literary criticism

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

Posted on Updated on

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)

కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.

మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

GULZAR ARTICLE ANDHRA PRABHA

Posted on

 కవిత్వంలో ప్రతీకలు మనసు తట్టి చేయి పట్టుకు నడిపిస్తాయి

++++++++++++++++++ వారాల ఆనంద్ 

 ఒక కవిని గతంలో చదివినప్పటికీ ఆ కవిని మళ్ళీ మళ్ళీ  చదవడం గొప్ప అనుభవం. “REVISITING ALWAYS REJUNAVATES “. ఒక కవిని లేదా ఒక కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి.కొత్త భావాలు ధ్వనిస్తాయి.సరికొత్త అనుభవాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కవి సరికొత్తగా దర్శనమిస్తాడు. ప్రేమగా ఆసక్తిగా వింటే ’Between the lines’ లోంచి ఆ కవి మనతో మరింత ఆర్తిగా, వేదనగా, సంతోషంగా మాట్లాడతాడు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజనకారుడు మనముందు ఆవిష్కృత మవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. ఎప్పుడూ ఇష్టంగా చదువుతూ వుండే గుల్జార్ ని ఆయనకు ‘జ్ఞాన్ పీఠ్’ ప్రకటించిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదవడం సరికొత్త అనుభవమే. గుల్జార్ కవిత్వాన్నీ వచనాన్నీ మొత్తంగా ఆయన సృజనని చదవడంలో అందుకున్న ఆనందం రెట్టింపులు అయింది.  

ఆయన కవిత్వం తాను  పాఠకుడితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ కవిత్వం నిండా ప్రతీకలు (ఇమేజేశ్) పరుచుకుని వుంటాయి. సాధారణంగా ఎప్పుడూ మనం చూసే చిత్రాల్ని, దృశ్యాలనే ప్రతీకలుగా చేసుకుని అతి సున్నితమయిన అంశాల్ని కవిత్వం చేస్తాడు. ఆయన కవితల నిండా మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం కనిపిస్తాయి. ఇట్లా గుల్జార్ కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి చదువుతూ వుంటే అనేక కోణాల్లో గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశమూ లభించిది. ఓ గొప్ప కవిని తిరిగి దర్శించడం అంటే ఇదేనేమో.

     భారత దేశభజనలో జరిగిన హింసకు గురయిన కుటుంబం ఆయనది. పాకిస్తాన్ నుంచి సరిహద్దును దాటి ఈ పక్కకు వచ్చారు. అప్పుడు జరిగిన దుర్మార్గాలను స్వయంగా చూసిన గుల్జార్ ఆనాటి అనుభవాల్ని కవితలుగా కథలుగా రాశారు… ’ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్’ పుస్తకంగా వచ్చింది.

“అది ఇప్పటికీ నా మాతృభూమే

కానీ ఇకపై ఎప్పటికీ నా దేశం కాదు

అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల్లోని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరగాలి

నా కలలకు ఆధారాల్ని చూపుతూ

నా ముఖం మీద ముద్రలు వేయించుకోవాలి” 

అంతేకాదు ‘నెగ్లెక్టెడ్ పోయెమ్స్’ లో

‘కళ్ళకు వీసా అవసరం లేదు

కలలకు సరిహద్దులు లేవు

నేను నా కళ్లను మూసుకుని

సరిహద్దును దాటి వెళ్తాను

మెహెంది హాసన్ ని కలవడానికి’ అంటూ తన వేదనని చెబుతాడు. 

     కవిగా రచయితగా గుల్జార్ అనేక భిన్నమయిన వైవిధ్యమయిన ప్రక్రియల్లో రాశారు. విభిన్న కళారూపాల్లో కృషి చేశారు. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా దృశ్య మాధ్యమంలో, సినీ గేయరచయితగా సంగీత ప్రపంచంలో గుల్జార్ ఆవిష్కరించిన కళాత్మకత ఎంతో విశాలమయింది, విలక్ష్ణమయింది. అయితే “ఎన్ని రూపాల్లో తన భావాల్ని వ్యక్తం చేసినప్పటికీ తనకు  ‘అక్షరమే’ ఆలంబన అని, రచనే తన మౌలిక వ్యక్తీకరణ రూపమని” ఆయన అంటారు. సాహిత్యం విషయానికి వస్తే ఆయన కవిత్వం, కథలు, జ్ణాపకాలు, పిల్లలకోసం కథలు పాటలు, కవితానువాదాలు, త్రివేణి పేర మూడు లైన్ల చిన్న కవితలు, ‘టూ’ పేర ఒక ఇంగ్లీష్ నవల, కామిక్స్ , ‘చక్కర్ చలాయే ఘన్ చక్కర్’ నాటకం, ఇట్లా అనేక ప్రక్రియల్లో రాసారు.  ఆయన ప్రధానంగా ఉర్దూ లో రాస్తారు. ఉర్దూ ఎంతమంది చదువుతున్నారు అది అంతరించి పోతున్న భాష అని ఎవరయినా అంటే గుల్జార్ అందుకు అంగీకరించడు. భాష ఎప్పటికీ అంతం కాదు. లిపి మారితే మారొచ్చు. కానీ భాష కు మరణం లేదు అంటాడాయన, మన దేశంలో పంజాబీ భాషను ఇప్పుడు గుర్ముఖీ లిపిలో రాస్తున్నారు, అదే పాకిస్తాన్లో వున్న పంజాబ్ లో ఉర్దూ లో రాస్తారు అంటాడాయన, మన దేశంలో ఉర్దూ పార్శీ ప్రభావంతోనూ, హిందీ సంస్కృత ప్రభావంతోనూ వుంది. కానీ ఇప్పుడు హిందీ ఉర్దూ ల్లో పెద్ద తేడా లేదు. సినిమాల్లో చూసినా బయట చూసినా వాడే హిందీలో అధిక శాతం ఉర్దూ మాటలే.  అందుకే మనం దాన్ని హిందూస్థానీ అనాలి అంటాడు గుల్జార్. అయితే ఆయన రచనలు ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, బ్రిజ్, ఖరీబౌలి, హర్యాన్వి, మార్వారి భాషల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందాయి.గుల్జార్ తన సృజాత్మక వ్యక్తీకరణల్లో ఇంత వైవిధ్యాన్ని విలక్షణతను సాధించడానికి ఆయన తన 90 ఏండ్ల వయసులో కూడా తనలోని సున్నితత్వాన్ని పోగొట్టుకోక పోవడమే ప్రధాన కారణం. ఆయన ఇప్పటికీ క్రమం తప్పకుండా, క్షణం వృధా చేయకుండా చదువుతూనో రాస్తూనో మాట్లాడుతూనో వుంటారు. అదే ఆయన బలం. మరో వైపు చూస్తే గుల్జార్ తన రచనల్లో వివిధ భారతీయ, భారతీయేతర భాషల్ని, ఆయా భాషల్లోని మాండలికాల్ని, జాతీయాల్ని ఆలవోకగా ఉపయోగిస్తాడు. దానికి ఆయన చేసే వివిధ భాషల అధ్యయనమే ప్రధానమయిన భూమిక. గుల్జార్ రాసిన తొలి సినిమా పాట ‘బందిని’ లోని మేర గోరా అంగ్ లయ్లే.. పాట పూర్తిగా అవధ్. ఇక ఆయనకు ఆస్కార్ తెచ్చిన ‘జయ్ హొ.’లో పంజాబీ తో పాటు కొంత స్పానిష్ కూడా ధ్వనిస్తుంది. ఇక ఆయన కవిత్వంలో ఆయన పలికించే ప్రతీకలు ప్రధాన బలం. గుల్జార్ కవితలు, గజల్స్ లో జానపదుల ఒరవడి, అమీర్ ఖౌస్రో, గాలిబ్, బాబా బుల్లే షా లాంటి కవుల అధ్యయన  ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచనల్లోని మరో ముఖ్యాంశం ఆయన కవిత్వంలోనూ జీవితంలోనూ వున్న ‘డౌన్ టు ఎర్త్, డౌన్ టు హార్ట్’ లక్షణం.అది ఎళ్ళ వేళల్లా ఆయన రచనల్లో ధ్వనిస్తూనే వుంటుంది. ‘కబీ రూహ్ దేఖీ హై.. ‘  అని ఆయన అన్నప్పుడు గుల్జార్ లోని తాత్వికత ఆవిష్కృతమవుతుంది.

