Month: February 2024

GULZAR ARTICLE ANDHRA PRABHA

Posted on

 కవిత్వంలో ప్రతీకలు మనసు తట్టి చేయి పట్టుకు నడిపిస్తాయి

++++++++++++++++++ వారాల ఆనంద్ 

 ఒక కవిని గతంలో చదివినప్పటికీ ఆ కవిని మళ్ళీ మళ్ళీ  చదవడం గొప్ప అనుభవం. “REVISITING ALWAYS REJUNAVATES “. ఒక కవిని లేదా ఒక కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి.కొత్త భావాలు ధ్వనిస్తాయి.సరికొత్త అనుభవాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కవి సరికొత్తగా దర్శనమిస్తాడు. ప్రేమగా ఆసక్తిగా వింటే ’Between the lines’ లోంచి ఆ కవి మనతో మరింత ఆర్తిగా, వేదనగా, సంతోషంగా మాట్లాడతాడు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజనకారుడు మనముందు ఆవిష్కృత మవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. ఎప్పుడూ ఇష్టంగా చదువుతూ వుండే గుల్జార్ ని ఆయనకు ‘జ్ఞాన్ పీఠ్’ ప్రకటించిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదవడం సరికొత్త అనుభవమే. గుల్జార్ కవిత్వాన్నీ వచనాన్నీ మొత్తంగా ఆయన సృజనని చదవడంలో అందుకున్న ఆనందం రెట్టింపులు అయింది.  

ఆయన కవిత్వం తాను  పాఠకుడితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ కవిత్వం నిండా ప్రతీకలు (ఇమేజేశ్) పరుచుకుని వుంటాయి. సాధారణంగా ఎప్పుడూ మనం చూసే చిత్రాల్ని, దృశ్యాలనే ప్రతీకలుగా చేసుకుని అతి సున్నితమయిన అంశాల్ని కవిత్వం చేస్తాడు. ఆయన కవితల నిండా మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం కనిపిస్తాయి. ఇట్లా గుల్జార్ కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి చదువుతూ వుంటే అనేక కోణాల్లో గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశమూ లభించిది. ఓ గొప్ప కవిని తిరిగి దర్శించడం అంటే ఇదేనేమో.

     భారత దేశభజనలో జరిగిన హింసకు గురయిన కుటుంబం ఆయనది. పాకిస్తాన్ నుంచి సరిహద్దును దాటి ఈ పక్కకు వచ్చారు. అప్పుడు జరిగిన దుర్మార్గాలను స్వయంగా చూసిన గుల్జార్ ఆనాటి అనుభవాల్ని కవితలుగా కథలుగా రాశారు… ’ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్’ పుస్తకంగా వచ్చింది.

“అది ఇప్పటికీ నా మాతృభూమే

కానీ ఇకపై ఎప్పటికీ నా దేశం కాదు

అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల్లోని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరగాలి

నా కలలకు ఆధారాల్ని చూపుతూ

నా ముఖం మీద ముద్రలు వేయించుకోవాలి” 

అంతేకాదు ‘నెగ్లెక్టెడ్ పోయెమ్స్’ లో

‘కళ్ళకు వీసా అవసరం లేదు

కలలకు సరిహద్దులు లేవు

నేను నా కళ్లను మూసుకుని

సరిహద్దును దాటి వెళ్తాను

మెహెంది హాసన్ ని కలవడానికి’ అంటూ తన వేదనని చెబుతాడు. 

     కవిగా రచయితగా గుల్జార్ అనేక భిన్నమయిన వైవిధ్యమయిన ప్రక్రియల్లో రాశారు. విభిన్న కళారూపాల్లో కృషి చేశారు. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా దృశ్య మాధ్యమంలో, సినీ గేయరచయితగా సంగీత ప్రపంచంలో గుల్జార్ ఆవిష్కరించిన కళాత్మకత ఎంతో విశాలమయింది, విలక్ష్ణమయింది. అయితే “ఎన్ని రూపాల్లో తన భావాల్ని వ్యక్తం చేసినప్పటికీ తనకు  ‘అక్షరమే’ ఆలంబన అని, రచనే తన మౌలిక వ్యక్తీకరణ రూపమని” ఆయన అంటారు. సాహిత్యం విషయానికి వస్తే ఆయన కవిత్వం, కథలు, జ్ణాపకాలు, పిల్లలకోసం కథలు పాటలు, కవితానువాదాలు, త్రివేణి పేర మూడు లైన్ల చిన్న కవితలు, ‘టూ’ పేర ఒక ఇంగ్లీష్ నవల, కామిక్స్ , ‘చక్కర్ చలాయే ఘన్ చక్కర్’ నాటకం, ఇట్లా అనేక ప్రక్రియల్లో రాసారు.  ఆయన ప్రధానంగా ఉర్దూ లో రాస్తారు. ఉర్దూ ఎంతమంది చదువుతున్నారు అది అంతరించి పోతున్న భాష అని ఎవరయినా అంటే గుల్జార్ అందుకు అంగీకరించడు. భాష ఎప్పటికీ అంతం కాదు. లిపి మారితే మారొచ్చు. కానీ భాష కు మరణం లేదు అంటాడాయన, మన దేశంలో పంజాబీ భాషను ఇప్పుడు గుర్ముఖీ లిపిలో రాస్తున్నారు, అదే పాకిస్తాన్లో వున్న పంజాబ్ లో ఉర్దూ లో రాస్తారు అంటాడాయన, మన దేశంలో ఉర్దూ పార్శీ ప్రభావంతోనూ, హిందీ సంస్కృత ప్రభావంతోనూ వుంది. కానీ ఇప్పుడు హిందీ ఉర్దూ ల్లో పెద్ద తేడా లేదు. సినిమాల్లో చూసినా బయట చూసినా వాడే హిందీలో అధిక శాతం ఉర్దూ మాటలే.  అందుకే మనం దాన్ని హిందూస్థానీ అనాలి అంటాడు గుల్జార్. అయితే ఆయన రచనలు ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, బ్రిజ్, ఖరీబౌలి, హర్యాన్వి, మార్వారి భాషల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందాయి.గుల్జార్ తన సృజాత్మక వ్యక్తీకరణల్లో ఇంత వైవిధ్యాన్ని విలక్షణతను సాధించడానికి ఆయన తన 90 ఏండ్ల వయసులో కూడా తనలోని సున్నితత్వాన్ని పోగొట్టుకోక పోవడమే ప్రధాన కారణం. ఆయన ఇప్పటికీ క్రమం తప్పకుండా, క్షణం వృధా చేయకుండా చదువుతూనో రాస్తూనో మాట్లాడుతూనో వుంటారు. అదే ఆయన బలం. మరో వైపు చూస్తే గుల్జార్ తన రచనల్లో వివిధ భారతీయ, భారతీయేతర భాషల్ని, ఆయా భాషల్లోని మాండలికాల్ని, జాతీయాల్ని ఆలవోకగా ఉపయోగిస్తాడు. దానికి ఆయన చేసే వివిధ భాషల అధ్యయనమే ప్రధానమయిన భూమిక. గుల్జార్ రాసిన తొలి సినిమా పాట ‘బందిని’ లోని మేర గోరా అంగ్ లయ్లే.. పాట పూర్తిగా అవధ్. ఇక ఆయనకు ఆస్కార్ తెచ్చిన ‘జయ్ హొ.’లో పంజాబీ తో పాటు కొంత స్పానిష్ కూడా ధ్వనిస్తుంది. ఇక ఆయన కవిత్వంలో ఆయన పలికించే ప్రతీకలు ప్రధాన బలం. గుల్జార్ కవితలు, గజల్స్ లో జానపదుల ఒరవడి, అమీర్ ఖౌస్రో, గాలిబ్, బాబా బుల్లే షా లాంటి కవుల అధ్యయన  ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచనల్లోని మరో ముఖ్యాంశం ఆయన కవిత్వంలోనూ జీవితంలోనూ వున్న ‘డౌన్ టు ఎర్త్, డౌన్ టు హార్ట్’ లక్షణం.అది ఎళ్ళ వేళల్లా ఆయన రచనల్లో ధ్వనిస్తూనే వుంటుంది. ‘కబీ రూహ్ దేఖీ హై.. ‘  అని ఆయన అన్నప్పుడు గుల్జార్ లోని తాత్వికత ఆవిష్కృతమవుతుంది.

