Month: January 2018

కొత్త తరం దర్శకులు సరికొత్త తరం సినిమా

Posted on

 కొత్త తరం దర్శకులు సరికొత్త తరం సినిమా

     1990ల తర్వాత ఎప్పుడయితే దేశంలో సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ (LPG) అమలులోకి వచ్చిందో అప్పటినుంచి భారతీయ సినిమా రంగంలో ఊహించని రీతిలో మార్పులు మొదలయ్యాయి. దానికి తోడు వివిధ దేశాల ఉపగ్రహ చానళ్ళ ప్రసారాలు మొదలు కావడం, ఉప్పెనలా డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం, హై స్పీడ్ ఇంటర్నెట్ చేరువకావడం తదితర కారణాలతో అప్పటిదాకా వున్న సినిమా నిర్మాణ రీతులు పూర్తిగా మార్పునకు లోనయ్యాయి. మరోపక్క కుటుంబాలు సమిష్టి తనాన్ని కోల్పోయి ఉపగ్రహ కుటుంబ వ్యవస్థ రావడం చకచకా జరిగిపోయాయి. ఇట్లా మొత్తంగా గత రెండున్నర మూడు దశాబ్దాలుగా మొత్తం భారతీయ సామాజిక స్థితి మారిపోయింది. దాని ప్రభావం సమస్త మానవ సృజనాలపై, ముఖ్యంగా  సినిమాపైన అమితంగా పడింది. ఈ నేపధ్యంలో మలయాళీ సినిమాను పరిశీలిస్తే ఇప్పుడు కొత్త తరం దర్శకులు, సరికొత్త సినిమా రూపొందడాన్ని చూడవచ్చు. ఆ మార్పు నిర్మాణ నైపుణ్యాల విషయాలతో పాటు ఇతివృత్తాల పరంగా కూడాజరుగుతున్నది. కేరళలో సినిమా పెద్ద మార్పునే చెందింది. అల్ఫోంస్ పుత్రేన్ దర్శకత్వం లో రూపొందిన “ప్రేమమ్ ” మలయాళీ సినిమా రంగంలో విజయమవంతమయి కొత్త తరం సినిమాకు పాదులు వేసింది. ఈ ప్రేమ కథాత్మమయిన నవీన్ పాళీ, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ లు నటించిన ఈ సినిమా నిర్మాణ పరంగా కూడా నూతన ఒరవడిని ప్రారంభించింది.  సినిమా కేరళ, తమిళనాడు లతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. 4కోట్ల బడ్జెట్ తో నిర్మానమయి 60కోట్లకు పైగా వసూలుచేసింది. లిజిన్ జోస్ తీసిన “ ఫ్రైడే “ ఒక రోజు అనేక కథలు అన్న నిర్మాణ ఒరవడిని చేపట్టిన థ్రిల్లర్ డ్రామా.  ఫాహద్ ఫాసిల్. ఆన్ ఆగస్టిన్లు  ప్రధాన భూమికలు పోషించిన ఫ్రైడే విలక్షణ మయిన సినిమా నరేటివ్ ను కలిగి వుంది. తర్వాత అల్ఫోంస్ పుత్రేన్ తీసిన “నీరమ్  “ బ్లాక్ కామెడీ థ్రిల్లర్. తమిళ మలయాళీ భాషల్లో ఏక కాలం లో నిర్మించ బడిన ఈ సినిమా తర్వాత తెలుగులో రన్ గా అనువాదమయింది. ఇక లిజో జోస్ పెళ్లిసేరి తీసిన “సిటీ ఆఫ్ గాడ్ “, “డబుల్ బారెల్ ” లు కూడా మంచి  స్టై లైజ్డ్ సినిమాలుగా కొత్త తరం సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో ఆధునికతను సంతరించుకున్న స్త్రీ పాత్రలు, ప్రేమ గురించి సెక్స్ గురించి మాట్లాడడానికి మొహమాటాల్లేని తనం అంతా ఓపెన్ నేస్స్ అన్నట్టుగా కనిపించే విధానం చూస్తాం. అయితే స్త్రీ పాత్రల విషయంలో వారి వ్యక్తిత్వ ఆవిష్కరణ  కంటే అత్యానుధికత  వీటిల్లో ముఖ్యమయిపోయి కొత్త తరం సినిమాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఇంకా సుదేవన్(సీ.ఆర్.నంబర్ 89), సమీర్ తహిర్(చాప్పా ఖురీష్) , లాల్ జోష్(డైమండ్ నెక్లెస్), అన్వర్ రశీ( ఉస్తాద్ హోటల్), . వి.కె.ప్రకాష్(బ్యూటీఫుల్ ), రాజేశ్ పిళ్ళై ( ట్రాఫిక్)  లాంటి దర్శకులు చర్చనీయాంశమయిన సినిమాలు తీశారు. ఇక జీతూ జోసెఫ్ రూపొందించిన  “ దృశ్యం ”లాంటి సినిమాలు దేశ వ్యాప్తంగా తెలుగుతో సహా తమిళ,హింది భాష ల్లోకి రేమేక్ అయ్యి విజయం సాధించింది.

    మలయాళంలో కొత్తతరంసినిమాల్తో పాటు కొత్త తరం నటీనటులు కూడా వెలుగు చూస్తున్నారు. ఫహద్ ఫజిల్, నివిన్ పాలీ, జయసూర్య, దుల్ఖర్ సల్మాన్, పృథ్వీరాజ్ లాంటి నటులు ముందుకు వచ్చారు. ఇట్లా కొత్త తరం నిర్మిస్తున్న new gen సినిమాలతో మలయాళీ సినిమా కొత్త పుంతలు తొక్కుతున్నది.

  ఇలాంటి కొత్త తరం సినిమాలు మలయాళీ సినిమా రంగం లో ఆదినుంచీ వున్న విలక్షణతను ఆవిష్కరిస్తున్నాయనే చెప్పాలి.

        నిజానికి  ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర కోట్ల మందిమాట్లాడే మలయాళీ భాష వారి కళాత్మక సృజన విలక్షమయింది.అది సాహిత్యమయినా, సినిమా అయినా వాస్తవికత ఒక వైపూ వ్యాపారాత్మకత మరో వైపూ సమాంతరంగా సాగుతూ వుంటాయి. అన్ని భారతీయ రాష్ట్రాలోకెల్లా కేరళ సృజన విషయంలో తన విలక్షణతను చాటుకుంటూనే వుంది. సినిమా విషయానికి వస్తే తూర్పున వున్న బెంగాల్ కు  సమాంతరంగా అర్థవంతమయిన ఆవిష్కరణలతో అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది కేరళ.

