Month: April 2023

89=యాదొంకి బారాత్

Posted on

+++++ వారాల ఆనంద్

89=యాదొంకి బారాత్

+++++ వారాల ఆనంద్

బండి రెండు చక్రాలమీద నడవడం, రైలు రెండు పట్టాలమీద నడవడం మామూలే కదా. మనషి జీవితంలో మొదటి స్థానంలో నిలబడాలని ఆనుకుంటాడు కానీ ‘రెండు’ అనే సంఖ్య చాలా చిత్రంగా మనిషిలోనా బయటా అన్నింటా పెనవేసుకుపోయి వుంటుంది. రెండు కాళ్ళు, రెండు కళ్ళు, రెండు చెవులు రెండు చేతులు అంతేకాదు చీకటి వెల్తురు, సుఖం దుఖం, భార్యా భర్త, అమ్మా నాన్న ఇట్లా అనేకానేక రకాలుగా రెండుతో మనిషికి ఉన్న అనుబంధం విడదీయరానిది. నా జీవితం ఆసక్తులలో కూడా అటు ఫిలిం సొసైటీ ఇటు ఎస్.ఆర్.అర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు రెండూ రెండు పట్టాలుగా పెనవేసుకుపోవడమే కాదు నా బతుకు బండిని నడిపించాయి. నేనేమో హాయిగా హుషారుగా రెంటి మీదా చక్రాలేసుకుని సంతోషంగా పరుగులు పెట్టాను.

ఫిలిం సొసైటీకి సొంత హాలు ‘ఫిలిం భవన్’ ఏర్పాటు అవడం దాని లో కొత్త కొత్త ఫిలిం కార్యక్రమాలకు ప్రణాలికలు వేస్తూ ఉండగానే అటు మా కాలేజీకి యాభై ఏళ్ళు వచ్చాయని స్వర్ణోత్సవాలు నిర్వహించాలనే ఆలోచన మొదలయింది. ప్రిన్సిపాల్ శ్రీ బి.రామచందర్ రావు    ఎంతో ఉత్సాహంగా స్టాఫ్ అందరినీ ఉత్సవాలకు సిద్ధం చేయడం మొదలు పెట్టారు. మా కాలేజీకి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్ గా పనిచేసారన్నది ఓ అదనపు ఆకర్షణ. దానితో పాటు విలువల పట్ల పెద్ద బాధ్యత. ఎస్ ఆర్ ఆర్ కి మొదటి రోజులనుంచీ కాలేజీ కి ప్రిన్సిపాల్లుగా పనిచేసి జీవించి వున్న వారందరినీ పిలిచి సత్కరించుకోవాలని ప్రధాన ఆలోచన. అంతేకాదు గత యాభై ఏళ్లుగా ఈ కాలేజీలో చదివిన పూర్వ విద్యార్తులని సాధ్యమయినంత మందిని సమీకరించాలని, ఆయా సంవత్సరాలల్లో విద్యార్థి సంఘాల్లో బాధ్యతలు నిర్వహించన వాళ్ళని ఉత్సవ బాధ్యతల్లోకి ఆహ్వానించాలని ఇట్లా అనేక ప్రణాలికలు సిద్దమవసాగాయి. అన్నింటికంటే ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ని ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పిలవాలని అనుకున్నాం. అపుడు జిల్లా మంత్రిగా వున్న శ్రీ ఎం.సత్యనారాయణ రావు అందుకు పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. పొన్నం ప్రభాకర్ లాంటి మిగతా నాయకులు  కూడా అందుకు పూనుకున్నారు.

