VARALA PROFILE

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

Posted on Updated on

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)

కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.

మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

పుస్తకం లాంటి మనిషి

Posted on

పుస్తకం లాంటి మనిషి  

++++++++++++ వారాల ఆనంద్

దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ

వాటి మధ్యే బతికానేమో

పుస్తకాల్ని

దూరంగా అద్దాల బీరువాలో చూసినా

దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా

ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది

చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది

మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా

పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది

అప్పుడు

కొన్నింటితో స్నేహం కుదుర్తుంది

కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను

కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే

మరికొన్ని నులిపెడతాయి

నేను కరిగి నీరయిపోతాను

కొన్ని నవ్విస్తే,

మరికొన్ని ఏడిపిస్తాయి

కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే

ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి

నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను

మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి

నేను వాటిలో లీనమవుతాను

అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా

నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం

పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..

*****************

24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY

పెద్ద సమయం పట్టదు++++++ వారాల ఆనంద్

Posted on

FRIENDS,READ MY POEM PUBLISHED IN NAVATELANGANA TODAY,Tq

పెద్ద సమయం పట్టదు

+++++++++++++++ వారాల ఆనంద్

అంతా కనిపిస్తూనే వుంటారు

అందరూ వినిపిస్తూనే వుంటారు

కానీ

కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా   

కళ్ళముందే మొలుస్తున్న గోడలు

ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు

భ్రమాలోకపు గడీలు

తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు

చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు

ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది

నేనే

ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను

ప్రవాహంలా పరుగులుపెట్టాను

ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు

అలసట వొచ్చినప్పుడల్లా

‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని

పైత్యాన్ని వదిలించుకున్నాను

ఇవ్వాళ

ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి  

కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను

బంధాలకు కొత్త రూపునూ

అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను

మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ

అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ 

మనుషుల సమూహంలోకి

మమతల జాతరలోకి

నడక సాగిస్తున్నాను  

అస్తమయం తర్వాత

సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు

కొంచెం ఓపికుండాలి

ఒకింత విశ్వాసముండాలి

ఎంతయినా అందరమూ మనుషులమే కదా!

****************** 9440501281

15 APRIL 2024

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

యాదోంకీ బారాత్ 2- సిరీస్- నంబర్ 12

Posted on

 యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 12

++++++++++++++++ వారాల ఆనంద్

మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే  ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్  అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు.

“బతుకు ప్రయాణంలో

ఎందరో స్నేహితులు

ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి పోయారు”  

+++

నా ఉద్యోగ జీవితం 2016 లో ముగింపునకు వచ్చింది. 1980 జనవరి నుంచి కాలేజీ గ్రంధాలయ అధికారిగా నా ఉద్యోగజీవితం ఒకింత సాఫీగానే  సాగింది. ఆ లైబ్రెరియన్ ఉద్యోగంలో ఏమి మజా వుంటుంది.                 

చేసేదీ ఏముండదు అని అన్నవాళ్లూ, అనుకున్నవాళ్లూ వున్నారు. లైబ్రెరియన్ అంటే నిద్రపోయేవాడు అని అనుకున్నవాళ్లూ వున్నారు. విద్యాసంవత్సరం మొదట్లో ఏవో కొన్ని పుస్తకాలు పంచి ఏడాది చివర తిరిగి తీసుకోవడమే లైబ్రెరియన్ చేసేపని అని ఎగతాళి చేసిన వాళ్ళూ వున్నారు.                                                 కానీ  నేను మాత్రం నా ఉద్యోగాన్ని కొంత ఆసక్తిగానూ ఎంతో ఉత్సాహంగానూ చేశాను. విద్యార్థులూ పుస్తకాలూ అధ్యాపకులూ వీరందరి నడుమా బుక్స్ ఇవ్వడం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా సాహితీ సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చైతన్యవంతంగానే గడిపాను. ముఖ్యంగా ఎస్.ఆర్.ఆర్.కాలేజీలోకి వచ్చాక నాకు గొప్ప మైదానమే దొరికింది. కేవలం పుస్తకాలూ విద్యార్థులే కాకుండా వైవిధ్యంగా పనిచేసే గొప్ప అవకాశం నాకా కాలేజీ ఇచ్చింది. దాంతో నేను రంగులరాట్నంలా  గిర గిరా తిరిగాను.          

‘రంగుల రాట్నం’

+++++

సూర్యచంద్రులు

కళ్లు మూస్తూ తెరుస్తూనే వున్నారు

నేనేమో కాలాన్ని భుజానేసుకుని

‘రంగులరాట్నం’లా గిర గిరా తిరుగుతున్నా

++++++++++++ అని  రాసుకునే అవకాశం వచ్చింది.

