అందుకున్నాను
చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు
చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు
***********
వారాల ఆనంద్ సాహితీ లోకంలో పరిచయం అక్కరలేని కలం. చేవున్న కవితలతో నడుస్తున్న గొప్పకవి.అంతేకాదు వార్తా ప్రపంచంలో ఓ మానవీయ వ్యక్తి. మరింక లోతుగా చూస్తే సమాంతర సినిమా శోధకుడు, బోధకుడు కూడానూ. నిన్న సొంత ఊరు సొదలను మన ఎద ఎదల్లో నింపి
ఇప్పుడు చిన్నోడి ముక్తకాలను మన ముందు పరిచారు.ఇక్కడ తాత మనమడు సేఫ్.పాఠకులకు మాత్రం నల్లేరు నడక కాదిది.ఒక బాల్యంలోకి పరకాయ ప్రవేశం చేసి తన బాల్యాన్ని నాస్టాల్జియాలోకి ఒంపుకొని బాల ముక్తకాలను మరో ఆముక్తమాల్యదగా కవిత్వాన్ని అందించారు.ఇటీవలే ఈ కలం గుల్జార్ “గ్రీన్ పోయెమ్స్” తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నది.చిన్నోడి ముక్తకాలు 108 రకాల భావోద్వేగాల రాగమాల. కవిత్వం సినిమాటిక్ గా,డ్రామాటిక్ గా ఉండాలి. కానీ పాథెటిక్ గా కాదు. సీరియస్ గా ఉండి సెన్సషనల్ గా మానసిక ఉల్లాసం వైపు నడవడం స్టాటిక్ నుండి డైనమిక్స్ చేరుకోవడమే కవిత్వం అసలు ఉద్దేశ్యం లక్షమూ కూడా. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ధారాళంగా వారాల ఆనంద్ చిన్నోడి ముక్తకాలు అందుకున్నాయి. బతుకులో ముఖ్యమైన దశ బాల్యమే కదా. ఎందుకంటే బాల్యంలేని బతుకు ఉండదు మనిషికి. తన బాల్యాన్ని కవి తన మనుమడి లో చూసుకోవడం గొప్ప నాస్టాల్జియానే. ఇక పేజీలు అలల్లా కదులుతున్నాయి నా చేతి వేళ్లను తాకుతూ. ఇది నాకు గొప్ప అనుభూతినీ ఆనందాన్నీ ఇచ్చింది. కవి అంటాడూ ఒక ముక్తకంలో ఇలా … “వాడితో ఆడుకుంటున్నా, /కాదు వాడే నన్నాడిస్తున్నాడు/ ఇరవై ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నదేదో తిరిగిస్తున్నాడు/”. తన బాల్యాన్ని వారాల ఆనంద్ యాదోంకీ బారాత్ గా ఆవిష్కరించుకుంటూ తన మనుమని బాల్యంలోకి అన్వయ కవిత్వం రాస్తున్నారు. ఇద్దరూ ఆడుకోవం ప్రధానమైన అనుభూతి . ఈ ఇద్దరూ కలిసి పాఠకులను ఆడించం గొప్ప అనుభవమే మరి. బాల్యం చేయని పని లేదుగదా. మరో పోయెమ్ లో “ఈ నడుమ వాకింగ్ కు వస్తలేవేంది… /వాకింగేంది భయ్యా చిన్నోడితో /రన్నింగే అవుతుంటే”/ ప్రతి ఒక్కరికీ బాల్యంలో ఆట ఉరుకులూ, పరుగులూ, దుముకుడూ, పడి లేవడాలూ ఉత్సుకతనూ భయాన్నీ పరిచయం చేసేవే . అయితే వీటి డిగ్రీ ఒకేలా ఉండదు కూడా. దీనిలో తాతను మనమడు ఆడించడమే సజీవ కవిత్వమూ, కవిత్వవంశమూ కూడా. వ్యక్తావ్యక్త బాల్యాన్ని ఆవిష్కరించుకోవడం కవికి గొప్ప వరం. అంతేకాదు వారాల ఆనంద్ కు కొత్త జీవన సారం కూడా. మరో ముక్తకంలో “కవిత్వం చదివాను కనుక నాకు ఉనికి /కవిత్వం రాసాను కనుక నాకు ఊపిరి”/కవికి చిరునామా కవిత్వం బతుకూ కవిత్వమైనప్పుడు ఉనికీ ఊపిరీ కవిత్వమే . మన పనీ పనితనమూ మనలో ప్రవహించడమంటే ఇదే మరి. “చిన్నోడికి నాలుగు అడుగులు వేయడం వచ్చింది /మెష్ డోర్ తీస్తే చాలు /’కవిత్వం ‘/ నడక కొత్తదిగదా పరుగో పరుగు అంటుంది. చిన్నోడి చేష్టలు ఆపడం కష్టమే మరి. ఇది ప్రతి తాత అమ్మమ్మమ్మ జీవితానుభవ సారమే. ఇక్కడ కవిత్వం చెంగో బిళ్ళ మాటలో పొడుగుకుంది. ఎంత గొప్ప మాండలిక నుడికారం. అంతే అస్తిత్వ ప్రతీక కూడా.