   కాలేజీలో అనేక కమిటీలు వేసారు. వాటిలో అతి ముఖ్యమయినది ఫైనాన్స్ కమిటీ, దాని తర్వాతిది సావనీర్ కమిటీ. ఆర్ధిక కమిటీ లో నగర ప్రముఖుల్నీ చేర్చారు. అయోద్యరామారావు, డాక్టర్ విజేందర్ రెడ్డి, రాగి లింగమూర్తి, ప్రసాద రావు, ప్రకాష్ హాల్ల, కొండా వేణుమూర్తి, భూపతి రెడ్డి లతో పాటు కాలేజీ అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి, మురళి, ఎం.నారాయణ, కే.శంకరా చారి, కే.లక్ష్మిరాజం తదితరులు ఉన్నారు. ఇక సావనీర్ కమిటీ లో కన్వీనర్ గా ఆర్.వినయ సాగర్ వుండగా మచ్చ హరిదాస్, గోపు లింగా రెడ్డి, కే.విజయ బాబు, ఎస్.గంగాధర్, శాష్త్రి, భాస్కర్ రావు, కనకా చారి, జగదీశ్వర్, నేనూ సభ్యులుగా వున్నాం. స్వర్ణోత్సవాల నిర్వహణ అన్నది ఒక చారిత్రాత్మక సందర్భం కాబట్టి కాలేజీ చరిత్ర గొప్పదనం సావనీర్ లో సంపూర్ణంగా రావాలని నేనన్నాను. పాత ప్రిన్సిపాల్లతో సహా అనేక మంది తో వారి వారి అనుభవాల్ని వ్యాసాలుగా రాయించి  సావనీర్ లో వేయాలనుకున్నాం. కాలేజీపట్ల వారి అభిప్రాయాలు రాయించాలనుకున్నాం. కాలేజీ చేసిన విజ్ఞప్తికి అనేక మంది ఎంతో ఉత్సాహంగా స్పందించారు. అంపశయ్య నవీన్, వెల్చాల కొండల రావు, ఐ.వి.చలపతి రావు, కే.వై.ఎల్.నరసింహా రావు, ఎం.వి నరసింగ రావు, డీ ఆర్ కే, అప్పయ్య శాష్త్రి ఇట్లా అనేక మంది ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో ఉన్నప్పటి  తమ గొప్ప అనుభవాల్ని అక్షర రూపాల్లో పంచుకున్నారు. వీటికి తోడు గత సంచికల్లో వెలువడిన పీ.వీ.నరసింహారావు లాంటి వాళ్ళ వ్యాసాల్ని కూడా సావనీర్ లో పొందుపరచం. అందరి ఫోటోలు, గ్రూపు ఫోటోలు ఒకటేమిటి దాదాపు కాలేజీ సమగ్ర చరిత్ర అందులో రికార్డ్ అయింది. సమాచార సేకరణ, లభించిన సమాచారాన్ని అందంగా రంగుల్లో పొందుపరచడం లో సావనీర్ కమిటీ తీవ్రంగా కృషి చేసింది. ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ పార్థసారధి గారు కన్వీనర్ గా కమిటీ వేసారు. ఇక జిల్లాకు చెందిన అందరు ప్రజాప్రతినిదుల్నీ ఇన్వాల్వ్ చేసారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా అట్టహాసంగా మొదలయ్యాయి అందరిలో చెప్పలేని ఆనందం. అంతా తమ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం లా భావించారు. ఉత్సవానికి ముఖ్యమంత్రి రావడానికి అంగీకరించడంతో మరెంతో ఉత్సాహం కలిగించింది.       

