Month: September 2023
మళ్ళీ ఒక చెట్టు
మళ్ళీ ఒక చెట్టు
+++++++
ఇప్పుడు పుడక వున్న చోటే
గతంలో ఓ చెట్టు ఉండేది
దాని శిఖరం మీద
పిడుగు పడిందేమో
అక్కడో పక్షి గూడుండేది
ఇప్పుడక్కడ బూడిద మిగిలింది
అడవిలో నాలుగు దిక్కులా
వెళ్తురు నిండి వుండేది
అక్కడో కల వుండేది
ఇప్పుడక్కడ శాంతి నెలకొంది
ఇప్పుడెక్కడయితే శాంతి వుందో
అక్కడో మొగ్గ తొడిగింది
మళ్ళీ ఒక చెట్టు
మళ్ళీ ఒక అడవి
మళ్ళీ ఒక కల
అదే పుడక లోంచి
********
హిందీ మూలం : కున్వర్ నారాయణ్
ఇంగ్లీష్ : అపూర్వ నారాయణ్
తెలుగు : వారాల ఆనంద్
నిలకడలేని కాలం
+++ వారాల ఆనంద్
నిలకడలేని కాలం
+++ వారాల ఆనంద్
తల పైకెత్తి విశాలమయిన ఆకాశాన్ని
కానీ
నా చేతులు చాలా చిన్నవి
తల వంచి నేల వైపు చూసి
ఉత్సాహంగా భూప్రదక్షణ చేద్దామనుకున్నాను
కానీ
నా పాదాలు చాలా చిన్నవి
ప్రపంచ సాహిత్యాన్నంతా
ఆసక్తిగా చదివేద్దామనుకున్నాను
కానీ వయసుడిగిన చూపులు మందగించాయి
వెధవది మనిషిలాగే నిలకడలేని కాలం
ఎవరో తరుముతున్నట్టు
ఒకటే పరుగు
‘మనుషులు’ మిగిలిపోతారు
++++++ వారాల ఆనంద్
‘మనుషులు’ మిగిలిపోతారు
++++++ వారాల ఆనంద్
కరచాలనం
చేసిన చేతుల్ని వదిలేసినంత మాత్రాన
చూపుల్ని తిప్పేసినంత మాత్రాన
నవ్విన
మూతుల్ని ముడిచేసినంత మాత్రాన
బంధాలు తెగిపోతాయా
అనుబంధాలు చేదవుతాయా
శతృత్వాలు చిగురిస్తాయా
ముఖాల్ని తిప్పేసిన చెడు వాతావరణంలో కూడా
నాలుగు మంచి మాటలు పలకొచ్చు
వైరానికి అర్థాన్ని మార్చొచ్చు
ఒక్క క్షణం పాదాల్ని భూమ్మీద
నిలకడగా వుంచి
తల విదిల్చి తరచి చూస్తే
ముసుగులు తొలిగిపోతాయి
మనసులు విచ్చుకుంటాయి
‘మనుషులు’ మిగిలిపోతారు
********
మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”
****** వారాల ఆనంద్
మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”
****** వారాల ఆనంద్
బెంగాల్ లో ఒక టాగోర్ లా, కర్ణాటకలో ఒక ఏ.కే.రానుజన్ లా, మలయాళంలో ఫణిక్కర్ లా తనదయిన ఒక ప్రత్యేకమయిన స్వరంతో ప్రకృతితో మమేకమయి గొప్ప కవిత్వం రాసిన మానకాలపు మహాకవి జయంత్ మహాపాత్ర. తనని పాబ్లో నెరూడాతో ఒకసారి ఎవరో పోలిస్తే నవ్వేసి నెరూడాలాగా ఒక కవిత రాస్తే చాలు’ అన్నాడు. ఆయన అంత నిగర్వి సాధారణ మయినవాడాయన. మీరు ఇంత పెద్ద కవి కదా ఈ మామూలు పట్టణం కటక్ లో ఎందుకు నివసిస్తారని ఆయన్ని అడిగితే ‘ ఈ ఇంట్లో ఏది ఎక్కడ వుందో నాకు తెలుసు. నా ఇంటి చుట్టూ వున్న చెట్టూ చేమా రోజూ నాతో మాట్లాడతాయి. వీధి తలుపు తీసుకుని బయటకు వెళ్తే ఎంతో మంది చేతులూపి పలకరిస్తారు.. ఇంతకంటే నాకేం కావాలి’ అన్నాడాయన. అదీ జయంత్ మహాపాత్ర.
