Month: November 2022
అదూర్ ‘స్వయంవరం’ @50
FRIENDS, 24 FRAMES MY WEEKLY COLUMN IN ‘DISHA DAILY
24 ఫ్రేమ్స్
అదూర్ ‘స్వయంవరం’ @50
+++++ వారాల ఆనంద్
సాధారణ అట్టడుగు ప్రాంతీయ జీవితాల్లోంచి ప్రపంచ మానవ జీవితాల్ని ఆవిష్కరించిన అదూర్ దర్శకుడు గోపాలకృష్ణన్. ఆయన రూపొందించిన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’. ఆ సినిమాకిప్పుడు యాభై ఏళ్ళు. అంటే గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవం. అర్థవంతమయిన సినిమా అభిమానులు రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఇది ఒక పండగే. స్వయంవరం మలయాళీ సినిమాకు కొత్త భాషను కొత్త ఒరవడిని చూపించిన సినిమా. ఆ సినిమా ఎలాంటి రాజీ లేకుండా కేవలం సినిమాను సినిమాగా ఆవిష్కరించిన సినిమాగా నిలబడింది. అప్పటిదాకా మలయాళీ సినిమాల్లో వున్న మెలోడ్రామా, పాటలు, డాన్సులు, కామెడీ ట్రాకులూ లేకుండా దృశ్య ప్రధాన మయిన ఒరవడిలో కొత్త దారులు వేసింది. రే లాంటి వాళ్ళు ఆరంభించిన సమాంతర సినిమాలకు కొనసాగింపు ఈ స్వయంవరం. ఇద్దరు ప్రేమికులు వారి పెద్దలు అంగీకరించకున్నా తమ అభీష్టం మేరకు పెళ్ళాడి తమ కాళ్ళ పై తాము నిలబడాలని నగరానికి వస్తారు. కాని ఈ సమాజంలో మన గలగడం అంత సులభం కాదని అందునా రచయిత గా నిలబడడం చాలా కష్టమని క్రమంగా తెలుసుకుంటారు. ఆ గమనం లో ఆ జంట ఎదుర్కొన్న అనుభవాలూ చూసిన జీవితాలూ ఈ సినిమా కాన్వాస్. అందులో అదూర్ తన దృష్టి కోణాన్ని గొప్పగా ఆవిష్కరించాడు. టార్చ్ బేరర్ గా నిల బడ్డాడు. స్వయంవరం సినిమా స్వర్ణోత్సవం సదర్భంగా ఫిలిం క్రిటిక్ మధు ఎరవంకర THE JOURNEY, Swayamvaram at Fifty అన్న డాక్యుమెంటరీ తీసాడు. అట్లా ‘స్వయంవర’ స్వర్ణోత్సవం కేరళ లోనే కాదు మొత్తం భారతీయ సినిమా రంగంలో నిర్వహించుకోవాల్సిన పండుగ.
భారతీయ నవ్య సినిమా ప్రపంచంలో సత్యజిత్ రే తర్వాత అంత గా ప్రపంచ వ్యాప్త గౌరవాన్ని అనుడ్కున్న దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. సినిమా ఒక పరికరం కాదు అది ఒక ఆలోచన, అభిప్రాయం, ఒక ఆవిష్కరణ అని విశ్వసించి సినిమా ద్వారా జనానికి సామాజిక వాస్తవిక అవగాహన ఆకలుగుతుందని అదూర్ సినిమాలు వివరిస్తాయి. అదూర్ గోపాలకృష్ణన్ అంతర్ముఖుడైన భావుకుడు. వాస్తవికతకు నిబద్దుదయిన దర్శకుడు. ఎప్పటికప్పుడు తనని తాను తెలుసుకుంటూ ఆవిష్కరించుకుంటూ దృశ్య మాధ్యమంలో ప్రకటిస్తూ వచ్చాడు అదూర్. ఒక రకంగా అదూర్ చిత్ర యాత్ర సమస్తం ఆయన విశ్వసించిన వాస్తవికతను ఆయన తన కోణంలో పూర్తిగా తనదయిన ప్రాంతీయ నేపధ్యంలోంచి చిత్రీకరిస్తూ పోయాడు. అందుకే అదూర్ కేవలం తన మాతృ భాష మలయాలంలోనే తన సినిమాలు తీసాడు తప్ప వేరే భాషలో నిర్మించే అవకాశాలు వచ్చినా అందుకు ముందుకు రాలేదు ఎందుకంటే తాను చేపాదలచుకున్నది తనకు తెలిసిన భాషలో చెప్పడమే సరయినదని విశ్వసించాడు. అదే పాటించాడు.
మీ సినిమా తలా రూపొందుతుందంటే కలగా మొదలయి, అక్షరంగా రూపుదిద్దుకొని పాత్రలుగా మారి సినిమా తయారవుతుందని అదూర్ ఒక చోట చెప్పుకున్నాడు. ప్రాంతీయ కోణంతో పాటు అదూర్ సినిమాల్లో మానసిక వాస్తవికత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆయన సినిమాల్లో స్త్రీ లది ప్రముఖమయిన పాత్ర. అట్లని aa పాత్రలు స్థ్రేఎ వాడ పాత్రలు మాత్రమే కాదు. మొత్తంగా కుటుంబాన్ని సమాజాన్ని నిభాయించుకునే స్త్రీ పాత్రలు ఆయనవి. అదూర్ గమనించిన కేరళ మాతృ స్వామ్య లక్షణాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తూ వుంటాయి. అదూర్ సాధారణంగా తన సినిమాలకు తానే కథ కథనాలు సమకూర్చుకుంటాడు. ఆయన తీసిన ‘ మధిలుకల్ ‘ (వైకం మొహమ్మద్ భషీర్), విదేయన్ ( పాల్ జక్కరియా) ల కథల ఆధారంగా తీసాడు. తను సినిమా నిర్మాణం మొదలు పెట్టింతర్వాత మరే ఆలోచన తనలో చొరబడనీయకుండా మొదటి ప్రింట్ పూ ర్తి అయేంతవరకు దీక్షగా కోన సాగుతాడు.
తన నాలుగు దశాబ్దాల చలన చిత్ర జీవితంలో 12 కథాత్మక సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాకుమెంటరీ సినిమాలు తీసాడు. తన సినిమాల్లో ప్రతి వివరాన్నిపూర్హి గా తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ తన సినిమాల్లో నటులు సెచ్చ తీసుజోవదాన్ని అంగీకరించరు. సినిమాల్లో నటులు నాటకాల్లోలాగా ప్రేక్షకులకోసం నటించడం లేదని వారు దర్శకుడికోసం దర్శకుడి ఆశించినట్టుగా దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. పాత్రల్ని సృష్టించి కథ మేరకు ఆవిష్కరింప చేసే పని దర్శకుడిదే కనుక నటులు పాత్రల్ని ఇంప్రోవైస్ చేయడాన్ని సమంజసం కాదంటారు. అంతే కాదు అదూర్ నటీనటులకు పాత్రల వివరాలు మాటలు సీన్లు సెట్లోకి వచ్చింతర్వాతే ఇవ్వాలంటాడు. ఆతర్వాతే రిహార్సల్ తర్వాత షూట్ అంటాడాయన. అట్లా సినిమాలకు సంభందించి తనదైన ప్రత్యేక ఒరవడిని సృష్టించాదాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని సంపాదించాడు.
మలయాళీ చలన చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయత దాబికాల్ని తోసిరాజని అద్దోర్ గోపాలకృష్ణన్ తన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’ తో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు. జూలై 3 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ కుటుంబం కథాకళి నేపధ్యం వున్న కుటుంబం కావడం తో చిన్ననాటినుండే నాటకాలు ప్రదర్శనలతో ఆయన జీవితం ప్రారంభమయంది. కథాకళి లో వున్న సంగీత ఒరవడి, శారీరక సంజ్ఞలు అదూర్ని అమితంగా ప్రభావితం చేసాయి. 8 ఏళ్ల వయసులోనే వేదికలెక్కి ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తమిళ నాడు లోని దిండిగల్ లో ఉద్యోగం చేసాడు.తర్వాత పూనా లోని ఫిలిం ఇన్స్టిట్యుట్ లో స్క్రీన్ప్లే, డైరక్షన్ లలో డిప్లొమా పొందాడు. తర్వాత త్రివేండ్రం వచ్చి కొంత మంది మిత్రులతో కలిసి రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం సొసైటీ ‘చిత్రలేఖ’ స్థాపించాడు. తర్వాత సినిమా నిర్మాణం కోసం ‘చిత్రలేఖ ఫిలిం కొ ఆపరేటివ్ ‘ ను ఆరంభించాడు. తాము కొంత చిత్రలేఖ సంస్థ కొంత నేషనల్ ఫిలిం ఫైనాన్స్ సంస్థ నుంచి కొత్త అప్పు తీసుకొని 1972 లో ‘స్వయంవరం’ తీసాడు. నూతన జీవితాన్ని ఆరంభించాలనే ఓ జంట ఎదుర్కొనే అడ్డంకులు ఒడిదొడుకులు ప్రధాన అంశంగా వుంటుందీ చిత్రంలో కాని aa నేపధ్యంలో అదూర్ ఆకాలం నాటి సామాజిక ఆర్ధిక అంశాల పైన ఒక స్టేట్మెంట్ లాగా ఈ సినిమా రూపొందించాడు. అత్యంత వాస్తవిక ధోరణిలో చిత్రీకరించబడి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. నిజానికి విడులయిన మొదటి రోజుల్లో ప్రేక్షకులు రాక ఆర్థికంగా వైఫల్యాన్ని ఎదుర్కొంది. కాని ఎప్పుడయితే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకొందో దాన్ని మళ్ళీ రెలీస్ చేయడంతో జనం దృష్టిని ఆకర్షించి గొప్ప విజయాన్ని సాధించింది. తర్వాత అద్దోర్ తీసిన సినిమా ‘ కోడియాట్టం’. ఇందులో ఒక వ్యక్తి అమాయక ఏదీ పట్టించుకోని వ్యక్తి నుండి ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. సినిమా మొత్తం కేరళ ఆలయాల్లో జరిగే పండుగలా జరుగుతుంది. కోడియాట్టం ప్రధాన పాత్ర దారి గోపికి ఈ సినిమా గొప్ప పేరును తెచ్చి పెట్టడంతో పాటు అనేక అవార్డులు సాధించింది. తర్వాత అదూర్ తీసిన ‘ఎలిపత్తాయం’
అద్దోర్ సినీ రంగ జీవితంలో గొప్ప సినిమా గా ఎంచబడింది. ఇది కేరళ లోని ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించి. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యుట్ అవార్డును గెలుచుకొంది. ఇఅ అదూర్ ‘ ముఖాముఖం’ ఒక కమ్యునిస్టు కార్యకర్త జీవితం పైన నిర్మించబడి గెలుపు ఓటముల సంక్షోభాల్ని ఆవిష్కరించింది. ఇక ‘ అనంతరం’ అదూర్ స్వీయ జీవిత కథాత్మక సినిమా గా చెప్పుకుంటారు. నిర్మాణ సరళి లో మొదట మోనోలోగ్ గా ప్రారంభమయి కోన సాగుతుంది. వాస్తవం, కల ల మధ్య ఊగిసలాడే జేవితాన్ని అనంతరం అద్భుతంగా చిత్రిస్తుంది.