ఇంకా “మెట్లు ఎక్కుతాడట,/ గోడలు దాటుతాడట,/ గోడలు దూకకుండా చూస్కో అంటున్నాడో మిత్రుడు”/మనిషి ఎదుగుదలలో పెరుగుదలలో మంచీ చెడూ సంగమిస్తాయి . కవి హెచ్చరికగా గోడలు దూకకుండా చూస్కో అని మరో గోతులోంచి పలికించాడు కవి ఆనంద్. ఇదే కవిత్వం చెమక్కు. అలతి అలతి మాటలు, రోజూ మన వాడే భాషలో కవిత్వాన్ని అల్లడం నేర్పూ ఓర్పుకు పరీక్షే మరి. లోగడ ముక్తకాలు కవిత్వం వెలువరించిన కాలానికీ కవికీ ఇది సమస్య కాకపోవచ్చు. అయినా మన రోజూవారీ మాటలను మనం కవిత్వంలోకి ప్రతిక్షేపించడం ఒకింత సాహసం. అంతే స్వాభిమానం కూడా. మరో ముక్తకంలో “వాడికి తెలిసిందల్లా నవ్వులూ కేరింతలూ కవ్వింతలే “/ అంటాడు కవి. చిన్నతనంలో పిల్లల ఆస్తి అదేకదా. కల్మషం మాయామర్మం లేని తెల్ల కాగితం కదా బాల్యమంటే. అది సజావుగా నడిచేలా చూడడమే తాతల పని. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు.సామజిక దృక్పథంలో కవి రచనకు మచ్చుగా చెప్పొచ్చు కూడా. మరో కవితలో “సతాయింపు ఇసుమంత /ఆనందం ‘ఆకాశమంత’/ఆనంద్ కు ఉచితంగానే ఆనందం దొరికింది.ఆనందం ఔషధం. దీనితో మనసూ దేహం మరింత ఆరోగ్యాన్ని తప్పకుండా పొందుతుంది.ఇక్కడ మునుమడు తాతకు మంచి టానిక్.కవికి ఆప్టిమిస్టిక్ ఆప్టిక్.ఆనంద్ కవిత్వం నడక తీరును తన లయ కవితం నుండి నుండి మానేరు తీరం, మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు,సొంత ఊరు కవిత్వం చదివిన తెలుస్తుంది. అందులో చతుర చాతుర్యం, హాస్యం, సామజిక నేపథ్యం, బంధాలూ సంబంధాలూ వాలి విలువలు తెలిపే మెళుకువలున్నాయి. ఇది చూడండి. “ఇంట్లో కర్ఫ్యూ పెట్టినట్టుంది/ చిన్నోడిప్పుడే నిద్ర పోయాడు/”ఎంత సునిశిత భావుకత. ఎంత గొప్ప అభివ్యకి. మమకారం, ప్రేమా రక్తంలా ప్రవహిస్తేనే ఇలాంటి కవిత్వం కవిలో పుట్టుకొస్తుంది నిస్సందేహంగా. కవి స్వయంగా సినీ వాలి. అందువల్ల అనుకోకుండానే సినీ మాటలు, సినీమా ఆటలు సినిమాటిక్ గా వచ్చి వాళ్ళయిక్కడ. కదలడు -వదలడు, చిక్కడు దొరకడు , మోసగాళ్లకు మోసగాడు సాగర సంగమం,ఛాలెంజ్ వంటివి కొన్ని సందర్భం ఔచిత్యం తొణికిసలాడేలా కవితమయమైనవి. ఇది అనుభవం నేర్పిన విద్య. ఇక చివరగా మనుమని విన్యాసం కవి రాతలో ” క్షణంలో గులక రాయి / నోట్లో ఎరగనట్టు/ నవ్వేస్తాడు,’మోసగాళ్లకు మోసగాడు’ /
తాత కవిత్వమంతా మనుమనిపైన ఎలా అల్లుకొని గుండెను అలుముకొందో చెప్పొచ్చు. చిన్నతనం మనను ఎలా నమ్మిస్తుందో చెప్పడం కవి ఉద్దేశ్యంగా నాకు తోచింది. మనుమనిలో తన బాల్యాన్ని చూసుకుంటూ మనకు మంచి బాలల కవిత్వాన్ని అందించిన ఆనంద్ సర్వదా బహుధా ప్రశంశనీయుడు.వారి కలం సేద్యం శ్లాఘనీయం కూడా.
