Latest Event Updates

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

Posted on Updated on

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)

కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.

మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

పుస్తకం లాంటి మనిషి

Posted on

పుస్తకం లాంటి మనిషి  

++++++++++++ వారాల ఆనంద్

దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ

వాటి మధ్యే బతికానేమో

పుస్తకాల్ని

దూరంగా అద్దాల బీరువాలో చూసినా

దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా

ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది

చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది

మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా

పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది

అప్పుడు

కొన్నింటితో స్నేహం కుదుర్తుంది

కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను

కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే

మరికొన్ని నులిపెడతాయి

నేను కరిగి నీరయిపోతాను

కొన్ని నవ్విస్తే,

మరికొన్ని ఏడిపిస్తాయి

కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే

ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి

నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను

మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి

నేను వాటిలో లీనమవుతాను

అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా

నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం

పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..

*****************

24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY

“ప్రజాస్వామ్యం” ++++వారాల ఆనంద్

Posted on

“ప్రజాస్వామ్యం”

++++ వారాల ఆనంద్

ఓటు హక్కున్న మనుషులు

నడుస్తున్న కరెన్సీ అయిపోయినప్పుడు

పలుకుతున్న మాటలన్నీ

జమా ఖర్చులే

సర్వత్రా

నేను నాదీ నాకు అనేవే   

ఉఛ్వాస నిశ్వాసలై ఊరేగినప్పుడు                                                                                                                                                    

“ప్రజల చేత, ప్రజలయొక్క, ప్రజలకొరకు”

అన్న భావన సలసల కాగే స్వార్థపు జడిలో  

ఆవిరై అదృశ్యమైపోక

నాకోసమో నీకోసమో మిగులుతుందా

ఎన్నికల మైదానంలో

కూటమి, ఫిరాయింపు, బంధుప్రీతి  

మూడురంగుల జెండాగా తలెత్తుకు   

రెప రెప లాడుతూ వుంటే

కొంగ్రొత్త ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది

ప్రజలే ప్రేక్షకులై బిక్కమొహమేసుకుని

ప్రేక్షకుల్లా అచేతనంగా నిలబడిపోతారు 

*********************                                                                                                                                                                                                                                                                                          

Posted on

చార్లీ చాప్లిన్

Posted on

చార్లీ చాప్లిన్

++++++++ వారాల ఆనంద్

హాస్యం వారధిగా
దుఖాన్ని
దృశ్య మానం చేశావు

చిత్రంగా
హాస్యం సమస్త లోకానికి చేరింది

దుఖం మాత్రం నీలో నిలిచిపోయింది

************************************
( చార్లీ చాప్లిన్ జయంతి నేడు )

16 ఏప్రిల్ 2024

చార్లీ చాప్లిన్

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

యాదోంకీ బారాత్ 2- సిరీస్- నంబర్ 12

Posted on

 యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 12

++++++++++++++++ వారాల ఆనంద్

మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే  ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్  అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు.

“బతుకు ప్రయాణంలో

ఎందరో స్నేహితులు

ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి పోయారు”  

+++

నా ఉద్యోగ జీవితం 2016 లో ముగింపునకు వచ్చింది. 1980 జనవరి నుంచి కాలేజీ గ్రంధాలయ అధికారిగా నా ఉద్యోగజీవితం ఒకింత సాఫీగానే  సాగింది. ఆ లైబ్రెరియన్ ఉద్యోగంలో ఏమి మజా వుంటుంది.                 

చేసేదీ ఏముండదు అని అన్నవాళ్లూ, అనుకున్నవాళ్లూ వున్నారు. లైబ్రెరియన్ అంటే నిద్రపోయేవాడు అని అనుకున్నవాళ్లూ వున్నారు. విద్యాసంవత్సరం మొదట్లో ఏవో కొన్ని పుస్తకాలు పంచి ఏడాది చివర తిరిగి తీసుకోవడమే లైబ్రెరియన్ చేసేపని అని ఎగతాళి చేసిన వాళ్ళూ వున్నారు.                                                 కానీ  నేను మాత్రం నా ఉద్యోగాన్ని కొంత ఆసక్తిగానూ ఎంతో ఉత్సాహంగానూ చేశాను. విద్యార్థులూ పుస్తకాలూ అధ్యాపకులూ వీరందరి నడుమా బుక్స్ ఇవ్వడం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా సాహితీ సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చైతన్యవంతంగానే గడిపాను. ముఖ్యంగా ఎస్.ఆర్.ఆర్.కాలేజీలోకి వచ్చాక నాకు గొప్ప మైదానమే దొరికింది. కేవలం పుస్తకాలూ విద్యార్థులే కాకుండా వైవిధ్యంగా పనిచేసే గొప్ప అవకాశం నాకా కాలేజీ ఇచ్చింది. దాంతో నేను రంగులరాట్నంలా  గిర గిరా తిరిగాను.          

‘రంగుల రాట్నం’

+++++

సూర్యచంద్రులు

కళ్లు మూస్తూ తెరుస్తూనే వున్నారు

నేనేమో కాలాన్ని భుజానేసుకుని

‘రంగులరాట్నం’లా గిర గిరా తిరుగుతున్నా

++++++++++++ అని  రాసుకునే అవకాశం వచ్చింది.

అయితే ముగింపు సంవత్సరానికి వచ్చేసరికి ముగించాల్సిన పనులు, అప్పగించాల్సిన బాధ్యతలు అనేకం ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. అప్పటికే  రెండేళ్లుగా అనారోగ్యం, మందుల నడుమ చక్కర్లు కొడుతున్నవాన్ని. ఆ క్రమంలో నా సహోద్యోగులూ సహచరులూ స్నేహితులూ అందించిన సహకారం ఎనలేనిది.అప్పుడు నా చార్జ్ లో చాలా అంశాలున్నాయి. కేవలం లైబ్రరీ  విషయానికే వస్తే ప్రధాన గ్రంధాలయంలోని వేలాది పుస్తకాలు, యుజీసీ విభాగం, బుక్  బాంక్, రెఫెరెన్స్ విభాగం, శాతవాహన విభాగం పేర నేను సేకరించిన కరీంనగర్ జిల్లా కవులూ రచయితల పుస్తకాలు, నేనే మొదలెట్టి నడిపిన జర్నలిజం కోర్సు, ఫిల్మ్ మేకింగ్ కోర్సు, మిత్రుడు బయోటెక్నాలజీ శాఖ రీడర్  డాక్టర్ ఎస్.మాధవ రావు గారు ప్రిన్సిపాల్ గా బదిలీ అయి వెళుతూ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ  స్టడీ సెంటర్ బాధ్యతలు అప్పగించగా వున్న బాధ్యత, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్ విభాగం ఇట్లా అనేక బాధ్యతల్ని వివిధ అధ్యాపకులకు లెక్కలు చూపించి మరీ అప్పగించాలి. అదంతా పెద్ద పని. నాకు మొదటి నుంచీ ఎంతయినా పని చేయడం ఇష్టమే కానీ చార్జ్ అప్పగించడమంటేనే ఎక్కడ్లేని బద్దకం. అదో పెద్ద రోదన. కానీ తప్పదు. ఈ  చార్జ్ ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ 2016 లో ముగిసే జర్నలిజం కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ పూర్తి చేయాలి. అప్పుడు ప్రిన్సిపాల్ శ్రీ నితిన్ సంపూర్ణంగా సహకరించాడు. ఆరు మాసాల జర్నలిజం కోర్సు కేవలం నా చొరవతోటే మొదలయింది. పదమూడు బ్యాచులు అత్యంత విజయవంతంగా నడిచాయి.అప్పటి విద్యార్థులు అనేకమంది ఇవ్వాళ  ప్రధాన స్రవంతి జర్నలిజంలో వున్నారు. 13వ బ్యాచ్ ముగింపు సభ నా సర్వీసులో చివరిది కనుక ఎంతో ఉత్సాహంగా ఆడంబరంగా జరిగింది  ఆనాటి సభలో నితిన్, లెక్చరర్ మిత్రులు శ్రీయుతులు సుబ్బరామిరెడ్డి, డాక్టర్ ఎస్.మనోహరాచారి,  వై.సత్యనారాయణ, సత్యప్రకాశ్ లు ఎంతో ఆసక్తిగా పాలు పంచుకున్నారు. తర్వాత జర్నలిజం కోర్సు పట్ల ఎంతో ఆసక్తిగా పనిచేసిన సుబ్బరామి రెడ్డి గారికి కోర్సు చార్జ్    అప్పగించాను.ఇక ఇగ్నో స్టడీ సెంటర్ ను యూనివర్సిటీ  ఎత్తేయడంతో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కంప్యూటర్స్ మొదలయినవన్నీ యూనివర్సిటీ కి పంపించేశాను.  

కాలేజీలో ఇదంతా ఇట్లా జరుగుతుండగానే ప్రముఖ కవి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తమ తండ్రి గారు కీ.శే.గండ్ర  హనుమంత రావు గారు పేరుమీద ఇచ్చే ‘గండ్ర హనుమంత రావు స్మారక సాహితీ పురస్కారం                                                                                        ’ నాకు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కేంద్ర  గ్రంధాలయంలో జరిగిన సభకు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి  శ్రీనివాస్, వఝల శివకుమార్ లు అతిథులుగా హాజరయ్యారు. ఆ పురస్కారం నాకో గొప్ప గుర్తింపుగా ఫీలయ్యాను.

ఇదిట్లా వుండగానే జగిత్యాల లో సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ గుండేటి రాజు ఫోన్ చేశాడు. తమ వూరివాడు గొప్ప కవీ ఫోటోగ్రాఫర్ అలిశెట్టి ప్రభాకర్ పేరున రాష్ట్ర స్థాయి పురస్కారం             ఇవ్వాలనుకుంటున్నాం, ఆ మొదటి అవార్డును నాకు ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు.  అలిశెట్టి ప్రభాకర్   పెరు వినగానే ఎన్నెన్ని జ్నాపకాలు.ఎన్నెన్ని అనుభూతులు. అలిశెట్టిని మొట్టమొదట కలిసింది జగిత్యాల లోనే. నేనూ మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు ఇద్దరమూ ప్రత్యేకంగా వచ్చి కలిశాం. తర్వాత కలిసి లయ కవితా సంకలనం వేశాం,కరీంనగర్లో శిల్పి స్టూడియో, హైదరాబాద్ లో చిత్రలేఖ స్టూడియో ఇట్లా ఒకటనేమిటి ఎన్నో ఏళ్ల అనుబంధం.నేను ‘నవ్యచిత్ర వైతాళికులు’ సినిమా వ్యాసాలు రాయడంలోనూ అవి ‘పల్లకి’ పత్రికలో  రావడంలోనూ అలిశెట్టి సాహచర్యం ఎంతగానో తోడ్పడింది.నువ్వు కవిత్వం రాయడం లేదు కదా నీ కిష్టమయిన సమాంతర సినిమాల మీద వ్యాసాలు రాయి అని నన్ను సిద్ధం చేసింది ఒకరకంగా అలిశెట్టి ప్రభాకరే. నాకు అప్పటికే ఏమయినా రాయాలి అన్న కోరిక వున్నప్పటికీ రాసేలా చేసింది ప్రభాకరే. అలాంటి అలిశెట్టి పేరుమీద ఇవ్వ తలపెట్టిన అవార్డు నాకు ఇస్తాననడం, అదీ జగిత్యాలలో కావడంతో ఇష్టంగా  అంగీకరించాను. నేనూ ఇందిరా బయలుదేరాం.  ఏం.ఎల్.ఏ.శ్రీ టి.జీవన్ రెడ్డి గుండేటి రాజు తదితరులు పాల్గొన్నారు. సభ ఎంతో అభిమానంగా జరిగింది. ఆ సభకు నా పాత మిత్రుడు వెంకటేశ్వర్ రావు కూడా రావడం చాలా సంతోషాన్నిచ్చింది. సభ తర్వాత వెంకటేష్  ఇంటికి వెళ్ళాం.అట్లా ఆనాటి జగిత్యాల సభ పూర్హ్తి అయింది. ఇక  కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లో అప్పుడే ఇరానియన్ ఫిల్మ్ ఫెల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. నేనూ నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడాము. నేను ఇరానియన్ సినిమా అక్కడి దర్శకులు వాళ్ళ కళాత్మకత, ముఖ్యంగా పిల్లలకోసం వాళ్ళ సినిమాలు తదితర అంశాల మీద మాట్లాడాను. ఆ ఫెస్టివల్ లో చాలా మంచి పాకేజ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి. ఫెడరేషన్ వాళ్ళు పంపిణీ చేశారు.

ఇక ఫిల్మ్ భవన్  లోనే ప్రముఖ జర్నలిస్టు హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కమిటీ మెంబర్ కంబాలపల్లి కృష్ణ రాసిన పుస్తక పరిచయ సభ అనిర్వహించారు.అందులో కూడా పుస్తకం గురించి  వివరంగా మాట్లాడాను. 

ఇక ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో నా ఉద్యోగం రోజులు దగ్గర పడ్డాయి.అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.ఇన్ని దశాబ్దాలుగా నేను కొన్నవి, సాహితీ మిత్రులు ఇచ్చినవి, నేను సేకరించినవి 2000 పుస్తకాల్ని కాలేజీ  గ్రంధాలయానికి  ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్సిపాల్ నితిన్ కి చెబితే ఫ్రీగా ఇస్తానంటే వద్దంటానా అన్నాడు.వాటన్నింటి లిస్టు రాసి ఒక పూట కార్యక్రమం ఏర్పాటు చేశాను. కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్ బి.రాంచందర్ రావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం.ఆయన ఎంతో ఆదారంగా వచ్చారు.ప్రత్యేక విభాగంలో ఆ పుస్తకాల్ని వుంచుతామని నితిన్ ప్రకటించారు. దాదాపు లక్ష రూపాయల విలువ  కలిగిన ఆ పుస్తకాల ప్రదానం చాలా  తృప్తిని ఇచ్చింది. ఇక ఉద్యోగ విరమణ తేదీకి  ముందే లైబ్రరీ చార్జ్ కూడా ఎవరికయినా ఇవ్వాలన్నారు.నితిన్ ఉర్దూ మేడమ్ ఇస్రత్  సుల్తానా  గారికి ఆ బాధ్యత  అప్పగించారు.ఏవో కొన్ని చూసి పూర్తి స్థాయి గ్రంధాలయ అధికారి రాగానే పూర్తి చేస్తామనే హామీ మీద ఆ తతంగం ముగిసింది. కొంత డబ్బు డిపాజిట్ కూడా చేశాను.

ఇక మా కాలేజీలో అధ్యాపకుల పదవీ విరమణ సభకు కొన్ని పద్దతులు ఏర్పాటయి వున్నాయి. కామర్స్ అధ్యాపకుడు ఆనంద రావు, ప్రిన్సిపాల్ మురలి, యాద కిషన్, పీడీ లక్ష్మీరాజం లాంటి వాళ్ళు ఆ ఆనవాయితీని కొనసాగించారు. అవేమిటంటే కాలేజీలో పెద్ద విందు ఏర్పాటు చేయడం,స్టాఫ్ క్లబ్ సన్మాన విరమణ సభ నిర్వహించడం.కానీ   నేను మా ఇంట్లో వీడ్కోలు విందు ఏర్పాటు చేసి అందరినీ  పిలిచాను. దాదాపు అందరూ వచ్చారు. స్టాఫ్ క్లబ్ నిర్వహణలో సింపుల్ గా జరగాలని కోరుకున్నాను.అట్లే జరిగింది. విరమణ సభ అనగానే అందరూ ఇంద్రుడూ చంద్రుడూ అని పొగడడం అదీ  ఎందుకో నాకిష్టం కాలేదు.అయినా సభలో నా అభీష్టం మేరకు మిత్రులంతా ఆదరంగా క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత ఫిల్మ్ భవన్ లో సాహితీ  గౌతమి ఫిల్మ్ సొసైటీ తదితర సంస్థల  నిర్వహణలో కూడా సభ పెట్టారు.

అట్లా  నా 36ఏళ్ల  ఉద్యోగ జీవితం విజయవంతంగా ముగిసింది.

మిగతా వివరాలతో మళ్ళీవారం కలుస్తాను.

సెలవు                                                                                                                                                                           -వారాల ఆనంద్

14 ఏప్రిల్ 2024                                                                                 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

‘జ్ఞానం’ కవిత

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్

‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్

ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను

చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను

సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను

కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా

చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది

అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే

నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు

పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది

******************** 24-03-2024

YADONKI BARATH 2-series,Bo-11

Posted on

యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 11 

++++++++++++++++ వారాల ఆనంద్

జీవితం సరళరేఖ కాదు. తిన్నగా సాగడానికి. జీవితం నునుపయిన రహదారీ కాదు సాఫీగా నడవడానికి.  అనేక వంకరలు, వంపులు మలుపులు అనివార్యం. వాటన్నింటినీ దాటుకుంటూ మెలకువతో ముందుకు పయనించడమే జీవితం.

ఆ ప్రయాణానికి “ఎంట్రీ-ఎగ్జిట్” రెండూ వుంటాయి. మాతృగర్భంలోంచి మొదలయిన బతుకు ప్రవేశం(ఎంట్రీ) ఉత్సాహంగా ఆశలతో కలల్తో షురూ అవుతుంది. కానీ నిష్క్రమణే (ఎగ్జిట్) ఎవరిది ఎట్లా వుంటుందో ఏమిటో ఎవరమూ ఊహించలేం. ఎంట్రీ ఎగ్జిట్ లు రెండూ బాగుండాలనుకుంటాం. ఎవరమయినా ఎగ్జిట్ సంతోషంగా వుండాలనీ ఆశిస్తాం.

అది జీవితానికే కాదు బతుకులో ఏ ఉద్యోగానికయినా, వృత్తికయినా, మరే పనికయినా అంతే. ఎంట్రీ ఎగ్జిట్ అత్యంత ప్రధానమయినవి.

 నా ఉద్యోగ జీవితం ఎంట్రీ కొంత ఇష్టాయిష్టాల మధ్య 1980లో మొదలయింది. అనేక మలుపులతో 36 ఏళ్ళు గడిచాక 2016లో ఉద్యోగవిరమణ ఎగ్జిట్ సంవత్సరంలోకి చేరాను. అప్పటికి ఆ ప్రయాణం వివిధ కాలేజీల్లో అనేక మలుపులతో సాగిగింది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోకి 2000 సంవత్సరంలో ఎంట్రీ జరిగి పదహారేళ్లు కొనసాగింది. అదే కాలేజీలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థిగా ఎంతో ఉద్వేగంగా ఆ ప్రయాణం మొదలయింది. గ్రంధాలయ నూతన భవన నిర్మాణంలోనూ, అభివృద్దిలోనూ, విద్యార్థుల బహుముఖీన ఎదుగుదలకూ కొంత కృషి చేశాననే తృప్తి తోనే కాలేజీ ప్రయాణం సాగింది. మొత్తంగా ఇటు కాలేజీలో అటు బయటా సృజనాత్మక, సామాజిక రంగాల్లో పని చేయడానికి కాలేజీ, కాలేజీ మిత్రులూ నా వెన్నంటి వున్నారు. చేయిపట్టుకు  ముందుకు నడిపించారు.    