చాలా విస్తృతంగా రాసిన  గుల్జార్ కవితా సంకలనాల వివరాల్లోకి వెళ్తే ఆయన రచనల్లో ప్రధానమయినవి సెలెక్టెడ్ పోయెమ్స్, నేగ్లెక్టెడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్, సైలెన్సెస్, ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్, ప్లూటో, ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇటీవలే గుల్జార్ కవిత్వం లోంచి సేకరించిన కవితలతో కూడిన సమగ్ర సంకలనం ‘బాలో-పార్:..కలెక్టెడ్ పోయెమ్స్” వెలువడింది. రక్షందా జలీల్ ఆ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. మొత్తం 1400 పేజీల ఈ సంకలనంలో గుల్జార్ మూల కవితలు వాటి అనువాదాలతో కూడిన ఈ సంకలనంలో చాంద్ పుఖ్ రాజ్ కా, రాత్ పాశ్మీనేకీ, పంద్రా పాచ్ పచత్తర్, కూచ్ ఔర్ నజ్మే, ప్లూటో, త్రివేణి సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి.

++++

గుల్జార్ కవిత్వాన్ని గురించి మరింతగా చెప్పుకుంటే ఆయన ‘ఆకుపచ్చ కవితలు’తో సహా గొప్ప భావుకుడయిన ఆయన సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్‌ వుంటుంది. ఇక ఆయన భాష,,రచనా శైలి కూడా చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వం చదువుతూ వుంటే ఆయన వాడిన  ఇమేజెస్‌లో వున్న ఒక తాజాదనం మనల్ని కదిలిస్తుంది. పాఠకుడి మనసు కదిలిపోతుంది.

ఈ కవిత చూడండి…

‘గగన సీమలో ఆకాశం

అతుకులు అతుకులుగా విడిపోతున్నది,

ఎన్ని ప్రాంతాల్నుంచి

ఈ గుడారం విడిపోతున్నదో

నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ

మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం పాఠకుడిపై గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది..

ఇంకో కవిత:

‘భయపడకు నేనున్నాను

భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు

చెట్టుకు ధైర్యాన్నిస్తూ

చెబుతూనే వుంది’

ఎంత నిబ్బరమయిన మాట’

ఇక ఆయనే రాసిన మరో  కవిత…

మబ్బు-

నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి

నా కిటికీని తాకింది

అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా

బయటంతా  చీకటి

లేచి వెళ్ళి బయట వర్షాన్ని

పలకరించే సమయం కాదిది

కెటికీ పరదాల్ని వేశాను

అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి

తడి తడి చేసింది

నా హాస్య చతురత మూగవోయింది

లేచి కిటికీల్ని దడాల్న మూసేశా

తిరిగి ముసుగేసుకొని పడకేసా

మనస్తాపం చెందిన వాన కోపంతో

కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది

మళ్ళీ తిరిగి రాలేదు

కిటికీ అద్దం పగుళ్లు మాత్రం

అట్లాగే వుండిపోయాయి

** * ఎంత భావుకతో కదా

ఇక మరో కవిత ఇట్లా సాగుతుంది

           —

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు

‘రాత్రులు’

దాడి చేయడానికి సిద్ధపడ్డాయి

అది ఓ సాలెగూడు

చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ

అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి

అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది  

అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు

మరింత భయంతో వణుకొస్తుంది  

‘జాతి’

కొందరి పదఘట్టనల క్రింద

నలిగిపోతున్నది

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మరోసారి మెడలు వంచబడ్డాయి

తలలు తెగి రాలిపడ్డాయి

ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా

విభజించబడ్డారు  

ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది

ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది

కొందరు చాలాసార్లు  నన్ను

మంచెకు వేలాడదీసారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

*********************

పర్యావరణం గురించి అధికంగా మదన పడే గుల్జార్ రాసిన ఈ కవితను చూడండి

“ దళిత మొక్క”

ఈ అడవి మొక్కల కొమ్మల మీద

ఏవో కొన్ని పదాలు కనిపిస్తాయి

పూర్తి కవిత అయితే కాదు

భూమి పొరల్ని చీల్చుకుని బలంగా నిలబడడానికి

ఈ మొక్కల కెప్పుడూ పోషకాలుండవు

వాటికి పూల కుండీలుండవు

వేర్లకు పోషకాలు లభించడానికి

అవి రోడ్లపైకి విసిరేయబడతాయి

దుమ్ములో ఆకలితో ధర్మంతో బతుకుతాయి

కొన్ని సార్లు మరిన్ని చేట్లేమో

బురద నీటిలోకి ఊడ్చేయబడతాయి 

ఆ బురద నీటిలోనే మురికి మట్టిలోనే

ఎదగడం మొదలెడతాయి

మళ్ళీ ఇంకో రోడ్డు మళ్ళీ ఇంకో తన్ను

ఇంకో దళిత మొక్క

 **** మొక్క గురించి చెబుతున్నట్టే వున్నా దళిత మొక్కను ప్రతీకగా చేసి మొత్తం కవిత కోణాన్నే మార్చేశాడు.

కవిత్వం సంగతి ఇట్లా వుంటే వచనం విషయంలో కూడా కథలు, ఒక నవల, ఒక నాటకం రాసిన గుల్జార్ తన జ్ఞాపకాల్నీ రాశాడు. అవి పుస్తకంగా వచ్చాయి.

ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR (నిజంగా.. వాళ్ళని నేను కలిసాను- ఓ జ్ఞాపకం = గుల్జార్ ) ఇవన్నీ అద్భుతమయిన జ్ఞాపకాలు. ఏకబిగిన చదివిస్తాయి. గుల్జార్ తన ఇన్నేళ్ళ జీవితంలో ఎంతో మందిని కలిసాడు. కవులు, రచయితలు,దర్శకులు, నటీనటులు, గాయకులూ, సంగీత దర్శకులు వొహ్ గొప్ప జ్ఞాపకాలు, మరెన్నోగొప్ప అనుభవాలు. ఈ పుస్తకంలో తాను తన నిత్య జీవితంలో కలిసిన వాళ్ళ గురించి ప్రస్తావించారు. తన వృత్తి జీవితంలో తాను కలిసి పనిచేసిన వారి గురించీ  రాసారు, అంతే కాదు తన పై వాళ్ళ ప్రభావాన్ని కూడా గుల్జార్ ఈ పుస్తకం లో సవివరంగా చెప్పారు. పుస్తకం శీర్షిక “నిజంగా.. వాళ్ళని నేను కలిసాను”లో నిజంగా అనడంలోనే గుల్జార్ కవితాత్మ కనిపిస్తున్నది. వాళ్ళని ఊరికే కలిసాను అని కాకుండా  నిజంగా కలిసాను అంటే మనసు లోతుల్లోంచి కలిసి రాసాను అంటున్నాడు గుల్జార్. ఇదొక మంచి జ్ఞాపకాల తోరణం.

నిజానికి ఇది గుల్జార్ జీవిత చరిత్ర కాదు, ఎందుకంటే జీవితచరిత్ర రచనకు, జ్ఞాపకాలకు తేడా వుంటుంది. జీవితచరిత్రలో సమగ్ర జీవితం వుంటే జ్ఞాపకాల్లో కొన్ని ముఖ్యమయిన సందర్భాలు సంఘటనలు వుంటాయి. ఈ పుస్తకం నిండా జ్ఞాపకాలున్నాయి.

++++++++

నిజానికి మనిషి జీవితంలో జ్ఞాపకాలు మరుగున పడవు. చేతనా అంతఃచేతనల్లో ఎక్కడో ఒక చోట సజీవంగా నిక్షిప్తమయ్యే వుంటాయి. అందునా కవీ కళాకారుడి జీవితాల్లో జ్ఞాపకాలు హృద్యంగానూ సాంద్రంగానూ వుంటాయి. కావలసిందల్లా ఆ జ్ఞాపకాలని రాయాలనుకున్నప్పుడు మనసు, ఆలోచనలు తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలాన్ని పునర్ దర్శించాలి. వున్నది వున్నట్టు కల్పనారహితంగా రచన లో ప్రబిబింప జేయాలి. అప్పుడే ఆ జ్ఞాపకాలకు సాహిత్యంలో స్థానంతో పాటు గౌరవమూ లభిస్తాయి. ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR పుస్తకం అలాంటి గౌరవం ఇవ్వాల్సిన రచన. ఈ పుస్తకం ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. తొలుత బెంగాలీ పత్రిక ఆదివారం సంచిక కోసం గుల్జార్ ఇవి రాసారు. అవన్నీ కలిపి “పంటా భాటే” పేరున బంగాలీ లో పుస్తకంగా వచ్చింది. మహార్గ్య చక్రవర్తి ఇంగ్లీషులోకి చేసారు. పెన్గ్విన్ వాళ్ళు ప్రచురించారు.