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871.
https://epaper.dishadaily.com/c/72719329
ప్రియురాలు
+++++
ప్రియురాలు
+++++
ప్రేమ
నాలుగక్షరాల పదమే అయితే
చిరునవ్వు అంటే ఓ ముఖమే
ప్రియురాలు అని ఎవరినయితే అంటామో
ఆమె స్త్రీయే అయి వుండాలి
ఈ శవ పేటికలో
నిద్రిస్తున్నది
ఆ ప్రియురాలేనేమో
…….
సింహళ మూలం: లియనాగ్ అమర కీర్తి
ఇంగ్లీష్: ఉదాని పెరేరా
తెలుగు: వారాల ఆనంద్
కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్
కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్
++++++++ వారాల ఆనంద్
“నేను ప్రకృతిని అనుసరించను..నేనే ప్రకృతిని” నంటారు కున్వర్ నారాయణ్.
అంతేకాదు మనం రెండు ప్రపంచాల్లో బతుకుతాం..ఒకటి తాను సృష్టించిన ప్రపంచం.. మరోటి ఇతరులు సృష్టించింది..
నా ప్రపంచం మన ప్రపంచానికి భిన్నమయింది కావచ్చు కాకపోనూ వచ్చు.. అంటాడు
***********
Pl click the link for video
********
వర్తమాన హిందీ సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గొప్పగా ప్రభావితం చేసారు కున్వర్ నారాయణ్.
హిందీ సాహిత్య ప్రపంచంలో తనదయిన సృజనాత్మక నైపుణ్యాన్ని సాధించాడు. ఆయన సృజనాత్మక వ్యక్తీకరణలో సరళత, పదునయిన తాదాత్మ్యత కనిపిస్తాయి. మొత్తంగా సమతావాద దృక్పధం లో ఆయన రచనలన్నీ సాగాయి.
కున్వర్ నారాయణ్ రచనల్లో ‘జీవితం..కవిత్వం తో రూపొందింది’అన్న BORGES మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
కున్వర్ నారాయణ్ ఒక చోట ఇట్లా అంటాడు
‘నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను’…
హిందీ నవ్య కవిత్యోద్యమం తో మమేకమయిన కున్వర్ నారాయణ్ తన సరళమయిన భాష వ్యక్తీకరణలతో హిందీ సాహిత్యం లో ప్రత్యేక ముద్ర వేసాడు.
కున్వర్ నారాయణ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో వున్నారు.
ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసారు. కవిత్వం, కథలు,ఎపిక్, విమర్శ, వ్యాసాలూ, అనువాదాలు చేసారు. వాటితో పాటు సినిమా,సంగీతం, కళలు, మ్యూజింగ్స్ కూడా రాసారు.
++++
19 సెప్టెంబర్ 1927న జన్మించిన కున్వర్ నారాయణ్ తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య-ఫైజాబాద్ నగరాల్లో గడిపారు. ఆ కాలంలో ఆయన కుటుంబాన్ని టీబీ తీవ్రంగా కలిచివేసింది. అనేక మంది మృత్యు వాత పడ్డారు. చివరికి తనకు అత్యంత ప్రియతములయిన తల్లి, సోదరి కూడా టీబీ వ్యాధికి బలయ్యారు.