ఆ నడకలో ఓ ‘మెరుపు’ మెరిసింది. నాలోనూ మెరిసింది. ఉత్తర తెలంగాణా సాహిత్య ప్రపంచంలోనూ మెరిసింది. ఒక రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి, కవి మిత్రుడు ఆచార్య జయధీర్ తిరుమల రావు, నిజాం వెంకటేశంలు మేమంతా వస్తున్నాము. కరీంనగర్ లో కవులు రచయితలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నారు. అది నాతో ఎందుకన్నారో నాకు తెలీదు. శాస్త్రి గారికి నాకు అంతకు ముందు పరిచయమే లేదు. నా పేరు ఎవరు చెప్పారబ్బా అని ఆలోచించాను. బహుశా జింబో అని వుంటాడు. ఏది ఎట్లా అయితేనేం. మా ఫిల్మ్ భవన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. సాహితీ మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. ఎంతమంది స్పందిస్తారో తెలీదు. ఎంతమంది వస్తారో ఊహించలేను. చూద్దాం అనుకున్నాను. సమావేశం సమయానికల్లా అనేక మంది  పెద్దలు, కవులు రచయితలు వచ్చారు. సమావేశంలో ఎం.వీ.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ ఆంధ్రభూమి జిల్లా ఎడిషన్లో వారం వారం రెండు పేజీలు సాహిత్యానికి కేటాయిస్తున్నామన్నారు. అంతే కాదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సాహిత్యకారుల రచనలకు అందులో చోటు ఇవ్వాలనుకుంటున్నా మన్నారు. ఏమయినా సూచనలు ఇవ్వమన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణ రావుతో సహా పలువురు మాట్లాడారు. జయధీర్ తిరుమల్ రావు, నిజాం వెంకటేశం గార్లు కూడా మాట్లాడారు. చివరన ఈ సాహిత్య పేజీకి ‘మెరుపు’ అని పేరు పెడుతున్నామన్నారు. ఆ పేజీకి వారాల ఆనంద్ బాధ్యుడుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. నాకు కొంత ఆశ్చర్యం, మరికొంత ఆనందం. బాధ్యత తీసుకుంటారుగా అన్నారు శాస్త్రి గారు నేను సరే నన్నారు. దానికి సంభందించిన వివరాలు మాట్లాడదామన్నారు. సాహితీ మిత్రులంతా ఉత్తర తెలంగాణా సాహిత్యానికి ఒక వేదిక లభించినందుకు సంతోపడ్డారు. నాకయితే ఉత్సాహంగానే వుంది. అప్పుడు కరీంనగర్లో ఆంధ్రభూమి ఆఫీసు మా కాలేజీ గేటుకి సరిగ్గా ముందే వుంది. అంతేకాదు దాన్లో డీటీపీ ఆపరేటర్ చంద్రమౌళి గతంలో మా తో ఈనాడు లో పనిచేస్నవాడే. అంతా ఒకే అనుకున్నాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అంటూ హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లు బయలుదేరారు. ఆంధ్రభూమిలో ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా ఉత్తర తెలంగాణ జిల్లాల సాహిత్యకారులను సంప్రదించాను. అంతా ఉత్సాహం చూపించారు. అనేక వారాలు విజయవంతంగా సాగింది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది. దాంతో నేను ఉత్తర తెలంగాణ జిల్లాల కవులు రచయితల ఇంటర్వ్యూ లు ప్లాన్ చేశాను. అందరినీ సంప్రదించి ప్రశ్నలు పంపాను.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం వారం వేశాను. కవితలు,కథలు, సమీక్షలు ఓహ్ అన్ని కాలమ్స్ కొనసాగాయి. ఆ ఇంటర్వ్యూ లను “మెరుపు” పేర పుస్తకంగా తెచ్చాను. ఆ ఇంటర్వ్యూల్లో జింబో, దర్భశయనం, నలిమెల భాస్కర్, చొప్పకట్ల చంద్రమౌళి, అంపశయ్య నవీన్, తుమ్మేటి, వఝల శివకుమార్ తదితర అనేక మందితో చేసిన ‘ముఖా ముఖి’ ఇంటర్వ్యూలు ప్రచురించాను. దానికి 23 ఏప్రిల్ 2016 రోజున ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ. సాహితీ గౌతమి నిర్వహణ. ఆవిష్కర్తగా కరీంనగర్ లో కలెక్టర్ గా పనిచేసి ఫిల్మ్ భవన్ నిర్మాణం లోనూ, కాలేజీ గ్రంధాలయ భావన నిర్మాణంలోనూ నాకు ఎంతగానో సహకరించిన మంచి మనిషి శ్రీ సి.పార్థసారధి గారిని పిలిచాను. ఆయన ఎంతో ఉత్సాహంగా రావడానికి అంగీకరించాడు. వచ్చారు కూడా. కె.ఎస్. అనంతాచార్య అధ్యక్షతన సభ చాలా ఆసక్తిగా ఆనందంగా జరిగింది. నాకు మెరుపు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన పలువురు కవులు రచయితలు పాల్గొన్నారు. కవి మిత్రులు శ్రీ వఝల శివకుమార్, జింబో, నలిమెల భాస్కర్, దాస్యం సేనాధిపతి వేదిక మీద వుండి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘మెరుపు’ ఆవశ్యకతను ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలో సాహితీ వేత్తలు తెలంగాణ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు అనే విషయాల్ని ఆనాటి సభ విస్తృతంగా చర్చింది. సభలో శ్రీ నమిలకొండ హరిప్రసాద్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, పీ.ఎస్., తోట రమేశ్, మచ్చ హరిదాస్, డాక్టర్ రామకృష్ణ,. అన్నవరం దేవేందర్, ఎం.సరస్వతి, నవీన, ఇందిర, రేల తదితరులు పాల్గొన్నారు. పార్థసారధి గారు సాహితీ వేత్తలందరికి మెరుపు పుస్తకాన్ని అందజేశారు.

ఇదంతా ఇట్లా వుండగా అంతకు ముందే నా ‘మనిషి లోపల’ కవితా సంకలనం లోని కవితల్ని మిత్రురాలు బొడ్ల అనురాధ ఇంగ్లీష్ లోకి అనువదించడం ఆరంభించారు. అనురాధ గారు మాకు అత్యంత ఆత్మీయ స్నేహితులు. కరీంనగర్ లో ప్రముఖ విద్యావేత్త కీ.శే.నాగభూషణం గారు మొట్టమొదటి ట్యుటోరియల్ ఏర్పాటు చేసిన విద్యావేత్త. 70ల్లో ఎస్వీటీసీ నోట్స్ అంటే కరీంనగర్ విద్యార్థుల్లో గొప్ప ఆదరణ. వారి కూతురు అనురాధ. తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హై స్కూలు చదువు తర్వాత వివాహమై ఇద్దరు పిల్లల తర్వాత వూహించని ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాంతో జీవితం ముగిసిందని ఆమె అనుకోలేదు. పోరాటమే తన జీవితం అనుకుంది. కాలానికి ఎదురొడ్డింది. తన కాళ్లమీద తాను నిలబడి ఉన్నత చదువులు కొనసాగించింది. ఎదురుదెబ్బలు తనకు ఎలాంటి ఆటంకం కావని ఆమె నిరూపించారు. కొంత కాలం మాల్దీవ్స్ కు కూడా వెళ్ళి అక్కడ పనిచేశారు. ఇంగ్లీష్ లో మంచి పట్టు సాధించారు. తనతో మాకున్న దశాబ్దాల స్నేహం, అభిమానంవల్ల ఆమె నా కవితల్ని ఇష్టంగా చదివింది. తనకు నచ్చిన ఆ కవితల్నిఅందంగా అర్థవంతంగా ఇంగ్లీషులోకి అనువదించే పని పెట్టుకుంది. చాలా గొప్ప అనువాదం చేశారామె. ఆ అనువాదాలతో ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ పేర పుస్తకం తెచ్చాను. పుస్తకం ఆవిష్కరణల విషయంలో మిత్రుడు ఎన్.బి.టి. తెలుగు సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ సహకరించారు. ఆ సమయంలో తాను హైదరబాద్ లో లేకున్నా ఉస్మానియా కాంపస్లో వున్న తమ ఆఫీసులోని హాలులో ఆవిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణకు ఆత్మీయ మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు ని పిలిచాను. ఆయనకుతోడు డాక్టర్ నందిని సిద్దారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య తదితరులు హాజరయ్యారు. కవిత్వం గురించి సిద్దారెడ్డి, అనువాదం గురించి దర్భశయనం మాట్లాడారు. అనువాదంలో అనురాధ చూపించిన పరిపక్వతని ఆయన సోధాహరణంగా చెప్పారు. ఇంగ్లీష్ పుస్తకానికి న్యాయం చేయడానికి దర్భశయనం సరయిన వాడని సిధారెడ్డి అన్నారు. ఆ తర్వాత ‘సూర్య’ దిన పత్రికలో మిత్రుడు టీవీ9 వొడ్నాల చంద్రమౌళి మంచి సమీక్ష చేశారు. 1990ల నుంచి పరిచయమూ స్నేహమూ వున్న చంద్రమౌళి చాలా సంవత్సరాలు ఈనాడులో సబ్ ఎడిటర్ గా పని చేసారు. వయసులో నాకంటే చాలా చిన్న వాడే అయినా ఇద్దరి నడుమా దగ్గరి స్నేహం అల్లుకుపోయింది. భావుకుడు ప్రగతిశీలవాది అయిన చంద్రమౌళి సిగ్నేచర్ ఆఫ్ లవ్ గురించి రాస్తూ ‘సమాజం పైన కవి వారాల ఆనంద్ చేసిన ప్రేమ సంతకమిది. మనసు నిండా ప్రేమను నింపుకున్న కవి తన కవిత్వం నిండా ప్రేమను నింపడం సహజమే. ఆ ప్రేమ మనుషులపట్ల, సమాజం పట్ల,మనుషుల మనుగడకు ఆధారభూతమయిన భూమి గాలి నీరు పట్ల కనిపిస్తాయి. వారాల ఆనంద్ జీవితం నిండా కవిత్వం కనిపిస్తుంది’ అని రాశాడు. రోజూ కలిస్తేనే స్నేహాలు నిలుస్తాయా… ఎప్పుడో ఒకసారి కలిసే చంద్రమౌళి తో స్నేహం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగడం లో ఆయన చూపించే ఆప్యాయత ప్రధాన కారణం. ఈనాడు తర్వాత తాను ఎలెక్ట్రానిక్ మీడియాకు వెళ్ళాడు.

ఇక సమీక్షలకు పంపించే క్రమంలో సిగ్నేచర్ ఆఫ్ లవ్ ని ఇండియన్ లిటరేచర్ కు కూడా పంపాను. అక్కడ ఆ పుస్తకాన్ని చూసిన తమిళ కవి, ప్రముఖ అనువాదకుడు చంద్ర మనోహరన్ ఒకరోజు ఫోన్ చేసారు. మీ పుస్తకాన్ని తమిళం లోకి తేవచ్చా అని అడిగాడు. నేను వెంటనే చాలా సంతోషం అన్నాను. తానే దాన్ని తమిళం లోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడెమికి అనేక అనువాదాలు చేసిన చంద్ర మనోహరన్ స్వచ్చందంగా ‘అన్బిన్ కైచాంది’ పేర వెలువరించారు.  ఆ అనువాద సంకలనాన్ని తమిళనాడుకు చెందిన ‘ఆర్ట్ లిటరరీ క్లబ్’ ఆవిష్కరించింది. ఆనాటి కార్యక్రమానికి నేను వెల్ల లేదు కానీ ఆ సభలో సంస్థ కార్యదర్శి బి. ఆర్. నటరాజన్,డాక్టర్ సురేష్,డాక్టర్ మీనా సుందర్,డైరెక్టర్ మని, అన్వాదకుడు చంద్రమనోహరన్ పాల్గొన్నారు. ముక్కూ మొహం తెలీని  నేను రాసిన నా కవిత్వాన్ని తమిళంలోకి అనువదించి ప్రచురించిన చంద్ర మనోహరన్ కి ఎంతని ఏమని కృతజ్ఞతలు చెప్పను. ధన్యవాదాలు అంటూ నమస్కరించడం తప్ప.

2016 నాటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాను..

+++++

వారాల ఆనంద్

24 మార్చ్ 2024   

Image Posted on

యాదోంకీ బారాత్ సిరీస్-2 నంబర్-10

Posted on Updated on

యాదోంకీ బారాత్

సిరీస్-2 నంబర్-10

+++++++++++ వారాల ఆనంద్

ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/

మంచిదేనేమో…..

మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు

ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు

ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు

ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే

ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది 

తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది

…….

బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి మలుపులోకి ఒకింత ఉత్సాహంగానే తిరిగాను. సమయం లేదు అన్న భావనేదో లోన ఎక్కడో నాకు తెలీకుండానే పని చేసిందేమో. మనిషిగా భౌతికంగా అనేక పరిమితులకు లోబడినప్పటికీ చిత్రంగా నా సృజనాత్మక పరుగు వేగం పెరిగింది. రాతలు, ప్రచురణలు, కాలేజీలో ఆక్టివిటీస్ కొనసాగుతూనే వచ్చాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నారై ల సహకారంతో ఏర్పాటు చేసిన ‘ప్రతిభాపురస్కారాల ప్రదానం’ మా స్టాఫ్ సహకారంతో కొనసాగించాము. ఒక కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యుడు శ్రీ గంగుల కమలాకర్ అతిథిగా వచ్చారు. అప్పటికి ప్రిన్సిపాళ్లుగా డాక్టర్ మురలి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి లు ఉద్యోగ విరమణ చేశారు. మిత్రుడు భౌతిక శాస్త్ర విభాగం ఇంచార్జ్ శ్రీ పి.నితిన్ ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు. నితిన్ నేనూ గతంలో ఒకసారి హైదరబాద్ లోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో మూడు వారాల పాటు రిఫ్రెషర్ కోర్సు చేశాము. రూమ్ మేట్స్ గా వున్నాం. ఆయన అత్యంత నిబద్దత కలిగిన వాడు. ఉద్యోగ బాధ్యతల్లో గానీ తన జీవన సరళి లో కానీ తాను విశ్వసించిన దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిత్వం ఆయనది. అట్లా ఆయన కాలేజీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నప్పుడే పలు కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతిభాపురస్కారాల్లో భాగంగా ఒక మెడల్, సర్టిఫికేట్, అయిదు వేల నగదు ఇచ్చేవారం. మొదట అది బయట టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రారంభించి మా కాలేజీకి తెచ్చాను. ఇక నా ఉద్యోగ విరమణకు ముందు లైబ్రరీ సైన్స్ కి సంబంధించి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. మిత్రుడు శ్రీ చేగొని రవి కుమార్ చాలా ఆక్టివ్ గా వున్నాడు. ఆయన ఒక ప్రతిపాదన తెచ్చాడు‘COLLECTION DEVELOPMENT IN OPEN ACCESS ERA’అన్న అంశం మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్ నిర్వహించాలనుకున్నాం. దానికి ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ ప్రొఫెస్సర్ డాక్టర్ లక్ష్మణ రావు గారిని ప్రధాన వక్తగా పిలిచాము. ఆయన నాకు బి.ఎల్.ఐ.ఎస్సీ. ఏం.ఎల్.ఐ.ఎస్సీ రెండు కోర్సుల్లో టీచర్. కాటలాగింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లల్లో ప్రభావవంతంగా బోధించారు. ఆ రోజుల్లో ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, సుదర్శన్ రావు, విశ్వమోహన్ లు ఆచార్యులుగా వుండేవారు. మా కాలేజీలో అంతకు ముందెప్పుడో నిర్వహించిన రెండు జాతీయ స్థాయి సెమినార్స్ కి కూడా శ్రీ లక్ష్మణ రావు నాకు మార్గ నిర్దేశకత్వం చేశారు. అట్లా నా రిటైర్మెంట్ కి రోజులు దగ్గరపడ్డప్పటికీ ఆరోగ్య షరతులకు జాగ్రత్తలకు లోబడి ఉత్సాహంగానే అన్ని  కార్యక్రమాల్ని నిర్వహించాను. మిత్రులు ఏర్పాటు చేసిన వాటిలో క్రమం తప్పకుండా పాలు పంచుకుంటూనే వున్నాను. అదట్లా వుండగానే 2016 మార్చ్ లో హైదరబాద్ గ్లోబల్ ఆసుపత్రి నిర్వహణలో గ్లోబల్ కిడ్నీ సప్పోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నా నెఫ్రాలజీ డాక్టర్ గందే శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన గ్రూప్లో ఉత్సాహంగా పాలు పంచుకున్నాను. కరెంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశాం. మా ఫిల్మ్ భవన్ నిర్మాణం కాక ముందు తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుతో పాటు నా ‘సినీ సుమాలు’,’24ఫ్రేమ్స్’ పుస్తకాల ఆవిష్కరణ లాంటి అనేక సమావేశాలకు ప్రెస్ క్లబ్ ప్రధాన వేదికగా వుండేది. జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ మయి అందరికీ అందుబాటులో వున్న వేదిక ప్రెస్ భవన్. ప్రెస్ భవన్ అనగానే జీవగడ్డ విజయ్ కుమార్ గుర్తొస్తాడు.  