తర్వాత వైకం బషీర్ కథ ఆధారంగా ‘ మథిలుకల్ ‘ తీసాడు. ఇది కూడా చిత్రీకరనలోవిలక్షనతు సంతరించుకుంది. స్వాతంత్ర పోరాట కాలంలో బషీర్ అనుభవించిన జైలు జీవితాన్ని మథిలుకల్ చిత్రించింది. ఆరాట కాలంలో బషీర్ను జైల్లో వేస్తారు. జైలు గోడకి అవతల మహిళా జైలులో వున్న నారాయని తో మాట కలుస్తుంది. గోడకు చెరో పక్క వున్న a ఇద్దరి నడుమా స్నేహం కుదుర్తుంది. ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం లేదు కాని కాని మాటలు కలుపుతాయి చిత్రీకరణ గొప్పగా సాగుతుంది. ఇద్దరూ బయట ఆసుపత్రిలో కలుసుకోవాలనుకుంటారు కాని వీలు కాదు. ఇందులో మమ్ముట్టీ అద్భుతంగా నటించాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. తర్వాత అదూర్ విదేయన్, కథాపురుషన్ తీసాడు. ఇవి రెండూ కేరళలో కొంత వివాదాస్పదమయ్యాయి. విదేయన్ రచయిత పాల్ జక్కరియా తన కథకు అదూర్ న్యాయం చేయలేదని హిందూత్వాన్ని జోడించి నవలకు యదార్థ రూపం ఇవలేక పోయాడని అనడంతో వివాదం చెలరేగింది. దానికి జవాబుగా అదూర్ ఇట్లా అన్నాడు ‘ సాహిత్య పఠ నం వ్యక్తిగత అనుభవం అదే సినిమా సామూహిక అనుభవం కాబట్టి సినిమా రూపాన్తరీకరణ నవల లాగే ఉండాలనుకోవడం సమంజసం కాదు’. తర్వాత అదూర్ తీసిన కథాపురుషన్ స్వీయ కథాత్మక సినిమా గా నిలిచింది. ఇది కేవలం సినిమాఎన్ కాకుండా 40 నుంచి 80 దాక కథానాయకుడి చరిత్రగా తెరకెక్కింది కాని అది కేవలం అతని జీవితమే కాకుండా అయా కాలాలకు సంభంచిన సామాజిక చరిత్రను సైతం చిత్రించింది. ముఖ్యంగా ఆయా కాళాల దృక్పథాల ప్రభావాల్ని ప్రతిహావంతంగా చూపించింది.
ఇక అదూర్ తీసిన ముఖాముఖం కూడా కొంత వివాదాన్నే లేవనేత్త్తింది ఇది కేరళలో కమ్యునిస్టుల వైఫల్యాల్ని చూపించిం ది. దాంతో ముఖాముఖం కమ్యునిస్టుల వ్యతిరేక చిత్రం గా ఆరోపించబడింది. ఇందులో ప్రధాన పాత్రదారికి నత్తి పెట్టడంతో సూచన ప్రాయంగా ఒక నాయకుడిని ప్రతిబింబించి వివాదం ఎక్కువయింది.
తర్వాత అదూర్ ‘ నాలు పెలుంగల్ ‘ తీసాడు. ఇది తగజి శివ శంకర పిల్లి రాసిన నాలు కట్ర్హల్ని జోడించి నిర్మించాడు. స్త్రీల పాత్రల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమా నాలుగు కథల సమ్మేళనంగా వుంది. తర్వాత అదూర్ పెన్న్యం నిర్మించాడు. ఇట్లా ఆయన నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించి సొంత గొంతును పలికించి నిలబెట్టాయి.
ఫీచర్ films తో పాటు అదూర్ అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీసాడు. కాలమండలం గోపి లాంటి కథాకళి కలాకారు డి పైన ఆయన తీసిన డాక్యుమెంటరీ లు సాదికరికమయినవిగా పెరుతేచ్చుకున్నాయి.
మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ కళాత్మక వాస్తవికతకు తోడు మానసిక వాస్తవికతను తెరపై నిజాయితీగా చిత్రిస్తూ ముందుకు సాగుతున్న అదూర్ గోపాలకృష్ణన్ భారతీయ సినిమాకు అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆయన ఖ్యాతి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది.
-వారాల ఆనంద్ 944440501281
బహుముఖీన సృజన శీలి – దీప్తి నావల్
‘SAHITHI SRAVANTHI’ No-15
బహుముఖీన సృజన శీలి – దీప్తి నావల్
+++++++++ వారాల ఆనంద్
దీప్తి నావల్ అనగానే మనకు మన దేశంలో 1980లలో ఎగిసి విరిసిన నవ్య సినిమా ఉద్యమం గుర్తొస్తుంది. ఆ సినిమాల్లో నటించిన నటీ నటులు గుర్తొస్తారు. నసీరుద్దీన్ షా, ఓం పూరి, ఫరూఖ్ షేఖ్, నటీమణులు స్మితాపాటిల్, షబానా ఆజ్మీ, అపర్ణా సేన్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళందరితో పాటు దీప్తి నావల్ గుర్తొస్తుంది. వివిధ భాషల్లో వంద సినిమాలకు పైగా నటించిన దీప్తి మంచి నటే కాదు మంచి కవి, రచయిత, ఫోటోగ్రాఫర్, పేయింటర్ కూడా. మొత్తంగా మంచి కళాకారిణి. ఆమె సినిమాలనగానే “చస్మే బద్దూర్” లో దీప్తి పోషించిన మిస్ చంకో వెంటనే స్పురణలోకి వస్తుంది, “కథ” లోని సంధ్య సబ్నిస్, “దామూల్” లోని మహాత్మాయి జ్ఞాపకం వస్తారు. అంతే కాదు ఇంకా అనేకానేక పాత్రలు గుర్తొస్తాయి. అయితే ఆమె తన కారీర్ లో తాను ఎంపిక చేసుకున్న పాత్రలు మాత్రమే చేసింది. లేకుంటే ఆమె చేసిన సినిమాల సంఖ్య వందకంటే ఇంకా చాలా ఎక్కువగా వుండేది. అట్లా ఆమె నటిగా తనదయిన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. సమాంతర సినిమాలతో పాటు మధ్యేవాద సినిమాల్ని కూడా దీప్తి చేసారు.
అయితే ఆమె కేవలం నటే కాదు మంచి కవి, కథా రచయిత్రి కూడా. దీప్తి నావల్ కవిత్వం ఇప్పటికి రెండు సంకలనాలు వెలువడ్డాయి. మొదటిది “ లమ్ హా.. లమ్ హా” , రెండవది “బ్లాక్ విండ్ అండ్ ఆదర్ పోయెమ్స్” . ఈ రెండు సంకలనాలూ సాహిత్య ప్రపంచంలో మంచి పేరు గడించాయి. “బ్లాక్ విండ్ అండ్ ఆదర్ పోయెమ్స్” పుస్తకానికి ప్రసిద్ద కవి గుల్జార్ ముందు మాట రాసారు. అందులో ఆయన ఇట్లా అంటారు… “ దీప్తి నావల్ ఆలోచనలు హృదయం లోనూ, ఆమె హృదయం ఆలోచనల్లోనూ వుంటాయి. ఆమె ప్రతి విషయాన్నీ రెండేసి సార్లు అనుభవం లోకి తీసుకుంటుంది. మొదటిసారి ఆ సందర్భంలోకి వెళ్లి సంపూర్ణంగా అనుభూతిస్తుంది, రెండవసారి ఆమె దాన్ని వడపోసి సారాంశాన్ని కవితగా మార్చి పునర్జీవింపజేస్తుంది” దీప్తి నావల్ కు కవిగా గొప్ప కవి ఇచ్చిన ప్రశంసగా దాన్ని తెసుకోవచ్చు. ఇక దీప్తి మంచి కథా రచయిత్రి కూడా. ఆమె రాసిన కథలతో “మాడ్ టిబెటన్-స్టోరీస్ ఫ్రం దెన్ అండ్ నౌ “ అన్న కథా సంకలనం వెలువడింది. అమే కథలన్నీ వాస్తవ జీవితానుభవాలనుండే రాసింది. చాలా కథలు తాను తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఇతివృత్తాలుగా తీసుకుని రాసింది. మరి కొన్నింటిని తన మిత్రులు దగ్గరి వాళ్ళు చెప్పిన వారి వారి అనుభవాల ఆధారంగా రాసింది. అయితే అవన్నీ కేవలం కథ చెప్పడం లాగా కాకుండా సృజనాత్మకతను జోడించి స్క్రీన్ ప్లే లాగా వుంటాయి. అవి చదువుతూ వుంటే దాదాపుగా సినిమా చూస్తున్న అనుభవమే కలుగుతుంది. కేవలం ’మార్నింగ్ ఆఫ్టర్’ కథ మాత్రం కల్పిత కథ. ముఖ్యంగా ఆమె రాసిన ‘తుల్లీ” కథ చాలా గొప్ప వాస్తవిక కథ. బాంబే లోని రెడ్ లైట్ ప్రాంతంలో ఒక యువతీ కథ అది. మొదట ఒక సినిమా స్క్రిప్ట్ ను విజయ్ టెండూల్కర్ దీప్తి కిచ్చాడు. దాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. దానికి ముందు రెడ్ లైట్ ప్రాంతంలో కొంత రిసర్చ్ చేయాలని తల పోసి కొందరు మిత్రులతో కలిసి ఆ ప్రాంతంలో రాత్రుళ్ళు తిరిగింది దీప్తి. అక్కడ చూసిన సంఘటనలు, అక్కడి యువతుల అనుభవాలు చూసి చలించిపోయిన దీప్తి తుళ్ళి కథ రాసారు. అత్యంత సహజంగా, అక్కడి వాళ్ళ భాష, జీవితమూ అన్నీ ఈ కథ లో ఆవిష్కరించ బడ్డాయి. సినిమా నిర్మాణం అటుంచి కథ గొప్ప పేరును సంపాదించుకుంది. ఇక మరో ముఖ్యమయిన కథ దీప్తి రాసిన ఇద్దరు మగవాళ్ళ కథ.