2 అక్టోబర్ 1928 కటక్ లో జన్మించిన జయంత్ మహాపాత్ర కింది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. తన ప్రాథమిక విద్య కటక్ లోని స్టీవర్ట్ స్కూలు లో జరిగింది. చిన్నప్పటినుండీ ఆంగ్ల మాధ్యంలో చదువుకున్న ఆయన సైన్స్ బాగా ఉత్సాహంగా ఆసక్తిగా చదువుకున్నాడు. భౌతిక శాస్త్రం లో పీజీ ప్రథమ శ్రేణిలో పాసయి, శాస్త్రవేత్తగా శిక్షణ పొందాడు. కాలేజీ టీచర్ గా తన వృత్తి జీవితం ప్రారంభించాడు. ఒదిశా లోని పలు కాలేజీల్లో ముప్పయి ఆరేళ్ళ పాటు భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పని చేసాడు. గంగాధర్ మెహర్ కాలేజ్ సంబల్ పూర్, బి.జే.బి కాలేజి, భువనేశ్వర్,ఫకీర్ మోహన్ కాలేజి బాలాసోర్, రావెన్ షా కాలేజ్,కటక్ లాంటి అనేక కాలేజీల్లో పని చేసాడు. చిన్నప్పటినుండీ ఎప్పుడూ కవిత్వం రాయాలని, కవి ని కావాలని ఆయన అనుకోలేదు. చాలా మంది కవుల కంటే భిన్నంగా జయంత్ మహాపాత్ర తన 38 వ ఏట కవిత్వం రాయం మొదలు పెట్టాడు. ఆయన ఇంగ్లీష్, ఒడియా రెండు భాషల్లో విరివిగా రాసాడు. భారతీయ ఆంగ్ల కవిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు.
ఆయన మొట్టమొదటి పుస్తకం “CLOSE THE SKY , TEN BY TEN” 1970 లో అచ్చు అయింది. అప్పటిదాకా భౌతిక శాస్త్రం భోదిస్తూ ఉన్నప్పటికీ, ఆయనకు నవలలు కథలు బాగా ఇష్టంగా ఉండేవి. అందులోనూ ఇంగ్లీష్ వచనం బాగా చదివాడు. కానీ ఎప్పుడూ కవి అవుతానని అనుకోలేదు. కాని కవిత్వం లోకి గుడ్డిగా వచ్చేసాడు.. ఎటు పోతున్నాడో తెలీని స్థితి.. కవిత్వ తొలి రోజుల్లో ఆయన కవిత్వం నిండా స్వీయ స్పృహ అధికంగా కనిపిస్తుంది. అయితే ‘కవిగా మొదటి రోజుల్లో పడిపోయాను, లేచాను, ఎదిగాను’ అంటాడు మహాపాత్ర. బహుశా అప్పటిదాకా ఆయనలోనో నిబిడీకృత మయివున్న కవితాంశ, భావావేశం, సృజనాత్కత పెల్లుబికి కవిత్వంగా రూపుదిద్దుకుందేమో అనిపిస్తుంది. ఆయన రాయకుండా, తన భావాల్ని చెప్పకుండా ఉండలేని స్థితికి గురయి విస్తృతంగా రాసాడు. రెండు భాషల్లో రెండు చేతులతో రాసాడనే చెప్పాలి. ఆయన విస్తృతంగా చదివాడు. అట్లా చదవడం వల్లనే తనకు భాష వొంటబట్టింది. ఆ భాషను కవిత్వం లో వాడాడు. చిన్నప్పటి నుండీ మిషనరీ స్కూల్స్ లో చదవడం వాళ్ళ ఆయనకు ఇంగ్లీష్ స్వభావ సిద్దంగానే వచ్చింది. ఒడియానే తనకు సెకండ్ లాంగ్వేజ్ గా నిలిచింది. అయినా ఆయన చుట్టూ వున్నది ఒడియా భాష అక్కడి ప్రజలు. వారితో మమేకం అయివుండడంతో ఆయన రచనల్లో ఆ జీవితం ఆ భాష ప్రభావం అమితంగా వుంది. తాను నివసించిన ఒడిశా ప్రాంత చరిత్ర సంస్కృతి ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. మహాపాత్ర ఇంగ్లీషు కవిత్వంలో ధ్వనించే లయ మిగతా బయటి దేశాల ఇంగ్లీష్ భాషా కవులకంటే భిన్నంగా వుంటుంది. దానికి ప్రదానంగా ఆయన పైన వున్న ఒడిశా లోని మౌఖిక సాహిత్యం, జానపద గీతాలు అనే చెప్పాలి.