ఇక మా కుటుంబం విషయానికి వస్తే రేల తన సాఫ్ట్ వేర్ ఉద్యోగం క్రమబద్దంగా చేస్తూనే వుంది. ఇందిర ఎజెండా ప్రధానంగా నేనూ నా ఆరోగ్యం. అంతేకాదు ఎన్నో జాగ్రత్తలు. నిలబడితే కూర్చుంటే హెచ్చరికలు చేస్తూ నియంత్రించడం. ఎందుకంటే మనం అంత సులువయిన వాళ్ళం కాదు కదా. చెట్టు దాకా వెళ్లమంటే చెట్టు ఎక్కేసే రకం. ఆ ఏమయితదిలే అనుకునే మనస్తత్వం. ఇందిరే క్షణక్షణం కట్టె పట్టుకోకుండానే హెచ్చరికలు చేస్తూ వచ్చింది. ఇక మా అబ్బాయి అన్వేష్. హైదరబాద్ లో యింటర్ తర్వాత ఎంట్రన్స్ రాసి తిరువనంతపురం లో వున్న ఐ.ఐ.ఎస్.టి.INDIAN INSTITUTE OF SPACE SCIENCE AND TECHNALAGY లో సీటు తెచ్చుకుని ఏవియానిక్స్ లో చేరాడు. నాలుగేళ్ల చదువు పూర్తి అయిన తర్వాత నేను హాస్పిటల్ లోవుండగానే నాన్నా నేను వచ్చేస్తున్నా అన్నాడు ఫోన్లో. సరే రా అన్నాను. అముంది లాగేజీ తో పాటు దిగిపోయాడు. ఏమయింది అంటే నాకా 9-5 జాబ్ ఇష్టం లేదు నేను క్రియేటివ్ రంగంలోకి వెళ్తాను అన్నాడు. ఇందిర మిగతా అంతా కంగారు పడ్డారు. నేను క్షణం ఆలోచించకుండా ఎవరయినా తన కిష్టం అయిన పనిలోనే సంతోషంగా వుంటారు. మనిషికి కావలసింది సుఖం కాదు సంతోషం అన్నాను. అప్పుడే నానిగాడి మీద ఇట్లా రాసుకున్నాను

“ఇన్నాళ్లూ వాడు నాకార్థం కాలే/ అవును ఎవరయినా ఎందుకు అర్థం అవుతారు/ మనం ప్రయత్నిస్తే కదా/ గుండెల మీద పడుకున్ననాడూ, చిటికేన వేలు పట్టుకుని నడిచిననాడూ/       

జబ్బకు సంచీ వేసుకుని స్కూలుకు వెళ్ళిన నాడూ/ ముద్దు మురిపాల ముచ్చట్లే కదా/ ఆనాడు మనకేం అర్థం అవుతాడు… పరీక్షలూ మార్కులూ సీట్లూ ఈ గొడవలో పడ్డప్పుడూ వాడు నాకార్థం కాలే/ కానీ ఇప్పుడు

‘అంతరిక్షం నుంచి సృజన వైపు వాడి ప్రయాణం/

సారీ రా నానీ నువ్వు అర్థం కాలేదనుకున్నా /కానీ నేనే నిన్నర్థం చేసుకోలేదు

నా కలలూ నీ కలలూ ప్రోది చేసుకుని/ విశ్వంలోకి దూసుకెళ్లు

నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు’ (మనిషి లోపల)

అన్వేష్ మొదట డ్రాయింగ్,పెయింటింగ్ తర్వాత ఎనిమేషన్ ఇట్లా దృశ్య మాధ్యమంలోనే కాలు మోపాడు. ఏనిమేషన్ లో మిత్రుడు కళ్యాణం శ్రీనివాస్ తో కొంతకాలం నడిచాడు. కానీ వాడి దృష్టి అంతా ‘మూవింగ్ ఇమేజెశ్’ పైనే. కెమెరా పట్టుకుని తిరగడం. మొదట స్టిల్ ఫోటోస్. సిరిసిల్లా వెళ్ళి మిత్రుడు జర్నలిస్ట్ టీ.వీ.నారాయణ తో కలిసి తిరిగి నేత కార్మికులు నేత పని పరిశ్రమల పైన ఒక సిరీస్ తీశాడు. తర్వాత ‘తెలంగాణ పట్నం’. దాని గురించి నేనూ ఇందిర చెప్పగానే మా దగ్గరి ఫామిలీ మిత్రులు లావణ్య రాజయ్య సార్ వాళ్ళ వూరు గంగాధరలో పట్నం పండుగ బాగా చేస్తారని అనగానే రేల అన్వేష్ లు ఇద్దరూ వెంటనే అక్కడికి వెళ్లారు.  పట్నం ఉత్సవాన్ని మొత్తం కలర్ ఫుల్ గా షూట్ చేశాడు. చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ మ్యూజిక్ చేశాక అన్వేష్ పైన నా నమ్మకం రెట్టింపు అయింది. ఇదిలా వుండగానే నాకు అత్యంత దగ్గరి మిత్రుడూ సుప్రసిద్ద కవీ శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య పైన ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది అన్నాను. సరే వెళ్దాం అన్నాడు అన్వేష్. నేను అమెరికా వెళ్తున్నాను ఈలోగా చేయగలిగితే చాలా బాగుంటుంది అన్నాడు దర్భశయనం. నేనూ ఇందిర అన్వేష్ హనుమకొండ వెళ్ళాం. నిజానికి కవిత్వం రాయడం ఎంతో కవిత్వ పఠనం అంతకంటే గొప్ప కళ. అందులో ప్రతిబావంతుడు దర్భశయనం. ఇంకేముంది కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణలోనూ, తర్వాత రామప్ప కూ వెళ్ళి షూట్ చేశాము. రామప్పకూ నేనూ ఇందిరా అన్వేష్, ధర్భశయనం లతో పాటు ఆయన సతీమణి కమల గారు కూడా వచ్చారు. అట్లా షూట్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ కూడా చేశాడు అన్వేష్. తర్వాత 8 నవంబర్ 2015 న కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ చేశాము. మా మిత్రుడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. దాస్యం సేనాధిపతి,ముజాఫ్ఫర్ తదితరులు హాజరయ్యారు. ఆనాటి కార్యక్రమానికి మిత్రులు ఏం.గంగాధర్, అన్నవరం దేవేందర్,పొన్నం, ఆర్.వెంకటేశ్వర్ రావు తదితర మిత్రులు అనేక మంది పాల్గొన్నారు. అట్లా ఆనాటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డాక్యుమెంటరీ ప్రొజెక్షన్ కూడా వేశాం. పట్నం, బతుకే ఒక కళ లతో అన్వేష్ ఫిల్మ్ మేకింగ్ మొదలయింది. ఆ తర్వాత హైదరబాద్ లో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్వేష్ తీసిన పట్నం డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు.

ఇక తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక లఘు చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిల్మ్ భవన్లో జరిగిన ఆ కార్యక్రమంలో ముద్దసాని రామిరెడ్డి, యాది సదాశివ, శివపార్వతులు, పట్నం ఫిల్మ్స్ ని ప్రదర్శించారు. ఆనాటి కార్యక్రమానికి డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా, కామారెడ్డి శంకర్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులు హాజరయ్యారు. అదే కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక వేదికను కూడా ఏర్పాటు చేసాము.‘యవనిక’ పేర ఏర్పాటయిన ఆ వేదిక ద్వారా తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ని సేకరించాలని, ఫిల్మ్ మేకర్స్ ని ఒకే వేదిక మీదికి తేవాలని ఆలోచన చేశాం. తర్వాతి కాలంలో యవనిక ఏదో కొంత కృషి చేసినప్పటికీ అనుకున్న రీతిలో కొనసాగించలేక పోయాం. నేనేమో యవనిక పేర సమాంత సినిమాల పైన సమీక్షలు, పరిచయాలు చేసి నా యూ ట్యూబ్ చానల్ Aksharala Thera By Varala Anand లో ప్రెసెంట్ చేశాను.

అన్వేష్ డాక్యుమెంటరీల ప్రస్థానం ఆ విధంగా మొదలయింది. కానీ సినిమాటోగ్రఫీ లో గొప్ప ఇన్సిట్యూట్ లో చదవితే కానీ ఫలితం వుండదన్నాను. దానికోసం అన్వేష్ మొదట హైదరబాద్ లోని శ్రీ వాణి గారి కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కోల్కట్టా లోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశానికి ఎంట్రన్స్ రాశాడు. రెండింటిలోనూ ప్రథముడిగా నిలిచి సీటు పొందాడు. మిత్రుల సూచన మేరకు కోల్కట్టా లో చేరాడు. ఆ వివరాలు మళ్ళీ రాస్తాను.

ఇక నా ‘మనిషి లోపల’ కవితా సంకలనాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే పనిని ఆత్మీయురాలు బొడ్ల అనురాధ చేపట్టారు. విజయవంతంగా SIGNATURE OF LOVE పేర పుస్తకం తెచ్చారు. ఆవివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

+++++++++

వారాల ఆనంద్

17 మార్చ్ 2024          

YADONKI BARATH 2 SERIES,No-9

Posted on

యాదోంకీ బారాత్

2 సిరీస్- నంబర్- 9  

+++++++++++++++ వారాల ఆనంద్

ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో\

నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/

స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ  ఆత్మగలవాడు/ ప్రేమ సంతకం చేసిపోవచ్చు         

ఈ కవిత నా ‘మనిషి లోపల’ కవితా సంకలనంలో రాసుకున్నాను. అవును ఎవరమయినా మనసు ఆంటెన్నాను తెరిచి వుంచితే మంచిది. కానీ ఇవ్వాళ ఆన్టెన్నా ల కాలం పోయింది. ఇప్పుడంతా చుట్టూరా అలుముకుని పరుచుకున్న ‘వై వై’.  దానికి కూడా మన లోపలి రిసీవర్ సిద్దంగా వుండాలి. అప్పుడే దేన్ననయినా స్వీకరించేందుకు మనం సిద్దంగా వుంటాం. ఓపెన్ నెస్ ని అందిపుచ్చుకుని ఈ మొత్తం సాంకేతికత సంక్లిష్టతల నేపధ్యంలో నేను నా రొటీన్ కార్యక్రమాలల్లో చేరిపోయాను. కాలేజీలో ఆక్టివ్ గా వుంటూనే సినిమాల మీద ముఖ్యంగా తెలంగాణ సినిమాల మీద వ్యాసాలు రాయడం విస్తృత పరిచాను. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాస్తూ పోయాను. ఇక నా ఆరోగ్యం కొంత మెరుగు పడింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు క్రెయాటిన్ లాంటి అనేక పరీక్షలు చేయించుకుంటూనే నెఫ్రాలజిస్ట్ ను కలవడం తప్పలేదు. నా మట్టుకు నాకు డాక్టర్ గందే శ్రీధర్ హైదరాబాద్ నుండి ప్రతి బుధవారం కరీంనగర్ కు విజిటింగ్ రావడం ఎంతో ఉపయోగపడింది. లేకుంటే ప్రతి సారీ హైదరబాద్ వెళ్లాల్సిన పని బడేది. డాక్టర్ శ్రీధర్ సివిల్ ఆసుపత్రి రోడ్డులోని న్యూ శ్రీనివాస మెడికల్స్ ఆవరణలోని క్లినిక్ కి వస్తాడు. జిల్లాలోని అనేక మందికి ఆయన సేవలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ఇక కరీంనగర్లో  వైద్య సదుపాయాల పరిస్తితి చూస్తే అప్పటిదాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఫిజిషియన్స్, సర్జన్స్ అందుబాటులో వుండేవాళ్లు. కానీ ఎప్పుడయితే ‘ప్రతిమ’,’ చలిమెడ ఆనందరావు’ పేర్లతో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయో అప్పటినుండి అత్యున్నత స్థాయి డీ.ఎం. లు అందుబాటులోకి వచ్చారు. దాదాపు అన్నీ విభాగాల్లో యువ వైద్యులు వచ్చారు. కొంత ఖర్చయినా ఉత్తమ వైద్య సేవలు లభించడంతో ఒకరకంగా మంచే జరిగింది.

అట్లా నేను వారం వారం వైద్య పరీక్షలు నెలకో సారి డాక్టర్ విజిట్ కి వెళ్ళడం సాగుతూనే వుంది. పరిస్తితి మెరుగ్గా వుండడంతో రాయడం, కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తూనే వచ్చాను. కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి కూడా ఆక్టివ్ గా వుండడంతో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ సినిమా ఎదగాలని, అది తన స్వీయ గొంతుకతో పలకాలని తపిస్తూ అనేక సూచనలు చేస్తూ వ్యాసాలు రాశాను. అదే సమయంలో కాలేజీలో 26 మే 2015 రోజున ‘తెలంగాణ సినిమా దశ దిశ’ పేర సదస్సు నిర్వహించాను. దానికి మేయర్ శ్రీ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల్లో సినిమా చైతన్యం పెరిగేందుకు దోహదం చేసింది. ఆ తర్వాతి కాలంలో ‘తెలంగాణ సినిమా-దశ దిశ’ పేర పూర్తి స్థాయి పుస్తకమే తెచ్చాను. ఇక మా కాలేజీలోనే ‘తెలంగాణ కళ-పేరిణి నృత్యం’ మీద పక్షం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాము. దానికి మా కొలీగ్ శ్రీమతి ఎలిజబెత్ రాణి పూర్తిగా సహకరించారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేరిణి మీద మా అబ్బాయి అన్వేష్ మంచి ఫోటో షూట్ చేశాడు. డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేశాం కానీ పేరిణి లో ప్రముఖుడయిన ఓ కళాకారుడి అభ్యంతరాలు వాద వివాదాల నడుమ ఆ డాక్యుమెంటరీ ప్రయత్నం నిలిచిపోయింది. నేనూ అన్వేష్ బాగా నిరుత్సాహపడ్డాం. ఇట్లా పలు కార్యక్రమాల్లో బిజీ వుంటూ అత్యంత మామూలుగా వున్నాను.అప్పుడే ప్రముఖ తెలంగాణ సినీ కథానాయకుడు టి.ఎల్.కాంతారావు జయంతి ఉత్సవాన్ని16 నవంబర్ 2015 రోజున

 శ్రీ సి.వి.ఎల్.నరసింహా రావు నిర్వహిస్తే హైదరాబాద్ వెళ్ళి వచ్చాం. సభ బాగా జరిగింది. సీవీల్ గారి దీక్ష చాలా గొప్పది.

….

ఇదంతా ఇట్లా జరుగుతుండగానే మళ్ళీ ఒకసారి అనారోగ్య బాంబు పేలింది. ఒక ఆదివారం రోజున నా పెదవి కింద కట్ అయిన విషయం గమనించిన ఇందిర అదేమిటి అంది. ఏదో షేవింగ్ లో కట్ అయివుంటుంది అని తేలిగ్గా తీసేశాను. అది కాస్తా మర్నాటికి ముక్కు పక్కకు చేరింది. ఇందిర కంగారు పడింది. నీకన్నీ అనుమానాలే అంటూ బుధవారం డాక్టర్ దగ్గరికి వెళ్దాం లే అన్నాను. అనుకున్నట్టుగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి ఆనంద్ ఎట్లా వున్నారు అని ఆయన అడుగుతూ వుండగానే ఇందిర కట్ అయిన విషయం చెప్పింది. ఆయన అదేమీ వినకుండానే సీరియస్ గా ఫేస్ మాస్క్ తీయించి మొత్తం ముక్కు పక్కనుంచి ముఖమంతా పరిశీలించారు. ఆనంద్ మీరు వెంటనే హైదరాబాద్ బయలుదేరండి. నేను హాస్పిటల్ కి ఫోన్ చేస్తాను వెంటనే అడ్మిట్ కండి అన్నాడు. నాకేటూ పాలు పోలేదు. ఏమయింది సార్ అన్నాను. నేను చెబుతున్నాను కదా వెంటనే బయలుదేరండి అన్నారాయన. మేము బయటకొచ్చి అప్పటికి సాయంత్రం ఆరు దాటుతున్నది అప్పటికప్పుడు వెల్లడమెట్లా అనుకున్నాం. మెడికల్ షాప్ ముందు కూర్చుని కొంత సేపు తర్జన భర్జన పడ్డాం. ఇందిరకు ఒకటే కంగారు ఆందోళన. మళ్ళీ లోనికి వెళ్ళి డాక్టర్ణి కలిసి రేపుదయం వస్తామన్నాము. అదేమీ నాకు తెలీదు మీరు రేపుదయం 5 గంటలక్ల్లా అడ్మిట్ కావాలి మరి అన్నాడు. ఇంటికి వచ్చి ఏవో కొన్ని సర్దుకుని అర్ధరాత్రి బయలుదేరాము. గ్లోబల్ లో అడ్మిట్ అయ్యాను. వెంట వెంటనే రక్త పరీక్షలు అవీ చేశారు. అడిగితే బ్లడ్ బాంబే పంపిస్తున్నాం. రిపోర్ట్ రావడానికి రెండు రోజులు పట్టొచ్చు అన్నాడు టెక్నీసియన్. కొంత సేపటికి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రమాశంకర్, డాక్టర్ రఘు అంతా వచ్చేశారు. ఆనంద్ రిపోర్ట్ రావడం లేట్ అవుతుంది ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు. అసలు ఇంతకూ ఏమయింది సార్ అని అడిగాను. ఏమీ లేదు సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ వుంది. అయిదు రోజుల పాటు అయిదు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఒక్కొక్కటి డ్రాప్ బై డ్రాప్ 7 గంటలు తీసుకుంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ముప్పై అయిదు వేలు వుంటుంది అన్నారు. డబ్బు సరే విషయం అంత ప్రమాదకరమా అన్నాను. అవును అన్నారు. రిపోర్ట్ కోసం వేచి చూసే సమయం కూడా లేదు ట్రీట్ మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు శ్రీధర్. నేను బదులిచ్చే లోపలే మీరేట్లా అనుకుంటే అట్లా చేయండి సర్ అంది ఇందిర. ఐవీ ఇంజెక్షన్ మొదలయింది. ఐసీయు లో వుంచారు. టోటల్ కంటోల్డ్ వాతావరణం. అప్పుడు డాక్టర్ రమాశంకర్ వచ్చి పక్కన కూర్చుని ఆనంద్ గారు ఇది మీ ట్రాన్స్ ప్లాంట్ కంటే సీరియస్ స్థితి. బయటకేమీ కనిపించదు కానీ ప్రమాదం. మీరు వెంటనే కరీంనగర్ లో శ్రీధర్ ని కలవడం మంచిది అయింది. ఆయన కూడా వెంటనే స్పందించాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. అయిదు ఇంజెక్షన్స్ తర్వాత మీ ఇమ్యూనిటీ, ఎనర్జీ మొత్తం జెరో కి వస్తుంది. కొద్ది రోజులు కదలడం కూడా కష్టం అవుతుంది. మీకు మీరు కప్ పట్టుకుని టీ తాగలేరు, షర్ట్ కూడా వేసుకోలేరు. ఆ స్థితిలో చాలా జాగ్రత్తగా వుండాలి. ప్రోటీస్ డోస్, సప్లిమెంట్స్ ఇస్తాం కానీ సమయం పడుతుంది అన్నారు. అప్పటికి కానీ మాకు అసలు స్థితి అర్థం కాలేదు. ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ అప్పుడు కూడా ఇందిర కళ్ళల్లో నీళ్ళు చూడలేదు. కానీ ఇప్పుడు కళ్ళు వొత్తుకోవడం గమనించాను. ఏమీ కాదు లేవోయి అంటున్నాను నేను. బాంబే రిపోర్ట్ శ్రీధర్ గారు వూహించినట్టే వచ్చింది. అప్పటికే ట్రీట్మెంట్ మొదలయింది. మూడో రోజుకి మెడిసినల్ ప్రభావం మొదలయింది. నాలో బలహీనత పుంజుకుంది. క్రమంగా సత్తువ కోల్పోసాగాను. మాట బాగానే వుంది. ఇందిరనే తినిపించడంతో సహా అన్నీ పనుల్లో సాయం చేయసాగింది. బాప్ రే. హింస అంటే ఇది కదా అనిపించింది. నా పరిస్తితి గమనించిన ఇందిర డాక్టర్ శ్రీధర్ తో మాట్లాడుతూ ఇంకా ఎవరయినా సీనియర్. మీ ప్రొఫెసర్స్ ని సంప్రదించండి అంది. మీరెక్కడికయినా వెళ్ళండి నేను మాట్లాడతాను అన్నారు శ్రీధర్. లేదు లేదు మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకట్లా అనిపించింది అంది ఇందిర. మర్నాడుదయమే ఓ సీనియర్ నేప్రాలజీ ప్రొఫెసర్ ని పిలిపించారు. ఆయన చూసి ఎవ్రీ థింగ్ ఇస్ ఆన్ గుడ్ లైన్స్ అని వెళ్లారు. ఇన్ని ట్రాన్స్ ప్లాంట్స్ చూసాము మీది పెక్యులియర్ అన్నారు. అవును మరి ఆనంద్ అంటే మజాకా  పెక్యులియరే మరి అని నేనూ ఇందిరా నవ్వుకున్నాము. డాక్టర్స్ చర్చించుకుని ఏవో నిర్ణయాలు తీసుకున్నారు. 