అయితే ముగింపు సంవత్సరానికి వచ్చేసరికి ముగించాల్సిన పనులు, అప్పగించాల్సిన బాధ్యతలు అనేకం ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. అప్పటికే  రెండేళ్లుగా అనారోగ్యం, మందుల నడుమ చక్కర్లు కొడుతున్నవాన్ని. ఆ క్రమంలో నా సహోద్యోగులూ సహచరులూ స్నేహితులూ అందించిన సహకారం ఎనలేనిది.అప్పుడు నా చార్జ్ లో చాలా అంశాలున్నాయి. కేవలం లైబ్రరీ  విషయానికే వస్తే ప్రధాన గ్రంధాలయంలోని వేలాది పుస్తకాలు, యుజీసీ విభాగం, బుక్  బాంక్, రెఫెరెన్స్ విభాగం, శాతవాహన విభాగం పేర నేను సేకరించిన కరీంనగర్ జిల్లా కవులూ రచయితల పుస్తకాలు, నేనే మొదలెట్టి నడిపిన జర్నలిజం కోర్సు, ఫిల్మ్ మేకింగ్ కోర్సు, మిత్రుడు బయోటెక్నాలజీ శాఖ రీడర్  డాక్టర్ ఎస్.మాధవ రావు గారు ప్రిన్సిపాల్ గా బదిలీ అయి వెళుతూ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ  స్టడీ సెంటర్ బాధ్యతలు అప్పగించగా వున్న బాధ్యత, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్ విభాగం ఇట్లా అనేక బాధ్యతల్ని వివిధ అధ్యాపకులకు లెక్కలు చూపించి మరీ అప్పగించాలి. అదంతా పెద్ద పని. నాకు మొదటి నుంచీ ఎంతయినా పని చేయడం ఇష్టమే కానీ చార్జ్ అప్పగించడమంటేనే ఎక్కడ్లేని బద్దకం. అదో పెద్ద రోదన. కానీ తప్పదు. ఈ  చార్జ్ ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ 2016 లో ముగిసే జర్నలిజం కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ పూర్తి చేయాలి. అప్పుడు ప్రిన్సిపాల్ శ్రీ నితిన్ సంపూర్ణంగా సహకరించాడు. ఆరు మాసాల జర్నలిజం కోర్సు కేవలం నా చొరవతోటే మొదలయింది. పదమూడు బ్యాచులు అత్యంత విజయవంతంగా నడిచాయి.అప్పటి విద్యార్థులు అనేకమంది ఇవ్వాళ  ప్రధాన స్రవంతి జర్నలిజంలో వున్నారు. 13వ బ్యాచ్ ముగింపు సభ నా సర్వీసులో చివరిది కనుక ఎంతో ఉత్సాహంగా ఆడంబరంగా జరిగింది  ఆనాటి సభలో నితిన్, లెక్చరర్ మిత్రులు శ్రీయుతులు సుబ్బరామిరెడ్డి, డాక్టర్ ఎస్.మనోహరాచారి,  వై.సత్యనారాయణ, సత్యప్రకాశ్ లు ఎంతో ఆసక్తిగా పాలు పంచుకున్నారు. తర్వాత జర్నలిజం కోర్సు పట్ల ఎంతో ఆసక్తిగా పనిచేసిన సుబ్బరామి రెడ్డి గారికి కోర్సు చార్జ్    అప్పగించాను.ఇక ఇగ్నో స్టడీ సెంటర్ ను యూనివర్సిటీ  ఎత్తేయడంతో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కంప్యూటర్స్ మొదలయినవన్నీ యూనివర్సిటీ కి పంపించేశాను.  

కాలేజీలో ఇదంతా ఇట్లా జరుగుతుండగానే ప్రముఖ కవి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తమ తండ్రి గారు కీ.శే.గండ్ర  హనుమంత రావు గారు పేరుమీద ఇచ్చే ‘గండ్ర హనుమంత రావు స్మారక సాహితీ పురస్కారం                                                                                        ’ నాకు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కేంద్ర  గ్రంధాలయంలో జరిగిన సభకు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి  శ్రీనివాస్, వఝల శివకుమార్ లు అతిథులుగా హాజరయ్యారు. ఆ పురస్కారం నాకో గొప్ప గుర్తింపుగా ఫీలయ్యాను.

ఇదిట్లా వుండగానే జగిత్యాల లో సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ గుండేటి రాజు ఫోన్ చేశాడు. తమ వూరివాడు గొప్ప కవీ ఫోటోగ్రాఫర్ అలిశెట్టి ప్రభాకర్ పేరున రాష్ట్ర స్థాయి పురస్కారం             ఇవ్వాలనుకుంటున్నాం, ఆ మొదటి అవార్డును నాకు ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు.  అలిశెట్టి ప్రభాకర్   పెరు వినగానే ఎన్నెన్ని జ్నాపకాలు.ఎన్నెన్ని అనుభూతులు. అలిశెట్టిని మొట్టమొదట కలిసింది జగిత్యాల లోనే. నేనూ మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు ఇద్దరమూ ప్రత్యేకంగా వచ్చి కలిశాం. తర్వాత కలిసి లయ కవితా సంకలనం వేశాం,కరీంనగర్లో శిల్పి స్టూడియో, హైదరాబాద్ లో చిత్రలేఖ స్టూడియో ఇట్లా ఒకటనేమిటి ఎన్నో ఏళ్ల అనుబంధం.నేను ‘నవ్యచిత్ర వైతాళికులు’ సినిమా వ్యాసాలు రాయడంలోనూ అవి ‘పల్లకి’ పత్రికలో  రావడంలోనూ అలిశెట్టి సాహచర్యం ఎంతగానో తోడ్పడింది.నువ్వు కవిత్వం రాయడం లేదు కదా నీ కిష్టమయిన సమాంతర సినిమాల మీద వ్యాసాలు రాయి అని నన్ను సిద్ధం చేసింది ఒకరకంగా అలిశెట్టి ప్రభాకరే. నాకు అప్పటికే ఏమయినా రాయాలి అన్న కోరిక వున్నప్పటికీ రాసేలా చేసింది ప్రభాకరే. అలాంటి అలిశెట్టి పేరుమీద ఇవ్వ తలపెట్టిన అవార్డు నాకు ఇస్తాననడం, అదీ జగిత్యాలలో కావడంతో ఇష్టంగా  అంగీకరించాను. నేనూ ఇందిరా బయలుదేరాం.  ఏం.ఎల్.ఏ.శ్రీ టి.జీవన్ రెడ్డి గుండేటి రాజు తదితరులు పాల్గొన్నారు. సభ ఎంతో అభిమానంగా జరిగింది. ఆ సభకు నా పాత మిత్రుడు వెంకటేశ్వర్ రావు కూడా రావడం చాలా సంతోషాన్నిచ్చింది. సభ తర్వాత వెంకటేష్  ఇంటికి వెళ్ళాం.అట్లా ఆనాటి జగిత్యాల సభ పూర్హ్తి అయింది. ఇక  కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లో అప్పుడే ఇరానియన్ ఫిల్మ్ ఫెల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. నేనూ నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడాము. నేను ఇరానియన్ సినిమా అక్కడి దర్శకులు వాళ్ళ కళాత్మకత, ముఖ్యంగా పిల్లలకోసం వాళ్ళ సినిమాలు తదితర అంశాల మీద మాట్లాడాను. ఆ ఫెస్టివల్ లో చాలా మంచి పాకేజ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి. ఫెడరేషన్ వాళ్ళు పంపిణీ చేశారు.