ఆ కథను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన అనుభవంగా దీప్తికి చెప్పాడు. ఓక యువకుడు సినిమాల మీద వ్యామోహంతో మొట్ట మొదటిసారిగా బాంబే బయలు దేరతాడు. రైల్లో ప్రయాణిస్తూ వుండగా అతన్ని మరొక సహప్రయాణికుడు చాలా సేపు పరిశీలించి మాట కలుపుతాడు. ఎక్కడి వెళ్తున్నాడో ఏమి చేయాలనుకున్తున్నాడో లాంటి వివరాలన్నీ అడుగుతాడు .ఆ యువకుడి విషయం తెలుసుకుని తనతో రమ్మని వసతి కల్పిస్తానని తీసుకెళతాడు. ఇంటికీ వెళ్ళిన తర్వాత ఆతని భార్య ఈ యువకున్న వ్యామోహానికి గురిచేస్తుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. ఇదంతా జరుగుతుండగా ఇంటతను బయట మంచంలో పడుకునే ఉంటాడు. అంటే అతను నపుంసకుడు. యువకున్ని తన భార్యకోసం తీసుకుచ్చాడు. అతనికి తన భార్య అంటే చాల ఇష్టం. ఆమెను వదులుకోలేడు. అట్లని కోరికల్నుంచి ఆమెను దూరం చేయలేదు. అందుకోసమే ఇదంతా చేస్తాడు. కథను నడిపించిన తీరు చాలా గొప్పగా వుంటుంది. జరిగిన కథే అయినా తన సృజనాత్మకతతో కథను నడిపించిన తీరు.. ఆ ఇద్దరు పురుషుల మనస్తత్వాలూ, పురుష కోణం లోంచి బాగా రాసారు దీప్తి. ఇట్లా కథలన్నీ పూర్తి స్థాయిలో ఉత్తమ కథకుడు రాసినట్టే వున్నాయి.
ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే దీప్తి ఓక రోజు టాటా సుమో తీసుకుని బయలు దేరి లడఖ్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడి అందమయిన దృశ్యాల్ని అక్కడి మనుషుల్నీ తన కెమెరా లో బంధించింది. ఫలితంగా “ఇన్ సర్చ్ ఆఫ్ అనదర్ స్కై” అన్న ఫోటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటయింది. ఆ ఫోటోలు మామూలుగా కాఫి టేబుల్ బుక్ లోని ఫోటోల్లాగా కాకుండా మనసుకు హత్తుకునే వెంటాడే ఫోటోలుగా వుంది మంచి పేరు తెచ్చుకున్నాయి.
దీప్తి నావల్ కి ‘కళ’ ఏ రూపంలో వున్నా ఆసక్తే. అందుకే 1996లో ఒక సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేసింది. అవన్నీ కళాకారుల్లో ఎంతో ఆసక్తిని కలిగించాయి. మంచి ప్రశంసల్ని అందుకున్నాయి. అందుకే ఏ ఒక్క కళా రూపానికో పరిమితం కాలేను అంటారామె. అందుకే దీప్తి సృజన రంగంలో భిన్నమయిన దారుల్లో పయనిస్తున్నారు. ఇంత భాహుముఖీన మయిన సృజనను ప్రదర్శిస్తున్న దీప్తి నావల్ ‘ తనకు నటనతో సహా అన్ని కళారంగాలు ప్రేరనాత్మకంగానే వుంటాయి అంటారు. నటన గొప్పదే కానీ దానిలో ఆయా సినిమాల రచయితల, దర్శకుల ఆలోచనలు అనుభవాలూ కలిసి వుంటాయి.. అయినప్పటికీ మంచి నటులకు వాటిల్లో కూడా ఎంతో కొంత స్వీయ జీవితానుభవాలు కల్సి పోతాయి అంటారామె. కానీ రచనలలోనే స్వంత హృదయం ఉంటుంది అన్నది ఆమె అభిప్రాయం.
…
దీప్తి నావల్ ౩ ఫిబ్రవరి 1952లో పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. అమృత్ సర్ లోని సేక్రేడ్ హార్ట్ సెకండరీ స్కూలు లో స్కూల్ ఫైనల్ పూర్తి చేసారు. తర్వాత ఆమె అమెరికా వెళ్ళారు. న్యు యార్క్ లోని హంటర్ కాలేజ్ ఆఫ్ సిటీ యునివర్సిటీ లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసారు. డిగ్రీలో పేయింటింగ్ ప్రధాన అంశంగా నూ ఇంగ్లీష్, సైకాలజీ లు ద్వితీయ అంశాలుగా తీసుకున్నారు. దీప్తి తండ్రి గారు ఉదయ్ నావల్ ప్రొఫెస్సర్ గా పని చేసారు. తల్లి హిమాద్రి గంగాహర్ ఉపాధ్యాయురాలిగానూ, పెయింటర్ గానూ కృషి చేసారు. ఆమెకు ఒక సోదరుడు రోహిత్ నావల్, సోదరి స్మితి నావల్ వున్నారు.
ఆమె సృజనాత్మక జీవితం మొదట నాటక రంగం లో మొదలయింది. ఒక రోజు ఆడిషన్ కోసం ఆమె దూరదర్శన్ స్టూడియోకు వెళ్ళారు. అక్కడ ప్రముఖ నటుడు టీవీ హోస్ట్ ఫరూఖ్ షేఖ్ ను కలిసింది. ఇద్దరూ కలిసి ఫరూఖ్ అన్న కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఫరూఖ్ షేఖ్ ఇచ్చిన సమాచారం తో దీప్తికి వినోద్ పాండే రూపొందించిన “ఏక్ బార్ ఫిర్’ లో ముఖ్యాభినేతగా నటించే అవకాశం వచ్చింది. అట్లా ఆమె హిందీ లో నటించిన మొదటి అమెరికన్ ఇండియన్ నటి గా నిలిచారు.
సాధారణంగా నటుల జీవితాలు వేరు… నటించిన సినిమాలు వేరుగా ఉంటాయి. కానీ దీప్తి సినిమాల్లోని పాత్రలు ఆమె నిజజీవితానికి అద్దం పడుతాయి. తండ్రి ఆమెను మంచి చిత్రకారిణిని చేయాలనుకున్నాడు. కానీ ఆమె సినిమాను ప్రేమించింది. నటి కావాలనుకుంది. ఆమె సినిమాల్లోకి వచ్చేనాటికి మహామహా నటీమణులున్నారు. అయినా గ్లామర్తో కాకుండా పాత్రల్లోని గాఢత, సాధారణంగా కనిపించే ఆ అసాధారణ నటన ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది. అందుకు కారణం… తాను పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడం.. తాను కాకుండా పాత్ర మాత్రమే అక్కడ ఉండటం ఆమె బలం.
న్యూయార్క్ లో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేసింది దీప్తి. కానీ ఇక్కడ భారతీయ సినిమా పూర్తిగా కమర్షియల్ వైపు నడుస్తున్నది. చదువుకున్నదానికి, ఇక్కడి సినిమా స్థితికి పొంతన కుదరలేదు. అయినా ఆమె నట జీవితం 978లో శ్యామ్బెనగల్ ‘జునూన్’ సినిమాతో బాలీవుడ్లో మొదలయింది. ఛష్మేబద్దూర్, కమలా, మై జిందా హూ, ఆంఖే, మిర్చీమసాలా, సాత్సాత్, అంగూర్… సినిమాలన్నింటిలో ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. నిజానికి సమాంతర, ఆర్ట్ సినిమాలు చేయడం అంత సులభం కాదు.వాటిల్లో మమేకం అయి నటించాలి. పాత్రలకు జీవం పోయాలి. ఒక్కో పాత్ర కోసం ఎదురు చూసింది.ఎంపిక చేసుకుంది.
1981వచ్చిన ‘ఛష్మేబద్దూర్’ మొదలు.. 80 తొలినాళ్లలో సక్సెస్ఫుల్ ఆన్స్క్రీన్ జంట ఫరూక్షేక్, దీప్తి. ఈ ద్వయం తరువాత ‘సాత్సాత్’, ‘కిసీసే న కెహ్నా’, ‘కథ’, ‘రంగ్బిరంగీ’ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. మూడు దశాబ్దాల తరువాత 2011లో ‘టెల్ మీ ఓ ఖుదా’లో కలిసి నటించారు. ఇద్దరూ తెర పంచుకున్న చివరి సినిమా ‘లిజన్ అమాయా’. ఫరూక్షేక్ మరణించిన 2013లో విడుదలైంది.1990 తరువాత ఆమె కెరీర్ కొంత నెమ్మదించింది. 2000లో ‘బవందర్’, ‘ఫిరాక్’ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఉత్తమ నటిగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. హృషికేష్ ముఖర్జీ సినిమాలను ప్రేమించే ఆమె’చష్మేబద్దూర్’, ‘కథ’ వంటి జీవిత కథలను చిత్రీకరించిన సాయి పరాంజపే తనకు అత్యంత ఇష్టమయిన దర్శకురాలు. దీప్తి దర్శకుడు ప్రకాశ్ఝాను పెండ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాలు కలిసి వుంది మనస్పర్తల కారణంగా విడిపోయారు. కానీ మంచి స్నేహితులుగా వున్నారు. వాళ్లిద్దరూ ఒక అమ్మాయి దిశ ని దత్తత తీసుకున్నారు. పంచ్గానీలోని బోర్డింగ్ స్కూల్లో చదువుకున్న దిశ… శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. తండ్రి సినిమా ‘రాజనీతి’కి కాస్టూమ్ డిజైనర్గా పని చేసింది.
దీప్తి మంచి నటి మాత్రమే కాదు… ఫిల్మ్మేకర్ కూడా. మనీషా కొయిరాలా హీరోయిన్గా ఆమె తీసిన ‘దో పైసే కి ధూప్, చార్ ఆనేకి బారిష్’ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. 2009లో కాన్స్ లో ప్రదర్శితమైంది. దీప్తి కేవలం హిందీ లోనే కాకుండా అనేక భారతీయ భాషా చిత్రాల్లో నటించింది. పంజాబీలో “మర్హీ డా దీవా’, కన్నడంలో గిరీష్ కాసరవెల్లి రూపొందించిన ‘మనే’, మరాఠీ లో ‘అనాహాట్’ లో నటించారు. టీవీ లలో కూడా నటించారామె.
