Month: December 2021
పుస్తకం కారాదు పురావస్తువు..!
+++++++++++++++++++
సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. ‘పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందని ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పర్చుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో’. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ ఆవేదన అది. ‘పుస్తకం హస్త భూషణం’ అన్న స్థితి నుంచి నేడు పుస్తకం ‘పురా వస్తువు’ అయిపోయే స్థితి కనిపిస్తున్నది.
పుస్తకం చదవడం అంటే విద్యాలయాల్లో మార్కులు ర్యాంకులు సాధించడానికి పరిమితమైపోతుండగా, పౌర గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం చదవడమే మనకు కనిపిస్తున్నది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యం, సామాజిక రంగంలో వేళ్లూనుకుంటున్న సంక్లిష్టతలనూ, మానసిక సంక్షోభాలనూ ఆవిష్కరించిన పుస్తకాలను చదివేవాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యక్తిగత, సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకూ అవకాశం కలుగుతున్నది.
నిజానికి పుస్తకం ఒక నిధి. భాషకూ, భావానికీ, వ్యక్తీకరణకూ పుస్తకం ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞాన పరంపరను వారసత్వంగా అందిస్తున్న మాధ్యం పుస్తకం. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర చాలా గొప్పది, విశిష్టమైంది కూడా. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాలను, ఉద్యమాలను, ఉద్వేగాలను, విలువలను ఒక్కటేమిటి మనిషి సమస్త మార్పులనూ పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. అలాంటి పుస్తకాలు అనేక మందికి చేరడం విస్తృతంగా చదవడం అత్యంత అవసరం. పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు పుస్తకాలను పూర్వపక్షం చేస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు.
21వ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే’ సంస్కృతి నుంచి వేరై పోతూ ‘చూసే’ సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్దకాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా మాధ్యమాలూ అలవాట్లూ పెరిగాయి. అంతా చూడటమే. టీవీ, సినిమా, కంప్యూటర్ చూస్తారు. స్మార్ట్ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు, వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అన్నీ చూడటమే. అక్షరాలు రాయడానికీ, చదువడానికీ కూడా ఇమేజ్లను వాడే సంస్కృతిని చూస్తున్నాం. అయితే ఈ చూడటం అనే ప్రక్రియలో అంతా సరిగ్గానే ఉందా, చూస్తూ ఉన్నవాళ్లపై ఈ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్కు సంబంధించిన ప్రభావాలెలా ఉంటున్నాయి, వాటి ప్రతిఫలనాలు సమాజంపై ఎట్లా ఉంటున్నాయనే అవగాహన కొరవడటం విచారకరం.
ఒక మంచి పుస్తకం చదువుతూ గుండెల మీద ఉంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం ఆధునిక తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే. ఈ స్థితికి సాంకేతికత, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలూ కారణమనే వాదన వినిపిస్తూ ఉంటుంది. కానీ తాళపత్ర గ్రంథాలూ, లిఖిత ప్రతుల కాలాన్ని దాటి అచ్చు యంత్రం వచ్చినప్పుడు కూడా ఇలాగే అది అనర్థహేతువనే వాదన వినిపించింది. కానీ క్రమంగా అచ్చుయంత్రం పుస్తక ప్రచురణలో ఎంత విప్లవాత్మక మార్పులు తెచ్చిందో చూశాం. అదేవిధంగా నేటి సాంకేతికత కూడా తాత్కాలికంగా పుస్తకాన్ని మరుగునపర్చినట్టు కనిపించినా, దాన్ని సరైన దిశలో వియోగించగలిగితే భౌతికంగా సాంకేతికత పుస్తక రూపాన్ని మింగేయవచ్చు కానీ భాషనూ భావాలనూ మింగేయలేదు. చదవడం అనే ప్రక్రియకు సంబంధించి పాఠకుల అలవాటు పేజ్ రీడింగ్ నుంచి స్క్రీన్ రీడింగ్కు మారింది.
సాంకేతికత దాని పర్యవసానాలను పక్కనపెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలుచేయాలి. పుస్తకాలు చదవడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ అర్థం చేయించాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసు లోపల ఇమిడించుకోవడంలో ఉన్న ఆనందాన్ని అర్థం చేయించాల్సి ఉన్నది. అది ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలల్లో, గ్రంథాలయాల్లో జరగాల్సి ఉన్నది. లైబ్రరీలను, ఈ-గ్రంథాలయాలూ, డిజిటల్ గ్రంథాలయాలూ అంటూ ఆధునిక వసతులు కల్పిస్తూనే విద్యార్థుల్లో, యువకుల్లో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరగాలి. వారిలో చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులూ గ్రంథాలయాలూ వేదికలు కావాలి. సామాజిక బాధ్యతను గుర్తెరగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం, చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదవాలని టీచర్లు చెప్పగలిగితే విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది, పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.