      1928లో జేసీ డేనియల్ నిర్మించిన మొట్టమొదటి మూకీ సినిమా

“ విగతకుమారన్” తో మొదలయిన మలయాళీ సినిమా ప్రస్థానం 1938లో  ఎస్.  నొటాని  నిర్మించిన “ బాలన్” తో టాకీ సినిమా యుగం మొదలయింది. బాలన్ నిర్మాతలు కేరలేతరులు కాగా కేరళ వాసి నిర్మించిన మొదటి సినిమా గా “ ప్రహ్లాద” ను చెప్పుకోవచ్చు. నిజానికి అన్నీ దక్షిణ భారతీయ సినిమా రంగాల్లాగే మద్రాస్ కేంద్రంగానే మలయాళీ సినిమా కూడా మొదలయింది.  పి.సుబ్రమణ్యం త్రివేంద్రంలో స్థాపించిన మెర్రీలాండ్ స్టూడియో తో మలయాళీ సినిమా రంగం గొప్ప మలుపు తిరిగింది. ఆ తర్వాత క్రమంగా కేరళ లో చిత్రసీమ ఎదుగుదల మొదలయింది. అక్కడ మొదటినుంచీ వాస్తవ వాద సినిమాలు ఒక  వైపూ పూర్తి ప్రధాన స్రవంతి సినిమాలోక వైపూ నిర్మాణమవుతూ వచ్చాయి. రామూ కరియత్ “ చేమ్మీన్ ” లాంటి సినిమాలతో జాతీయ స్థాయి గుర్తిపును సాధిస్తే ప్రేమ్ నజీర్ లాంటి స్టార్ లు వ్యాపార సినిమా రంగాన్ని ఏలారు. మరోపక్క “ ఆమె మధురరాత్రులు ” లాంటి సినిమాలు కూడా వచ్చాయి. 1960ల్లో అనేక  సాహితీ విలువలున్న కథలు, నవలలూ కేరళలో మంచి సినిమాలుగా వచ్చాయి. తకజ్హి శివశంకర పిళ్ళై , ఎండి బషీర్,పరప్పురమ్, ఏంటీ వాసుదేవన్ నాయర్ లాంటి వాళ్ళు రాసిన రచనలు ఎన్నో సినిమాలుగా రూపాంతరీకరణ చెందాయి. 1965లో రామూ కరియత్ తన చేమ్మీన్ తో 1965లో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకొని మలయాళీ సినిమాకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తర్వాత భాస్కరన్  “ఇరుతింటే ఆత్మవు ”, విన్సెంట్ “ తులాభారం “ సినిమాలు జాతీయ గుర్తింపును అందుకున్నాయి. 1972లో అదూర్ గోపాలకృష్ణన్ శకం మొదలయింది. చిత్రలేఖ ఫిల్మ్ కొ ఆపరేటివ్ ను స్థాపించి అదూర్ తీసిన “స్వయంవరం” మొత్తం దేశంలోనే నూ తన ఒరవడిని ఆరంభించింది. తర్వాత ప్రఖ్యాత రచయిత ఏంటీ వాసుదేవన్ నాయర్ తన “ నిర్మాల్యం “ దానికి తోడయింది. అట్లా కేరళలో వాస్తవిక  పాంతీయ,సృజనాత్మక సినిమాకు పాదులు పడ్డాయి. ఆ ఒరవడి అరవిందన్, కె.జి.జార్జ్ , మోహనన్, పద్మరాజన్, భారతన్ తదితరుల సినిమాలతో ముందుకు సాగింది. అరవిందన్ కాంచన సీత, చిదంబరం, ఎస్తప్పన్, అదూర్ ఎలిపత్తాయమ్,  ముఖాముఖం, షాజీ కరుణ్  “ పిరవి  “ తదితర అనేక సినిమాలు అర్థవంతమయిన కళాత్మక సినిమా ప్రపంచంలో గొప్ప సినిమాలుగా నిలిచాయి. మరోవైపు ఒడెస్సా సినిమా ఉద్యమంతో జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి ఊరూరూతిరిగి మంచి సినిమాలు ప్రదర్శించి ప్రేక్షకులు ఇచ్చిన చందాలతో  “అమ్మా అరియన్ “ లాంటి గొప్ప సినిమాలు తీశాడు.

    అట్లా సమాంతర సినిమా తో పాటు కేరళలో ప్రధాన స్రవంతి సినిమా కూడా సుప్రసిద్ద నటులు మమ్ముట్టీ, మోహన్ లాల్ లాంటి నటులతో స్టార్ డమ్ కూడా కొనసాగింది. అయితే కేరళ లో ప్రత్యేకత ఏమంటే మోహన్ లాల్, మమ్ముట్టీ లు కూడా సమాంతర సినిమాలల్లో విరివిగా నటించి ఎన్నో జాతీయ అవార్డులు ప్రశంశలు అందుకున్నారు.  ఇట్లా విభిన్న నిర్మాణ రీతులు, భిన్న ఇతివృత్తాలతో కళాత్మకత ఒక వైపూ కాసుల సినిమా మరోవైపూ కేరళ లో విలసిల్లుతున్నది. ఏదేట్లా వున్నా భారతీయ సినిమా రంగంలో మలయాళీ సినిమా ప్రాంతీయమయి విలక్షణతను చాటుకున్నది. ఆధునిక newgen కాలంలో కొత్త రకం సినిమాకూ వేదిక అవుతున్నది.

0f0d06d9-e5c8-4edc-8ba1-2a3e24046fc4 (1)

Posted on

పుస్తకమే ఒక జ్ఞాననిధి

Thu,January 25, 2018 01:19 AM

హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీజిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. పుస్తక పఠనంతో బాధ్యత గల పౌరులు తయారవుతారు.ఉత్తమ విలువల సమాజం ఏర్పడుతుంది.

