Month: October 2021

యాదోంకి బారాత్ -19 =  కరీంనగర్- ఎస్.ఆర్.ఆర్.కాలేజీ-డిగ్రీ చదువులు 

Posted on

 

 కరీంనగర్- ఎస్.ఆర్.ఆర్.కాలేజీ-డిగ్రీ చదువులు

++++++++++++

1974 లో ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో డిగ్రీ లో చేరింతర్వాత చదువులో ఓ స్తబ్దత సృజనలో కొత్త దారులు ఏర్పడ్డాయి. చదువు విషయం లో ఓకే లక్ష్యం ఒక ధ్యేయం లేని కాలమది. ఆ కాలంలో డిగ్రీలో చేరిన తర్వాత రెండేళ్ళకి ‘పార్ట్ వన్’ అని  First language ఇంగ్లీషు, Second  language  తెలుగో హిందీనో ఏదయితే అది రెండో భాష లకు పరీక్షలు ఉండేవి, తర్వాత  మూడేళ్ళకి ‘పార్ట్ టూ’ అని అసలు డిగ్రీ ఫైనల్ పరీక్షలు. పార్ట్ 2 లో అన్ని సబ్జేక్టులకూ ఒక్కో దానికి మూడేసి పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. అది ఏమి ప్రయోగమో కానీ డిగ్రీ చదువంటే మూడేళ్ళూ ఆడుతూ పాడుతూ సాగడమే.. పరీక్షల భయం లేదు.. పాస్ ఫెయిల్ లేదు. అంతా బలాదూర్. క్లాసులు ఉండేవి కాని ఒక చాప్టర్ తర్వాత మరొకటి అట్లా ముగుస్తూ ఉండేవి. Assessment or Assignments అనేవే లేవు . కనీసం వెనక్కి చూడకుండా చదువులు కాలం కూడా సాగి పోయేవి. నా లాంటి వాడికి మెడికల్ కల ముగిసిన తర్వాత మరింత ఉదాసీనత అనుముకునేది. నా మట్టుకు నాకయితే తెలుగు మీడియం లో బీఎస్సీ కావడం తో ‘ ఆకసేరుకాలు ’, ‘ సకశేరుకాలు ’, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం లాంటి మాటలతో ఏమీ తోచేది కాదు. మీది తెలుగు మీడియం తప్పదు తెలుగులోనే రాయాల్సి వుంటుంది అనేవాళ్ళు సార్లు. మూడేళ్ళ తర్వాత పరీక్షల నాటికి చూద్దాం అన్నట్టు సాగేది చదువు. జువాలజీ లాబ్ లో ‘స్కొలియోడాన్’, కెమిస్ట్రీ లాబ్ లో అమ్మోనియా కంపు చిత్రంగా వుండేది. అయినా ఎప్పుడూ క్లాసులు ఎగ్గొట్టడం కానీ నిర్లక్ష్యంగా కానీ లేక పోవడంతో అన్ని అకాడెమిక్ పరీక్షల్లో ఎక్సెలెంట్ ఫలితాలు కాకున్నా ఫెయిల్ అన్నది లేదు.. కొంత మెరుగయిన ఫలితాలే వచ్చాయి. అట్లా జరగడానికి ప్రధాన కారణం నా చేతి రాత మాట లాగే బాగా లేకపోవడం. మరో కారణం వృక్ష, జంతు శాస్త్రాల్లో బొమ్మలు సరిగ్గా వేయలేక పోవడం. చిన్నప్పుడు నాన్న నా చేతి రాత పై చాల దృష్టి పెట్టారు. చూచి రాతలు రాయించారు. తెలుగుకు రెండు లైన్ల కాపీలూ, ఇంగ్లీషుకు నాలుగు లైన్ల కాపీలు తెచ్చి రాయించే వారు. రాయక పోతే చేతి మట్టలు పగులగొట్టారు. సున్నా చుట్టడడం, సరళ రేఖ గీయడం చేయరా రాత మెరుగవుతుందని చెప్పీ చెప్పీ విసుగొచ్చి వదిలేసాడు. దాని ఫలితమే వంకర రాత. ఆలోచనలు, సబ్జెక్ట్ లు సరిగ్గానే వున్నా ఆకట్టుకునే చేతి రాత లేకపోవడం పెద్ద ఆటంకమే అయింది, మా మిత్రుడు దామోదర్ రాతా అంతంత మాత్రంగానే ఉండేది. ‘ఆ ఏముంది భయి చాలా మంది డాక్టర్ల రాతే బాగుండదు.. వాళ్ళు పెళ్ళానికి ఉత్తరం రాస్తే మెడికల్ షాప్ కెళ్ళి చదివించు కోవాలని’ జోకులు వేసేవాడు. మా వెంకటెష్ గాడి రాత చాలా అందంగా వుండేది. స్కూలు కాలం నుంచి నోట్స్ రికార్డ్స్ కూడా బాగా రాసేవాడు. కాని ఏమి లాభం వార్షిక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేవి. స్కూల్లో తెలుగు సార్ అనేవాడు.. “చేతి రాత దేముందిరా తల రాత బాగుండాలి అని”.

   ఇక బొమ్మల విషయానికి వస్తే రికార్డ్స్ లో వెంకటేష్ డ్రాయింగ్స్ బాగా వేసేవాడు. మనమే అంతంత మాత్రం. ఒక్కోసారి రెండు వైపులా పుస్తకాలు పెట్టి అడ్డంగా అమర్చి వెంకట్ గాడి రికార్డ్ షీట్స్ కాపీ కొట్టిన సందర్భం కూడా వుంది. ఏమిటో హై స్కూల్ సైన్సు నుండి డిగ్రీ సైన్సు దాకా అట్లా గడిచింది. గుండ్రటి అక్షరాలూ అందమయిన డ్రాయింగ్స్ లేకుండానే Graduation  ఘనంగా ముగిసింది.

++++        

స్కూలు కాలం నుంచి సిలబస్ చదువులే కాకుండా కథలకు చందమామ, బాలమిత్ర లు, కొంచెం పెద్దయ్యాక డిటేక్టివ్ నవలలకు క్లాక్ టవర్ దగ్గరలో వున్న శ్రీ కృష్ణ బుక్ స్టాల్ మీద ఆధార పడేవాళ్ళం. రొజువారీ కిరాయకు (రెంట్)కు ఇచ్చేవారు. ఇక దిన పత్రికలు స్కూలు దాటే వరకు అంతగా పరిచయం లేదు. ఎందుకంటే కరీంనగర్ కు దిన పత్రికలు రోజూ ఏ పగటీలికో వచ్చేవి. విజయవాడనుంచి రైలులో వరంగల్ కు చేరి బస్సులో మా వూరుకు   వచ్చేసరికి మధ్యాహ్నం దాటేది. ఇక 1972లో మా పదవ తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించిన రోజు బస్ స్టాండు లో ఉదయం నుంచి వేచి వున్న రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నవ్వువస్తుంది. ఓ పక్క ఫలితం ఏమవుతుందో నన్న భయం మరో పక్క పేపర్ ఆలస్యం గొప్ప ఉత్కంఠ. ఆ రోజుల్లో కరీంనగర్ లో ఇద్దరు పేపర్ ఏజెంట్లు వుండే వాళ్ళు. ఒకరు MOIZ గా ప్రసిద్దుడయిన మొయినొద్దిన్ కాగా రెండవ వారు అనంతస్వామి. మోయిజ్ కు బస్ స్టాండ్ లో బుక్ స్టాల్ వుండడంతో పాటు దాదాపు అన్ని తెలుగు దిన వార పత్రికలకు, మాస పత్రికలకు ఆయనే ఏజెంట్ కావడంతో పత్రికలు చదవాలనుకునే వాళ్లకు ఆయనే దిక్కు. అంతే కాకుండా ఆయన ఆజన్మాంతం ‘సియాసత్’ ఉర్దూ పత్రికకు విలేఖరిగా వున్నాడు. ఇక అనంత స్వామి హిందూ ఆంగ్ల పత్రికకు ఏజెంట్ కం రిపోర్టర్ గా పనిచేసారు. కరీంనగర్ బస్ స్టాండ్ ఇప్పుడు ప్రతిమ మల్టిప్లెక్ష్ వున్న జాగాలో వుండేది. ఒక క్లాసికల్ స్థాయిలో రౌండ్ గా అందంగా ఆకర్షనీయంగా కనిపించేది. అందులో ఒక స్టాల్ మోయిజ్ ది. దాని ముందు మా టెంత్ ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం చూసిన ఎదురుచూపులు ఇంకా నా మదిలో ఫ్రెష్ గానే  వున్నాయి. ముఖ్యంగా మొయిజ్ కోపంగా కేర్ లెస్ గా మాట్లాడేవాడు. ఆయనది పత్రికల వ్యాపారంలో మొనోపలీ కనుక పత్రికల్ని ముట్టనిచ్చే వాడు కాదు. జావో జావో అంటూ ఉండేవాడు. కొనడానికి తప్ప చూడ్డానికి ఆ బుక్ స్టాల్ కి వెళ్ళే వాళ్ళం కాదు.(తర్వాత ఆయనతో నాకు మంచి స్నేహం కుదిరిందనుకోండి.. అది మరో సారి). అట్లా దిన పత్రికలతో మా అనుబంధం సాగేది. డిగ్రీలో చేరింతర్వాత మార్కెట్ లో వున్న జిల్లా గ్రంధాలయానికి వెళ్ళడం మొదలయ్యింది. అక్కడే పత్రికలు చూడడంతో పాటు కార్వాన్, బ్లిట్జ్, Illustrated weekly లాంటి పత్రికల పరిచయం ఏర్పడింది. ఇక కాలేజీ లైబ్రరీ లో అంత సీన్ వుండేది కాదు. విద్యార్థులు అధికంగా వుండడం తో వసతి అంతంత మాత్రమె. సో అప్పుడు మాకు జిల్లా గ్రంధాలయమే దిక్కు. కొంచెం రద్దీగా వున్నా అక్కడే దాదాపు అన్ని పత్రికల పరిచయం అయింది. ఆ పరిచయమే నన్ను రచయితను చేసిందేమోననిపిస్తుంది.