      ఇదంతా ఇట్లా జరుగుతూ వుండగా నాకు ఓ చిన్న ప్రమాదం జరిగింది. ఇంట్లో అప్పటికి వాటర్ గేజర్ లేదు. గాస్ స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు వేడి చేసుకుని తీసుకొస్తూ వుండగా జారి పడి చేయి విరిగింది. డాక్టర్ శ్రీధర్ రావుగారు పట్టీ వేసి రెస్ట్ తీసుకొమ్మన్నారు. చేయి విరిగిందని తెలిసి ఆత్మీయ మిత్రుడు ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఎం.విజయమోహన్ రెడ్డి  చూడడానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన మిత్రులతో ఎప్పుడూ గలగలా మాట్లాడే మా ఇందిర  విజయమోహన్ రెడ్డిగారితో అంది ‘సార్ చేయికట్టుతో రెస్ట్ తీసుకోవాల్సిందే కదా, ఆనంద్ కంట్లో కాటరాక్ట్ వుంది. డాక్టర్ శ్రీధర్ కంటి ఆపరేషన్ అవసరమన్నారు.. రేసులో రెస్ట్ ఇప్పుడు ఆపరేషన్ కు వినడం లేదు.. మీరయినా చెప్పండి ‘ అంది. ఉండమ్మా తల్లీ ఇంటికి వచ్చిన మిత్రుఅలతో నన్ను కొంచెం మాట్లాడనీ అని నేను అంటూ ఉండగానే ‘డబల్ ధమాఖా బోనస్ లా అయిపోతుంది చేయించుకోండి ఆనంద్ అన్నారు డాక్టర్ విజయమోహన్ రెడ్డి. నేను శ్రీధర్ కి చేబుతాను అని కూడా అన్నారు. ఇంకేముంది ఇందిర పట్టుబట్టింది. ఐ స్పెషలిస్టు డాక్టర్ శ్రీధర్ తాను లయన్స్ కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటి నుండీ దగ్గరి మిత్రుడు. మర్నాడుదయమే కాటరాక్ట్ సర్జెరీ చేసేసాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఒకే కాలంలో రెండు రెస్టులు గడిపాను. ఇప్పుడాలోచిస్తే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇంతలో కాలేజీ ఉత్సవాలు రానే వచ్చాయి. మా ప్రిన్సిపాల్ గారు ఆనంద్ ఉత్సవాలల్లో నీ వంతు ఏమి చేస్తావన్నాడు. ఆ రోజు పూర్తి స్థాయిలో మంచి ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేద్దామన్నాను. అందరికీ నచ్చింది. ఒకే అన్నారు. మా ఆస్థాన ఫోటోగ్రాఫర్ జయ కృష్ణ ను పిలిచి ఏర్పాట్లు మొదలు పెట్టాను. చేతికి వున్న కట్టు అట్లాగే వుంది. మరోవైపు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే మేమెంటో గురించిన చర్చ వచ్చింది. కరీంనగర్ వెండి తీగ పరిశ్రమకు ప్రసిద్ది సో వెండి తీగలతో కాలేజీ భవనం మాడల్ చేయించి ఇస్తే బాగుంటుంది అన్నాను. అంతా బాగుంటుంది అన్నారు. మా మిత్రుడు జంతు శాస్త్ర అధ్యాపకుడు యాద కిషన్ కు ఆ బాధ్యతను అప్పగించారు. నన్ను సహకరించామన్నారు. నేను తను కలిసి వెండి తీగ కళాకారున్ని వెతికి పట్టుకుని కాలేజీ ఫోటో ఇచ్చి రూపాన్ని అద్భుతంగా చేయించాం. దాన్నే ఉత్సవం రోజు ముఖ్యమంత్రికి జ్ఞాపికగా ప్రిన్సిపాల్ గారు అందజేశారు. ఇక ఉత్సవం గ్రాండ్ గా ఆరంభయింది. కాలేజీ మైదానం లో సభ ఘనంగా జరిగిన తర్వాత కాలేజీ గోల్డెన్ జూబిలీ భవనానికి ముఖ్య మంత్రి వై ఎస్ శంఖుస్థాపన చేసారు. అనంతరం ముఖ్యమంత్రి మేము ఏర్పాటు చేసిన విశాలమయిన కాలేజీ చరిత్రను తెలిపే ఫోటో ప్రదర్శనను ప్రారంభించి ఆసక్తిగా అన్ని ఫోటోలని వివరాలు అడుగుతూ చూసారు. ఆయనతో సహా అతిథులందరూ ఫోటోలని చాలా ఆసక్తిగా చూసి కాలేజీ తో తమకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ఈ సమయంలో మరో చిత్రమయిన అనుభవమూ ఎదురయింది. నేనూ కిషన్ కలిసి అంతకుముందే ఒక ఆలోచన చేసాం. ఉత్సవాల జ్ఞాపకంగా అందరమూ మొమెంటో లు అవీ మన వద్ద ఉంచుకుంటాం. మరి కాలేజీలో ఏముంటుంది అనుకుని ఒక పెద్ద చాలా అందమయిన జ్ఞాపికను తయారు చేయించాం. దాన్ని ఫోటో ప్రదర్శనలో ముందుంచి దాని మీద శాలువా కప్పి ముఖ్యమంత్రి చేత ఆవిష్కరింప చేసాము. ఇది ఎవరికోసమయ్యా అని వైఎస్ పక్కనే వున్నా నన్ను అడిగాడు. కాలేజీలో జ్ఞాపకంగా ఉంచాలని అన్నాను. బిగ్గరగా నవ్వి బాగుంది అన్నారాయన. ఆ తర్వాత విలేఖరుల సమావేశంలో సి ఎం పాల్గొన్నారు. కానీ జరిగిందేమిటి అంటే మేమంతా అక్కడినుండి కదలగానే ఎవరో మా అధ్యాపకుదో విద్యార్తో తస్కరించి మాయం చేసారు. అది గమనించి ‘ఒక మంచి ఆలోచన అట్లా ముగిసిపోయి నందుకు ఒకరిని ఒకరం చూసుకుంటూ నేనూ కిషన్ మా ప్రిన్సిపాల్ గారు ఆతర్వాత చాలా బాధ పడ్డాం. తీసినదేవరో తెలిసినా మౌనంగానే వున్నాం. వాళ్ళ పట్ల జాలి పడ్డాం అంతే. అదొక భిన్నమయిన అనుభవం. నేనూ కిషన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాం.

ఇక సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా విశ్వనాథ స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేయగా శ్రీ పావని శాస్త్రి ప్రసంగించారు. ఆ సభలో కొండల రావు, జువ్వాడి గౌతమ రావు, గండ్ర లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన కాలేజీ గోల్డెన్ జూబిలీ సావనీర్ చిరస్థాయిగా ఉండేలా రూపొందింది. కాలేజీ కి సమబధించి అదొక చారిత్రక డాక్యుమెంట్ గా మిగిలింది. సావనీర్ కమిటీ లో ఆర్.వినయ సాగర్, ఎస్.గంగాధర్, మచ్చ హరిదాస్ తదితరుల కృషి ఎంతో అభినందనీయమయింది.

