Month: May 2023
శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’
శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’
(14 మే నుంచి ఆయన శతవంతాల సంవత్సరం )
-వారాల ఆనంద్
భారతీయ నవ్య సినిమా ప్రపంచానికి ఆధునికతను, ప్రగతి శీల భావనలను, సామాజిక వ్యాఖానాన్ని జోడించి ఆవిష్కరించిమ సినీ వైతాళికుడు మృణాల్ సేన్. తన సినీ జీవిత మొదటి రోజుల్లో ఆయన సామాజిక వాస్తవవాద దృక్పథం తోనూ, అనంతర కాలంలో అంతర్ముఖీనుడై తనదై న ఆధునిక సినిమా భాష్యం తో సినిమాలు తీసి లెజెండరీ ఫిలిం మేకర్ గా నిలిచాడు. తన సినిమాల్లో సెల్ల్యులాయిడ్ పైన తన తాత్వికతను ఆవిష్కరించిన వాడు సేన్. కలకత్తా నగరం భాతీయ సినిమా రంగానికి అందించిన ముగ్గురు ఫిలిం మేకేర్స్ గురించి ఆలోచనరాగానే ట్రయాలజీ లాగా రిత్విక్ ఘటక్, సత్యజిత్ రే మృణాల్ సేన్ స్పురణకు వస్తారు. అయితే ముగ్గురూ తమ తమ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమాలు తీసి తమదయిన కిరస్మరణీయమయిన ‘సంతకాన్ని’ ఇండెలిబుల్ సిగ్నేచర్ ని లిఖించి పోయారు.
మే 14 మృణాల్ సేన్ నూరవ జయంతి. ఆయన ఇప్పుడు మానమధ్య లేకున్నా తన సృజనాత్మక జీవితంతో మన మధ్యే వున్న ‘నూరేళ్ళ యువకుడు’ ఆయన.
మృణాల్ సెన్ Sir Charles Chaplin, Sergei Eisenstein, Vittorio De Sica and Jean Luc Godard.లాంటి దర్శకుల సినిమాల తో ప్రభావితుడయిన వాడు. అంతే కాదు Akira Kurosawa సినిమాల్ని కూడా అమితంగా అభిమానించేవాడు.
‘ కొత్త భావనలు, కొత్త ఆలోచనలు కలిగించడానికి, వాటిని అభివృద్ది పరిచి వాటి ద్వారా కళాత్మక ఆనందం పంచడానికి సినిమా కృషి చేయాలి. అంతే తప్ప కేవలం సాంకేతిక మాయాజాలంతో మాజిక్కులు సృష్టించడం సినిమా పని కాదు’ అని విశ్వసించిన వాడు ఆయన. తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం లో మృణాల్ సెన్ ౩౦కి పైగా సినిమాలు రూపొందించాడు. తన తొలి నాళ్ళల్లో ఆయన తీసిన ఇంటర్వ్యూ, కలకత్తా 71, పదాతిక్ సినిమాల ట్రైయాలజీ తో ఆయన ప్రగతిశీల రాజకీయ భావాలు కలిగిన దర్శకుడిగా నిలబడ్డాడు. వామపక్ష భావాల్ని అభిమానించిన మృణాల్ సెన్ కి కలకత్తా యే చిరునామా. అక్కడి వీధుల్ని, మనుషుల్నీ, వారి తత్వాల్నీ పరిశీలించడమే కాదు వారిలో మమేకమయి దృశ్యాల్ని చిత్రబద్దం చేశారు. మృలాల్ దా అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మృణాల్ సెన్ సహచరి గీత సెన్ గొప్ప నటి.