++++++

ఎస్.ఆర్.ఆర్. లో చదువుతూ ఉండగానే అంటే 1974లోనే హైదరాబాద్ నుండి ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభమయింది. దాంతో కరీంనగర్ లో దినపత్రికల దృశ్యమే మారిపోయింది. ఉదయాన్నే వచ్చేది. బిన్నమయిన శీర్షికలతో బాగా ఆకట్టుకుంది. ఇక నా జీవితంలో మొట్టమొదటిసారి రచనకు పారితోషికం అందుకుంది ఈనాడు నుంచే. అప్పుడు ఈనాడు లో ‘గొప్ప అత్యల్ప విషయాలు’ అనే శీర్షిక నిర్వహించేవారు. అది చూసి నేను నాకు కార్వాన్ లాంటి పత్రికల పరిచయంతో కొన్ని అత్యల్పంగా కనిపించే గొప్ప విషయాల లిస్టు రాసి పంపాను. రెండు వారాల్లో ప్రచురించారు. ఈనాడు లో ‘వారాల ఆనంద్’ అన్న పేరు చూసుకోవడం మజా నే కాదు అదో పెద్ద థ్రిల్. అంతే కాదు వెంటనే అమౌంట్ సరిగ్గా గుర్హ్టు లేదు కాని పదో ఇరవయ్యో మనీ ఆర్డర్ పంపారు. ఆనాడు నా సంతోషానికి అవధుల్లేవు. అట్లా పత్రికలు-నా రచనలు ఆరంభమయ్యాయి.

+++++++++

దాదాపుగా అదే సమయంలో నా సృజనాత్మక రచనలు కూడా మొదలయ్యాయి. మనెను మొట్టమొదట రాసింది ఓ చిన్న కాలం కథ. అది కథ నొ గల్పికనో తెలీదు. కాని నేను రాసిన దాన్ని కరీంనగర్ నుంచి అప్పుడు వెలువడిన ‘చిత్రిక’ వార పత్రికలో వేసారు. కథ పేరు ‘ఆమె’ అని జ్ఞాపకం. ఒక యువకుడు కరీంనగర్ లోని మంకమ్మ తోట నుంచి నడుస్తూ బయలుదేరతాడు. ముందు ఒక అందమయిన అమ్మాయి వెళ్తూ వుంటుంది. ఆ అమ్మాయిని చూసిన ఆనందంలో ఆ అబ్బాయి మనసులో ‘పగలే వెన్నెలా జగమే ఊయల’ పాట గన్ గునాయిస్తూ ఉంటాడు… అట్లా నడక సాగీ సాగీ కరీంనగర్ బస్ స్టాండ్ దాటుతుంది. ఆ అమ్మాయి వెనక్కి ఒక్క సారి వెనక్కి చూసి ఆ పక్క సందులోకి మరలుతుంది. అప్పుడు తోస్తుంది ఆ అబ్బాయికి ఆ సందు వేశ్యా గృహాలు ఉండేది. అబ్బాయి హతాశుడవుతాడు మనస్సు చివుక్కు మంటుంది. ఇట్లా సాగుతుందా కథ. దాన్ని చిత్రిక సంపాదకుడు శ్రీ పురాణం రామచంద్ర బాగా ప్రెజెంట్ చేసారు. అంతే కాదు నన్ను పిలిచి బాగా ప్రోత్సహించారు. కథలు రాస్తూ వుండు. మంచి కథన లక్షణం వుంది నీ రాతలో అన్నాడు. పొంగిపోయాను. అప్పుడప్పుడూ శాస్త్రీ రోడ్డులో వున్న చిత్రిక ఆఫీసుకు వెళ్ళడం ఆరంభించాను. పత్రిక కూర్పు ప్రింటింగ్ తదితరాలతో అప్పుడే నాకు పరిచయం కలిగింది. తర్వాత ఏవో కొన్ని కథలు రాసాను తప్ప ఎందుకో కథల మీదే దృష్టి పెట్టి కృషిచేస్తే ఎట్లా ఉండేదో అని ఇవ్వాళ అనిపిస్తుంది. అట్లా నాలో మొట్టమొదటి సారి కథకుణ్ణి గుర్తించిన పురాణం రామచంద్ర ఒక చేత కవిత్వాన్నీ మరో చేత జర్నలిజాన్నీ పట్టుకుని సమాజాన్ని భిన్న కోణాల్లోంచి పరికించి రచనలు చేసిన వాడు. ఆయన 1974 లోనే ’27 వసంతాలు’ కవితా సంపుటిని వెలువరించారు. “ఎదలోని చీకటిని/ చిదిమి వేయాలి/ మానవతా దీపాలు/ మదిని నిలవాలి అంటూ వెలుగుని చైతన్యాన్ని నింపిన వాడాయన. పాత్రికేయుల్లో పురాణం గా ప్రసిద్దులయిన ఆయన 1945 మే 28 న వేములవాడలో ఆర్థికంగా మంచి స్థితి వంతమయిన కుటుంబంలో జన్మించారు. పై చదువులకోసం హైదరాబాద్ వెళ్ళిన పురాణం కు కాలేజీ పత్రిక ‘సంధ్య’ కు సంపాదకత్వం వహించే అవకాశం రావడం తో జర్నలిజం వైపు ఆయన దృష్టి మరలింది. తర్వాత ‘ఆంద్ర జనత’ లో జర్నలిస్టు గా తన కారీర్ ఆరంభించారు. వేటూరి సుందర రామ మూర్తి సంపాదకుడిగా వున్న కాలం లోనే పురాణం గారికి పత్రిక అన్ని విభాగాల్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. 1968లో పురాణం రామ చంద్ర ‘ప్రతిధ్వని’ పక్ష పత్రికను ప్రారంభించారు. తర్వాత కరీంనగర్ ఈనాడుకు జిల్లా విలేఖరిగా కూడా పనిచేసారు. 1974 తర్వాత ఆయన ‘చిత్రిక’ వార పత్రికను ఆరంభించి జిల్లా కేంద్రంలో విలక్షణ జర్నలిస్టుగా పేరు గాంచారు.ఉన్నత ఆశయాలతో ఉత్తమ రచనా శైలితో జర్నలిస్టుల్లో మాడల్ గా నిలిచారు.        