గ్రంథాలయాలు మరింత బాధ్యతను కలిగి ఉన్నాయి. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల భాండాగారంలా ఉంటే సరిపోదు. కంప్యూటరీకరించినంత మాత్రాన బాధ్యత తీరదు. నిజానికి గ్రంథాలయం ఒక సాంస్కృతిక కేంద్రం కావాలి. పాఠకులను తనవైపు ఆకర్షించే కృషి జరగాలి. పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలిపే, పుస్తక పరిచయ సభలు, ప్రముఖ రచయితలు, ఎడిటర్లు, జర్నలిస్టులు తదితరులతో ముఖాముఖీ కార్యక్రమాలు, ‘రీడ్ అండ్ రివ్యూ’ కింద పుస్తక సమీక్షా సభలు, పోటీలు ఏర్పాటుకావాలి. అంతేకాదు దృశ్య మాధ్యమాన్ని కూడా ఒక ప్రధానాంశంగా తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రేరణ కలిగించే జీవిత చరిత్రల డాక్యుమెంటరీలు, సుప్రసిద్ధ రచనల దృశ్యరూపాల ప్రదర్శనలు ఏర్పాటుచేయగలిగితే పాఠకులు ముఖ్యంగా యువతీ యువకులు లైబ్రరీల వైపు ఆకర్షితులవుతారు. రావడం మొదలైతే చదవడం తప్పకుండా అనుసరిస్తుంది.
ఇక ప్రభుత్వపరంగా కూడా ‘డిజిటల్ లైబ్రరీ మిషన్’ విజయవంతం కావాలంటే కచ్చితంగా లైబ్రరీలను బలోపేతం చేయాలి. ఆధునిక వసతులతో పౌర గ్రంథాలయాలు ఏర్పాటు చేసినప్పుడే సమాచార వ్యాప్తి విస్తరణ సాధ్యమవుతుంది. సాక్షరతా మిషన్ వలె ‘లైబ్రరీ మిషన్- రీడర్షిప్ మిషన్’ చేపట్టాల్సి ఉన్నది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే ఫలితాలు దివ్యంగా ఉంటాయి. బాధ్యత గల పౌరులూ ఉత్తమ విలువల సమాజం ఏర్పడుతుంది. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ‘పుస్తకానికీ జై- చదివే అలవాటుకూ జై’.
– వారాల ఆనంద్, 94405 01281
(PUBLISHED TODAY IN NAMASTE TELANGANA DAILY)
అందుకున్నాను- 21=సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్
+++++++
SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL
—————————-
చిన్నప్పటినుంచీ నేనో సినిమా పిచ్చోన్ని. అంతకంటే నాకు సినిమా పాటలు అందులోనూ హిందీ పాటలంటే మహా పిచ్చి. కవిత్వమన్నాకూడా అంతేకదా అందుకే ఇటీవల సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్ (SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL ) పుస్తకాన్ని ఆన్లైన్ లో అందుకున్నాను. సాహిర్ లుధ్యాన్వీ సాహిత్యాన్నీ జీవితాన్నీ సురేందర్ దేవల్ చాలా బాగా రాసారు. సినిమా కవిగా సాహిర్ ఎంత పాపులరో విలక్షణ మయిన కవిగా అంతే ప్రసిద్ధుడు.
ఈ ‘సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్’ లో సాహిర్ రాసిన 90 కి పైగా రచనల ఆంగ్లానువావాదాలున్నాయి. వాటిల్లో కవితలు, గజల్లు, భజనలు వాటి తో పాటు ‘PARCHAAIYAAN’ (నీడలు) లాంటి దీర్ఘ కవితలూ వున్నాయి.
ఇందులో రచయిత ముఖ్యంగా కవిగా సాహిర్ లోని నాలుగు ప్రధాన లక్షణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. సాహిర్ గొప్ప ప్రకృతి ప్రేమికుడు. గొప్ప భావుకుడు. మనిషి పట్ల ప్రేమా, ఆతని వేదన దుఖం పట్ల సానుభూతి సంఘీభావం వున్నవాడు. అంతే కాదు భవిష్యత్తు పట్ల గొప్ప ఆశాభావం కలిగి వున్నవాడు. అలాంటి సాహిర్ ను ఆయన సాహిత్య జీవితాన్ని కళ్ళముందుకు తెచ్చిన పుస్తకంగా ఇది నాకు బాగా నచ్చింది.
ఈ పుస్తకంలో సాహిర్ చిన్నప్పటి జీవితం నుంచి మొదలు 40 లలో వచ్చిన తన మొదటి కవిత్వ సంకలనం “తల్కియాన్” వరకు మొదటి భాగంలోనూ, తర్వాతి కవితా పుస్తకం“ పర్చాయియాన్” 2 వ భాగం లోనూ, ౩,4 భాగాలలో సాహిర్ రాసిన గజల్స్, భజన్స్ గురించి రాసారు. ఇక చివరి భాగంలో ముగింపు భావనలున్నాయి.