జయంత్ మహాపాత్ర కవితా సంకలనం ‘ఏ రెయిన్ ఆఫ్ లైఫ్’ కవితలన్నీ బ్రిటన్ లోని క్రిటికల్ క్వార్టర్లీ, టి.ఎల్.ఎస్.లాంటి వాటిల్లోనూ, చికాగో రివ్యు లాంటి పత్రికల్లోనూ అచ్చయ్యాయి. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియాలలోని సాహిత్య పత్రికల్లో కూడా వచ్చాయి. దాంతో ఆ పుస్తకానికి జాకోబ్ గ్లాట్ స్టైన్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.
జయంత్ మహాపాత్ర 30 కి పైగా కవితా సంకలనాలు వెలువరించారు. అందులో అధికంగా ఇంగ్లీష్ లోనూ మిగతావి ఒరియాలోనూ రాసారు.
జయంత్ మహాపాత్ర ప్రధానంగా కవిత్వం రాసినప్పటికీ వచనం కూడా రాసారు. దొర్ ఆఫ్ పేపర్స్ కథా సంకలనం, అనేక వ్యాసాలూ, తన జ్ఞాపకాలూ రాసారు.అంతేకాదు జయంత్ మహాపాత్ర అనేక ఒడియా కవితల్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అనువాదకుడిగా కూడా ఆయనకు గొప్ప గౌరవముంది.
ఆయన కవితా సంకలనం ‘రిలేషన్ షిప్స్’ కి 1981 లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. దాంతో ఆయన మొట్టమొదటి భారతీయ ఆంగ్ల కవిగా ఆ అవార్డును అందుకున్నాడు. చికాగో పోయెట్రీ మాగజైన్ నుండి జాకోబ్ గ్లాట్ స్టయిన్ పురస్కారం, అల్లెన్ టా టే అవార్డును ద సేవానీ రివ్యు నుండి, సార్క్ లిటరరీ అవార్డు, టాటా లిటరేచర్ జీవన సాఫల్య పురస్కారంఅందుకున్నారు. ఇంకా 2009 లో పద్మశ్రీ పురస్కారం, ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, సాహిత్య అకాడెమీ ఫెల్లో షిప్ కూడా అందుకున్నారు. ఫెల్లోషిప్ ను అందుకున్న మొట్ట మొదటి భారతీయ ఆంగ్ల కవి కూడా జయంత్ మహాపాత్ర నే. అంతే కాదు అనేక జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కవిత్వ పఠనాల్లో పాల్గొన్నారు.
‘కవి తనకు తాను వేసుకునే అనేక ప్రశ్నలకు, తాను రాసే కవిత్వం సమాధానాలు చెబుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.
అందుకే ఆయన కవిత్వం ఆయనకు తన అంతర్ బహిర్ సంఘర్షణలకు వేదికగా నిల్చింది. ఆయన రాసిన కవిత్వం ఆయనకే కాదు చదువరులు తాము ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు కూడా వెతికితే సమాధానాలు లభిస్తాయి.
ఆయన్ని చదివిన తర్వాత నా అనుభవం చెబుతున్న సత్యమిది.