అట్లా నా రచనా యాత్ర చిత్రికతో మొదలయ్యింది. పురాణం రామచంద్ర ఇవ్వాళ లేక పోయినా ఆయన కృషి స్మరణీయమయింది. ఆయనకు నా హృదయ పూర్వక నివాళి.

మళ్ళీ వారం కలుద్దాం….

-వారాల ఆనంద్ 

30 OCT 2021

యాదోంకి బారాత్ -18= కరీంనగర్- 1974- మూల మలుపు

Posted on

యాదోంకి బారాత్ -18 

++++++++++

===============  

మనిషి బతుకు దారిలో ఎత్తు పల్లాలూ, తిన్నని దారులూ, మలుపులూ మూల మలుపులూ అత్యంత సహజం. అన్నింటినీ దాటుకుంటూ పడుతూ లేస్తూ సాగే ప్రయాణంలో గెలుపోటముల ఉద్విగ్నత ఉన్నప్పటికీ బతికామనే భావన వుంటుంది. BORN WITH SILVER SPOON లో మజా ఏముంటుంది.

అందరిలాగే నా జీవితపు గతుకుల రోడ్డులోనూ అనేక మలుపులున్నాయి. అందులో 1974 ప్రధాన మూల మలుపు. అప్పటిదాక వున్న మిఠాయి దుకాణపు ఇంట్లోనూ, చదువులో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కాలేజీలో చేరడమూ రెండూ పెద్ద కుదుపులే.   

మా నాన్న పుట్టిందీ పెరిగిందీ ఆయన పెళ్ళీ, పిల్లలూ, అప్పటిదాకా గడిపిన జీవితం అంతా మిఠాయి దుకాణపు ఇంట్లోనే. ఆయనెప్పుడూ అది తన ఇల్లు కాకుండా పోతుందని తాను పరాయి వాడిని అవుతానని ఊహించను కూడా లేదు. నేను కూడా పుట్టిందీ ఇంటర్ దాకా సాగిందీ అక్కడే. ప్రేమలూ అవమానాలూ  అనుభవించిందీ ఆ ఇంట్లోనే. మా పెద్ద నానమ్మ ఆ ఇంటి మూలస్థంభం మిఠాయి సత్యమ్మ మరణం తర్వాత అక్కడ అనేక కొత్త పరిణామాలు జరగడం మొదలెట్టాయి. మా పెద్దనాన్న ఒకరు నాన్నను మమ్మల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తిట్టడం మొదలెట్టాడు. మా నాన్నను ఎప్పుడో చిన్నప్పడు వేములవాడ వాళ్ళ చిన్నాయన స్వామి పెంపకం తీసుకున్నాడని ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆయన వాదన. విపరీతంగా తాగి అంతకు మించి విపరీతంగా గొడవ చేసాడు. మాటల్ని తిట్లనీ ఇక భరించరాని స్థితిలో మా అమ్మనూ  అయిదుగురు పిల్లల్నీ తీసుకుని నాన్న మిఠాయి దుకాణపు ఇల్లు ఖాళీ చేసాడు. దశాబ్దాల పాటు అల్లుకున్న గూడును వదిలేసి పెట్టె బేడా సర్దుకుని వెళ్ళడంలో ఆయన పడ్డ వేదన నేనెరుగుదును. శ్రీనివాస్ జీపులోనూ రిక్షాలోనూ సామానంతా సర్ది ఆగస్ట్ 1974లో మంకమ్మ తోటలోని ఓ మూల నున్న ఇంట్లోకి కిరాయికి మారిపోయాం. ఇంటి ఓనర్  సాయన్నకుటుంబం మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. మెయిన్ రోడ్డు మీద ఇంద్రభవన్ ముందు ఓ సలూన్ షాప్ వాళ్ళది.

ప్రతి రోజూ బావి లోంచి నీళ్ళు తోడుకుంటూ సాయన్న పాడే ‘నాస్తిక్’ సినిమాలో పాట “ దేఖ్ తేరి సంసార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్…. కిత్నా బాదల్ గయా ఇన్సాన్’ నా కిప్పటికీ గుర్తే.

………….

కిరాయి ఇంట్లోకి మారింతర్వాత ‘మామూలుగా వెళ్ళమని చెబితే పోయేదానికి తిట్లూ శాప నార్తాలూ అని’ మా అమ్మ పడ్డ బాధ నా కిప్పటికీ యాది కొస్తే కోపం తారస్థాయికి చేరుతుంది. అప్పటినుంచి తీవ్రమయిన కోపంతో నేను 10-15 సంవత్సరాల పాటు మిఠాయి దుకాణము కాదు కదా క్లాక్ టవర్ చుట్టూ తిరిగాను కాని తూర్పు వైపు దారి కూడా తొక్కలేదు.

మంకమ్మ తోటలో మూడు గదుల కొత్త ఇల్లు. ముందు రెండు గదులు నడుమ ఖాళీ స్థలం తర్వాత వంటిల్లు. వంటింట్లో ఫ్లోరింగ్ లేక అలుక్కోవడం. బావినుంచి నీళ్ళు తోడుకొని రావడం అంతా కొత్త అనుభవం.. నౌకర్లూ చాకర్లూ వున్న పెద్ద ఇంట్లోంచి వచ్చిన అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మేము అయిదుగురం పిల్లలం, చదువుకోవడానికి అక్క దగ్గరికి వచ్చిన మా మేనమామ మంగారి రాజేందర్ అమ్మా నాన్న అందరమూ ఆ చిన్న ఇంట్లోనే.. ఎట్లా సర్డుకున్నామో ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మా అమ్మకు తన పిల్లలకంటే తమ్ముడి మీదే ప్రేమ ఎక్కువగా వుండేది. వసతి ఆహార పానీయాల విషయంలో మొగ్గు ఎక్కువగా వుండేది. తర్వాత కొద్ది రోజులే అయినా మా పెద్ద మేనమామ కొడుకు శివ ప్రసాద్ కూడా అమ్మ దగ్గరే వుండి చదువుకున్నాడు. ఇక తర్వాతి కాలంలో మా కిష్టాపూర్ సుమిత్ర పెద్దమ్మ కొడుకు నోముల రాజ్ కుమార్ ఆతని చెల్లెలు రాజ్య లక్ష్మి కూడా తమ తమ చదువుల్ని మా అమ్మ దగ్గరే వుండి పూర్తి చేసుకున్నారు. అందరినీ మా అమ్మ ‘అమ్మ’ లాగే చూస్కుంది. పెద్దమ్మ ఇంటినుంచి బియ్యమో పప్పులో, వడియాలో వచ్చేవి.

———   

కుటుంబ వాతావరణంలో మలుపులు ఇట్లా వుంటే చదువు విషయంలో మరో మలుపు డిగ్రీ లో చేరడం. ఇంటర్ చదువు ఖార్ఖాన గడ్డ కాలేజీలో పూర్తి అయింది.దాదాపు అంతా పాసయ్యాం రక రకాల క్లాసుల్లో నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. నెక్స్ట్ అందరి దృష్టీ మెడిసిన్ పైనే. అప్పటికి డి.బోస్ గైడ్ ఒక్కటే దిక్కు. దామోదర్ నేనూ వెంకట్, రాధాకృష్ణ అందరమూ దరఖాస్తు చేసాం. నాకు 16 ఏళ్ళు పూర్తిగా నిండలేదని వయసు సరిపోదని రిజెక్ట్ చేసారు. డీలా పడిపోయాను. తర్వాత ఎవరో మహానుభావుడు కోర్టును ఆశ్రయిస్తే పరీక్ష చివరి క్షణాల్లో కోర్టు అనుమతినిచ్చింది. ఏముంది ఆఘమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి అప్పటికే ఈసామియాబాజార్ లో ‘రాతిభవన్’లో టిఖానా ఉంటున్న వేములవాడ మిత్రులు ఎడ్ల రాజేందర్ రవి ల గదికి వెళ్లి మర్నాడు పరీక్షకు వెళ్లాను. కోటీలో కిషోర్ కేఫ్ లో చాయ్ తాగి చాంతాడు పొడవున్న లైన్ లో నిలబడి పరీక్ష రాసాను. గొప్పగా కాదు గాని బాగానే రాసాను అనిపించింది. కానీ ఫలితం చూస్తె ప్రభుత్వ కాలేజీలో అంటే ఒస్మానియా, గాంధి లలో సీటు రాలేదు. మాలో ఒక్క రాధాకృష్ణ మాత్రం సాధించాడు. వరంగల్ లో వున్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ అప్పుడు ఏడు వేల అయిదువందలు డొనేషన్ కట్టాలి. ఆర్ధిక స్థితి అంత లేదు. వేములవాడ మేనమామ డాక్టర్ రఘుపతి రావు కడదామని ముందుకు వచ్చాడు. అప్పుగా నయినా సరే నన్నాడు కానీ నాన్న అంగీకరించలేదు. మళ్ళీ ఏడూ రాస్తాడు మెరిట్ లో వస్తుందిలే అన్నాడు. దాంతో మెడిసిన్ తప్పి పోయింది తర్వాత  ఏడు  రాసినా రాలేదు. ఎస్.ఆర్ ఆర్. లో డిగ్రీ లోస్ సెటిల్ అయిపోయాను.

