Month: July 2023
భారతీయ సినిమాల్లో మహిళా రచయిత్రులు
భారతీయ సినిమాల్లో మహిళా రచయిత్రులు
బహుశా భారత రాజకీయాల్లోనూ, భారతీయ సినిమా రంగంలోనూ వున్నన్ని మూఢ నమ్మకాలూ, సెంటి మెంట్లూ మరే ఇతర రంగాల్లో కనిపించవు. ఒక రాజ కీయ పార్టీ రైతులగురించి మాట్లాడి విజయం సాధిస్తే మొత్తం పార్టీలన్నీ అదే మాట మాట్లాడతాయి, అట్లాగే సినిమా రంగంలో ఒక ఒరవడిలో సినిమా ఆర్థికంగా విజయం సాధిస్తే ఇక కొంత కాలం అదే మూసలో సినిమాలు నిర్మాణం కావడం ఎస్ఏఆర్విఏ సాధారణం. వాటిమీద జనానికి మొహం మొత్తి అలాంటి ఒకటి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాతే మరో మూస ఫార్ములా కోసం పాకులాడడం మనం చూస్తూనే వున్నాం, 1980వ దశకం లో ‘మాభూమి’ విజయం తర్వాత ‘ఎర్రమల్లెలు’, ఆ తర్వాత అవే ఎర్ర సినిమాలు ఎన్ని వచ్చాయో మనం చూసాం. అదేవిధంగా బాలకృష్ణ నటించిన ఒక రాయల సీమ ఫ్యాక్షన్ సినిమా విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములా తో ఎన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయో చూసాం. ఇవి మచ్చుకు కొన్నే. అంతే కాదు ఈ పరిస్థితి కేవలం తెలుగు ప్రాధాన స్రవంతి సినిమాలకే కాదు భారతీయ అన్ని భాషల్లోని ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ వుంది. హిందీ సినిమా రంగం కూడా అందుకు ఏమీ మినహాయింపు లేదు. మూడు ఫైట్లు ఆరు పాటలూ అన్న చందంగా అనేక రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు హిందీ లో కూడా అనేకం. అట్లే భారతీయ అన్ని సినిమాల్లో హీరో డైరెక్టర్, హీరో హీరోయిన్ ల కాంబినేషన్ అన్న ఫార్ములా కూడా వుంది. ఇట్లా పలు చిత్ర విచిత్ర మయిన అంధ విశ్వాసాలతో హిందీ సినిమా కూడా కునారిల్లుతూనే వుంది. అయితే హిందీ సినిమా విస్తృతి పెద్దది కనుక ఆ ఫార్ములా ఒరవడిలో అది కొట్టుకుపోతున్నా అప్పుడప్పుడూ కొంత భిన్న మయిన సినిమాలు హిందీలో వస్తూనే వున్నాయి. ఆర్ట్ సినిమాలూ, వాస్తవిక సినిమాలూ కనుమరుగయినప్పటికీ సబ్జెక్ట్స్ లోనూ, మేకింగ్ లోనూ కొంత భిన్నమయిన సినిమాలు హిందీ లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే వున్నాయి. అందుకే హిందీ సినిమా రంగంలో ఇట్లా వచ్చి విడుదలై కోట్లు కొల్లగొట్టి అట్లా ప్రేక్షకుల మనసుల్లోంచి మాయమయి పోయే సినిమాలకు సమాంతరంగా నాలుగు కాలాలపాటు చూపరులకు గుర్తుండే కొన్ని మంచి సినిమాలు కూడా తయారవుతూనే వున్నాయి. విజయవంతమవుతూనే వున్నాయి. మంచి సినిమా చూసామన్న అనుభూతిని ప్రేక్షకుల్లో మిగులుస్తున్నాయి. సామాజిక మానసిక అంశాల్ని కూడా ఇలాంటి ‘అవుట్ ఆఫ్ బాక్స్’ సినిమాలు తడుముతూనే వున్నాయి. అలాంటి కనీస అర్థవంతమయిన సినిమాలు హిందీ టిహెచ్ఓ సహా పలు ఇతర భారతీయ భాషా సినిమా రంగాల్లో వస్తూనే వున్నాయి.
ఇలాంటి అవుట్ ఆఫ్ బాక్స్ సినిమాలు రావడానికి ప్రధానంగా భిన్నమయిన కథ, వినూత్నమయిన స్క్రీన్ ప్లే, అవుట్ ఆఫ్ ది ట్రాక్ ఫిలిం మేకింగ్ లు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇలా భారతీయ సినిమా విలక్షణతను సంతరించుకుని దాని ముఖ చిత్రం మారుతూ వుండడం మనం గమనించ వచ్చు. ఆ స్థితికి ప్రధానంగా కొంత మంది విలక్షణ మహిళా రచయిత్రులు స్క్రీన్ రైటర్లు రంగంలోకి రావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా పలువురు మహిళా రచయితలు పలు విజయవంతమయిన అర్థవంతమయిన సినిమాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అలా ఏఏ మధ్య వచ్చిన
‘మంటో’, ‘మన్ మర్జియా’, గల్లీ బాయ్ లాంటి సినిమాల రచయిత్రులు దర్శకుల గురించి ఒకసారి మాట్లాతుకుందాం.