‘రచన తనకెంతో ఇష్టమైన, తన జీవితంలో అత్యంత ప్రధానమైన ప్రక్రియ. రాయకుండా ఉండలేను’ అని చెబుతుంది. ఆమె రాసిన వాటిలో ఇప్పటికి పబ్లిష్ అయినవి చాలా తక్కువ. కేవలం తన పనేదో తాను చేసుకుంటూ పోదామె… తన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్నెప్పుడూ పరిశీలిస్తూ ఉంటుంది. చిత్రకారిణిగా కాన్వాస్పై ఆయిల్ పెయింటింగ్ను ఇష్టపడతారు. ల్యాండ్స్కేప్స్ చిత్రించడానికే సుముఖత చూపుతుంది. ఎన్నో సెల్ఫ్ పోట్రెయిట్స్ కూడా గీసింది. ల్యాండ్స్కేప్స్ కంటే సెల్ఫ్ పోట్రెయిట్స్ లోతుగా, సునిశితంగా ఉంటాయి. చాలా సంవత్సరాలు ఒంటరిగా జీవించిన ఆమె..’నాకు నేనే బెస్ట్ కంపనీ’.. అంటుంది. రచనలు చేయడం తన హృదయానికి అత్యంత దగ్గరయిన కళ అన్నారామె.
ఇక ఇటీవలే తన చిన్ననాటి స్మృతుల్నీ, అనుభవాలనీ అక్షబద్దం చేస్తూ “ అ కంట్రీ కాల్డ్ చైల్ హుడ్” అన్న జ్ఞాపకాల తోరణాన్ని రాసారు. విడుదలయిన అతి కొద్ది రోజుల్లోనే విశేష ప్రాచుర్యం పొందింది.
తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని ధ్వనుల్నీ, అక్కడి సువాసనల్నీ అన్నింటినీ కలబోసి రాసిన పుస్తకమిది అంటారామె. అదికూడా కేవలం తాను గడిపిన కాలం అనుభవాలని ఉటంకించడం కాకుండా ఒక నవల చదివినంత ఆసక్తిగా ఉండేలా ప్రయత్నం చేసారామే. ఇది కేవలం దీప్తి తన 19 ఏళ్ళ వయసు వచ్చేవరకు గడిపిన చూసిన జీవితమే. మొదటి నాలుగు చాప్టర్లను 20 ఏళ్ళ క్రితమే రాసారు. తర్వాత ఇటీవలి 5 ఏళ్లుగా చేసిన రాసిన కృషి ఫలితంగా ఈ పుస్తకం వెలువడింది. ఇందులో ఎన్నో విషయాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా రాసారామే. తాను తన మిత్రురాళ్ళు ఆనాడు హీరో రాజేష్ ఖన్నా అంటే ఎంత పిచ్చిగా వుండే వాళ్ళో రాసింది. ‘ఆరాధన’ సినిమాలో రాజేష్ ఖన్నా తల ఊపుతూ చేసిన మానరిజం తననుఎంతగా ఆకట్టుకుందో రాసింది. ఆ సినిమాను 13 సార్లు చూసానంది. అంతే కాదు సఫర్, కటీపతంగ్ లాంటి సినిమాలంటే ఎంతగా పడిచచ్చామో రాసింది. ఇంకా తనను ‘మేరా నాం జోకర్’ ఎంతగా ఆకట్టుకుందో కూడా రాసింది దీప్తి. మొత్తంగా తన బాల్యాన్ని పునసృష్టించింది ఈ పుస్తకం లో.
“నిజానికి జీవన ప్రయాణం లో బాల్యాన్ని అందరం రిటర్న్ టికెట్ బుక్ చేసుకోకుండానే.. వదిలేసి వస్తాం,,తర్వాత కేవలం జ్ఞాపకాల్లోనే ఆ ప్రాంతాన్ని తిరిగి దర్శిస్తాం.’ ఆ పనిని దీప్తి అత్యంత ప్రేమతో ఆసక్తి తో సృజనాత్మకంగా చేసింది.
ఇట్లా బహుముఖీనమయిన రంగాల్లో సృజనాత్మక కృషి చేసిన దీప్తి నావల్ రాసిన కవితల్లోంచి కొన్నింటికి నేను చేసిన అనువాదాలు మీకిప్పుడు అందిస్తాను…
నేనూ-స్మిత
———————
మన కలల్ని వెంటాడుతూ
మనదెప్పుడూ ఒకటే పరుగు
ప్రతిసారీ విమానాశ్రయాల్లో సామాన్లు తెసుకుంటూనే,
వీ ఐ పీ లాంజిల్లోనో లోని వెళ్ళే కౌంటర్ల దగ్గరో కలుసుకునే వాళ్ళం
జనసమూహం మధ్య
మాట్లాడుతూనో మౌనంగానో
ఏదయినా చెప్పు కుందా మనుకుంటూ
భయం తో మనకు మనమే భయంతో
చుట్టూ జనం చేతులు ఊపుతూ కేరింతలు కొడుతూ
మనం పిచ్చితనం మధ్య అద్భుతాలుగా
ఓ క్షణం చూపుకోసం,
ఓ క్షణం స్పర్శ కోసం
ఓ క్షణం జీవించడానికి చూస్తూ చూస్తూ
కదిలి వెళ్ళిపోయేవాళ్ళం
మనం చివరిసారి కలిసి కూర్చున్నప్పుడు
నేనడిగినట్టు గుర్తు
“మనం మన బతుకుల్ని ఇంతకంటే
భిన్నంగా జీవించ వచ్చు అనుకుంటాను”
కొన్ని క్షణాల మౌనం తర్వాత
నావైపు చూడకుండానే
కళ్ళు కడపకుండానే
“అలాంటి వీలు లేదు” అన్నావు
ఇవ్వాళ నువ్వు వెళ్ళిపోయావు
కానీ
‘వీల్లేదు’ అన్న నీ మాట తప్పని
రుజువు చేసేందుకు
నేనిప్పటికీ పరుగులు పెడుతూనే వున్నాను
ప్రయత్నిస్తూనే వున్నాను
******* అనుసృజన- వారాల ఆనంద్
+++++++++++++++++++
మానసిక దుర్గంధం
—-
నీ లోపలేదో కుళ్ళి పోయింది
నీ దేహంలో రక్తమాంసాల్లో.. మానసిక దుర్గంధం
అది నీ కళ్ళల్లో శ్వాసిస్తున్నది
అది నీ మాసంలో ఇంకి క్షీనింపజేస్తుంది
ఆలస్యమయి పోతున్నది
నువ్వు దాంతో చచ్చిపోతావు
రాత్రి వెనుక రాత్రి అది నీతోనే నిద్రిస్తుంది
ఇష్టం లేని వయసు మళ్ళిన స్త్రీలాగా
ఎక్కడో వీధి చివర చీకట్లో గడుపుతుంది
అయినా అది నిన్ను అనుసరిస్తూ
నిన్ను చెత్తలో పడేయడానికి ఎదురు చూస్తుంది
నీకు తప్పించుకునే దారి లేదు
అది నీలో నీ రక్త మాంసాల్లో శ్వాసిస్తుంది
నువ్వు మానసిక దుర్గంధం తో చచ్చిపోవాల్సిందే
+++++++++++++++++++++++++++
ప్రయాణం సాగుతూనే వుంది
++++++ వారాల ఆనంద్
మిత్రులారా! ఇవ్వాళ 13 నవంబర్(2022) ‘సంచిక’ ఆన్లైన్ పతియాలో ప్రచురితమయిన నా కవిత, మిస్ అయిన వాళ్ళు చదువుతారని.. ఇక్కడ పోస్ట్ చేస్తున్నా..కస్తూరి మురళికృష్ణ గారికి ధన్యవాదాలు.
ప్రయాణం సాగుతూనే వుంది
++++++ వారాల ఆనంద్
ఇద్దరమూ నదీ ప్రవాహంలో
సముద్రంలో కలుసుకుందామనుకున్నాం
పయనించే ప్రవాహపు అలల్లో పుట్టిన ‘లయ’ను
చేతుల్లోకి తీసుకున్నాం
అది హృదయంలో ప్రతిధ్వనించింది
‘లయ’ని పిడికిట్లో బంధించాలనుకున్నాం
అది చేజారి ప్రవాహంలో కలిసిపోయింది
నది మంద్రంగా గాంభీర్యాన్ని సంతరించుకుంది
ఆకాశపు నీలి రంగుని
ప్రతిఫలిస్తూ మురిసి పోయింది
ప్రయాణం సాగుతూనే వుంది
సముద్రున్ని చేరతామో లేదో
ఎప్పటికయినా జతగా కలుస్తామో లేదో తెలీదు
కానీ
లక్ష్యం వైపు కలిసి నడుస్తున్నామనే భావనే
ఇద్దరిలో చిందులు వేస్తున్నది
ఆనందం చిగుర్లు తొడుగుతున్నది
*******
Like
Comment
Share
అంపశయ్య పై ‘సినిమా వినోదం’
FRIENDS, my weekly column in ‘DISHA’ daily
++++ వారాల ఆనంద్
“టికెట్ కొనుక్కుని థియేటర్ కు వెళ్లి సినిమా చూడడంలో వున్న ఆనందమే వేరు..దయచేసి థియేటర్ కు వెళ్ళండి మా బొమ్మల్ని చూడండి. ప్రస్తుతం పెద్ద సమస్యగా వుంది ఈరోజుల్లో ఎవరూ సినిమా థియేటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా వుండడం లేదు. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మా సినిమాని థియేటర్ కు వెళ్లి చూడండి” అంటూ సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసారు. తన పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా క్రోర్పతి’ కొత్త ఎపిసోడ్లో తమ కొత్త సినిమా ‘వూంచాయి’ ప్రమోషన్ షో నిర్వహించారు. ఆ సినిమాలో సహనటులు అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, బొమ్మన్ ఇరానీలను అతిథులుగా పిలిచి ఆ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ఈ మేరకు చేతులెత్తి ప్రేక్షకులను కోరుకున్నారు. అమితాబ్ లాంటి పాపులర్ సీనియర్ నటుడు ఈ మేరకు విజ్ఞప్తి చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవ్వాళ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం దాదాపుగా మానేసినట్టు కనిపిస్తున్నది. వారిని టాకీసుల దాకా రప్పించడం ఎంత గగనంగా మారిందో తేట తెల్లం అవుతున్నది. ఇన్నేళ్ళుగా భారతీయ ప్రజలకు చౌకగా అందుబాటులో వున్న సినిమా వినోదం ‘అంపశయ్య’ పై చేరిందా అనిపిస్తున్నది. ఎదో ఒక సినిమా ఆర్థికంగా విజయవంతమయితే పది సినిమాలు పరాజయం పాలవుతున్న వర్తమాన స్థితిలో హిందీ సినిమా రంగం తో సహా దాదాపు అన్ని భారతీయ భాషా సినిమా రంగాలూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ‘పుష్ప’, ఆర్ ఆర్ ఆర్’, కీజీఎఫ్ లాంటి సినిమాల తాకిడికి గురయి హిందీ సినిమా చచ్చిపోతోంది అన్న వాదన కూడా ముంబై లో విస్తృతంగా వినిపిస్తున్నది. ఆ వాదన కొంత అతిగా ఉన్నప్పటికీ వాస్తవంగా హిందీ సినిమా దాదాపు సంక్షోభంలో ఉందన్నది మాత్రం నిజం. దాదాపు మిగతా భాషా సినిమాలది కూడా అదే పరిస్థితి.