…………. ఈ ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR  లో గుల్జార్ తన గురువు మెంటార్ అయిన బిమల్ రాయ్ నుంచి మొదలు పెట్టాడు. తాను తన మొదటి పాట కోసం బిమల్ రాయ్ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితుల్లో వెళ్లిందీ ఆసక్తికరంగా రాసాడు. అనేక సంఘటనలను కథాత్మకంగా రాసారు గుల్జార్. ఈ పుస్తకంలో బిమల్ రాయ్ తో మొదలయిన ఈ జ్ఞాపకాల పరంపర సంగీతదర్శకులు సలిల్ చౌదరి, హేమంత్ కుమార్, ఆర్ డీ బర్మన్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ కుమార్, గాయకుడు కిషోర్ కుమార్, సంజీవ్ కుమార్, హ్రిషికేశ్ ముఖర్జీ, పండిట్ రవి శంకర్, భీంసేన్ జోషి, నటీమణులు సుచిత్ర సేన్, షర్మిళా టాగోర్, రచయిత్రి మహాశ్వేతా దేవి లాంటి అనేక మందితో తన పరిచయం, తనపై వారి ప్రభావం రాసారు. గుల్జార్ రాసిన విధానం మనతో మాట్లాడుతున్నట్టు వుండి చక చకా చదివిస్తుంది. అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పినట్టు అనిపిస్తుంది.

అట్లా కవిత్వమే కాదు వచనంలో కూడా గుల్జార్ పాఠకులని చేయి పట్టుకుని తన వెంట తీసుకెళ్తాడు, పాఠకుని చేయిపట్టుకుని వెంట నడుస్తాడు.

 అనేక సృజన రూపాలు, అనేక రచనలు, సినిమాలు, పాటలు, పిల్లల కథలు పిల్లల పాటలు ఎన్నో ఎన్నెన్నో గుల్జార్ కలం నుండి వెలువడ్డాయి.  ఆయన్ని ఎంత చదివితే అంతగా సున్నితమయిపోతుంది పాఠకుడి మనసు. ఆయన సాహిత్యమే కాదు ‘ఖోశిష్’ లాంటి ఆయన సినిమాలూ అంతే. 

ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం రావడం అభినందనీయం. గుల్జార్ తో ఆ పురస్కారానికీ  గౌరవం పెరిగింది.

+++++++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

9440501281

GULZAR ARTICLE NAVA TELANGANA

Posted on

కవిత్వం సినిమాలు ఆయనకు రెండు కళ్ళు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘మొర గోరా రంగ్ లైలే..’ అంటూ మొట్టమొదటిసారిగా బిమల్ రాయ్ సినిమాకు రాసినా..

‘మైనే తెరెలియే హి సాత్ రంగ్ కె సప్నే చునే’  అంటూ ఆనంద్ లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..

‘ముసాఫిర్ హో…యారో .. నా ఘర్ హై నా టిఖానా … ‘

అంటూ పరిచయ్ లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్న్తాడుగుల్జార్.  

‘దిల్ హూం హూం కరే ఘబ్ రాయే.’ అని రుడాలి లో వేదన పడ్డా

‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా  హై..’ అంటూ ఇజాజత్ లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దుఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్ లో రాసినా

వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంధ్రత గుల్జార్ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి  రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నోపాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.పాఠకుడి మనసుని తత్తెస్థాయి.  

ఇక సంభాషణల విషయానికి వస్తే

‘బాబూమొషై జిందగీ బడీ హోనీ చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’

‘మౌత్ తో ఏక్ పల్ హయ్,

(జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలో గుల్జార్ రాశారు.అట్లా ఆయన పాటలు సంభాషణలే కాదు గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్. సినిమా రంగంలో విశేషమయిన్ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు సత్కారాలు లభిచాయి. ఆస్కార్, గ్రామీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి. బహుశా ఆయన అందుకోని అవార్డు లేదు. కానీ సాహిత్యం లో ఆయనకు వచ్చిన ‘జ్ఞానపీఠ పురస్కారం ప్రత్యేకమయింది. ఎందుకంటే ఆయనే అనేక చోట్ల చెప్పుకున్నట్టు సాహిత్యమే తన నిజమయిన వ్యక్తీకరణ రూపం. సినిమా కూడా సృజనాత్మక కళ నే. కానీ అది రచయిత, దర్శకుడు, నటుల సమిష్టి కృషి. సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగతమయిన వ్యక్తీకరణ. అందులో ఇతరుల ప్రమేయం వుండదు. కవీ రచయిత తన భావాలకు తానే రూపం కల్పిస్తాడు. అందుకే సాహిత్య సృజనలో స్వేచ్చ వుంటుంది. అందుకే సాహిత్యంలో తనకు వచ్చిన ‘జ్ఞానపీఠ్’ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారాయన. 

‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు,అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని  అందరికీ  చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్.   

అంతే కాదు కవిత్వం ఎట్లా రాస్తారు అని అడిగితే ‘సాహిత్య సృజన చేయడానికి నువ్వు ‘గుహ’లో నివసించాలి, ఆ గుహ మరేదో కాదు అది నువ్వే’ అంటాడాయన.  

కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్.

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది.అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జణ్యాలు, పడ్డ వేదన దుఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది. ఏం.హెచ్.సత్యు ‘ఘరమ్ హవా’ లాంటి సినిమాలు తెస్తే గుల్జార్ కవిత్వమూ కథలూ రాశాడు.

  ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్ మాచ్ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్ రాయ్ ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎవో  పొరపొచ్చాలు రావడంతో ఆ ఇద్దరూ కలిసి పని చేసే స్థితి లేకపోయింది. దాంతో శైలేంద్ర గుల్జార్ ని తక్షణమే వెళ్ళి బిమల్దాను కలవమని సూచించాడు. మిత్రుడు ఆసీత్ సేన్ తోకలిసి వెళ్ళి కలిశాడు. ‘ఇతను విషయాన్ని అర్థం చేసుకుని పాట రాయగలడా అని సేన్ ను బెంగాలీలో అడిగాడు’ అప్పుడు సేన్ దాదా తనకు బెంగాలీ రాయడం చదవడం వచ్చు అనేసరికి  కంగారుపడ్డ బిమల్ రాయ్ సర్దుకుని పాట రాయమని ప్రోత్సాహించాడు. గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ దా  గుల్జార్ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దా కి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది.  సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్ కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్ కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

    టెలివిజన్ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్ గొప్పగా విజయవంతమయి కల్ట్ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

గుల్జార్ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘GREEN POEMS’ ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘SUSPECTED POEMS’ ని అనుమానిత కవితలు గా అనువదించారు.

గుల్జార్ కూడా అనేక అనువాదాలు చేశారు.‘ ఏ పోయేమ్ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు. వాటిల్లో వర్తమాన కవుల కవితల్నిచేర్చారు. పాఠశాల కళాశాల పాఠ్యపుస్తకాల్లో చదివే కవుల కవితలు కాకుండా ఇప్పుడు వర్తమాన సామాజిక స్థితిలో ఆధునిక కవులు రాస్తున్న కవితల్ని చేర్చారు.‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న విషయం అర్థం కావడానికి ఈ సంకలనం ఎంతో దోహద పడుతుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫిల్ హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ, చాపాక్, సామ్ బహదూర్ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘ బికాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ ఇప్పటికే పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

కవి, రచయిత,

GULZAR

Posted on

మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024

‘ఇరుగు పొరుగు’ సమీక్ష

Posted on

మిత్రులారా! నా అనువాద సంకలనం ‘ఇరుగు పొరుగు’ పైన ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో సమీక్ష చేశారు. చూడండి, సమీక్షకులు రామా చంద్రమౌళి గారికి, సంపాదకులకు కృతజ్ఞతలు- వారాల ఆనంద్,
25 ఫిబ్రవరి 2024

అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి

Posted on Updated on

+++++++++ వారాల ఆనంద్
ఇవ్వాళ మన దేశం మొత్తం మీద గొప్ప కవిత్వమేకాదు మొత్తంగా గొప్ప సాహిత్యం ఈశాన్య రాష్ట్రాలనుంచే వస్తున్నది. అక్కడి ప్రజల సంఘర్షణ ఆ సాహిత్యంలో సజీవంగా వికసిస్తున్నది. 7 సిస్టర్స్ గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో హిమాలయాల ఒడిలో నెలకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భారత దేశపు ఊయయించే సూర్యుడు. అక్కడి డాంగ్ గ్రామమే దేశం మొత్తం మీద తొలి సూర్యోదయాన్ని చూస్తుంది. ఆ రాష్ట్రానికే దేశమ్మోత్తం మీద అతి ధీర్ఘమయిన అంతర్జాతీయ సరిహద్దు వుంది. అక్కడి ప్రజలు ‘ఆది’, ‘ఆక’, ‘అప్తాని’ లాంటి 90 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు ఆ రాష్ట్రంలో 26 ప్రధాన తెగలు మరియు వందల ఉప తెగలు ఉన్నాయి. కానీ ఈ బహుళత్వం మధ్య, అన్ని సంఘాలలో ఒక సాధారణ లక్షణం ఉంది, వారు గొప్ప కథకులు.