అట్లా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ స్వర్ణోత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి.

  కాలేజీకి సంబంధించి నాక్ అసెస్మెంట్ లో బి++ రావడం, స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించడం, లైబ్రరీ భావన శంఖుస్థాపన లాంటి విజయాలతో ఆ రెండేళ్ళు చిరస్మరణీయంగా  గడిచాయి. అప్పుడు కాలేజీలో పనిచేసిన ప్రిన్సిపాల్ రాంచందర్ రావు గారితో పాటు మిగతా అధ్యాపకులూ, అధ్యాపకేతర సిబ్బందీ ఎంతో సంతృప్తిని పొందారు. ఆ సమయాన్ని గుర్తింపు నీ  ఎంతో గౌరవంగా స్వీకరించారు.          

మిగతా మళ్ళీ వారం …

-వారాల ఆనంద్

అస్సామీ సాంస్కృతిక బావుటా – భూపేన్ హజారికా+++ వారాల ఆనంద్

Posted on

Pl read my article published in NETINIJAM, Tq Sri Baisa Devadas garu*****

అస్సామీ సాంస్కృతిక బావుటా – భూపేన్ హజారికా
+++ వారాల ఆనంద్
దిల్ హూం హూం కరే ఘబ్ రాయే..
ఘన్ దం దం కారే
గర్ జాయే
ఏక్ భూంద్ క భీ పానీ కీ
మోరి అఖియోన్ సే బర్సాయే
తేరి ఝోరీ దారూన్ సబ్ సూఖే పాత్ జో ఆయే తేరా చువాన్ లాగే మేరి సూఖీ దాల్ హరియాయే
జిస్ తనకో చువాన్ తూనే అస్ తన కో చుపావూన్ జిస్ మనకో లగే నయినా వొహ్ కిసకో దిఖావూన్
ఓ మేరె చంద్రమా తేరి చాందినీ అంగ్ జలాయే ఊంచి తొర్ ఆతారీ మైనే పంఖ్ లిఏ కత్వాయీ
====
ఆ ఆవారా హూన్ జమీసే చల్తే ఝలక్ ది బహాతే ధరియాకి ధారా హూన్..
యహాన్ కా వహాన్ కా కహీ కా నహూ దిశా వొంకా మారరా హున్
++++++++
విస్తార్ హాయ్ అపార్ ప్రజా దోనో పార్
కరే హా హా కార్
నిశబ్ద్ సదా ఓహ్ గంగా తుమ్ బహతీ హాయ్ క్యోన్
నైతికతా నష్ట్ హివీ, మానవతా భ్రష్ట హువీ
నిర్లజ్య భావ్ సే బహతీ క్యాన్..
+++++ ఈ పాటలు వినగానే దుఖం, వేదన, కోపం, ఆవేశం, ఆలోచన ఒకటేమిటి అనేక భావాలు ఉత్తుంగ తరంగంగా మనలో మెదులు తాయి..మనసంతా అదుపు తప్పుతుంది..అచేతనమయిపోతుంది..మనసంతా కలి కలి..కలకలం..
ఒక్క మీరూ నేనే కాదు.. మన దేశమే కాదు.. సమస్త ప్రపంచమూ భూపేన్ హజారికా పాటలకూ సంగీతానికీ దాసోహం ఆన్నది. మైఖేల్ జాక్సన్ ని అభిమానించిన వారు సైతం భూపేన్ స్వరానికీ, సంగీతాన్నీ .. ఊగి పోయారు. భూపేన్ దా ఈశాన్య భారతావనిలో పుట్టిన వాడు. అక్కడి సంగీతాన్నీ సాహిత్యాన్నీ, జీవితాల్నీ సంగీత ప్రపంచానికి పరిచయం చేసి ఒహో అనిపించారు. మనుషుల్ని వారి మనసుల్నీ భూపేన్ హజారికా ఇట్టే పట్టెస్తాడు.. తన పాటల వెంట లాగేసుకుంటాడు..
హజారికా గీతాల్లో అస్సాం కనిపిస్తుంది.. ఆయన పాటల్లో ఆసామీ ప్రజలు వినిపిస్తారు.. ఆ గానంలో ఒంటరితనమూ వుంది.. సామూహిక స్వరమూ ధ్వనిస్తుంది..
భూపేన్ హజారికా కేవలం అస్సాం జానపద పాటలు పాడడు.. మొత్తంగా అస్సామీ సంస్కృతిని ఆవాహనం చేసుకుని హృదయాన్ని ఆవిష్కరిస్తాడు..
++++
‘సుధాకాంత’ , ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’(బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర) గా సుప్రసిద్దుడయిన భూపేన్ హజారిక కవి, రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, సినిమా దర్శకుడు, జర్నలిస్ట్. అంతే కాదు ఆయనకాయనే తానో జాజాబోర్ (దేశద్రిమ్మరి) అని ప్రకటించుకున్న కళాకారుడు. అస్సామ్ జానపద సంగీతానికి కొంత శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి ప్రపంచాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఆయన రచనల నిండా మానవీయత, మతసామరస్యం, సహానుభూతి నిండి వుంటాయి. ఆయన ఆసామీ, బెంగాలీ, హిందీ భాషల్లో గానం చేసి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు.