*******************
“మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై
పల్ దో పల్ మేరీ హస్తీ హై, పల్ దో పల్ మెరీ జవానీ హై
ముఝ్సె పహ్లే కిత్నే షాయర్ ఆయే ఔర్ ఆకర్ చలే గయే,
కుఛ్ ఆహేఁ భర్కర్ లౌట్ గయే, కుఛ్ నగ్మే గా కర్ చలే గయే
వో భీ ఎక్ పల్ కా కిస్సా థే, మైఁ భీ ఎక్ పల్ కా కిస్సా హూఁ
కల్ తుమ్ సె జుదా హో జావూఁగా, జో ఆజ్ తుమ్హారా హిస్సా హూఁ ”
ఎంత గొప్ప కవిత. ఒక కవి అంతరంగం ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు సాహిర్.
ఆ కవితే తర్వాత ‘కభీ కభీ’ సినిమాలో పాటగా అమితాబ్ నోట పలికించారు. ఇందులో
కవి ఇట్లా అంటున్నాడు “గతం లో ఎంతో మంది మహా కవులు వచ్చారు గొప్ప కవిత్వాన్ని అందించి వెళ్ళిపోయారు.. నేనూ అంతే ఒక క్షణపు చరిత్రను..ఇక ముందు కూడా నాకంటే గొప్ప కవులు వస్తారు..మీకంటే మంచి శ్రోతలూ వస్తారు” ఎంత వాస్తవిక మానసిక ఆవిష్కరణ. అది సాహిర్ కే చెల్లింది.
అంతే కాదు….
“యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై ..”(ప్యాసా)
“చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయేఁ హమ్ దోనో…”( గం రాహ )
ఇట్లా ఎన్ని పాటలు… దశాబ్దాలుగా వింటూ మైమరిచి పోయాను. గున్ గునాయిస్తూ ఊగి పోయాను.
నేను పాటల పిచ్చోన్ని అని చెప్పాను కదా 70 ల్లోనే సిలోన్ రేడియో లో వచ్చే ‘బినాకా గీత్ మాలా’ అంటే ప్రాణం పెట్టేవాన్ని. ప్రతి బుధవారం రాత్రి 8 అయిందంటే చాలు రేడియో ముందుకు చేరాల్సిందే. అంటే కాదు ప్రతి రోజూ ఉదయం 7.30 కి ప్రసారమయ్యే ‘పురానీ ఫిల్మొంకా గీత్ వినాల్సిందే. అట్లా పాటలంటే ప్రాణం పెట్టె నేను క్రమంగా ఆ పాటల గాయకులే కాకుండా సంగీత దర్శకుల పేర్లు రాసిన కవుల పేర్లూ తెలుసుకోవడం మొదలు పెట్టాను. అందులో నాకు కవిగానూ సినీ గీత రచయిత గానూ మదిలో నిలిచిపోయిన వాడు సాహిర్.
అట్లా కవిత్వమూ పాటలూ రాసి మెప్పించిన సాహిర్ పుట్టి నూరేళ్ళు పూర్తయినాయి. ఆయన రచనలు, కవితలు ఈనాటి సమస్యలకు అద్దం పడుతాయి. ప్రగతి శీల ఉద్యమాలకు ఆయన కవితలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సాహిర్ లుధియాన్వి మార్చి 8, 1921లో ఒక జమిందారీ కుటుంబంలో పుట్టారు. ఆయన మొదటి పేరు అబ్దుల్ హై ఫజాల్ అహ్మద్. సాహిర్ అన్న పేరును తన కలం పేరుగా పెట్టుకున్నారు. జమిందారి కుటుంబంలో పుట్టినా జమిందారి దర్జాలను సౌఖ్యాలను ఆయన అనుభవించ లేదు. ఎందుకంటే ఆయన పుట్టిన కొన్నాల్లకే తల్లి దండ్రులు విడిపోయారు. సాహిర్ తల్లి సర్దార్ బేగమ కొడుకును తీసుకొని భర్త నుంచి దూరంగ వెళ్ళిపోయింది. సాహిర్ చిన్నప్పుడే తన తల్లిని హింసించే తండ్రిని ఆయన అసహ్యించుకున్నాడు. ఇది ఆయనపై గొప్ప ప్రభావాన్నే చూపించింది. ఒక నవ యువకుడిగా ఆయన సమకాలీన రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలపై స్పందించే వాడు.
సాహిర్ ను తల్లే కష్టపడి పెంచింది. లాహోర్ లోని దయాళ్ సింగ్ కాలేజీ లో చదివాడు సాహిర్.
”ఎన్నాళ్లని ఆదం గొంతుని నొక్కేస్తారు – మేము చూస్తాం – ఎన్నాళ్లని రగులుతున్న ఉద్వేగాలను ఆపగల్గుతారు – మేము చూస్తాం.” అంటూ సాహిర్ రాసిన కవిత పాకిస్తాన్ పాలక వర్గాలకు ఆగ్రహం కలిగించింది. ఫలితంగా సాహిర్ ఇండియా వచ్చేసాడు.