కనికా ధిల్లాన్:
అమృత్సర్ లో పుట్టిన కనికా మంచి రచయిత్రిగా ఎదిగింది. బాంబే డక్ ఈస్ అ ఫిష్, శివ అండ్ ద రైస్ ఆఫ్ షాడోస్, ద డాన్స్ ఆఫ్ ద దుర్గా (Bombay Duck is a Fish, Shiva and the Rise of the Shadows,The Dance of Durga, లాంటి నవలలు రాసారు. అమె మొదట రెడ్ చిల్లీ లో పని చేస్తూ ‘ఓం శాంతి ఓం’ కి సహాయ దర్శకురాలిగా పని చేసింది, తర్వాత రావన్, సైజ్ జీరో, మాన్ మర్జియా లకు స్క్రిప్ట్ రచన చేసింది.ఇటీవల కేదార్ నాధ్ , మెంటల్ హై క్యా లకు కథ స్క్రీన్ప్లే సంభాషణలు రాసింది. విజయవంతమయిన రచయిత్రిగా నిలద దొక్కుకుంది.
జుహీ చతుర్వేది:
1975లో లక్నోలో జన్మించిన జుహీ లక్నో లోనే డిగ్రీ పూర్తి చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా లో చేరింది. తర్వాత 1996 లో ధిల్లీ లో అడ్వర్టైస్ మెంట్ కంపనీలో చేరింది. తర్వాత అక్కడే తన మొదటి సినిమా ‘విక్కీ డోనార్’ సినిమా స్క్రిప్ట్ రాయడం ఆరంభించింది. విక్కీ డోనార్ కు రచయిత్రి గా, ‘మద్రాస్ కెఫే’ కు సంభాషణలు, ‘పీకూ’, ‘అక్టోబర్’,’స్కై ఈస్ పింక్’ సినిమాలకు రచయిత్రిగా పని చేసి అద్భుతమయిన సినిమాల్ని అందించింది.ఆమె విక్కీ డోనార్ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు ను అందుకుంది.
కొంకణ సేన్ శర్మ:
ప్రముఖ బెంగాలి నటి అపర్ణ సేన్ కూతురు అయిన కొంకణ మొదట మంచి నటి గా గుర్తింపు పొందింది. రెండు జాతీయ అవార్డులు, నాలుగ్ ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఇక రచయిత్రిగా దర్శకురాలిగా కొంకణ ‘ ఎ డెత్ ఇన్ ద గంజ్’ తో ఆమె ప్రతిభను నిరూపించింది.
అలంకృతా శ్రీవాస్తవ :
ధిల్లీ లో జన్మించిన అలంకృత ప్రకాష్ ఝా తీసిన ‘గంగా జల్’, ఖోయా ఖోయా చాంద్, ‘రాజనీతి’ లాంటి సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేసి తన మొదటి సినిమా ఆమె ‘టర్నింగ్ 30’ రూపొందించింది. తర్వాత ఆమె తీసిన’ లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ ఎంత చర్చనీయాంశ మయిన సినిమాగా నిలబడిందో చూసాం. తర్వాత ఆమె ‘దోలి కిట్టీ అవుర్ చమక్తే సితారే’, ‘మెర్ ఇన్ హెవెన్’ సినిమాలు రూపొందించి ఆమె ఈ సినిమాలకు రచయిత్రి దర్శకురాలిగా పనిచేసారు.
గౌరీ షిండే:
పూనే లో పుట్టి పెరిగిన గౌరీ షిండే ముంబై లి సిద్దార్థ్ ఖక్ దగ్గర సహాయ దర్శకురాలిగా పని చేసింది. తను తన మొట్ట మొదటి సినిమా గా ‘ ఇంగ్లీష్ వింగ్లిష్’ రూపొందించింది. కథా రచన,స్క్రీన్ప్లే, దర్శకత్వ భాధ్యతల్ని తానే నిర్వహించింది. ఆ సినిమా శ్రీదేవి చలనచిత్ర కారీర్ కు పునర్ ఆరంభం పలికింది. తర్వాత షారుఖ్ ఖాన్, అలియ భట్ నటించిన ‘డియర్ జిందగీ’ సినిమాకు కూడా ఆమె కథా రచన,స్క్రీన్ప్లే, దర్శకత్వ భాధ్యతల్ని నిర్వహించింది. ఆ రెండు సినిమాల్ కథలు విలక్షనతను సంతరించుకున్నాయి.రచయిత్రి గానూ దర్శకురాలిగాను షిండే ఇవ్వాళ హిందీ రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందింది.