ఇక ఫిల్మ్ భవన్  లోనే ప్రముఖ జర్నలిస్టు హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కమిటీ మెంబర్ కంబాలపల్లి కృష్ణ రాసిన పుస్తక పరిచయ సభ అనిర్వహించారు.అందులో కూడా పుస్తకం గురించి  వివరంగా మాట్లాడాను. 

ఇక ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో నా ఉద్యోగం రోజులు దగ్గర పడ్డాయి.అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.ఇన్ని దశాబ్దాలుగా నేను కొన్నవి, సాహితీ మిత్రులు ఇచ్చినవి, నేను సేకరించినవి 2000 పుస్తకాల్ని కాలేజీ  గ్రంధాలయానికి  ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్సిపాల్ నితిన్ కి చెబితే ఫ్రీగా ఇస్తానంటే వద్దంటానా అన్నాడు.వాటన్నింటి లిస్టు రాసి ఒక పూట కార్యక్రమం ఏర్పాటు చేశాను. కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్ బి.రాంచందర్ రావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం.ఆయన ఎంతో ఆదారంగా వచ్చారు.ప్రత్యేక విభాగంలో ఆ పుస్తకాల్ని వుంచుతామని నితిన్ ప్రకటించారు. దాదాపు లక్ష రూపాయల విలువ  కలిగిన ఆ పుస్తకాల ప్రదానం చాలా  తృప్తిని ఇచ్చింది. ఇక ఉద్యోగ విరమణ తేదీకి  ముందే లైబ్రరీ చార్జ్ కూడా ఎవరికయినా ఇవ్వాలన్నారు.నితిన్ ఉర్దూ మేడమ్ ఇస్రత్  సుల్తానా  గారికి ఆ బాధ్యత  అప్పగించారు.ఏవో కొన్ని చూసి పూర్తి స్థాయి గ్రంధాలయ అధికారి రాగానే పూర్తి చేస్తామనే హామీ మీద ఆ తతంగం ముగిసింది. కొంత డబ్బు డిపాజిట్ కూడా చేశాను.

ఇక మా కాలేజీలో అధ్యాపకుల పదవీ విరమణ సభకు కొన్ని పద్దతులు ఏర్పాటయి వున్నాయి. కామర్స్ అధ్యాపకుడు ఆనంద రావు, ప్రిన్సిపాల్ మురలి, యాద కిషన్, పీడీ లక్ష్మీరాజం లాంటి వాళ్ళు ఆ ఆనవాయితీని కొనసాగించారు. అవేమిటంటే కాలేజీలో పెద్ద విందు ఏర్పాటు చేయడం,స్టాఫ్ క్లబ్ సన్మాన విరమణ సభ నిర్వహించడం.కానీ   నేను మా ఇంట్లో వీడ్కోలు విందు ఏర్పాటు చేసి అందరినీ  పిలిచాను. దాదాపు అందరూ వచ్చారు. స్టాఫ్ క్లబ్ నిర్వహణలో సింపుల్ గా జరగాలని కోరుకున్నాను.అట్లే జరిగింది. విరమణ సభ అనగానే అందరూ ఇంద్రుడూ చంద్రుడూ అని పొగడడం అదీ  ఎందుకో నాకిష్టం కాలేదు.అయినా సభలో నా అభీష్టం మేరకు మిత్రులంతా ఆదరంగా క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత ఫిల్మ్ భవన్ లో సాహితీ  గౌతమి ఫిల్మ్ సొసైటీ తదితర సంస్థల  నిర్వహణలో కూడా సభ పెట్టారు.

అట్లా  నా 36ఏళ్ల  ఉద్యోగ జీవితం విజయవంతంగా ముగిసింది.

మిగతా వివరాలతో మళ్ళీవారం కలుస్తాను.

సెలవు                                                                                                                                                                           -వారాల ఆనంద్

14 ఏప్రిల్ 2024                                                                                 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

Posted on

ఏమి జంతువది
+++++++++++++++

ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు

దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది

ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు

ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు

ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది

ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది

దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది

ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు

ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ

దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ

అందరూ దాని కోసం ప్రార్థించండి

ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్


YADONKI BARATH 2-series,Bo-11

Posted on

యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 11 

++++++++++++++++ వారాల ఆనంద్

జీవితం సరళరేఖ కాదు. తిన్నగా సాగడానికి. జీవితం నునుపయిన రహదారీ కాదు సాఫీగా నడవడానికి.  అనేక వంకరలు, వంపులు మలుపులు అనివార్యం. వాటన్నింటినీ దాటుకుంటూ మెలకువతో ముందుకు పయనించడమే జీవితం.

ఆ ప్రయాణానికి “ఎంట్రీ-ఎగ్జిట్” రెండూ వుంటాయి. మాతృగర్భంలోంచి మొదలయిన బతుకు ప్రవేశం(ఎంట్రీ) ఉత్సాహంగా ఆశలతో కలల్తో షురూ అవుతుంది. కానీ నిష్క్రమణే (ఎగ్జిట్) ఎవరిది ఎట్లా వుంటుందో ఏమిటో ఎవరమూ ఊహించలేం. ఎంట్రీ ఎగ్జిట్ లు రెండూ బాగుండాలనుకుంటాం. ఎవరమయినా ఎగ్జిట్ సంతోషంగా వుండాలనీ ఆశిస్తాం.