ఈ స్థితికి కారణాలని అన్వేషిస్తే రెండు అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఉప్పెనలా దాడి చేస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు కాగా రెండవది ఊక దంపుడు కథలతో రొడ్ద కొట్టుడు కథలతో సినిమా రంగం చేసుకుంటున్న స్వయంకృతాపరాధం.
మొదట సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు సినిమా ఆవిష్కరణే గొప్ప సాంకేతిక పరిణామం. తెరమీద బొమ్మలు కదలడమే ఆనాటి అద్భుతం. మూకీ నుంచి టాకీ, 16 ఎం.ఎం. నుంచి ఇప్పటి డిజిటల్ కాలం దాకా సాంకేతిక రంగం లో వచ్చిన మార్పులే ఇవ్వాల్టి సినిమా రూపానికి మూలాధారం. అప్పటిదాకా వీధి భాగోతాలూ, నాటకాలూ, బుర్రకథలు, హరికథలు మాత్రమె వినోదాంశాలుగా వున్న ప్రజలకు సినిమా కొత్త వినోదంగా ముందుకొచ్చింది. అయితే ఆ వినోదం తొలి రోజుల్లో కొంత సామాజిక ఉపయోగానికి, మంచి విలువలతో కూడిన కథలకు పరిమితమయి ప్రజల్ని అలరించాయి. కానీ సమాజంలో వచ్చిన మార్పులు, సాంకేతిక రంగంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణలు సినిమా రూపాల్ని పూర్తిగా మార్చేశాయి. సినిమా ప్రేక్షకులమీద మొట్టమొదటి సాంకేతిక ప్రభావం టీవీ లతో వచ్చింది. టీవీ వచ్చిన మొదటి రోజుల్లో సాయంత్రాలు, ఆదివారాలు ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రావడమే మానేశారు. రామాయణాలు, భారతాలు, సీరియల్లు, టీవీ లలో ప్రసారమయ్యే సినిమాల ప్రభావంతో 70 -80 లలో సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు కరువయ్యారు. తర్వాత వచ్చిన ‘వీడియో’ మరింత ప్రభావాన్నిచూపించింది. వీడియో పార్లర్స్ కొంత కాలం సినిమాల్ని దెబ్బ తీసాయి. కానీ క్రమంగా టీవీ కార్యక్రమాలు రొటీన్ కావడం వీడియోలు అంతగా ఆకట్టుకొక పోవడం తో పాటు థియేటర్లో చూసిన అనుభూతి పూర్తిగా కలగక పోవడం వలన ప్రేక్షకులు తిరిగి సినిమా హాళ్ళ వైపునకు మరలారు. సినిమాలు కూడా హింస, సెక్స్ లాంటి ఎమోషన్స్ ని ప్రేరేపించే కథలతో ప్రజల ముందుకు వచ్చి ఆకర్షించే ప్రయత్నాలు చేసాయి. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. కోవిడ్ నేఅధ్యంలో ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రాక పోవడం సరిగ్గా అప్పుడే ఓ టీ టీ లు రావడం తో పరిస్థితి పూర్తిగా మారి పోయింది. దాంతో పాటు విపరీతంగా పెరిగిన సెల్ ఫోన్ల వినియోగం కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నది. అరచేతిలోనూ, ఇంట్లోనూ సినిమాల్ని చూసే లుక్ కల్చర్ పెరిగిన తర్వాత ప్రత్యేకంగా సినిమా హాల్లకు వెళ్లి వందలాది రూపాయలు ఖర్చు చేసేందుకు భారతీయ ప్రస్తుతానికి సిద్దంగా లేరు.
ఓటీటీ గురించి జరిపిన ఒక సర్వ్ లో చెప్పిన దానిప్రకారం ఓ టీ టీ లలో డిస్నీ-హాట్ స్టార్ కు 4 కోట్ల మంది చందాదారులు వున్నారు. అట్లే అమెజాన్ ప్రైం కు 2- 2 ½ కోట్ల మంది, జీ5 కు 60 లక్షలు, నెట్ఫ్లిక్స్ కు 60 లక్షలు, సోనీ లైవ్ కు 40 లక్షలు,వూట్ కు 30 లక్షల మంది చందాదారులున్నారు. అట్లా దేశంలో మొత్తంగా పది కోట్లకు పైగా ఓ టీ టీ చందాదారులున్నారు. సగటున ఓ టీ టీ లలో స్ట్రీమింగ్ చూసే సమయం మాత్రం వారానికి 10 నుంచి 13 గంటలు మాత్రమే నని ఆ సర్వే సూచించింది. ఇక ఓ టీ టీ లలో వారానికి సగటున 2-3 సినిమాలు చూసే వారి సంఖ్యే హెచ్చుగా వుంది. గత రెండు సంవత్సరాలుగా చూస్తే ఓ టీ టీ ప్రేక్షకుల సంఖ్యక్రమంగా పెరగడం గమనించవచ్చు. అదే క్రమంలో సినిమా హాల్లల్లోకి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్యా తగ్గుతూ వస్తున్నది అన్నది నిజం. అంటే ఆమేరకు మన దేశంలో సినిమా హాల్లకు వెళ్ళే వినోదం ప్రమాదం లో పడినట్టే.
ఇక రెండో కారణం గురించి ఆలోచిస్తే మన దేశంలో ఉన్న సినిమా థియేటర్స్ లోకి వెళ్లి కొనే వాళ్ళ సంఖ్య ౩-4 కోట్లు వుంటారు. ఆ సంఖ్య సినిమా హాళ్ల లోని 80 శాతం సీట్లకు మాత్రమే సమానం. ఇక రెగ్యులర్ గా సాదారణ ప్రేక్షకుడు సంవత్సరానికి 5-6 సినిమాల్ని మాత్రం చూస్తాడు. ఆ స్థితిలో పెద్ద స్టార్లు, విపరీతమయిన ముందస్తు ప్రచారం వున్న సినిమాలకు మాత్రమె జనం తండోప తండాలుగా వచ్చే అవకాశం వుంది. మిగతావాటికి జనం రావడం గగనమే అయిపోతున్నది. అందుకే గతంలో లాగా టాకీసుల ముందు “HOUSE FULL” బోర్డులు కనుమరుగు అయిపోయాయి. మల్టీ ప్లేక్సులు, విపరీతంగా పెరిగిన టికెట్ రెట్లు కూడా మరో ప్రధాన కారణం. అంటే కథా కథనం భిన్నంగానూ హై ఫై గానూ వుండి ప్రేక్షకుల్ని ఊహా లోకాల్లోకి తీసుకెళ్ళే తరహా సినిమాలకు కొంత ఆదరణ దొరికే అవకాశం వుంది. అవి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అబ్బురపరిచే దృశ్యాలుతో కూడి వుండాలి.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియన్ సినిమాల పేరున వచ్చిన పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కీజీఎఫ్ లు అలాంటివే. ఇక మరో రకంవి ‘కాశ్మీర్ ఫైల్స్’. ఎదో ఒక భావోద్వేగాన్ని ప్రేరేపించే సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. రాజకీయంగా పాలకులు ప్రమోట్ చేయడం ఆ సిన్మా ఆదరణ పొందడానికి మరో ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
మొత్తం మీద ఇవ్వాళ ప్రజల్లో స్పూర్తిని పెపొందించే సినిమాల కంటే ఆకాంక్షల్ని అవీ భూటకపు ఆకాంక్షల్ని పెంచే సినిమాలకు అధికంగా ఆదరణ లభిస్తున్నది. అది సమాజానికి అంత అభిలాష నీయమయింది కాదు. కానీ కేవలం లాభాలు మాత్రమె పరిగణన లోకి తీసుకునే వ్యాపార సినిమా రంగం పెట్టుబడి లాభాల ప్రాతి పదికగా పని చేస్తుంది. అందుకే వందలాది కోట్ల పెట్టుగది తో మరిన్ని సినిమాలు రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. వాటిల్లో ఎన్ని ‘పుష్ప’ సినిమాలు అవుతాయో, మరిన్ని ‘ఆచార్య’ సినిమాలు అవుతాయో చూడాలి.
కానీ మొత్తం మీద మన ప్రేక్షకులకు అతి చౌకయిన వినోదాన్ని క్రమంగా అతి ఖరీదయిన వినోదం గా మార్చే పనిలో సినిమా రంగం తల మునకలయి వుంది.. చూద్దాం ఇంకా ఏమి జరుగానుందో..భవిష్యత్తులో సినిమా వాళ్ళు గెలుస్తారా ప్రేక్షకులు నెగ్గుతారా…
-వారాల ఆనంద్
కవిత్వమూ సామాజిక ఉద్యమాలూ ఆమెకు రెండు కళ్ళు- సుగత కుమారి
+ వారాల ఆనంద్
‘పువ్వు వికసించినంత సహజంగా నాలో కవిత్వం జనిస్తుంది’ అంటారు సుగత కుమారి. అంతే కాదు ‘నేను కేవలం పాడగలను అంతే… ‘ ఎట్లా ఏమిటి అంటే నేనేమీ వివరించలేను అంటా రావిడ. ఆమె కవిత్వం నిండా మనుషుల పట్ల ప్రేమా, మనుషుల యొక్క వేదన ధ్వనిస్తాయి. అంతేకాదు పర్యావరణ సమస్యలు.అస్తిత్వ పరితాపాలు, ప్రేమకోసం స్త్రీల అన్వెషణలు ఇట్లా అనేక అంశాలు ఆమె కవిత్వంలో ప్రతిధ్వనిస్తాయి.
1970 లలో మలయాళ సాహిత్యం లో ఆధునికత వెల్లివిరుస్తున్న నాటికే సుగత కుమారి సుప్రసిద్ధ కవి. నిజానికి ఆనాటి కేరళ ఆధునిక సాహిత్యా ఆవరణంలో స్త్రీ స్వరాలు తక్కువే. అధికంగా పురుష సాహితీ వెత్తలే ఆధునిక సాహిత్య దివిటీని పట్టుకుని ముందుకొచ్చారు. కాని 1975 లో ఎప్పుడయితే సుగత కుమారి తన ‘రాత్రిమజ’ (నైట్ రెయిన్) కవిత రాసిందో అప్పుడే ఒక స్థిరమయిన స్వంతదయిన మహిళా గొంతుక వినిపించింది. ఇక అప్పటినుండి ఆ గుంతుక విస్తారంగా మాట్లాడుతూనే వుంది. ఒక్క సాహిత్య రంగం లోనే కాదు అనేకానేక సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటూ అనేకమంది సాహిత్య కారులని సామాజిక ఉద్యమాలకు మద్దుతును కూడగట్టే పనినీ ఆమె విజయవంతంగా చేసారు. ముఖ్యంగా పర్యావతనం, మహిళా సాధికారికత లాంటి అంశాల్లో సుగత కుమారి చేసిన కృషి విశేషమయింది. ఓ పక్క రాస్తూనే మరో పక్క ఉద్యామాలు నడిపించారామే.