జోయా అక్తర్ :
జావేద్ అక్తర్, హనీ ఇరానీ ల కూతురయిన జోయా న్యూ యార్క్ లో చదువుకున్నారు.మీరా నాయర్ లాంటి వాళ్ళ దగ్గర సహాయకురాలిగా పని చేసారు.’లక్ బై చాన్స్’, ‘జిందగీ న మిలేగి దోబారా’, ‘బాంబే టాకీస్’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాలు భిన్నంగా రూపొంది జోయా కు మంఛి పేరు తెచ్చాయి.‘దిల్ దడఖ్ నే దో’, ‘లాస్ట్ స్టోరీస్’ లాంటి సినిమాలు కూడా జోయా రూపొందించి ప్రతిభ కల దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. తను దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు జోయా రచన భాధ్యతలు కూడా నిర్వహించారు.
నందితా దాస్:
1969 లో పుట్టిన నందితా దాస్ 40 కి పైగా సినిమాల్లో నటించారు.దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించిన నందిత దర్శకురాలిగా మొట్ట మొదట 1988 లో ‘ఫిరాఖ్’ తో ఆరంభించింది.ఫిరాఖ్ గుజరాత్ హింసాకాండ గురించి నిజాయితీగా తీసిన సినిమా గా నిలిచింది. అనేక వాస్తవ కథల్ని 24 గంటల సమయంలో పరస్పర సమన్వయంతో నిర్మించారీ సినిమాను. గత ఏడాది నందిత ‘మంటో’ సినిమా రూపొందించింది. సుప్రసిద్ధ రచయిత బియోపిక్ గా రూపొందిన మనతో దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.
జీనత్ లఖాని:
జీనత్ లఖాని దర్శకురాలిగా మొట్టమదటి సినిమా షాదీ కే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ .విద్యా బాలన్, ఫర్హాన్ అక్ష్టార్ లు ప్రధాన భూమికల్ని పోషించారు. 2017 లో జీనత్ లఖాని రచన బాధ్యతల్ని నిర్వహించిన సినిమా ‘హిందీ మీడియం’, ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్ లు ప్రధాన పాత్రల్ని పోషించారు. సామాజిక కోణం లోంచి వర్తమాన విద్యా వ్యవస్థను తూర్పార పట్టిన సినిమా గా హిందీ మీడియం నిలుస్తుంది.
అన్వితా దత్ గుప్తన్:
అన్విత ప్రధానంగా సంభాషణలు, పాటల రచయిత్రిగా పేరెన్నిక గన్నది.రచయిత్రిగా ఆమె రాసిన సినిమాలు ‘శాందార్’, ‘ఫైల్లౌరీ’ లు రోడ్ద కొట్టుడు సినిమాలకు భిన్నమయిన సినిమాలుగా నిలిచాయి.
కామ్నా చంద్ర:
కామ్నా చంద్ర గతంలో పలు మంచి ప్రేమకథా చిత్రాలకు రచనలు చేసారు. ‘1942-లవ్ స్టొరీ’ లాంటి సినిమాలకు ఆమె రచన చేసారు. ఇటీవలి కాలంలో ఆమె రచన చేసిన సినిమా ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’
ఇట్లా అనేక మంది మహిళా రచయిత్రులు భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తున్నారు. కొత్త దానాన్ని అద్ది సరికొత్త సినీ భాష్యాన్ని లిఖిస్తున్నారు. వారి కృషిలో నిర్మాణ మయిన సినిమాల్ని చూస్తె భారతీయ సినిమాకు ఇంకా సొంత గొంతుకతో పాటు సొంత స్టైల్ కూడా వుందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మహిళా రచయిత్రులు, దర్శకుల్లో అధిక శాతం మంది 1970 లలో జన్మించిన వల్లే కావడం గమనించ దగ్గ అంశం అంటే కొత్త తరం కొత్తగా ఆలోచిస్తుందని,సరికొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందని అవుటాఫ్ ద బాక్శ్ సినిమాల్ని రూపొందిస్తారని విదితమవుతుంది.
జావేద్ అఖ్తర్- కవిత్వం లో ఓ లౌకిక స్వరం
జావేద్ అఖ్తర్- కవిత్వం లో ఓ లౌకిక స్వరం
++++++ వారాల ఆనంద్
జావేద్ అఖ్తర్ ప్రతిభావంతమయిన కవి. వక్త, స్క్రీన్ ప్లే రచయిత.
సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్నసామాజిక గొంతుక ఆయనది.
ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమయిన స్వతంత్ర లౌకిక స్వరం జావేద్ అఖ్తర్.
భావుకుడూ, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించాడు. జావేద్ తండ్రి జాన్ నిసార్ అక్తర్ ప్రముఖ ఉర్దూ కవి సినీ గీత రచయిత. జావేద్ అఖ్తర్ తాత ముజఫర్ ఖరబాది కవిత్వం ఉర్దూ సాహిత్య ప్రపంచంలో మైలురాయి లాంటిదని భావిస్తారు. ఇంకా జావేద్ మేనమామ మజాజ్ కవిత్వం కూడా ఉర్దూ లో ప్రముఖ మయిందే. జావేద్ అక్తర్ తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా రాసాడు. జాతీయ సమక్యత, స్త్రీల హక్కులకోసం మాట్లాడాడు రాసాడు. తప్పు దోవ పట్టిన యువతనుద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995 లో కేండ్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది.