పుస్తకం ఒక జ్ఞాననిధి. అనుభవాల గది, అనుభూతుల సారధి. భాషకు, భావానికి, వ్యక్తీకరణకు అది ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. అంతటి విలువగల పుస్తకాన్ని, దాని అవసరాన్ని, చదివే సంస్కృతిని పెంపొందించేందుకు గాను పుస్తక ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర గొప్పది. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాల ను, ఉద్యమాలను, ఉద్వేగాలను ఒకటేమిటి మనిషి సమస్త మార్పులను పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. అలాం టి పుస్తకాలు అనేకమందికి చేరడం, విస్తృతంగా చదువడం అవసరం. ఆ అవసరాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ పూర్తిచేస్తున్నది. లక్షలాదిమంది పుస్తక ప్రదర్శనకు రావడమే కాకుండా పుస్తకాల అమ్మకాల పరిస్థితి చూస్తుంటే పుస్తకాల భవిష్యత్తు మీద చదివే అలవాటు మీద గొప్ప ఆశలు ముప్పిరిగొంటున్నాయి. ఎంతో ఆశావహమైన స్థితి కనిపిస్తున్నది. పుస్త కాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిదన్నట్టు ఇండ్లల్లోకి పుస్తకాలు చేరి తే చదువడం తప్పకుండా అలవాటవుతుంది. పుస్తక విక్రేతలు చెబుతున్నదాని ప్రకారం ఊహించనివిధంగా లక్షలాది రూపాయల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సందర్శకుల సంఖ్య పెరుగుతున్నది. అంటే జనం లో చదివేవాళ్లు ఉన్నారు కానీ, వారికి వాటిని అందించడంలోనే వైఫల్యాలున్నాయన్నది ఇప్పుడు రుజువవుతున్నది.
భారతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఆచార్య రంగనాథన్ చెప్పినట్టు పుస్తకాలు ఉపయోగపడాలి. ప్రతి పుస్తకం తన చదువరిని చేరాలి, ప్రతి చదువరీ తన పుస్తకాన్ని చేరాలి అట్లా పుస్తకాల పరిధి విస్తృతమై అందరిని చేరగలిగినప్పుడు అవి సార్థకమవుతాయి. వాటి లక్ష్యమూ నెరవేరుతుంది. ఆ పనిని ముఖ్యంగా పౌర గ్రంథాలయాలు, విద్యాసంస్థ ల్లో ఉండే గ్రంథాలయాలూ నెరవేర్చాలి. కానీ పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు పుస్తకాలను పూర్వపక్షం చేస్తున్నాయి. పుస్తక పఠనం తగ్గిపోవటం మంచి పరిణామం కాదన్నది నిజం.

21వ శతాబ్దంలో ఆధునిక తరం చదివే సంస్కృతి నుంచి వెరైపోతూ చూసే సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్దకాలం నుం చి ఒక్క చదివే అలవాటు మినహా అన్ని అలవాట్లు పెరిగాయి. అంతా చూడటమే. టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు. స్మార్ట్ ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒకటేమిటి అన్ని చూడటమే. దీనికి చిన్న పిల్లల నుంచి మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికి, చదువడానికి కూడా ఇమేజ్‌లనే వాడే సం స్కృతి వచ్చింది. ఒక మంచి పుస్తకం చదువుతూ గుండెల మీద ఉంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం నేటి తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే.

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందనో, పుస్తకం ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ బాధ అది. పుస్తకం హస్తభూషణం అన్న స్థితి నుంచి నేడు పుస్తకం పురావస్తువు అయిపోయే స్థితి కనిపిస్తున్నది. ఇవ్వాళ పుస్తకం చదువడం అంటే విద్యాలయాల్లో మార్కులు ర్యాం కులు సాధించడానికి పరిమితమైపోతుండగా, పౌర గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం చదువడమే మనకు కనిపిస్తున్నది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యం, సామాజిక రంగంలో వేళ్లూనుకుంటున్న సం క్లిష్టతలను, మానసిక సంక్షోభాలను ఆవిష్కరించిన పుస్తకాలను చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యక్తిగత సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకూ అవకాశం కలుగుతున్నది.

ఈ స్థితికి సాంకేతికత, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలూ కారణమనే వాదన వినిపిస్తూ ఉంటుంది. నేటి సాంకేతికత కూడా తాత్కాలికం గా పుస్తకాన్ని మరుగునపరిచినట్టు కనిపించినా దాన్ని సరైనదిశలో విని యోగించగలిగితే భౌతికంగా సాంకేతికత పుస్తక రూపాన్ని మింగేయవ చ్చు. కాని భాషను, భావాలను మింగేయలేదు. చదువడం అనే ప్రక్రియ కు సంబంధించి పాఠకుల అలవాటు పేజ్ రీడింగ్ నుంచి స్క్రీన్ రీడింగ్‌కు మారింది. కానీ ఆ స్థితిని ఎట్లా సరైన దిశలో మార్చుకోవాలో ఆలోచించాల్సి ఉన్నది.

సాంకేతికత దాని పర్యవసానాలను పక్కనబెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలుచేయాల్సి ఉన్నది. పుస్తకాలు చదు వడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ అర్థం చేయించాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసు లోపల ఇమిడించుకోవడంలో ఉన్న ఆనందాన్ని అర్థం చేయించా లి. అది ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్ల్లో జరుగాలి. లైబ్రరీల ను ఈ గ్రంథాలయాలు, డిజిటల్ గ్రంథాలయాలు అంటూ ఆధునిక వసతులు కల్పిస్తూనే విద్యార్థు ల్లో, యువకుల్లో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరుగాలి. చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులు, గ్రంథాలయాలు వేదిక కావాలి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికే కాకుండా ఆలోచనల్లో విశాలత్వం పెంచుకోవడానికి, సామాజిక బాధ్యతను గుర్తెరుగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం, చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదువాలని టీచర్లు చెప్పాలి. అప్పుడు విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది. పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.
anand
గ్రంథాలయాల సేవలు ఎప్పటికప్పుడు విస్తరించాలి. గ్రంథాలయం ఒక సాంస్కృతిక కేంద్రం కావాలి. పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలిపే పుస్తక పరిచయ సభలు, ముఖాముఖి కార్యక్రమాలు, రీడ్ అండ్ రివ్యూ కింద పుస్తక సమీక్ష సభలు, పోటీలు ఏర్పాటుకావాలి. అలాగే దృశ్య మాధ్యమాన్ని కూడా ఒక ప్రధానాంశంగా తీసుకొని ప్రేరణ కలిగించే జీవిత చరిత్రల డాక్యుమెంటరీలు, సుప్రసిద్ధ రచనల దృశ్యరూపాల ప్రదర్శనలు ఏర్పాటుచేయాలి. సాక్షరతా మిషన్ లాగా లైబ్రరీ మిషన్, రీడర్‌షిప్ మిష న్ చేపట్టాలి. ఆ క్రమంలో హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీ జిల్లా కేంద్రాల్లో ఏర్పా టు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. పుస్తక పఠనంతో బాధ్యత గల పౌరులు తయారవుతారు. ఉత్తమ విలువ ల సమాజం ఏర్పడుతుందిeef8fe05-6f05-4f94-bcbb-7d40eb5443f9.jpg