హైదరబాద్ ఆసుపత్రిలో వుండడం ఏదో ఒకరోజు మాత్రమే అనుకున్నాం. వెంట బట్టలు అవీ ఏమీ లేవు. ఖైరతాబాద్ లో మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందిర వాషింగ్ పని ముగించుకు వచ్చింది. అయిదు రోజుల మెడికల్ డోసేజీ అయిపోయాక డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి ఒకే కరీంనగర్ వెళ్లమన్నారు. కానీ మూడు నెలలు సెలవు పెట్టండి. ఇంట్లోంచి బయటకు పోవద్దు. సాధ్యమయినంత మేర ఎవరినీ దగ్గరకు రానివ్వవద్దు అన్నారు. క్రమంగా కోలుకుంటారు అని కూడా అన్నారు. దాదాపు స్టేచ్చర్ పైననే బయటకు వచ్చి కారులో కరీంనగర్ చేరుకున్నాం. ఏముందిక 100 శాతం రెస్ట్. కదలడం కష్టం. ఆ కాలం ఎట్లా గడిచిందో ఇప్పుడు వూహించుకుంటే భయమేస్తుంది. న్యూస్ పేపర్ చదవలేను, స్వంతంగా స్నానం చేయలేను, నా కిష్టమయిన టీ నాకు నేను తాగలేను అబ్బో అదంతా పెద్ద నరకం. భరించాం తప్పదు కదా. మొత్తం మీద ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా సోకిందో తెలీదు కానీ సరయిన సమయానికి శ్రీధర్ గారిని కలవడం ఆయన వెంటనే స్పందించి, రోగ నిర్ధారణ చేయడంతో బయటపడ్డాను.  

మిగతా వివరాలతో మళ్ళీ వారం…

-వారాల ఆనంద్

10 మార్చ్ 2024

SRIBHASHYAM VIJAYASARATHI

Posted on

మిత్రులారా! సాహితీస్రవంతి కార్యక్రమంలో ఈ వారం సంస్కృత కవి పండితుడు శ్రీ శ్రీభాష్యం విజయసారధి గారి గురించి నా PODCAST వినండి. లింక్ క్లిక్ చేసి చూడండి -వారాల ఆనంద్, 9 మార్చ్ 2024

‘A POEM A DAY’ 28 FEB 2024

Posted on

‘A POEM A DAY’
28 FEB 2024

‘A POEM A DAY’ 27 FEB 2024

Posted on

‘A POEM A DAY’
27 FEB 2024

GULZAR ARTICLE ANDHRA PRABHA

Posted on

 కవిత్వంలో ప్రతీకలు మనసు తట్టి చేయి పట్టుకు నడిపిస్తాయి

++++++++++++++++++ వారాల ఆనంద్ 

 ఒక కవిని గతంలో చదివినప్పటికీ ఆ కవిని మళ్ళీ మళ్ళీ  చదవడం గొప్ప అనుభవం. “REVISITING ALWAYS REJUNAVATES “. ఒక కవిని లేదా ఒక కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి.కొత్త భావాలు ధ్వనిస్తాయి.సరికొత్త అనుభవాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కవి సరికొత్తగా దర్శనమిస్తాడు. ప్రేమగా ఆసక్తిగా వింటే ’Between the lines’ లోంచి ఆ కవి మనతో మరింత ఆర్తిగా, వేదనగా, సంతోషంగా మాట్లాడతాడు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజనకారుడు మనముందు ఆవిష్కృత మవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. ఎప్పుడూ ఇష్టంగా చదువుతూ వుండే గుల్జార్ ని ఆయనకు ‘జ్ఞాన్ పీఠ్’ ప్రకటించిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదవడం సరికొత్త అనుభవమే. గుల్జార్ కవిత్వాన్నీ వచనాన్నీ మొత్తంగా ఆయన సృజనని చదవడంలో అందుకున్న ఆనందం రెట్టింపులు అయింది.  

ఆయన కవిత్వం తాను  పాఠకుడితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ కవిత్వం నిండా ప్రతీకలు (ఇమేజేశ్) పరుచుకుని వుంటాయి. సాధారణంగా ఎప్పుడూ మనం చూసే చిత్రాల్ని, దృశ్యాలనే ప్రతీకలుగా చేసుకుని అతి సున్నితమయిన అంశాల్ని కవిత్వం చేస్తాడు. ఆయన కవితల నిండా మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం కనిపిస్తాయి. ఇట్లా గుల్జార్ కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి చదువుతూ వుంటే అనేక కోణాల్లో గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశమూ లభించిది. ఓ గొప్ప కవిని తిరిగి దర్శించడం అంటే ఇదేనేమో.

     భారత దేశభజనలో జరిగిన హింసకు గురయిన కుటుంబం ఆయనది. పాకిస్తాన్ నుంచి సరిహద్దును దాటి ఈ పక్కకు వచ్చారు. అప్పుడు జరిగిన దుర్మార్గాలను స్వయంగా చూసిన గుల్జార్ ఆనాటి అనుభవాల్ని కవితలుగా కథలుగా రాశారు… ’ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్’ పుస్తకంగా వచ్చింది.

“అది ఇప్పటికీ నా మాతృభూమే

కానీ ఇకపై ఎప్పటికీ నా దేశం కాదు

అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల్లోని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరగాలి

నా కలలకు ఆధారాల్ని చూపుతూ

నా ముఖం మీద ముద్రలు వేయించుకోవాలి” 

అంతేకాదు ‘నెగ్లెక్టెడ్ పోయెమ్స్’ లో

‘కళ్ళకు వీసా అవసరం లేదు

కలలకు సరిహద్దులు లేవు

నేను నా కళ్లను మూసుకుని

సరిహద్దును దాటి వెళ్తాను

మెహెంది హాసన్ ని కలవడానికి’ అంటూ తన వేదనని చెబుతాడు. 

     కవిగా రచయితగా గుల్జార్ అనేక భిన్నమయిన వైవిధ్యమయిన ప్రక్రియల్లో రాశారు. విభిన్న కళారూపాల్లో కృషి చేశారు. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా దృశ్య మాధ్యమంలో, సినీ గేయరచయితగా సంగీత ప్రపంచంలో గుల్జార్ ఆవిష్కరించిన కళాత్మకత ఎంతో విశాలమయింది, విలక్ష్ణమయింది. అయితే “ఎన్ని రూపాల్లో తన భావాల్ని వ్యక్తం చేసినప్పటికీ తనకు  ‘అక్షరమే’ ఆలంబన అని, రచనే తన మౌలిక వ్యక్తీకరణ రూపమని” ఆయన అంటారు. సాహిత్యం విషయానికి వస్తే ఆయన కవిత్వం, కథలు, జ్ణాపకాలు, పిల్లలకోసం కథలు పాటలు, కవితానువాదాలు, త్రివేణి పేర మూడు లైన్ల చిన్న కవితలు, ‘టూ’ పేర ఒక ఇంగ్లీష్ నవల, కామిక్స్ , ‘చక్కర్ చలాయే ఘన్ చక్కర్’ నాటకం, ఇట్లా అనేక ప్రక్రియల్లో రాసారు.  ఆయన ప్రధానంగా ఉర్దూ లో రాస్తారు. ఉర్దూ ఎంతమంది చదువుతున్నారు అది అంతరించి పోతున్న భాష అని ఎవరయినా అంటే గుల్జార్ అందుకు అంగీకరించడు. భాష ఎప్పటికీ అంతం కాదు. లిపి మారితే మారొచ్చు. కానీ భాష కు మరణం లేదు అంటాడాయన, మన దేశంలో పంజాబీ భాషను ఇప్పుడు గుర్ముఖీ లిపిలో రాస్తున్నారు, అదే పాకిస్తాన్లో వున్న పంజాబ్ లో ఉర్దూ లో రాస్తారు అంటాడాయన, మన దేశంలో ఉర్దూ పార్శీ ప్రభావంతోనూ, హిందీ సంస్కృత ప్రభావంతోనూ వుంది. కానీ ఇప్పుడు హిందీ ఉర్దూ ల్లో పెద్ద తేడా లేదు. సినిమాల్లో చూసినా బయట చూసినా వాడే హిందీలో అధిక శాతం ఉర్దూ మాటలే.  అందుకే మనం దాన్ని హిందూస్థానీ అనాలి అంటాడు గుల్జార్. అయితే ఆయన రచనలు ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, బ్రిజ్, ఖరీబౌలి, హర్యాన్వి, మార్వారి భాషల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందాయి.గుల్జార్ తన సృజాత్మక వ్యక్తీకరణల్లో ఇంత వైవిధ్యాన్ని విలక్షణతను సాధించడానికి ఆయన తన 90 ఏండ్ల వయసులో కూడా తనలోని సున్నితత్వాన్ని పోగొట్టుకోక పోవడమే ప్రధాన కారణం. ఆయన ఇప్పటికీ క్రమం తప్పకుండా, క్షణం వృధా చేయకుండా చదువుతూనో రాస్తూనో మాట్లాడుతూనో వుంటారు. అదే ఆయన బలం. మరో వైపు చూస్తే గుల్జార్ తన రచనల్లో వివిధ భారతీయ, భారతీయేతర భాషల్ని, ఆయా భాషల్లోని మాండలికాల్ని, జాతీయాల్ని ఆలవోకగా ఉపయోగిస్తాడు. దానికి ఆయన చేసే వివిధ భాషల అధ్యయనమే ప్రధానమయిన భూమిక. గుల్జార్ రాసిన తొలి సినిమా పాట ‘బందిని’ లోని మేర గోరా అంగ్ లయ్లే.. పాట పూర్తిగా అవధ్. ఇక ఆయనకు ఆస్కార్ తెచ్చిన ‘జయ్ హొ.’లో పంజాబీ తో పాటు కొంత స్పానిష్ కూడా ధ్వనిస్తుంది. ఇక ఆయన కవిత్వంలో ఆయన పలికించే ప్రతీకలు ప్రధాన బలం. గుల్జార్ కవితలు, గజల్స్ లో జానపదుల ఒరవడి, అమీర్ ఖౌస్రో, గాలిబ్, బాబా బుల్లే షా లాంటి కవుల అధ్యయన  ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచనల్లోని మరో ముఖ్యాంశం ఆయన కవిత్వంలోనూ జీవితంలోనూ వున్న ‘డౌన్ టు ఎర్త్, డౌన్ టు హార్ట్’ లక్షణం.అది ఎళ్ళ వేళల్లా ఆయన రచనల్లో ధ్వనిస్తూనే వుంటుంది. ‘కబీ రూహ్ దేఖీ హై.. ‘  అని ఆయన అన్నప్పుడు గుల్జార్ లోని తాత్వికత ఆవిష్కృతమవుతుంది.

చాలా విస్తృతంగా రాసిన  గుల్జార్ కవితా సంకలనాల వివరాల్లోకి వెళ్తే ఆయన రచనల్లో ప్రధానమయినవి సెలెక్టెడ్ పోయెమ్స్, నేగ్లెక్టెడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్, సైలెన్సెస్, ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్, ప్లూటో, ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇటీవలే గుల్జార్ కవిత్వం లోంచి సేకరించిన కవితలతో కూడిన సమగ్ర సంకలనం ‘బాలో-పార్:..కలెక్టెడ్ పోయెమ్స్” వెలువడింది. రక్షందా జలీల్ ఆ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. మొత్తం 1400 పేజీల ఈ సంకలనంలో గుల్జార్ మూల కవితలు వాటి అనువాదాలతో కూడిన ఈ సంకలనంలో చాంద్ పుఖ్ రాజ్ కా, రాత్ పాశ్మీనేకీ, పంద్రా పాచ్ పచత్తర్, కూచ్ ఔర్ నజ్మే, ప్లూటో, త్రివేణి సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి.

++++

గుల్జార్ కవిత్వాన్ని గురించి మరింతగా చెప్పుకుంటే ఆయన ‘ఆకుపచ్చ కవితలు’తో సహా గొప్ప భావుకుడయిన ఆయన సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్‌ వుంటుంది. ఇక ఆయన భాష,,రచనా శైలి కూడా చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వం చదువుతూ వుంటే ఆయన వాడిన  ఇమేజెస్‌లో వున్న ఒక తాజాదనం మనల్ని కదిలిస్తుంది. పాఠకుడి మనసు కదిలిపోతుంది.

ఈ కవిత చూడండి…

‘గగన సీమలో ఆకాశం

అతుకులు అతుకులుగా విడిపోతున్నది,

ఎన్ని ప్రాంతాల్నుంచి

ఈ గుడారం విడిపోతున్నదో

నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ

మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం పాఠకుడిపై గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది..

ఇంకో కవిత:

‘భయపడకు నేనున్నాను

భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు

చెట్టుకు ధైర్యాన్నిస్తూ

చెబుతూనే వుంది’

ఎంత నిబ్బరమయిన మాట’

ఇక ఆయనే రాసిన మరో  కవిత…

మబ్బు-

నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి

నా కిటికీని తాకింది

అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా

బయటంతా  చీకటి

లేచి వెళ్ళి బయట వర్షాన్ని

పలకరించే సమయం కాదిది

కెటికీ పరదాల్ని వేశాను

అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి

తడి తడి చేసింది

నా హాస్య చతురత మూగవోయింది

లేచి కిటికీల్ని దడాల్న మూసేశా

తిరిగి ముసుగేసుకొని పడకేసా

మనస్తాపం చెందిన వాన కోపంతో

కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది

మళ్ళీ తిరిగి రాలేదు

కిటికీ అద్దం పగుళ్లు మాత్రం

అట్లాగే వుండిపోయాయి

** * ఎంత భావుకతో కదా

ఇక మరో కవిత ఇట్లా సాగుతుంది

           —

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు

‘రాత్రులు’

దాడి చేయడానికి సిద్ధపడ్డాయి

అది ఓ సాలెగూడు

చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ

అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి

అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది  

అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు

మరింత భయంతో వణుకొస్తుంది  

‘జాతి’

కొందరి పదఘట్టనల క్రింద

నలిగిపోతున్నది

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మరోసారి మెడలు వంచబడ్డాయి

తలలు తెగి రాలిపడ్డాయి

ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా

విభజించబడ్డారు  

ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది

ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది

కొందరు చాలాసార్లు  నన్ను

మంచెకు వేలాడదీసారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

*********************

పర్యావరణం గురించి అధికంగా మదన పడే గుల్జార్ రాసిన ఈ కవితను చూడండి

“ దళిత మొక్క”

ఈ అడవి మొక్కల కొమ్మల మీద

ఏవో కొన్ని పదాలు కనిపిస్తాయి

పూర్తి కవిత అయితే కాదు

భూమి పొరల్ని చీల్చుకుని బలంగా నిలబడడానికి

ఈ మొక్కల కెప్పుడూ పోషకాలుండవు

వాటికి పూల కుండీలుండవు

వేర్లకు పోషకాలు లభించడానికి

అవి రోడ్లపైకి విసిరేయబడతాయి

దుమ్ములో ఆకలితో ధర్మంతో బతుకుతాయి

కొన్ని సార్లు మరిన్ని చేట్లేమో

బురద నీటిలోకి ఊడ్చేయబడతాయి 

ఆ బురద నీటిలోనే మురికి మట్టిలోనే

ఎదగడం మొదలెడతాయి

మళ్ళీ ఇంకో రోడ్డు మళ్ళీ ఇంకో తన్ను

ఇంకో దళిత మొక్క

 **** మొక్క గురించి చెబుతున్నట్టే వున్నా దళిత మొక్కను ప్రతీకగా చేసి మొత్తం కవిత కోణాన్నే మార్చేశాడు.

కవిత్వం సంగతి ఇట్లా వుంటే వచనం విషయంలో కూడా కథలు, ఒక నవల, ఒక నాటకం రాసిన గుల్జార్ తన జ్ఞాపకాల్నీ రాశాడు. అవి పుస్తకంగా వచ్చాయి.

ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR (నిజంగా.. వాళ్ళని నేను కలిసాను- ఓ జ్ఞాపకం = గుల్జార్ ) ఇవన్నీ అద్భుతమయిన జ్ఞాపకాలు. ఏకబిగిన చదివిస్తాయి. గుల్జార్ తన ఇన్నేళ్ళ జీవితంలో ఎంతో మందిని కలిసాడు. కవులు, రచయితలు,దర్శకులు, నటీనటులు, గాయకులూ, సంగీత దర్శకులు వొహ్ గొప్ప జ్ఞాపకాలు, మరెన్నోగొప్ప అనుభవాలు. ఈ పుస్తకంలో తాను తన నిత్య జీవితంలో కలిసిన వాళ్ళ గురించి ప్రస్తావించారు. తన వృత్తి జీవితంలో తాను కలిసి పనిచేసిన వారి గురించీ  రాసారు, అంతే కాదు తన పై వాళ్ళ ప్రభావాన్ని కూడా గుల్జార్ ఈ పుస్తకం లో సవివరంగా చెప్పారు. పుస్తకం శీర్షిక “నిజంగా.. వాళ్ళని నేను కలిసాను”లో నిజంగా అనడంలోనే గుల్జార్ కవితాత్మ కనిపిస్తున్నది. వాళ్ళని ఊరికే కలిసాను అని కాకుండా  నిజంగా కలిసాను అంటే మనసు లోతుల్లోంచి కలిసి రాసాను అంటున్నాడు గుల్జార్. ఇదొక మంచి జ్ఞాపకాల తోరణం.

నిజానికి ఇది గుల్జార్ జీవిత చరిత్ర కాదు, ఎందుకంటే జీవితచరిత్ర రచనకు, జ్ఞాపకాలకు తేడా వుంటుంది. జీవితచరిత్రలో సమగ్ర జీవితం వుంటే జ్ఞాపకాల్లో కొన్ని ముఖ్యమయిన సందర్భాలు సంఘటనలు వుంటాయి. ఈ పుస్తకం నిండా జ్ఞాపకాలున్నాయి.

++++++++

నిజానికి మనిషి జీవితంలో జ్ఞాపకాలు మరుగున పడవు. చేతనా అంతఃచేతనల్లో ఎక్కడో ఒక చోట సజీవంగా నిక్షిప్తమయ్యే వుంటాయి. అందునా కవీ కళాకారుడి జీవితాల్లో జ్ఞాపకాలు హృద్యంగానూ సాంద్రంగానూ వుంటాయి. కావలసిందల్లా ఆ జ్ఞాపకాలని రాయాలనుకున్నప్పుడు మనసు, ఆలోచనలు తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలాన్ని పునర్ దర్శించాలి. వున్నది వున్నట్టు కల్పనారహితంగా రచన లో ప్రబిబింప జేయాలి. అప్పుడే ఆ జ్ఞాపకాలకు సాహిత్యంలో స్థానంతో పాటు గౌరవమూ లభిస్తాయి. ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR పుస్తకం అలాంటి గౌరవం ఇవ్వాల్సిన రచన. ఈ పుస్తకం ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. తొలుత బెంగాలీ పత్రిక ఆదివారం సంచిక కోసం గుల్జార్ ఇవి రాసారు. అవన్నీ కలిపి “పంటా భాటే” పేరున బంగాలీ లో పుస్తకంగా వచ్చింది. మహార్గ్య చక్రవర్తి ఇంగ్లీషులోకి చేసారు. పెన్గ్విన్ వాళ్ళు ప్రచురించారు.