మృణాల్ సెన్ 1923 మే 14 న తూర్పు బెంగాల్ (ప్ర స్తుతం బంగ్లాదేశ్) లోని ఫరీద్పూర్ లో జన్మించాడు. తన ఇంటర్ విద్య పూర్తి చేసుకొని కలకత్తా చేరుకున్నాడు. మృణాల్ సేన్ తన యవ్వన దశలోనే స్పానిష్ సివిల్ వార్, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాల తో అమితంగా ప్రభావితుడయ్యాడు. సేన్ ఎస్ ఎఫ్ ఐ సంస్థలో కార్యకర్తగా పనిచేసాడు. తన కార్యరంగాన్ని పూర్తిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ తో పెన వేసుకున్నాడు. అక్కడే పరిచయమయిన గీతా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
డిగ్రీ చదువు పూర్తి అయిం తర్వాత సేన్ ఆర్ధిక స్థితి దయనీయంగా ఉండేది. రోజూ తన సమయాన్ని అధిక శాతం ఇంపీరియల్ లైబ్రరీలో గడుపుతూ సినిమా కు సంబంధించన అనేక పుస్తకాలు చదవడం తో పాటు చార్లీ చాప్లిన్ పైన ఒక పుస్తకం కూడా రాసాడు. 1947 రే, చిదాదాండ్ దాస్ గుప్తా, నిమాయ్ ఘోష్ ల తో కలిసి కలకత్తా ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి దాని వెలుగున అనేక గొప్ప సినిమాల్ని చూశాడు. ప్రపంచాసినిమా తో పరిచయం అవగాహన ఫిల్మ్ సొసైటీ తోనే కలిగింది. పారడైస్ కేఫ్లో ఘటక్ రే తదితరులతో పాటు సినిమా చర్చల్లో పాల్గొనే వాడు. 1952 దేశంలో మొట్టమొదటి సారి జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రషోమాన్, ఓపెన్ సిటీ, బైసికిల్ తీఫ్ లాంటి సినిమాలు చూసి తన దృక్పధానికి పదును పెట్టుకున్నాడు మృణాల్ సేన్. 1956 తన మొదటి సినిమా ‘రాత్ భూరు’ రూపొందించాడు. తన మొదటి ప్రయత్నాన్ని విఫల ప్రయత్నం గానే మృణాల్ సేన్ భావించినప్పటికి తర్వాత సేన్ ‘నీల్ ఆకాశార్ నీచే’ రూపోనించాడు. చైనా యువకుడికి బెంగాల్ యువతికి నడుమ జరిగిన ప్రేమ అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మించాడు. ప్రధాని నెహ్రూ ఆ సినిమాను గొప్ప సినిమా గా అభినందించాడు. తర్వాతి కాలం లో చైనా యుద్ధ సమయంలో ఆ సినిమాను నిషేదించారు.
‘బైసే శ్రావణ్’ మృణాల్ సేన్ తీసిన మూడవ సినిమా. వెనిస్, లండన్ తదితర ఫెస్టివల్స్ లో ప్రశంసల్ని అందుకుంది ఆ సినిమా.
ఆ తర్వాతి కాలంలో ఫ్రెంచ్ మాస్టర్స్ ప్రభావం తో మృణాల్ సేన్ సినిమా నిర్మాణ సరళి లో పెద్ద మార్పు వచ్చింది. వివరణాత్మక ధోరణి నుండి వైదొలిగి తనదయిన క్లాసిక్ ధోరణికి మారిపోయాడు. తర్వాత ఉన్నత వర్గాల పైన పేరడీ గా సేన్ 1965 లో ‘ ఆకాష్ కుసుం’ సినిమా నిర్మించాడు. తర్వాత ఒడియా భాషలో సేన్ ‘ మథిర మనిష’ సినిమా తీసాడు.
1969 లో మృణాల్ సేన్ ‘ భువన శోం’ రూపొందించాడు. అది మృణాల్ సిగ్నేచర్ ఫిలిం గా మిగిలిపోయింది. ఉత్పల్ దత్ , సుహాసిని మూలే లు ప్రధాన పాత్రల్ని ధరించిన ఈ సినిమా ప్రముఖ రచయిత బలాయి చంద్ ముఖోపాధ్యాయ్ రాసిన చిన్న కథ ఆధారంగా నిర్మించబడింది. గ్రామీణ నగరాల నడుమ ఉండే అంతరాల్ని, మోనో టానీ , ఒంటరితనం తదితర అనేక అంశాల్ని ఆవిష్కరించిన హిందీ సినిమా అది. భారతీయ నవ్య సినిమా చరిత్రలో భువన శోం ది గొప్ప స్థానం. అందులో సెన్ ప్రధానంగా వ్యంగ్యాన్ని ప్రధానంగా వాడుకుని సమాజం లోని డొల్ల తనాన్ని చూపించాడు. ఈ సినిమా సెన్ సేనిమాల్లోకెల్ల ఆర్థికంగా గొప్ప విజయ వంతమయిన సినిమా. అంతే కాదు ఈ సినిమాకు మరో ప్రత్యేకతకూడా వుంది ‘సాత్ హిందూస్థానీ’తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాముందే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. కేవలం 300 రూపాయల పారితోషకమ్ తో ఈ సినిమాకు అమితాబ్ డబ్బింగ్ చెప్పాడు. ఇదిప్పుడు ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.