ఎస్.ఆర్ ఆర్. డిగ్రీ కాలేజీలో చెరేనాటికే కొంత సాహిత్య స్పృహ చదవడం పెరిగింది. అప్పటికి కేవలం వ్యాపార నవలలు,డిటెక్టివ్ నవలలే పరిచయం ఉండేది. కాని క్రమంగా చదివే తీరు మారింది. చదివే పుస్తకాలూ మారాయి. ఆ సమయంలోనే మాతోనే వుండే మా అమ్మ తమ్ముడు మంగారి రాజేందర్ సహచర్యం, వేములవాడ నటరాజకళానికేతన్ కార్యక్రమాలూ నా సాహిత్య జీవితంపై ప్రభావం చూప సాగాయి. క్రమంగా శ్రీ శ్రీ కవిత్వం, నవలల్లో అల్పజీవి, అసమర్థుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, కాలాతీత వ్యక్తులు, అంపశయ్య, చలం సాహిత్యం చదవడం ఒక పెద్ద మలుపు. కాలేజీలోనే ఎకనామిక్స్ విభాగంలో అంపశయ్య నవీన్ లెక్చరర్ గా వుండడం,మాకో ప్రేరణ. ఆయన ఇల్లు కూడా మంకమ్మ తోటలోనే వుండడంతో అప్పుడప్పుడూ ఆయన ఇంటికి వెళ్ళే వాళ్ళం రాజేందర్ అప్పటికి స్వాతి పేరుతో కథలు రాయడం ఆరంభించాడు. దాంతో నవీన్ ఆయన్ని ఏం స్వాతి అని పిలిచేవాడు. నాకున్న స్టామర్ సమస్య వాళ్ళ ఎక్కువా వినడమే తప్ప మాట్లేది తక్కువగా వుండేది. ఇంట్లో సైన్స్ పుస్తకాల తో పాటు సాహిత్యం కూడా కనిపించడం ఆరంభించింది. అయితే నాన్న కానీ అమ్మ కానీ ఎపుడూ అభ్యంతర పెట్టలేదు.

అట్లని డిగ్రీ చదువు మీద అలక్ష్యం కూడా ఎప్పుడూ లేదు. అయితే అ కాలంలో డిగ్రీలో ప్రతి   ఏటా పరీక్షలు కాకుండా ద్వితీయ సంవత్సరం తర్వాత పార్ట్ 1 అని ఇంగ్లీష్, హిందీ/తెలుగు పరీక్షలు ఉండేవి. తృతీయ సంవత్సరం చివర మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు. దాంతో పారేక్షలు అనే భయమే వుండేది కాదు. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ అటు చదువు విషయంలోనే కాదు మిగతా అన్ని సామాజిక సాంస్కృతిక విషయాల్లో నాకో ఐ ఓపెనర్.

అంతకు ముందు మా కాలేజీ ప్రిన్సిపాల్లుగా విశ్వనాధ సత్యనారాయణ, ఐ.వీ.చలపతి రావు లాంటి అనేక మంది గొప్పవాళ్ళు పనిచేసారు. ఇక నేను ఆ కాలేజీ లో చేరేనాటికి సాహితీ వేత్తలు శ్రీ వెల్చాల కొండల రావు ప్రిన్సిపాల్గావున్నారు. తర్వాత కే.వై.ఎల్.నరసింహా రావు వచ్చారు. మంచి వాతావరణం వుండేది.

     ఇంటర్ తెలుగులో సరయిన మార్కులు రాలేదని డిగ్రీ తెలుగు మీడియంలో చేరాను. మిగతా ఇంటర్ మిత్రులు అనేక మంది ఇంగ్లిష్ మీడియం లో చేరారు. దామోదర్ హైదరాబాద్ కు వెళ్ళాడు. ఖాజా లాంటి మిత్రులు సైన్స్ వదిలేసి బి.కాం, లో చేరాడు. బి.ఎస్సీ.లో మాది బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులు. సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు కూడా బాగాచేప్పేవాళ్ళు. 

బాటనీ వరకువచ్చేసరికి బాగా గుర్తున్న మేడం రఫియా సుల్తానా. చాలా అందంగా చలాకీగా వుండేది. బాగా చెప్పేది. హిందీ పాటలన్నా సినిమాలన్న తనకిష్టం. మనకది కామన్ ఇంటరెస్ట్ కదా అందుకే తను బాగా కనెక్ట్ అయింది. ఒకటి రెండు సార్లు ఆదివారాలలో తన ఇంట్లో మా చెన్న రెడ్డి ప్రసాద్ లాంటి వాళ్ళ గాన కచేరీ వుండేది. ఇక మరొకరు జనార్ధన చారి బ్లాక్ బోర్డ్ పై ఆయన వేసే బొమ్మలు అద్భుతంగా ఉండేవి. పోతే జువాలజీ లో ముగ్గురు సార్లు బాగా చెప్పారు. ఒకరు మా క్లాస్మేట్ రవీందర్ వాళ్ళ నాన్న మధుసూదన్ రావు గారు, మరొకరు జోసెఫ్ భాస్కర్, ఇంకొకరు నాంపెల్లి మధుబాబు. మంచి టీచర్ కావడంతో పాటు మంచి స్టేజీ నటుడు. వేములవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ కుటుంబంనుంచి వచ్చారాయన. త్యాగారాయ లలిత కళా పరిషత్ తదితర సంస్థలతో ఆయన కరీంనగర్ కళాభారతిలో మంచె సత్యనారాయణ, రంగాచారి తదితరులతో కల్సి ఎన్నో నాటకాలు వేసారాయన.

ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే ఎం.వీ.నరసింగ రావు, జీవీజీ, కృష్ణమోహన్, ఆనందం, ఖురేషీ తదితరులు బాగా చెప్పేవాళ్ళు. ద్వితీయ భాష హిందీ లో బంకట్ లాల్ అగర్వాల్ గుర్తున్నారు తర్వాత ఆయన ప్రిన్సిపాల్కూడా అయ్యారు.