చాలా విస్తృతంగా రాసిన  గుల్జార్ కవితా సంకలనాల వివరాల్లోకి వెళ్తే ఆయన రచనల్లో ప్రధానమయినవి సెలెక్టెడ్ పోయెమ్స్, నేగ్లెక్టెడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్, సైలెన్సెస్, ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్, ప్లూటో, ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇటీవలే గుల్జార్ కవిత్వం లోంచి సేకరించిన కవితలతో కూడిన సమగ్ర సంకలనం ‘బాలో-పార్:..కలెక్టెడ్ పోయెమ్స్” వెలువడింది. రక్షందా జలీల్ ఆ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. మొత్తం 1400 పేజీల ఈ సంకలనంలో గుల్జార్ మూల కవితలు వాటి అనువాదాలతో కూడిన ఈ సంకలనంలో చాంద్ పుఖ్ రాజ్ కా, రాత్ పాశ్మీనేకీ, పంద్రా పాచ్ పచత్తర్, కూచ్ ఔర్ నజ్మే, ప్లూటో, త్రివేణి సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి.

++++

గుల్జార్ కవిత్వాన్ని గురించి మరింతగా చెప్పుకుంటే ఆయన ‘ఆకుపచ్చ కవితలు’తో సహా గొప్ప భావుకుడయిన ఆయన సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్‌ వుంటుంది. ఇక ఆయన భాష,,రచనా శైలి కూడా చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వం చదువుతూ వుంటే ఆయన వాడిన  ఇమేజెస్‌లో వున్న ఒక తాజాదనం మనల్ని కదిలిస్తుంది. పాఠకుడి మనసు కదిలిపోతుంది.

ఈ కవిత చూడండి…

‘గగన సీమలో ఆకాశం

అతుకులు అతుకులుగా విడిపోతున్నది,

ఎన్ని ప్రాంతాల్నుంచి

ఈ గుడారం విడిపోతున్నదో

నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ

మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం పాఠకుడిపై గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది..

ఇంకో కవిత:

‘భయపడకు నేనున్నాను

భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు

చెట్టుకు ధైర్యాన్నిస్తూ

చెబుతూనే వుంది’

ఎంత నిబ్బరమయిన మాట’

ఇక ఆయనే రాసిన మరో  కవిత…

మబ్బు-

నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి

నా కిటికీని తాకింది

అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా

బయటంతా  చీకటి

లేచి వెళ్ళి బయట వర్షాన్ని

పలకరించే సమయం కాదిది

కెటికీ పరదాల్ని వేశాను

అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి

తడి తడి చేసింది

నా హాస్య చతురత మూగవోయింది

లేచి కిటికీల్ని దడాల్న మూసేశా

తిరిగి ముసుగేసుకొని పడకేసా

మనస్తాపం చెందిన వాన కోపంతో

కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది

మళ్ళీ తిరిగి రాలేదు

కిటికీ అద్దం పగుళ్లు మాత్రం

అట్లాగే వుండిపోయాయి

** * ఎంత భావుకతో కదా

ఇక మరో కవిత ఇట్లా సాగుతుంది

           —

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు

‘రాత్రులు’

దాడి చేయడానికి సిద్ధపడ్డాయి

అది ఓ సాలెగూడు

చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ

అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి

అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది  

అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు

మరింత భయంతో వణుకొస్తుంది  

‘జాతి’

కొందరి పదఘట్టనల క్రింద

నలిగిపోతున్నది

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మరోసారి మెడలు వంచబడ్డాయి

తలలు తెగి రాలిపడ్డాయి

ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా

విభజించబడ్డారు  

ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది

ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది

కొందరు చాలాసార్లు  నన్ను

మంచెకు వేలాడదీసారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

*********************

పర్యావరణం గురించి అధికంగా మదన పడే గుల్జార్ రాసిన ఈ కవితను చూడండి

“ దళిత మొక్క”

ఈ అడవి మొక్కల కొమ్మల మీద

ఏవో కొన్ని పదాలు కనిపిస్తాయి

పూర్తి కవిత అయితే కాదు

భూమి పొరల్ని చీల్చుకుని బలంగా నిలబడడానికి

ఈ మొక్కల కెప్పుడూ పోషకాలుండవు

వాటికి పూల కుండీలుండవు

వేర్లకు పోషకాలు లభించడానికి

అవి రోడ్లపైకి విసిరేయబడతాయి

దుమ్ములో ఆకలితో ధర్మంతో బతుకుతాయి

కొన్ని సార్లు మరిన్ని చేట్లేమో

బురద నీటిలోకి ఊడ్చేయబడతాయి 

ఆ బురద నీటిలోనే మురికి మట్టిలోనే

ఎదగడం మొదలెడతాయి

మళ్ళీ ఇంకో రోడ్డు మళ్ళీ ఇంకో తన్ను

ఇంకో దళిత మొక్క

 **** మొక్క గురించి చెబుతున్నట్టే వున్నా దళిత మొక్కను ప్రతీకగా చేసి మొత్తం కవిత కోణాన్నే మార్చేశాడు.

కవిత్వం సంగతి ఇట్లా వుంటే వచనం విషయంలో కూడా కథలు, ఒక నవల, ఒక నాటకం రాసిన గుల్జార్ తన జ్ఞాపకాల్నీ రాశాడు. అవి పుస్తకంగా వచ్చాయి.

ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR (నిజంగా.. వాళ్ళని నేను కలిసాను- ఓ జ్ఞాపకం = గుల్జార్ ) ఇవన్నీ అద్భుతమయిన జ్ఞాపకాలు. ఏకబిగిన చదివిస్తాయి. గుల్జార్ తన ఇన్నేళ్ళ జీవితంలో ఎంతో మందిని కలిసాడు. కవులు, రచయితలు,దర్శకులు, నటీనటులు, గాయకులూ, సంగీత దర్శకులు వొహ్ గొప్ప జ్ఞాపకాలు, మరెన్నోగొప్ప అనుభవాలు. ఈ పుస్తకంలో తాను తన నిత్య జీవితంలో కలిసిన వాళ్ళ గురించి ప్రస్తావించారు. తన వృత్తి జీవితంలో తాను కలిసి పనిచేసిన వారి గురించీ  రాసారు, అంతే కాదు తన పై వాళ్ళ ప్రభావాన్ని కూడా గుల్జార్ ఈ పుస్తకం లో సవివరంగా చెప్పారు. పుస్తకం శీర్షిక “నిజంగా.. వాళ్ళని నేను కలిసాను”లో నిజంగా అనడంలోనే గుల్జార్ కవితాత్మ కనిపిస్తున్నది. వాళ్ళని ఊరికే కలిసాను అని కాకుండా  నిజంగా కలిసాను అంటే మనసు లోతుల్లోంచి కలిసి రాసాను అంటున్నాడు గుల్జార్. ఇదొక మంచి జ్ఞాపకాల తోరణం.

నిజానికి ఇది గుల్జార్ జీవిత చరిత్ర కాదు, ఎందుకంటే జీవితచరిత్ర రచనకు, జ్ఞాపకాలకు తేడా వుంటుంది. జీవితచరిత్రలో సమగ్ర జీవితం వుంటే జ్ఞాపకాల్లో కొన్ని ముఖ్యమయిన సందర్భాలు సంఘటనలు వుంటాయి. ఈ పుస్తకం నిండా జ్ఞాపకాలున్నాయి.

++++++++

నిజానికి మనిషి జీవితంలో జ్ఞాపకాలు మరుగున పడవు. చేతనా అంతఃచేతనల్లో ఎక్కడో ఒక చోట సజీవంగా నిక్షిప్తమయ్యే వుంటాయి. అందునా కవీ కళాకారుడి జీవితాల్లో జ్ఞాపకాలు హృద్యంగానూ సాంద్రంగానూ వుంటాయి. కావలసిందల్లా ఆ జ్ఞాపకాలని రాయాలనుకున్నప్పుడు మనసు, ఆలోచనలు తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలాన్ని పునర్ దర్శించాలి. వున్నది వున్నట్టు కల్పనారహితంగా రచన లో ప్రబిబింప జేయాలి. అప్పుడే ఆ జ్ఞాపకాలకు సాహిత్యంలో స్థానంతో పాటు గౌరవమూ లభిస్తాయి. ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR పుస్తకం అలాంటి గౌరవం ఇవ్వాల్సిన రచన. ఈ పుస్తకం ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. తొలుత బెంగాలీ పత్రిక ఆదివారం సంచిక కోసం గుల్జార్ ఇవి రాసారు. అవన్నీ కలిపి “పంటా భాటే” పేరున బంగాలీ లో పుస్తకంగా వచ్చింది. మహార్గ్య చక్రవర్తి ఇంగ్లీషులోకి చేసారు. పెన్గ్విన్ వాళ్ళు ప్రచురించారు.

…………. ఈ ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR  లో గుల్జార్ తన గురువు మెంటార్ అయిన బిమల్ రాయ్ నుంచి మొదలు పెట్టాడు. తాను తన మొదటి పాట కోసం బిమల్ రాయ్ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితుల్లో వెళ్లిందీ ఆసక్తికరంగా రాసాడు. అనేక సంఘటనలను కథాత్మకంగా రాసారు గుల్జార్. ఈ పుస్తకంలో బిమల్ రాయ్ తో మొదలయిన ఈ జ్ఞాపకాల పరంపర సంగీతదర్శకులు సలిల్ చౌదరి, హేమంత్ కుమార్, ఆర్ డీ బర్మన్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ కుమార్, గాయకుడు కిషోర్ కుమార్, సంజీవ్ కుమార్, హ్రిషికేశ్ ముఖర్జీ, పండిట్ రవి శంకర్, భీంసేన్ జోషి, నటీమణులు సుచిత్ర సేన్, షర్మిళా టాగోర్, రచయిత్రి మహాశ్వేతా దేవి లాంటి అనేక మందితో తన పరిచయం, తనపై వారి ప్రభావం రాసారు. గుల్జార్ రాసిన విధానం మనతో మాట్లాడుతున్నట్టు వుండి చక చకా చదివిస్తుంది. అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పినట్టు అనిపిస్తుంది.

అట్లా కవిత్వమే కాదు వచనంలో కూడా గుల్జార్ పాఠకులని చేయి పట్టుకుని తన వెంట తీసుకెళ్తాడు, పాఠకుని చేయిపట్టుకుని వెంట నడుస్తాడు.

 అనేక సృజన రూపాలు, అనేక రచనలు, సినిమాలు, పాటలు, పిల్లల కథలు పిల్లల పాటలు ఎన్నో ఎన్నెన్నో గుల్జార్ కలం నుండి వెలువడ్డాయి.  ఆయన్ని ఎంత చదివితే అంతగా సున్నితమయిపోతుంది పాఠకుడి మనసు. ఆయన సాహిత్యమే కాదు ‘ఖోశిష్’ లాంటి ఆయన సినిమాలూ అంతే. 

ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం రావడం అభినందనీయం. గుల్జార్ తో ఆ పురస్కారానికీ  గౌరవం పెరిగింది.

+++++++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

9440501281

GULZAR ARTICLE NAVA TELANGANA

Posted on

కవిత్వం సినిమాలు ఆయనకు రెండు కళ్ళు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘మొర గోరా రంగ్ లైలే..’ అంటూ మొట్టమొదటిసారిగా బిమల్ రాయ్ సినిమాకు రాసినా..

‘మైనే తెరెలియే హి సాత్ రంగ్ కె సప్నే చునే’  అంటూ ఆనంద్ లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..

‘ముసాఫిర్ హో…యారో .. నా ఘర్ హై నా టిఖానా … ‘

అంటూ పరిచయ్ లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్న్తాడుగుల్జార్.  