భూపెన్ హజారికా ఈశాన్య భారతం లో అస్సామీ చలనచిత్ర వైతాళికుడు. ఆ రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం స్టూడియో నిర్మించింది ఆయనే. ప్రపంచానికి అస్సామీ సినిమాను పరిచయం చేసింది కూడా ఆయనే.
భోపెన్ హజారికా 8 సెప్టెంబర్ 1926 న అస్సాం లోని సదియా గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టిన ప్రాంతమంతా ఆదివాసీలు నివసించే ప్రాంతం. అక్కడి మహిళలు గొప్పగా నృత్యం చేస్తూ పాటలు పాడేవాళ్ళు. బాల్యం లోని ఆ సంగీతం పాటలు భూపేన్ మనసులో నాటుకు పోయాయి. బాల్యంలోనే ఒక రోజు ఆదివాసీ మహిళలతో కలిసి వెళ్ళిపోయాడు. భూపేన్ తల్లిదండ్రులు ఆందోళనతో అంతటా వేడికి వేసారి దొరక్క పోవడంతో తీవ్రంగా ఆందోళన చెందారు. మర్నాడు ఉదయం ఆ మహిళలే పిల్లాన్ని తెచ్చి అప్పగించడం తో . వీడు తల్లి పాలు తాగే వాడు కదా రాత్రంతా ఎట్లా వున్నాడు. అని అడిగితే ఆదివాసీల మహిళలే తమ పాలిచ్చి పడుకో బెట్టామని చెప్పారు. అట్లా చిన్న నాటినుండే ఆదివాసీ ఆట పాటలు భూపేన్ లో అంతర్భాగమయి పోయాయి. భూపేన్ తల్లి శాంతి ప్రియా హజారికా, తండ్రి నీలకంఠ. వారి కుటుంబం లో పలువురు టీచర్లుగా పని చేసేవారు. పది మంది సోదర సోదరీ మణులలో భూపేన్ పెద్దవాడు. చిన్నప్పుడు గౌహతి, తేజ్పూర్ లలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. అనంతరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1944లో బీ.ఎ., 1946లో ఎం.ఏ పూర్తి చేసాడు.
భూపేన్ కు చిన్న తనం నుండే పాటలు రాయడం పాడడం స్వభావ సిద్ధంగా అబ్బింది. ఆరవ తరగతి చదువుతూ ఉండగానే తన తొలి పాట రాసాడు. దానికి అవార్డును కూడా గెలుచుకున్నాడు. అదంతా విన్న ప్రముఖ సంగీతజ్ఞులు జ్యోతిప్రసాద్ ఆగర్వాల, విష్ణు రాఖాలు హజారికాను కలకత్తా తీసుకెళ్ళి సంగీతం లో శిక్షణ ఇప్పిస్తామని తీసుకెళ్ళారు. అప్పుడే బెంగాలీ సినిమాలో పాటలు పాడించారు. అట్లా మొట్టమొదటి సారి హజారికా ‘జాయ్ మతి’, ‘శోనిత్ కున్వారీ’సినిమాల్లో పాటలు పాడి బాల ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికి తన స్వరం పూర్తిగా పరిపక్వం కాకపోవడం తో ఆయన పాడిన పాటల్ని ఆ సినిమాల్లో కథానాయికలకు వాడారు. తర్వాత అస్సాం లో రూపొందిన మొదటి సినిమాలో పాడాడు. అప్పటికి అక్కడ రికార్డింగ్ వసతి లేక పోవడం తో షూటింగ్ కి సమాంతరంగా పాడి విజయవంతంగా నిలిచాడు. ఇక తాను తన బనారస్ చదువులు పూర్తి అయ్యాక కొంత కాలం అద్యాపకుడిగా పనిచేసాడు. ఆతర్వాత ఆకాశవాణిలో చేరాడు. అనంతరం హజారికా కు స్కాలర్షిప్ రావడంతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ ‘భారతదేశంలో వయోజన విద్యారంగంలో దృశ్య శ్రవణ పద్ధతుల్ని వినియోగించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు’ అన్న అంశం పైన డాక్టరేట్ చేసారు. అక్కడ ఉండగానే “జై రఘునందన్..’ అన్న నృత్య గీతానికి హాజారిక స్వరాన్నీ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రియంవదా పటేల్ నృత్యం చేసింది. తర్వాత పెద్ద ధనికురాలయిన ప్రియంవద భూపేన్ హజారికాను ప్రేమించి వివాహం చేసుకుందామని అడగడం తో తాను ఇప్పటికే ఒక అమ్మాయికి మనసిచ్చానని హజారికా చెప్పడంతో హతాశురాలయిన ప్రియంవద మరి ఆమెను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది. ఆ అమ్మాయికి ఇప్పటికే పెళ్లి అయిపొయింది అన్నాడు భూపేన్. మరింకేముంది మనం పెళ్లి చేసుకోవచ్చుకదా అని ఆమె ప్రోత్సహించడం తో హజారికా అంగీకరించి ముందుకొచ్చాడు. కానీ వారి ఇండ్లల్లో ఇద్దరి పెద్దలు అంగీకరించక పోవడంతో స్నేహితులు కలిసి వారికి వివాహం చేసారు. వారిద్దరికీ 1951లో ఒక కొడుకు జన్మించాడు.