జావేద్ అఖ్తర్ 1980లో సీరియస్ గా కవిత్వం రాయడం ఆరంభించాడు. ఆయన 1995 లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘టార్ఖాష్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమానుల్నుంచి విమర్శకులనుంచి ప్రశంసల్ని అందుకుంది.ఇప్పటికే అది హిందీలో 10, ఉర్దూలో అయిదు ముద్రణలు పొందింది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్ గా కూడా ప్రాచుర్యం పొందింది.
గ్వాలియర్ లో పుట్టిన జావేద్ లక్నో అలిఘర్, భూపాల్ లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిది బాగా విస్తారమయింది. చిన్నప్పుడు ఆయన జీవితం చాలా చిత్రంగా గడిచింది. తండ్రి బాంబే లో ఉండేవాడు. తల్లి అప్పటికే మరణించింది. జావేద్ తన అమ్మమ్మ తాతయ్యల దగ్గర లక్నోలో పెరిగాడు. నెలకు 15 రూపాయల జీతం మీద చదువు చెప్పే ట్యూషన్ మాస్టర్ వద్ద చదువు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. తనకు రోజూ ఉదయం ఆఠాణ, సాయంత్రం ఒక అణా ఇచ్చేవారని వాటితో ఉదయమే రాంజీ లాల్ షాపులో రంగుల మిఠాఈలు సాయంత్రం భగవతీ షాపులో చాట్ తినేవాన్నని జావేద్ ఒక చోట రాసుకున్నాడు. కనీసం మెట్రిక్ అన్నా పూర్తిచేయి పోస్ట్ ఆఫీసులో చిన్న ఉద్యోగామయినా దొరుకుతుంది అనేవాడు జావేద్ తాత. తర్వాత జావేద్ ను ఆయన అత్తగారి వూరయిన అలిఘర్ పంపించారు. ‘ వీడిని జాగ్రత్తగా చూడండి..వీడికి చదువుకంటే సినిమా పాటలంటే ఎక్కువ ఇష్టం’ అక్కడ స్కూల్లో చేర్పిస్తూ మామ టీచర్ తో అన్నాడంట. ఎందుకంటే అప్పటికే జావే కి ‘ఉరన్కా ఠోళా’, ‘శ్రీ 420’ లాంటి సినిమాల పాటలతో పాటు అనేక పాటలు నోటికి వచ్చేవంట. తర్వాత కొంత కాలం భూపాల్ లో తన సవతి తల్లి ఇంట్లో వున్నాడు. కాని అక్కడ ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేక మిత్రులతో కలిసి ఉంటూ కాలేజీ చదువుని పూర్తి చేసాడు. అప్పుడే మిత్రుడు ముస్తాక్ ద్వారా దేశ విభజన గురించీ అప్పుడు జరిగిన అరాచకాల గురించీ విన్నాడు.
తర్వాత అక్టోబర్ 1964 బాంబే చేరుకుని తండ్రి వద్ద వున్నాడు. కానీ కేవలం వారం తిరగ కుండానే ఇల్లు వదలాల్సి వచ్చింది. జేబులో 25 పైసలున్నాయి రెండేళ్ళ పాటు అష్ట కస్తాలు పడ్డాడు ఒక చిన్న సినిమాకు మాటలు రాసి వంద రూపాయలు సంపాదించాడు. అనేక సార్లు పలువురికి సహాయకుడిగానూ, ఘోస్ట్ రచయితగానూ పనిచేసాడు. సంవత్సరానికి పైగా కమల్ స్టూడియో లో వున్నాడు జావేద్. అందులో ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. అప్పుడే అంధేరీ లో వున్న ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్ వాడి పరిచయం తో జావేద్ చదివెందుకు పుస్తకాలకు కొదువ లేకుండా పోయింది.తర్వాత కొంతకాలం మిత్రుడు జగదీష్ తో కలిసి బాంద్రాలో మహాకాళి కేవ్స్ లో వున్నాడు. అప్పుడే తన విజయవంతమయిన పార్టనర్ సలీం ఖాన్ తో స్నేహం ఏర్పడింది. ప్రధాన స్రవంతి హిందీ సినిమాలకు ఒక సరికొత్త దారి చూపిన వాడు జావేద్. ఆయన తన మిత్రుడు సలీం ఖాన్ తో కలిసి రాసిన స్క్రీన్ ప్లే లు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయవంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది.దాన్నే సినిమా భాషలో ‘బ్రేక్ ‘ అంటారు. ఆ జంట రాసిన మొట్ట మొదటి సినిమా ‘హాతీ మేరె సాథీ’. ఒక రోజు రాజేష్ ఖన్నా వారి దగ్గరికి వెళ్లి దక్షినాది సినీ నిర్మాత అయిన దేవన్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు..మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.. దాంతో నేను హీరో రాజ్ కుమార్ కు చెందిన బిల్డింగ్ అమ్మకానికి వస్తే అడ్వాన్స్ ఇచ్చేసాను.. కానీ స్క్రిప్ట్ చూస్తే ఘోరంగా వుంది.. అది చేస్తే ఇక దాంతో నా ఫిలిం కారీర్ అంతే సంగతులు..అందుకే దాన్ని సరిచేయండి.. ఇంటికిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు. ఎట్లాగయినా చేసి ఈ స్క్రిప్ట్ ను మెరుగు పరచండి లేదా తిరగ రాయండి అని కోరుకున్నాడు. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీసిన ‘హాతీ మేరె సాథీ’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సలీం జావేద్ ల జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్ గా మారింది.