అట్లా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ సబ్జెక్టుల విషయంలో ఎంతగా ప్రభావం చూపిందో ఆ ‘కాలం’ సాహిత్య రంగం విషయంలో కూడా అంతే ప్రభావం కలిగించింది… ఆ వివరాలు మళ్ళీ వారం…

-వారాల ఆనంద్

నిద్ర రాని రాత్రి

Posted on

నిద్ర రాని రాత్రినిద్ర రాని రాత్రి

================ వారాల ఆనంద్

కాలం నడక సాగుతూ సాగుతూ

పగలు గడిచి

సాయంత్రమయింది

చీకటి విస్తరించి

రాత్రి కమ్ముకొచ్చింది

కాలం అడుగులేస్తూనే వుంది

నిద్ర రాదు

నేరం చీకటిదా 

కలలు పలకరించవు

దోషం నిద్రదా

మూసిన రెప్పల మాటున

చూపులు మేలుకునే వుంటాయి

చేతనా చేతన స్థితిలో

నేను శిలను కాను

ప్రవాహాన్నీ కాను

నడిచే కాలానికి తీరిక లేదన్నారెవరో

కాని

అసలు తీరిక లేనిది

మనస్సుకు కదా

“బంగారు తెలంగాణాలో చలన చిత్రం” – ఓ జ్ఞాపకం

Posted on

“బంగారు తెలంగాణాలో చలన చిత్రం” – ఓ జ్ఞాపకం

++++++++++++++++++++++++

అరవై సంవత్సరాల ఆకాంక్ష దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణా ఏర్పాటయింది. కొత్త రాష్ట్రం లో బంగారు తెలంగాణా నినాదం తో పునర్నిర్మాణం ఆరంభమయింది. ఆ నేపధ్యంలో సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా సినిమా రంగంలో మంచి సినిమా అభిమానిగా తెలంగాణా వాడిగా నేను ఆశించిన, ఊహించిన, కలగన్న భావాలతో రెండు పుస్తకాలు రాసాను వాటిలో రాసిన మొదటి పుస్తక ‘బంగారు తెలంగాణలో చలన చిత్రం’ అది 2014లో కరీంనగర్ ఫిలిం భవన్ లో ఆవిష్కరించబడింది.

నిజానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చింతర్వాత నెహ్రు కు ఒక ఆలోచన తట్టింది. వేలాది సంవత్సరాల చరిత్ర సంస్కృతి కలిగిన భారత్ కు ఒక సాంస్కృతిక విధానం వుండాలి కదా అని. ఆ ఆలోచన ఫలితన్గానే ఆయన పాటిల్ కమిటీని వేసారు. ఆ కమిటీ సూచన మేరకు దేశంలో అన్ని కళా రంగాలతో పాటు సినిమాకు కూడా ఫిలిం పాలసీ రూపొందించారు. మిగతా కళా సంస్థలతో పాటు(సాహిత్య అకాడెమి, సంగీత నాటక అకాడెమి…మొ) నేషనల్ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్, పూనా ఫిలిం FILM SNSTITUTE, FILM ARCHIVES, CHILDREN’S FILM SOCIETY OF INDIA లాంటి గొప్ప సంస్థల్ని ఏర్పాటు చేసారు.

అదే స్ఫూర్తి తో తెలంగాణలో కూడా ఒక సాంస్కృతిక విధానం (సినిమాను కలుపుకుని) రూపొందించాల్సిన అవసరం వుందని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాల సంకలమిది.

సినిమాకు సంబంధించి అనేక అంశాల్ని స్పృశించిన వ్యాస సంకలన మిది.

ఆనాటి ఆవిష్కరణ సభలో నందిని సిద్దారెడ్డి, దేశపతి, దర్భశయనం, జింబో, వజ్జల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కాని తెలంగాణా సినిమాకు సంబంధించి ఎలాంటి ముందడుగూ పడలేదు. ఏ మార్పూ జరగా లేదు.

తర్వాత “తెలంగాణా సినిమా దశ-దిశ” పేరుతో మరో పుస్తకమూ తెచ్చాను.

 ఇప్పటికయితే బంగారు తెలంగాణా లో చలన చిత్ర జ్ఞాపకం మీ తో పంచుకుంటున్నాను

చూడండి……

-వారాల ఆనంద్     

యాదొంకీ బారాత్ – 17 =వేములవాడ రాజన్న జాతర = కొన్ని పిక్నిక్కులు 

Posted on

=================

వేములవాడ రాజన్న జాతర = కొన్ని పిక్నిక్కులు 

++++++++++

నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతిక, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట  దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. ఎంత పల్లె టూరి వాళ్ళయినా, ఆర్థికంగా ఎంత లేని వాళ్ళయినా జాతర వచ్చిందంటే పిల్లా పాపలతో బండ్లమీదో, నడిచో, బస్సేక్కో వచ్చి జాతరలో పాల్గొనడం తప్పనిసరి కార్యంగా నిర్వహించే వారు.

అట్లాంటి జాతరలు మా కరీంనగర్ ప్రాంతంలో అనేకం. వేములవాడ, కొత్తకొండ, నల్లగొండ ఇట్లా పలు ప్రాంతాల్లో వేర్వేరు పండగలప్పుడు జాతరలు జరుగుతాయి. అందులో ముఖ్యమయినదీ  ప్రాచుర్యం పొందిందీ వేములవాడ రాజేషుని జాతర. ప్రతి శివరాత్రికి జరిగే ఈ జాతర గొప్ప ఉత్సవం. వేములవాడలో శివరాత్రి జాతరతో పాటు శ్రీ రామనవమికి జరిగే దేవుని పెళ్లి, దసరా ఉత్సవాలూ గొప్పగా జరుగుతాయి. శ్రీరామనవమికి శివపార్వతుల పెళ్లి విశేష మయింది. దానిపైన నేనో డాక్యుమెంటరీ కూడా తీశాను. ఆ వివరాలు మరోసారి రాస్తాను.

*******

శివరాత్రి జాతర నా జీవితంలో గొప్ప ప్రభావాన్నీ చూపించింది. నిజానికి వేములవాడ గతంలో జైన క్షేత్రమని కాకతీయ రాజుల కాలంలో అది శైవ కేంద్రంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. మా ఎరుకలో కూడా అంటే దాదాపు 1970ల వరకు ఆలయంలో జైన విగ్రహాలు ఉండడడం నేనుచూసాను. తర్వాత వాటిని భీమేశ్వరాలయం పక్కన వున్న తోటలోకి చేర్చారు. ఆ విషయాలు ఎట్లున్నప్పటికీ రాజన్న జాతర విషయానికి వస్తే ఏడాదికోసారి వేలాదిమంది గ్రామీణులకు అదో ఓ గొప్ప ఉత్సవం. పిల్లలుగా మాకూ మహా ఉత్సాహంగా వుండేది. కేవలం కరీంనగర్ జిల్లానుంచే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలనుంచీ మహారాష్త్ర నుంచీ లేక్కలేనంత మంది జాతరకు తరలి వచ్చేవారు. జాతరకు ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక జాతర బస్సులు నడిచేవి. కరీంనగర్ బస్ స్టాండు లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. కరీంనగర్లో ఇప్పుడు ప్రతిమ మల్టీ ప్లెక్ష్ వున్న స్థానంలో గుండ్రంగా కళాత్మకంగా నిర్మించబడిన బస్ స్టాండ్ వుండేది. అందులో ఓ పక్క వేములవాడ జాతర కోసం చలువ పందిళ్ళు వేసేవారు. యాత్రికులకోసం చలివేంద్రాలు పెట్టి తాగు నీటి వసతి కల్పించే వాళ్ళు. జాతర వారం ముందునుంచే ఈ ఏర్పాట్లు మొదలయ్యేవి. మిగతా రూట్లకు బస్సులు తగ్గింఛి జాతర బస్సులు నడిపేవారు. టికెట్లు బస్ స్టాండులోనే తీసుకుని ఎక్కాలి. కండక్టర్ ఉండేవాడు కాదు. నాన్ స్టాప్ గా వేములవాడ చేరేవి. ఆవారం కరీంనగర్ బస్టాండుతో సహా అనేక ప్రాంతాల్లో బస్ స్టాండుల స్థితి ఇట్లాగే వుండేది. క్రిక్కిరిసిన జనంతో ఆ ప్రాంతమంతా కిట కిట లాడేది. ఇక వేములవాడలోనయితే అందరి ఇళ్ళల్లో జాతర వాతావరణం వెళ్లి విరియాల్సిందే. చుట్టాలూ, స్నేహితుల రాకతో ఇండ్లన్నీ నిండుకుండలే. మా అమ్మమ్మ ఇల్లు కూడా పెద్దమ్మలు చిన్నమ్మలూ వారి శ్రీవార్లూ, మిత్రులతో కళ కళ లాడేది. అనేక సంవత్సరాలు నా మిత్రులు దామోదర్, వెంకటేష్లు కూడా జాతరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చే వాళ్ళు. ఇల్లంతా సందడి సందడి. అక్కడి మిత్రుల విషయానికి వస్తే మంగారి రాజెందర్, మంగారి శివప్రసాద్, పి.ఎస్.రవీంద్ర, బాపురెడ్డి, ఎడ్ల రాజేందర్, ఎడ్ల రవి, రఫీక్, యుగేందర్ రావు తొలి రోజల్లో వుండేవాళ్ళు తర్వాత సాంబశివుడు,రమేష్ చంద్ర, పి.రమేష్, కే.రాజేందర్, వజ్జలశివకుమార్ ఇట్లా అనేక మంది కలిసారు.