వారి స్వంత అధీకృత స్క్రిప్ట్ లేకుండా, వారు వారి జ్ఞాపకాలలో వారి కాలపు కథలను భద్రపరిచారు. మౌఖికంగా వారు ఆయా భాషల్ని వ్యాప్తి చేశారు. తరువాతి తరాలకు అందించారు. అక్కడి ప్రజలు కీర్తనలల్ని బాగా ప్రదర్శిస్తారు. తమ కుటుంబ సామాజిక మావేశాలలోకథల్ని కథలు చెప్పడాన్ని బాగా బాగా ఇష్టపడతారు.
అరుణాచల ప్రదేశ్ సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు కేవలం మౌఖికమే కాకుండా లిఖిత సాహిత్యాన్ని కూడా చర్చించాలి.
మౌఖిక సాహిత్యం ప్రధానంగా జానపద సాహిత్యం యొక్క అభివ్యక్తి. అందులో ప్రధానంగా పురాణాల కథలు, వాటిలోని సూక్తులు, కథనాలు. కథలు ప్రధాన అంశాలుగా వుంటాయి. వాటితో పాటు జంతువులు, విశ్వం మరియు మానవ నమ్మకాలు, ఆచారాల కథలు కూడా మనకు కనిపిస్తాయి. లిఖిత సాహిత్యంలో కవిత్వం, నాటకం, చిన్న కథలు ప్రధాన పాత్ర పోషిస్తాయి మౌఖిక సాహిత్యంతో సృజనాత్మకత ప్రధానమయింది. కాగా మౌఖిక లిఖిత సాహిత్యాల నడుమ విడదీయరాని మౌళిక సంబంధం ఉంది.
ఇరవయ్యవ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్‌కు లిఖిత సాహిత్యం మొదలయిందని చెప్పాలి. మారుతున్న సామాజిక ఆర్థ్క స్థితులు అంతేకాకుండా ఆధునిక విద్య అందుబాటులోకి రావడం వల్ల అక్కడి వాళ్ళల్లో సరికొత్త భావనాత్మకత తో పాటు నవ్య సృజనాత్మకత ఆరంభమైంది. ముఖ్యంగా ఆంగ్ల, విద్య విదేశీ సంస్కృతుల ప్రభావం వల్ల కళాత్మక సృజన పెరిగిందనే చెప్పాలి. 1947 తర్వాత తగాంగ్ టాకీ, లుమ్మర్ దాయి, YD థోంగ్చి, రించిన్ నోర్బు మొయిబా, సమురు లుంచాంగ్ మరియు కెన్సమ్ కెంగ్లాం వంటి రచయితల రచనలు వెలువడ్డాయి. అరుణాచలానికి చెందిన మొదటి తరం సాహిత్య ప్రముఖులు వీరే. లుమ్మర్ దాయ్ యొక్క తొలి నవల ఫారోర్ క్సీలే క్సీలే (1961) బహుశా ఒక అరుణాచలి రాసిన అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొదటి నవలగా పరిగణించబడుతుంది. తమదయిన
స్క్రిప్ట్ లేకపోవడంతో, ఆ కాలంలోని రచయితలు తమ భావాలను వ్యక్తీకరించడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో, పాఠశాలల్లో అస్సామీ బోధనా మాధ్యమం కావడం తో చాలామంది అస్సామీని తమ రచనా భాషగా ఎంచుకున్నారు. స్వీయ భాషాపరమైన అడ్డంకిని దాటి, ఈ మొదటి తరం రచయితలు, వారి బహుముఖ మరియు విశిష్టమైన కథలతో, అరుణాచల్ ప్రదేశ్‌లో సాహిత్యంలో ముఖ్యమైన భాగం పంచుకున్నారు. సరికొత్త పాదులు వేశారు.
అప్పటి వారి రచనలు సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలు. వారు తరచుగా తమ రచనలకు జానపద సాహిత్యాన్ని మూలంగా చూసేవారు. వారు వక్తృత్వం, పురాణం, జానపద నమ్మకం మరియు ఆచారాల నుండి ప్రత్యేకమైన ప్రేరణను పొందారు. ఇది వారి రచనలలో వ్యక్తీకరణలో స్పష్టంగా కనిపిస్తుంది. థోంగ్చి, సోనమ్‌లో, బ్రోక్పాతమ రచనల్లో సమాజంలోని సంప్రదాయాల్ని ఆచారాలను అన్వేషిస్తారు. మమంగ్ డై తన నవలలు పహరోర్ క్సీలే జిలే, మోన్ అరు మోన్, పృథివీర్ హన్హిలో ఆది జానపద జీవితానికి సంబంధించిన నైతికతను చాటుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లో పాఠశాలల్లో క్రమంగా ఇంగ్లీషు, హిందీ భాషలను ప్రవేశపెట్టారు. అస్సామీ స్థానంలో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరిగారు. ప్రధాన మాధ్యమంగా ఇంగ్లీషు, హిందీ భాషా భాషలు స్థానం పొందాయి. తత్ఫలితంగా అస్సామీలో వ్రాసే వారు పాఠకులతో డిస్‌కనెక్ట్‌గా భావించడం ప్రారంభించారు. అస్సామీ రాయడం తగ్గిపోయింది
తర్వాత చదువు పెరగడం తో ప్రజలు వారి చరిత్రను సంస్కృతిని గురించి మరింత ఉత్సుకతతో చ్ఫూపించడం ఆరంభమయింది. 1978లో అరుణాచల్ ప్రదేశ్ లో మత స్వేచ్ఛ చట్టం ఆమోదించబడింది. దేశీయ సంస్కృతి విశ్వాసాల పరిరక్షణ, ప్రచారం పట్ల ఆసక్తి పెరిగింది. కృషీ ఆరంభమైంది. ఫలితంగా రచనల్లో అక్కడి సమస్యల్ని రాయడం మొదలయింది. అక్కడి రచయితలలో తుంపక్ ఈటే, ఒసాంగ్ ఎరింగ్, బని డాగ్గెన్, ఎన్. ఎన్. ఒసిక్, ఎల్ ఖిమ్‌హర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అరుణాచల్‌లో ఇంగ్లీషు మరియు హిందీ భాషలను ప్రవేశపెట్టినప్పటి నుండి కొత్త తరం రచయితలు ఆవిర్భవించారు. జుమ్సీ సిరామ్ రాసిన ఏ-అలుక్ (1993) అన్న నవల ఈ రాష్ట్రానికి చెందిన ఒక స్వదేశీ రచయిత హిందీలో రాసిన మొదటి నవలగా వినుతికెక్కింది. యుమ్లామ్ తానా యొక్క ది మ్యాన్ అండ్ ది టైగర్ (1999) మరియు మమంగ్ దాయి యొక్క ‘ది లెజెండ్ ఆఫ్ పెన్సమ్ (2006)’ ఇంగ్లీష్ హిందీ సాహిత్య ప్రపంచంలో అరుణాచల రచయితల స్థానాన్నినిలబెట్టాయి. వీరి రచనలు రాష్ట్ర సరిహద్దులు దాటి అరుణాచలి రచనలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఎంతగానో సహాయపడ్డాయి.
మమంగ్ దై ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్సామ్ అండ్ బ్లాక్ హిల్స్‌’ లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క పూర్వ-చారిత్రక గతాన్ని తిరిగి సృష్టించింది.
ఇప్పుడు అక్కడి సమకాలీన సమాజం కూడా ప్రపంచీకరణ ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది, దాంతో సంస్కృతి, సంప్రదాయాలు వాటిలోని అన్ని అంశాలు నాటకీయ మార్పులకు గురయ్యాయి. ఒక రకమైన కొత్త సాంస్కృతిక వాతావరణం ఏర్పడింది. కవులూ రచయితలూ సామాజిక అసమానతల్ని ప్రశ్నించడం ప్రారంభించారు, పురాతన ఆచారాల్ని, సంప్రదాయాలను విడిచిపెట్టడం ప్రారంభించారు. ప్రపంచీకరణ ప్రభావం అరుణాచల్ ప్రదేశ్ యొక్క సాహిత్య సృజనల్లో మార్పును తెచ్చింది. అరుణాచల్ క్రమంగా మౌఖిక సాహిత్యం మరచిపోయే స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. ఉదృతమవుతున్న ప్రపంచీకరణ ప్రభావానికీ అక్కడి సంప్రదాయానికి నడుమ వున్న ఘర్షణ సమకాలీన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గుర్తింపు సంక్షోభం identity crisis, నోస్టాల్జియా nostalgia సామాజిక సమస్యల యొక్క ఘర్షణ వారి రచనల ఇతివృత్తాలలో ప్రతిబింబిస్తుంది.
“ఈ వేసవి”లో మమంగ్ దై
‘విలపిస్తున్నాను
మా వేటలో మేము నాశనం చేసిన అందం
జీవితం కోసం మా వేటలో.
… సీతాకోక చిలుకలను క్షమించమని వేడుకుంటున్నాను’, అంటుంది