అది జీవితానికే కాదు బతుకులో ఏ ఉద్యోగానికయినా, వృత్తికయినా, మరే పనికయినా అంతే. ఎంట్రీ ఎగ్జిట్ అత్యంత ప్రధానమయినవి.

 నా ఉద్యోగ జీవితం ఎంట్రీ కొంత ఇష్టాయిష్టాల మధ్య 1980లో మొదలయింది. అనేక మలుపులతో 36 ఏళ్ళు గడిచాక 2016లో ఉద్యోగవిరమణ ఎగ్జిట్ సంవత్సరంలోకి చేరాను. అప్పటికి ఆ ప్రయాణం వివిధ కాలేజీల్లో అనేక మలుపులతో సాగిగింది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోకి 2000 సంవత్సరంలో ఎంట్రీ జరిగి పదహారేళ్లు కొనసాగింది. అదే కాలేజీలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థిగా ఎంతో ఉద్వేగంగా ఆ ప్రయాణం మొదలయింది. గ్రంధాలయ నూతన భవన నిర్మాణంలోనూ, అభివృద్దిలోనూ, విద్యార్థుల బహుముఖీన ఎదుగుదలకూ కొంత కృషి చేశాననే తృప్తి తోనే కాలేజీ ప్రయాణం సాగింది. మొత్తంగా ఇటు కాలేజీలో అటు బయటా సృజనాత్మక, సామాజిక రంగాల్లో పని చేయడానికి కాలేజీ, కాలేజీ మిత్రులూ నా వెన్నంటి వున్నారు. చేయిపట్టుకు  ముందుకు నడిపించారు.    

ఆ నడకలో ఓ ‘మెరుపు’ మెరిసింది. నాలోనూ మెరిసింది. ఉత్తర తెలంగాణా సాహిత్య ప్రపంచంలోనూ మెరిసింది. ఒక రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి, కవి మిత్రుడు ఆచార్య జయధీర్ తిరుమల రావు, నిజాం వెంకటేశంలు మేమంతా వస్తున్నాము. కరీంనగర్ లో కవులు రచయితలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నారు. అది నాతో ఎందుకన్నారో నాకు తెలీదు. శాస్త్రి గారికి నాకు అంతకు ముందు పరిచయమే లేదు. నా పేరు ఎవరు చెప్పారబ్బా అని ఆలోచించాను. బహుశా జింబో అని వుంటాడు. ఏది ఎట్లా అయితేనేం. మా ఫిల్మ్ భవన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. సాహితీ మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. ఎంతమంది స్పందిస్తారో తెలీదు. ఎంతమంది వస్తారో ఊహించలేను. చూద్దాం అనుకున్నాను. సమావేశం సమయానికల్లా అనేక మంది  పెద్దలు, కవులు రచయితలు వచ్చారు. సమావేశంలో ఎం.వీ.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ ఆంధ్రభూమి జిల్లా ఎడిషన్లో వారం వారం రెండు పేజీలు సాహిత్యానికి కేటాయిస్తున్నామన్నారు. అంతే కాదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సాహిత్యకారుల రచనలకు అందులో చోటు ఇవ్వాలనుకుంటున్నా మన్నారు. ఏమయినా సూచనలు ఇవ్వమన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణ రావుతో సహా పలువురు మాట్లాడారు. జయధీర్ తిరుమల్ రావు, నిజాం వెంకటేశం గార్లు కూడా మాట్లాడారు. చివరన ఈ సాహిత్య పేజీకి ‘మెరుపు’ అని పేరు పెడుతున్నామన్నారు. ఆ పేజీకి వారాల ఆనంద్ బాధ్యుడుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. నాకు కొంత ఆశ్చర్యం, మరికొంత ఆనందం. బాధ్యత తీసుకుంటారుగా అన్నారు శాస్త్రి గారు నేను సరే నన్నారు. దానికి సంభందించిన వివరాలు మాట్లాడదామన్నారు. సాహితీ మిత్రులంతా ఉత్తర తెలంగాణా సాహిత్యానికి ఒక వేదిక లభించినందుకు సంతోపడ్డారు. నాకయితే ఉత్సాహంగానే వుంది. అప్పుడు కరీంనగర్లో ఆంధ్రభూమి ఆఫీసు మా కాలేజీ గేటుకి సరిగ్గా ముందే వుంది. అంతేకాదు దాన్లో డీటీపీ ఆపరేటర్ చంద్రమౌళి గతంలో మా తో ఈనాడు లో పనిచేస్నవాడే. అంతా ఒకే అనుకున్నాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అంటూ హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లు బయలుదేరారు. ఆంధ్రభూమిలో ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా ఉత్తర తెలంగాణ జిల్లాల సాహిత్యకారులను సంప్రదించాను. అంతా ఉత్సాహం చూపించారు. అనేక వారాలు విజయవంతంగా సాగింది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది. దాంతో నేను ఉత్తర తెలంగాణ జిల్లాల కవులు రచయితల ఇంటర్వ్యూ లు ప్లాన్ చేశాను. అందరినీ సంప్రదించి ప్రశ్నలు పంపాను.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం వారం వేశాను. కవితలు,కథలు, సమీక్షలు ఓహ్ అన్ని కాలమ్స్ కొనసాగాయి. ఆ ఇంటర్వ్యూ లను “మెరుపు” పేర పుస్తకంగా తెచ్చాను. ఆ ఇంటర్వ్యూల్లో జింబో, దర్భశయనం, నలిమెల భాస్కర్, చొప్పకట్ల చంద్రమౌళి, అంపశయ్య నవీన్, తుమ్మేటి, వఝల శివకుమార్ తదితర అనేక మందితో చేసిన ‘ముఖా ముఖి’ ఇంటర్వ్యూలు ప్రచురించాను. దానికి 23 ఏప్రిల్ 2016 రోజున ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ. సాహితీ గౌతమి నిర్వహణ. ఆవిష్కర్తగా కరీంనగర్ లో కలెక్టర్ గా పనిచేసి ఫిల్మ్ భవన్ నిర్మాణం లోనూ, కాలేజీ గ్రంధాలయ భావన నిర్మాణంలోనూ నాకు ఎంతగానో సహకరించిన మంచి మనిషి శ్రీ సి.పార్థసారధి గారిని పిలిచాను. ఆయన ఎంతో ఉత్సాహంగా రావడానికి అంగీకరించాడు. వచ్చారు కూడా. కె.ఎస్. అనంతాచార్య అధ్యక్షతన సభ చాలా ఆసక్తిగా ఆనందంగా జరిగింది. నాకు మెరుపు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన పలువురు కవులు రచయితలు పాల్గొన్నారు. కవి మిత్రులు శ్రీ వఝల శివకుమార్, జింబో, నలిమెల భాస్కర్, దాస్యం సేనాధిపతి వేదిక మీద వుండి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘మెరుపు’ ఆవశ్యకతను ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలో సాహితీ వేత్తలు తెలంగాణ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు అనే విషయాల్ని ఆనాటి సభ విస్తృతంగా చర్చింది. సభలో శ్రీ నమిలకొండ హరిప్రసాద్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, పీ.ఎస్., తోట రమేశ్, మచ్చ హరిదాస్, డాక్టర్ రామకృష్ణ,. అన్నవరం దేవేందర్, ఎం.సరస్వతి, నవీన, ఇందిర, రేల తదితరులు పాల్గొన్నారు. పార్థసారధి గారు సాహితీ వేత్తలందరికి మెరుపు పుస్తకాన్ని అందజేశారు.