“వెర్రి మానవుడు”

Posted on

ప్రతిభావంతమయిన అనువాదం “వెర్రి మానవుడు”

కవిగా తాత్వికునిగా ఖలీల్ జీబ్రాన్ పాఠకుల రక్త నాళాల్లో ప్రవహించి హృదయపు పొరల్లోకి దిగిపోతాడు. కనిపించని వినిపించని ఒక దుఖ పొరను కప్పెస్తాడు. జీబ్రాన్ను చదవడమే మనసులోపల్నుంచీ ఒక కదిలిక. ఆలతి ఆలతి మాటల్తో జీవన సూత్రాల్ని ఆవిష్కరించిన జీబ్రాన్ మనిషి గురించి ప్రేమ గురించి స్నేహం గురించి సమస్త జీవన అనుభవాల గురించి ప్రస్తావిస్తాడు. మనుషుల మధ్యన వుండే అనుభందాల్ని స్వాభావిక లక్షణాల్ని ఆవిష్కరిస్తాడు. మనిషికీ మనసుకీ మనిషికీ లోకానికీ వున్న అంతర్లయని ఆలవోకగా పలికిస్తాడు. జీబ్రాన్ రచనల నిండా విస్తరించి సాగే తాత్వికత పాఠకుల్ని అనుభూతింప జేస్తూ ఆలోచింప చేస్తుంది. తమని తాము అద్దంలో చూసుకునేట్టుగా చేస్తుంది. జీబ్రాన్ రాసిన పంక్తుల్లో అలలు అలలుగా సాగే కవిత్వం ఆయన్ని విశ్వ కవిని చేసింది. ఆయనలో సాగే కవితా ధార, ఉప్పొంగే వూహల ప్రపంచం ఎంతో ఉన్నత మయింది. ఖలీల్ భావాల సవ్వడి హృదయ తరంగాలకు సొగసులు అబ్బుతుంది.జీబ్రాన్ భావావిష్కర్ణ చేసిన భాష ఎంతో అందంయింది. ఆయన భాష మోసిన భావ లయ ఉన్నతమయింది.

ఖలీల్ జీబ్రాన్ రచనల్లో లభిస్తున్న వాటిలో ప్రవక్త (ద ప్రాఫెట్) అత్యంత ప్రసిద్దమయింది. ప్రపంచ భాషల్లోకి అనేక సార్లు అనువాదమయి అత్యంత ప్రభావ వంత మయిన కవితాత్మక వ్యాస సంపుటిగా నిలిచింది. ప్రజా కవి కాళోజీ తో సహా పలువురు ప్రవక్త ను తెలుగులోకి అనువదించారు. పెళ్లి పిల్లలు, సుఖ దుఖాలు, కాలమూ, మంచీ చేడూ, అందమూ, శృంగార సౌఖ్యమూ, మతమూ, మృత్యువూ ఇలా అనేక మానవానుభూతుల తాత్విక లోతుల్ని స్పృశించిన ప్రవక్త లో జీబ్రాన్ వీడ్కోలు అంకం లో ఇట్లా అంటాడు…

“కొద్దిగా ఆగండి

గాలి ఊయల మీద కొద్దిగా విశ్రమించ నీయండి

మరో స్త్రీ గర్భంలో నేను ఉదయిస్తాను‘’

కానీ ఇప్పటికీ జీబ్రాన్ పాఠకుల హృదయాల్లో ఉదయించే వున్నాడు.

ఖలీల్ జీబ్రాన్ తన తొలి సృజన కాలంలో రాసిన కవితలు, కథలు, కవితాత్మక కవితలు 1918 లో మొట్టమొదటిసారిగా ‘” MADMAN “ పేర వెలువడింది. అందులో చిన్నవీ పెద్దవీ 35 రచన లున్నాయి. అవి ఈబుక్ లో చదివీ చదవంగానే కవీ పండితుడూ, గొప్ప వక్త, నాకు అత్యంత ఆత్మీయుడయిన డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు తెలుగులో అనుస్ర్రుజనకు పూనుకుని “వెర్రి మానవుడు “” పేర చక చక పూర్తి చేసి చదవండి అని ఇచ్చారు. ఏకబిగిన చదివాను. త్రిల్ గా ఫీలయ్యాను. అప్పటికే Madman మరో అనువాదాన్ని చదివున్నప్పటికీ లక్షమన్ రావు గారి అనువాద సరళి అందులో కనిపించిన ప్రవాహ లక్షణమూ అమితంగా ఆకర్షించాయి. “”Madman“” ను లక్ష్మణ్ రావు గారు వెర్రిమానవుడు అనడంలోనే గొప్పతాత్వికత వుంది.

మూలం నుంచి స్వేచ్ఛగా సరళంగా ఆయన చేసిన అనువాదం జీబ్రాన్ భావ పరంపరను గొప్పగా అక్షరీకరించింది.

ఖలీల్ జీబ్రాన్ భూమిక తాత్వికత, బలం ఆయన లోని కవితాత్మకత. ఆయన్ను చదువుతుంటే ప్రతి సృజన శీలికీ జీబ్రాన్ని తన మాతృ భాషలోకి తర్జుమా చేయాలనీ తన వాళ్ళకు అందించాలనే వూహ కలగడం అత్యంత సహజం. భాషాను వాదమూ సరలమే కానీ ఖలీల్ జీబ్రాన్ తాత్విక భావ పరంపరను అనువాదంలోకి తేవడం సులభం కాదు అందుకు అనువాదకునికి తాదాత్మ్యకత, సాధన కావాలి అవన్నీ పుష్కలంగా వున్న గండ్ర లక్ష్మణ్ రావు గారికి ఇది సులభ సాధ్యమే అయింది.