తర్వాత ఇండియా వచ్చిన భూపేన్ హజారికా క్రమంగా బెంగాలీ సినిమాలకు సంగీతం అందించడం మొదలు పెట్టాడు. ‘ఎరా బతుర్ సుర్’, ‘శకుంతల’, ‘ప్రతిధ్వని’, ‘లోతి ఘోటి’, ‘చిక్మిక్ బిజిలీ’, ‘మొన్ పతి’, ‘స్వికరోక్తి’, ‘సిరాజ్’ లాంటి అనేక సినిమాలకు సంగీతం తో పాటు పాటలూ పాడారు. తానే స్వయంగా ‘మాహుత్ భండూరే’ లాంటి సినిమాల్ని రూపొందించాడు. ఇంకా అరుణా చల్ ప్రేదేశ్ లో మొట్ట మొదటి హిందీ కలర్ సినిమా ‘మేరా ధరం మేరి మా’ సినిమాను నిర్మించడంతో బాటు దర్శకత్వం సంగీత దర్శకత్వ బాధ్యతల్నీ తీసుకున్నారు. ఇంకా ఆయన అరుణాచల్ రాష్ట్రం కోసం ఆదివాసీ నృత్య సంగీతం లతో కూడిన ‘హూం ద సన్ శైన్స్’ అన్న డాక్యుమెంటరీ తీసారు. అస్సాంలోని సహాకార ఉద్యమం పైన హజారికా ‘ఎముథీ సౌ లార్ కహాని’ డాకుమెంటరీ ని , ‘త్రూ మెలోడీ అండ్ రిధం’ పేర కలకత్తా దూరదర్శన్ వాళ్ళకోసం మంచి డాక్యుమెంటరీ తీసారాయన. ఇంకా అనేక డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీతం అందించడం తో పారు నిర్మించారు కూడా. క్రమంగా ఆర్థికస్థితి మెరుగు పడింది. ఇంతలో హేమంత్కుమార్ హజారికాకు లతా మంగెష్కర్ ను పరిచయం చేసాడు. హజారికా క్రమంగా హిందీ సినిమా వైపునకు తన ప్రయాణం ఆరంభించాడు. అప్పుడు ఇండియా వచ్చిన ప్రియంవద అక్కడ హజారికకు ఇతర మహిళలతో సంబంధం వుందని భావించింది.అనేక వాద వివాదాల తర్వాత విడాకులు తీసుకుంది. కానీ చివరంటా స్నేహంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు.. కొడుకును తీసుకు ప్రియంవద అమెరికా వెళ్ళిపోయింది.
హజారికా ఒంటరి అయిపోయాడు. అప్పుడే కలకత్తా లో హేమేంద్ర ప్రసాద్ బరూవా ‘ఏకే పల్’ సినిమాను నిర్మించతలపెట్టాడు. ఆ సినిమా దర్శకురాలు కల్పనా లాజ్మీ ని భూపేన్ హజారికా కు పరిచయం చేసాడు. వారిద్దరి అభిప్రాయాలూ కలిసాయి. ఆమె చివరంటా భూపేంద్ర జీవితంలోనూ, వృత్తీ ప్రవృతి లోనూ తోడూ నీడ గా వుండి పోయింది. ఇన్నేళ్ళ తర్వాత కూడా భూపేన్ హజారికా అంటే తనకెంత ప్రేమో వ్యామోహమో అందామె
ఇక హిందీ సినిమాల విషయానికివస్తే కల్పాన లాజ్మీ తీసిన ‘ ఏకే పల్’ సినిమాకు హజారికా అందించిన సంగీతం విశేష ప్రశంసల్ని అందుకుది. ఆ సినిమాలో షబానా ఆజ్మి, నసీరుద్దీన్ షా, ఫరూఖ్ షేఖ్ ప్రధాన భూమికల్ని పోషించారు. అస్సామీ భాషలో వచ్చిన గొప్ప చిన్న కథల్ని ఆధారం చేసుకుని కల్పనా లాజ్మీ టీవీ కోసం రూపొందించిన ‘లోహిత్ కినారే’ సీరియల్ కి భూపేన్ దా గొప్ప సంగీతం అందించారు.
ఇక “ రుదాలి” చిత్రం భూపేన్ దా సంగీత జీవితం లో అత్యంత ప్రభావంతమయినదిగా పేరొందింది. అందులో ఆయన అందించిన సంగీతంలో భైరవి రాగంతో కలిపి అయిదు రాగాల్ని జానపద సంగీతంతో సమ్మిళితం చేసి సృష్టించారు. ఇందులో మొత్తం జై సల్మేర్ కు చెందిన సంగీత వాయిద్యకారులనే ఉపయోగించారు. రుడాలి కి కలపనా లాజ్మీ, గుల్జార్ లు స్క్రీన్ ప్లే రాసారు. ఆ స్క్రీన్ ప్లే ను ముందుంచుకుని ఆ సినిమాకు సినిమాటోగ్రఫీ ని నిర్వహించిన సంతోష్ శివన్ తో ఒక్కో సీన్ నూ చర్చిస్తూ దానికి తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించారు. అందుకే ఆ సినిమాలో ఏ పాటా సినిమాకు గానీ, కథకు గానీ, కథనానికి ద్రుశ్యానికే గానీ వేరుగా అనిపించదు. అన్నీ సమ్మిళితమయిపోయి ప్రేక్షకుల్ని వాటిల్లో మమేకం చేస్తాయి. అందుకే రుడాలి పాటలు అప్పటికీ ఇప్పటికీ ‘సమయ్ ఓ దీరే చలో ‘ అంటూ శ్రోతల్ని మమేకత్వంలో నింపేస్తున్నాయి. రుడాలి లో డింపుల్ కపాడియా,రాఖీ, రాజ్ బబ్బర్, అమ్జద్ ఖాన్ లు ప్రాధాన పాత్రల్ని పోషించారు. ఆ సినిమా జాత్జీయ అవార్డు తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించింది.