నిజానికి మలయాళీ సాహిత్య చరిత్రలో మహిళల పాత్ర తక్కువే. అక్కడ మీరాకానీ, అక్క మహాదేవి కానీ, ఆండాళ్ లాంటి కవయిత్రులు గానీ లేరు. కేవలం అరబిక్ మలయాళం గీతాల్లో కొన్ని సార్లు ఏవో కొన్ని పేర్లు వినిపిస్తాయి. ముఖ్యంగా 19 వ శతాబ్దం లో కుట్టికుంజు తన్గాచీ, తోట్టాయికట్టు ఇక్కవమ్మ లాంటి కొంత మంది ఎదిగి వచ్చారు. వారి తర్వాత అక్కడ కవయిత్రిగా ఎదిగి గణింప దగ్గ కృషి చేసిన వారిలో సుగత కుమారి అత్యంత ప్రముఖులు.
…
సుగత కుమారి 22 జనవరి 1934 న జన్మించారు. ఆమె తండ్రి బోదేశ్వరన్ గా పేరుగాంచిన కేశవ పిళ్ళై స్వాతంత్ర సమరయోధుడు. గాంధేయ వాది. ఆమె తల్లి కాత్యాయనీ అమ్మ సంస్కృత పండితురాలు. ఆ ఇద్దరి ప్రభావం చిన్నప్పుడే సుగత కుమారి పైన పడింది. చదువు పట్ల అమిత ప్రేమ వున్న ఆమె తన డిగ్రీ విద్యను తిరువనంతపురం లోని యునివర్సిటీ కాలేజీలో పూర్తి చేసారు. తర్వాత తత్వశాస్త్రం లో పీజీ చేసారు. ఆ తర్వాత మూడేళ్ళపాటు పరిశోధనా రంగం లో ఉన్నప్పటికీ తన పీ.హెచ్.డీ. పూర్తి చేయలేకపోయారు. ఆమె ఫిలాసఫీ తో పాటు విద్యా మనస్తత్వ శాష్ట్రంలో కూడా మంచి అభినివేశాన్ని పొందారు. తాను తన మొట్టమొదటి కవితను 1957 లో రాసారు. తన మొదటి కవితను ఆమె కలం పేరుతో రాసారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమె రాష్ట్ర విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసారు.
సుగత కుమారి కి 1978 లోనే ఆమె రాసిన ‘పతిరా పుక్కయి’( FLOWERS OF MIDNIGHT ) కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. అమె రచనల్లో ముఖ్యమయినవి ముత్తు చిప్పి, పతిర పూక్కల్, పావం పవం మానవ హృదయం, ప్రణామం, ఇరుచిరకుకల్, రాత్రి మజా, అంబాల మని, రాదేయవిడే, దేవదాసి, అభిసారిక లాంటివి అనేకం వున్నాయి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు తో పాటు ఒడకుజ్జల్ అవార్డు, వయలార అవార్డు, ఆసాన్ అవార్డు, వీ టీ సాహిత్య అవార్డు, బషీర్ పురస్కారం, సరస్వతీ సమ్మాన్, కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు తో పాటు ఇంకా అనేక అవార్డులు లభించాయి. తనకు 2006 లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.
పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా పోరాటం చేసారు. మూడు దశాబ్దాల కింద పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో హైడల్ ప్రాజెక్ట్ను నిర్మాణాన్ని అడ్డుకొన్నారు. అందుకోసం పెద్ద ఉద్యమాన్నే లేవదీసారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చారు. ఇటీవల కూడా మరో ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు. అర్నములాలో విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా సుగతకుమారి నేతృత్వంలో ఉద్యమం చేపట్టారు. అట్లా సుగాతా కుమారి కవిత్వం రాయడం తో పాటు అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రధాన భూమికను పోషించారు. ముఖ్యంగా సలేంట్ వాలీ ఉద్యమంలో ఆమె కృషి గొప్పది. ఆమె తాను పాల్గొనడం తో పాటు అనేకమంది మలయాళీ సాహితీ వేత్తల్ని ఈ ఉద్యమానికి మద్దతుగా కూడగట్టారు.
ఫలితంగా ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమంలో రచయితలు తమ రచనల్ని కొనసాగించారు.భౌతిక పర్యావరణాన్ని కాపాడడం కోసం విలువల ప్రాముఖ్యతను చెప్పారు. సామాజిక అంశాల్నిశాస్త్రీయ అంశాలతో జోడించారు. అది పర్యావరణీయం అయ్యింది. కవులు రచయితలూ ఉద్యమంలో చేరేసరికి ఉద్యమం తీవ్ర స్ధాయికి చేరింది, ఆ వేగాన్ని వీరు మరింత పెంచారు. వైకం బషీర్,యస్.కే. పోట్టేకర్,ఓ,వీ. విజయన్, కే.భాస్కరన్ నాయర్, సుకుమర్ర్ అజ్హికోడే వంటి వారు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. వివిధ ప్రయోగాలు చేసారు అందులో భాగంగా 1983లో 34 కవితలతో కూడిన ‘వనపర్వం’ అన్న కవితా సంపుటిని ప్రచురించారు. సుగత కుమారి సైలెంట్ వ్యాలీని
‘దట్టమైన,చల్లని, జీవం ఉట్టిపడుతున్న ప్రదేశం, భూమి వ్యక్త పరిచిన అత్యత్భుతమైన భావన’ అంటారు.
ఆ భావాలన్నీ వనపర్వంలో చోటుచేసుకున్నాయి. వనపర్వం అన్న శీర్షికకి స్ధానికులు సైలెంట్ వ్యాలీ గురించి చెప్పే కధకి పోలిక వున్నది. ఈ ప్రాంతాన్ని సైరంధ్రి వనం అంటారు. ద్రౌపది కి వున్న మరో పేరు సైరంధ్రి. వనవాసమప్పుడు పాండవులు ఇక్కడ కొంత కాలం గడిపారని వారి నమ్మకం. కాలక్రమేణా బ్రిటిష్ వారి కాలం వచ్చే సరికి సైరంధ్రి వనం సైలెంట్ వ్యాలీ గా మారింది. ఈ ప్రాంతాన్ని చిపింగ్ సిడా అన్న అడవి క్రిమి వల్ల కూడా సైలెంట్ వ్యాలీ అన్న పేరు వచ్చింది అన్న నానుడి కూడ వుంది.
సాహిత్యం ద్వారా కేవలం సైలెంట్ వ్యాలీ అంశాలనే కాక ప్రకృతి మానవ మనుగడ గురించి విశిష్టంగా ‘ప్రకృతి సంరక్షణ,సుస్ధిర జీవనం’ అన్న నినాదం తో ప్రకృతి సంరక్షణ సమితి పని చేసింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రచారానికి కేరళ నలుమూలల వివిధ కళా రూపాల ద్వారా ప్రచారం చేసారు. 1980 జూన్,6 వ తేదీన కవులను సత్కరించారు. ప్రముఖ కవులు కవితలు చదివి పర్యావరణ విశిష్టతను చెప్పారు. సైలెంట్ వ్యాలీ సంరక్షణకు వివిధ స్ధాయిల్లో సమితి కృషి చేసింది. అందులో సుగత కుమారి ప్రముఖ పాత్ర పోషించారు ,ఆమె రచించిన ‘మరతిను స్తుతి’(వృక్ష గీతం) విశిష్ట ప్రాచుర్యం పొందింది. ఈ కవితలో ఆమె చెట్టుని, భూమిని కాపాడడానికి విషం తాగిన శివుడిగా వర్ణిస్తారు. నేను అతనిని పూజిస్తాను/ ఎవరైతే శ్వాస గాలినిస్తారో/ విషం తాగి/నీలకంటుడిలా’(5-8). ఇదంతా పాటకుడికి కిరణజన్య సంయోగంగా అనిపించవచ్చు. ఈ కవిత ప్రకృతి సమతుల్యతను శాస్త్రీయంగా వివరిస్తుంది. ప్రకృతిలో చెట్టు పాత్రను ,అది మానవ మనుగడకు చేసే ఉపయోగాలను.
నువ్వు మా
తల్లి భూమిని వరదల నుండి రక్షిస్తావు
నేలను పునర్జీవింప చేస్తావు
నువ్వుఅమృతాన్ని భద్ర పరుస్తావు
దివినుండి భువి కి వస్తున్న దానిని
ఉబుకుతున్న నీ గుండెల్లో(౩౩-40,పంక్తులు)
భూమి ఏమైనా ఆడుకునే బంతా లేక ఆడుకునే బొమ్మా! (43-44 పంక్తులు)
ఈ కవితలో భూమి కున్న ఓపికను పరిక్షించొద్దని హెచ్చరిస్తారు. దీని ద్వారా ‘ప్రకృతి మన తల్లి ,ఆమెని పూజ్య భావంతో, ప్రేమతో దరి చేరమని చెపుతారు. మన చర్యలు విధ్వంశంగా వుంటే ప్రకృతి ప్రతిచర్యలు అదే విధంగా ఉంటాయి’ ఇది అర్ధం చేస్కునే సునిశిత మనకు అవసరం.
మానవసేవే.. మాధవ సేవ.. దీన్ని అక్షరాల పాటించారు సుగుత కుమారి. కల్లాకపటం, కల్మషం లేని మానసిక రోగులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి మరో జన్మ కల్పించారు. కేరళలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో రోగుల దుస్థితిని చూసి చలించి, మానసిక రోగుల కోసం ఏకంగా ఆమె ఓ గ్రామాన్నే నెలకొల్పారు. వేలాదిమందిని తన పిల్లలుగా చూసుకుంటూ, వారి కలలనే తన కలలుగా చేసుకుంటూ జీవితాన్ని గడిపారు. మానసిక రోగులకే కాదు, అనాథ బాలికలు, మహిళలు, ఆల్కాహాల్, డ్రగ్ బాధితులకు కూడా ఆశ్రయం కల్పించారు. అన్ని కేర్ హోమ్ సెంటర్లాంటిదిగా కాకుండా అక్కడ వీరూ వారూ అనే తేడా లేదు.. అక్కడ అందరికీ చోటు ఉంటుంది. తిరువనంతపురంలోని కేర్ సెంటర్లో లైంగిక వేధింపుల బాధితులు. గృహ హింస బాధితులు. డ్రగ్ అడిక్ట్స్ కు వసతి కల్పించారు. అనాథ బాలికలు. ఎవరూ లేని మహిళలకూ నివాసం కల్పించారు. వారు ఎదుర్కొన్న సమస్యలన్నీ వారికి గతం అయిపోయి వారు కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. చదువుకుంటున్నారు. ఉపాధి పొందుతున్నారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో మరో కొత్త జీవితానికి పునాది వేసుకుంటున్నారు. మూడు దశాబ్దాల సేవ..