ఆ తర్వాత మృనాల్ సేన్ తన రాజకీయ విశ్వాసాల బహిరంగ ప్రకరణలు గా చెప్పుకొనే కలకత్తా ట్రిలోజీ సినిమాలు వచ్చాయి. అప్పటి కలకత్తా నగరంలో పెల్లుబికిన రాజకీయ అంతర్మధన స్థితులు, ఉడికిపోతున్న సామాజిక స్థితిగతుల్ని ఈ మూడు సినిమాలు గొప్పగా ప్రతిభావంతంగా చూపించాయి. మొదట 197౦ లో ‘ ఇంటర్వ్యు’ వచ్చింది. 72 లో ‘ కలకత్తా 71 ‘ , 73 లో ‘ పదాతిక్ ‘ లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కమ్యునిస్టు పార్టీలో వచ్చిన విభజన, ఎగిసిన నక్సలైట్ ఉద్యమం నేపధ్యంలో రూపొందాయి. అత్యంత విశ్లేషనాత్మకంగా నిర్మాణమయిన ఈ సినిమాలు ఆనాటి పరిస్థితులను ఆవిష్కరించాయి.
తర్వాత సేన్ 74 లో ‘కోరస్’ సినిమా తీసాడు అది జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా గా అవార్డును గెలుచుకొంది.
1976 లో మృణాల్ సేన్ తీసిన ‘ మృగయా’ 1930 ల నాటి స్థితిగతుల పైన తీసిన సినిమా. అడవిలో మనుషుల్ని చంపుతూ వున్నా మృగాల్ని చంపితే ఓ యువకునికి బహుమతిచ్చిన వారే మనుషుల్ని పీక్కు తింటున్న మానవ మృగాన్ని చంపితే ఉరి శిక్ష వేస్తారెండదుకని ప్రశ్నిస్తాడు సేన్. కె. రాజేశ్వర్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఒడియా రచయిత భగవతీ చరణ్ పాణిగ్రాహి రచించిన నవల మూలం. ఈ సినిమా చొసిన తర్వాత నేను అత్యంత ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది సరిగ్గా ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారి ‘యజ్ఞం’ కథను గుర్తుకు తెస్తుంది. మిథున్ చక్రవర్తి మొట్ట మొదటిసారిగా నటించిన ఈ సిన్మాకు ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.
ఈ సినిమా తో నాకో గొప్ప సరదా అనుభవం కూడా వుంది. 1982-83 ప్రాంతం లో వేములవాడలో ఫిలిమ్ సొసైటీనడిపిస్తున్న కాలంలో మృగయా బుక్ చేశాం, అప్పుడు సికిందరాబాద్ నుండి బస్ లో ప్రింట్ రావాలి. ఆదివారం ఉదయం షో వేయాలి. టాకీసు ఫిలిమ్ ఆపరేటర్కి శనివారం ప్రింట్ వస్తుందని చెప్పాం. రాత్రి 9 గంటలకు వచ్చే సూపర్ ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూసి ప్రింట్ ను టాకీసుకు పంపించేసి ఇంటికి వెళ్ళాం. మర్నాడు ఉదయమే ఆపరేటర్ ఫోన్ మీరు చెప్పిన సినిమారాలేదు. వేరేదేదో మేరీ గాయ్ వచ్చింది అన్నాడు. మాకు ఒకటే కంగారూ. ఆఘ మేఘాల మీద నేనూ రవీంద్ర వెళ్ళాం. బాక్స్ మీద ఇంగ్లీషులో MRIGAYA అని వుంది. ఆపరేటర్ కు వచ్చిన ఇంగ్లీష్ తో పుట్టిన కంగారూ అది. సరదా సంఘటన. కలకత్తా ఫెస్టివల్ లో ఒకాసారి మృణాల్ సేన్ ను కలిసి నమస్కారం పెట్టుకున్నాను. మరోసారి హైదరబాద్ ఫెస్టివల్ లో ‘నవ్యచిత్ర వైతాళికులు’ పుస్తకం ఇస్తే తెలుగులో వుంది కదా అని నన్ను అభినందించారు. అవీ సేన్ ను కలిసిన సందర్భాలు.