…………. ఈ ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR  లో గుల్జార్ తన గురువు మెంటార్ అయిన బిమల్ రాయ్ నుంచి మొదలు పెట్టాడు. తాను తన మొదటి పాట కోసం బిమల్ రాయ్ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితుల్లో వెళ్లిందీ ఆసక్తికరంగా రాసాడు. అనేక సంఘటనలను కథాత్మకంగా రాసారు గుల్జార్. ఈ పుస్తకంలో బిమల్ రాయ్ తో మొదలయిన ఈ జ్ఞాపకాల పరంపర సంగీతదర్శకులు సలిల్ చౌదరి, హేమంత్ కుమార్, ఆర్ డీ బర్మన్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ కుమార్, గాయకుడు కిషోర్ కుమార్, సంజీవ్ కుమార్, హ్రిషికేశ్ ముఖర్జీ, పండిట్ రవి శంకర్, భీంసేన్ జోషి, నటీమణులు సుచిత్ర సేన్, షర్మిళా టాగోర్, రచయిత్రి మహాశ్వేతా దేవి లాంటి అనేక మందితో తన పరిచయం, తనపై వారి ప్రభావం రాసారు. గుల్జార్ రాసిన విధానం మనతో మాట్లాడుతున్నట్టు వుండి చక చకా చదివిస్తుంది. అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పినట్టు అనిపిస్తుంది.

అట్లా కవిత్వమే కాదు వచనంలో కూడా గుల్జార్ పాఠకులని చేయి పట్టుకుని తన వెంట తీసుకెళ్తాడు, పాఠకుని చేయిపట్టుకుని వెంట నడుస్తాడు.

 అనేక సృజన రూపాలు, అనేక రచనలు, సినిమాలు, పాటలు, పిల్లల కథలు పిల్లల పాటలు ఎన్నో ఎన్నెన్నో గుల్జార్ కలం నుండి వెలువడ్డాయి.  ఆయన్ని ఎంత చదివితే అంతగా సున్నితమయిపోతుంది పాఠకుడి మనసు. ఆయన సాహిత్యమే కాదు ‘ఖోశిష్’ లాంటి ఆయన సినిమాలూ అంతే. 

ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం రావడం అభినందనీయం. గుల్జార్ తో ఆ పురస్కారానికీ  గౌరవం పెరిగింది.

+++++++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

9440501281

GULZAR ARTICLE NAVA TELANGANA

Posted on

కవిత్వం సినిమాలు ఆయనకు రెండు కళ్ళు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘మొర గోరా రంగ్ లైలే..’ అంటూ మొట్టమొదటిసారిగా బిమల్ రాయ్ సినిమాకు రాసినా..

‘మైనే తెరెలియే హి సాత్ రంగ్ కె సప్నే చునే’  అంటూ ఆనంద్ లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..

‘ముసాఫిర్ హో…యారో .. నా ఘర్ హై నా టిఖానా … ‘

అంటూ పరిచయ్ లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్న్తాడుగుల్జార్.  

‘దిల్ హూం హూం కరే ఘబ్ రాయే.’ అని రుడాలి లో వేదన పడ్డా

‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా  హై..’ అంటూ ఇజాజత్ లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దుఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్ లో రాసినా

వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంధ్రత గుల్జార్ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి  రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నోపాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.పాఠకుడి మనసుని తత్తెస్థాయి.  

ఇక సంభాషణల విషయానికి వస్తే

‘బాబూమొషై జిందగీ బడీ హోనీ చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’

‘మౌత్ తో ఏక్ పల్ హయ్,

(జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలో గుల్జార్ రాశారు.అట్లా ఆయన పాటలు సంభాషణలే కాదు గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్. సినిమా రంగంలో విశేషమయిన్ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు సత్కారాలు లభిచాయి. ఆస్కార్, గ్రామీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి. బహుశా ఆయన అందుకోని అవార్డు లేదు. కానీ సాహిత్యం లో ఆయనకు వచ్చిన ‘జ్ఞానపీఠ పురస్కారం ప్రత్యేకమయింది. ఎందుకంటే ఆయనే అనేక చోట్ల చెప్పుకున్నట్టు సాహిత్యమే తన నిజమయిన వ్యక్తీకరణ రూపం. సినిమా కూడా సృజనాత్మక కళ నే. కానీ అది రచయిత, దర్శకుడు, నటుల సమిష్టి కృషి. సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగతమయిన వ్యక్తీకరణ. అందులో ఇతరుల ప్రమేయం వుండదు. కవీ రచయిత తన భావాలకు తానే రూపం కల్పిస్తాడు. అందుకే సాహిత్య సృజనలో స్వేచ్చ వుంటుంది. అందుకే సాహిత్యంలో తనకు వచ్చిన ‘జ్ఞానపీఠ్’ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారాయన. 

‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు,అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని  అందరికీ  చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్.   

అంతే కాదు కవిత్వం ఎట్లా రాస్తారు అని అడిగితే ‘సాహిత్య సృజన చేయడానికి నువ్వు ‘గుహ’లో నివసించాలి, ఆ గుహ మరేదో కాదు అది నువ్వే’ అంటాడాయన.  

కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్.

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది.అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జణ్యాలు, పడ్డ వేదన దుఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది. ఏం.హెచ్.సత్యు ‘ఘరమ్ హవా’ లాంటి సినిమాలు తెస్తే గుల్జార్ కవిత్వమూ కథలూ రాశాడు.

  ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్ మాచ్ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్ రాయ్ ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎవో  పొరపొచ్చాలు రావడంతో ఆ ఇద్దరూ కలిసి పని చేసే స్థితి లేకపోయింది. దాంతో శైలేంద్ర గుల్జార్ ని తక్షణమే వెళ్ళి బిమల్దాను కలవమని సూచించాడు. మిత్రుడు ఆసీత్ సేన్ తోకలిసి వెళ్ళి కలిశాడు. ‘ఇతను విషయాన్ని అర్థం చేసుకుని పాట రాయగలడా అని సేన్ ను బెంగాలీలో అడిగాడు’ అప్పుడు సేన్ దాదా తనకు బెంగాలీ రాయడం చదవడం వచ్చు అనేసరికి  కంగారుపడ్డ బిమల్ రాయ్ సర్దుకుని పాట రాయమని ప్రోత్సాహించాడు. గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ దా  గుల్జార్ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దా కి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది.  సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్ కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్ కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

    టెలివిజన్ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్ గొప్పగా విజయవంతమయి కల్ట్ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

గుల్జార్ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘GREEN POEMS’ ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘SUSPECTED POEMS’ ని అనుమానిత కవితలు గా అనువదించారు.

గుల్జార్ కూడా అనేక అనువాదాలు చేశారు.‘ ఏ పోయేమ్ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు. వాటిల్లో వర్తమాన కవుల కవితల్నిచేర్చారు. పాఠశాల కళాశాల పాఠ్యపుస్తకాల్లో చదివే కవుల కవితలు కాకుండా ఇప్పుడు వర్తమాన సామాజిక స్థితిలో ఆధునిక కవులు రాస్తున్న కవితల్ని చేర్చారు.‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న విషయం అర్థం కావడానికి ఈ సంకలనం ఎంతో దోహద పడుతుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫిల్ హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ, చాపాక్, సామ్ బహదూర్ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘ బికాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ ఇప్పటికే పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

కవి, రచయిత,

GULZAR

Posted on

మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024

‘ఇరుగు పొరుగు’ సమీక్ష

Posted on

మిత్రులారా! నా అనువాద సంకలనం ‘ఇరుగు పొరుగు’ పైన ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో సమీక్ష చేశారు. చూడండి, సమీక్షకులు రామా చంద్రమౌళి గారికి, సంపాదకులకు కృతజ్ఞతలు- వారాల ఆనంద్,
25 ఫిబ్రవరి 2024

యాదోంకీ బారాత్ సిరీస్ 2, నంబర్7

Posted on

యాదోంకీ బారాత్

సిరీస్-2, నంబర్-7

+++++++++ వారాల ఆనంద్

బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం వుంది. అందుకే పరుగు ఛైతన్యవంతుడయిన మనిషి మనుగడలో ప్రధాన అంశం. కానీ నేనయితే నా ప్రమేయం లేకుండానే పరుగు లోంచి నిలకడలోకి రావాల్సే వచ్చింది. అప్పటిదాకా అర్థవంతమయిన సినిమాలు, కాంపస్ ఫిల్మ్ క్లబ్బులు, సెమినార్లు, ఫిలిమ్ ఫెస్టివల్స్, సాహిత్యం అంటూ పరుగులు పెడుతున్న నా పరుగును శారీరక అనారోగ్యం రెడ్ లైట్ చూపించి స్టాప్ అని నిలిపేసింది. బయట తిరగడాలు, ఆహారం తదితర విషయాల్లో అనేక నిబంధనలతో బతుకు కొత్తగా మొదలయింది.

హైదరబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతమయింది. తర్వాత వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు అక్కడే వున్నాను. నెల రోజూల పాటు వాళ్ళని క్రమం తప్పకుండా దర్శించుకున్నాను. ఇక సర్లే వెళ్ళండి అని వాళ్ళు పొమ్మన్నాక కరీంనగర్ బయలుదేరాను. పిల్లలిద్దరూ రేలా అన్వేష్ లు హాస్టళ్లలో చేరిపోయారు. నేనూ ఇందిరా ఇల్లు చేరుకున్నాం. మూడు నాలుగు నెలలు విడిచి వెళ్తే ఎట్లా వుంటుందో మా ఇల్లు సరిగ్గా అట్లే వుంది. నన్నేమో దుమ్ముకు దూళికి దూరంగా వుండమన్నారు. పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. అందుకే నేను వెళ్ళి పక్క పోర్షన్లో కూర్చున్నాను. రేల, శ్రీలత, అటెండర్ నాగరాజు ల సాయంతో ఇందిర ఇంటి పనిలో పడింది. మా పక్క పోర్షన్ లోకి దాదాపు 8 ఏళ్ల తర్వాత వెళ్ళాను. చందన, సంజీవరెడ్డి లు మా ఇంట్లో చేరింతర్వాత మా వాళ్లయిపోయారు. చందనయితే కూతురులాగే వుంటుంది. వాళ్ళ రెండో అబ్బాయి కుశ్లు మాయింట్లోనే పుట్టాడు. వాళ్ళతో మా అనుబంధం చాలా మంచి అనుబంధం. ఇల్లు శుభ్రం అవగానే నేనూ ఇందిర హమ్మయ్య మనింట్లోకి వచ్చాం. క్షేమంగా ఆరోగ్యంగా అనుకున్నాం.

నేను కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ఉత్సాహంగానే వున్నాను. నాకు నా కష్టాల గురించీ అనారోగ్యం గురించీ అందరితో అతిగా చెప్పాలనిపించదు. ఎట్లా వున్నావు అంటే ‘ఫైన్’ అంటాను. అంతేకాదు స్టేబుల్ అని కూడా అంటాను. ఎందుకో మరి కొందరయితే కనిపించగానే, ఎవరయినా పలకరించగానే చాలా కష్టంగా వుంది. అనారోగ్యం చాలా కష్ట పెడుతూ వుంది అంటూ అనేకం చెబుతారు. ఆరోగ్యమే కాదు మరెన్నో సమస్యల్ని ఏకరువు పెడతారు. అది వాళ్ళ అభీష్టమే కాదనలేను. కానీ నేనెందుకో అట్లా చెప్పడానికి సిద్దంగా వుండను. కష్టం వున్నది మనకొక్కరికే కాదు. సమాజంలో చాలామందికి చాలా రకాల కష్టాలున్నాయి అనేక ఇబ్బందులున్నాయి. ఆర్థికమూ, సామాజికమూ కూడా. వాటన్నింటితో పోలిస్తే మన అనారోగ్య సమస్య పెద్దదేమీ కాదు. మనదొక్కటే పెద్ద సమస్య అన్నట్టు దీనంగా వుండడం సరయింది కాదన్నది నా ఫీలింగ్. అది నాకు నాకు చేతకాదు. నా ఆరోగ్యం విషయం ఎవరు తీసినా మెడికల్ టెక్నాలజీ చాలా పెరిగింది. నా సహచరి నా పక్కన నిలబడింది. అంతా బాగుంది. సబ్ కుచ్ చల్ రహా హై…ఆచ్ఛాహీ చల్ రహా హై. చలాయెంగే జాబ్ తక్ హై జాన్’ అంటాను.

కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాను. అప్పుడు ప్రిన్సిపాల్ గా మిత్రుడు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి వున్నారు. నన్ను చూడగానే భయ్యా వచ్చారా? అంటూ ఎదురొచ్చాడు. స్నేహపూర్వమయిన హగ్. జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి అవుతుండగానే కాలేజీ మిత్రులంతా హాయ్ హాయ్ అంటూ సంతోషంగా కలిశారు. నేను చదివిన కాలేజీ, అప్పటికే 14 ఏళ్లుగా పనిచేస్తున్న కాలేజీ. మళ్ళీ ఉత్సాహం ఉరకలు వేసింది. ఇంతలో ప్రిన్సిపాల్ పద పద రూమ్ నంబర్ 63లో పిల్లలతో ఓ మీటింగ్ వుంది అన్నాడు. అరె ఇప్పుడే వచ్చిన కదా అన్నాను. అయితే ఏముంది. ఆవన్నీ తర్వాత పిల్లలతో నువ్వు మాట్లాడాలి పదా అని లాక్కెల్లాడు. ఇంకేముంది ఫాలో అయిపోయాను. పిల్లల్ని చూడగానే పాత ఉత్సాహం పెళ్లుబికింది. మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి వచ్చేశాను. ఇమ్మ్యునో సప్రెస్సర్స్ వాడతాను కనుక మాస్క్ లాంటి ఆయుధాలు తప్పనిసరి. గుంపుల్లోకి వెళ్లకూడదు. పనేమో కాలేజీలో కనుక కొంత తప్పలేదు. ఇల్లు కాలేజీ అంతే.

ఒక ఆలోచన తీవ్రంగా తొలవడం మొదలయింది. కాలం ఎప్పుడు ఎట్లా ఏ మలుపు తీసుకుంటుందో ఏమో. ఇన్నాళ్లుగా రాస్తూ వచ్చిన వాటికి పుస్తక రూపం ఇస్తే బాగుంటుందనుకున్నాను. ఇందిరేమో మీ ఇష్టం అంది. అలసట అవుతుందేమో చూసుకోండి అంది. ఆసుపత్రి, ఆపరేషన్ అవన్నీ నాపై తీవ్రమయిన వొత్తిడి వుండగానే హైదరబాద్ లో నన్ను నేను ఆవిష్కరించుకుంటూ రాసిన కవిత్వం వుంది. దానికంటే ముందు మరో రెండు పుస్తకాలు వేద్దామనుకున్నాను. ఒకటి ’మానేరు గల గల’. ఆంధ్రజ్యోతి దిన పత్రిక కరీంనగర్ ఎడిషన్ లో మిత్రుడు బ్యూరో చీఫ్ శ్రీ నగునూరు శేఖర్ కోరిక మేరకు నేను వారం వారం ‘విద్యుల్లత’ జిల్లా సాహిత్య పేజీనిర్వహించాను. అందులో జిల్లా కు చెందిన సాహితీవేత్తల పై నేను రాసిన వ్యాసాలు అన్నింటినీ కలిపి ‘మానేరు గల గల‘ పుస్తకం తేవాలని, దానితోపాటు అప్పటిదాకా నమస్తే తెలంగాణ తో సహా ఇతర పత్రికల్లో రాసినా సినిమా వ్యాసాలతో ‘బంగారు తెలంగాణ లో చలన చిత్రం’ వ్యాస సంకలనం వేయాలని అనుకున్నాను. రెండు పుస్తకాల డీటీపీ పనులు ఎప్పటిలాగే తమ్ముడు అమర్ కి అప్పగించాను. పనులు చక చకా జరిగాయి. పుస్తకాల కవర్ పేజీలు ఎట్లా అన్న సమస్య వచ్చింది. మిత్రుడు అన్నవరం శ్రీనివాస్ ని సంప్రదించాను. వీలుచేసుకుని ఇంటికి రండి సార్. మీ కిష్టం వచ్చిన పెయింటింగ్ ఎంచుకోండి అన్నారాయన. ఆయన వుంటున్న ఫ్లాట్ లోనే వుంటున్న మా కొలీగ్ ఎలిజబెత్ రాణి ని కూడా కలిసినట్టు అవుతుంది పద అన్నాను ఇందిరతో. చలో అంది. వెళ్ళి ఒక పెయింటింగ్ ఎంపిక చేసుకున్నాను. కాస్ట్ అడిగితే అదేంది సార్ అట్లా అంటారు మీరు పరాయి వాళ్ళా అన్నాడాయన. శ్రీనివాస్ గారి శ్రీమతి కవిత కూడా అంతే ఆప్యాయంగా టీ తాగేదాకా వదల్లేదు. ఎలిజబెత్ కూడా అంతే మేమంటే ఎంతో అభిమానం చూపించింది. ఇక సినిమా వ్యాసాల పుస్తకానికి అన్వేష్ వేసిన పెయింటింగ్ ని తీసుకున్నాను.‘మానేరు గల గల’ లో పీవీ, చొప్పకట్ల చంద్రమౌళి, పురాణం రామచంద్ర, ఎం.ఎస్.ఆర్. లతో కలిపి 49 వ్యాసాల్ని ప్రచురించాను. తెలంగాణ రచయితల సంఘం ప్రచురణగా వెలువరించాను. అప్పటి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముందుమాట రాస్తూ ‘ఇయాలిటీ సందర్భం అస్తిత్వ ప్రకటన. అంతే బలంగా చరిత్ర నిర్మాణం.జరగాల్సిన సమయం. ఆ దిశలో అవటానికి మానేరు గల గల కరీంనగర్ ప్రాంత కవి పరిచయాలే కావచ్చు కానీ సరయిన మార్గం సరయిన ప్రయత్నం’ అన్నాడు. మనకూ ఒక సాంస్కృతిక విధానం కావాలి అంటూ తెలంగాణా సినిమా ఉనికి దాని అభివృద్ధికి చేయాల్సిన అంశాల పైన ప్రధానంగా నమస్తే తెలంగాణలో రాసినవ్యాసాల సంకలనం బంగారు ‘తెలంగాణాలో చలన చిత్రం’. ఈ రెండు పుస్తకాల్నీ నా పుట్టిన రోజు 21 ఆగస్ట్ 2014 న తెచ్చాను. మానేరు గల గల ను నా వైద్యుడు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గందే శ్రీధర్ కి అంకితమిచ్చాను. ఆయన చాలా సంతోష పడ్డారు. బంగారు తెలంగాణ .. పుస్తకాన్ని ఆత్మీయులు మంగారి రాజేందర్ జింబో, వఝల శివకుమార్, సాంబశివుడు, నందిగం కృష్ణా రావులకు అంకితం చేశాను. మిత్రులు సభ పెట్టాలన్నారు. ఫిల్మ్ భవన్ లో ఏర్పాటు చేశాం. ఆత్మీయులందరినీ పిలిచాను. జింబో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, దర్భశయనం శ్రీనివాసాచార్య, వఝల శివ కుమార్, బీ.వీ.ఎన్ స్వామి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, దాస్యం సేనాధిపతి తదితరులు అతిథులుగా పాల్గొనగా, కె.ఎస్.అనంతాచార్య సభకు అధ్యక్షత వహించారు. మానేరు గలగల ను సిధారెడ్డి, బంగారు తెలంగాణ ను జింబో ఆవిష్కరించారు. సభ బాగా జరిగింది. నేను అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ దాటి వచ్చాను కదా. అనేకమంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు. సభలో నమిలకొండ హరిప్రసాద్, నరెడ్ల శ్రీనివాస్, లక్ష్మీకాంతం, పీ.ఎస్.రవీంద్ర, మంగారి శివ ప్రసాద్, ఎం.సరస్వతి-పాపన్న, హిమజ, శారదా శివకుమార్, నవీన వదిన మహేశన్న, ఇట్లా అనేక మంది ఆప్యాయంగా వచ్చి అభినందించారు. దర్భశయనం, స్వామి లు పుస్తకాల మీద సాధికారక ప్రసంగం చేశారు. ఇక మధు అయితే నా వృత్తి, కాలేజీ, లైబ్రరీల గురించి విశేషంగా మాట్లాడారు. సిధారెడ్డి, దేశపతి,వఝల, జింబో లు చాలా ఆప్యాయంగా వివరంగా మాట్లాడారు. నాకిప్పటికీ వారి మాటలు గుర్తున్నాయి. అవి నాకా రోజు పెద్ద టానిక్ లాంటివి.

