Month: February 2017
Life Time Achievement award
Wish to share that I have Received Life Time Achievement award from FOLK ARTS ACADEMY on 12 Feb.2017
మేళా (POEM)
మేళా
-వారాల ఆనంద్
—————————–
అక్షరాలన్నీ పేజీల్లో నిద్దరోతున్నాయి
పేజీలన్నీ గడ్డకట్టి
కుప్పలు కుప్పలుగా
బీరువాల్లో నిలబడిపోయాయి
ఆర్తి నిండిన చూపులకొసం
పెదాల తడి అంటిన
మునివేళ్ళ కోసం
భావాల పాదముద్రలు
కాగితాల్లో ఒదిగి వుండిపోతున్నాయి
తరాల అనుభవాల సారాన్ని
తల మీద మోస్తూ
నడుములు వంగి నడవ లేక
సహారా కోసం
మూసిన తలుపుల లోపల పుస్తకాలన్నీ
ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాయి
గత కాలపు అనుభూతుల నురగని
అర్థం చేసుకోకుండానే
వేల వేల పేజీల్లో ప్రవహిస్తున్న
సామాజిక గమన తాత్విక
సారాంశాన్ని తెలుసుకోకుండానే
నవలోకం నడిచి వెళ్లిపోతోంది
అభివృద్ది బహానాలో,సాంకేతిక సుడిగాలిలో
కుర్రతనం కాట గలిసి పోతోంది
అయితేనేం
కొత్త పాదాలు పర్వతం వైపు కదలనప్పుడు
పర్వతమే నడక నేర్చుకొని లేత హృదయాల వైపు వెళ్ళాలి
షెల్ఫులు దాటి వీధుల్లోకి రావాలి
మేళాలుగా బారులు తీరాలి
జాతరల్లో చిలుకా బత్తీసల్లా మెరవాలి
కొత్త తరం చూపు మరల్చి పేజీల్లోకి తొంగి చూస్తారు
అక్షరాల్ని ఆలింగనం చేసుకుని
వృక్షాలై ఎదిగి
భవిష్యత్తుకు నీడ నిస్తారు
The Page of Dismay (POEM)
మెరుపు ఇంటర్వ్యూ
1) సాహిత్యాన్ని మీరేట్లా అర్థం చేసుకున్నారు? సినిమా పట్ల అభిమానం ఎందుకు పెరిగింది? రెడింటి మధ్యా సారూప్యాలు భేధాల గురించి చెప్పండి?
జ: సాహిత్యం ఒక అనుభవం,ఒక అనుభూతి, ఒక కోపం, వేదన ధుఖం ఇలా ఒకటేమిటి మొత్తంగా మనిషి శ్యాస తీసుకున్నంత సహజంగా తనను తాను వ్యక్తీకరించుకునే రూపమే సృజన. అది కవిత్వం, పాట, వచనం, సంగీతం,పెయింటింగ్, సంగీతం సినిమా ఏదయినా సృజనే. ఒక్కొక్కరూ తమకు వ్యక్తీకరణకోసం ఒక్కో రూపాన్ని ఎంకుంటారు. వాటిల్లో రూప భేదమే తప్ప వేరే కాదు. అందులోనూ అత్యంత ప్రాచీనమయిన సాహిత్యం, ఆధునికమయిన సినిమా రెండూ నాణానికి రెండు ముఖాల్లాంటివి. నాకయితే రెండిలో పెద్ద భేదం కనిపించదు. కవిథ్యంలో భావ లయ, సినిమాలో దృశ్య లయ రెండూ నన్ను అమితంగా ఆకర్షిస్తాయి. అర్థవంతమయిన సినిమా పట్ల ఇష్టం పెరిగింతర్వాత ఫిలిమ్ సొసైటి వుద్యమంలో మూడున్నర దశాబ్దాలకు పైగా పనిచేశాను. అనేక పత్రికల్లో వకా సంఖ్యలో వ్యాసాలు రాశాను.అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో పాల్గొనడం, అనేక ఫెస్టివల్స్ ని నిర్వహించడం జరిగింది. కరీంనగర్ ఫిల్మ్ సొసైటికి ఫిల్మ్ భవన్ నిర్మించడం గొప్ప అనుభవం.