ఇక అస్సామీ భాషలో వచ్చిన సినిమాల్లో అధిక శాతం సినిమాలకు భూపేన్ దా నే పాటలు రాసి పాడి సంగీతం అందించాడు. అంతే కాదు అనేక బెంగాలీ సినిమాలకు కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించాడు. ‘జీబన్ త్రిష్ణ’, ‘జోనకిర్ ఆలో’, ‘మహిత్ బందూరే’, ‘కారి ఓ కోమల్’,’పింజర్’, ‘దంపతి’, ‘చమేలి మేమ్సాబ్’ లాంటి అనేక సినిమాలు అందులో వున్నాయి. హిందీ లో కల్పనా లాజ్మీ సినిమాలతో పాటు సాయి పరంజి పే తీసిన ‘పాపీహా’, బిమల్ దత్తా సినిమా’ ప్రతి మూర్తి’ లాంటి అనేక సినిమాలకు మ్యూసిక్ ఇచ్చాడు. ‘మిల గాయీ మంజిల్ ముజే’ సినిమాను ప్లస్ చానల్ రూపొందించగా లేఖ్ టాండన్ దర్శకత్వం వహించారు. సాయి పరంజి పే సినిమా ‘ సాజ్’ కూడా భూపెందా సంగీతం అందించాడు. పాన్ పిక్చర్స్ వారి ‘దర్మియాన్’ సినిమాకు కూడా సంగీతం తానే ఇచ్చాడు. ప్రఖ్యాత పేయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్ రచించి దర్శకత్వం వహించిన ‘గజ గామిని’ సినిమాకు భూపేన్ హజారికా అందించిన సంగీతం అద్భుతమయింది. ఇంకా లెక్క లేనన్ని డాక్యుమెంటరీలకు, టెలి సీరియల్స్ కు ఆయన సంగీతం విశేషప్రాచుర్యాన్ని తెచ్చింది. 2000 సంవత్సరంలో కల్పనా లాజ్మి సినిమా ‘దమన్’కు, 2003 లో ’ క్యోఁ’ సినిమాకు కూడా భూపేన్ డా సంగీత దర్శకత్వం వహించాడు. మొత్తంగా ఆయన 36 అస్సామీ సినిమాలకు, ఎనిమిది బెంగాలీ, అనేక హిందీ సినిమాలకు సంగీతం అందించాడు.
సంగీతమే తన మొదటి ప్రాముఖ్యత ‘మై ఫస్ట్ లవ్’ అని చెప్పిన భూపేన్ హజారికా సినిమా సంగీతం, పాటలతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ తో శ్రోతల్నీ విశేషంగా అకర్శించాడు.
భూపేన్ హాజారికా అమెరికాలో ఉన్నప్పుడే పాల్ రాబ్సన్ ని కలిసాడు. అప్పుడే ఆయనకు భారతీయ జానపద పాటలకు గాను అమెరికా లో బంగారు మెడల్ లభించింది.
భూపేన్ స్వతంత్ర అభ్యర్థి గా 1967 – 73 ల మధ్య అస్సాం లో శాసనసభ్యుడిగా పని చేసారు. అయితే 2004 లో భారతీయ జనతా పార్టి అభ్యర్థి గా గౌహతి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.
ఆయన జీవితం, సృజనాత్మతల పైన వి.బోరా, అర్నాబ్ జాన్ దేఖా లు సంయుక్తంగా ‘మొయి ఇతి జాజోబార్’ ( I am a wanderer) పేర పూర్తి స్థాయి డాక్యుమెంటరీ మొదలు పెట్టారు కానీ కారణాంతరాల వాళ్ళ అది పూర్తి కాలేదు ఈ లోగా సహదర్శకుడు అర్నాబ్ దేఖా ఆ ఫిలిం పైన. ‘అన్య ఏక్ జాజోబార్’, ‘మోర్ సునాకే భూపేంద్ర’ అన్న రెండు పుస్తకాలు రాసాడు.
భూపేన్ హజారికా అందుకున్న అవార్డులకు లెక్కేలేదు.ఆయనకు 1961 లో ఆసామీ సినిమా ‘శకుంతలకు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు, 1967లో ఉత్తమ సంగీతానికి గాను ‘చమేలీ మేమ్సాబ్’కు, అవార్డులు లభించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’, లభించాయి. మరణానంతరం ఆయనకు కేంద్రం ‘భారతరత్న’ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఇంకా సంగీత నాటక అకాడెమీ అవార్డు, ఫెలో షిప్, తదితర ఎన్నో పురస్కారాలు లభించాయి
భూపేన్ హాజారికా అనేక ఆరోగ్య సమస్యలతో 2011 వ సంవత్సరంలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో చేరారు. అదే సంవత్సరం నవంబర్ 5న మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో తుదిశ్వాసను విడిచారు భూపేన్ హజారికా గారి అంత్యక్రియలలో అయిదు లక్షల మంది పాల్గొన్నారు. భూపేన్ హజారికా ఈశాన్యభారతం అందించిన ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’(బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర). ఆయన గురించీ ఆయన అందించిన సంగీతం గురించీ ఎంతచేప్పుకున్నా మిగిలే వుంటుంది.
*****