యుమ్లాం తమ గుర్తింపు సంక్షోభం సమస్యను ఈ విధంగా ప్రస్తావిస్తుంది:
‘ఈ భౌగోళిక పటం
మా భూములు,
అటవీ హక్కుల గురించి ఏమీ మాట్లాడలేదు..’ అంటారు
ఇటీవలి సంవత్సరాలలో అనేకమంది యువకులు, విద్యావంతులైన రచయితలు సాహిత్యరంగంలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. వారు తమదయిన కొత్త శైలి,, కళా ప్రక్రియలతో ప్రయోగాలు చేస్తున్నారు. అది గత తరం రచయితలకు భిన్నమయిన ధోరణి. వారి రిఫ్రెష్ కథలు వారి ప్రత్యేకమైన స్వభావాలతో, వారు ప్రపంచ సాహిత్య రంగంలో తమను తాము నిలబెట్టుకుంటున్నారు.
తాయ్ టాగుంగ్ తన డ్రామా, లాపియాలో ఉద్దేశపూర్వకంగానే అరుణాచలి హిందీని ఉపయోగించాడు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో మాట్లాడే హిందీపై భాషావేత్తల దృష్టిని తీసుకువచ్చింది. గుమ్లాట్ మైయో యొక్క త్రయం వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కాలేజీ క్యాంపస్ నవల. డై యొక్క స్టుపిడ్ మన్మథుడిని చిక్ లైట్ అని వర్ణించవచ్చు.
ఇటీవలి కాలంలో ఇక్కడి సాహిత్యంలో వున్న కొన్ని ముఖ్యమైన పేర్లు Takop Zirdo, Tony Koyu మరియు Yabin Zirdo.
అరుణాచల్ ప్రదేశ్‌లో హిందీ సాహిత్య పురోగతికి గణనీయమైన కృషి చేసిన వారిలో తారో సింధిక్, జమునా బిని మరియు జోరామ్ యాలం వంటి అనేకమంది వున్నారు.
మునుపటి తరం నుండి వచ్చిన వారైనా, లేదా ఇటీవలి వారైనా, అరుణాచల్‌లో వెలువడే సృజనాత్మక రచనల్లో పౌరాణిక జానపద కథల యొక్క ప్రభావం, దాని కొనసాగింపు కనిపిస్తుంది. మమంగ్ దాయి యొక్క సంకలనం ది బామ్ ఆఫ్ టైమ్, రివర్ పోయమ్స్, తానాస్ మ్యాన్ అండ్ ది టైగర్ అండ్ విండ్ కూడా సింగ్స్ మరియు LW బాపు యొక్క ఖండూమాస్ కర్స్ సాంప్రదాయ సాహిత్యం మరియు సృజనాత్మకత యొక్క సమ్మేళనంగా చూడొచ్చు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆధునిక సృజనాత్మక సాహిత్యం 20వ శతాబ్దం మధ్యలోనే మొదలయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొంతమంది ప్రతిభావంతులయిన రచయితలతో ఇది వేయి రేకులుగా విచ్చుకుంటోంది.
… మమంగ్ దాయి…
గత 13 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టాటా లిటరేచర్ లైవ్ ఈనెల 25 నుంచి తన 14 వ సంచికను నిర్వహిస్తున్నది. అందులో ఈశాన్య రాస్త్రమయిన అరుంచల్ ప్రదేశ్ కు చెందిన గొప్ప కవి రచయిత్రి మామంగ్ దాయిని ప్రధానంగా ఈ యేటి ఆస్థాన కవిగా ఎంపిక చేసి గౌరవిస్తున్నారు. మామంగ్ దాయి ఎంపిక సమంజసమయిందే కాదు, అభినందనీయమయింది.
మమంగ్ దై కవి మరియు నవలా రచయిత. ఆమె ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నివసిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఒక కవితా సంకలనం, ‘నది కవితలు’వెలువరించారు. ఆమె తర్వాతి రచన, మిడ్‌సమ్మర్-సర్వైవల్ లిరిక్స్, ఆమె ఆది భాషలోనూ ఆంగ్లంలోనూ రాస్తుంది.తాను మొదట ఐ.ఏ.ఎస్.కు ఎంపికయి జర్నలిస్టు గానూ, రచయిత్రిగానూ వుండడానికీష్టపడి ఐ ఏ ఎస్ ను వదిలేసింది.
మామంగ్ దాయి ది టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్ మరియు ది సెంటినెల్‌తో సహా వివిధ వార్తాపత్రికలకు కరస్పాండెంట్‌గా ఉన్నారు. టెలివిజన్ మరియు రేడియోలకు కూడా విరివిగా రాశారు. రెండు నవలలతో పాటు, యువ పాఠకుల కోసం ఆమె వచన కవితలు కథలు రాసింది. ఆమె నాన్-ఫిక్షన్ రచన, అరుణాచల్ ప్రదేశ్: ది హిడెన్ ల్యాండ్, 2003లో స్టేట్ వెరియర్ ఎల్విన్ అవార్డును అందుకుంది. ఆమె ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లిటరరీ సొసైటీకి జనరల్ సెక్రటరీగా, నార్త్ ఈస్ట్ రైటర్స్ ఫోరమ్ సభ్యురాలు మామంగ్ డయి యొక్క కవితా ప్రపంచం నది, అడవి మరియు పర్వతాలలో ఒకటి, ఆమె తన మూలాల్ని తాని నివసించిన స్వస్థలాన్ని తన రచనల్లో ప్రతిబింబింపజేసి వాటిని సృజనాత్మకంగా సజీవం చేశారు. ఇక్కడ ప్రకృతి రహస్యమైనది, పురాణాలతో పచ్చగా ఉంటుంది, పవిత్రమైన జ్ఞాపకశక్తితో దట్టమైనది. ప్రతిచోటా మాయాజాలం ఉంది:
లిల్లీస్ “హృదయ స్పందనలో నావిగేట్ చేసే విధంగా . . . “చల్లని వెదురు,/ సూర్యకాంతిలో పునరుద్ధరించబడిన” నిశ్శబ్దంగా, పర్వతాల యొక్క “మాటలు లేని ఉత్సాహం”లో, కత్తి చేపలా పైకి దూసుకుపోతున్నాయి. “నదికి ఆత్మ ఉంది” అంటారామె.
ఆమె కవిత్వంచాలా సరళంగా వుంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి

Mamang Dai

Posted on

Friends, Celebrated poet Mamang Dai will be the Poet Laureate of the 14th edition of Tata Literature Live! The Mumbai LitFest. I have written a small article on Mamang Dai, published today in edit page of SAKSHI daily, thanks to the editor and his editorial team members

-anand varala

మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”

Posted on

****** వారాల ఆనంద్

మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”

****** వారాల ఆనంద్

బెంగాల్ లో ఒక టాగోర్ లా, కర్ణాటకలో ఒక ఏ.కే.రానుజన్ లా, మలయాళంలో ఫణిక్కర్ లా తనదయిన ఒక ప్రత్యేకమయిన స్వరంతో ప్రకృతితో మమేకమయి గొప్ప కవిత్వం రాసిన మానకాలపు మహాకవి జయంత్ మహాపాత్ర. తనని పాబ్లో నెరూడాతో ఒకసారి ఎవరో పోలిస్తే నవ్వేసి నెరూడాలాగా ఒక కవిత రాస్తే చాలు’ అన్నాడు. ఆయన అంత నిగర్వి సాధారణ మయినవాడాయన. మీరు ఇంత పెద్ద కవి కదా ఈ మామూలు పట్టణం కటక్ లో ఎందుకు నివసిస్తారని ఆయన్ని అడిగితే ‘ ఈ ఇంట్లో ఏది ఎక్కడ వుందో నాకు తెలుసు. నా ఇంటి చుట్టూ వున్న చెట్టూ చేమా రోజూ నాతో మాట్లాడతాయి. వీధి తలుపు తీసుకుని బయటకు వెళ్తే ఎంతో మంది చేతులూపి పలకరిస్తారు.. ఇంతకంటే నాకేం కావాలి’ అన్నాడాయన. అదీ జయంత్ మహాపాత్ర.