ఆ తర్వాత ఆ రెండు పుస్తకాలకు కొన్ని మంచి సమీక్షలే వచ్చాయి. ఇక నా కవిత్వం ముందుకు వచ్చింది. హైదరబాద్ లో గడిపిన ఆ మూడు నెలల సంక్షోభ కాలంలో రాసిన కవితలన్నింటినీ పుస్తకంగా తేవాలని ఆలోచన.

అనారోగ్యమూ, మందులూ, జాగ్రత్తలూ, ఉద్యోగమూ ఒక వైపు, మరో వైపు నా సృజనాత్మక జీవితం. కవిత్వమయితే వేయాలి అనుకుంటూ ముందుకు సాగాను. ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య ను ముందుమాట రాయమని అడిగాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆగస్టులో రెండు పుస్తకాలు వస్తే నవంబర్ 2014 లో కవిత్వం “మనిషి లోపల” వెలువడింది. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను..

+++++

-వారాల ఆనంద్

25 ఫిబ్రవరి 2024

All reactions:

‘A POEM A DAY’ 25 FEB 2024

Posted on

‘A POEM ADAY’
25 FEB 2024

DASHARATHI

Posted on

మిత్రులారా! సాహితీ స్రవంతి కార్యక్రమంలో ‘దాశరథి’ గురించి వినండి.
Pl. click the link for my podcast on DASHARATHI

Posted on

మిత్రులారా!36 ఏళ్లపాటు పలు కాలేజీల్లో లైబ్రెరియన్ గా పుస్తకాల మధ్య, విద్యార్థినీ విద్యార్థుల నడుమ గడిపినవాణ్ణి.  నిన్న ముల్కనూరు గ్రామంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ప్రజా గ్రంధాలయానికి  వెళ్ళాను. అక్కడి వాతావరణం నిర్వాహకుల్ని చూస్తే చాలా సంతోషం కలిగింది. ఆ లైబ్రరీకి నా పుస్తకాల తో పాటు మరో 250 పుస్తకాల్ని నా వంతుగా ఇచ్చాను. ఆ లైబ్రరీ ఎంతగాని అభివృద్ధి చెందాలని, మరింతగా సేవలు అందించాలని కోరుకుంటున్నాను – వారాల ఆనంద్        

“A DAY A POEM”24 FEB 2024

Posted on

“A DAY A POEM”

24 FEB 2024

‘A POEM A DAY’ 22 FEB 2024

Posted on

‘A POEM A DAY’
22 FEB 2024

‘A POEM A DAY’20 FEB 2024

Posted on

‘ A POEM A DAY’
20 FEB 2024

సాహితీ స్రవంతి ‘జువ్వాడి గౌతమ రావు

Posted on

మిత్రులారా! సాహితీ స్రవంతి లో జువ్వాడి గౌతమ రావు గారి గురించి వినండి
Pl click the link

YADONKI BARATH 2 SERIES, No6

Posted on

యాదోంకీ బారాత్-2 సిరీస్, నంబర్-6

++++++++++ వారాల ఆనంద్ 

సాఫీగా గడిచిపోతున్న/జీవితంలో/ ఓ పెద్ద కుదుపు/ అది మొదటిదీ కాదు చివరిదీ కాదు మిగిలిన జీవితానికో/ పెద్ద మూల మలుపు .

….

ఎప్పటికప్పుడు /దరి కోసమో దారి కోసమో/ వూపిరి కోసమన్నంత ఆర్తిగా/ వెతుకుతూనే వున్నా/ చీకటి తుఫానులో /చిక్కుకున్న ప్రాణానికి రాత్రిలేదు పగల్లేదు నిద్రలేదు మెలకువా లేదు/ మనసంతా కర్ఫ్యు నిండింది/ ప్రశ్నలేదు సమాధానం లేదు/కనీస స్పందనా లేదు/ ఆలోచనల నిండా భయం కవాతు/ ముందు లేదు వెనక లేదు వర్తమాన స్పర్షా లేదు/ ఎప్పటి కప్పుడు నిరారుగా నిలబడేందుకు/ నన్ను నేను పుటం బెట్టుకునేందుకు కూడదీసుకుంటూనే వున్నా.

……..

15 జూలై 2014. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ విజయవంతమయింది. దాత నా సహచరి  ఇందిర, స్వీకర్త నేనూ క్షేమంగానే వున్నాం. ముఖ్యంగా డాక్టర్ల కమిట్మెంట్, పర్యవేక్షణ బాగా ఉపయోగపడింది. సర్జన్ డాక్టర్ మాలకొండయ్య గారు ఒక మాట చెప్పారు ‘ఆనంద్, సర్జరీ తో మా పని ముగిసింది. ఇక మొత్తం నెఫ్రాలజిస్ట్ ట్రీట్మెంట్, మీ జాగ్రత్తల మీదే ఆధారపడి వుంటుంది అన్నారు. ఇమ్మ్యునో సప్రెస్సర్స్ గురించి నెఫ్రాలజీస్ట్స్ వివరించారు. దాంతో పాటు మందుల గురించీ వివరించారు. తాము సూచించిన మందులు తప్ప వేరే ఏ ఇతర టాబ్లెట్స్ కానీ మందులు కానీ వాడొద్దన్నారు. కేవలం డోలో650, లేదా పెయిన్స్ ఎక్కువ అనిపిస్తే అల్ట్రాసెట్ మాత్రం వాడాలన్నారు. లైఫ్ స్టైల్ పొల్యూషన్ ఫ్రీ గా వుండాలన్నారు. అప్పుడు ఇట్లా రాసుకున్నాను

“శరీరంలో ప్రతిఘటించే గుణాన్ని నియంత్రించేదేదో

రక్త నాలాల్లో సుళ్ళు తిరుగుతోంది/

వైరస్లూ బాక్టీరియాలతో సహా

దేన్నీ ప్రఘటించలేని అతనిప్పుడు

ఆకర్శ మంత్రాన్ని పఠిస్తున్న మౌన ముని…

అయినా ప్రతిఘటనా నియంత్రణ శరీరానికే కాని ఆలోచనకు కాదు గదా

మనసులో ముంచిన ఆలోచనలకు

పదును పెడుతూ    

తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు

ఎంతయినా మనసున్న మనిషి కదా (మనిషి లోపల సంకలనం)

ఆపరేషన్ తర్వాత పన్నెండు రోజులకు డిశ్చార్జ్ అయి ఖైరతాబాద్ ఇంటికి చేరుకున్నాం.  కనీసం మరో నెల వుండాలన్నది ఆలోచన. నాన్న మా వెంటే వున్నారు. బహుశా నాకు తెలిసి నాన్న కరీంనగర్ వదిలి హైదరబాద్ లో ఇన్ని రోజులు వున్నది ఇదే తొలిసారి. నాన్న మిత్రుడు నాకు పూజనీయులు అయిన పూడూరు మల్లారెడ్డి సార్ కూడా నా దగ్గరికి వచ్చాడు. నేను బాగుండాలని ఆశీర్వదించారు. 

‘నిజానికి కనుచూపు మేరలో ఓటమి కనిపిస్తూ వుంటే నిలదొక్కు కోవడం ఎంత కష్టం..’

భౌతికంగా ఆ కష్టాన్ని దాటేసి వచ్చాను. అయినా బయటకు కనిపించని భయం, వినిపించని రోదన. దేహం నిండా ధైర్యాన్ని కప్పుకుని వున్నాను. ఇందిరా, నాన్న, రేల, అన్వేష్ దాదాపుగా అందరూ అంతే. తాను బయటపడితే మిగతావాళ్లు మరింత దుఖపడతారని అందరూ మామూలుగానే వుంటున్నారు. నాకు తెలుస్తూనే వుంది. బహుశా అందరికి కూడా  తెలుస్తున్నదేమో, ఏమో. అప్పుడు నన్ను ఆదుకుందీ లంగరేసిందీ కవిత్వమే. అప్పుడు నాకు ‘కవిత్వం కేవలం కవిత్వమే కాదు సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప, బతుకు సమరంలో నిలబెట్టే లంగరు’. Poetry becomes a guiding light when we may come to a crossroads or a halt- it helps clean the muddy waters and opens our minds to more ways to communicate and carve out life.

  ఇళ్లే చేరాక డాక్టర్లు సూచించిన మందులు రెస్టు, జాగ్రత్తలు వాటితో పాటు ఇద్దరు మిత్రులు క్రమం తప్పకుండా నా వద్దకు వస్తూ నన్ను మానసికంగా సంతోషంగా వుండేందుకు తోడ్పడ్డారు. జీవితం గురించి సాహిత్యం గురించీ ఎన్నో చర్చలు ఎంతో ప్రేరణ. వారిద్దరిలో ఒకరు కోడం పవన్. ఎప్పుడో దశాబ్దాల నుంచీ వున్న స్నేహం. సిరిసిల్ల, కరీంనగర్, చెన్నై, హైదరబాద్ అట్లా అనేక వూర్లల్లో కొనసాగిన మా స్నేహం నా అపత్కాలంలో తోడుంది. ఆయన వస్తూ వస్తూ స్నేహ పరిమళాలని అనేక ముచ్చట్లని మోసుకొచ్చేవాడు. ఇందిరతోనూ తనకు సన్నిహిత స్నేహమే. సరదాగా గడిచేది కాలం. ఇక మరొక మిత్రుడు రచయిత శ్రీ తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి. రెండు రోజులకోసారి నా కోసమే వచ్చేవాడు. ఉదయాన్నే ఆనంద్ గారూ ఈ రోజు మీ వద్దకు ఎవరయినా వస్తున్నారా? నేను రావచ్చా? హాస్పిటల్ కు వెళ్లేదేమయినా వుందా అని ఫోన్లో అడిగి మరీ వచ్చేవాడు. ఎవరోస్తే ఏముంది మీరు రావడానికి అంటే కాదు లెండి నేను మరో రోజు వస్తాను అనేవాడు. లేదు లేదు రండీ అని కొరగానే బయలుదేరేవాడు. ఎక్కడో నారపల్లి నుంచి వచ్చేవారాయన. ఆ రెండు బెడ్ రూముల అద్దె ఇంట్లో ఒక గదిలో ఇద్దరమూ కూర్చునే వాళ్ళం. మీరు అట్లా మంచంలో పడుకునే మాట్లాడండి అనే వారాయన. ఎన్ని మాటలో ఎన్నెన్ని అనుభవాలో చెప్పేవారు. తన సింగరేణి జీవితం, సంఘర్షణ, జీవన విలువలు ఒకటేమిటి సాహిత్యం జీవితం అన్నీ కళ్ళముందు పరిచే వారాయన. నిజంగా అప్పటిదాకా నేనేమీ చదివానో, ఏ గొప్ప సినిమాలు చూశానో కానీ రఘోత్తం రెడ్డి గారి మాటల్ని వినడం, ఆ రోజుల్లో ఆయన సాన్నిహిత్యం నాకో గొప్ప ఐ ఓపెనర్.

ఆయన గురించి ఇట్లా రాసుకున్నాను..

మాటల పరిమళాల్ని/వెదజల్లుతూ అతనొస్తాడు/నా ముఖం వికసిస్తుంది/

విలువల పూలగంపని/నాముందు బోర్లిస్తాడు/ గదంతా పరిమళ భరితమవుతుంది/       

గోర్కీనో, టాల్ స్టాయో, కాళీపట్నమో, రావీ శాస్త్రో/ మా మాధ్య కొచ్చి కూర్చుంటారు

భానుమతి గీతమో, భీస్మిల్లాఖాన్ షెహనాయో/ఆమోంకర్ ఆలాపనో/మమ్మల్ని రాగభరితం చేస్తారు/ఆయన క్రమక్రమంగా ప్రవాహమై నాలోకి ప్రవేశిస్తాడు/

అప్పటిదాకా నాలో వున్న దుఖం బాధా వేదనా/క్రమంగా ఆ ప్రవాహంలో కలిసి ఆవిరవుతాయి/

ఆయన నన్ను ఇష్టపడ్డాడో/నేనతన్ని ప్రేమించానో/ సుఖ సమయంలో కాదు కానీ/దుఖ కాలాల్లో నాలుగు ధైర్య చినుకుల్ని రాల్చాడు/

చెరో కప్పూ టీ తాగాక ఒక్క క్షణం మౌనం మాటలేముంటాయనుకుంటాం/

కానీ/ సంచీలోంచి పాత సంచికలు తీసినట్టు/ అనుభవమో అనుభూతో అభిప్రాయమో/ మా మధ్య పరుచుకుంటాయి/కాలం ఎప్పటికప్పుడు/ వేగాన్ని పెంచుకుంటూ కదిలిపోతుంది”(‘మనిషి లోపల’సంపుటి).

అలా నా కంటినే కాదు మనసునీ తెరిపించి ధైర్యాన్ని నింపిన వారు రఘోత్తం రెడ్డి. ఖైరతాబాద్ లో వున్నన్ని రోజులూ ఆయన తన మాటలతో నన్ను అల్లుకుపోయారు. అయితే ఏ ఒక్క రోజూ మాతో భోజనం చేయడానికి కూర్చోలేదు. ఇంట్లో భోజనం చేసే వచ్చాను అన్నది ఆయన స్టాండర్డ్ డైలాగ్. ఇందిర ఎన్ని సార్లు వొత్తిడి చేసినా టీ తాగాను కదా ఇందిరా అనేవారు. ఆనంద్ పైన డాక్టర్ల మందులకంటే మీ మాటలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. మీకేట్లా కృతజ్ఞతలు చెప్పాలో అని ఇందిర అంటే ‘ధైర్యం ఆయనదే, నాది మాట సాయమే.. అని నవ్వేసేవారు.       

నాకు సర్జరీ అయిందనగానే కవి మిత్రులు శ్రీ దర్భశయనం శ్రీనివాసా చార్య వారి శ్రీమతి కమల, టి.రాధాకృష్ణమాచార్య, వఝల శివకుమార్ వారి శ్రీమతి శారద, దామోదర్, సుధీన, పీ.ఎస్.రవీంద్ర, గండ్ర లక్ష్మణ రావు, మంగారి శివప్రసాద్, యాద కిషన్, శ్రీకాంత్, మాడిశెట్టి గోపాల్, వుప్పుల రామేశం, సునీత రాజీ రెడ్డి, లావణ్య రాజయ్య, ఇంకా ఎందరో హైదరబాద్ దాకా వచ్చారు. పలకరించారు, పరామర్శించారు, ధైర్యం ఇనుమడింపజేశారు.  ఇక బంధువుల్లో సురేశన్న-కుసుమ వదిన, రమక్క బాబూరావు, విజయక్క, మహేశన్న నవీన వదిన, గుణక్క, శ్రీశైలం మామ, భూపతి రావు, బెల్లపుకొండ అశోక్, ఇట్లా బంధువులు ఎంతో మంది వచ్చి పలకరించారు. 

..

ఇక హైదారాబాద్ లో వుండాల్సిన సమయం ముగిసింది. డాక్టర్లు కరీంనగర్ వెళ్లడానికి పచ్చ జెండా వూపారు. మేము సిద్దమవుతున్నాం. ఒక రోజు సాయంత్రం జింబో, శైలజ ఇంటికొచ్చారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మాట్లాడుతూ మాట్లాడుతూ జింబో ఒక కవర్ తీసి టేబుల్ పైన పెట్టాడు. ఏమిటది అన్నాను.’ ఏమీ లేదు కొంత డబ్బు’అన్నారు శైలజ. ఎందుకు అన్నాను. ఎంతో కొంత సపోర్ట్ వుంటుంది కదా అన్నారు. సర్జరీ తో సహా అంతా అయిపోయింది. రేపో ఎల్లుండో బయలు దేరుతున్నాం. ఇప్పుడేమీ అవసరాల్లేవు అన్నాను. నేనూ,శివకుమార్,సాంబశివుడు,నందిగం కృష్ణారావు అనుకున్నాం వుండనీ దేనికయినా అక్కరకొస్తుంది అన్నారు జింబో. ఇందిర నేను ముఖాలు చూసుకున్నాం. తానేదో అనబోతూ వుంటే నేనే కవర్ తీసుకుని ఇంత మంది స్నేహితులు అభిమానంగా ఇస్తే వద్దు అనడం కరెక్ట్ కాదు అన్నాను. వారి ప్రేమకు అభిమానానికి ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో తోచలేదు. మిత్రులకు చేతులెత్తి మొక్కలేను, థాంక్స్ అన్న మాట సరిపోదు. అందుకే కొన్ని సార్లు మన భావాల్ని ప్రకటించడానికి మాటలకున్న శక్తి చాలదు. అలాంటి స్థితిలో మౌనమే గొప్ప సంభాషణ.

ఆ తర్వాత రెండు మూడు రోజులకు కరీంనగర్ బయలుదేరాం.

వినాయక చవితి మనింట్లో జరుపుకుందామని ఇందిర బయలుదేర తీసింది.

దాదాపుగా ముగింపునకు చేరిన కాలాన్ని దాటేసి ఇంటికి చేరాను…

మిగతా వివరాలతో మళ్ళీ వారం…

*************************

18 ఫిబ్రవరి 2024           

‘A POEM ADAY’17 Feb 2024

Posted on

‘A POEM ADAY’
17 Feb 2024

A POEM A DAY

Posted on

‘A POEM A DAY’
16 FEB 2024

యాదోంకీ బారాత్ (2 సిరీస్,5 నం.)