అనంతరం కున్వర్ పెద్దన్నయ్యతో కలిసి లక్నో నగరానికి చేరుకున్నాడు. అప్పుడు దేశమంతా గాంధీగారి ప్రభావం పెల్లుబుకుతున్న సమయం. లక్నో లో వాళ్ళిల్లు అనేక మంది రాజకీయ నాయకుఅకు వేదిక గా వుండేది. ఆక్రమం లోనే కున్వర్ నారాయణ్ జీవితంలో తొలి రోజుల్ని, ఆలోచనల్ని ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య కృపలానీ తీవ్రంగా ప్రభావితంచేసారు. ఒక సంవత్సరం బాంబే లో నరేంద్ర దేవ్ తో వున్న కున్వర్ తర్వాత
ఆచార్య కృపలానీ తో ‘విజిల్’ పత్రికలో పని చేసాడు. ఆ అనుభవం తన ఆలోచననీ దృష్టి కోణాన్నీ విస్తారం చేసింది.
కున్వర్ నారాయణ్ లక్నో విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో ఎం.ఎ. పూర్తి చేసారు. అప్పుడే ‘లేఖ్ సంఘ్’ అన్న సంస్థ తో మమేకమయి పని చేసారు. తర్వాత విదేశాలకు వెళ్ళిన కున్వర్ కవిత్వం పైన పాబ్లో నెరుడా, నాజిమ్ హిక్మాట్ లాంటి అనేక విదేశీ సృజనకారుల ప్రభావం పడింది. పోలాండ్, జెకోస్లోవేకియా, చైనా, రష్యా లాంటి దేశాల పర్యటన కున్వర్ ఆలోచనా పరిధిని విస్తృతం చేసాయి. 1956 లో విదేశాలనుంచి తిరిగి రాగానే కున్వర్ నారాయణ్ తొలి కవితా సంకలనం ‘చక్రవ్యూహ్’ వెలువడింది. ఆ కాలంలోనే ఆయన ‘యుగ చేతన’ అన్న పత్రిక కు సహా సంపాదకుడిగా పని చేసారు. తర్వాతి కాలంలో ‘నయా పత్రిక్’, ‘చాయానాత్’ అన్న పత్రికలకు కూడా సహసంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. ఎ పనిలో వున్నా ఎక్కడున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. తన సృజనని నిరంతరం నిలుపుకున్నారు. కవిత్వంతో పాటు అనేక కథల్నీ రాసారు కున్వర్. తర్వాత వెలువడింది ‘తీస్రా సప్తక్’. ప్రసిద్ధ కవి ఆగ్గేయ సంపాదకత్వం లో వెలువడిన ఆ సంకలనం లో వున్న ఏడుగురు కవుల్లో కున్వర్ నారాయణ్ ఒకరు.
తర్వాత కున్వర్ కవితా సంకలనం ‘పర్వేష్-హం తుమ్’
ఆ తర్వాత వచ్చిన “ ఆత్మజాయి” ఉపనిషత్తులలో వున్న నచికేతుని పాత్ర ఆధారంగా రాసిన రచన అది. అందులో జీవితము,మరణమూ, సంఘర్షణ లని మూలన్గాతీసుకుని చేసిన ఈ రచన తాత్వికంగా వుంటుంది. అందులో తమ కుటుంబ సభుల మరణాలూ వాటి ప్రభావాలూ అంతర్లీనంగా కనిపిస్తాయి.