ఇండియా వచ్చింతర్వాత సాహిర్ అభ్యదయ రచయితల సంఘం లో చురుకుగా వుండేవాడు. ఫైజ్, ప్రేమ్చంద్,అలీ సర్దార్ జాఫ్రీ లాంటి మహా మహులతో పనిచేసాడు. ఆయన పేదలు, కార్మిక వర్గం సమస్యల పట్ల స్పందిస్తూ కవిత్వం రాసారు.
సాహిర్ లుధ్యాన్వీ రాసిన అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించిన పుస్తకంగా సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్* మిగిలిపోతుంది.
చివరగా ఈ సాహిర్ కవితను మననం చేసుకుంటూ….ముగిస్తాను
”మానా కి ఇస్ జమీ కో న గుల్జార్ కర్ సకె – కుచ్ ఖార్ కం తో కర్ గయే గుజ్రే జిధర్ సె హం”
(అవును ఈ ప్రపంచాన్ని నందనవనంగా మార్చ లేకపోయాం – కానీ మనం నడిచిన దారిలో కొన్ని ముళ్ల నైనా తీసివేయగలిగాం )
—వారాల ఆనంద్
విద్యాసంస్థల్లో ఫిల్మ్ క్లబ్ లు
–వారాల ఆనంద్
మారుతున్న కాలం ప్రకారం వ్యక్తులు సంస్థలు తమ లక్ష్యాలని కాయక్రమాలనీ మార్చుకోవలసిందే. లేకుంటే అవి మరుగున పడిపోతాయి. వాటి ఉనికే ప్రశ్నార్ధక మవుతుంది. ముఖ్యంగా సమాంతర కళాత్మక సినిమాలకు వేదికలయి దశాబ్దాలకు పైగా ఒక తరాన్ని ప్రభావితం చేసిన ఫిల్మ్ క్లబ్బుల (సొసైటీలు) పరిస్థితీ ఇవ్వాళ స్తబ్దంగా మారి పోయింది. మన రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ లాంటి ఒకటి రెండు చోట్ల నిలబడ్డ ఫిలిం క్లబ్బులు కరోనా నేపధ్యంలో కార్యక్రమాలు క్రమంగా మందగించి అవి వాటి ఉనికిని నిలబెట్టుకునే స్థితిలోకి నెట్టి వేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవ్వాళ ఫిలిం సొసైటీ ల ఆవశ్యకత లేదని, అసలు వాటి relevance లేదనే వాదన వినిపిస్తున్నది. దాదాపుగా అన్ని సినిమాలు ఇంటర్నెట్ లో లభిస్తున్నప్పుడు ప్రత్యేక ఫిల్మ్ క్లబ్బుల అవసరం ఏముందని కూడా వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల పెల్లుబికిన ఓటీ టీ( ప్రైం, నెట్ఫ్లిక్స్,ఆహా, సోనీ మొ…) వేదికలు వచ్చాక ఇంట్లో కూర్చునే సినిమాల్ని చూసే అవకాశం వచ్చాక బయట సినిమాలకు వెళ్ళే పరిస్థితే లేకుండా పోతున్నది. మరోవైపు ఫిలిం సొసైటీ ప్రదర్శనలకు వచ్చే సభ్యుల సంఖ్య కూడా క్రమంగా తప్పిపోతున్నదన్నది కాదనలేని వాస్తవం.
మరిప్పుడు ఫిలిం సొసైటీలు ఎం చేయాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. కేవలం సినిమా ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఫిలిం టెక్నాలజీ పై ద్రష్టి పెట్టాల్సిన అవసరం వుంది. అంతేకాదు కొత్త తరానికి కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ కాంపస్ ఫిల్మ్ క్లుబ్బులు ఏర్పాటు చేసి ఫిల్మ్ క్లబ్బులకు కొత్త రూపాన్ని ఇవ్వాల్సిన అవసరం వుంది. నా అభిప్రాయం ప్రకారం నిజానికి ఫిల్మ్ క్లబ్బుల relevance, అవసరం ఇవ్వాళే ఎక్కువగా వుంది. అందుకు మన ప్రభుత్వం కూడా చొరవ చూపించాల్సి వుంది.