——————————————–
2) మీ రచనల వివరాలు చెప్పండి
జ: మొదట వేములవాడ నటరాజ కళానికేతన్ వెలువరించిన ‘నవత’ పత్రిక తో రచనా ఆరంభమయింది. తర్వాత చిత్రిక, జీవగడ్డ లాంటి పత్రికల్లో రచనలు సాగాయి. ముఖ్యంగా జీవగడ్డ నా దృక్పధాన్ని విస్తృత పరిచింది. తర్వాత 1981లో జింబో, అలిశెట్టి ప్రభాకర్, వజ్జాల శివకుమార్, పి.ఎస్.రవీంద్ర ల తో కలిసి ‘లయ కవితాసంకలనం వెలువడింది. ఆతర్వాత కార్యక్షేత్రం సినిమా వైపు మరలింది. ‘మానేరుతీరం’, నవ్యచిత్రవైతాళికులు, బాల చిత్రాలు, చిల్డ్రన్ సినిమా, సినీ సుమాలు,24ఫ్రేమ్స్, మనిషి లోపల, మానేరుగలగల, బంగారు తెలంగాణాలో చలనచిత్రం, మెరుపు, signature ఆఫ్ లవ్ (అనువాదం అను బొడ్ల) తదితరాలు వెలువడ్డాయి.
———————————————
3) వర్తమాన సాహిత్యాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ: వర్తమాన సాహిత్యం గొప్ప వైవిధ్యాన్ని విలక్షణతని సంతరిచుకుంది అనడంలో సందేహం లేదు కానీ తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో పాట పాత్ర గొప్పది. వచనం చాలా వరకు వెనక బడింది. కవిత్వం చాలానే వచ్చింది కానీ భాష పైననే కవులు ధ్యాస పెట్టడం, ఇంకా నాస్తాల్జియా పయిన కేంద్రీకుతమ్ కావడం తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింతర్వాత ఒక స్తబ్దత ఏర్పడింది మళ్ళీ ఇప్పుడిప్పుడే గొంతు సావరిచుకుంటున్నది. నిజానికి భాషే కవిత్వం కాదు. వాహకం మాత్రమే. మనిషి భావాలే సారాంశంలో కవిత్వం అవుతాయి.
———————————————–
4) నూతన తరం సాహిత్య సృజనలోకి రావాలంటే ముఖ్యంగా ఏంచేయాలి, కవిత్వం రాయడానికి శిక్షణ అవసరమా?
జ: కొత్త తరం లో వినూత్నంగా ఆలోచించడం తో పాటు విలక్షణంగా తమను తాము వ్యక్తం చేసుకునే తత్వం వుంది . ఆధునిక సాంక్తిక పరిణామం వాళ్ళని ఎక్కువ కాలం ఎంగేజ్ చేస్తోంది, నిజానికి సాహిత్యం యువతను చేరలేకపోతోంది. ఆంగ్ల, తెలుగు సాహిత్యాల్లో పి.జి లు చదువుతున్నవారికి కూడా టెక్స్ట్ బుక్స్ తప్ప సాహిత్య లోతులు తెలియడం లేదు. మూడున్నర దశాబ్దాల కాలేజీ అనుభవంలో నేను తెలుసుకున్నదేమంటే మంచి కవిత్వం, మంచి సినిమా వారిని చెర గలిగితే వారు తప్పకుండా ఆకర్షితులవుతారు. మంచి మంసులుగా మారతారు. ఇక శిక్షణ విషయానికి వస్తే విశ్వవ్యాప్తంగా వస్తున్న ఒరవడులను తెలుసుకోవడానికి, రూపం విషయంలో టెక్నిక్ విషయంలో శిక్షణ అవసరమే,
దానికంటే విస్తృత అధ్యయనం అత్యంత అవసరం.
కొత్త తరం విద్యాలయాల్లోనుంచే వస్తుంది. పాటశాల స్థాయినుండి యూనివర్సిటీ దాకా విధ్యార్థుల్లో చదివే లక్షణాన్ని పెంచాలి. మంచి సాహిత్యాన్ని,సినిమాతో సహా సంగీతం, పెయింటింగ్ లాంటి సృజన ప్రక్రియాల్ని వారి ఆసక్తుల మేరకు పరిచయం చేయాలి. ముఖ్యంగా అధ్యాపకులు, లైబ్రరీలు ప్రధాన పాత్రను పోషించాలి.