2 అక్టోబర్ 1928 కటక్ లో జన్మించిన జయంత్ మహాపాత్ర కింది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. తన ప్రాథమిక విద్య కటక్ లోని స్టీవర్ట్ స్కూలు లో జరిగింది. చిన్నప్పటినుండీ ఆంగ్ల మాధ్యంలో చదువుకున్న ఆయన సైన్స్ బాగా ఉత్సాహంగా ఆసక్తిగా చదువుకున్నాడు. భౌతిక శాస్త్రం లో పీజీ ప్రథమ శ్రేణిలో పాసయి, శాస్త్రవేత్తగా శిక్షణ పొందాడు. కాలేజీ టీచర్ గా తన వృత్తి జీవితం ప్రారంభించాడు. ఒదిశా లోని పలు కాలేజీల్లో ముప్పయి ఆరేళ్ళ పాటు భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పని చేసాడు. గంగాధర్ మెహర్ కాలేజ్ సంబల్ పూర్, బి.జే.బి కాలేజి, భువనేశ్వర్,ఫకీర్ మోహన్ కాలేజి బాలాసోర్, రావెన్ షా కాలేజ్,కటక్ లాంటి అనేక కాలేజీల్లో పని చేసాడు. చిన్నప్పటినుండీ ఎప్పుడూ కవిత్వం రాయాలని, కవి ని కావాలని ఆయన అనుకోలేదు. చాలా మంది కవుల కంటే భిన్నంగా జయంత్ మహాపాత్ర తన 38 వ ఏట కవిత్వం రాయం మొదలు పెట్టాడు. ఆయన ఇంగ్లీష్, ఒడియా రెండు భాషల్లో విరివిగా రాసాడు. భారతీయ ఆంగ్ల కవిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు.

ఆయన మొట్టమొదటి పుస్తకం “CLOSE THE SKY , TEN BY TEN” 1970 లో అచ్చు అయింది. అప్పటిదాకా భౌతిక శాస్త్రం భోదిస్తూ ఉన్నప్పటికీ, ఆయనకు నవలలు కథలు బాగా ఇష్టంగా ఉండేవి. అందులోనూ ఇంగ్లీష్ వచనం బాగా చదివాడు. కానీ ఎప్పుడూ కవి అవుతానని అనుకోలేదు. కాని కవిత్వం లోకి గుడ్డిగా వచ్చేసాడు.. ఎటు పోతున్నాడో తెలీని స్థితి.. కవిత్వ తొలి రోజుల్లో ఆయన కవిత్వం నిండా స్వీయ స్పృహ అధికంగా కనిపిస్తుంది. అయితే ‘కవిగా మొదటి రోజుల్లో పడిపోయాను, లేచాను, ఎదిగాను’ అంటాడు మహాపాత్ర. బహుశా అప్పటిదాకా ఆయనలోనో నిబిడీకృత మయివున్న కవితాంశ, భావావేశం, సృజనాత్కత పెల్లుబికి కవిత్వంగా రూపుదిద్దుకుందేమో అనిపిస్తుంది. ఆయన రాయకుండా, తన భావాల్ని చెప్పకుండా ఉండలేని స్థితికి గురయి విస్తృతంగా రాసాడు. రెండు భాషల్లో రెండు చేతులతో రాసాడనే చెప్పాలి. ఆయన విస్తృతంగా చదివాడు. అట్లా చదవడం వల్లనే తనకు భాష వొంటబట్టింది. ఆ భాషను కవిత్వం లో వాడాడు. చిన్నప్పటి నుండీ మిషనరీ స్కూల్స్ లో చదవడం వాళ్ళ ఆయనకు ఇంగ్లీష్ స్వభావ సిద్దంగానే వచ్చింది. ఒడియానే తనకు సెకండ్ లాంగ్వేజ్ గా నిలిచింది. అయినా ఆయన చుట్టూ వున్నది ఒడియా భాష అక్కడి ప్రజలు. వారితో మమేకం అయివుండడంతో ఆయన రచనల్లో ఆ జీవితం ఆ భాష ప్రభావం అమితంగా వుంది. తాను నివసించిన ఒడిశా ప్రాంత చరిత్ర సంస్కృతి ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. మహాపాత్ర ఇంగ్లీషు కవిత్వంలో ధ్వనించే లయ మిగతా బయటి దేశాల ఇంగ్లీష్ భాషా కవులకంటే భిన్నంగా వుంటుంది. దానికి ప్రదానంగా ఆయన పైన వున్న ఒడిశా లోని మౌఖిక సాహిత్యం, జానపద గీతాలు అనే చెప్పాలి.

జయంత్ మహాపాత్ర కవితా సంకలనం ‘ఏ రెయిన్ ఆఫ్ లైఫ్’ కవితలన్నీ బ్రిటన్ లోని క్రిటికల్ క్వార్టర్లీ, టి.ఎల్.ఎస్.లాంటి వాటిల్లోనూ, చికాగో రివ్యు లాంటి పత్రికల్లోనూ అచ్చయ్యాయి. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియాలలోని సాహిత్య పత్రికల్లో కూడా వచ్చాయి. దాంతో ఆ పుస్తకానికి జాకోబ్ గ్లాట్ స్టైన్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.

జయంత్ మహాపాత్ర 30 కి పైగా కవితా సంకలనాలు వెలువరించారు. అందులో అధికంగా ఇంగ్లీష్ లోనూ మిగతావి ఒరియాలోనూ రాసారు.

జయంత్ మహాపాత్ర ప్రధానంగా కవిత్వం రాసినప్పటికీ వచనం కూడా రాసారు. దొర్ ఆఫ్ పేపర్స్ కథా సంకలనం, అనేక వ్యాసాలూ, తన జ్ఞాపకాలూ రాసారు.అంతేకాదు జయంత్ మహాపాత్ర అనేక ఒడియా కవితల్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అనువాదకుడిగా కూడా ఆయనకు గొప్ప గౌరవముంది.

ఆయన కవితా సంకలనం ‘రిలేషన్ షిప్స్’ కి 1981 లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. దాంతో ఆయన మొట్టమొదటి భారతీయ ఆంగ్ల కవిగా ఆ అవార్డును అందుకున్నాడు. చికాగో పోయెట్రీ మాగజైన్ నుండి జాకోబ్ గ్లాట్ స్టయిన్ పురస్కారం, అల్లెన్ టా టే అవార్డును ద సేవానీ రివ్యు నుండి, సార్క్ లిటరరీ అవార్డు, టాటా లిటరేచర్ జీవన సాఫల్య పురస్కారంఅందుకున్నారు. ఇంకా 2009 లో పద్మశ్రీ పురస్కారం, ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, సాహిత్య అకాడెమీ ఫెల్లో షిప్ కూడా అందుకున్నారు. ఫెల్లోషిప్ ను అందుకున్న మొట్ట మొదటి భారతీయ ఆంగ్ల కవి కూడా జయంత్ మహాపాత్ర నే. అంతే కాదు అనేక జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కవిత్వ పఠనాల్లో పాల్గొన్నారు.

‘కవి తనకు తాను వేసుకునే అనేక ప్రశ్నలకు, తాను రాసే కవిత్వం సమాధానాలు చెబుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.

అందుకే ఆయన కవిత్వం ఆయనకు తన అంతర్ బహిర్ సంఘర్షణలకు వేదికగా నిల్చింది. ఆయన రాసిన కవిత్వం ఆయనకే కాదు చదువరులు తాము ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు కూడా వెతికితే సమాధానాలు లభిస్తాయి.

ఆయన్ని చదివిన తర్వాత నా అనుభవం చెబుతున్న సత్యమిది.

ఎవరికయినా చదవడం రాయడం ఒక మంత్రం లా పని చేస్తుంది. అది ఆ పాఠకుడిలో వున్న అనేకానేక బాధలకు, సంక్షోభాలకు తెరిపినిస్తుంది. అందులో ముఖ్యంగా రాయడం వలన కవిలో పెల్లుబికిన ఉద్వేగం కాగితం మీదికి ఒలికి అతను అతని మనసు నిమ్మలమవుతుంది. జయంత్ మహాపాత్ర కవిత్వం కూడా అంతే ఆయన కూడా అంతే.. రాస్తూ తాను ఎంతో ఉపశమనం పొందుతానని అంటాడు.

‘కవి తాను స్వేచ్చగా రాయాలి, తన ఆవగాహనకు స్థాయికి అనుగుణంగా రాయాలి. ప్రేమ కవి, కమర్షియల్ కవి అంటూ కాకుండా కవి అనేవాడు తప్పకుండా తనను తాను ఆవిష్కరించుకోవాలి.. ఎలాంటి భేషజాలు, లేకుండా తాను భావించిన విషయాలు, తాను అనుకున్న సత్యాలు తాను చూసిన లేదా అనుభవించిన వాటిని తన కవిత్వంలో నిజయితీగా ప్రతిఫలింప జేయాలి’ అంటాడు జయంత్.

‘కవి అనేవాడు తన కవిత్వం తో నీతివంతమయిన ప్రవర్తనకు సంరక్షకుడిగా వుండాలి. కవిత్వం అలాంటి స్థితి సృష్టించ లేనప్పుడు ప్రపంచ మనుగడే ప్రశ్నార్థక మవుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.