   జాతరలో ఎన్నో విశేషమయిన అంశాలు. నా మట్టుకు నేనయితే సర్కస్ చూడడం అక్కడే మొదలు. జోకర్లను చూసి అరవడం జంతువులను చూసి బెదరడం ఇంకా గుర్తే. అంతే కాదు జైంట్ వీల్, ఎయిర్ గన్ తో బలూన్లని కాల్చడం, రింగులు వేసి సబ్బు పెట్టెలు ప్లాస్టిక్ డబ్బాలు గెల్చుకోవడం జాతర్లోనే. మరో వైపు బుగ్గలు అని పిలిచే బలూన్లను, లైలప్పలు అమ్మే వాళ్ళు, పుంగీ లు అమ్మే వాళ్ళు, ఆడవాళ్ళ కాలి మట్టెలు, కుంకుమ బుక్క గులాలు  అమ్మేవాళ్ళు ఒకటేమిటి సామాన్య జీవుల సమస్త వస్తువుల అమ్మకాలకు జాతర పెద్ద వేదిక. మిఠాయీల విషయానికి వస్తే చిలుకలు, బత్తీసలు, బెండ్లు, శక్కరి పుట్నాలు అనేక రకాలు అందంగా పేర్చి అమ్మకానికి పెట్టె వాళ్ళు.

   మా చిన్నప్పుడు ఫోటోల విషయానికి వస్తే జాతరలో తాత్కాలిక స్టూడియోలు వేలిసేవి. అరగంటలో ‘కాపీ’ అనే వాళ్ళు. వీటికి తోడు వేములవాడలో అప్పుడు మూడు ప్రధాన ఫోటో స్టూడియోలు ఉండేవి. రాజ్ స్టూడియో, బాబా స్టూడియో, వాణీ స్టూడియో. రాజ్ ఫోటో స్టూడియో అధినేత వెంగయ్య మాకు అత్యంత ఆత్మీయుడయిన స్నేహితుడు. జాతరా అప్పుడు తప్ప వెంగయ్యతో కలిసి అంతా రాజు ఉడిపి హోటల్లోనో, నటరాజ్ హోటల్లోనో టీ తాగడం అందరికీ అలవాటు. జాతర అప్పుడు “జాతరా టీ ” అనే వాళ్ళు. నీళ్ళ పాలతో చేసిన టీ రుచీ సుచీ వుండేది కాదు. పాపం యాత్రికులకు మాత్రం అది తప్పేది కాదు.   

          ఇక జాతరకు వచ్చే వాళ్ళను తమ తమ ఇండ్లల్లో దింపుకుని గుండంలో స్నానాలూ, దేవదర్శనాలు చేయించే బ్రాహ్మలు ఒక వైపు, మరో వైపు ఎవరికీ వాళ్ళు జాతరకొచ్చి చెరువు కట్టమీదో, జాతర గ్రౌండులో ఇక్కడ అక్కడ అనేమిటి ఎక్కడ చూసినా జనమే. దేవుని గుండంలో స్నానాలు చేసి తడి బట్టలతో క్యూ లో నిలబడి దైవదర్శనం చేసుకుని వసతి దొరకకుంటే ఎక్కడ చోటు దొరికితే అక్కడ పరదాలు కట్టుకుని దీపాలు పెట్ట్టుకుని రాత్రంతా జాగారం చేయడం అక్కడ ఆనవాయితీ. తర్వాతి రోజు జరిగే పోచమ్మ బోనాలు తప్పకుండా చూడాల్సిన వేడుక. పోచమ్మకు ‘శాఖ’ పోసి కాగితపు ఉయ్యాలలు కట్టి పెద్ద దప్పుల మోత తో చేసే నృత్యాలు పెద్ద ఊపు.

   ఇక మరో వైపు జాతర కొచ్చిన వాళ్ళు పిల్లలకు ఎదో ఒకటి కొనిపెట్టడం పిల్లల కోర్కెలు తీర్చడం మామూలే. ఆ విషయంలో జాతర వ్యాపారులు అడ్డీకి పావుసేరు( అంతులేని ధరలకు) అమ్మేవాళ్ళు. ఎవరయినా యాత్రికులు బేరం చేస్తే ఎన్నడయినా కొన్న ముఖమేనా… జాతర కొచ్చి తక్కువకు అడుగుతావు అని కూడా గద్దిరించే వాళ్ళు. అమాయక పల్లె ప్రజలు జాతర వ్యవహారాల్లో మోసపోవడం అక్కడ చాలా మామూలయిన విషయం. విశ్వాసంతో వచ్చే యాత్రికుల్ని ఆర్థికంగా మోసం చేయడం దాదాపు అన్ని జాతరలలో మామూలే. జాతరలో పాల్గొనడం అంటే దైవభక్తి తో మొక్కులు తీర్చుకోవడం, జాగారం(జాగరణ) చేయడం ఒక ఎత్తయితే, మరో వైపు పెద్ద ఎత్తున జనం చేరిన చోట జరిగే అవలక్షణాలూ జాతరల్లో సాధారణమే. జాతర చూడ్డానికివచ్చిన వాళ్ళు, సరదా రాయుల్లూ అక్రమార్కులూ, సెక్స్ మార్కులూ అనేక మంది కనిపించేవాళ్ళు. అంతా వూర్లోనూ, జాతర గ్రౌండులోనూ గుంపులుగా తిరగడమే. ఆడా మగా వందలాది మంది ఒకర్ని ఒకరు తోసుకు వెళ్ళడమే. అందులో వయసులో వున్న పోరగాల్లు అమ్మాయిల్ని గుంపులో గోవిందా అన్నట్టు తోయడం ఎక్కడెక్కడో తడమడం, నానా రబస గొడవ. మగవాళ్ళే కాదు అలాంటి అమ్మాయిలూ వుండేవాళ్ళు. జాతర అంటే ఇంకేమి వుంటుంది భై అనే వాళ్ళూ కనిపించే వాళ్ళు. ఆ పోకిరీ గాళ్ళను ఓ కన్నేసి చూసే పోలీసు మరో వైపు.

అట్లా మొత్తం మీద జాతర అంటే ఒక సామూహిక సంబురం. స్వామి కార్యాలూ స్వకార్యాలూ అన్నిటికీ అనుకూలమయిన మహా సంఘమస్థలి అది.

అట్లా వేములవాడ జాతర ఇంకా ఎన్నో అనుభావాల్ని జ్ఞాపకాల్ని మిగిల్చింది.

++++++++++

ఇక ‘పిక్నక్’ ల విషయానికి వస్తే వేములవాడ దోస్తులం వెళ్ళిన నాలుగు పిక్నిక్ లు మదిలో నిలిచిపోయాయి.

“బాసర యాత్ర’ : వేముల వాడ నుండి ఆదిలాబాద్ జిల్లా బాసర కు వెళ్ళడం ఒక అనుభూతి. సరస్వతీ ఆలయ కేంద్రమయిన అక్కడికి వేములవాడనుండి గునక్క, రాజేందర్, శివ ప్రసాద్, ఎడ్ల రవి ఎడ్ల రాజేందర్ పి.ఎస్.రవీంద్ర తదితరులం కామారేడ్డి దాకా బస్సులోనూ తర్వాత రైల్లోనూ ప్రయాణం. కొందరికి టికెట్ తీసుకుని కొందరికి లేకా వెళ్తున్నాం. మధ్యలో టీ సి వచ్చాడు. అప్పటికి అంతా బాగానే వుంది. బెర్త్ పైనుంచి రవి దాబల్న కిందికి దూకాడు. దాంతో టీ సీ పట్టుకుని పెద్ద వాడేనని ఫైన్ తో కలిపి డబ్బు వసూలు చేసాడు. గునక్క రవిని తిట్టన తిట్లు ఇప్పటికీ జ్ఞాపకమే.