—————————————————–
5). ఆధునిక కాలంలో తెలుగు భాషా ప్రాధాన్యత తగ్గి పోతుంది అని ఒక వాదన వినిపిస్తుంది. ఇది నిజమా? అయితే దీనికి ప్రధాన కారణాలేమై ఉంటాయి.
జ : ఆధునిక కాలంలో విస్తృతంగా పెరిగిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వల్ల అనేక అంశాల ప్రాధాన్యతా క్రమం ఒడిదొడుకులకు గురవుతున్నది. అది భాషా విషయంలో కూడా వుంది. ఎప్పుడయితే విద్యా అధ్యయనం విజ్ఞానం కోసం వ్యక్తిత్వ వికాసం కోసం కాకుండా కేవలం ఉద్యోగం కోసమే అన్న పరిస్తితి ఏర్పడింతర్వాత భాష అధ్యయనం పాత్ర తగ్గిపోయింది. ప్రపంచీకరణ నేపథ్యం లో భూమి గ్రామమయి పోయి విదేశీ ముఖ్యంగా అమెరికా వలసలు ఎక్కువై పోయింతర్వాత కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడం తోటే భవిష్యత్తు అన్న భావన పెరిగిపోయింది. దానికి తోడు ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు ఆంగ్ల మాధ్యమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం తో తల్లిదండ్రుల్లో ఆంగ్ల భాష వ్యామోహం తెలుగు పట్ల నిరాసక్తత పెరిగి పోయాయి. ఆంగ్లాన్ని భాష గానో మాధ్యమంగానో కాకుండా జీవన విధానంగా మార్చుకోవడంతో తెలుగు ప్రాధాన్యత కుంచించుకు పోయింది.
——————————-
6). గ్రంధాలయాధికారిగా నీకున్న విశేషానుభవంతో విద్యార్థి పాఠకులలో తెలుగు భాష విషయంలో మీరు ఎలాంటి మార్పు గమనించారు?
జ: మూడున్నర దశాబ్దాలకు పైగా విద్యార్థుల తోనూ పుస్తకాలతోనూ గడిపాను. ఈ కాలంలో పుస్తకాల పట్ల అధ్యానం పట్ల అనేక మార్పుల్నే చూశాను. భారతి , స్రవంతి లాంటి సాహిత్య పత్రిక లతో పాటు శ్రీ శ్రీ, చలం, కుటుంబరావు లాంటి వారి సాహిత్యాన్ని చదివిన విద్యార్థుల్నీ, యద్దనపూడి, యండమూరి లాంటి వ్యాపార రచయితల పుస్తకాల్నీ చదివిన విద్యార్థుల్నీ గమనించాను. వ్యాస రచనా,ఉపన్యాస పోటీల్లో తెలుగులో విశేషంగా పాల్గొన్న వారినీ చూశాను కానీ కాలం గడుస్తున్న కొద్దీ పరిస్తితి మారింది. ఇప్పుడు కేవలం సిలబస్ పుస్తకాలు చదవడమే గగనమయిన పరిస్తితి వుంది. అది కూడా ఆంగ్ల మాధ్యమం అంతే కాదు నోట్స్ గైడ్లూ, ప్రశ్న బాంకులకే పరిమిత మయిన విద్యార్హులే అధికంగా వున్నారు. అది విషాదకరమయిన పరిస్తితి. సామాజిక అధ్యయనం కానీ, సాహిత్య సంపర్గం కానీ అరుదు పర్యవసానంగా తెలుగు గురించి ఆలోచించే విద్యార్థులు కనిపించడం అరుదు. అనారోగ్యకరమయిన పోటీ ప్రపంచంలో కొట్టుకు పోతూ మౌలిక అంశాల్ని పట్టిచ్చుకోవడం లేదు. దాంతో మధ్యస్థమయిన విద్యార్థులూ లేదా ప్రతిభావంతులయిన రోబోలు తయారవుతున్నారు.