ఇంకా సుగతకుమారి ఆధ్వర్యంలో తిరువనంతపురంలో అనాథలు, నిరాశ్రయులు, బాధితుల కోసం ఎయిటీస్లో ‘అభయ’పేరుతో ఓ ఆశ్రమాన్ని నెలకొల్పారు. లైంగిక వేధింపుల బాధితులతోపాటు వివిధ కారణాలతో అనాథలుగా మారిన, నిరాశ్రయులైన వేలాదిమంది జీవితాల్లో ఈ సంస్థ వెలుగులు నింపింది. ‘అభయ’కు మొదటి నుంచి నిధుల కొరత ఎదురుకొంది.అయినా నిధుల కొరత కారణంగా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే వున్నా ఆ సంస్థలో చేరిన వారు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో బయటకు నిలదొక్కుకున్నారు. ఆశ్రమంలో చేరినప్పుడు బేల చూపులు, భవిష్యత్పై భయంతో కనిపించిన వారి కళ్లలో మెరుపులు నిండాయి. గొప్ప ఆత్మ విశ్వాసం నిండిన వ్యక్తిత్వం తో భవిష్యత్పై ఆశతో కొత్త జీవితాల్ని ఆరంభిస్తున్నారు. సుగతకుమారి విజయానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. 14 జిల్లాల్లో పునరావాస కేంద్రాలు..
‘సరస్వతి సమ్మాన్’ అవార్డు గ్రహీత, రచయిత్రి సుగతకుమారీ ‘అభయ’ను మరింత విస్తరించాలనుకున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారి కోసం కేరళలోలని 14 జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు.
కేరళలలోని ప్రభుత్వ ఆసుప్రతులలో మానసిక వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోవడంతో 1985లో ప్రత్యేకంగా మానసిక రోగుల కోసమే ‘అభయ’ ఏర్పాటైంది. ‘‘ఇప్పటికే ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. వేలాదిమంది నిరాశ్రయులకు జీవితంపై ఆశ కల్పించాం. ఈ మూడు దశాబ్దాలలో వదిలివేసిన, నిరాశ్రయులైన, అనాథలకు అండగా నిలిచాం’’ అనుకోకుండా ‘అభయం’ ఏర్పాటయింది. ప్రస్తుతం మల్టీ యూనిట్ ఇన్స్టిట్యూట్గా ఎదిగింది. అక్కడ పునరావాసంతోపాటు చికిత్సను కూడా అందిస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్, అనాథ బాలికలకు కేర్హోమ్, మహిళలకు వసతి గృహాలను నెలకొల్పారు. సన్నిహితులంతా ‘టీచర్’ అని పిలుచుకునే సుగత కుమారి ఓసారి తిరువనంతపురంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలను సందర్శించారు. ఆ సమయంలో రోగులతో ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుతో ఆమె కలత చెందారు. ఆ సమయంలోనే ‘అభయ’ను నెలకొల్పాలని ఆమె డిసైడయ్యారు. ‘‘మేం అడుగుపెట్టేవరకు కేరళలో మానసిక రోగుల పరిస్థితి ఘోరంగా ఉండేది. వారిని పట్టించుకునే నాథుడే లేరు. హాస్పిటల్లో నేను చూసిన పరిస్థితులను వివరించడానికి కూడా నోరు రావడం లేదు.. అర్ధనగ్నంగా, గాయాలతో రోగులు విలవిలలాడుతూ కనిపించారు. ఓ చిన్నరూమ్లో వారిని బంధించారు. చాలామంది నా కాళ్లు పట్టుకుని భోజనం పెట్టమని వేడుకున్నారు’’ అని ఆనాటి పరిస్థితులను ఆమె కళ్లకు కట్టారు. 81 ఏళ్ల సుగతకుమారి పోరాట ఫలితంగా, ఏళ్లుగా అధికారుల వెనకపడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ప్రస్తుతం ‘‘అభయ’ సేవలను మరింత విస్తరించారు. మలయిన్కీజు గ్రామం శివార్లలో 10 ఎకరాల విస్తీర్ణంలో ‘అభయగ్రామం’ పేరుతో మానసిక రోగుల కోసం మరో ప్రపంచాన్ని 1992లో నిర్మించారు. ఈ ‘అభయ గ్రామం’ నర్వ్ సెంటర్కు ప్రఖ్యాత టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పునాది రాయి వేశారు. దలైలామా స్ఫూర్తితో.. దలైలామా ప్రసంగాలు విని, స్ఫూర్తి పొందే సుగతకుమారి, నిరాశ్రయులకు బాసటగా నిలుస్తున్నారు. ‘‘ఓసారి దలైలామా ఇలా అన్నారు. ఈ భూమిని నిరుపేదలకు, ఇళ్లులేని వారికి ఆశ్రయంగా చేయాలి అని. అప్పటి నుంచి ఆయన ఆశయాల సాధనకు ప్రయత్నిస్తున్నాను’’ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం అభయ ఎనిమిది కేంద్రాలుగా విస్తరించింది, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చికిత్స, ఆశ్రయం కోసం ‘కర్మ’ మానసిక రోగల తాత్కాలిక, దీర్ఘకాల సంరక్షణ కోసం ‘శ్రద్ధభవనం’, మిత్ర పేరుతో డీ అడిక్షన్, మెంటల్ హెల్త్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. అనాథ బాలికల కోసం ‘అభయబాల’, మహిళల తాత్కాలిక వసతి కోసం ‘అతని’, అల్కాహాల్, డ్రగ్ బాధితుల కోసం ‘బోధి’ మానసిక రోగుల కోసం ‘పకల్వీడు’ డే కేర్ సెంటర్లను కూడా ‘అభయ’ నిర్వహిస్తోంది. ఇవే కాకుండా మహిళల కోసం 24 గంటల హెల్ప్లైన్, మహిళల కోసం ఉచితంగా న్యాయ సాయం కూడా అందిస్తున్నది. నిధుల కొరత.. నిరాశ్రయుల కోసం, ముఖ్యంగా మానసిక రోగుల కోసం వివిధ రకాల సెంటర్లను నిర్వహిస్తున్న ‘అభయ’ను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రస్తుతం ‘అభయ’లో 200 మంది నిరాశ్రయులు, 80 మంది ఉద్యోగులున్నారు. ‘ప్రభుత్వ కేటాయింపులు, వ్యక్తిగత విరాళాలపైనే ఆధారపడుతున్నాం. నిధుల కొరత కారణంగా ఎక్కువమందిని ఉద్యోగులను పెట్టుకోలేకపోతున్నాం. అందువల్ల నిరాశ్రయులు సమస్యలపాలవుతున్నారు. ఉద్యోగంలో పెట్టుకున్నవారికి సైతం సరిపోయేంత జీతం ఇవ్వలేకపోతున్నాం’’ అని సుగత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మతాలు, కులాలతో ‘అభయ’కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే సంస్థకు బలమూ, బలహీనత. ఒకవేళ ఎదైనా మతపర సంస్థతో సంబంధం ఉండి ఉంటే, లక్షల రూపాయలు విరాళాలుగా వచ్చేవి’’
అట్లా కవిత్వాన్ని శ్వాసిస్తూ సమాజం కోసం కృషి చేస్తూ సుగత కుమారి తన 87 వ ఏట, 23 డిసెంబర్ 2020 రోజున తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కోవిడ్ 19 కు చికిత్స పొందుతూ తనువు చాలించారు. పూర్తి ప్రభుత్వ లాంచనాలతో ఆమె అంతిమ యాత్ర నిర్వహించారు.
ఆమె కవితల్లోంచి తెండు కవితలకు నేను చేసిన అనుసృజన ____
నువ్వు వెళ్లి పోయింతర్వాత
+++++
నువ్వు వెళ్లి పోయింతర్వాత ! చూడు
నేనిక్కడే వున్నాను, వెన్నెలా ఇక్కడే వుంది
పగలూ రాత్రీ ఏ కొంచెమూ మారలేదు
ఆకాశంలో నక్షత్రాలున్నాయి
అయినా చీకటి పడే వేళ
ఇంట్లో నేను దీపం వెలిగిస్తూనే వున్నాను
నువ్వు వెళ్లి పోయింతర్వాత
పున్నమి చంద్రుడు విరగబడి నవ్వుతున్నాడు
అయినప్పటికీ మన చీకటి పెరట్లో
పాల వెన్నెల చిందిస్తూనే వున్నాడు
రాత్ర మల్లెలు ఎప్పటిలాగే విరగబూస్తున్నాయి
చల్లటి గాలి సువాసనలు అట్లాగే వున్నాయి
పట్టు వీడకుండా చిన్న పిల్లాడి ఏడుపును వింటూనే వున్నాను
ప్రతిదీ ఎప్పటిలాగే మామూలుగానే వున్నాయి
స్నానం నిద్ర పేపర్ చదవడం
ఎంతో పని వుంది అతిథులు వస్తూనే వున్నారు
నిత్య కృత్యాలు మామూలుగా సాగుతూనే వున్నాయి
నువ్వు లేకున్నప్పటికీ అన్నీ అర్థం లేకుండా
ఎప్పటిలాగే సాగుతూనే వున్నాయి
పగిలిన పూల కుండీలో పాత తులసి మొక్క
ఎవరూ నీళ్ళు పోయాక ఎండిపోతున్నది
ఇప్పటికీ కేవలం నీ జ్ఞాపకాల్లో
అన్నీ యధావిధిగానూ ప్రతిదీ మామూలుగానూ వున్నాయి
ఇదంతా యువ యాత్రికుల కోసం రాస్తున్నాను
చేతిలో చెయ్యేసి
నడవడానికి కొంచమయినా సమయం లేదు…
కోరికకు… ప్రేమకు కూడా..