ఇదంతా ఇట్లా వుండగా అంతకు ముందే నా ‘మనిషి లోపల’ కవితా సంకలనం లోని కవితల్ని మిత్రురాలు బొడ్ల అనురాధ ఇంగ్లీష్ లోకి అనువదించడం ఆరంభించారు. అనురాధ గారు మాకు అత్యంత ఆత్మీయ స్నేహితులు. కరీంనగర్ లో ప్రముఖ విద్యావేత్త కీ.శే.నాగభూషణం గారు మొట్టమొదటి ట్యుటోరియల్ ఏర్పాటు చేసిన విద్యావేత్త. 70ల్లో ఎస్వీటీసీ నోట్స్ అంటే కరీంనగర్ విద్యార్థుల్లో గొప్ప ఆదరణ. వారి కూతురు అనురాధ. తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హై స్కూలు చదువు తర్వాత వివాహమై ఇద్దరు పిల్లల తర్వాత వూహించని ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాంతో జీవితం ముగిసిందని ఆమె అనుకోలేదు. పోరాటమే తన జీవితం అనుకుంది. కాలానికి ఎదురొడ్డింది. తన కాళ్లమీద తాను నిలబడి ఉన్నత చదువులు కొనసాగించింది. ఎదురుదెబ్బలు తనకు ఎలాంటి ఆటంకం కావని ఆమె నిరూపించారు. కొంత కాలం మాల్దీవ్స్ కు కూడా వెళ్ళి అక్కడ పనిచేశారు. ఇంగ్లీష్ లో మంచి పట్టు సాధించారు. తనతో మాకున్న దశాబ్దాల స్నేహం, అభిమానంవల్ల ఆమె నా కవితల్ని ఇష్టంగా చదివింది. తనకు నచ్చిన ఆ కవితల్నిఅందంగా అర్థవంతంగా ఇంగ్లీషులోకి అనువదించే పని పెట్టుకుంది. చాలా గొప్ప అనువాదం చేశారామె. ఆ అనువాదాలతో ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ పేర పుస్తకం తెచ్చాను. పుస్తకం ఆవిష్కరణల విషయంలో మిత్రుడు ఎన్.బి.టి. తెలుగు సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ సహకరించారు. ఆ సమయంలో తాను హైదరబాద్ లో లేకున్నా ఉస్మానియా కాంపస్లో వున్న తమ ఆఫీసులోని హాలులో ఆవిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణకు ఆత్మీయ మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు ని పిలిచాను. ఆయనకుతోడు డాక్టర్ నందిని సిద్దారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య తదితరులు హాజరయ్యారు. కవిత్వం గురించి సిద్దారెడ్డి, అనువాదం గురించి దర్భశయనం మాట్లాడారు. అనువాదంలో అనురాధ చూపించిన పరిపక్వతని ఆయన సోధాహరణంగా చెప్పారు. ఇంగ్లీష్ పుస్తకానికి న్యాయం చేయడానికి దర్భశయనం సరయిన వాడని సిధారెడ్డి అన్నారు. ఆ తర్వాత ‘సూర్య’ దిన పత్రికలో మిత్రుడు టీవీ9 వొడ్నాల చంద్రమౌళి మంచి సమీక్ష చేశారు. 1990ల నుంచి పరిచయమూ స్నేహమూ వున్న చంద్రమౌళి చాలా సంవత్సరాలు ఈనాడులో సబ్ ఎడిటర్ గా పని చేసారు. వయసులో నాకంటే చాలా చిన్న వాడే అయినా ఇద్దరి నడుమా దగ్గరి స్నేహం అల్లుకుపోయింది. భావుకుడు ప్రగతిశీలవాది అయిన చంద్రమౌళి సిగ్నేచర్ ఆఫ్ లవ్ గురించి రాస్తూ ‘సమాజం పైన కవి వారాల ఆనంద్ చేసిన ప్రేమ సంతకమిది. మనసు నిండా ప్రేమను నింపుకున్న కవి తన కవిత్వం నిండా ప్రేమను నింపడం సహజమే. ఆ ప్రేమ మనుషులపట్ల, సమాజం పట్ల,మనుషుల మనుగడకు ఆధారభూతమయిన భూమి గాలి నీరు పట్ల కనిపిస్తాయి. వారాల ఆనంద్ జీవితం నిండా కవిత్వం కనిపిస్తుంది’ అని రాశాడు. రోజూ కలిస్తేనే స్నేహాలు నిలుస్తాయా… ఎప్పుడో ఒకసారి కలిసే చంద్రమౌళి తో స్నేహం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగడం లో ఆయన చూపించే ఆప్యాయత ప్రధాన కారణం. ఈనాడు తర్వాత తాను ఎలెక్ట్రానిక్ మీడియాకు వెళ్ళాడు.