వెర్రిమానవుడు లో జిబాన్ ఇట్లా అంటాడు

‘నేను వెర్రివాడనయ్యాను ఇప్పుడు ఏకాంతం దొరికింది’

స్వేచ్చతో కూడిన ఏకాంతం దొరికిందని అర్థమయ్యింది, నాలోనే ఉన్న ఎవరి బంధం నుండో బానిసత్వం నుండో నేను విముక్తుడి నయ్యాని అనిపించింది””

నిజమే మానవుడికి వెర్రితనం లోనే తమ కాంక్షలు స్వేచ్చ తన కవసరమయిన రక్షణా లభిస్తాయేమో. ఇది నాటి జీబ్రాన్ కాలం నుండి నేటి వర్తమానం దాకా వర్తిస్తుంది. వెర్రి మానవుడులో దేవుడు, నామిత్రుడు, నిద్ర లో నడిచే వాడు, గుడి మెట్ల మీద …. అట్లా సాగి దుఖం, సంతోషం లతో ముగుస్తుంది.

వాటిల్లో జీబ్రాన్ ఇలా అంటాడు

నేనిప్పుడు చని పోయిన ధూఖం తో పాటు, చని పోయిన సంతోషాన్ని కూడా నెమరు వేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే నా జ్ఞాపకం గాలికి ఊయల లూగి ఆగి పోయిన గడ్డిపరక వంటిది మాత్రమే.

ఈ సరళి లో గండ్ర లక్స్మన్ రావు గారి అనువాదం హృద్యంగా సాగుతుంది. ముందే చెప్పుకున్నట్టు గండ్ర లక్స్మన్ రావు గారు కవీ పండితుడూ, విశ్వనాథ సత్యనారాయణ

వేయిపడగల మీద సాధికారిక పరిశోధన చేసినవాడు. మూడు దశాబ్దాలకు పైగా జూనియర్ డిగ్రీ విద్యార్హ్తులతో మమేక మయి ఎంతో మందిలో సాహితీ తృష్ణనూ సృజననూ మేల్కొల్పిన వారు. ఇక ప్రాచీన సాహిత్యం మీద ఎంత పట్టు గల వారంటే అలవోకగా ఎలాంటి రెఫరెన్స్ లేకుండానే వందలాది పద్యాలు సంధర్భ సహితంగా వివరించగల దిట్ట ఆయన. గండ్ర లక్స్మన్ రావు గారు పద్యం చదువుతుంటే లయాత్మకగానూ భావనాత్మకంగానూ వుంటుంది. పద్యం రాసినా వచనం రాసినా ఆయనది సొంత గొంతుక. ఇక సాహితీ సంస్థల ఏర్పాటు నిర్వహణ విషయం లో ఆయన అనేక మందికి ప్రేరణ. సమతా సాహితి అయినా సాహితీ గౌతమి అయినా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రెండున్నర దశాబ్దాలుగా సినారె పురస్కారం ఇవ్వడంలో ఆయనది ముఖ్య భూమిక. ఇట్లా బహుముఖీన ప్రతిభ గల గండ్ర లక్స్మన్ రావు గారి “వెర్రి మానవుడు“
ఉత్తమ అనువాదంగా నిలుస్తుంది.

నాకంటే వయసులో పెద్ద వాడయినప్పటికీ ఆత్మీయ మిత్రుడిగా కలగలిసిపోయే గండ్ర లక్స్మన్ రావు గారి “”వెర్రి మానవుడును “” మనసారా ఆహ్వానిస్తున్నాను. ఆయన కృషిని అభినందిస్తున్నాను.

– వారాల ఆనంద్

gandra 1

 VILLAGE ROCKSTARS

Posted on Updated on

 విలేజ్ రాక్ స్టార్స్ –మంచి అస్సామీ బాలల సినిమా

      ప్రకృతి సిద్దమయి నదీ  నదాలూ, పర్వతాలతో స్వచ్చమయిన వాతావరణంతో తుల తూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడినుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమామొదలు అన్నీ కళలూ అత్యంత ప్రాంతీయమై  అనుకరణ కాని ఆసలయిన కళారూపాలుగా వుంటాయి.

     అస్సామీ సినిమా జాలీ వుడ్ (JOLLYWOOD) గా పిలవబడుతున్నది. 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాల నిర్మించిన  “” జోయ్ మతి  “” సినిమాతో అసామీ సినిమా ప్రారంభమయింది. కానీ అనేక కారణాల రీత్యా అక్కడ సినిమా విస్తారంగా ఎదగలేదు. చాలా కాలం కలకత్తా కేంద్రంగానే అస్సామీ సినిమాల నిర్మాణం జరిగింది. కానీ వచ్చిన సినిమాలు మాత్రం చాలా వరకు మంచి సినిమాలుగా పేరుతెచ్చుకున్నాయి. అట్లా ఇటీవల దర్శకురాలు రీమాదాస్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా   విలేజ్ రాక్ స్టార్స్   ఇటీవల హైదరబాద్ లో జరిగిన  అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం లో ఆసియా విభాగంలో దర్శకత్వ అవార్డు తో పాటు మరో రెండు అవార్డులు కూడా గెలుచుకుంది.

  విలేజ్ రాక్ స్టార్స్   సహజంగానూ, గ్రామీణ వాతావరణ నేపథ్యంలోనూ చిత్రించబడి ఆసామ్ జనజీవన సజీవ దృశ్యం లా సాగుతుంది. ఈ సినిమాను దర్శకురాలు తమ గ్రామం చాహాయి గాంవ్ కు అంకితం చేస్తుంది.

మహిళల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో స్వంత కాళ్ళ పై నిలబడడం, వ్యక్తిత్వ నిర్మాణం రూపొందించుకోవడం, తన కలల్ని సాకారం చేసుకోవడం అనే అంశాలపై ఈ సినిమా సాగుతుంది. విజువల్ గా చాలా అద్భుతంగా వుండి అబ్బురపరుస్తుంది.