ఆ తర్వాత సీతా అవుర్ గేత సమయంలో జావేద్ అఖ్తర్ కి హనీ ఇరానీ తో పరిచయం కావడం అది పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఒకటయ్యారు. వారిద్దరికీ జోయా, ఫర్హాన్ లు జన్మించారు.
జావేద్ అఖ్తర్ తండ్రి జాన్ నిసార్ 18 ఆగస్ట్ 1976న మరణించాడు. చనిపోతూ తన చివరి పుస్తకాన్ని జావేద్ కి ఇస్తూ దాని పై ఇట్లా రాసాడు’నేను వెళ్లి పోయిన తర్వాత నన్ను గుర్తు చేసుకుంటావు..
’అప్పటిదాకా తండ్రి పట్ల సానుకూలంగా లేని జావేద్ కన్నీటి పర్యంతం అయ్యాడు.1979 తన మొదటి కవిత రాసాడు.అప్పుడే జావేద్ కి షబానా ఆజ్మీ తో పరిచయం ఏర్పడింది. కైఫీ ఆజ్మీ కూతురు అయిన షబానా కు కూడా అప్పుడే జీవితం పట్ల అనేక ప్రశ్నలు, అనుమానాలూ వస్తున్న సమయం అది. అప్పుడే వారిద్దరి నడుమా సాన్నిహిత్యం పెరిగింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ లు విడిపోయారు. కానీ స్నేహంగానే వున్నారు పిల్లలు ఇద్దరు కూడా తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెంచుకోలేదు. జావేద్ షబానా ల జీవితం సాఫీగానే సాగుతున్నది.
జావేద్ అందుకున్న అవార్డులకు లెక్కేలేదు. ఆయన సినిమా పాటలకు అయిదు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఫిలిం ఫేర్, జీ,ఐఫా అవార్డులు లభించాయి. జాతీయస్థాయిలో పద్మభూషణ్,అవధ రత్న, జాతీయ సమగ్రత లో ఇందిరా గాంధీ అవార్డు లభించాయి.ఆయన హార్వార్డ్, కొలంబియా,బర్కిలీ, మేరీ లాండ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్, జే.ఎన్.యు., అలీ ఘర్, విశ్వభారతి లాంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించారు.
అట్లా జావేద్ కారీర్ కవిగానూ, సినిమా పాటల రచయితగానూ, స్క్రిప్ట్ రైటర్ గానూ ఎదుగుతూ వచ్చింది.
ఫలితంగా సలీం-జావేద్ లు జంట గా అందాజ్, సీతా అవుర్ గీతా, యాదోన్కీ బారాత్, జంజీర్,దీవార్, షోలే..డాన్, త్రిశూల్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు హిందీ సినిమాలకు ‘ఆంగ్రీ యంగ్ మాన్’ అన్న పాత్రను అందించింది. అప్పటి ఆ విజయాల మీద అంగ్రీ యంగ్ మాన్ కారెక్టర్ మీద పరిశోదనలు కూడా జరిగాయి. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్తుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆజంట విడిపోయింది. 1981 సలీం జావేద్ ల జంట విడిపోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేసాడు.వాటిల్లో సాగర్, మిస్టర్ ఇండియా, బెతాబ్, లక్ష్య లాంటి విజయవంతమయిన సినిమాలకు రాసాడు.
తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం లిరిక్స్ వైపు కదిలాడు.ఆయన రాసిన సినీ గీతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే కైఫీ ఆజ్మీ ఒక చోట ఇట్లా అంటాడు.. ’మొదట సమాధి తవ్వి తర్వాత దానికి సరిపడే శరీరాన్ని వెతకడం సినీ గేయ రచయితల పని’ అయితే జావేద్ అఖ్తర్ తనసినీ గీతాలతో అద్భుతమయిన రూపాల్ని చిత్రించాడు.సినీ గీత రచయితగానే కాకుండా జావేద్ అఖ్తర్ గొప్ప కవి. ఆయనరాసిన కవితలు గజల్ సూటిగా స్పష్టంగా మనసుకు హత్తుకుంటాయి. ఆయన కవితా సంకలనాలు ‘టర్కష్’ 1995 లో వచ్చింది, తర్వాత ‘లావా’ 2012 లో వెలువడింది. లావా కు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్’
అందులో ఆయన కాలాన్ని గురించి..