ఇక తెలుగులో మృణాల్ సేన్ ‘ ఒక ఊరి కథ’ తీసాడు. మున్షి ప్రేమ చంద్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు తిక్కవరపు పట్టాభి రాం రెడ్డి నిర్మాత.
తర్వాత సేన్ ‘ఏక దిన్ ప్రతిదిన్’ , ‘ అకాలేర్ సంధానే’, ‘చల చిత్ర’, ‘ఖరీజ్’, ‘ఖండహార్’ తదితర సినిమాల్ని తీసాడు. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారం తో ఆయన తీసిన ‘జెనెసిస్’ రాజస్థాన్ ఎడారుల్లో నిర్మితమయి వినూత్న సినిమా గా పేరొందింది. ఇక బెర్లిన్ గోడ పగులగొట్టడం, తూర్పు యూరప్ దేశాల్లో కమ్యునిజం విఫలం చెందడం తదితర నేపధ్యాలతో సేన్ తీసిన సినిమా ‘మహా పృథ్వీ’. కలకత్తాలోని ఒక మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలోంచి అంతర్జాతీయ రాజకీయాల్ని సేన్ చర్చిస్తాడు. తర్వాత తన 76 ఏళ్ల వయసులో సేన్ ‘ అంతరీన్’ సినిమా తీసాడు.
తన మొత్తం సినిమా కారీర్ లో 27 ఫీచర్ ఫిలిమ్స్, 13 ఎపిసోడ్స్ టివి సీరియల్ తీసిన మృణాల్ సేన్ ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు సంబంధించి భారతీయ ప్రగతి శీల సంతకం. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ఆయన సినిమాలు ప్రదర్శించబడి అవార్డులు అందుకున్నాయి. దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఫిలిం సొసైటీ ఉద్యమంలో కూడా ఆయన కృషి గొప్పది.
ఈ సంవత్సరం మృణాల్ సేన్ శతజయంతి సంవత్సరంగా ప్రపంచంలోని మంచి సినిమా అభిమానులంతా నిర్వహించుకుంటున్నారు.
భారతీయ సినిమాకు సంబంధించి ఆయన ఓ లివింగ్ లెజెండ్ అయిన
మృణాల్ దా ని ఆయన సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
-వారాల ఆనంద్
ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు
మిత్రులారా! ‘ ఆకుపచ్చ కవితలు’ పైన ‘దిశ’ దినపత్రికలో సమీక్ష వచ్చింది. సంపాదకులకు, సమీక్షకులు శ్రీ అరవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు –ఆనంద్
+++++++++
ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు
బలమైన కవిత పుట్టాలంటే కవికి తీవ్రస్థాయిలో కోపం రావాలి. లేదంటే పట్టలేని సంతోషం కలగాలి. ఏ భావోద్వేగమైనా సరే.. ఉచ్ఛస్థాయిలో ఉండాలి. అప్పుడే ఓ మంచి కవిత పుడుతుంది. మనసును ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తోంది. తెలుగునాట ప్రభావం చూపిన కవిత్వమంతా అటువంటిదే. మనం ఈ నేల మీద పుట్టాము కాబట్టి.. మన మాతృభాష తెలుగు కాబట్టి.. మనకు తెలుగులో రాసిన కవిత్వం మాత్రమే చదువుకొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో గొప్ప కవిత్వం పుడుతుంది. బహు భాషాపండితులు ఆ కవిత్వాన్ని చదివి ఆస్వాదించగలుగుతారు. కానీ సామాన్యులకు సాధ్యం కాదు. అందుకోసం పుట్టుకొచ్చిన ప్రక్రియే అనువాదం.. ప్రపంచ సాహిత్యంలో, లేదంటే మనదేశంలోని ఇతర భాషల్లో ఆలోచింపజేసే సాహిత్యాన్ని ఎందరో అనువాదకులు తెలుగుకు పరిచయం చేశారు.