70 వ దశకం వచ్చేసరికి కున్వర్ నారాయణ్ పై సినిమా, సంగీతం, నాటకం, చిత్రకళా ప్రభావాలు అధికమయ్యాయి. ఆ కాలంలోనే ‘నయా ప్రతీక్’, ‘చాయానాత్’ పత్రికలకు సహా సంపాదకత్వం వహించాడు. కొన్ని సాహితీ సంస్థల నిర్వహణ బాధ్యతా స్వీకరించాడు. 71 లో ఆయన వెలువరించిన ‘ఆమ్నే సామ్నే’ అన్న కథల పుస్తకం ఆనాటి సామాజిక రాజకీయాల పైన సంధించిన వ్యంగ్యాత్మక రచన గా వినుతికెక్కింది
అయితే ఆయనకు గొప్ప పేరుని అనేక అవార్డుల్నీ ఇచ్చిన పుస్తకం 1979 లోవచ్చిన “ కోయి దూస్రా నహీ’లో జీవితానుభవాల విస్తృతి కనిపిస్తుంది. 1999 కున్వర్ నారాయణ్ ‘ఆజ్ అవుర్ ఆజ్ సే పహలే’ అన్న సాహిత్య విమర్శ పుస్తకం వెలువరించారు. తర్వాత తన ఇంటర్వ్యూ ల తో కూడిన ‘మేరె సాక్షాత్కర్’ వచ్చింది. కున్వ నారాయణ్ అనేక సంవత్సరాల పాటు సినిమా, శాస్త్రీయ సంగీతాలను విశ్లేషిస్తూ విరివిగా రాసారు. పలు అనువాదాలు కూడా చేసారు.
2002లో ఆయన ‘ఇన్ దినో’ అన్న కవితా సంకలనం వెలువరించారు. తర్వాత ‘వాజస్రావాకే బహానే’ అన్న ఒతిహాసిక గ్రంధం ప్రచురించారు.
హిందీ సాహిత్య ప్రపంచంలో విలక్షణ కవిగా పేరుగడించిన కున్వర్ నారాయణ్ సృజనాత్మక ప్రభావం మొత్తం హిందీ బెల్ట్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయనకు సాహిత్యంలో అనేక జాతీయ అంతర్జాతీయ విశిష్ట అవార్డులు లభించాయి. అందులో కెనడా హాహిత్య అకాడెమీ అవార్డు, జ్ఞానాపీఠ్ పురస్కారం, కబీర్ సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, లోహియ సమ్మాన్, సలఖ్ సమ్మాన్, వార్శా విశ్యవిద్యాలయ గోల్డ్ మెడల్, ఇటలీ ప్రెమియో ఫెరోనియా లు కొన్ని మాత్రమే.
++++++
ఇట్లా హిందీ సాహితీ ప్రపంచంలో తనదయిన గొప్ప స్థానాన్ని పొందిన కున్వర్ నారాయణ్ ఎంపిక చేసిన కవితల్ని ఆయన కుమారుడు అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి ప్రతిభావంతంగా అనువదించారు. మూల రచనని యధాతతదంగా కాకుండా, భావం చెడకుండా చాలా గొప్పగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. అనువాదంలో అనేక మంది లాగా అకాడెమిక్ ఇంగ్లీష్ భాషను కాకుండా సృజనాత్మక ఆంగ్ల భాషను ఉపయోగించి ఈస్తేటిక్ ఫీల్ ని చివరంటా కొనసాగించారు. అది అనువాదకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సంకలనంలో అనువాదకుడు అపూర్వ మూల కవిత్వాన్ని “ EARLY MEDITATIONS, ROUGH ROADS OF HISTORY, JOURNEYS,THE RIVER DOES NOT GROW OLD, TREES, MITTORS AND SHADOWS,REMEMBERANCES, HUMANESQUE” విభాగాలుగా ఎంపిక చేసి కూర్చారు. చాలా గొప్ప కూర్పు.
1927లో జన్మించిన కున్వర్ నారాయణ్ తన 90 ఎల్ల వయసులో 15 నవంబర్ 2017 న పరమపదించారు.
ఆయన కవిత్వం అందరూ ముఖ్యంగా కవులూ సాహిత్యకారులూ తప్పకుండ చదవాలని నేను అభిలషిస్తున్నాను. ఈ సందర్భంగా కున్వర్ నారాయణ్ స్మృతికి నివాళులు అర్పించుకుంటూ, అనువాదాన్ని అందించిన అపూర్వ నారాయణ్ కి ధన్యవాదాలు
….. మీకోసం నేను చేసిన కున్వర్ నారాయణ్ కవిత్వ అనువాదాలు కొన్ని……
1) కొత్త మార్గం
————————
నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను
జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
కవిత్వానికి
అనుమానాస్పదంగా వున్న
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి
అందుకు మొదట
జీవితపు శక్తి మూలాల్ని
క్రియాశీలం చేయాలి
తర్వాత ఆ శక్తిని
బతుకు కక్షకున్న ఇరుసుకు
జత చేయాలి
అప్పుడు
గతంలో లాగా
‘యాంత్రికత’ లేని
‘మానవత్వం’ వైపు మరలిన
కొత్త మార్గం ఆరంభమవుతుంది.