     సినిమా కథా కథనానికి వస్తే ఓ మారు మూల గ్రామంలో ధును అనే ఓ పదేళ్ళ అమ్మాయి విధవరాలయిన తన తల్లి, బద్దకస్థుడు అయిన అన్న తో కలిసి జీవిస్తుంటుంది. తల్లి చేసిన తినుబండారాల్ని అమ్ముకు రావడానికి జాతరకు వెళ్ళిన ధును అక్కడ ఒక బాండ్ ప్రదర్శన చూసి అబ్బురపడుతుంది. అంతే కాదు ఒక కార్టూన్ పుస్తకం చూసి ప్రభావితమయి తానూ ఒక గిటారిస్ట్ కావాలని, తానూ ఒక బాండ్ ను రూపొందించుకోవాలని కలలుకంటుంది.  ఒక పాత పేపర్లో పాజిటివ్ గా వుండడం వల్ల కలలు సాకారమవుతాయని దాంతో దేన్నయినా సాధించుకోవచ్చు నని అర్థం చేసుకుంటుంది. కానీ తమ పేదరికం అసహాయత అడ్డు పడుతుండగా మొక్క వోని దీక్షతో ఒక్కో రూపాయి కూడా బెట్టడం ఆరంభిస్తుంది. అప్పుడే ధును రజస్వల  అవుతుంది. మొత్తం ఆచారాల ప్రకారం తంతు నిర్వహిస్తారు. అప్పటినుంచి ఆమె పైన ఆంక్షలు ఆరంభ మవుతాయి. చీరె కట్టాలని, మగపిల్లలతో కలిసి తిరగొద్దని కట్టుబాట్లు చెబుతారు. కానీ ధును తల్లి అందుకు భిన్నంగా తన బిడ్డకు పూర్తి స్వాంతత్రాన్ని ఇస్తుంది.

వరదలు ప్రకృతి భీభత్శాలకు వాళ్ళకున్న కొద్ది భూమిలో పంట కూడా కొట్టుకు పోతుంది. ప్రతి ఏటా వరదలకు కొట్టుకుపోయే ఈ వ్యవసాయం ఎందుకు చేయాలని ధును తల్లిని అడుగుతుంది. తమకు తెలిసిన వృత్తీ యాగం ఇదే అని తల్లి బదులిస్తుంది. మునిగి పోతుందని ఏమీ చేయకుండా వుండలేము కదా అంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టి ధును తన గిటార్ కలను నెరవేర్చుకుంటుంది.

ఇక్కడ గిటార్ సాధించడం కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, మొత్తం సినిమాలో ధును తన ఉత్సాహం, సొంతంగా సాధించాలనే తత్వం చాలా సహజంగా చూపిస్తుంది దర్శకురాలు.

    వర్తమాన కాలంలో ఆడపిల్లలకు మగపిల్లలకు నడుమ వుండే ఒక ప్రధాన మయిన తేడాను  విలేజ్ రాక్ స్టార్స్  వివరిస్తుంది. ధును అత్యంత ఉత్సాహవంతురాలిగా భాధ్యత కలిగిన అమ్మాయిలా వుంటే ఆమె అన్న బద్దకంగానూ చిన్న అవకాశం దొరికితే చాలు బడి ఎగ్గొట్టే రకంగానూ వుంటాడు. ఇక ధును తండ్రి ఈత నేర్చుకోవానికి భయపడి నీలల్లో మునిగి చనిపోతాడు. ఇట్లా ఆడపిల్లల స్వావలంభనను ఆవిష్కరిస్తూ  విలేజ్ రాక్ స్టార్స్   కొన సాగుతుంది. ఇందులో నీలోత్పల్ బోరా సంగీతం అదనపు మూడ్ ను కలిగిస్తుంది. కెమెరా భాధ్యతల్ని కూడా రీమా దాస్ నిర్వహించారు.

     పిల్లల్ని చైతన్య వంతులను చేసే దిశలో సాగే ఈ సినిమాకు ధును పాత్ర ధారి భనితా దాస్ సహజ నటన ప్రధాన ఆకర్షణ. పేదరికానికి,ప్రకృతివైపరీతలకూ ఎదురోడ్డి తన కలల్ని సాకారం చేసుకునే పాత్రలో భనిత, ఆమె తల్లి పాత్రలో బసన్తీ దాస్ తో పాటు ఎవరు కూడా వృత్తి కళాకారులు కాదు అందరూ గ్రామంలోంచి ఎన్నుకోబడ్డావారే కావడం గమనార్హం. విలేజ్ రాక్ స్టార్స్   ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బహుమతులు గెలుచుకుంటూనే వుంది.

    పిల్లలు ప్రాధానంగా చూడాల్సిన ఆసలయిన ప్రకృతి సిద్దమయిన మంచి సినిమా  విలేజ్ రాక్ స్టార్స్   

వారాల ఆనంద్

rockstars 1

అవరోధాల్ని అధిగమిస్తున్న మణిపుర్ సినిమా

Posted on

అవరోధాల్ని అధిగమిస్తున్న మణిపుర్ సినిమా

       ఈశాన్య భారతం లోని మణిపూర్ రాష్ట్రం విలక్షణమయిన సాంస్కృతిక వారసత్వానికి నెలవు. ఆ రాష్ట్రంలో నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, క్రీడలతో పాటు యుధ్ధ కళలు విలక్షణమయినవి. అక్కడ జానపద సంస్కృతి సజీవంగా ఆలరారుతుంది.  మణిపూర్ కళాత్మక సృజాన వైపు ప్రపంచమంతా చూస్త్తుంది.

     సినిమాల విషయానికి వస్తే మణిపుర్ లో మూడు భాషా సినిమాలు నిర్మాణ మవుతాయి. ఇండో ఆర్యన్, ద్రావిడియన్, టిబెటో  బర్మన్ భాషా చిత్రాలు అక్కడ రూపొందుతాయి.  నిజానికి మూకీ సినిమాల కాలంలోనే మణిపుర్ లో టూరింగ్ టాకీసులు టెంట్, సినిమాలతో మూవింగ్ ఇమేజెస్ ప్రదర్శించాయి. మణిపుర్ కు సంబంధించి మహారాజ కుమార్ ప్రియబ్రతా 1936లోనే డాకుమెంటరీ సినిమాల్ని తీశాడు. తన 8 ఎం.ఎం. కెమెరాతో మణిపుర్లో జరిగిన ముఖ్యమయిన సందర్భాల్ని షూట్ చేసి పెట్టాడు. తర్వాత 1960-70 ల మధ్య ఇబోహల్ శర్మ  కొన్ని ఫీచర్     ఫిల్మ్స్, మరి కొన్ని నాన్ ఫీచర్ ఫిల్మ్స్ నిర్మించాడు.