‘ఫిల్మ్ క్లబ్ లో చేరండి ప్రపంచాన్ని చూడండి’ ఇది ఎనభయవ దశకం లో మంచి సినిమాలు ఇష్టపడే వాళ్ళు అర్థవంతమయిన సినిమాల్ని ఆసక్తిగా చెప్పు కున్న స్లోగన్. ఆకాలం లో సత్యజిత్ రాయ్, సినిమాలు గాని, కురుసోవా సినిమాలు గాని మరింకే విఖ్యాత దర్శకుల సినిమాలు చూడడానికి ఖచ్చితంగా ఫిలిమ్ క్లబ్ లే అధారంగా వుండేవి. అంతే కాదు ‘భాగల్పూర్ బ్లైండింగ్స్’ పైన తపన్ బోస్ తీసినదయినా, రాకేశ్ శర్మ తీసిన బాంబే హమారా షెహర్ మరింకే మంచి డాకుమెంటరీ చూడాలని వున్నా ఫిల్మ్ క్లబ్బులే అవకాశం కల్పించేవి. అందుకే అవి 1970 నుండి రెండు దశాబ్దాల పాటు ఒక ప్రగతిశీల,ఉత్తమ సినిమాలకు వేదిక గా నిలిచాయి. అందుకే దేశ వ్యాప్తంగా ఏర్పాటయిన వాటితో సహా హైదరబాద్,కరీంనగర్,వరంగల్ లాంటి నగరాలతో పాటు, వేములవాడ,ఎల్లారెడ్డి పేట్. లాంటి మామూలు గ్రామాల్లో కూడా ఫిలిమ్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి. దశాబ్దాలపాటు ఉత్తమ సినిమాలకు వేదికలయాయి. కలర్ టీవీలు క్రమంగా నట్టింట్లోకి చేరాయో అప్పుడే సభ్యుల సంఖ్య తగ్గడంతో ఫిలిమ్ క్లబ్బులు క్రమంగా తమ కార్యక్రమాల్ని తగ్గించుకోవడం ఆరంభ మయింది. 1970-1990 ల దాకా విస్తృత మయిన కార్యక్రమాల్ని నిర్వహించి జాతీయ అంతర్జాతీయ సినిమాల్ని, బాలల సినిమాల్ని ప్రజలకు పరిచయం చేసిన ఫిల్మ్ క్లబ్బులు అనతర కాలం లో మందగించాయి. నిజానికి ప్రధాన స్రవంతి సినిమాకి సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ పంపిణీ వ్యవస్థగా ఫిలిమ్ క్లబ్బులను రూపొందించాలని అప్పటి కార్యకర్తలు భావించారు.
ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు సత్యజిత్ రాయ్ అధ్యక్షుడిగా వుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా డిల్లీ చాప్టర్ కి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అనేక అంతర్జాతీయ సినిమాలతో కూడిన ఫిలిమ్ పాకేజీలతో ఉత్సవాలు నిర్వహించింది. దేశమంతా ఒక ఆశావాహమయిన స్థితి కనిపించింది. ఫిలిమ్ క్లబ్బుల ఫలితంగానే మన దేశంలో అంతర్ జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ మొదలయింది.
కానీ అనంతర కాలం లో ఇంట్లోకి చొరబడ్డ టెలివిజన్ పెరిగిన సాంకేతిక అభివృద్ది క్రమంగా ఫిలిమ్ క్లబ్బుల వునికిని ప్రశ్నార్థకం చేశాయి. ఇంట్లోనే రోజంతా సినిమాలు,సినిమా ఆధారిత కార్యక్రమాలతో టీవి ప్రజల్ని ఎంగేజ్ చేయడం తో ఆదివారం ఉదయం 8గంటలకు జరిగే ప్రదర్శనలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అప్పటికే దేశం ప్రాధాన్యతను సంతరించుకుంటున్న ప్రపంచీకరణ మంచి కళాత్మక వాస్తవిక సినిమాలకు స్థానం లేకుండా పోయింది .దాంతో ఫిలిమ్ క్లబ్బుల నిర్వహణ కష్టతరమయిపోయింది. అంతే కాదు సభ్యుల సంఖ్యా కుదించుకు పోయింది. అప్పటివరకూ ఉదయం 8 గంటలకు సినిమా ప్రదర్శనకు అవకాశం ఇచ్చి టాక్స్ కూడా మినహాయించి ప్రోత్సహించిన ప్రభుత్వాలు క్రమంగా తమ ప్రోత్సాహాన్ని వెనక్కు తీసుకున్నాయి. అది కూడా క్లబ్బుల నిర్వహణ పైన ప్రభావాన్ని చూపించింది. ఇక మారుతున్న కాలంలో సాంకేతికత పెరిగి మొదట వీడియో కాస్సేట్లు వీడియో లిబ్రరీ లు, తర్వాత సీడీలు తర్వాత డీవీడీలు హార్డ్ డిస్క్ లూ తమ ప్రాభవాన్ని పెంచడం ఆరంబించాయి. ఇంటర్నెట్ అందు బాటులోకి వచ్చినంక పరి స్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ లో torrent, యు ట్యూబు, vimeo, website లాంటి ఎన్నో ప్లాట్ ఫార్మ్ లో సినిమాలకు వీడియోలకు వేదికలయ్యాయి. దునియా ముట్టీమే అన్నట్టు ప్రపంచ సినిమా మొదట డెస్క్ టాప్ లకు, ఇప్పుడు సెల్ ఫోన్ లోకి వ్యాప్తి చెందింది. అన్నీ సినిమాలు అరచేతిల్లో అందుబాటులో వుండగా ఫిల్మ్ క్లబ్బుల అవసరమేముంది. వాటిల్లో సభ్యులుగా చేరడం ఆదివారాల్లో ఉదయమే సినిమాకు రావడం ఎందుకు అనే భావం ఏర్పడింది. దాంతో ఫిలిమ్ క్లబ్బుల అవసరం ఆవశ్యకత తగ్గిపోయింది. అప్పటిదాకా సమాంతర సినిమాలకు ఏకయిక వేదికగా వున్న ఫిలిమ్ క్లబ్బుల రేలేవన్స్ తగ్గిపోయింది. దాంతో పల్లె పల్లె కూ చేరుతుందనుకున్న ఫిలిమ్ క్లబ్బుల వుద్యమం మహానగరాలకు నగరాలకూ పరిమితంయి పోయి చివరికి దాదాపు అన్నీ మూత బడే స్థితి ఏర్పడింది.