కాలమంటే ఏమిటి,
అలుపూ విరామమూ లేకుండా
సాగిపోతున్నది
అడట్లా ప్రయానిన్చాకుండా వుంది వుంటే
అదేక్కడుండేది
ఎక్కడో ఒక చోట వుండేది కదా… అంటూ గొప్ప తాత్వికత తో రాస్తాడు.
…..
ఇట్లా ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మనుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల్నుండి పెల్లుబుకుతుంది.
ఈ సంకలనం నిండా వర్తమాన అవ్యవస్థ గురింఛి తనకోపమూ, తన తాత్వికత, వేదన దుఖం, ప్రశ్న జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించాడు జావేద్ అఖ్తర్. తన కవిత్వం నిండా వర్తమాన మత చాందస వాదం గురించీ ఖండిస్తూ రాసాడు. మాట్లాడాడు. ప్రశించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించాడు జావేద్.
ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి,కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించాడు.
*********
సశేషం +++ వారాల ఆనంద్
సశేషం
+++ వారాల ఆనంద్
దూరం తరగదు
కాలం నిలవదు
చీకటి ముగియదు
వెలుతురు తెమలదు
గాయం మానదు
భారం తొలగదు
నడక ఆగదు
అలసట తెలియదు
పరదా దిగదు
నాటకం ముగియదు
ఏది ఎక్కడ నిలుస్తుందో
ఎప్పుడు ముగుస్తుందో
ఇప్పటికిది
సశేషం
********
అనువాదం గొప్ప అనుసృజన
అనువాదం గొప్ప అనుసృజన
++++
భాషా సంస్కృతులు తమదయిన శూన్యంలో పుట్టవు, పెరగవు.
కవులూ రచయితలూ అంతే.
తమదయిన స్వీయ సృజనతో పాటు ఇతర భాషలను చదవడం నేర్చుకోవడం, ఆయా భాషల్లో సాహిత్యాల్లో వస్తున్న సృజనాత్మక మార్పుల్ని గమనించడం అనివార్యమయిన అధ్యయనం. దానితోటే భాషాభివృధ్ధి తో పాటు సాహిత్యాభివృధ్ధీ సాధ్యమవుతుంది. కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేసి చూస్తేనే కొత్త భాష వినిపించే మన దేశంలో భాషా సాహిత్యాల మధ్య ‘ఆదాన్ ప్రదాన్’ అత్యంత ముఖ్యమయినది. అది సాధ్యం కావడానికి ఆయా భాషల నడుమ అనుబంధం వాటి మధ్య అనువాదం అత్యంత అవసరమయిన ప్రక్రియ. అట్లని అనువాదం కేవలం భాషానువాదం కాదు. అది మొత్తంగా ఆ ప్రాంత జనజీవన సాంస్కృతిక ప్రతిబింబమయి వుండాలి. అందుకే అనువాదం అన్నది గొప్ప అనుసృజన.
రెండు భాషలకూ, రెండు వ్యక్తీకరణలకూ, రెండు సంస్కృతులకూ నడుమ ‘అనువాదం’ ఓ అక్షరాల వారధి
అది ఓ గొప్ప భావానుబంధం. సమస్త మానవాళి జీవితాల్నీ, జీవనానుభవాల్నీ ఏకం చేసే ఓ సాంస్కృతిక వేదిక. అందుకే సాహిత్య చరిత్ర లో అనువాదకుడి పాత్ర విలక్షణమయింది, విశిష్టమయిందీ కూడా.