కవి ఒంటరిగా ఒంటరితనంలో కూర్చుని రాయలేడు, అట్లా చేస్తే స్తబ్దత, ఎడారితనం కవిని చుట్టుముడుతాయి.అందుకే తన చుట్టూ జరుగుతున్న విషయాల్ని పతిన్చుకోకుండా ఉండలేడు. కవి తన వేదనని భావోద్వేగాన్ని గూర్చే రాస్తాడు. కవిత్వం కవి అంతర్ బహిర్ సంభాషణ నుంచే పుడుతుంది అంటాడు. అంతేకాదు కవిత్వం వర్తమాన కాలపు సంక్షోభాన్నీ, దుఖాన్ని ప్రతిబించాలంటాడు.

“నేను ఒడిశా లో పుట్టాను, ఇక్కడే బతికాను బతుకుతున్నాను, ఇక్కడి చరిత్ర నాది, కోణార్క్ నాది, కోణార్క్ వైశాల్యం నాది, వైభవం నాది, దాని ఒంటరితనం నాది.. అంతే కాదు ఇక్కడి ఆకలి.. ఇక్కడి కరువు కాటకాలు నావి.. ఎవరయినా వాటిని దాటి నా నుంచి మరే రచనల్ని ఆశిస్తారు.. నేను అదే రాసాను.. రాస్తున్నాను..చెట్టు మీద మామిడి ఎట్లా పండి పోతుందో నేనూ అట్లే మరణం వైపు పరి పక్వం చెందుతున్నాను” అన్నాడు జయంత్ మహాపాత్ర.

ఆయన కవిత్వంలో కాలం ముఖ్య భూమికను పోషిస్తుంది. ఆయన కాలంతో పాటు సమాంతరంగా సాగాడు. కాలం ఆయన కవిత్వం లో ముందుకు వెనక్కు కదుల్తూ వుంటుంది.

ఆయన కవిత్వం నిండా నాస్టాల్జియా కనిపిస్తుంది.

‘రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు … ఒక్కోసారి కవిత్వం గతాన్ని స్తుతిస్తుంది’ అని కూడా ఆయనంటాడు.

ఇట్లా భౌతిక శాస్త్రం చదువుకుని బోధించి కవితా ప్రపంచంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ స్పష్టమయిన అభిప్రాయాలతో అందమయిన స్థానీయమయిన ప్రతీకలతో గొప్ప కవిత్వాన్ని రాసి ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన జయంత్ మహాపాత్ర ఈ కాలపు మహా కవిగా మన్ననల్ని అందుకున్నాడు. ఒక కవి అలుపెరుగ కుండా సీరియస్ గా కవిత్వం రాస్తూ వుంటే అవార్డులు రివార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి అదే క్రమంలో జయంత్ మహాపాత్రకు అనేక అవార్డులు మన్ననలు వచ్చాయి.

జయంత్ మహాపాత్ర కటక్ కీ, మహానదీ తీరానికీ, ఒడియా నేలకీ జీవితమంతా అంటిపెట్టుకుపోయాడు. ఆ విషయంలో రామానుజన్ కన్నా, పార్థసారథికన్నా దిలీప్ చిత్రేకన్నా తనెంతో అదృష్టవంతుణ్ణని చెప్పుకుంటాడు. ఇప్పుడు తన ఆత్మకథ మాత్రం ఒడియాలో రాస్తున్నాడు. కవిత్వం జీవన సారాంశాన్ని చెప్పాలి. కవి అనేవాడు తన కవిత్వం లో తన శక్తిమేరకు జీవన గమనాన్ని నిజాయితీగానూ కళాత్మకంగానూ చెప్పగలగాలి. మొత్తంగా జయంత్ మహాపాత్ర కవిత్వం గాఢమైన జీవితానుభవంలాగా చాలా సాంద్రంగా సాగుతుంది.

ఆయనలేని లోటు భారతీయ ఆంగ్ల కవిత్వానికే కాదు మొత్తంగా కవిత్వ ప్రపంచానికే పూడ్చలేని లోటు.

======= 9440501281

మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”

****** వారాల ఆనంద్

డోగ్రీ భాషా వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్

Posted on

+++++++++++ వారాల ఆనంద్

డోగ్రీ భాషా వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్

+++++++++++ వారాల ఆనంద్

‘మీరు మీ సొంతదయిన మాతృభాష లో మాట్లాడండి’ ఇతర ఎన్ని భాషల్ని నేర్చుకున్నా సరే తల్లి భాషలోనే మాట్లాడండి మాతృస్థానమిచ్చి గౌరవించండి అన్నారు సుప్రసిధ్ధ డోగ్రీ భాషాకవి వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్. ఆమె ఆధునిక డోగ్రీ భాషలో కవిత్వం రాసిన మొట్టమొదటి కవయిత్రి. సాహిహ్త్య అకాడెమీ పద్మశ్రీ లాంటి అనేక అవార్దుల్ని అందుకున్న ఆమె డోగ్రి హిందీ భాషల్లో 60 పుస్తకాల దాకా రాశారు.
పద్మా సచ్ దేవ్ రాసిన ‘మేరీ కవితా మేరీ గీత్’ పుస్తకానికి ముందు మాట రాసిన సుప్రసిధ్ధ హిందీ కవి రాంధారి సింగ్ దినకర్ “పద్మ కవితల్ని చదివిన తర్వాత నేను నా కాలాన్ని మూసేయాలకున్నాను… ఎందుకంటే పద్మ అసలయిన కవిత్వం రాసింది’ అన్నారు.
అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ను పాలించిన మహారాజ హరి సింగ్ కుమారుడు శ్రీ కరణ్ సింగ్ పద్మా సచ్ దేవ్ ఒక కవితను ఇంగ్లీశ్లోకి అనువాదం చేశారు. ఆ సందర్భంగా ఆయన డోగ్రీ భాషా గుర్తింపు కోసం దాని ప్రగతి కోసం చేసిన కృషిని వేనోళ్ల పొగిడారు.

డోగ్రీ భాషను అధికార భాషగా గుర్తించాలని రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో చేర్చాలని ఆమె అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారితో కోట్లాది సాధించారు. 2003లో డోగ్రీ ని 8వ షెడ్యూల్ లో చేర్చిన రోజును ఆమె తన జీవితంలో అత్యంత మరపురాని సంతోషకరమయిన రోజు అన్నారు. అంతే కాదు డోగ్రీ భాష స్వతంత్రమయిన భాష అది ఒక ప్రాంతపు మాండలికం కాదు అని కూడా అన్నారు. అందుకే ఆమెను డోగ్రి భాషకు మాతృమూర్తి అంటారు. వాస్తవానికి డోగ్రీ జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ప్రాంతంలోని 50లక్షల మందికి పైగా ప్రజలు మాట్లాడతారు. పాకిస్తాను లో డోగ్రిని పహాడీ’ అని పిలుస్తారు. డోగ్రీ మాట్లాడే వారిని డోగ్రాలనీ, డోగ్రీ మాట్లాడే ప్రాంతాన్ని దుగ్గర్ అనీ పిలుస్తారు. అలాంటి డోగ్రీ భాషలో ప్రధానంగా కవిత్వం పాటలు, కథలు ఆత్మకథ, జ్నాపకాలు రాసిన పద్మా సచ్ దేవ్ మంచి గాయని. ఆమె స్వరం చిన్నప్పటినుండే కంచు మొగినట్లు వుండి అందరినీ ఆకర్షించేది. 1940 17 ఏప్రిల్ రోజున పురామండల్ లో జన్మించిన ఆమె కుటుంబం మంచి సాహిత్య కుటుంబం. ఆమె తండ్రి జయదేవ బాబు సాంస్కృత పండితుడు ప్రొఫెసర్. దేశ విభజనలో జరిగిన అల్లర్లలో ఆయన హత్యకు గురయ్యాడు. కేవలం ఏడెనిమిదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన పద్మా సచ్ దేవ్ తన తల్లి నీడన ఎదిగారు. ఆమె తన మొట్టమొదటి కవితను తన 16యేళ్ళ వయసులో చదివారు. శ్రోతలో వున్న అప్పటి ముఖ్యమంత్రి ఆమె కవితని విని ఎంతగానో ప్రశంసించారు. అంతేకాదు స్థానిక పత్రిక సంపాదకుదయిన వేద్ పాల్ సింగ్ ఆ కవితను మర్నాడే ప్రచురించాడు. అట్లా ఆమె సాహిత్య సృజనాత్మక జీవితం మొదలయింది. ఆ పరిచయంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వారిద్దరి వయసులు ఆమె 16 అతను 27. ఆ పెల్లిని డోగ్రీ సనాతనతులు వ్యతిరేకించారు. కానీ కొన్ని రోజులకే ఆమె ఆహారనాళంలో క్షయ వ్యాధి సోకి మూడేళ్లపాటు సానిటోరియం లో చికిత్స పొందారు. వైవాహిక జీవితం విఫలం చెంది వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అది కూడా డోగ్రీ పెద్దలకు రుచించలేదు.