————————–
7). విద్యార్థులలోవచ్చిన ఈమార్పుకు ప్రభావ హేతువు ఏమై ఉండవచ్చు
జ: నేరం విద్యార్హ్తులది కాదు. సామాజినిదే అందులో ముఖ్యంగా ప్రభుత్వాలు, తల్లిదండ్రులదే. ప్రభుత్వాలకు సరయిన దృక్పధం లేదు. ప్రభుత్వాలు సంక్షేమానికీ, వ్యాపారానికీ నడుమ వున్న విభజన రేఖను తుడిచేసి పని చేస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పట్ల ఒకింత భయమూ, ఎక్కువగా అత్యాశ కు పోవడం వల్ల ఇటు తెలుగు రాక అటు ఆంగ్లం లో పరిపక్వతా రాక విద్యార్హ్తులు రెంటికీ చెడిపోయి కేవలం డబ్బు సంపాదించడానికి
పనిముట్లుగా తయారవుతున్నారు.
——————————-
8) ఈరోజు తెలుగు పేరుతో సినిమాల్లో,సినిమా పాటల్లో వినిపించే భాష ఆహ్వానించదగ్గదేనా?
జ: ఇవ్వాళ తెలుగు సినిమాల్లో తెలుగు తనమే లేదు. స్పష్టంగా చెప్పుకోవాలంటే దానికి ఎలాంటి స్థానికతా లేదు. ఇవాల్టి సినిమా కథలకు పాత్రలకు వునికి లేదు కేవలం అర్థం లేని వూహలు మాత్రమే. ఇక భాష విషయంలో చర్చించాల్సిన అవసరమే లేదు. వాటిల్లో సరయిన భాష గాని వ్యక్తీకరణ గానీ వుండడం లేదు. అంతా కృతకమయిపోయింది. సినిమా అత్యంత ప్రభావవంతమయిన మాధ్యమం కనుక దాని ప్రభావం తో యువత వాటినే అనుకరించి భాష విధ్వంశమయిపోతోంది. సినిమాల్లో వాడుతున్న కృతకమయిన భాష ఆహ్వానించడగింది కాదు.
—————————–
9) అన్యభాషా పదప్రయోగాల వల్ల తెలుగుభాషపై ఏవిధమైన ప్రభావం ఉంటుందని మీరు భావిస్తున్నారు?
జ: భాష కు ఆదాన ప్రధాన లక్షణాలుంటాయి. తెలుగుకు మరింత ఎక్కువ.
అవసరమయినంత మేర ఆదాన ప్రాధానాలు తప్పవు.
———————————–
10) ప్రస్తుతం ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్లభాషా విద్యా విధానం అమలులో ఉంది. ఇది మాతృభాషపై ఏవిధమైన ప్రభావం చూపెడుతుంది?
జ: ప్రాథమిక స్థాయి నుండి అన్నీ విద్యాలయాల్లో ఆంగ్ల భాషా విద్యావిధానం అమలులోకి వచ్చేస్తున్నది. ప్రభుత్వాలు వుద్యోగాలు, ఎదుగుదల కావాలంటే ఆగ్లం తప్పనిసరి అని విస్తృత ప్రచారానికి పూనుకున్నాయి. దీని వెనుక సరయిన ఆలోచన అధ్యానం లేదు. విధ్యార్హ్తుల మానసిక ఎదుగుదలకు మూలమయిన మాతృభాషా ప్రాధాన్యతను పాలక వర్గాలు పెడచెవిన పెడుతున్నాయి. అంతేకాదు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా సరయిన రీతిలో పెట్టకుండా, ఉపాధాయిల్ని సిద్దం చేయకుండా ఆంగ్లం ప్రవేశ పెడుతూ వుండంతో విధ్యార్థులు ఎటూ కాకుండా పోవడం విషాదం.
తెలుగులో చదవడం అవమానం అన్న స్థాయికి తేవడంతో మాతృభాష తెవ్రమయిన ప్రభావానికి గురవుతున్నది.
——————————————–
11) అధికార భాష అమలులో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు?