ఇక సమీక్షలకు పంపించే క్రమంలో సిగ్నేచర్ ఆఫ్ లవ్ ని ఇండియన్ లిటరేచర్ కు కూడా పంపాను. అక్కడ ఆ పుస్తకాన్ని చూసిన తమిళ కవి, ప్రముఖ అనువాదకుడు చంద్ర మనోహరన్ ఒకరోజు ఫోన్ చేసారు. మీ పుస్తకాన్ని తమిళం లోకి తేవచ్చా అని అడిగాడు. నేను వెంటనే చాలా సంతోషం అన్నాను. తానే దాన్ని తమిళం లోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడెమికి అనేక అనువాదాలు చేసిన చంద్ర మనోహరన్ స్వచ్చందంగా ‘అన్బిన్ కైచాంది’ పేర వెలువరించారు.  ఆ అనువాద సంకలనాన్ని తమిళనాడుకు చెందిన ‘ఆర్ట్ లిటరరీ క్లబ్’ ఆవిష్కరించింది. ఆనాటి కార్యక్రమానికి నేను వెల్ల లేదు కానీ ఆ సభలో సంస్థ కార్యదర్శి బి. ఆర్. నటరాజన్,డాక్టర్ సురేష్,డాక్టర్ మీనా సుందర్,డైరెక్టర్ మని, అన్వాదకుడు చంద్రమనోహరన్ పాల్గొన్నారు. ముక్కూ మొహం తెలీని  నేను రాసిన నా కవిత్వాన్ని తమిళంలోకి అనువదించి ప్రచురించిన చంద్ర మనోహరన్ కి ఎంతని ఏమని కృతజ్ఞతలు చెప్పను. ధన్యవాదాలు అంటూ నమస్కరించడం తప్ప.

2016 నాటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాను..

+++++

వారాల ఆనంద్

24 మార్చ్ 2024   

CHUKKALA MUGGU ‘POEM’

Posted on

Friends, pl click the link below to read my poem published today in sanchika online magazine, thanks to the editor- anand Anand Varala
https://sanchika.com/chukkala-muggula-va-poem/

యాదోంకీ బారాత్ సిరీస్-2 నంబర్-10

Posted on Updated on

యాదోంకీ బారాత్

సిరీస్-2 నంబర్-10

+++++++++++ వారాల ఆనంద్

ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/

మంచిదేనేమో…..

మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు

ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు

ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు

ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే

ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది 

తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది

…….

బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి మలుపులోకి ఒకింత ఉత్సాహంగానే తిరిగాను. సమయం లేదు అన్న భావనేదో లోన ఎక్కడో నాకు తెలీకుండానే పని చేసిందేమో. మనిషిగా భౌతికంగా అనేక పరిమితులకు లోబడినప్పటికీ చిత్రంగా నా సృజనాత్మక పరుగు వేగం పెరిగింది. రాతలు, ప్రచురణలు, కాలేజీలో ఆక్టివిటీస్ కొనసాగుతూనే వచ్చాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నారై ల సహకారంతో ఏర్పాటు చేసిన ‘ప్రతిభాపురస్కారాల ప్రదానం’ మా స్టాఫ్ సహకారంతో కొనసాగించాము. ఒక కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యుడు శ్రీ గంగుల కమలాకర్ అతిథిగా వచ్చారు. అప్పటికి ప్రిన్సిపాళ్లుగా డాక్టర్ మురలి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి లు ఉద్యోగ విరమణ చేశారు. మిత్రుడు భౌతిక శాస్త్ర విభాగం ఇంచార్జ్ శ్రీ పి.నితిన్ ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు. నితిన్ నేనూ గతంలో ఒకసారి హైదరబాద్ లోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో మూడు వారాల పాటు రిఫ్రెషర్ కోర్సు చేశాము. రూమ్ మేట్స్ గా వున్నాం. ఆయన అత్యంత నిబద్దత కలిగిన వాడు. ఉద్యోగ బాధ్యతల్లో గానీ తన జీవన సరళి లో కానీ తాను విశ్వసించిన దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిత్వం ఆయనది. అట్లా ఆయన కాలేజీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నప్పుడే పలు కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతిభాపురస్కారాల్లో భాగంగా ఒక మెడల్, సర్టిఫికేట్, అయిదు వేల నగదు ఇచ్చేవారం. మొదట అది బయట టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రారంభించి మా కాలేజీకి తెచ్చాను. ఇక నా ఉద్యోగ విరమణకు ముందు లైబ్రరీ సైన్స్ కి సంబంధించి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. మిత్రుడు శ్రీ చేగొని రవి కుమార్ చాలా ఆక్టివ్ గా వున్నాడు. ఆయన ఒక ప్రతిపాదన తెచ్చాడు‘COLLECTION DEVELOPMENT IN OPEN ACCESS ERA’అన్న అంశం మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్ నిర్వహించాలనుకున్నాం. దానికి ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ ప్రొఫెస్సర్ డాక్టర్ లక్ష్మణ రావు గారిని ప్రధాన వక్తగా పిలిచాము. ఆయన నాకు బి.ఎల్.ఐ.ఎస్సీ. ఏం.ఎల్.ఐ.ఎస్సీ రెండు కోర్సుల్లో టీచర్. కాటలాగింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లల్లో ప్రభావవంతంగా బోధించారు. ఆ రోజుల్లో ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, సుదర్శన్ రావు, విశ్వమోహన్ లు ఆచార్యులుగా వుండేవారు. మా కాలేజీలో అంతకు ముందెప్పుడో నిర్వహించిన రెండు జాతీయ స్థాయి సెమినార్స్ కి కూడా శ్రీ లక్ష్మణ రావు నాకు మార్గ నిర్దేశకత్వం చేశారు. అట్లా నా రిటైర్మెంట్ కి రోజులు దగ్గరపడ్డప్పటికీ ఆరోగ్య షరతులకు జాగ్రత్తలకు లోబడి ఉత్సాహంగానే అన్ని  కార్యక్రమాల్ని నిర్వహించాను. మిత్రులు ఏర్పాటు చేసిన వాటిలో క్రమం తప్పకుండా పాలు పంచుకుంటూనే వున్నాను. అదట్లా వుండగానే 2016 మార్చ్ లో హైదరబాద్ గ్లోబల్ ఆసుపత్రి నిర్వహణలో గ్లోబల్ కిడ్నీ సప్పోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నా నెఫ్రాలజీ డాక్టర్ గందే శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన గ్రూప్లో ఉత్సాహంగా పాలు పంచుకున్నాను. కరెంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశాం. మా ఫిల్మ్ భవన్ నిర్మాణం కాక ముందు తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుతో పాటు నా ‘సినీ సుమాలు’,’24ఫ్రేమ్స్’ పుస్తకాల ఆవిష్కరణ లాంటి అనేక సమావేశాలకు ప్రెస్ క్లబ్ ప్రధాన వేదికగా వుండేది. జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ మయి అందరికీ అందుబాటులో వున్న వేదిక ప్రెస్ భవన్. ప్రెస్ భవన్ అనగానే జీవగడ్డ విజయ్ కుమార్ గుర్తొస్తాడు.  