అయితే ఇందుకు మినహాయింపు కేరళ రాష్ట్రం అక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం తో ఫిల్మ్ క్లబ్బులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి.కానీ మన తెలంగాణాలోనూ ఆంధ్రాలోనూ పరిస్తితి పూర్తిగా భిన్నం. కరీయింనగర్ ఫిలిమ్ సొసైటి సిలిమ్ భవన్ పేర సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక విలక్షణమయిన విషయం, బెంగళూరు తర్వాత కరీంనగర్లోనే ఫిలిమ్ సొసైటి కి సొంత హాలు వుండడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే నెట్ లో అన్నీ దొరుకుతున్నాయి కలెగూరగంప లాగా, అన్నీ ఒక చూటే దొరికినప్పుడు ఫిల్మ్ క్లబ్బుల అవసరం లేదనే వాదన కు బలం లేదు ఎందుకంటే అన్నీ ఒకచోట లభించినప్పుడు వాటిల్లో మంచివి ఏవి చెడువి ఏవి అనే తేడాని తెలుసుకునే పరిజ్ఞానం కావాలి మరి అలాంటి పరిజ్ఞానాన్ని అందించే కృషి ని ఫిల్మ్ క్లబ్బులు నిర్వహిస్తాయి. అన్ని మానవీయ విలువల్ని తుంగలో తొక్కుతూ హింస,సెక్స్, అవాస్తవికత లాంటి అంశాలతో సమాజాన్ని తప్పు తోవ పట్టిస్తున్న వ్యాపార సినిమాల నుంచి భిన్న మయిన అర్థవంత మైన చిత్రాలగురించి ముఖ్యంగా యువతకు అవగాహన కలిగించాల్సిన అవసరం వుంది. గతం లో లాగా ఫిల్మ్ క్లబ్బు ఉత్తమ సినిమాల్ని ప్రదర్శించి వూరుకోకుండా వాటి appreciation లో కూడా వివరించాల్సి వుంటుంది అప్పుడే దృశ్య మాధ్యమాన్ని గురించి మంచి చెడులు తెలుస్తాయి. అందుకే ఫిల్మ్ క్లబ్బుల్ని అన్నీ జిల్లాలకూ మండలాలకూ విస్తరింప చేయడంలో ఉత్తమ సినిమాల అభిమానులూ అభినివేశం వున్న వారూ కృషి చేయాల్సి వుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించాల్సి వుంది.
ఇక కాలేజీలూ స్కూళ్ళల్లో కాంపస్ ఫిలిమ్ క్లబ్బుల ఏర్పాటు ప్రక్రియ గతం లోనే ప్రారంభ మయింది. ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ పలు యూనివర్సిటీ ఉప కులపతులకు లేఖలు రాశారు. దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మనజింగ్ డైరెక్టర్ సి.పార్థసారధి గారిని కోరితే కాలేజీ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్లకి లేఖలు రాయగా వారు స్పందించి ఆయా కాలేజీలకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ మొదలు విశాఖ దాకా అనేక కాలేజీల్లో ఫిల్మ్ క్లబ్బుల ఏర్పాటు జరిగింది. నేనే ఊరూరు వెళ్లి కాలేజీల్లో ఫాలం క్లబ్బులు స్థాపించాను. అయితే వాటిని సక్రమంగా నడిపించాల్సి వుంది. విద్యార్హ్తులకు సినిమా డిజిటల్ మీడియాకు సంబంధించి చాన్యం కలిగించాల్సి వుంది.
ఆ ఒరవడి ఇప్పటి మన తెలంగాణ లో కూడా కొనసాగించాల్సిన పని వుంది..