జ: ప్రభుత్వాలు ఒకవైపు విద్యను మొత్తం ఆంగ భాషలోనికి మారుస్తూ
ఇటు అధికార భాష అంటూ దానికో అధికార భాషా సంఘాన్ని వేయడం చిత్రమయిన విషయం. ఈ ప్రపంచంలో బతకాలంటే ఆంగ్లం రావలసిందే అంటున్న వారే అధికార భాష ను అమలు చేస్తామనడంలో అర్థం లేదు. రెంటినీ నిర్వహించాలంటే అన్నీ స్థాయిల్లో తెలుగును తప్పనిసరి చేయాలి. సాంకేతికరంగా కంప్యూటర్, ఇంటర్నెట్ ళల్లోనూ, ఫెస్బుక్,వ్హాట్స్ అప్,లాంటి సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగు వినియోగంలోకి వచ్చింది కనుక స్కూళ్ళు,కాలేజీల్లో తెలుగు ను సజీవంగా వుంచాలి.
—————————————————-
12) భాషాసంరక్షణలో పత్రికలు దృశ్య శ్రవణ మాధ్యమాలు ఏవిధమైన పాత్ర పోషించాలి?
జ: పత్రికలూ, దృశ్య శ్రవణ మాధ్యమాలూ సమాజంపైన అత్యంత ప్రభావాన్ని చూపిస్థాయి. టీవి,సినిమా,ఇంటర్నెట్ లాంటివి లేకుండా సమాజాన్ని వూహించలెం. ప్రజల అభిప్రాయాల్ని మార్చే అంత శక్తి ని కూడా ఇవ్వాళ ప్రసార మాధ్యమాలు కలిగి వున్నాయి. అనుకరణ మానవ సహజ లక్షణం కనుక ప్రసార మాధ్యమాల భాషనూ ప్రజలు అనుకరిష్టారు. కాబట్టి వాటి పాత్ర గణనీయమయిందే .
————————–
13) మాతృభాష ప్రాధాన్యతను పెంచె విషయంలో ప్రజలను ఏవిధంగా భాగస్వాములను చేయవచ్చు?
జ: ప్రజల్ని చూసే (టీవి మొ.) లక్షణం నుంచి చదివే లక్షణం వైపు మరల్చాలి.
పౌర గ్రంధాలయాల్ని అభివృద్ధి చేసి మొదట తెలుగు చదివే అలవాట్లు పెంచాలి.
—————————
౧౦.దీనికోసం ఉద్యమాలు రావాలా? ఉద్యమ పంథా ఎలా ఉండాలి?
జ: తెలుగు భాషను రక్షించుకోవడానికి ఉద్యమం రావాల్సిన పరిస్థితులే వున్నాయి. సామాజిక భాధ్యత కలిగిన స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి. కేవలం సభలు వుపన్యాసాలతో సరిపెట్టకుండా విద్యార్థులకు యువతకు భాషా ప్రాముఖ్యతను పెం పొందించే రీతిలో భాష వ్యక్తీకరణ అంశాల్లో శిక్షణతో పాటు పలు అంశాల పైన పోటీలు ఏర్పాటు చేయాలి. వూరూరా గ్రంధాలయాలు పెట్టాలి. ఆంగ్ల మాధ్యమ విద్యాలయాల్లో తెలుగు తప్పనిసరి చేసే విధంగా వొత్తిడి చేయాలి.
—————————-
14) విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి?
జ: విధ్యార్థులు నవ సమాజ నిర్మాతలు. ఏ రంగం లోనయినా సృజనాత్మకత కలిగిన వారే ఉన్నత శిఖరాలకు చేరుతారన్న విషయాన్ని ఎప్పుడూ మనసులో వుంచుకోవాలి. రొడ్డ కొట్టుడు చదువుల తో సరిపెట్టకుండా భిన్నంగా ఆలోచించి విలక్షణంగా కృషి చేసినప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో రోబోలుగా కాకుండా స్వంత అలోచనలూ, అభిప్రాయాలూ లక్ష్యాలూ వున్న వారుగా ఏడుగుతారు. తమ వంతు సమాజానికి కొత్త దానాన్ని తెచ్చిపెడతారు.
–వారాల ఆనంద్
కవీ, రచయితా.
https://aanandvarala.wordpress.com
9440501281