——————————–
ఓ వింతయిన రోజు
—————
నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదు
అనేకమంది మనుషుల్ని కలిసాను
ఎక్కడా అవమానం ఎదురుకాలేదు
నేను రోజంతా సత్యమే మాట్లాడాను
ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
నేనివాళ అందరినీ విశ్వసించాను
ఎక్కడా మోసగింప బడలేదు
అద్భుతమయిన విషయమేమిటంటే
నేను ఇంటికి చేరుకోగానే
తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
నేనే అని కనుగొన్నాను
================
ఎనిమిదవ అంతస్తు పైన
+++++++++
నేను ఎనిమిదవ అంతస్తులోని
ఓ చిన్న ఫ్లాట్ లో
ఒంటరిగా నివసిస్తున్నాను
ఆ ఫ్లాట్ కు బయటకు తెరుచుకునే
రెండు కిటికీ లున్నాయి
అవి నన్ను తీవ్రంగా భయపెడతాయి
కిటికీలకు బందోబస్తుగా
గట్టి గ్రిల్స్ బిగించాను
బయటనుంచి ఏదో ఉపద్రవం
ముంచు కొస్తుందని కాదు
ఇంత ఎత్తులోకి చొచ్చుకొచ్చే
ధైర్యం ఎవడు మాత్రం చేస్తాడు
ప్రమాదమల్లా నా లోపలే వుంది
చుట్టూ ఈ ఒంటరితనం ఈ విసుగూ
భయ భ్రాంతులని చేసే ఆ అంశాలు
ఏదో ఒక రోజు నన్ను
ఈ కిటికీల్లోంచి బయటకు దూకే
ఒత్తిడి చేస్తాయేమో
====
ఎదనిండా ‘తడి’ ++వారాల ఆనంద్
ఎదనిండా ‘తడి’
++++++++++++++++ వారాల ఆనంద్
తెలంగాణా మాటంటే ఎంత పావురం
వింటే చెవులల్ల అమృతం బోసినట్టుంటది
పలకరిస్తే ప్రేమ ఒలక బోసినట్టుంటది
పిలిస్తే మత్తడి దుమికినట్టుంటది
ఎంత ఆత్మగల్లదీ భాష
అవ్వ అంటే తొవ్వ జూపిస్తది
అయ్య అంటే వేలుబట్టుకు నడిపిస్తది
వాకిట్లోంచి ఎవరయినా కేకేస్తే
కిటికీ రెక్కలు బార్లా దెరిచి
చల్ల గాలి లోనికొచ్చి ప్రేమతో
పెయ్యంతా తడిమినట్టయితది
పాణంగా ముచ్చట బెడితే
పండగ జేసినట్టుంటది
కష్టాల్ని దల్సుకుంట ఎక్కిళ్ళు పడితే
కడుపులోంచి దుఖం తన్నుకొస్తది
ఏమి భాషిది
మనసుకు అద్దం పడుతది
మనుషుల నడుమ వంతెన కడుతది
దీంట్ల దొరగాడి రాజసముంది
కూలోడి చెమట చుక్కల మెరుపుంది
ఏ బస్సులోనో రైలులోనో గాలి మోటర్లోనో
ఏ ముఖం తెలీని వాడి నోటయినా
తెలంగాణా మాట వింటే చాలు
మావాడనిపిస్తది మావూరోడనిపిస్తది
కానీ ఉద్యమంలో ఆధిపత్యాన్ని వూడ్చేసిన
మా చీపుర్లు
ఇవ్వాళ మూలకు కూలబడ్డాయి
మీన మేషాలు లెక్కబెడుతున్నాయి
నీళ్ళలాంటి మాటల్ని రసాయన ద్రవాల్లో మరగబెడుతున్నాయి
పాత రాగంతో కొత్త గానం అందుకుంటున్నాయి
అయినా
నాకెందుకో ఈ భాషంటే
ఎద నిండా తడి
అది రాసే వాళ్ళంటే
ఎంతో చెప్పలెంత ‘ఇది’
*************