Posted on

యాదోంకీ బారాత్
(సెరీస్-2, నంబర్-5)
+++++++++ వారాల ఆనంద్
‘గతం’ పొరలు పొరలుగా తెరలు తెరలుగా పేర్చుకున్న జ్ఞాపకాల అర
‘వర్తమానం’ క్షణ క్షణం నడక
‘భవిష్యత్తు’ రూపం దిద్దుకునే కలల మంచుపల్లకి…
….
2013 లో మొదలయిన ఆరోగ్య సమస్య 2014లోకి చేరింది.
హీమో నుంచి పేరిటోనియల్ డయాలిసిస్. తర్వాత ఒక కిడ్నీ తీసేసారు. ఖైరతాబాద్ కిరాయి ఇంట్లో నివాసం. కాలం ఎన్నో మలుపులు తిరుగుతూ పరుగులు పెట్టింది. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు అంటూ వున్నట్టు ‘నిర్మూలించలేనిది నిభాయించుకోవడమే’ ఆ మాటలు నా నరనరాల్లో చేరిపోయాయి. అప్పుడే అనుకున్నాను…
‘లోపలేక్కడో దాగివున్న పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని నిల్బడాల్సిన సమయమిదే/
వూహించని తూఫాను గాలికి విల విల్లాడిన ఆకుల్ని ఆలోచనల్ని చేతుల్నీ చేతల్నీ అదిమిపట్టుకుని కూలి పోకుండా నిలబడాల్సిన సమయమిదే’అని అనుకుంటూ
కూలిపోతున్న మనసుని దిటవు చేసుకుంటూ వచ్చాను. పెల్లుబుకుతున్న భావాల్ని పరుచుకుంటూ, రాసుకుంటూ ముందుకు సాగడం మొదలుపెట్టాను. నేనొక్కన్నే కాదు నావెంట నాన్న, ఇందిర, రేల వారితోపాటు ఎంతో మంది మిత్రులు, ఆత్మీయ బంధువులు నిలబడ్డారు.మా తమ్ముడు అర్జున్, ఇందిర తమ్ముడు బాల రాజు మా వెంటే వున్నారు. ఇక కవి మిత్రులు జింబో, వఝల శివకుమార్ లయితే ఆనంద్ కోసం కవితలు రాసారు. రోజు విడిచి రోజు ఉదయమే గ్లోబల్ కి వెళ్ళి డయాలిసిస్ చేయించుకోవడం తప్పనిసరి. ఇక తీసేసిన కిడ్నీగాయం మానాలి. సమస్త వాస్తవాల్ని అర్థం చేస్కున్న మానవత్వాన్ని అందిపుచ్చుకుని నిలబడాలి. నిర్భయంగా నిజాయితీగా నిటారుగా ముందుకు నడవాల్సిన సమయం. సరిగ్గా అప్పుడే ఒక రోజు ఉదయమే హాస్పిటల్ లో వున్నాను. మిత్రుడు దామోదర్ ఫోన్. పొద్దున్నే ఏమిటి విషయం అనుకుంటూ ఆదుర్దాగా ఫోన్ తీశాను. ఎక్కడున్నావు టెన్షన్ పడకు అన్నాడు. నా మనసేదో శంకించసాగింది. అరె చెప్పు భై డయాలిసిస్ లో వున్నాను అన్నాను. ‘అందుకే.. అంటూనే ఒక విషాద వార్త అంటూ.. మన పెండ్యాల సంతోష్ అన్నాడు.. ఏమయింది? ఏమయింది?..అంటూవుండగానే, కూల్ ఆనంద్ అందుకే నువ్వున్న స్థితిలో చెప్పాలా వద్దా అనుకుంటూనే ఫోన్ చేశాను అన్నాడు. విషయం నాకర్థం అయిపోయింది. సంతోష్ తో దశాబ్దాల స్నేహం. సినిమాలూ, సాహిత్యం రాజకీయాలూ అన్నింటితో పెనవేసుకున్న బంధం. మదిలో శూన్యం ఆవహించింది. నేను ఎట్లా ఎప్పుడు రావాలి అని అడిగాను. ‘ నువ్వు వచ్చుడేమీ వద్దు కేవలం సమాచారం కోసం చెప్పాను. మంగళ, పిల్లల్ని తర్వాత కలుద్దువుగాని’ అంటూ దామోదర్ ఫోనే పెట్టేశాడు. దుఃఖం అలుముకున్నా నా కళ్ళల్లోంచి నీళ్ళు రావే.. జీవితంలో అత్యంత విషాద సందర్భాల్లో అదొకటి. లేవ లేను.. వెళ్ల లేను.. అట్లని వూరకుండ లేను. మనసు దేహం ఆలోచన అంతా స్తబ్దత ఆవరించింది. నాలుగు గంటలు బెడ్ పై ఎట్లా గడిచిందో ఏమో…
……
కిడ్నీ రిమూవల్ ఆపరేషన్ జరగ్గానే ఆత్మీయ మిత్రుడు రచయిత నందిగం కృష్ణా రావు, డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, కోడం పవన్, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి లు వచ్చారు. ఆసుపత్రికీ ఇంటికి తిరుగుతూ వుండడంతో ఎక్కడో తీవ్రమయిన ఇన్ఫెక్షన్ సోకింది. ఇంకేముంది ట్రాన్స్ ప్లాంట్ వాయిదా పడింది. డాక్టర్ శ్రీధర్ మెడికల్ పర్యవేక్షణలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి హై మెడిసిన్స్. కాలం గడుస్తూనే వుంది. కరీంనగర్ నుంచి నరెడ్ల శ్రీనివాస్, చుక్కా రెడ్డి ఎప్పటికప్పుడు టచ్ లో వున్నారు. ఆరోగ్యం విషయంలోనూ, డబ్బుల అవసరం విషయం లోనూ. ఆర్థికంగా నా ఏర్పాట్లెవో నేను చేసుకున్నప్పటికీ నాన్న నా వెంటే వున్నాడు. మరోపక్క ట్రివేండ్రం లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవియానిక్స్ కోర్స్ చదువుతున్న మా అన్వేష్ పూట పూట కూ సమాచారం తెలుసుకుంటూ తీవ్ర ఆందోళనలోనో వున్నాడు. ఏమీకాదు లేరా అని నేనంటే ‘నాన్నా మీరట్లే అంటారు, ఫోన్ మమ్మీకో అక్కయ్యకో ఇవ్వండి అనేవాడు’.
ఇక అన్నీ అడ్డంకులూ తీరిపోయి ట్రాన్స్ ప్లాంట్ కి సమయం రానే వచ్చింది. గ్లోబల్ లో నేనూ ఇందిరా అన్నిరకాల పరీక్షలకు సిద్దమయిపోయాము. రెండు రోజుల పాటు ఎన్ని పరీక్షలు చేశారో గుర్తేలేదు. ఆపరేషన్ తేదీ ఫిక్స్ అయింది. ఇద్దరమూ మానసికంగా శారీరకంగా సిద్దపడే వున్నాం. అప్పుడే బీటెక్ ఎంబీయే పూర్తి చేసిన రేలకి హైదరబాద్ లోనే జాబ్ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కేరళ నుంచి అన్వేష్ ఫోన్ ‘నాన్నా నేను ప్యాకప్ వచ్చేస్తున్నా’ అని. నాకు మొదట అర్థం కాలేదు..అప్పుడే కాదు ఇన్నేళ్లూ వాడు నాకార్థం కాలేదు… వాడు ఫేస్ బుక్ లో, వాట్స్ అప్ ల్లో కారికేచర్లూ, అనిమేషన్ క్లిప్పులూ పంపినప్పుడూ అర్థం కాలేదు…అంతరిక్ష శాస్త్రం నుంచి సృజన రంగం వైపు వాడి ప్రయాణమని క్రమంగా ఇప్పుడు అర్థం అయింది. ఇంకేముంది వాడు పెట్టే బేడా సర్దుకుని వచ్చేశాడు. రేల నిరుద్యోగ మైదానం లోంచి ఉద్యోగ పర్వం లోకి, అన్వేష్ ఇస్రో ఉద్యోగ పర్వం లోంచి కళా మైదానం లోకి అడుగు పెడుతూ వుంటే నేనూ ఇందిరా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాం. తర్వాత ‘నానిగాడు’ పేరిట ఓ కవితే రాసుకున్నాను(మనిషి లోపల సంకలనం లో వుంది).
15 జూలై 2014 ఉదయం మా ఇద్దరికీ సర్జన్ డాక్టర్ మాలకొండయ్య, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కౌన్సెల్లింగ్ చేశారు. తాము ఏం చేయబోతున్నామో చెప్పారు. కాన్ఫిడెన్స్ ముఖ్యమన్నారు. మాకున్నదే అదొక్కటి అన్నాను. బ్లడ్ అవసరం వుంటుంది అంటే అన్వేష్ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి సిద్దంగా వున్నారు. తర్వాత ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. రెండు టేబుల్స్ పై ఇద్దరం. ‘ శీతల గదిలో తెల్లటి మంచం మీద కాళ్ళు బార్లా జాపి శవాసనం లా పడుకున్నాను/ అకస్మాత్తుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ప్రసరించింది. సర్జన్స్ వచ్చి వెన్నుపూసకో ఇంజెక్షన్ ఇస్తున్నాం. ప్రశాంతంగా వుండండి అన్నారు. కాళ్లూ చేతులూ తలా శరీరమూ అన్నీ మాట్లాడడానికి నోళ్ళు తెరిచాయి, గానం చేయడానికి గొంతు సవరించుకున్నాయి కానీ అన్నీ చలన రహితమయి పోయాయి. మనసొక్కటే మేల్కొని కళ్ల కిటికీలోంచి మంచు గదిని చూడడం మొదలు పెట్టింది. శరీరం నిండా ఏవేవో గాలి పంపులు నీటి పంపులూ మత్తు పంపులూ.. క్రమంగా స్పృహ పోయింది. అట్లా ఎంత సేపు ఎన్ని గంటలున్నానో తెలీదు. మెల్లగా స్పృహ వస్తూ వున్నప్పుడు మెలకువా నిద్రా కానీ స్థితి. చుట్టూ అనేక మంది డాక్టర్లు సిస్టర్లు ఒకరిని పట్టక ఒకరు వస్తూ పోతూ వుండడం లీలగా కనిపిస్తోంది. మాయగా అనిపిస్తోంది. కళ్ళు తెరవడం లేదు,మాట పెగలడం లేదు. స్పృహ వచ్చినట్టూ లేదు రానట్టూ లేదు. ఎంత సమయం గడిచిందో. డాక్టర్లు శ్రీధర్, మాలకొండయ్య, రామాశంకర్,వెంకటేశ్వర్ లు నన్ను పలకరిస్తూ హై ఆనంద్ ఎట్లా వున్నారు అంటూ వుండగా ఫైన్ అంటూ ఈ లోకం లోకి వచ్చాను. ఇందిర అని అనగానే షీ ఈజ్ గుడ్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇంకొంచెం సమయం గడిచాక జింబో, నారదాసు లక్ష్మణ్ రావు లు వేర్వేరుగా డాక్టర్ల సూట్లు వేసుకుని నన్ను చూడ్డానికి ఐసీయు కు వచ్చారు. వేరే ఎవరినీ అనుమతించలేదు. మరో ఐసీయు గదిలో వున్న ఇందిరకు స్పృహ రాగానే ఆనంద్ కు ఎట్లా వుంది? నేను చూడాలి అని గొడవ పెడితే డాక్టర్ వెంకటేశ్వర్ వెళ్ళి ఏమమ్మా నీకు అయిన ఆపరేషన్ కూడా చిన్నది కాదు ప్రశాంతంగా వుండు.. ఆనంద్ బాగున్నారు అని కోపం చేస్తే, మరి ఇంత మంది డాక్టర్లు ఎందుకు వస్తున్నారు అని ఇందిర అడిగిందంట. ఏమీ లేదమ్మా ఆబ్సర్వేషన్ కోసం అని చెబితే కొంత నెమ్మదించిందావిడ. ఇవన్నీ నాకు తర్వాత చెప్పిన ఆసుపత్రి సిబ్బంది ‘మీ ఆవిడ ఎంత మొండిది సార్’ అని ఒకటే నవ్వడం. నేనూ శృతి కలిపాను. తర్వాతి కాలంలో ఇట్లా రాసుకున్నాను…
“ఆమె ఒక భోలా/తనకు తెలిసిందేదో తెలిసినట్టు/ తోచిందేదో తోచినట్టు/
స్వరపర బేధాల్లేవు/ముందు వెనకల్లేవు/ కుళ్లూ కుతంత్రం లేదు/
ఆమె మంద్ర నదీ ప్రవాహం కాదు/ ఎగిసి దుమికే జలపాతం..
మా ఇదరి గమనంలో రహస్యం లేదు/ పెమలో మాలిన్యం లేదు/
ఆమె స్నేహంలో వెన్నెల కురుస్తుంది/త్యాగంలో ఆకాశాన్ని స్పృశిస్తుంది/
ఆమెతో జీవితం బతుకంత లోతయింది/విశ్వమంత విశాలమయింది”.
…..
ఆపరేషన్ కు ముందూ వెనకా మహేశన్న, నవీన వదిన, పావని, అమ్మాయక్క, చందన సంజీవ రెడ్డి, భూపతి రమేశ్, గునక్క విద్యాసాగర్ బాబాయి, శ్రీదేవి,ఉష, సరోజ-అశోక్,సత్యనారాయణ-సువర్ణ, సుగేందర్-రమ, ఇట్లా చాలా మంది మిత్రులు బంధువులు ఆసుపత్రికి వచ్చారు.కానీ ఆసుపత్రి వర్గాలు చాల మందిని లోనికి అనుమతించలేదు. కేవలం దూరంగా అద్దం లోంచి చూసి వెనుతిరిగారు. అప్పుడు నా చేతుల్లో ఏమీలేదు. అంతా హాస్పిటల్ వాళ్ళ నియంత్రణ. రూము లో నుంచే అందరికీ అభివాదం చేశాను. అట్లా దాదాపు రెండు వారాలు నేనూ ఇందిరా హాస్పిటల్ బందీఖానా లో వుండి పోయాం.
“ట్రాన్స్ ప్లాంట్ విజయవంతమయింది. కానీ మనిషి దేహం చాలా శక్తివంతమయింది. తనది కానిది ఏదయినా సరే దేహం లోకి వస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తుంది. అందుకే ఇమ్మ్యునొ సప్రెసర్స్ ఇస్తాం. వాటితో మీ ఇమ్మ్యూనిటీ తగ్గిపోతుంది. దాంతో ఏ ఇన్ఫెక్షన్ అయినా త్వరగా సోకుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా వుండాలి అన్నారు డాక్టర్ శ్రీధర్. కనీసం రెండు నెలలు ఇక్కడే వుండండి అని కూడా సూచించారాయన.
దాంతో ఖైరతాబాద్ కిరాయి ఇంట్లో వుండిపోయాము.అప్పుడు అనేక మంది మిత్రులు నాకు వ్యక్తిగతంగానూ మానసికంగానూ వెంట వున్నారు. ముఖ్యంగా తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, కోడం పవన్ రోజు విడిచి రోజు అన్నట్టు వచ్చారు. ఇంకా వఝల శివకుమార్, సాంబశివుడు, దర్భశయనం శ్రీనివాసాచార్య లతో సహా వస్తూనే వున్నారు… నా మానసిక ధైర్యాన్ని ఇంకా ధృడంగా నిలబెట్టిన ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.
-వారాల ఆనంద్
11 ఫిబ్రవరి 2024

User comments

‘ఇరుగు పొరుగు’ సమీక్ష

Posted on

మిత్రులారా! 29 భారతీయ భాషల్లోని 90 మంది ప్రఖ్యాత కవుల 152 కవితల అనువాదాలతో నేను వెలువరించిన “ఇరుగు పొరుగు” అనువాద కవితా సంకలనం పై ‘నేటినిజం’ పత్రికలో సమీక్ష ప్రచురించారు. వీలుచేసుకుని చదవండి. సమీక్షకులు జయసూర్య గారికి, సంపాదకులు శ్రీ బైస దేవదాసు గార్లకు కృతజ్ఞతలు- ఆనంద్

TIME WITH CHILDREN

Posted on

యే దౌలత్ భీ లేలో షోహరత్ భీ లేలో
భలే ఛీన్ లో ముజ్ సే మేరీ జవానీ
మగర్ ముజ్ కో లౌటాదే
బచ్ పన్ కా సావన్
వో కాగజ్ కి కష్తీ
వో బారిష్ కా పానీ( సుదర్శన్ ఫకీర్)
జగ్ జిత్ సింగ్ స్వరంలో ఎన్ని సార్లు విన్నానో.. పిల్లల నడుమ వుండడం…వాళ్ళతో గడపడం
నిండు పున్నమి రోజు పండు వెన్నెలలో నాట్యం చేయడం లాంటిది..నిన్న సాయంకాలమతా కరీంనగర్ భగవత్ అర్వీన్ ట్రీ స్కూలు విద్యార్థుల మధ్య గడిచింది. చిన్నారులతో గడిచిన క్షణాలు పంచుకున్న నాలుగు మాటలు గొప్ప వూపునిచ్చాయి, శ్రీ రమణా రావు గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి కృతజ్ఞతలు.-వారాల ఆనంద్