ఎవరికయినా చదవడం రాయడం ఒక మంత్రం లా పని చేస్తుంది. అది ఆ పాఠకుడిలో వున్న అనేకానేక బాధలకు, సంక్షోభాలకు తెరిపినిస్తుంది. అందులో ముఖ్యంగా రాయడం వలన కవిలో పెల్లుబికిన ఉద్వేగం కాగితం మీదికి ఒలికి అతను అతని మనసు నిమ్మలమవుతుంది. జయంత్ మహాపాత్ర కవిత్వం కూడా అంతే ఆయన కూడా అంతే.. రాస్తూ తాను ఎంతో ఉపశమనం పొందుతానని అంటాడు.
‘కవి తాను స్వేచ్చగా రాయాలి, తన ఆవగాహనకు స్థాయికి అనుగుణంగా రాయాలి. ప్రేమ కవి, కమర్షియల్ కవి అంటూ కాకుండా కవి అనేవాడు తప్పకుండా తనను తాను ఆవిష్కరించుకోవాలి.. ఎలాంటి భేషజాలు, లేకుండా తాను భావించిన విషయాలు, తాను అనుకున్న సత్యాలు తాను చూసిన లేదా అనుభవించిన వాటిని తన కవిత్వంలో నిజయితీగా ప్రతిఫలింప జేయాలి’ అంటాడు జయంత్.
‘కవి అనేవాడు తన కవిత్వం తో నీతివంతమయిన ప్రవర్తనకు సంరక్షకుడిగా వుండాలి. కవిత్వం అలాంటి స్థితి సృష్టించ లేనప్పుడు ప్రపంచ మనుగడే ప్రశ్నార్థక మవుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.
కవి ఒంటరిగా ఒంటరితనంలో కూర్చుని రాయలేడు, అట్లా చేస్తే స్తబ్దత, ఎడారితనం కవిని చుట్టుముడుతాయి.అందుకే తన చుట్టూ జరుగుతున్న విషయాల్ని పతిన్చుకోకుండా ఉండలేడు. కవి తన వేదనని భావోద్వేగాన్ని గూర్చే రాస్తాడు. కవిత్వం కవి అంతర్ బహిర్ సంభాషణ నుంచే పుడుతుంది అంటాడు. అంతేకాదు కవిత్వం వర్తమాన కాలపు సంక్షోభాన్నీ, దుఖాన్ని ప్రతిబించాలంటాడు.
“నేను ఒడిశా లో పుట్టాను, ఇక్కడే బతికాను బతుకుతున్నాను, ఇక్కడి చరిత్ర నాది, కోణార్క్ నాది, కోణార్క్ వైశాల్యం నాది, వైభవం నాది, దాని ఒంటరితనం నాది.. అంతే కాదు ఇక్కడి ఆకలి.. ఇక్కడి కరువు కాటకాలు నావి.. ఎవరయినా వాటిని దాటి నా నుంచి మరే రచనల్ని ఆశిస్తారు.. నేను అదే రాసాను.. రాస్తున్నాను..చెట్టు మీద మామిడి ఎట్లా పండి పోతుందో నేనూ అట్లే మరణం వైపు పరి పక్వం చెందుతున్నాను” అన్నాడు జయంత్ మహాపాత్ర.
ఆయన కవిత్వంలో కాలం ముఖ్య భూమికను పోషిస్తుంది. ఆయన కాలంతో పాటు సమాంతరంగా సాగాడు. కాలం ఆయన కవిత్వం లో ముందుకు వెనక్కు కదుల్తూ వుంటుంది.
ఆయన కవిత్వం నిండా నాస్టాల్జియా కనిపిస్తుంది.
‘రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు … ఒక్కోసారి కవిత్వం గతాన్ని స్తుతిస్తుంది’ అని కూడా ఆయనంటాడు.
ఇట్లా భౌతిక శాస్త్రం చదువుకుని బోధించి కవితా ప్రపంచంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ స్పష్టమయిన అభిప్రాయాలతో అందమయిన స్థానీయమయిన ప్రతీకలతో గొప్ప కవిత్వాన్ని రాసి ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన జయంత్ మహాపాత్ర ఈ కాలపు మహా కవిగా మన్ననల్ని అందుకున్నాడు. ఒక కవి అలుపెరుగ కుండా సీరియస్ గా కవిత్వం రాస్తూ వుంటే అవార్డులు రివార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి అదే క్రమంలో జయంత్ మహాపాత్రకు అనేక అవార్డులు మన్ననలు వచ్చాయి.