‘దిల్ హూం హూం కరే ఘబ్ రాయే.’ అని రుడాలి లో వేదన పడ్డా

‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా  హై..’ అంటూ ఇజాజత్ లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దుఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్ లో రాసినా

వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంధ్రత గుల్జార్ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి  రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నోపాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.పాఠకుడి మనసుని తత్తెస్థాయి.  

ఇక సంభాషణల విషయానికి వస్తే

‘బాబూమొషై జిందగీ బడీ హోనీ చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’

‘మౌత్ తో ఏక్ పల్ హయ్,

(జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలో గుల్జార్ రాశారు.అట్లా ఆయన పాటలు సంభాషణలే కాదు గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్. సినిమా రంగంలో విశేషమయిన్ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు సత్కారాలు లభిచాయి. ఆస్కార్, గ్రామీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి. బహుశా ఆయన అందుకోని అవార్డు లేదు. కానీ సాహిత్యం లో ఆయనకు వచ్చిన ‘జ్ఞానపీఠ పురస్కారం ప్రత్యేకమయింది. ఎందుకంటే ఆయనే అనేక చోట్ల చెప్పుకున్నట్టు సాహిత్యమే తన నిజమయిన వ్యక్తీకరణ రూపం. సినిమా కూడా సృజనాత్మక కళ నే. కానీ అది రచయిత, దర్శకుడు, నటుల సమిష్టి కృషి. సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగతమయిన వ్యక్తీకరణ. అందులో ఇతరుల ప్రమేయం వుండదు. కవీ రచయిత తన భావాలకు తానే రూపం కల్పిస్తాడు. అందుకే సాహిత్య సృజనలో స్వేచ్చ వుంటుంది. అందుకే సాహిత్యంలో తనకు వచ్చిన ‘జ్ఞానపీఠ్’ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారాయన. 

‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు,అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని  అందరికీ  చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్.   

అంతే కాదు కవిత్వం ఎట్లా రాస్తారు అని అడిగితే ‘సాహిత్య సృజన చేయడానికి నువ్వు ‘గుహ’లో నివసించాలి, ఆ గుహ మరేదో కాదు అది నువ్వే’ అంటాడాయన.  

కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్.

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది.అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జణ్యాలు, పడ్డ వేదన దుఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది. ఏం.హెచ్.సత్యు ‘ఘరమ్ హవా’ లాంటి సినిమాలు తెస్తే గుల్జార్ కవిత్వమూ కథలూ రాశాడు.

  ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్ మాచ్ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్ రాయ్ ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎవో  పొరపొచ్చాలు రావడంతో ఆ ఇద్దరూ కలిసి పని చేసే స్థితి లేకపోయింది. దాంతో శైలేంద్ర గుల్జార్ ని తక్షణమే వెళ్ళి బిమల్దాను కలవమని సూచించాడు. మిత్రుడు ఆసీత్ సేన్ తోకలిసి వెళ్ళి కలిశాడు. ‘ఇతను విషయాన్ని అర్థం చేసుకుని పాట రాయగలడా అని సేన్ ను బెంగాలీలో అడిగాడు’ అప్పుడు సేన్ దాదా తనకు బెంగాలీ రాయడం చదవడం వచ్చు అనేసరికి  కంగారుపడ్డ బిమల్ రాయ్ సర్దుకుని పాట రాయమని ప్రోత్సాహించాడు. గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ దా  గుల్జార్ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దా కి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది.  సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్ కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్ కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

    టెలివిజన్ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్ గొప్పగా విజయవంతమయి కల్ట్ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

గుల్జార్ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘GREEN POEMS’ ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘SUSPECTED POEMS’ ని అనుమానిత కవితలు గా అనువదించారు.

గుల్జార్ కూడా అనేక అనువాదాలు చేశారు.‘ ఏ పోయేమ్ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు. వాటిల్లో వర్తమాన కవుల కవితల్నిచేర్చారు. పాఠశాల కళాశాల పాఠ్యపుస్తకాల్లో చదివే కవుల కవితలు కాకుండా ఇప్పుడు వర్తమాన సామాజిక స్థితిలో ఆధునిక కవులు రాస్తున్న కవితల్ని చేర్చారు.‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న విషయం అర్థం కావడానికి ఈ సంకలనం ఎంతో దోహద పడుతుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫిల్ హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ, చాపాక్, సామ్ బహదూర్ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘ బికాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ ఇప్పటికే పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

కవి, రచయిత,

GULZAR

Posted on

మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024

‘ఇరుగు పొరుగు’ సమీక్ష

Posted on

మిత్రులారా! నా అనువాద సంకలనం ‘ఇరుగు పొరుగు’ పైన ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో సమీక్ష చేశారు. చూడండి, సమీక్షకులు రామా చంద్రమౌళి గారికి, సంపాదకులకు కృతజ్ఞతలు- వారాల ఆనంద్,
25 ఫిబ్రవరి 2024

యాదోంకీ బారాత్ సిరీస్ 2, నంబర్7

Posted on

యాదోంకీ బారాత్

సిరీస్-2, నంబర్-7

+++++++++ వారాల ఆనంద్

బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం వుంది. అందుకే పరుగు ఛైతన్యవంతుడయిన మనిషి మనుగడలో ప్రధాన అంశం. కానీ నేనయితే నా ప్రమేయం లేకుండానే పరుగు లోంచి నిలకడలోకి రావాల్సే వచ్చింది. అప్పటిదాకా అర్థవంతమయిన సినిమాలు, కాంపస్ ఫిల్మ్ క్లబ్బులు, సెమినార్లు, ఫిలిమ్ ఫెస్టివల్స్, సాహిత్యం అంటూ పరుగులు పెడుతున్న నా పరుగును శారీరక అనారోగ్యం రెడ్ లైట్ చూపించి స్టాప్ అని నిలిపేసింది. బయట తిరగడాలు, ఆహారం తదితర విషయాల్లో అనేక నిబంధనలతో బతుకు కొత్తగా మొదలయింది.

హైదరబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతమయింది. తర్వాత వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు అక్కడే వున్నాను. నెల రోజూల పాటు వాళ్ళని క్రమం తప్పకుండా దర్శించుకున్నాను. ఇక సర్లే వెళ్ళండి అని వాళ్ళు పొమ్మన్నాక కరీంనగర్ బయలుదేరాను. పిల్లలిద్దరూ రేలా అన్వేష్ లు హాస్టళ్లలో చేరిపోయారు. నేనూ ఇందిరా ఇల్లు చేరుకున్నాం. మూడు నాలుగు నెలలు విడిచి వెళ్తే ఎట్లా వుంటుందో మా ఇల్లు సరిగ్గా అట్లే వుంది. నన్నేమో దుమ్ముకు దూళికి దూరంగా వుండమన్నారు. పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. అందుకే నేను వెళ్ళి పక్క పోర్షన్లో కూర్చున్నాను. రేల, శ్రీలత, అటెండర్ నాగరాజు ల సాయంతో ఇందిర ఇంటి పనిలో పడింది. మా పక్క పోర్షన్ లోకి దాదాపు 8 ఏళ్ల తర్వాత వెళ్ళాను. చందన, సంజీవరెడ్డి లు మా ఇంట్లో చేరింతర్వాత మా వాళ్లయిపోయారు. చందనయితే కూతురులాగే వుంటుంది. వాళ్ళ రెండో అబ్బాయి కుశ్లు మాయింట్లోనే పుట్టాడు. వాళ్ళతో మా అనుబంధం చాలా మంచి అనుబంధం. ఇల్లు శుభ్రం అవగానే నేనూ ఇందిర హమ్మయ్య మనింట్లోకి వచ్చాం. క్షేమంగా ఆరోగ్యంగా అనుకున్నాం.

నేను కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ఉత్సాహంగానే వున్నాను. నాకు నా కష్టాల గురించీ అనారోగ్యం గురించీ అందరితో అతిగా చెప్పాలనిపించదు. ఎట్లా వున్నావు అంటే ‘ఫైన్’ అంటాను. అంతేకాదు స్టేబుల్ అని కూడా అంటాను. ఎందుకో మరి కొందరయితే కనిపించగానే, ఎవరయినా పలకరించగానే చాలా కష్టంగా వుంది. అనారోగ్యం చాలా కష్ట పెడుతూ వుంది అంటూ అనేకం చెబుతారు. ఆరోగ్యమే కాదు మరెన్నో సమస్యల్ని ఏకరువు పెడతారు. అది వాళ్ళ అభీష్టమే కాదనలేను. కానీ నేనెందుకో అట్లా చెప్పడానికి సిద్దంగా వుండను. కష్టం వున్నది మనకొక్కరికే కాదు. సమాజంలో చాలామందికి చాలా రకాల కష్టాలున్నాయి అనేక ఇబ్బందులున్నాయి. ఆర్థికమూ, సామాజికమూ కూడా. వాటన్నింటితో పోలిస్తే మన అనారోగ్య సమస్య పెద్దదేమీ కాదు. మనదొక్కటే పెద్ద సమస్య అన్నట్టు దీనంగా వుండడం సరయింది కాదన్నది నా ఫీలింగ్. అది నాకు నాకు చేతకాదు. నా ఆరోగ్యం విషయం ఎవరు తీసినా మెడికల్ టెక్నాలజీ చాలా పెరిగింది. నా సహచరి నా పక్కన నిలబడింది. అంతా బాగుంది. సబ్ కుచ్ చల్ రహా హై…ఆచ్ఛాహీ చల్ రహా హై. చలాయెంగే జాబ్ తక్ హై జాన్’ అంటాను.

కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాను. అప్పుడు ప్రిన్సిపాల్ గా మిత్రుడు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి వున్నారు. నన్ను చూడగానే భయ్యా వచ్చారా? అంటూ ఎదురొచ్చాడు. స్నేహపూర్వమయిన హగ్. జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి అవుతుండగానే కాలేజీ మిత్రులంతా హాయ్ హాయ్ అంటూ సంతోషంగా కలిశారు. నేను చదివిన కాలేజీ, అప్పటికే 14 ఏళ్లుగా పనిచేస్తున్న కాలేజీ. మళ్ళీ ఉత్సాహం ఉరకలు వేసింది. ఇంతలో ప్రిన్సిపాల్ పద పద రూమ్ నంబర్ 63లో పిల్లలతో ఓ మీటింగ్ వుంది అన్నాడు. అరె ఇప్పుడే వచ్చిన కదా అన్నాను. అయితే ఏముంది. ఆవన్నీ తర్వాత పిల్లలతో నువ్వు మాట్లాడాలి పదా అని లాక్కెల్లాడు. ఇంకేముంది ఫాలో అయిపోయాను. పిల్లల్ని చూడగానే పాత ఉత్సాహం పెళ్లుబికింది. మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి వచ్చేశాను. ఇమ్మ్యునో సప్రెస్సర్స్ వాడతాను కనుక మాస్క్ లాంటి ఆయుధాలు తప్పనిసరి. గుంపుల్లోకి వెళ్లకూడదు. పనేమో కాలేజీలో కనుక కొంత తప్పలేదు. ఇల్లు కాలేజీ అంతే.