కానీ దురదృష్టవశాత్తు అనువాద సాహిత్యం చాలా సార్లు కృతకంగా ఉంటుంది. మూలం చెడకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అనువాదకులు కాస్త కఠినమైన భాషలో రాస్తుంటారు. కథా రచన, నవలా రచన అనువదించినప్పుడే ఆ భాష సామాన్యులకు ఓ పట్టాన అంతు చిక్కదు. అటువంటిది కవిత్వమైతే ఇంకా కష్టం. తెలుగులో గొప్ప అనువాద రచనలు లేవని కాదు.. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసం కూడా అనువాద ప్రక్రియలో వచ్చిందే. అప్పటి కవులు స్వేచ్ఛను కూడా తీసుకొని.. తమదైన శైలిలో మూలం చెడకుండా భారతాన్ని రాశారు.
అయితే ప్రపంచ సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనలను తెలుగులో ఎందరో కవులు మనకందించారు. ఆ చిట్టా ఇప్పుడు అనవసరం కానీ..
గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్ ను ఆకుపచ్చ కవితలు పేరిట వారాల ఆనంద్ తెలుగులో అనువదించారు. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆకుపచ్చ కవితలు పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకంలో ఉన్న కవితలు చదువుతుంటే మనకు అచ్చం తెలుగు కవిత్వం చదువుతున్న ఫీల్ కలుగుతుంది. ఎక్కడా అనువాదం అనే భావం కలగదు. హిందీ కవితను కూడా పక్కనే చేర్చారు కాబట్టి.. హిందీ తెలిసిన వారు మూల కవితను పోల్చి చూసుకొనే అవకాశం ఉంది.
మొదటి కవిత నది..
తనలో తాను గుసగుసలాడుతూ
నది ప్రవహిస్తున్నది
చిన్న చిన్న కోరికలు తన హృదయంలో
కదలాడుతున్నాయి
జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ కదిలిన నది
వంతెన మీద నుంచి ప్రవహించాలనుకుంటోంది.
ఇది మొదటి కవిత.. రచయితకు ప్రకృతి మీద ఎంత ప్రేముందో ఈ కవితతో మనకు అర్థమవుతుంది. ఓ నది పడే ఆవేదనను అద్భుతంగా అక్షరీకరించింది ఈ కవిత. ఇందులోని పంక్తులు చదువుతుంటే అచ్చం ఓ తెలుగు కవితను చదువుతున్నట్టే ఉంటుంది తప్ప.. అనువాదమనిపించదు.
గుల్జార్ ప్రకృతి కవి.. నది మీద, మబ్బుల మీద, శిశిరంలో రాలే ఆకుల మీదే ఆయన దృష్టంతా ఉంది. ఆ ఆకుపచ్చ కవితలన్నీ నిజంగానే నదికి మనసుంటే.. మబ్బులకు గొంతు ఉంటే అవి ఇలాగే పలవరిస్తాయేమో అనిపిస్తుంది. శిశిరంలో రాలే ఆకులు .. కొమ్మలకు ఏం చెబుతాయన్నది అచ్చంగా మానవ సంబంధాలను తలపిస్తాయి. చెట్టు మీద కొమ్మ మీద రాలే ఆకు మీద కవికి ఉన్న దృష్టికి నిజంగా అబ్బుర పడతాం..
వీధి మలుపులో వృక్షం అన్న కవిత నిజంగా గుండెలను బరువెక్కిస్తుంది. చెట్టుకు మనిషికి విడదీయలేని సంబంధం ఉంటుంది. తనకు ఎంతో అనుబంధం ఉన్న ఓ భారీ వృక్షాన్ని మున్సిపల్ అధికారులు తన కండ్ల ముందే కూలదోస్తుంటే.. ఏ మనిషికైనా హృదయం బరువెక్కకుండా ఉంటుందా? ఇక కవి అయితే ఆ బాధను అక్షరీకరించకుండా ఉంటాడా.. అలా పుట్టిందే ఈ కవిత..
సూర్యుడితో ఓ చెట్టు చెప్పుకొనే వేదనే సూర్యుడి వేళ్లు కవిత. మనుషులు ఎంత కఠినంగా ఉంటారో.. చెట్ల మీద తమ పేర్లను ఎలా చెక్కుతారో ఓ చెట్టు పడే ఆవేదన ఈ కవిత..