అగ్రహారం: వేములవాడ పక్కనే వున్న అగ్రహారం లో ఒక రోజంతా పిక్నిక్ చేయడం ఒక సారి జరిగంది. పి.రమేష్ కు మెడిసిన్ లో సీట్ వచ్చిన సందర్బమది. ఆలయం వెనకాల ఆటా పాట.

ఎలగందుల: మా టీం లోకి వెంగయ్య, బాపురెడ్డి చేరారు. మొట్టమొదటిసారిగా 1905కి ముందు జిల్లా కేంద్రంగా వున్న ఎలగందుల ఖిలా ఎక్కడం, కొండ దోమినార్ అంతా మజా మజా.

హైదరాబాద్: అప్పటికి చిన్న వాళ్ళమే హైదరాబాద్కు వెళ్లాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, గండిపేట్ చెరువు ఇట్లా అనేక ప్రాంతాల పిక్నిక్ అది. ఆ టీంలో రాఘవేందర్ రెడ్డి కూడా వున్నాడు.

ఇట్లా ఈ పికినిక్ లను గుర్తు చేసుకోవడంలో ఒక సంతోషం వుంది. చిన్ననాటి మిత్రులతో గడిపిన రోజుల్ని నెమరు వేసుకోవడంలో ఎంతో ఆనందం వుంది. అంతే కాదు మా తరం కలిసికట్టుగా ఒక టీంగా గడిపిన సమయాన్ని ఇప్పటి తరానికి తెలియచేయడం బాధ్యత అనుకున్నాను. సెల్ ఫోన్ చాటింగ్ లో కంటే షేక్ హాండ్ ఇచ్చి బుజాల మీద చెయ్యేసి తిరిగిన అనుభావాలు ఎంతో మధురమయినవని చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇవాల్టి తరంలో సమిష్టి తనం కొరవడుతున్న స్థితి బాధనిపిస్తున్నది. కలిసి వుండడంలోని ఆనందం వారికి తెలియజేయాలన్నలక్ష్యం కూడా ఇందులో ఇమిడి వుంది.

మళ్ళీ వారంకలుద్దాం

-వారాల ఆనంద్ 

“మానేరు గల గల “ ఓ జ్ఞాపకం

Posted on

“మానేరు గల గల “ ఓ జ్ఞాపకం

===================

“తెలంగాణాలో సహజ సంపద పుష్కలమైనట్లే సాహిత్య సంపదా పుష్కలం. చరిత్రలో గోదావరీ నదీ నాగరికతకు ప్రతీక అయిన కరీంనగర్ ప్రాంతపు సాహిత్య సృజనలో సైతం కాలం పొడుగూతా అగ్రభాగాన నిలబడుతూ వచ్చింది. పలుకులో పాటలో పద్యంలో వచనంలో అన్ని రూపాల్లో ప్రాంత జీవన పరిమళాలను విస్తారంగా వెదజల్లింది” … అంటూ తెలంగాణా రచయితల సంగం ప్రచురణ పేర వెలువడిన నా సాహిత్య వ్యాసాల సంపుటి 2014లో వెలువడింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 50 మంది కవులూ రచయితల కళావిశ్కారణగా రాసిన వ్యాసాలున్నాయి. సాహిత్యమే అసలుతనమయిన లోపలి మనిషి పి.వి. నుంచి మొదలు అలిశెట్టి, ఎం.ఎస్.ఆర్.ల దాకా కవులు రచయితల జీవితాలూ,వారి సృజన గురించిన విశ్లేషణాత్మక పరిశీలన కూడా ఇందులో వుంది.

++++++++++

నిజానికి ఈ వ్యాసాలూ ఆంధ్రజ్యోతి  కరీంనగర్ ఎడిషన్ లో ‘విద్యుల్లత’ పేర వారం వారం ఒక సాహిత్య పేజీ నిర్వహించాలని భావించినప్పుడు సంపాదకులు శ్రీ కే.శ్రినివాస్, కరీంనగర్ బ్యూరో ఇంచార్జ్ శ్రీ  నగునూరి శేఖర్ లు ఆ బాధ్యతల్ని నాకు అప్పగించారు.ఆ పేజీలో రాసిన శీర్షిక ఈ ‘మానేరు గల గల‘. వారిద్దరికీ ధన్యవాదాలు. కాలం రాసే అవకాశమే లేకుంటే ఇవి రాసే వాడినే కాదేమో. పేజీ నిర్వహణ గురించి మరో సారి వివరంగా రాస్తాను.

++++++++

ఇక ఆ వ్యాసాల్ని సంకనంగా వేసి ఫిలిం భవన్ లో సభ ఏర్పాటు చేస్తే ఆత్మీయ మిత్రులు నందిని సిద్దారెడ్డి, దేశపతి, జింబో,దర్భశయనం శ్రీనివాసాచార్య,వజ్జల శివకుమార్, గండ్ర లక్ష్మన్  రావు,అనంతా చార్య, బుర్ర మధుసూదన్ రెడ్డి, దాస్యం ఇట్లా పలువురు హాజరయ్యారు.

“మానేరు గల గల’ వచ్చిన స్పందనను మీతో పంచుకుందామని షేర్ చేస్తున్నాను

-వారాల ఆనంద్    

“24 ఫ్రేమ్స్“ఓ జ్ఞాపకం

Posted on

“24 ఫ్రేమ్స్“ఓ జ్ఞాపకం

—————————————

డిజిటల్ సాంకేతికత ప్రపంచాన్ని కమ్మేయకముందు ‘దృశ్య మాధ్యమం’ సేల్ల్యులాయిడ్ పై నిక్షిప్తమయ్యేది. అప్పుడు 8 ఎంఎం,16 ఎంఎం ,35 ఎంఎం,70 ఎంఎం,సినిమా స్కోప్ ఇట్లా బిన్న ఫార్మాట్లల్లో సినిమాల నిర్మాణం జరిగేది. ఆ సమయంలో సినిమాకు 24 ఫ్రేమ్స్ అన్న మాట ప్రాతినిధ్య పదంగా వుండేది. అంటే ప్రొజెక్టర్ ఫిల్ము కదలికలో 24 ఫ్రేముల కదలికే తెర పైన బొమ్మల కదలికకు మూలమని. ఆ నేపధ్యం లోనే నేను 2004 లో ‘24 ఫ్రేమ్స్ (సినిమా వ్యాసాలూ-అక్షర చిత్రాలు) పేర సినిమాల పై రాసిన వ్యాస సంకలనం తెచ్చాను.

       24 ఫ్రేమ్స్ లో ‘దృశ్య మాధ్యమాలయిన చలనచిత్రాలు’, ‘చరిత్రను సృష్టించిన చలన చిత్రం’,  ‘రాజకీయ చిత్రాలు’,’క’ళ కోల్పోతున్న భారతీయ సినిమా’,’తెగులు పట్టిన తెలుగు సినిమా’, ‘పనోరమా చిత్రాలు’, ’అవరోధాల మధ్య అస్తిత్వాన్ని నిలుపుకున్న ఫిలిం సొసైటీ’ లాంటి అనేక వ్యాసాలున్నాయి.

      24 అక్టోబర్ ఆదివారం 2004 రోజున ఆ పుస్తకావిష్కరణ కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగింది. ఆ నాటి కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు శ్రీ దేవులపల్లి అమర్, సినీ కవి శ్రీ సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. స్థానిక మానేర్ టైమ్స్ పత్రిక సంపాదకుడు అధినేత శ్రీ పొన్నం రవిచంద్ర నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య ‘24 ఫ్రేమ్స్’ని  విపులంగా సమీక్షించారు.

   ఈ సందర్భంగా “ మేము సినిమా వాళ్ళం జనం కోసం రాస్తాం, వారాల ఆనంద్ మా కోసం రాస్తాడు” అన్న అశోక్ తేజ మాటలు నాకింకా గుర్తున్నాయి.  అదొక గొప్ప ప్రశంసగా స్వీకరించాను. అప్పుడే అశోక్ తేజ కు జాతీయ ఫిలిం అవార్డ్ వచ్చింది. అదే సభలో ఆయనకు ఘనసత్కారం నిర్వహించాడు రవిచంద్ర. ఆనాటి సభలో ఇవ్వాల్టి TELANGANA TODAY సంపాదకుడు శ్రీ కే.శ్రీనివాస్ రెడ్డి కూడా వుండడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఫిలిం సొసైటీ మిత్రులు, సాహితీ మిత్రులు అనేక మంది ఈ సభకు హాజరయ్యారు.  