అందుకే ఫిల్మ్ క్లబ్బుల అవసరం , relevance ఇప్పుడే అధికంగా వుంది. మేధావులూ, ప్రభుత్వమూ ఈ దిశలు ఆలోచించాల్సిన అవసరం వుంది
–వారాల ఆనంద్
Image Posted on
వారాల ఆనంద్ = చిన్న కవితలు
వారాల ఆనంద్
చిన్న కవితలు
++++++++++++
1)
కళా సృష్టి అనేది
మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి
ప్రతిమను రూపొందించడం లాంటిది
2)
అహంకారం ఒకసారి ఎక్కడం మొదలయితే
శరీరమూ మెదడూ సరిపోదు
మనసూ మునిగి పోతుంది
౩)
గొప్పలు చెప్పుకోవడం మొదలయ్యాక
మెప్పులు మాత్రమే రుచిస్తాయి
నిజాలు చేదవుతాయి
4)
కిరీటాలూ బుజకీర్తులూ
కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప
శ్రావ్య సంగీతాన్ని వినిపించవు
5)
అర్హతను ముంచి లభించిన ప్రతిదీ
అల్పత్వాన్నే ప్రోది చేస్తుంది
హుందా తనాన్నివ్వదు
6)
అవసరమయినప్పుడు ఆసరా తీసుకుని
తీరం చేరి తక్కువ చూసే
కృతఘ్నత ఎప్పటికీ ‘దారి’ చూపదు
7)
అసూయా పరుడు తనను తాను పొగుడుకుంటాడు
క్రమంగా తననే పోగొట్టుకుంటాడు
ఎండిన ఆకు గల గలమని గాలిలో కలిసిపోతుంది
8)
చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు
పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద
తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి
9)
చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది
వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది
మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం
10)
ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా
తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి
పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు
11)
ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు
సాటి మనుషులూ లేరు
ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది
12)
తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి
కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ
కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం
అందుకున్నాను-20
ఇప్పుడొక పాట కావాలి- బిల్ల మహేందర్ కవిత్వం
++++++++++++++
‘వస్తూవున్నప్పుడు
పిడికెడు మట్టిని తెండి
మొలకెత్తడం నేర్చుకుందాం….’ అంటూ బిల్ల మహేందర్ పంపిన “ఇప్పుడొక పాట కావాలి” కవితా సంకలనం అందుకున్నాను.
‘దుఖం ఇవ్వాల్టిది కాదు
యేండ్లతరబడి మోస్తూనే వున్నాను
వెనుక పేజీ తిరగేసిన
కన్నీళ్ళతో తడిసి బరువెక్కుతుంటాయి…’ అన్నాడు మహేందర్..అవును ‘ఇప్పుడొక పాట కావాలి’ చదివింతర్వాత గుండె బరువెక్కింది. మంచి కవిత్వం చదివిన అనుభవంతో పాటు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి కూడా మిగిలింది
…….
‘ఇది ఆకాంక్షల్ని రక్తగతం చేసుకుని, అక్షరాల్ని జీవితంగా మలుచుకుని కాలం నిర్దేశించిన దారిలో విచ్చుకుంటూ సాగిపోతున్న బిళ్ళ మహేందర్ నాలుగేళ్ళుగా సాగిన ప్రయాణాన్ని, రాసిన కవిత్వాన్ని ఒక చోట ప్రకటించిన సంపుటి ఈ ‘ఇప్పుడొక పాట కావాలి’ అని అన్నారు డాక్టర్ నందిని సిద్దారెడ్డి తన ముందు మాటలో.
ఆయన అభిప్రాయ పడ్డట్టుగానే గొప్ప అనుభవం, మంచి అనుభూతి, ఆర్ద్రత లతో పాటు మంచి వ్యక్తీకరణ కూడా కలిగిన కవి మహేందర్. ఈ సంపుటి నిండా సాంద్రమయిన కవిత్వం తో పాటు వస్తు వైవిధ్యమూ మనకు కనిపిస్తుంది.
“అప్పుడప్పుడు
తను నువ్వు నేను కలిసి
మొలిచిన మాటల్ని కుప్పలుగా పోసి
దారి పొడువునా మాటల పందిరిని నిండుగా పరచాలి” అన్నాడు మహేందర్ తన ‘నాలుగు’ కవితలో… అట్లా ఆయన కుప్పపోసిన మాటల వెంట నడుస్తూ నడుస్తూ ఈ సంపుటి చదువుతున్నంత సేపూ మంచి కవిత్వాన్ని అస్వాదిస్తాం.
+++++++
‘ఉత్తిగనే రాస్తూ కూర్చుండలేను
నడువాల్సిన తొవ్వెంబడి నడవక పోతే
కాళ్ళు గుంజుతుంటయి
ఎత్తాల్సినకాడ పిడికిలి ఎత్తకపోతే
చేతులు బరువేక్కుతాయి’ అన్న మహేందర్ వరంగల్ జిల్లా వేలేరు గ్రామంలో పుట్టాడు. మలిదశ తెలంగాణా ఉద్యమ ఉధృతిలో ముందుకు సాగిన తను ఇప్పటికి ఆరు పుస్తకాలు వెలువరించారు. దివ్యాంగ అనాధ విద్యార్హ్తుల విద్యాభివృద్ధికి తోడ్పడే అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కేవలం రాయడమే కాకుండా చైతన్యవంతమయిన కర్యశీలత తో కృషి చేస్తున్నాడు.