అస్సామీ సాంస్కృతిక బావుటా – భూపేన్ హజారికా
+++ వారాల ఆనంద్

ప్రియురాలు

Posted on

+++++

ప్రియురాలు

+++++

ప్రేమ

నాలుగక్షరాల పదమే అయితే

చిరునవ్వు అంటే ఓ ముఖమే

ప్రియురాలు అని ఎవరినయితే అంటామో

ఆమె స్త్రీయే అయి వుండాలి

ఈ శవ పేటికలో

నిద్రిస్తున్నది

ఆ ప్రియురాలేనేమో

…….

సింహళ మూలం: లియనాగ్ అమర కీర్తి

ఇంగ్లీష్: ఉదాని పెరేరా

తెలుగు: వారాల ఆనంద్

Posted on

ఓ నది కవిత

+++++++++

నది లో

ఆకాశం మేఘాలు సూర్యుడు ఉన్నాయి

నది నా పిడికిట్లో వుంది

నా చేతుల్లోంచి

నదిని విసిరేస్తే

చుక్కలు చుక్కలుగా ఎగిసి చింది

ఆకాశం మేఘాలు సూర్యుడు

నాపై చెల్లా చెదురుగా పడిపోతాయి

పిడికిల్లోని

నదిని తాగేస్తే

ఆకాశం మేఘాలు సూర్యుడు

నా లోపల ఉండిపోతాయి 

ఇప్పుడు చెప్పండి

ఎవరు ఎవరి లోపల వున్నారు

కన్నడ: మమతా సాగర్

ఇంగ్లిష్: చిత్ర పణిక్కర్

తెలుగు: వారాల ఆనంద్