++++

24 ఫ్రేమ్స్ పుస్తకానికి మంచి స్పందనే వచ్చింది. వాటిని మిత్రులతో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.

-వారాల ఆనంద్

“సినీ సుమాలు” ఓ జ్ఞాపకం

Posted on

వివిధ భారతీయ భాషా సినిమాల్లో స్త్రీ ముఖ్యాభినేతగా (WOMEN PROTAGANISTS IN INDIA CINEMA) రూపొందిన 70 సినిమాలని విశ్లేషిస్తూ నేను రాసిన వ్యాస సంకలనమిది. అత్యంత ప్రతిభావంతమూ ప్రభావంతమూ అయిన సినిమా మాధ్యమం స్త్రీని, స్త్రీ పాత్రల్నీ చాలా వివక్షతోనూ చిన్న చూపుతోనూ చూస్తూ వచ్చింది. భార్యలుగానూ, తల్లులుగానూ, ప్రియురాళ్ళు గానూ,వ్యాంపులుగానూ చిత్రించే ప్రయత్నం చేసారు తప్ప రక్త మాంసాలున్న, సొంత ఆలోచనలు స్వీయ వ్యక్తిత్వమూ వున్న మనుషులుగా చిత్రించే పని అతి కొద్దిగానే జరిగింది. ఆ కోణంలో స్త్రీపాత్రని భూమికగా చేసుకుని వివిధ భారతీయ భాషల్లో రూపొందిన సినిమాల పైన నేను రాసిన ఈ పుస్తకాన్ని 2003 లో న్యుధిల్లీలో జరిగిన 34వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రముఖ తెలుగు దర్శకుడు శ్రీ కే.విశ్వనాథ్ ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు చొరవతోనూ, FEDERATION OF FILM SOCIETIES OF INDIA వారి నిర్వహణ లోనూ ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత ఆ పుస్తకాన్ని కరీంనగర్ లో నాకు అత్యంత అత్మీయులయిన అప్పటి జిల్లా కలెక్టర్ సుమితా దావ్రా, దర్శకుడు కే.ఎన్.టి.శాస్త్రీ లు ఆవిష్కరించి మాట్లాడారు. దావ్రా సినీ సుమాలు ఇంగ్లీష్ లో రావాలని అభిలషించారు. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. మిత్రుడు డాక్టర్ ఎం.విజయమోహన్ రెడ్డి ముందు మాటతో వచ్చిన ఈ పుస్తకం గురించి కరీంనగర్ సభలో శ్రీ ధర్భశయనం శ్రీనివాసాచార్య సమీక్షోపన్యాసం చేసారు. +++++++++++++ ఈ వ్యాసాల్ని మొదట ఆంధ్రభూమి ‘వెన్నెల’ పేజీలో ధారావాహికంగా ప్రచురించారు అప్పటి ఇంచార్జ్ శ్రీ చల్లా శ్రీనివాస్. ********** “సినీ సుమాలు” కు లభించిన స్పందనని మిత్రులతో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.

-వారాల ఆనంద్

“బాలల చిత్రాలు” & “CHILDREN’S CINEMA’ : ఒక జ్ఞాపకం

Posted on

జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం. అలాంటి బాలల గురించి కేవలం మాటలు చెప్పకుండా ఏమి చేసినా ఎంత చేసినా తక్కువే. భారతీయ సినిమా రంగంలో బాలల సినిమాల పట్ల తక్కువ చూపు ఉన్నప్పటికీ నెహ్రు గారి ఆలోచనల మేరకు ఏర్పాటయిన బాలల చిత్ర సమితి CHILDREN FILM SOCIETY OF INDIA  పిల్లల కోసం వందలాది సినిమాల్ని రూపొందించింది. ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నది. రే లాంటి దర్శకులు గొప్ప బాలల సినిమాల్ని తీసారు. ఆ నేపధ్యంలో 1999 నవంబర్ లో హైదరాబాద్లో నిర్వహించిన ఫెస్టివల్ సందర్భంగా నేను రాసిన  రెండు పుస్తకాలు “బాలల చిత్రాలు” & “CHILDREN’S CINEMA’ నాకో గొప్ప జ్ఞాపకాన్ని అనుభవాన్నీ మిగిల్చాయి. అప్పుడు ఎఫ్.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న శ్రీ కే. రత్నకిషోర్ సహకారంతో ఆ రెండు పుస్తకాలనీ హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రచురించింది. అప్పటి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ బి. నరసింగ రావు, ప్రకాష్ రెడ్డి ల సహకారం మరువలేనిది. ఆ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో హాజరయిన ప్రతినిధులందరికీ ఒక్కో కాపీ అందించారు.  

“బాలల చిత్రాలు” తెలుగులో నేను రాయగా శ్రీ ఏ. సాయిప్రసాద్ తెలుగులోకి అనువదించారు. రెండు పుస్తకాలూ బాలలకూ,పాఠకులకూ బాగా నచ్చాయి. సమీక్షకుల్నీ బాగా ఆకట్టుకున్నాయి. నాకు గొప్ప సంతృప్తిని కలిగించాయి.

ఇక వీటిని ఫెస్టివల్ లో ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ ఆవిష్కరించగా, బి.నరసింగ రావు, కే.రత్నకిశోర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల సినిమలపైన తెలుగులో వచ్చిన మొదటి పుస్తకమిది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన స్పందనని మిత్రులతో  పంచుకుందామని మరో సారి షేర్ చేస్తున్నాను. చూడండి

-వారాల ఆనంద్  

“నవ్య చిత్ర వైతాళికులు” ఒక జ్ఞాపకం

Posted on

మన దేశంలోని వివిధ భాషల్లో సమాంతర సినిమా రంగంలో అర్థవంతమయిన సినిమాల్ని రూపొందించిన 54 మంది సినిమా దర్శకుల గురించి రాసిన పుస్తకం “నవ్య చిత్ర వైతాళికులు”. అందులో వారు తీసిన సినిమాల గురించీ వారి జేవితాల గురించీ నేను రాసిన ప్రొఫైల్ వ్యాసాలున్నాయి. ఆ పుస్తకం 1999 జనవరి 18 న హైదరాబాద్ లో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆవిష్కరించబడింది. 1986 తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో FFEDERATION OF FILM SOCIEITIES OF INDIA and HYDERABAD FILM CLUB ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఫోరం లో ఈ పుస్తకాన్ని సుప్రసిద్ధ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి ఆవిష్కరించారు.శ్రీ బి.నరసింగ రావు, శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి, కళ్యాణ్ రామన్ తదితరులు మాట్లాడారు.లయ కవితా సంకలనం తర్వాత కవిత్వం రాయడం మానేసి ఫిలిమ్స్ అండ్ ఫిలిం సొసైటీ ఉద్యమంలో పూర్తి సమయం గడుపుతున్న కాలంలో మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం వదిలేసావ్ సినిమా గురించి రాయచ్చు కదా అంటూ నన్ను బలవంతంగా పల్లకి వార పత్రిక ఆఫీసుకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఎడిటర్ శ్రీ విక్రం ప్రోత్సాహంతో డైరెక్టర్స్ డైరీ పేర ఓ కాలం రాసాను. ఆ వ్యాసాల్ని డెవెలప్ చేసి రాసిన పుస్తకమే ఇది. ++++++ సమాంతర సినిమా దర్శకుల గురించి తెలుగులో దాదాపు తొలిసారిగా వెలువడిన “నవ్య చిత్ర వైతాళికులు” పుస్తకం మంచి స్పందననే అందుకుంది. పాత ఫైళ్ళు తిరగేస్తున్నప్పుడు అప్పుడు “నవ్య చిత్ర వైతాళికులు”కు వచ్చిన స్పందన కనిపించింది. ఒక సారి మళ్ళీ మిత్రులందరితో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.. చూడండి… -వారాల ఆనంద్