++++++++++++++++++++++
మూలం- సుగత కుమారి
స్వేచ్చానువాదం – వారాల ఆనంద్
*********************************
రాత్రి వాన (NIGHT RAIN)
*******
రాత్రి వాన
ఏ కారణమూ లేకుండానే
నవ్వుతోంది ఏడుస్తోంది
విరామం లేకుండా అర్థం లేని
గుస గుసలు పోతోంది
తన పొడవయిన నల్లని వెంట్రుకల్ని గాలిలో వూపుతోంది
అది వంగి కూర్చున్న ఓ యువతిలా వుంది
రాత్రి వాన
ఆసుపత్రి వార్డుల్లోకీ ప్రవహిస్తుంది
అంతు లేని ఏడుపులో నన్ను
తన తెల్లని చేతులతో లాలిస్తుంది
అది జాలీల్లోంచి విస్తారంగా చేతులు సాచిన
చీకటి రాత్రి యొక్క దుఖపుకూతురు
రాత్రి వాన
నొప్పితో మూలుగులు షాకులు ఆశ్చర్యాలు కొపపు శబ్దాలు
ఒక్కసారిగా అమ్మ అరుపులు నన్ను ఆశ్చర్య పరుస్తాయి
చెవుల్ని మూసుకునేలా చేస్తాయి
అవన్నీ నన్నూ నా అనారోగ్యపు మంచాన్నీ చేరతాయి
రాత్రంతా బంధువుల్లా
ఓదార్పు మాటలతో నన్ను వూరడిస్తాయి
ఎవరో అన్నారు
పాడయిపోయిన అవయవాల్ని తొలగించాలని
కాని వాటికంటే ఎక్కువగా పాడయిన
మనసు సంగతేమిటి
రాత్రి వాన
గతంలో నా సంతోషపు రాత్రుల్లో నన్ను ఎంతగానో నవ్వించింది
అమితంగా పులకింపజేసింది
నా కెంతో ప్రేమను మరెంతో ప్రకాశ వంతమయిన
వెన్నెలనీ ఇచ్చింది
గాఢ నిద్రలో ఉలికి పాటుకు గురి చేసింది
నా ప్రేమకు గత కాలపు సాక్షంగా నిలిచింది
‘రాత్రి వాన’..
నేనివ్వాళ అనారోగ్యంతో మంచం మీద ఒంటరిగా అసహనంగా
అటూ ఇటూ దొర్లుతూ కనీసం ఏడవడాన్నీ మర్చిపోయి
శిలలా గడ్డ కట్టుకు పోయి
నా వేదనకు కొత్త సాక్షంగా మారాను
రాత్రి వానకు చెప్పేస్తాను
నీ దుఖభరిత తడి పాట నాకు తెలుసు
నీ దయాగుణం, అణచి వేయబడ్డ నీ ఆవేశం
చీకట్లో నీ రాక, నీ ఒంటరి ఏడుపు
కన్నీళ్లను త్వర త్వరగా నువ్వు తుడిచి వేయడం
ఎదో నెపం మీద త్వరపడ్డం ఏడవడం నవ్వడం
నాకు తెలుసు నాకన్నీ తెలుసు
ఎందుకో నీకు తెలుసా
నా ఆత్మ సహచరుడిగా నేనూ నీలాగే వున్నాను
ఇలాగే వున్నాను రాత్రి వానలా…
మూలం- సుగత కుమారి
స్వేచ్చానువాదం – వారాల ఆనంద్
బాలలు వోటర్లు కాదనేగా.
My WEEKLY COLUMN IN ‘DISHA’ daily
బాలలు వోటర్లు కాదనేగా.
—————— వారాల ఆనంద్
నవంబర్ నెల వచ్చిందంటే చాలు మనకు నెహ్రు గారి జయంతీ.. బాలల దినోత్సవం గుర్తొస్థాయి. అప్పుడు అందరమూ పిల్లల గురించి మాట్లాడతాం. అటు ప్రభుత్వమూ ఇటు సంస్థలూ సభలు పెడతాయి. జెండాలు కడతాయి. పిల్లలకు మిఠాయీలు పంచుతాయి. అంతా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. భావి భారత పౌరులు అంటాం. భవిష్యత్తు నిర్మాతలు అంటాం. మర్నాటికి మరిచిపోతాం.
నిజాలు మాట్లాడుకుంటే పిల్లలంటే మనకు అసలు పట్టింపు లేదు, ప్రేమ అసలే లేదు.ఇట్లా అంటే కొంచం కష్టం అనిపించొచ్చు. కానీ అది నిజం. మనం కేవలం నవంబర్ రోజులలో మాత్రమే పిల్లల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ళ కోసం ఆలోచించం. ఏమీ చేయం. ప్రభుత్వాలూ పార్టీలూ ఏమీ చేయవు. ఎందుకంటే బాలలు వోటర్లు కాదు. వాళ్లకు వోటు హక్కు లేదు.
అంతేకాదు బాల కోసం ప్రత్యేకంగా ఏమీ రాయం. కథలు లేదా కవితలు రాయడానికో వాళ్ళని ప్రోత్సహించం. పిల్లల్ని మార్కుల వెంట పరుగేత్తిస్తాం. మెరిట్ అంటూ హింస పెడతాం. ఇప్పుడు ఇంకా ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ తరగతుల పేర కనీస సంబందాల్నుంచీ దూరం చేస్తున్నాం. అన్ని భారతీయ భాషల్లోనూ చూస్తే కేవలం బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో తప్ప మిగతా ఇతర భాషల్లో బాలసాహిత్యం తక్కువ. కొన్ని భాషల్లో నయితే శూన్యం. పిల్లల కోసం రాసేవాళ్ళు తక్కువ. రాసిన వాళ్లకు గుర్తింపు తక్కువ. పిల్లల పుస్తకాలకు మార్కెట్ తక్కువ. పిల్లల్ని చేరే సాహిత్యం తక్కువ. అంతేకాదు పిల్లల కోసం సృజనాత్మక కార్యక్రమాలు మరీ తక్కువ. దేశంలో పాలకులు అధికారులు చివరికి తల్లిదండ్రుల్లో కూడా (ఏ కొంత మందో తప్ప) పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ కానీ వాళ్ళకోసం ప్రత్యేకించి చేసేది తక్కువే.
ఇక మన దేశంలో బాల సాహిత్యం కంటే ‘బాలల సినిమాల’ ది మరీ దారుణమయిన పరిస్థితి. దాదాపు అన్ని భాషల నిర్మాతల్లోనూ పిల్లల సినిమాలు తీస్తే మార్కెట్ లేదు ఏమొస్తుంది అనే భావనే. మలయాళం, బెంగాలీ లాంటి కొన్ని భాషల్లో వేళ్ళ మీద లెక్కించే కొన్ని మంచి సినిమాలు మాత్రం తీసారు. ఇక ముంబై లోని బాలల చిత్ర సమితి ( CHILDREN FILM SOCIETY OF INDIA) నిర్మించిన వందలాది పిల్లల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా ముంబై లో పడి వున్నాయి.
ఫిలిం సొసైటీ ఉద్యమం బలంగా వున్న కాలంలో కరీంనగర్ లో రెండేసి వారాల పాటు పిల్లలంతా స్కూల్లల్లోంచి ఉదయమే ‘ప్రభాత్ భేరీ’ లాగా వరుసగా సినిమా హాల్లకు వచ్చేవాళ్ళు. వూరు ఊరంతా ఆ బాలల చలనచిత్రోత్సవాలు జరిగినన్ని రోజులూ పెద్ద కోలా హలంగా వుండేది. 80 ల నుంచి రెండున్నర దశాబ్దాల పాటు కరీంనగర్ తో పాటు వేములవాడ,సిరిసిల్లా, జగిత్యాల,లాంటి అనేక చోట్ల పిల్ల సినిమాల పండుగ జరిగేది. అంతే కాదు ముఖ్యంగా 1987 లో గ్రామీణ బాలలకోసం చొప్పదండి, తాటిపల్లి, కొండాపూర్, మల్లాపూర్, పెంబట్ల తదితర గ్రామాల్లో గ్రామీణ బాలల చిత్రోత్సవాల పేరపిల్లల సినిమాలు ప్రదర్శించారు.
కానీ ఫిలిం సొసైటీ ఉద్యమం సనగిల్లిన తర్వాత ఇప్పుడు “ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు” అని బాధ పడాల్సిన స్థితి నెలకొంది.
చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రథమ భారత ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు నియమించబడిన ఎస్.కె.పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో ఏర్పాటయింది. చిల్ద్రెన్ ఫిలిం సొసైటీ ఆక్టివ్ గా వున్నప్పుడు ముఖ్యంగా కేదార్ శర్మ, భీమసేన్, జయాబచ్చన్, సాయి పరంజపే, గుల్జార్ తదితరులు దానితో వున్నప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. పోత్లీ బాబా, జంగల్ బుక్, ముజ్సే దోస్తీ కరోగే, లావణ్య ప్రీతీ,ఇట్లా ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి.
బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 1995 లో మొదటి సారి గా మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు. తర్వాత 1999 లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలని హైదరాబాద్ని ప్రతిపాదించారు.
అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతే కాదు రాష్ట్రం లో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీకి భూమి ఇస్తామని అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఇదంతా ప్రకటనల ఆర్భాటమే తప్ప అవేవీ అప్పుడు సాకారంకాలేదు. ఇప్పటికీ కాలేదు. భూమి ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఆధీనం చేయలేదు. తెలంగాణా ప్రభుత్వం వచ్చింతర్వాత కూడా అదేమీ జరగ లేదు. ఇంతలో కేసులు వగైరాలతో అది మూల బడింది. ఇప్పుడా భూమి వుందో అన్యాక్రాంతం అయిందో ఎవరికీ పట్టింపు లేదు. ఇప్పటికీ శాశ్వత వేదికకు ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్లో టూరింగ్ ఫెస్టివల్ గానే మిగిలిపోయింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ అధికారులు రెండేం డ్లకోసారి హైదారాబాద్ వచ్చి ఏదో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహించాము అనిపించి అది అయిపోగానే పెట్టె బేడా సర్దుకుని వెళ్ళి పోయే వాళ్లు. ఇప్పుడు అదీ లేదు.
నిజానికి పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ఎదుగుదలకు, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకి దోహదపడి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. సాంస్కృతిక విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి, ఎప్పుడో రెండేండ్లకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, రష్యాల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అద్భుతంగానూ, భావస్పోరకంగానూ వుంటాయి. అవి మొత్తం ప్రపంచాన్ని కట్టి పడే శాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి ఉన్నది. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మనసుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించ గలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్ర చలన చిత్రాభివ్రుద్ది సంస్థకు చైర్మన్ ను నియమించి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం అర్థవంతమయిన సినిమాల గురించి ముఖ్యంగా బాలల కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సి వుంది.
పిల్లలకోసం ఎ కొంత చేసినా ఎంతో చేసిన వాళ్ళవుతారు.