ఒక ఆలోచన తీవ్రంగా తొలవడం మొదలయింది. కాలం ఎప్పుడు ఎట్లా ఏ మలుపు తీసుకుంటుందో ఏమో. ఇన్నాళ్లుగా రాస్తూ వచ్చిన వాటికి పుస్తక రూపం ఇస్తే బాగుంటుందనుకున్నాను. ఇందిరేమో మీ ఇష్టం అంది. అలసట అవుతుందేమో చూసుకోండి అంది. ఆసుపత్రి, ఆపరేషన్ అవన్నీ నాపై తీవ్రమయిన వొత్తిడి వుండగానే హైదరబాద్ లో నన్ను నేను ఆవిష్కరించుకుంటూ రాసిన కవిత్వం వుంది. దానికంటే ముందు మరో రెండు పుస్తకాలు వేద్దామనుకున్నాను. ఒకటి ’మానేరు గల గల’. ఆంధ్రజ్యోతి దిన పత్రిక కరీంనగర్ ఎడిషన్ లో మిత్రుడు బ్యూరో చీఫ్ శ్రీ నగునూరు శేఖర్ కోరిక మేరకు నేను వారం వారం ‘విద్యుల్లత’ జిల్లా సాహిత్య పేజీనిర్వహించాను. అందులో జిల్లా కు చెందిన సాహితీవేత్తల పై నేను రాసిన వ్యాసాలు అన్నింటినీ కలిపి ‘మానేరు గల గల‘ పుస్తకం తేవాలని, దానితోపాటు అప్పటిదాకా నమస్తే తెలంగాణ తో సహా ఇతర పత్రికల్లో రాసినా సినిమా వ్యాసాలతో ‘బంగారు తెలంగాణ లో చలన చిత్రం’ వ్యాస సంకలనం వేయాలని అనుకున్నాను. రెండు పుస్తకాల డీటీపీ పనులు ఎప్పటిలాగే తమ్ముడు అమర్ కి అప్పగించాను. పనులు చక చకా జరిగాయి. పుస్తకాల కవర్ పేజీలు ఎట్లా అన్న సమస్య వచ్చింది. మిత్రుడు అన్నవరం శ్రీనివాస్ ని సంప్రదించాను. వీలుచేసుకుని ఇంటికి రండి సార్. మీ కిష్టం వచ్చిన పెయింటింగ్ ఎంచుకోండి అన్నారాయన. ఆయన వుంటున్న ఫ్లాట్ లోనే వుంటున్న మా కొలీగ్ ఎలిజబెత్ రాణి ని కూడా కలిసినట్టు అవుతుంది పద అన్నాను ఇందిరతో. చలో అంది. వెళ్ళి ఒక పెయింటింగ్ ఎంపిక చేసుకున్నాను. కాస్ట్ అడిగితే అదేంది సార్ అట్లా అంటారు మీరు పరాయి వాళ్ళా అన్నాడాయన. శ్రీనివాస్ గారి శ్రీమతి కవిత కూడా అంతే ఆప్యాయంగా టీ తాగేదాకా వదల్లేదు. ఎలిజబెత్ కూడా అంతే మేమంటే ఎంతో అభిమానం చూపించింది. ఇక సినిమా వ్యాసాల పుస్తకానికి అన్వేష్ వేసిన పెయింటింగ్ ని తీసుకున్నాను.‘మానేరు గల గల’ లో పీవీ, చొప్పకట్ల చంద్రమౌళి, పురాణం రామచంద్ర, ఎం.ఎస్.ఆర్. లతో కలిపి 49 వ్యాసాల్ని ప్రచురించాను. తెలంగాణ రచయితల సంఘం ప్రచురణగా వెలువరించాను. అప్పటి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముందుమాట రాస్తూ ‘ఇయాలిటీ సందర్భం అస్తిత్వ ప్రకటన. అంతే బలంగా చరిత్ర నిర్మాణం.జరగాల్సిన సమయం. ఆ దిశలో అవటానికి మానేరు గల గల కరీంనగర్ ప్రాంత కవి పరిచయాలే కావచ్చు కానీ సరయిన మార్గం సరయిన ప్రయత్నం’ అన్నాడు. మనకూ ఒక సాంస్కృతిక విధానం కావాలి అంటూ తెలంగాణా సినిమా ఉనికి దాని అభివృద్ధికి చేయాల్సిన అంశాల పైన ప్రధానంగా నమస్తే తెలంగాణలో రాసినవ్యాసాల సంకలనం బంగారు ‘తెలంగాణాలో చలన చిత్రం’. ఈ రెండు పుస్తకాల్నీ నా పుట్టిన రోజు 21 ఆగస్ట్ 2014 న తెచ్చాను. మానేరు గల గల ను నా వైద్యుడు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గందే శ్రీధర్ కి అంకితమిచ్చాను. ఆయన చాలా సంతోష పడ్డారు. బంగారు తెలంగాణ .. పుస్తకాన్ని ఆత్మీయులు మంగారి రాజేందర్ జింబో, వఝల శివకుమార్, సాంబశివుడు, నందిగం కృష్ణా రావులకు అంకితం చేశాను. మిత్రులు సభ పెట్టాలన్నారు. ఫిల్మ్ భవన్ లో ఏర్పాటు చేశాం. ఆత్మీయులందరినీ పిలిచాను. జింబో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, దర్భశయనం శ్రీనివాసాచార్య, వఝల శివ కుమార్, బీ.వీ.ఎన్ స్వామి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, దాస్యం సేనాధిపతి తదితరులు అతిథులుగా పాల్గొనగా, కె.ఎస్.అనంతాచార్య సభకు అధ్యక్షత వహించారు. మానేరు గలగల ను సిధారెడ్డి, బంగారు తెలంగాణ ను జింబో ఆవిష్కరించారు. సభ బాగా జరిగింది. నేను అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ దాటి వచ్చాను కదా. అనేకమంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు. సభలో నమిలకొండ హరిప్రసాద్, నరెడ్ల శ్రీనివాస్, లక్ష్మీకాంతం, పీ.ఎస్.రవీంద్ర, మంగారి శివ ప్రసాద్, ఎం.సరస్వతి-పాపన్న, హిమజ, శారదా శివకుమార్, నవీన వదిన మహేశన్న, ఇట్లా అనేక మంది ఆప్యాయంగా వచ్చి అభినందించారు. దర్భశయనం, స్వామి లు పుస్తకాల మీద సాధికారక ప్రసంగం చేశారు. ఇక మధు అయితే నా వృత్తి, కాలేజీ, లైబ్రరీల గురించి విశేషంగా మాట్లాడారు. సిధారెడ్డి, దేశపతి,వఝల, జింబో లు చాలా ఆప్యాయంగా వివరంగా మాట్లాడారు. నాకిప్పటికీ వారి మాటలు గుర్తున్నాయి. అవి నాకా రోజు పెద్ద టానిక్ లాంటివి.

ఆ తర్వాత ఆ రెండు పుస్తకాలకు కొన్ని మంచి సమీక్షలే వచ్చాయి. ఇక నా కవిత్వం ముందుకు వచ్చింది. హైదరబాద్ లో గడిపిన ఆ మూడు నెలల సంక్షోభ కాలంలో రాసిన కవితలన్నింటినీ పుస్తకంగా తేవాలని ఆలోచన.

అనారోగ్యమూ, మందులూ, జాగ్రత్తలూ, ఉద్యోగమూ ఒక వైపు, మరో వైపు నా సృజనాత్మక జీవితం. కవిత్వమయితే వేయాలి అనుకుంటూ ముందుకు సాగాను. ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య ను ముందుమాట రాయమని అడిగాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆగస్టులో రెండు పుస్తకాలు వస్తే నవంబర్ 2014 లో కవిత్వం “మనిషి లోపల” వెలువడింది. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను..

+++++

-వారాల ఆనంద్

25 ఫిబ్రవరి 2024

All reactions:

యాదోంకీ బారాత్ సిరీస్-2, నంబర్-7

Posted on Updated on

యాదోంకీ బారాత్

సిరీస్-2, నంబర్-7

+++++++++ వారాల ఆనంద్  

   బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం వుంది. అందుకే పరుగు ఛైతన్యవంతుడయిన మనిషి మనుగడలో ప్రధాన అంశం. కానీ నేనయితే నా ప్రమేయం లేకుండానే పరుగు లోంచి నిలకడలోకి రావాల్సే వచ్చింది. అప్పటిదాకా అర్థవంతమయిన సినిమాలు, కాంపస్ ఫిల్మ్ క్లబ్బులు, సెమినార్లు, ఫిలిమ్ ఫెస్టివల్స్, సాహిత్యం అంటూ పరుగులు పెడుతున్న నా పరుగును శారీరక అనారోగ్యం రెడ్ లైట్ చూపించి స్టాప్ అని నిలిపేసింది. బయట తిరగడాలు, ఆహారం తదితర విషయాల్లో అనేక నిబంధనలతో బతుకు కొత్తగా మొదలయింది.

     హైదరబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతమయింది. తర్వాత వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు అక్కడే వున్నాను. నెల రోజూల పాటు వాళ్ళని క్రమం తప్పకుండా దర్శించుకున్నాను. ఇక సర్లే వెళ్ళండి అని వాళ్ళు పొమ్మన్నాక కరీంనగర్ బయలుదేరాను. పిల్లలిద్దరూ రేలా అన్వేష్ లు హాస్టళ్లలో చేరిపోయారు. నేనూ ఇందిరా ఇల్లు చేరుకున్నాం. మూడు నాలుగు నెలలు విడిచి వెళ్తే ఎట్లా వుంటుందో మా ఇల్లు సరిగ్గా అట్లే వుంది. నన్నేమో దుమ్ముకు దూళికి దూరంగా వుండమన్నారు. పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. అందుకే నేను వెళ్ళి పక్క పోర్షన్లో కూర్చున్నాను. రేల, శ్రీలత, అటెండర్ నాగరాజు ల సాయంతో ఇందిర ఇంటి పనిలో పడింది. మా పక్క పోర్షన్ లోకి దాదాపు 8 ఏళ్ల తర్వాత వెళ్ళాను. చందన, సంజీవరెడ్డి లు మా ఇంట్లో చేరింతర్వాత మా వాళ్లయిపోయారు. చందనయితే కూతురులాగే  వుంటుంది. వాళ్ళ రెండో అబ్బాయి కుశ్లు మాయింట్లోనే పుట్టాడు. వాళ్ళతో మా అనుబంధం చాలా మంచి అనుబంధం. ఇల్లు శుభ్రం అవగానే నేనూ ఇందిర హమ్మయ్య మనింట్లోకి వచ్చాం. క్షేమంగా ఆరోగ్యంగా అనుకున్నాం.

నేను కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ఉత్సాహంగానే వున్నాను. నాకు నా కష్టాల గురించీ అనారోగ్యం గురించీ అందరితో అతిగా చెప్పాలనిపించదు. ఎట్లా వున్నావు అంటే ‘ఫైన్’ అంటాను. అంతేకాదు స్టేబుల్ అని కూడా అంటాను. ఎందుకో మరి కొందరయితే కనిపించగానే, ఎవరయినా పలకరించగానే చాలా కష్టంగా వుంది. అనారోగ్యం చాలా కష్ట పెడుతూ వుంది అంటూ అనేకం చెబుతారు. ఆరోగ్యమే కాదు మరెన్నో సమస్యల్ని ఏకరువు పెడతారు. అది వాళ్ళ అభీష్టమే కాదనలేను. కానీ నేనెందుకో అట్లా చెప్పడానికి సిద్దంగా వుండను. కష్టం వున్నది మనకొక్కరికే కాదు. సమాజంలో చాలామందికి చాలా రకాల కష్టాలున్నాయి అనేక  ఇబ్బందులున్నాయి. ఆర్థికమూ, సామాజికమూ కూడా. వాటన్నింటితో పోలిస్తే మన అనారోగ్య సమస్య పెద్దదేమీ కాదు. మనదొక్కటే పెద్ద సమస్య అన్నట్టు దీనంగా వుండడం సరయింది కాదన్నది నా ఫీలింగ్. అది నాకు నాకు చేతకాదు. నా ఆరోగ్యం విషయం ఎవరు తీసినా మెడికల్ టెక్నాలజీ చాలా పెరిగింది. నా సహచరి నా పక్కన నిలబడింది. అంతా బాగుంది. సబ్ కుచ్ చల్ రహా హై…ఆచ్ఛాహీ చల్ రహా హై. చలాయెంగే జాబ్ తక్ హై జాన్’ అంటాను. 

     కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాను. అప్పుడు ప్రిన్సిపాల్ గా మిత్రుడు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి వున్నారు. నన్ను చూడగానే భయ్యా వచ్చారా? అంటూ ఎదురొచ్చాడు. స్నేహపూర్వమయిన హగ్. జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి అవుతుండగానే కాలేజీ మిత్రులంతా హాయ్ హాయ్ అంటూ సంతోషంగా కలిశారు. నేను చదివిన కాలేజీ, అప్పటికే 14 ఏళ్లుగా పనిచేస్తున్న కాలేజీ. మళ్ళీ ఉత్సాహం ఉరకలు వేసింది. ఇంతలో ప్రిన్సిపాల్ పద పద రూమ్ నంబర్ 63లో పిల్లలతో ఓ మీటింగ్ వుంది అన్నాడు. అరె ఇప్పుడే వచ్చిన కదా అన్నాను. అయితే ఏముంది. ఆవన్నీ తర్వాత పిల్లలతో నువ్వు మాట్లాడాలి పదా అని లాక్కెల్లాడు. ఇంకేముంది ఫాలో అయిపోయాను. పిల్లల్ని చూడగానే పాత ఉత్సాహం పెళ్లుబికింది. మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి వచ్చేశాను. ఇమ్మ్యునో సప్రెస్సర్స్ వాడతాను కనుక మాస్క్ లాంటి ఆయుధాలు తప్పనిసరి. గుంపుల్లోకి వెళ్లకూడదు. పనేమో కాలేజీలో కనుక కొంత తప్పలేదు. ఇల్లు కాలేజీ అంతే.