…
“ ఇన్నేళ్లుగా కళాత్మక సినిమా, కవిత్వమూ అంటూ తిరిగిన నిన్ను ఈ అనువాదం ఎట్లా ఆకర్షించింది, ఏందీ కథ” అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. తాను అట్లా అడిగే సరికి అవును కదా అని నేనూ ఆలోచనలో పడ్డాను. నా మాతృభాషకూ ఇతర భాషలకూ ఎట్లా కుదిరింది ఎక్కడ మొదలయింది అని నా గతంలోకి వెళ్ళాను. నా చిన్నప్పుడు చుట్టూ అందరూ వున్నా తీవ్రమయిన ఒంటరితనంతో మా అమ్మా నాన్నే లోకంలా గడిపాను. మా ఇంటికి ఎదురుగా వున్న విజయలక్ష్మి హోటల్లో ఒక రేడియో వుండేది. అందులో ఎక్కువగా హిందీ పాటలే పెట్టేవాళ్లు. మానాన్న వాళ్ళ మిత్రులు అక్కడ ఆ పాటల్ని వింటూ పాడుతూ వుండేవాళ్లు. నేను కొంచెం ఎదిగే సమయానికి నాకు గుర్తున్న మేరకు మా నాన్న వారాల ఆంజయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే అయినప్పటికి హిందీ పాటలన్నా, ఉర్దు పుస్తకాలన్నా బాగా ఇష్టంగా వుండేవాడు. తాను స్వయంగా గొంతెత్తి పాటలు పాడేవాడు. తలత్ మహమూద్ అన్నా నటుడు దిలీప్ కుమార్ అన్నా ఆయనకి బాగా ఇష్టంగా వుండేది. ఒక రోజు ‘ఏ హవా ఏ రాత్ ఏ చాందినీ, తేరీ అదాపే నిసార్ హై’ అంటూ నాన్న పాడటం విని అట్లా అంటే ఏంది నాన్నా అర్థం ఏంది అని అడిగాను. ఆయన నవ్వి ఒక్కో పదానికి తెలుగులో అర్థం చెప్పడం మొదలు పెట్టాడు. నాకు కొంచెం అర్థం అయ్యీ కొంచెం కాలేదు. అవి హిందీ లోంచి నా మాతృభాష తెలుగులోకి నేను నేర్చుకున్న మొదటి మాటలు, పాఠాలు. ఇవన్నీ అర్థం కావాలంటే హిందీ బాగా చదవాలిరా అన్నాడు నాన్న. అప్పటికి భాషల గురించి నాకు వేరే ఏమీ తెలీదు. కానీ వేరే ఒక భాష లోని మాటల్ని అర్థం చేసుకోవడానికి వాటిని మన మాతృభాషలోకి మార్చుకోవాలని అనిపించింది. బహుశా నేనే కాదు అందరూ వేరే ఇతర భాషను అర్థం చేసుకోవడానికయినా తప్పకుండా తమ మాతృభాషలోకి మార్చుకోవాల్సిందే. ఖుషీ అనగానే సంతోషం అనీ, సాడ్ అనగానే దుఖం అనీ తెలిసిపోతుంది. అదంతా లోపల మనకు తెలియకుండానే అప్రయత్నంగానే జరిగిపోతుంది. కొత్త భాషను అర్థంచేసుకునే క్రమంలో జరిగే మేధోపరమయిన సమన్వయం అది. అదంతా అప్పుడు తెలీదు. కానీ మా యింట్లో రేడియోలో ‘శ్యామే ఘంకీ కసమ్’, ‘తు కహే అగర్’, ‘సుహానా సఫర్’ ఇట్లా అనేక పాటలు వచ్చేవి. నాన్న పాడుతూ వుండేవాడు. వాటితో పాటు ప్రతి బుధవారం బినాకా గీత్ మాల, ప్రతి రోజూ వచ్చే పురానీ ఫిల్మోకా గీత్….అట్లా అన్నీ హిందీ పాటలే. దాంతో నేను హిందీ నేర్చుకోవడానికి స్కూల్లోనూ కాలేజీలోనూ సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. అకాడెమిక్ ప్రోగ్రామ్ లో భాగంగా కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. అట్లా స్కూలు ముగిసే సరికి మూడు భాషల పరిచయం కలిగింది. తర్వాత సైన్స్ చదువుకోవడం ఉద్యోగం లో చేరడం అన్నీ జరిగి పోయాయి. సాహిత్యంతో పరిచయం వున్నప్పటికి ఎపుడయితే ఆర్ట్ సినిమా వైపు ఆసక్తి పెరిగిందో అపుడు ఈ అనువాదం నాకు తెలీకుండానే వచ్చేసింది.‘పథేర్ పాంచాలి’ చూడాలంటే బెంగాలీ రాదు సబ్ టైటిల్స్ పైన ఆధారపడాల్సిందే. అంటే బెంగాలీ మాటల్ని ఇంగ్లీష్ లో చదివి తెలుగులో అర్థం చేసుకోవాలి. బెంగాలీ మాత్రమే కాదు కన్నడ, మరాఠీ, తమిళ్, మలయాళం ఏ ఇతర భాషా సినిమా చూడాలన్నా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పై ఆధారపడ్డమే. అట్లా భాషానువాదం జీవితంలో భాగమయి పోయింది.