‘మూసేస్తున్న బావి’ ఈ కవిత పల్లెల్లో జరుగుతోన్న విధ్వంసానికి అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా పల్లె టూర్లలో చేదుడు బావులు, ఊట బావులు ప్రజల దాహార్తి తీర్చాయి. అవసరాలు కూడా. కానీ నేటి వాటి ఉనికి లేదు. బావుల జాడ కనిపించడం లేదు. కొన్నివిధ్వంసమయ్యాయి. మరెన్నో కనిపించకుండా పోయాయి. ఆ మూత పడ్డ బావులపై కవి వేదన ఎంతో అర్థవంతంగా ఉంది. ఆలోచనాత్మకండా కూడా..
మొత్తంగా అన్ని కవితలు కదిలించేవే. చెట్టు, పుట్ట, నది, మబ్బు, వర్షం, ఆకాశం ఇలా పుస్తకమంతా ప్రకృతి పలవరింతే.. ప్రకృతి మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తుంటే.. మనిషి మాత్రం దాన్ని మరిచిపోయి పగబట్టినట్టు ప్రకృతిని చెరబడుతున్నాడు. చెట్లను ధ్వంసం చేస్తున్నాడు. నదులను చెరబడుతున్నాడు. వాటి ఉనికి ధ్వంసం చేస్తున్నాడు. రచయిత ఇదే ఆవేదనను వ్యక్తం చేశాడు. రచయిత భావాలను అనువాదకులు వారాల ఆనంద్ అద్భుతంగా అక్షరీకరించారు. 155 పేజీలున్న ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే.
ప్రతులకు సంప్రదించండి
9440501281
– అరవింద్ రెడ్డి మర్యాద, 8179389805
పునాదులు గట్టివి
+++++ -వారాల ఆనంద్
పునాదులు గట్టివి
+++++ -వారాల ఆనంద్
‘స్వేచ్ఛ’ నా పేరు
నా పేరంటే నాకు చచ్చేంత ఇష్టం
నేనూ నా పేరూ వేరు కాదు
నేనూ సేచ్ఛావేరు కాదు
ఒకరిని పిలిస్తే మరొకరం పలుకుతాం
ఒక్కో సారి ఇద్దరమూ పలుకుతాం
నా ఊపిరి నిశ్చలం కాదు
నా ఉఛ్వాస నిశ్వాస చలనశీలం
ఒకటి వెంట మరొకటి
‘స్వాతంత్య్రం’ నా నివాసం
బ్యాంకు లాకర్ కాదది
రక్తమాంసాలతో నిర్మించుకున్న ఇల్లు
ఎవరి నమ్మకం వారిది
ఎవరి ప్రేమలు వాళ్ళవి
ఎవరి భోజనం వారిది
చాచా చాచీ అక్కా బావా
దాదా దాదీ బేటా బేటీ
అత్తా మామా
అంతా బాగుంటాం
అప్పుడప్పుడూ ఇంటి కప్పుకు
కన్నాలు పడుతాయి
ఎప్పటికప్పుడు ఆ కన్నాల్ని మూసేస్తాం
పెంకుల్ని సర్దిస్తాం
పందికొక్కులు దూరినప్పుడే
కంగారు పడుతాం
అయినా ధోకా లేదు
మా ఇంటి పునాదులు గట్టివి
వెయ్యేళ్ళయినా స్నేహామృతం
కురుస్తూనే ఉంటుంది.
#9440501281
నది ++++ వారాల ఆనంద్
నది
++++ వారాల ఆనంద్
నది
ఎప్పుడూ మౌనంగా వుండదు
గలగల మంటూ వుంటుంది
పగలు సూర్యుడూ
రాత్రి చుక్కలూ చంద్రుడూ
నది తో ముచ్చట్లు పెడుతూ వుంటాయి
నది
ఎప్పుడూ నిలకడగా వుండదు
నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది
పల్లం జారుడు బండలా
తోసుకెళ్తూ వుంటుంది
చల్లగాలి నది వీపుమీద చరుస్తూ
ముందుకు తోస్తుంది
నిద్ర ఎరుగని నది
తీరాలను ఒరుసుకుంటూ
రాళ్ళనీ రప్పల్నీ వంకల్నీ దొంకల్నీ
దాటుకుంటూ
అలసటనెప్పుడో మర్చిపోయింది
తీరికే లేని నది
తనలో తాను కలవరిస్తూ పలవరిస్తూ
ప్రేమించిన సముద్రుణ్ణి చేరేందుకు
పరుగులు తీస్తూవుంది
కాలం తో పోటీగా నది
కదం తొక్కుతూనే వుంది
******** 9440501281
8 MAY 2023
See less