ఒక ఆలోచన తీవ్రంగా తొలవడం మొదలయింది. కాలం ఎప్పుడు ఎట్లా ఏ మలుపు తీసుకుంటుందో ఏమో. ఇన్నాళ్లుగా రాస్తూ వచ్చిన వాటికి పుస్తక రూపం ఇస్తే బాగుంటుందనుకున్నాను. ఇందిరేమో మీ ఇష్టం అంది. అలసట అవుతుందేమో చూసుకోండి అంది. ఆసుపత్రి, ఆపరేషన్ అవన్నీ నాపై తీవ్రమయిన వొత్తిడి వుండగానే హైదరబాద్ లో నన్ను నేను ఆవిష్కరించుకుంటూ రాసిన కవిత్వం వుంది. దానికంటే ముందు మరో రెండు పుస్తకాలు వేద్దామనుకున్నాను. ఒకటి ’మానేరు గల గల’. ఆంధ్రజ్యోతి దిన పత్రిక కరీంనగర్ ఎడిషన్ లో మిత్రుడు బ్యూరో చీఫ్ శ్రీ నగునూరు శేఖర్ కోరిక మేరకు నేను వారం వారం  ‘విద్యుల్లత’ జిల్లా సాహిత్య పేజీనిర్వహించాను. అందులో జిల్లా కు చెందిన సాహితీవేత్తల పై నేను రాసిన వ్యాసాలు అన్నింటినీ కలిపి ‘మానేరు గల గల‘ పుస్తకం తేవాలని, దానితోపాటు అప్పటిదాకా నమస్తే తెలంగాణ తో సహా ఇతర పత్రికల్లో రాసినా సినిమా వ్యాసాలతో ‘బంగారు తెలంగాణ లో చలన చిత్రం’ వ్యాస సంకలనం వేయాలని అనుకున్నాను. రెండు పుస్తకాల డీటీపీ పనులు ఎప్పటిలాగే తమ్ముడు అమర్ కి అప్పగించాను. పనులు చక చకా జరిగాయి. పుస్తకాల కవర్ పేజీలు ఎట్లా అన్న సమస్య వచ్చింది. మిత్రుడు అన్నవరం శ్రీనివాస్ ని సంప్రదించాను. వీలుచేసుకుని ఇంటికి రండి సార్. మీ కిష్టం వచ్చిన పెయింటింగ్ ఎంచుకోండి అన్నారాయన. ఆయన వుంటున్న ఫ్లాట్ లోనే వుంటున్న మా కొలీగ్ ఎలిజబెత్ రాణి ని కూడా కలిసినట్టు అవుతుంది పద అన్నాను ఇందిరతో. చలో అంది. వెళ్ళి ఒక పెయింటింగ్ ఎంపిక చేసుకున్నాను. కాస్ట్ అడిగితే అదేంది సార్ అట్లా అంటారు మీరు పరాయి వాళ్ళా అన్నాడాయన. శ్రీనివాస్ గారి శ్రీమతి కవిత కూడా అంతే ఆప్యాయంగా టీ తాగేదాకా వదల్లేదు.  ఎలిజబెత్ కూడా అంతే మేమంటే ఎంతో అభిమానం చూపించింది. ఇక సినిమా వ్యాసాల పుస్తకానికి అన్వేష్ వేసిన పెయింటింగ్ ని తీసుకున్నాను.‘మానేరు గల గల’ లో పీవీ, చొప్పకట్ల చంద్రమౌళి, పురాణం రామచంద్ర, ఎం.ఎస్.ఆర్. లతో కలిపి 49 వ్యాసాల్ని ప్రచురించాను. తెలంగాణ రచయితల సంఘం ప్రచురణగా వెలువరించాను. అప్పటి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముందుమాట రాస్తూ ‘ఇయాలిటీ సందర్భం అస్తిత్వ ప్రకటన. అంతే బలంగా చరిత్ర నిర్మాణం.జరగాల్సిన సమయం. ఆ దిశలో అవటానికి మానేరు గల గల కరీంనగర్ ప్రాంత కవి పరిచయాలే కావచ్చు కానీ సరయిన మార్గం సరయిన ప్రయత్నం’ అన్నాడు. మనకూ ఒక సాంస్కృతిక విధానం కావాలి అంటూ తెలంగాణా సినిమా ఉనికి దాని అభివృద్ధికి చేయాల్సిన అంశాల పైన ప్రధానంగా నమస్తే తెలంగాణలో రాసినవ్యాసాల సంకలనం బంగారు ‘తెలంగాణాలో చలన చిత్రం’. ఈ రెండు పుస్తకాల్నీ నా పుట్టిన రోజు 21 ఆగస్ట్ 2014 న తెచ్చాను. మానేరు గల గల ను నా వైద్యుడు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గందే శ్రీధర్ కి అంకితమిచ్చాను. ఆయన చాలా సంతోష పడ్డారు. బంగారు తెలంగాణ .. పుస్తకాన్ని ఆత్మీయులు మంగారి రాజేందర్ జింబో, వఝల శివకుమార్, సాంబశివుడు, నందిగం కృష్ణా రావులకు అంకితం చేశాను. మిత్రులు సభ పెట్టాలన్నారు. ఫిల్మ్ భవన్ లో ఏర్పాటు చేశాం. ఆత్మీయులందరినీ పిలిచాను. జింబో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, దర్భశయనం శ్రీనివాసాచార్య, వఝల శివ కుమార్, బీ.వీ.ఎన్ స్వామి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, దాస్యం సేనాధిపతి తదితరులు అతిథులుగా పాల్గొనగా, కె.ఎస్.అనంతాచార్య సభకు అధ్యక్షత వహించారు. మానేరు గలగల ను సిధారెడ్డి, బంగారు తెలంగాణ ను జింబో ఆవిష్కరించారు. సభ బాగా జరిగింది. నేను అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ దాటి వచ్చాను కదా. అనేకమంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు. సభలో నమిలకొండ హరిప్రసాద్, నరెడ్ల శ్రీనివాస్, లక్ష్మీకాంతం, పీ.ఎస్.రవీంద్ర, మంగారి శివ ప్రసాద్, ఎం.సరస్వతి-పాపన్న, హిమజ, శారదా శివకుమార్, నవీన వదిన మహేశన్న, ఇట్లా అనేక మంది ఆప్యాయంగా వచ్చి అభినందించారు. దర్భశయనం, స్వామి లు పుస్తకాల మీద సాధికారక ప్రసంగం చేశారు. ఇక మధు అయితే నా వృత్తి, కాలేజీ, లైబ్రరీల గురించి విశేషంగా మాట్లాడారు. సిధారెడ్డి, దేశపతి,వఝల, జింబో లు చాలా ఆప్యాయంగా వివరంగా మాట్లాడారు. నాకిప్పటికీ వారి మాటలు గుర్తున్నాయి. అవి నాకా రోజు పెద్ద టానిక్ లాంటివి.

  ఆ తర్వాత ఆ రెండు పుస్తకాలకు కొన్ని మంచి సమీక్షలే వచ్చాయి. ఇక నా కవిత్వం ముందుకు వచ్చింది. హైదరబాద్ లో గడిపిన ఆ మూడు నెలల సంక్షోభ కాలంలో రాసిన కవితలన్నింటినీ పుస్తకంగా తేవాలని ఆలోచన.

అనారోగ్యమూ, మందులూ, జాగ్రత్తలూ, ఉద్యోగమూ ఒక వైపు, మరో వైపు నా సృజనాత్మక జీవితం. కవిత్వమయితే వేయాలి అనుకుంటూ ముందుకు సాగాను. ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య ను ముందుమాట రాయమని అడిగాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆగస్టులో రెండు పుస్తకాలు వస్తే నవంబర్ 2014 లో కవిత్వం “మనిషి లోపల” వెలువడింది. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను..

+++++

-వారాల ఆనంద్

25 ఫిబ్రవరి 2024                                   

DASHARATHI

Posted on

మిత్రులారా! సాహితీ స్రవంతి కార్యక్రమంలో ‘దాశరథి’ గురించి వినండి.
Pl. click the link for my podcast on DASHARATHI