జయంత్ మహాపాత్ర కటక్ కీ, మహానదీ తీరానికీ, ఒడియా నేలకీ జీవితమంతా అంటిపెట్టుకుపోయాడు. ఆ విషయంలో రామానుజన్ కన్నా, పార్థసారథికన్నా దిలీప్ చిత్రేకన్నా తనెంతో అదృష్టవంతుణ్ణని చెప్పుకుంటాడు. ఇప్పుడు తన ఆత్మకథ మాత్రం ఒడియాలో రాస్తున్నాడు. కవిత్వం జీవన సారాంశాన్ని చెప్పాలి. కవి అనేవాడు తన కవిత్వం లో తన శక్తిమేరకు జీవన గమనాన్ని నిజాయితీగానూ కళాత్మకంగానూ చెప్పగలగాలి. మొత్తంగా జయంత్ మహాపాత్ర కవిత్వం గాఢమైన జీవితానుభవంలాగా చాలా సాంద్రంగా సాగుతుంది.
ఆయనలేని లోటు భారతీయ ఆంగ్ల కవిత్వానికే కాదు మొత్తంగా కవిత్వ ప్రపంచానికే పూడ్చలేని లోటు.
======= 9440501281
నువ్వే….+++++ వారాల ఆనంద్
నువ్వే….
++++++++++++++ వారాల ఆనంద్
కారణమేదయినప్పటికీ
కారణమేదీ లేకున్నప్పటికీ
ఆ క్షణానికి
ఆ క్షణమే కాదు ప్రతి క్షణానికీ
నువ్వు నా వెంట ఉండాలనుకుంటాను
నీడలా నా పక్కనే నిలబడాలనుకుంటాను
నేను నిలబడ్డప్పుడూ
నేల జారినప్పుడూ
పరుగెత్తినప్పుడూ
పోట్రాయి తగిలి బొక్క బోర్లా పడిపోయినప్పుడూ
గెలిచి కాలరెగరేసినప్పుడూ
ఓడి ముఖం వేలాడేసినప్పుడూ
సుఖంలో మురిసినప్పుడూ
దుఃఖం లో నలిగినప్పుడూ
ఎప్పుడయినా ఏ క్షణమయినా
నువ్వు నా వెంటే వుండాలనుకుంటాను
తొలకరి చినుక్కి మురిసి పువ్వు వికసించినప్పుడూ
శరత్తులో ఎండిన ఆకు గలగలమని సవ్వడి చేసినప్పుడూ
నువ్వు నాపక్కనే వుండాలనుకుంటాను
అయినా నా అమాయకత్వం కానీ
నిద్దట్లోనూ మెలకువలోనూ
నాతో సదా వున్నది
నువ్వో నీ జ్ఞాపకామో కదా
*********************** 2 sept 2023
‘స్మశానాలు’
++++ వారాల ఆనంద్
Friends, pl read my poem published in KOUMUDI online magazine, Thank you Editor Sri Kiran Peabha garu – Varala Anand
‘స్మశానాలు’
++++ వారాల ఆనంద్
గుట్టలు తమలో తాము
గుస గుస లాడుకుంటున్నాయి
మనల్ని మందు పాతరల్తో పేల్చి
రంపాలతో కోసి చదునుచేసి
ఈ మనుషులు భవంతులు కడుతున్నారు
మెరుపులు దిద్దుకుంటున్నారు
పాపం ఆ తవ్వేసిన రాళ్ళకింద
ఏర్పడ్డ గోతుల్లో
తమ ‘స్మశానాల్ని’ తామే
సిధ్ధం చేసుకుంటున్నామని
తెలుసుకోలేక పోతున్నారు
గుట్టలు తమలో తాము
గుస గుస లాడుకుంటున్నాయి
************************ 9440501281
https://www.koumudi.net/Monthly/2023/september/index.html