ఇక మా కుటుంబం విషయానికి వస్తే రేల తన సాఫ్ట్ వేర్ ఉద్యోగం క్రమబద్దంగా చేస్తూనే వుంది. ఇందిర ఎజెండా ప్రధానంగా నేనూ నా ఆరోగ్యం. అంతేకాదు ఎన్నో జాగ్రత్తలు. నిలబడితే కూర్చుంటే హెచ్చరికలు చేస్తూ నియంత్రించడం. ఎందుకంటే మనం అంత సులువయిన వాళ్ళం కాదు కదా. చెట్టు దాకా వెళ్లమంటే చెట్టు ఎక్కేసే రకం. ఆ ఏమయితదిలే అనుకునే మనస్తత్వం. ఇందిరే క్షణక్షణం కట్టె పట్టుకోకుండానే హెచ్చరికలు చేస్తూ వచ్చింది. ఇక మా అబ్బాయి అన్వేష్. హైదరబాద్ లో యింటర్ తర్వాత ఎంట్రన్స్ రాసి తిరువనంతపురం లో వున్న ఐ.ఐ.ఎస్.టి.INDIAN INSTITUTE OF SPACE SCIENCE AND TECHNALAGY లో సీటు తెచ్చుకుని ఏవియానిక్స్ లో చేరాడు. నాలుగేళ్ల చదువు పూర్తి అయిన తర్వాత నేను హాస్పిటల్ లోవుండగానే నాన్నా నేను వచ్చేస్తున్నా అన్నాడు ఫోన్లో. సరే రా అన్నాను. అముంది లాగేజీ తో పాటు దిగిపోయాడు. ఏమయింది అంటే నాకా 9-5 జాబ్ ఇష్టం లేదు నేను క్రియేటివ్ రంగంలోకి వెళ్తాను అన్నాడు. ఇందిర మిగతా అంతా కంగారు పడ్డారు. నేను క్షణం ఆలోచించకుండా ఎవరయినా తన కిష్టం అయిన పనిలోనే సంతోషంగా వుంటారు. మనిషికి కావలసింది సుఖం కాదు సంతోషం అన్నాను. అప్పుడే నానిగాడి మీద ఇట్లా రాసుకున్నాను

“ఇన్నాళ్లూ వాడు నాకార్థం కాలే/ అవును ఎవరయినా ఎందుకు అర్థం అవుతారు/ మనం ప్రయత్నిస్తే కదా/ గుండెల మీద పడుకున్ననాడూ, చిటికేన వేలు పట్టుకుని నడిచిననాడూ/       

జబ్బకు సంచీ వేసుకుని స్కూలుకు వెళ్ళిన నాడూ/ ముద్దు మురిపాల ముచ్చట్లే కదా/ ఆనాడు మనకేం అర్థం అవుతాడు… పరీక్షలూ మార్కులూ సీట్లూ ఈ గొడవలో పడ్డప్పుడూ వాడు నాకార్థం కాలే/ కానీ ఇప్పుడు

‘అంతరిక్షం నుంచి సృజన వైపు వాడి ప్రయాణం/

సారీ రా నానీ నువ్వు అర్థం కాలేదనుకున్నా /కానీ నేనే నిన్నర్థం చేసుకోలేదు

నా కలలూ నీ కలలూ ప్రోది చేసుకుని/ విశ్వంలోకి దూసుకెళ్లు

నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు’ (మనిషి లోపల)