మంచి స్వరం వున్న పద్మ సచ్ దేవ్ 1961 లో జమ్మూ ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా చేరారు. అక్కడ ఇంచార్జ్ గా వున్న సురీందర్ పాల్ బాగా ప్రోత్సహించారు. తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తెచ్చిన తర్వాత మూడేళ్లకు ఆమె అంగీకరించి ఇద్దరూ పెళ్లాడారు వాయికి ఒక కుమార్తె మీటా సచ్ దేవ్. ఆమె రాసిన కథల్లో వర్తమాన సమాజంలో స్త్రీల అసమానత్వం, వారికి వున్న స్థానం, వారి హక్కులు మొదలయిన స్త్రీ వాడ భావాల్ని రాశారు. ఆమె డోగ్రీ భాషలో అనేక గేయాలు, జానపద పాటలు రాశారు. తాను బాంబే వెళ్ళినతర్వాత సుప్రసిద్ద హింది సినిమా గాయని లతా మంగేష్కర్ తో పరిచయం, స్నేహం కుదిరి డోగ్రీ పాటల్ని ఆమెతో పాడించింది. అంతే కాకుండా పద్మా సచ్ దేవ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు కూడా పాటలు రాశారు. వాటిలో ముఖ్యంగా ప్రేమ్ ప్రభాత్ లో ‘మేరా ఛోటా సా ఘర్ బార్’, ఆంకో దేఖీ సినిమాలో ‘సోనా రే తుజే కైసే మిలూ’ లాంటి పాటలు మంచి జనాధారణ పొందాయి. లతా తో పాటు ఆమె రాసిన పలు పాటల్ని మహమ్మద్ రఫీ, సులక్షణా పండిత్ లు పాడారు.. లతా మంగేష్కర్ తో తన అనుబంధాన్ని గురించి ఆమె ఒక చోట మాట్లాడుతూ అక్కా చెల్లెళ్లకంటే ఎక్కువ అన్నారు పద్మా.కవిగా ఆమె డోగ్రీ తో పాటు మొదట్లో హిందీలో కూడా విరివిగా రాశారు. అది చూసిన కొంత మంది పెద్దలు ‘నువ్వట్లా హిందీ లో మునిగి పోతే ఎట్లా? డోగ్రీ భాష సంగెతేమిటి అని ప్రశించారు. దాంతో నవడం, ఏడ్వడం సొంతంగా చేయాలి అనుకుని తన రచనల్ని డోగ్రీలోనే కొనసాగించారు.

పద్మా సచ్ దేవ్ రాసిన ‘మేరీ క్విత మేరీ గీత్’ కు 1969 లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. తర్వాత ఆమె తావి తే చన్ హాన్(RVERS OF TAAVI AND CHINAAB), నేహెరియాన్ గలియన్( DARK LANES), పోటా పోతానింబల్( FINGERTIPFUL CLOUDLESS SKY),ఉత్తర్ వాహిని, టైనితన్, అంరాయి(HINDI INTERVEWS),దివాన్ ఖానా (ఇంటర్వ్యూలు),చిట్ చితే( జ్నాపకాలు) తదితర అనేక రచనలు చేశారు.

తనకు పద్మశ్రీ, సాహిత్య అకాడెమీ అవార్డు తో పాటు ధీనుభాయి పంత్ లైఫ్ టైమ్ అవార్డు, సరస్వతి సమ్మాన్, కబీర్ సమ్మన్ తదితర అనేక అవార్డులు లభించాయి. పద్మా సచ్ దేవ్ తన 600 పేజీల జీవిత చరిత్ర లో ఉపయోగించిన నుడికారాలు ఆ ప్రాంత జీవన లయకు అద్దం పడతాయి. అంతే కాదు ఆ దుగ్గర్ ప్రాంత చరిత్ర సంస్కృతి అందులో ప్రముఖంగా చిత్రించబడింది. ‘ పంజాబీ భాషకు అమృతా ప్రీతం, హిందీ భాషకు మహాదేవి వర్మ ఎలాంటి వారో డోగ్రి భాషకు పద్మా సచ్ దేవ్ అంతరి వారు అనే చెప్పాలి.

ఆమె డోగ్రి భాషకు సంబంధించి ఒక్ గొప్ప వాగ్గేయకారిణి. అంతేకాదు ఆమె డోగ్రి జానపద సాహిత్యాన్నివెలుగులోకి తెచ్చి శాష్ట్రీయతనుసంపాదించి పెట్టారు

ఆమె 2021 ఆగస్ట్ నాలుగున తనువుచాలించారు. భవిష్యత్తు తరాల కోసం పద్మాసచ్ దేవ్ రచనల్ని ఆమె పాటల్ని ఆమె స్వరాన్ని భద్రపరచాల్సిన అవసరం ఎంతయినా వుంది.

పద్మా సచ్ దేవ్ ఆరాసినకొన్ని కవితలకు నేను చేసిన అనువాదాలు

తాత్కాలిక శిబిరం
—–
నేను
ఇంట్లోనో స్టూడియో లోనో
ఒంటరిగా వున్నప్పుడు

నా గమ్యం నా పక్కన నిలబడి
సున్నితంగానూ ఒకింత కపటంగానూ
సైగ చేస్తూ
నా ఒంటరితనపు భారాన్ని తగ్గిస్తుంది

దానికి నివాసం లేదు
అయినా నేను అత్యాశతో
దాన్ని అనుసరిస్తూ వెంట వెళ్ళాలనుకుంటాను

నా కోరిక
నా బంధాల్ని తుంచడం ఆరంభిస్తుంది

నేనొకప్పుడు
తాత్కాలిక శిబిరమనుకున్న
ఇక్కడే
ఓ పిరికి రక్షణా భావం
నన్ను వెనక్కి లాగుతుంది

===================================

జీవితం
—-
నాకు అవసరం లేనిది
నా వద్ద వున్నప్పుడు
జీవితం
ఎంత నిండుగానూ నిర్మలంగానూ వుండేది

ఓ దారేదో
అర్దాంతరంగా ముగిసినట్టు

ఒకప్పుడు
ఓ వంతేనేదో కలిపినట్టు
——————-
ఇంగ్లిష్: ఇక్బాల్ మసూద్
తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

====================
మాతృ భాష

+++++

“ మాతృభాష”

ఓ రెల్లు తీగపై ఊగుతున్న

ఓ కొమ్మ దగ్గరికి చేరి

ఓ ‘ఈక’ ను ఇవ్వమని అడిగాను

మొన్ననే ఒకటిచ్చాను ఇచ్చింది కొత్తదే

మరి దాన్నేం చేసావు కొమ్మ అసహనంతో అంది

ప్రతి రోజూ ఓ కొత్త పెన్ను అవసరం అయ్యేందుకు

ఏ యజమాని దగ్గరో

నువ్వేమయినా ఖాతాలు రాసే గణకుడివా

నేను ఏ యజమాని దగ్గరా పని చేయను

దయగల డబ్బున్న యజమానురాలి

దగ్గర పనిచేస్తాను

ఆమె వద్ద నాలాగే అనేకమంది సేవకులున్నారు

వారంతా ఆమెకు సేవలు చేసేందుకు

ఎప్పుడూ సిద్ధంగా వుంటారు

ఆ యజమానురాలు నా మాతృభాష

‘డోగ్రీ’

త్వరగా నాకో ఈకను ఇవ్వు

బహుశా ఆమె నాకోసం ఎదురుచూస్తూ వుంటుంది

రెల్లు తీగ తన చేయిని తుంచి నాకిచ్చి

తీసుకో నేను కూడా ఆమె సేవకున్నే అంది.

*****************

“బాధ”

ఈ తల

ఓ బాధల పెట్టె

పిల్లాడి గిలక్కాయలా గిర గిరా తిరుగుతూ

మళ్ళీ మళ్ళీ టక టాకా శబ్దం చేస్తుంది

ఒకటికాదు ఎన్నో రకాల బాధలు నొప్పులు

గతం జ్ఞాపకాల బాధ

వృధాగా దాచి ఉంచిన రహస్యాల బాద

ఇవ్వలిటి బాధ

రేపటి బాధ

కానీ ఒక బాధ మాత్రం

కొత్తగా పుట్టదు

అదట్లా వుంటుంది వుంటూనే వుంటుంది

ఆ బాధ “నేను”

ఆ బాధ

నేనివ్వాళ గానం చేయలేని

దుఖం నుండి పుడుతుంది.

డోగ్రి- పద్మా సచ్ దేవ్

ఇంగ్లిష్: ఇక్బాల్ మసూద్

**********************

డోగ్రీ భాషా వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్

+++++++++++ వారాల ఆనంద్