2014 తర్వాత సంస్థలు సభలు నిర్వహణ కార్యక్రమాలు మానేశాక సాహిత్యమే జీవితమయి పోయింది. ఆ క్రమంలో తెలుగు కవిత్వమే కాకుండా వివిధ భాషల సాహిత్యం ముఖ్యంగా కవిత్వం చదవడం అలవాటయింది.INDIAN LITERATURE లాంటి పత్రికల్ని పదేళ్లుగా క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తూ వస్తున్నాను. దాంతో పాటు నాకు దశాబ్దాలుగా ఇష్టమయిన గుల్జార్ ను ఫాలో అవడం మొదలు పెట్టాను. జావేద్ అఖ్తర్, సచ్చిదానందన్, జయంత్ మహా పాత్ర, గిరీష్ కర్నాడ్ ఇట్లా అనేక మంది రచనల్ని చదువుతూ వచ్చాను. ‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం మొదటినించీ నాకున్న అలవాటు’ నేను చదివిన కవితల్లోంచి నాకు నచ్చిన వాటిని తెలుగులో రాసుకోవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా ఏదయినా ఒక కవిత చదివినప్పుడు అరె ఎంతబాగా రాశారు ఇది నేను రాసి వుంటే ఎంత బాగుండేది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అనువదించే ప్రయత్నం చేశాను. అప్పుడు గుల్జార్ కవిత్వాన్ని ఆకుపచ్చ కవితలు పేర తీసుకొచ్చాను. అదే క్రమంలో మన తెలుగు వాళ్ళకి ఇరుగు పొరుగు భాషల్లో కవిత్వం ఎట్లా వస్తున్నది. అక్కడి కవులు ఏమి రాస్తున్నారు, ముఖ్యంగా వర్తమాన కవుల రచనలు ఎట్లా వున్నాయి వాటిని పరిచయం చేయాలనుకున్నాను. రూపంలో సారంలో ఆయా భాషల్లో కవిత్వం ప్రత్యేకతలు ఏమిటి? అవన్నీ తెలియయాలంటే వాటిని తెలుగులోకి అనువాదం చేసి అందించడమే అనుకున్నాను. ఆ క్రమంలో గుల్జార్ చేసిన ‘ ఎ పోయెం ఎ డే’ నా కంట పడింది. అది నాకు పెద్ద ప్రేరణ. ఆ క్రమంలోనే కె.సచ్చిదానందన్ సంపాదకత్వం లో వచ్చిన అనేక సంకలనాల్ని తెప్పించుకుని చదివాను. వాటితో పాటు కాశ్మీర్ కు చెందిన అఘా షాహిద్ అలీ, కెనడాలో వుంటున్న రూపి కౌర్, జయంత మహాపాత్ర, అస్సామ్ కు చెందిన నీలీం కుమార్ ఇట్లా వివిధ భారతీయ భాషలకు చెందిన కవుల సంకలనాల్ని చదివాను.
కొన్ని కవితలు అనువాదం చేసి ‘ఇరుగు పొరుగు’ పేర అనువాదాలు చేస్తున్నాను మిత్రమా అనగానే శ్రీ కాసుల ప్రతాప్ రెడ్డి ఆసియ నెట్ లో వారం వారం వేద్దాం అన్నాడు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ఎంతో సహకరించారు. దాదాపు రెండేళ్లకు పైగా అది కొనసాగింది. తర్వాత వివిధ పత్రికల్లో, ఆన్లైన్ మగజైన్స్ లో, సోషల్ మీడియాలో నేను చేసిన అనువాద కవితల్ని ప్రచురిస్తూనే వున్నాను.
ఇప్పటికి భారత రాజ్యాంగం తన 8వ షెడ్యూల్ లో అధికార భాషలుగా 22 భాషల్ని ఆమోదించింది. కాని మన దేశంలో లిఖిత మౌఖిక భాషలు ఎన్నో వున్నాయి. నేను ఇప్పటికీ 29 భారతీయ భాషల నుంచి 90 మందికి పైగా కవులు రాసిన కవితల్లోంచి 150కి పైగా కవితల్ని అనువదించి ఈ సంకలనంలో చేర్చాను.
ఈ ‘ఇరుగు పొరుగు’ లో వున్న కవితలన్నీ నేను చదివినవి, నాకు నచ్చినవి, నేను అందరితో పంచుకోవాలుకున్నవి మాత్రమే. ఈ ‘ఇరుగు పొరుగు’ నా నిరంతర అనుసృజనా ప్రక్రియ. ఆ క్రమంలో ఇది ఇరుగుపొరుగు మొదటి సంపుటి. నా స్వీయ కవితా రచనతో పాటు అనువాదం కూడా కొనసాగుతుంది.
వారాల ఆనంద్
9440501281
****************
మంచి కవిత— వారాల ఆనంద్
మంచి కవిత
++++++++ వారాల ఆనంద్
జాగ్రత్తగా చదువు
నీతో మాట్లాడుతుంది
మౌనంగా ధ్వనిస్తుంది
బిగ్గరగా అరుస్తుంది
ఉప్పెనలా చుట్టేసుకుంటుంది
పాటలా పట్టేసుకుంటుంది
సాలీడులా కమ్ముకుంటుంది
ఒడిలో కూర్చుంటుంది
చంకనెక్కి గారాలు పోతుంది
నెత్తిమీద మొట్టికాయ వేస్తుంది
రక్తనాళాల్లోకి ఇంకిపోతుంది
అటు ఇటు కాదు
నేరుగా మనసులోకి దిగి పోతుంది
నిన్ను మనిషిని చేస్తుంది
ఎక్కడా జారిపోకుండా నిలబెడుతుంది
సోయితో చదువితే
మంచి కవిత
నన్నూ నిన్నూ వెంటాడుతూనే వుంటుంది
***********19 జూలై 2023