అన్వేష్ మొదట డ్రాయింగ్,పెయింటింగ్ తర్వాత ఎనిమేషన్ ఇట్లా దృశ్య మాధ్యమంలోనే కాలు మోపాడు. ఏనిమేషన్ లో మిత్రుడు కళ్యాణం శ్రీనివాస్ తో కొంతకాలం నడిచాడు. కానీ వాడి దృష్టి అంతా ‘మూవింగ్ ఇమేజెశ్’ పైనే. కెమెరా పట్టుకుని తిరగడం. మొదట స్టిల్ ఫోటోస్. సిరిసిల్లా వెళ్ళి మిత్రుడు జర్నలిస్ట్ టీ.వీ.నారాయణ తో కలిసి తిరిగి నేత కార్మికులు నేత పని పరిశ్రమల పైన ఒక సిరీస్ తీశాడు. తర్వాత ‘తెలంగాణ పట్నం’. దాని గురించి నేనూ ఇందిర చెప్పగానే మా దగ్గరి ఫామిలీ మిత్రులు లావణ్య రాజయ్య సార్ వాళ్ళ వూరు గంగాధరలో పట్నం పండుగ బాగా చేస్తారని అనగానే రేల అన్వేష్ లు ఇద్దరూ వెంటనే అక్కడికి వెళ్లారు.  పట్నం ఉత్సవాన్ని మొత్తం కలర్ ఫుల్ గా షూట్ చేశాడు. చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ మ్యూజిక్ చేశాక అన్వేష్ పైన నా నమ్మకం రెట్టింపు అయింది. ఇదిలా వుండగానే నాకు అత్యంత దగ్గరి మిత్రుడూ సుప్రసిద్ద కవీ శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య పైన ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది అన్నాను. సరే వెళ్దాం అన్నాడు అన్వేష్. నేను అమెరికా వెళ్తున్నాను ఈలోగా చేయగలిగితే చాలా బాగుంటుంది అన్నాడు దర్భశయనం. నేనూ ఇందిర అన్వేష్ హనుమకొండ వెళ్ళాం. నిజానికి కవిత్వం రాయడం ఎంతో కవిత్వ పఠనం అంతకంటే గొప్ప కళ. అందులో ప్రతిబావంతుడు దర్భశయనం. ఇంకేముంది కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణలోనూ, తర్వాత రామప్ప కూ వెళ్ళి షూట్ చేశాము. రామప్పకూ నేనూ ఇందిరా అన్వేష్, ధర్భశయనం లతో పాటు ఆయన సతీమణి కమల గారు కూడా వచ్చారు. అట్లా షూట్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ కూడా చేశాడు అన్వేష్. తర్వాత 8 నవంబర్ 2015 న కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ చేశాము. మా మిత్రుడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. దాస్యం సేనాధిపతి,ముజాఫ్ఫర్ తదితరులు హాజరయ్యారు. ఆనాటి కార్యక్రమానికి మిత్రులు ఏం.గంగాధర్, అన్నవరం దేవేందర్,పొన్నం, ఆర్.వెంకటేశ్వర్ రావు తదితర మిత్రులు అనేక మంది పాల్గొన్నారు. అట్లా ఆనాటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డాక్యుమెంటరీ ప్రొజెక్షన్ కూడా వేశాం. పట్నం, బతుకే ఒక కళ లతో అన్వేష్ ఫిల్మ్ మేకింగ్ మొదలయింది. ఆ తర్వాత హైదరబాద్ లో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్వేష్ తీసిన పట్నం డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు.

ఇక తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక లఘు చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిల్మ్ భవన్లో జరిగిన ఆ కార్యక్రమంలో ముద్దసాని రామిరెడ్డి, యాది సదాశివ, శివపార్వతులు, పట్నం ఫిల్మ్స్ ని ప్రదర్శించారు. ఆనాటి కార్యక్రమానికి డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా, కామారెడ్డి శంకర్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులు హాజరయ్యారు. అదే కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక వేదికను కూడా ఏర్పాటు చేసాము.‘యవనిక’ పేర ఏర్పాటయిన ఆ వేదిక ద్వారా తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ని సేకరించాలని, ఫిల్మ్ మేకర్స్ ని ఒకే వేదిక మీదికి తేవాలని ఆలోచన చేశాం. తర్వాతి కాలంలో యవనిక ఏదో కొంత కృషి చేసినప్పటికీ అనుకున్న రీతిలో కొనసాగించలేక పోయాం. నేనేమో యవనిక పేర సమాంత సినిమాల పైన సమీక్షలు, పరిచయాలు చేసి నా యూ ట్యూబ్ చానల్ Aksharala Thera By Varala Anand లో ప్రెసెంట్ చేశాను.

అన్వేష్ డాక్యుమెంటరీల ప్రస్థానం ఆ విధంగా మొదలయింది. కానీ సినిమాటోగ్రఫీ లో గొప్ప ఇన్సిట్యూట్ లో చదవితే కానీ ఫలితం వుండదన్నాను. దానికోసం అన్వేష్ మొదట హైదరబాద్ లోని శ్రీ వాణి గారి కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కోల్కట్టా లోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశానికి ఎంట్రన్స్ రాశాడు. రెండింటిలోనూ ప్రథముడిగా నిలిచి సీటు పొందాడు. మిత్రుల సూచన మేరకు కోల్కట్టా లో చేరాడు. ఆ వివరాలు మళ్ళీ రాస్తాను.

ఇక నా ‘మనిషి లోపల’ కవితా సంకలనాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే పనిని ఆత్మీయురాలు బొడ్ల అనురాధ చేపట్టారు. విజయవంతంగా SIGNATURE OF LOVE పేర పుస్తకం తెచ్చారు. ఆవివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

+++++++++

వారాల ఆనంద్

17 మార్చ్ 2024