     మానివుడ్ గా పిలవబడే మణిపూర్ సినిమా చరిత్ర లో మొట్టమొదటి సినిమాగా దేబ్ కుమార్ బోస్ రూపొందించిన మాతంగి మణిపుర్  ను చెప్పుకోవచ్చు. ఆ సినిమా  మూడు సినిమా హాళ్లలో 3 ఏప్రిల్ 1972 న విడుదల అయింది. కానీ మణిపుర్ సినిమాకు అర్థవంతమయిన కోణాన్ని ఇచ్చినవాడు ఎస్.ఎన్.చాంద్. మణిపుర్ ఫిల్మ్ సొసైటి ముఖ్య బాధ్యు డయిన ఆయన  తాన ఉద్యోగాన్ని వదిలి ఆస్తినంతా అమ్మేసి సినిమా ప్రయత్నం చేశాడు. ఆర్థిక కారణాల వల్ల నిర్మాణం ఆలస్యంఅయింది.  బ్రో జెన్ డ్రాగి లుహోంబా ‘1973లో విడుదల అయింది.  తర్వాత కూడా ఎస్,ఎన్, చాంద్ మరికొన్ని ప్రయత్నాలు చేశాడు. నిజానికి మణిపుర్ సినిమాకు ఊపిరి పోసింది అక్కడి ఫిల్మ్ సొసైటి ఉద్యమమే. మణిపుర్ ఫిల్మ్ సొసైటి , తర్వాత ఇంఫాల్ సినీ క్లబ్ లు మొత్తంగా ఆ రాష్ట్రంలో గొప్ప సినీ చైతన్యాన్ని తెచ్చిందనే చెప్పుకోవాలి.

      కానీ మణిపుర్ సినిమాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిని కల్పించి అర్థవంతమయిన సినిమాకు పాదులు వేసిన దర్శకుడు అరిభమ్ శ్యామ్ శర్మ. ఆయన ఇంఫాల్ లో 1939లో జన్మించాడు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం శాస్త్రీయ సంగీతం చదివాడు. చదువు తర్వాత మణిపుర్ చేరుకున్న అరిభం మొదట నాటక రంగంలో విశేష కృషి చేశాడు. 1974నుండి తన దృష్టి సినిమా వైపునకు మరల్చాడు. 1976లో ఆయన రూపొందించిన  సనబీ  మంచి గుర్తింపును తెచ్చుకుంది. తర్వాతి చిత్రం  ఇషణో  మాయిబీ సంస్కృతీ విశ్వాసాల్ని తెరకెక్కించాడు. మణిపుర్ ప్రాంతంలోని సనాతన సంస్కృతిని నిజాయితీగానూ, వాస్తవికంగానూ చూపించి జాతీయ అవార్డుతో పాటు కేన్స్ చిత్రోత్సవంలోకూడా ప్రదర్శించబడింది ఇంకా  ఇమాగి నిన్గ్థమ్ తో మణిపుర్ సినిమా స్థాయిని  మరింత ఎత్తునకు తీసుకెళ్ళాడు. ఇంకా ఆయన పలు డాకుమెంటరీ లు కూడా రూపొందించాడు. మొదటి మూడు దశాబ్దాలల్లో మణిపుర్లో 54 ఫీచర్ ఫిల్మ్స్, 35 డాకుమెంటరి ఫిల్మ్స్ రూపొందాయి. కోటానుకోట్లు వెచ్చించి నిర్మించే హిందీ సినిమాలాతో పోల్చినప్పుడు మణిపుర్ సినిమా కేవలం 10-20లక్షల బడ్జెట్ తో సినిమాలు నిర్మించేవారు. అట్లని అవి ప్రాంతీయ వనరులతో, స్థానీయ కోణంతో నిర్మించబడడంతో స్వచ్ఛంగానూ గొప్పగానూ వున్నాయి.

     కానీ అసలు సమస్య 2000 సంవత్సరం చివరి రోజుల్లో మొదలయింది. అప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన రాజకీయ విభాగం మణిపుర్ లో హిందీ సినిమాలతో పాటు మణిపూరేతర సినిమాల ప్రదర్శనల పైన నిషేధం విధించింది. దాంతో అక్కడ మొత్తం సినిమా రంగం తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేయబడింది. దాంతో అనేక సినిమా హాల్లు మూతబడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమా రంగాన్ని వదిలేసి ఇతర వ్యాపారాల్లోకి మారిపోయారు. మరికొంత మంది చిన్న చిన్న వీడియో ప్రదర్శన హాల్లుగా మార్చుకొని వీడియో సినిమాల్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. దాంతో కొంత మంది దర్శకులు వీడియో సినిమాల్ని తీయడం మొదలుపెట్టారు. అట్లా మొదత రూపొందిన సినిమా లమ్మీ అది ఫ్రెండ్స్ టాకీసులో మార్చ్ 2001లో ఎల్.సి.డి ప్రొజెక్టర్తో ప్రదర్శించారు అది విజయవంతమయింది దాంతో సినిమా హాళ్ళల్లో వీడియో సినిమాల ప్రదర్శనకు అధికారుల అనుమతిని తీసుకున్నారు. ఇప్పు అనే దర్శకుడు దర్శకత్వం వహించిన  లల్లాసీ పాల్  సినిమా 2002లో విడుదల అయి మణిపుర్ డిజిటల్ సినిమాకు పాదులు వేసింది.  ఈలోగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల ఎంపిక కోసం 2010 నించి వీడియో ఫార్మాట్ ను కూడా అర్హమయినవిగా ప్రకటించడంతో మణిపుర్ సినిమాకు వూపిరి పోసినట్టయింది. అప్పటినుంచి ఏటా 40-50 వీడియో సినిమాలు రూపొందడం మొదలయ్యాయి. ఓయినమ్ గౌతమ్ రూపొందించిన   ఫిజిగీ మణీ   చిత్రం 2011 సంవత్సరంలో ఉత్తమ ప్రాంతీయ సినిమా అవార్డును గెలుచుకొంది.   

      ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం తన ఫిల్మ్ పాలసీ ని ప్రకటించింది. దాని ప్రకారం నిర్మాతలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సహాయం అందించడం మొదలు పెట్టింది. ఇంకా ఫిల్మ్ లాబ్, స్టూడియో, అవార్డుల ప్రకటన, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ మొదలయిన కార్యక్రమాల్ని మొదలు పెట్టింది. ఇంకా ఫిల్మ్ సొసైటి లను ప్రోత్సహించడం మొదలు పెట్టింది.