“బిళ్ళ మహేందర్ కవిత్వం చదువుతుంటే ప్రతి కవితలోనూ ప్రతి పంక్తిలోనూ ప్రతి పదం లోనూ నాకు కనబడినదీ వినబడినదీ హోరేత్తినదీ సార్ద్ర సంభాషణే. ఈకవిత్వమంతటినీ మాధ్యమంగా పెట్టుకుని మహేందర్ సమకాలీన సమాజంతో, నిత్య సన్నివేశాలతో నిరంతర సంభాషణ జరిపాడు” అని ఎన్.వేణుగోపాల్ అన్నాడు.
నిజమే మహేందర్ అట్లా సంభాషిస్తూనే ‘నేను మాట్లాడుతున్నాను’ అన్నాడు ఓ కవితలో అందులో
‘మౌనంగా ఉండడమంటే మాట్లాడలేకపోవడం కాదు
మనస్సు పొరల్ని బందించి జీవచ్చవంలా బతకడం
మనిషి తనాన్ని పూర్తిగా కోల్పోవడం’ అని అన్నాడు మహేందర్ . అనడమే కాదు వ్యక్తిగా మనిషితనాన్ని పూర్తిగా నిలుపుకుంటూ సాటి మనిషి పట్ల బాధ్యత తో నిలబడుతున్నాడు.
‘చివరికి
చీకట్లో కలసిపోయిన మీ అడుగుల్ని నిలబెట్టేందుకు
నేను ప్రతీ రాత్రి అడవిలో సింధూరమై మొలకేత్తుతాను’ అనీ అంటున్నాడు మహేందర్.
….
‘అది ఒక యుద్ధ క్షేత్రం
ఓ ఆత్మ గౌరవ పతాకం’ అని ధర్నాచౌక్ గురించి కవిత్వం చెప్పిన మహేందర్
“రాజ్యమేలేటోడు
వస్తూనే ఉంటడు పోతూనే వుంటడు
చివరిదాకా నిలిచేవాడే వీరుడు’ అని కూడా స్పష్టంగా అంటాడు.
అంతేకాదు
నిజంగా ఒట్టేసి చెబుతున్న
ఒక్క సారి మీ సాయంకాలాన్ని కాసేపు నాకివ్వండి
ఇక ప్రతి సాయంకాలం
మీకు అందమయినదిగా సంతకం చేసిస్తాను’ అని కూడా హామీ అస్తున్నాడు.
….
ఒక్కోసారి మహేందర్ కవిత్వం నిండా ఒక విషాద జీర ధ్వనిస్తూ వుంది.
“ఇప్పుడు కాళ్ళు రెక్కలు తెగి
చక్రాల మీదికి నెట్టి వేయబడిన నా జీవితానికి
మిగిలిన ఒకే ఒక తోడు ఈ కిటికీనే
ఎన్ని చేకట్లు కాటేసినా ఎన్ని వెలుగులు విరబూసినా
ఎ మాత్రం కదలలేని నా మొండి దేహానికి
ప్రత్యక్ష సాక్షి ఈ కిటికీనే
అప్పుడప్పుడూ
రెక్కలు కట్టుకుని ఊరేగుదామనుకున్న ప్రతిసారీ
ఎగరలేని నా నిస్సహాయతను చూసి
జాలిపడే ఆప్త మిత్రుడు ఈ కిటికీనే” కానీ ఆ విషాద స్పందన దగ్గర మహేందర్ నిలబడి పోడు.
ఆయన కవిత్వంలో ఆ విషాద ధ్వని కి ప్రతిధ్వనిగా గొప్ప ఆత్మ విశ్వాసం కూడుకున్న ఆశావాదం కూడా వినిపిస్తుంది. తనకి జాలి అవసరం లేదని..
‘రాళ్లో ముళ్లో పూలదారినో
బతుకు తొవ్వ సాగిపోవాలంటే
అడుగుల్ని ముందుకు కదిలించాల్సిందే
చివరివరకూ నడుస్తూపోవాల్సిందే’ అంటూ ముందుకు సాగుతాడు.
అట్లా గొప్ప ఆశావాద దృక్పధం తో కవిత్వం రాయడమే కాదు జీవితమూ అంతే ఆశావాహకంగా గడుపుతున్న మహేందర్ ను మనస్పూర్తిగా అభినదిస్తున్నాను.
కవిగానూ మనసున్న ఆత్మవిశ్వాసం వున్న మనిషి గా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను
-వారాల ఆనంద్