  కానీ ఇప్పటికీ ఇంకా మణిపూర్లో పూర్తి స్థాయి నిర్మాణ ప్రదర్శనా వసతులు ఏర్పడక పోవడంతో వాటి కోసం నిర్మాతా దర్శకులు కోల్ కట్టా, చెన్నై, ముంబై వెళ్ల వలసి రావడంతో నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం నిర్మాతలకు ఇబ్బందిగానే వుందని చెప్పుకోవచ్చు. ఇన్ని అవాంతరాల నడుమ కూడా అరిభమ్ శ్యామ్ శర్మా 2012లో “” లీపాఖీ 2013లో మోంగ్ సభా  నంగా కప్పా పఖ్చాడే   , 2014లో సువాస్  నాంగ్ మతాంగ్ “, 2014లోనే కున్దోఘ్ భం పల్లె ఫామ్ “, 2017లో పబ్బన్ కుమార్  లోక్టక్ లాయిరెంబీ  లాంటి సినిమాలు తీసి పలు అంతర్జాతీయ అవార్డులు గుర్తింపులూ సాధించారు.

  ఇట్లా అనేక రాజకీయ ఆర్థిక కారణాల వల్ల ఆటంకాలక గురయింది ఆ రాష్ట్ర సినిమా రంగం.  మరో వైపు ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం అందక మణిపుర్ సినిమా అష్టకష్టాలు ఎదుర్కొంటున్నది. అయినా మనుగడ సాగీస్తూనే వున్నది. ప్రభుత్వాలనుంచి ఇతోధిక ప్రోత్సాహం తో పాటు స్థానిక నిర్మాతల ప్రోత్సాహం కూడా తోడయితే మణిపుర్ సినిమా తన రాష్ట్ర సాంస్కృతిక నేపథ్యం లోంచి మరెంతో ఎదిగేందుకు అవకాశం వుందని చెప్పుకోవచ్చు. అక్కడ సినిమా ఎదగడంతో పాటు మణిపూర్ టూరిజం పెరుగుతుంది. యువతకు, కళాకారులకు పేరూ  గుర్తింపుతోపాటు జీవన భృతి అవకాశాలూ పెరుగుతాయి.

     మణిపూర్ సినిమా శతాబ్ది సంవత్సరమయిన 2020 వరకయినా పరిస్తితి మెరుగు పడుతుందని ఆశించ వచ్చు.

-వారాల ఆనంద్

7753942f-3cf9-449b-a969-be18a856405e

64036023-673a-409a-afab-3acbc14e2cf1

ముక్తకాలు(Mukkalu)

Posted on Updated on

ముక్తకాలు :వారాల ఆనంద్

–———-

ప్రతి హృదయమూ అలల సముద్రమే కొందరు దాని రుచిని చూస్తే,

మరింకొందరు దాని లోతునీ వైశాల్యాన్నీ చూస్తారు

Every heart is an ocean of waves.
Some taste it and some measure it.

Tr. Anu Bodla

” జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం “

Posted on

” జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం “

      ఎలాంటి మొహమాటాలూ ఆటంకాలూ లేని స్వచ్చమయిన చిరునవ్వుతో అమాయకత్వంనిండిన బాలలతో రెండు గంటలు కలిసే అవకాశం నిజంగా ఆరోజుకే కాదు కొన్నాళ్లపాటు గొప్ప టానిక్. అదికూడా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడిస్తూ బాలల్లోని సృజనాత్మకతను ఆస్వాదిస్తూ గడపడం గొప్ప అనుభూతి. అలాంటి స్థితికి ఇవ్వాళ లోనయ్యాను. ప్రిమరీ స్థాయి బాలల కోసం ఒక స్కూల్లో ఫిలిమ్ క్లబ్ ఏర్పాటు కావడం దాన్ని ప్రారంభించే అవకాశం కలగడం నాకయితే గొప్ప అవకాశమే కాదు గొప్ప గౌరవం కూడా.

     కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం లోని బూరుగుపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల కోసం వారి సృజనాత్మకతను పెంపొందించే కృషిలో భాగంగా ఫిల్మ్ క్లబ్ ఏర్పాటయింది. ఆ సందర్భంగా పిల్లలతో మాట్లాడుతూ వుంటే వాళ్ళ పరిశీలనా శక్తి, ఊహా లోకం, నిర్మలంగా వ్యక్తీకరించే తత్వం చూస్తే అసలయిన మనిషితనం వాళ్ళల్లో వుందనిపించింది.  బాలల రామాయణం సినిమాలో అబద్దాలు ఆడని రాముడు నచ్చాడని, బాహుబలిలో ఎప్పుడయినా  హింసపెట్టేవాడు హింసకె బలవుతాడనేది అర్థమయింది అని వాళ్ళన్నప్పుడు  మల్లెపువ్వుల్లాంటి మనసులున్న పిల్లలు మంచిని ఎంత అద్భుతంగా స్వీకరిస్తారో కదా అనిపించింది. పెద్దవాళ్ళమే తెల్లని ఆ పలకలమీద పిచ్చిగీతలు గీస్తున్నామని మరోసారి అర్థమయింది.

     ఆ పాఠశాల ప్రారంభమయి 60ఏళ్ళు నిండిన తరుణంలో పిల్లలకోసం మంచి సినిమాలు చూపించాలనే కృషిని మొదలు పెట్టిన అధ్యాపకులను అభినందించాలి. వారికి ప్రోత్సాహంగా ముందు నిలిచిన ప్రధానోపాధ్యాయుడు వి. లక్ష్మణ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించాలి. సినిమా చూపించడమే కాకుండా “వ్యూ-రివ్యూ “ పేర సినిమాల పైన వారి భావాల్నివాళ్ళ భాషలోనే రాయించి వ్యక్తీకరించే శక్తిని పెంపోదించాలని సూచించాను.

  అదే దారిలో మరిన్ని స్కూళ్ళు ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. నావంతుగా పిల్లలకోసం   మంచి సినిమాల్ని సూచించడమే కాదు కొన్నింటిని అందజేస్తాను కూడా

IMG_20180109_150457 (1)IMG_20180109_150553IMG-20180109-WA0014

CINEMA IN ASSAM (ARTICLE)

Posted on Updated on

CINEMA IN ASSAM (ARTICLE) PUBLISHED IN NAVA TELANGANA DAILY on 7-1-2018

36e5869c-d5b6-434a-8c94-aa542e6f3ba6d08d7429-1f79-4cbf-8ce7-ef3c548ae473