యాదోంకీ బారాత్ 2-సిరీస్, నం.4 +++++ వారాల ఆనంద్

Posted on

యాదోంకీ బారాత్ 2-సిరీస్, నం.4

+++++ వారాల ఆనంద్

అడుగులో అడుగేసుకుంటూ వచ్చి

ఎదుట నిలబడ్డది ఎవరు

మృత్యువా మిత్రుడా

మసకచీకటిలో తడి కళ్ళకు

ఎట్లా తెలిసేది

ఇన్నేళ్లుగా

బతుకే అర్థం కాలేదు 

ఎప్పుడో ఒకసారి వచ్చే

చావెట్లా అర్థం అవుతుంది

+++++

అదీ ఆనాటి నా మానసిక స్థితి. ఫిస్టులా విఫలం అయింది. లివర్ ఇన్ఫెక్షన్ అయింది. హీమో డయాలిసిస్ నుంచి పెరిటోనియాల్ డైయాలిసిస్ కి మారాను. పొట్టకు దాని కోసమే ఓ సర్జరీ. వాటర్ బ్యాగులు, ట్యూబ్స్ అంతా కొత్త. పెరిటోనియల్  ఎట్లా చేయాలో ఇందిర కు హైదరబాద్ లో టెక్నీషియన్ శ్రీకాంత్ శిక్షణ ఇచ్చాడు. కరీంనగర్ కు తిరిగి వచ్చాం. రోజూ ఉదయం 7గంటలకు, పగలు రెండు గంటలకు, రాత్రి మళ్ళీ ఎనిమిది గంటలకు పెరిటోనియల్ డయాలిసిస్ ఇందిర చేసేది. గ్లూకోస్ ఎక్కించినట్టుగా డయాలాసిస్ వాటర్ మొత్తం పొట్టలోకి ఒక పైప్ గుండా వెళ్ళి మరో పైప్ గుండా బయటకు రావడం ఆ ప్రాసెస్. అదంతా జరిగే సమయంలో నేనేమో పాటలు వింటూనో ఏదయినా చదువుకుంటూనో బెడ్ పైన పడుకునే వాణ్ని. ఇందిర పక్కనే పూర్తి అయ్యేంత వరకు ఎదురుచూస్తూ వుండేది. అయిపోయిన  తర్వాత ఆ పైపులు పడేయడం ఒక పెద్ద ప్రహసనం. మున్సిపల్ సిబ్బంది దగ్గరినుండి మొదలు చుట్టుపక్క వాళ్ళంతా ఏమిటిదంతా అని అనుమానంగా చూసేవాళ్ళు. పేరు పేరునా అందరికీ చెప్పలేం కదా. అదట్లా జరుగుతూ వుండగానే ఎప్పటికప్పుడు హాస్పిటల్ లో చేసే వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ గ్లోబల్ కి వెళ్ళాం. డాక్టర్ శ్రీధర్ గారిని కలిసి వస్తూ వుండగా ఇందిర తనతో అంది కిడ్నీ నేను డొనేట్ చేస్తాను అని అన్నాను సర్. ఏమయింది మరి అని ఆయన అడిగారు. సెకండ్ ఒపీనియన్ కోసమని ఎవరో చెబితే కిమ్స్ వెళ్ళాం. అన్ని టెస్టులూ చేశారు. చాలా డబ్బులు అయ్యాయి. కానీ “మా అమ్మకు సుగర్ వుంది కనుక నాకూ వచ్చే అవకాశం వుంది. ఆపరేషన్ వీలు కాదు” అన్నారు అని చెప్పింది. అంతేకాదు ఇప్పుడు ఆనంద్ కు సమస్య వచ్చింది కనుక మీరు వెంటవుండి తిరుగుతున్నారు. రేపు మీకూ సమస్య వస్తే ఇద్దరినీ తీసుకుని ఎవరు తిరుగుతారు అని బయపెట్టారు సర్ అని కూడా వివరంగా చెప్పింది తను. దానికి ఖంగు తిన్న డాక్టర్ శ్రీధర్ అట్లా ఎట్లా అంటారు. అమ్మకు షుగర్ వుంటే కూతురుకు తప్పకుండా రావాలని రూలేమీ లేదు, అట్లా ఖచ్చితంగా ఏముండదు. మీకు షుగర్ తప్పకుండా వస్తుందని ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం వుందా అని అడిగారు. లేదన్నాం. వాళ్ళు ఎట్లా చెప్పారో మరి. ఒక పని చేయండి నేను బుధవారం కరీంనగర్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని రండి చూద్దాం అన్నారాయన. సరే అని కరీంనగర్ తిరిగి వచ్చేశాం. తర్వాతి వారం వెళ్ళి శ్రీధర్ గారిని కలిశాం. రిపోర్ట్స్ అన్నీ సజావుగానే వున్నాయి. ఒక పని చేద్దాం ఇందిర గారూ మీరు మూడు నెలలపాటు ఎలాంటి టాబ్లెట్స్  వాడకండి, తర్వాత టెస్ట్ చేసి చూద్దాం అన్నారు. ఎంకేముంది నేను ఇంట్లో డయాలిసిస్ చేసుకుని క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళి రావడం. అంతటా అన్నింటా జాగ్రత్తగా వుండడం నా దిన చర్య అయిపోయింది. కాలేజీలో లైబ్రరీ వర్క్ తప్ప మిగతా జర్నలిజం, ఫిల్మ్ మేకింగ్ సర్టిఫికేట్ కోర్సుల వొత్తిడి కొంత తగ్గించుకున్నాను. చాలా కార్యక్రమాలకు దూరంగా వుండడం ఆరంభించాను. సహచరులు, సిబ్బంది, విద్యార్థులు అంతా ఎంతో సహకరించారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ మురళి.

అదంతా అట్లా మూడునెలల కాలం గడవగానే డాక్టర్ గారు ఇందిరకు మళ్ళీ అన్ని పరీక్షలు చేయించారు. నో కంప్లైంట్. ఆపరేషన్ కు సిద్దం కండి అన్నారు. ఖైరతాబాద్ లో వున్న మా సోదరి  మంజుల, బావ శ్రీ శ్యామ్ సుందర్ లతో మాట్లాడాము. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇంటి సమీపంలో  ఒక పోర్షన్ ఖాళీ అవుతున్నదని తెలిసి ఇందిర వొత్తిడి చేసి అడ్వాన్స్ ఇద్దామంది. వాళ్ళకు చాలా స్నేహంగా వున్న వాళ్ళు కనుక ఇంటిని రెంట్కి ఇచ్చారు. ఆ ప్రాంతం గ్లోబల్ కి చాలా దగ్గర. ఎంతో అనుకూలమయింది. వెంటనే కరీంనగర్ లో డబ్బు సమకూర్చుకోవాలి. లక్షలు కావాలి. ఎట్లా అని ఆలోచిస్తూ వుంటే సీనియర్ జర్నలిస్ట్, ఆత్మీయుడు శ్రీ కె.చుక్కా రెడ్డి చొరవతో ప్రైవేట్ చిట్ ఫండ్ లో ఫిక్స్ అయివున్న డబ్బును మాచురిటీ కి ముందే తన పరపతితో ఇప్పించాడు. అందులో మా నరెడ్ల శ్రీనివాస్ ఎంతో చొరవ చూపించాడు. అన్నింటా మిత్రులే అప్పుడు నాకు పెద్ద అండ. నారదాసు లక్ష్మణ రావు, నమిలకొండ హరిప్రసాద్, జింబో, పీయెస్, దామోదర్, కోడం పవన్, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి,లతో పాటు బాలరాజు, అర్జున్ ల వంటి అనేక మంది నా వెంటే వున్నారు. ఆనాడు మానసికంగా మిత్రులు ఇచ్చిన సపోర్ట్ ఇంతా అంతా కాదు. ఇక సహచరి  ఇందిర ధైర్యం, చొరవ, తెగింపు, నాకు అండగా వున్నాయి.ఆ సమయంలో నా ఆరోగ్యం విషయంలో తాను తన అభీష్టానికి భిన్నంగా ఎవరి మటనూ వినేందుకు ఆమె సిద్దంగా లేదు. ఎవరెన్ని రిస్కులు ఉన్నాయని చెప్పినా కిడ్నీ ఇవ్వాల్సిందే అంది. కరీంనగర్లో డాక్టర్ ఎం.విజయమోహన్ రెడ్డి గారు, నమిలకొండ హరిప్రసాద్ లు చెప్పిందే ఆమెకు ఫైనల్. హైదరాబాద్ లో డాక్టర్ శ్రీధర్ మాటే వేదం. మానసికంగా నాకు చాలా ధైర్యం వచ్చింది. ఒకటి మాత్రం నిజం..

“నేనిక్కడ కేవలం నాలుగు కాలాలు గడపడానికి రాలేదు

నాలుగు మాటలు పలకడానికి

నలుగురిని కలవడానికీ

నాలుగు పాదముద్రల్ని మిగల్చడానికి వచ్చాను

నాలుగు కన్నీటి బొట్లు తుడిచి

నాలుగు పువ్వుల్ని పంచడానికి వచ్చాను

నేనేకాదు నువ్వూ అంతే

ఇద్దరమూ వేర్వేరు కాదు

మనుషులయిన వారందరమూ అంతే

ఇక్కడ నాలుగు యుగాలు బతకడానికి రాలేదు

నాలుగు తరాలు నిలవడానికి శ్వాస నిలవదు”

******

కావలసిన కనీస వస్తువులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళేందుకు సిద్దమయ్యాము. మా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మురళి పదవీ విరమణ సభలో పాల్గొన్న మర్నాడు హైదరాబాద్ బయలుదేరాము. కరీంనగర్ లో బీ.టెక్.తర్వాత అప్పటికి ఉస్మానియాలో ఎం.బిఎ. పూర్తి చేసిన మా అమ్మాయి రేలకి ప్లేస్మెంట్ వచ్చింది. జాయిన్ అయ్యేందుకు కొంత సమయం వుంది. దాంతో తాను హాస్టల్ ఖాళీ చేసి మా ఖైరతాబాద్ కిరాయి ఇంటి వచ్చేసింది. హైదరబాద్ బయలుదేరే ముందు మా నాన్న గారిని వెంట రమ్మని తనకు అండగా వుండమని ఇందిర కొరగానే ఆ వయసులో కూడా పదమ్మా అని తాను కూడా బయలు దేరాడు. గ్లోబల్ లో నెఫ్రాలజిస్ట్ టీం హెడ్ డాక్టర్ శ్రీధర్ తో పాటు, డాక్టర్ రమాశంకర్,డాక్టర్ రఘు,యురాలోజీస్ట్ డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ వెంకటేశ్వర్ లు కలిసి మళ్ళీ అన్నీ పరీక్షలు చేశారు. మొదట ఒక కిడ్నీ తీసేసి నెల తర్వాత ఇందిర కిడ్నీ తో మరో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిశ్చయించారు. వైద్య నిర్ణయంలో మీరే ఫైనల్ అని నేను సరేనన్నాను. కిడ్నీ రిమూవల్ సర్జరీ బాగా జరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే పెరిటోనియల్ తీవ్రమయిన ఇన్ఫెక్షన్ అయి ఫెయిల్ అయింది. దాని ఫలితంగా నేను ఎదుర్కొన్న నొప్పి చాలా తీవ్రమయింది. ఇంటి కప్పు ఎగిరిపోయేంతగా అరిచాను. మళ్ళీ ఆసుపత్రిలో చేరాను. దానికి మళ్ళీ ట్రీట్ మెంట్. డ యాలిసి కోసం మెడ దగ్గర మళ్ళీ ఆపరేషన్. కిరాయి ఇంటికీ ఆసుపత్రికీ నడుమ తిరగడం. కరీంనగర్ లో రేలా బీటెక్ అప్పుడు కొన్న స్కూటీ వుంది. అది తెచ్చుకుంటే బాగుండు అనుకున్నాం.ఇందిర కజిన్ బ్రదర్ సింగరేణిలో పని చేసే శ్రీ మెట్టు సుగేందర్ రావు గోదావరిఖని నుండి వస్తూ బండిని తాను తీసుకొచ్చాడు. రేలకి అది ఎంతగానో ఉపయోగపడింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాడమే కాకుండా ఇందిరను వెంట తీసుకుని ఇతర పనులకోసం వెళ్లడానికి స్కూటీ ఎంతగానో ఉపయోగ పడింది.

అట్లా నెల రోజులపాటు

యుద్దం జరుగుతూనే వుంది

లోపలా బయటా

గెలుపును చేరుకోలేను ఓటమిని అంగీకరించనూ లేను

కొనసాగుతున్న యుద్దంలో

గెలుపోటములు ఎవరు నిర్ణయిస్తారు

కత్తులూ కటార్లూ లేవు గానీ

బతుకుతెరువు యుద్దమే

బతహకదమూ యుద్దమే

కళ్లుతెరిచింది మొదలు మూసెంతవరకూ

క్షణ క్షణం అడుగడుక్కీ

యుద్ద విన్యాసాలూ పోరు సన్నాహాలే

ముగియని యుద్దంలో

విజేతలెవరు పరాజితులెవారు

పోరు అనివార్యమయిన చోట

యుద్దమొకటే సిద్దాంతం

కాలు కదపడమే కర్తవ్యం

+++++

అదే ఆనాటి నాపరిస్థితి. అట్లా ఒక కిడ్నీ తీసేయబడి, డయాలిసిస్ కొనసాగుతూ వుండగానే అనేక సంఘటనలు జరిగాయి. ఒక్కోటి ఒక్కో అనుభవం..

ఆ వివరాలతో మళ్ళీ వారం.. కలుస్తాను

+++ వారాల ఆనంద్

4 ఫిబ్రవరి 2024

User comments
యాదోంకీ బారాత్ 2-సిరీస్, నం.4 +++++ వారాల ఆనంద్
User comments

యాదోంకీ బారాత్2-సిరీస్,న0-3

Posted on

యాదోంకీ బారాత్

2-సిరీస్,న0-3

+++++++++++++ వారాల ఆనంద్

చావు నన్నెప్పుడూ భయపెట్టలేదు

నేను చావును భయాపెడదామన్నా కుదర్లేదు

ఊపిరి తీసుకోవడం/రెప్పలు టప టప  లాడించడం/నాకెవరూ నేర్పలేదు

గాలి వీచినంత సహజంగా/వెళ్తురు కురిసినంత స్వచ్ఛంగా అవి నాతో అల్లుకు పోయాయి

ప్రేమించమనీ ద్వేషించమనీ నాకెవరూ చెప్పనేలేదు/మంచు చల్లగానూ నిప్పులు వేడిగానూ వున్నంత నిజంగా/నా లోనే పుట్టాయి

ఇష్టాల్నీ అయిష్టాల్నీ ఎవరూ బోధించనేలేదు/వాన కురిసినట్టు పిడుగు రాలినట్టు/ఎక్కడినుంచో ఎగిసి దుమికాయి

బతకమనీ బతుకు నేర్వమనీ/చావు అనీ చావు తథ్యమనీ/ఎవరూ దారి చూపాల్సిన పని లేదు

బతుకును నమ్మిన వాణ్ని

చావెప్పుడూ భయపెట్టలేదు

గడప దాకా వచ్చి వెళ్లిపోతుంది.

++++

ఈ మాటలు నేనే రాసుకున్నాను. వాటిని నేను నమ్మాను. కనుకే రాసుకున్నాను. నా విషయం లో సరిగ్గా అట్లే జరిగింది. తీవ్రమయిన అనారోగ్యం కమ్ముకుంది. రెండు కిడ్నీలు పాడయ్యాయి. విషయం తెలిసిన ఆత్మీయులు, స్నేహితులూ అంతా కంగారు పడ్డారు. అంతేకాదు ఆనంద్ పరిస్థితి ఏమిటో ఎట్లా వుంటుందో అనుకున్నారు. ఆవేదనపడ్డారు. కొంతమంది అయితే ఆశలు వాదులుకున్నారు. కానీ డాక్టర్లు డయాలిసిస్ అన్నారు. గ్లోబల్ ఆసుపత్రిలో కాకుండా సన్ షైన్ లో ఆరంభమయింది.

ఆసుపత్రి అనగానే ఎన్నో భావాలు ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. కె.శివారెడ్డి గారి ‘ఆసుపత్రి గీతం’  మదిలో మెదిలింది. ప్రభుత్వ దవాఖానా అయినా, కార్పొరేట్ దవాఖానా అయినా దవాఖానా దవాఖానే కదా. చిన్నప్పటి నుండీ వేములవాడలో   చూసిన తాతయ్య డాక్టర్ సుబ్రమణ్యం గారి దవాఖానా గుర్తొచ్చింది. అక్కడి కషాయాలూ గోలీలు గుర్తొచ్చాయి. కానీ ఇప్పటి దవాఖానా వేరు.  ఒగదిలో బంధిస్తారు. స్టాండ్ కు గ్లూకోస్ బాటల్ వేలాడుతూ వుంటుంది. డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నర్సులూ వస్తారు. పరిశీలిస్తారు. పలకరిస్తారు. ఏవేవో చెప్పి అయిదునిమిషాల్లో వెళ్తారు. తర్వాత ఇందిరా నేను మిగుళ్తాం. వారి రూల్స్ ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో సందర్శుకుల్ని అనుమతిస్తారు. అట్లా ఒంటరిగా వుండాల్సిందే.  మొదటి ఫిస్టులా అన్నీ రోజులూ చాలా కష్టంగా గడిచాయి. పరిస్తితి అంతా స్పష్టా స్పష్టం.

డిశ్చార్జ్ అయ్యాక అర్జున్ ఇంటికి ప్రయాణం. వారానికి మూడుసార్లు డయాలిసిస్ కి వెళ్ళాలి. అర్జున్ కొంత ఫ్రీగానే వుండడం రాజు మా వెంటే వుండడం రాక పోకలకు నా విషయంలో కొంత అనుకూలమయింది. సౌకర్యమయింది.  ఇదంతా ఇట్లా వుండగా ‘మిమ్మల్ని చూడడానికి అమ్మా నాన్న వస్తామంటున్నారు’ అన్నాడు. ఈ వయసులో వారెందుకులే అన్నాను నేను . హైదరబాద్ లోనే వున్నారు కదా. నేను భౌతికంగా పర్లేదు కాదా బెడ్ రిడేన్ కాదు. మనమే వెళ్దాం అన్నాను. రాజూ నేనూ ఇద్దరమూ హయాత్ నగర్ లో వున్న ఇందిరా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాం. ఇందిరకు కొంత అయిష్టంగానే వున్నా నేనే ఒప్పించాను. పెద్దవాళ్ళు పోనీలే అని. అట్లా రొగే సందర్శకుల వద్దకు వెళ్ళడం సరదాగానే అనిపించింది.

ఇక సరిగ్గా అదే సమయంలో ఉస్మానియాలో పర్యావరణ అంశంలో రిఫ్రెషర్ కోర్సు వచ్చింది. కాలేజీనుంచి ప్రిన్సిపాల్ మురళి  గారు  రిలీవ్ చేశారు. హైదరబాద్ లోనే వుంటారు కదా అటెండ్ కండి అన్నారు. లీవ్ మిగులుతుంది కదా అని నేనూ సిద్దపడ్డాను. ఉస్మానియా అకాడెమిక్ కాలేజీలో అప్పటికే రెండు కోర్సులు చేసి వున్నాను. ఒకటి లైబ్రరీ సైన్స్ లోనూ మరొకటి ఓరియెంటేషన్ కోర్సు. లైబ్రరీ కోర్సు కు ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు బాధ్యుడు. బాగా స్ట్రిక్ట్ గా నడిపారు. తర్వాతి ఓరియెంటేషన్ కి ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి గారు బాధ్యులు. ఆయనా అంతే. టైమ్ పాబంది. అయితే తానే అప్పుడు కోర్సులో పార్టీసిపెంట్ అయిన నాతో ORIGIN  AND EVOLUTION OF CINEMA అన్న అంశం మీద క్లాస్ ఇప్పించారు. ఆడియో విజువల్ తో కూడిన నా క్లాస్ అందరినీ బాగానే ఆకట్టుకుంది. అదంతా అట్లుంటే ఇప్పుడు ఓ పక్క డయాలిసిస్ మరో పక్క కోర్సు. కానీ ఈసారి ఇంచార్జ్ ప్రొఫెసర్ జన్యుశాస్త్రానికి చెందిన వాడు. ఆయనకు తన రీసర్చ్ క్లాసులు అవీ ఇంపార్టెంట్ కావడం తో అకాడెమిక్ కాలేజీ బాధ్యతల్ని అంతా సీరియస్ గా తీసుకోలేదు. దాంతో నాకు చాలా సులభమయింది. 3-4 వారాలపాటు అలాగే గడిచింది. వారంలో సోమ, బుధ,శుక్ర వారాల్లో డయాలిసిస్. మిగతా సమయాల్లో పర్యావరణ కోర్సు. సాన్ షైన్ ఆసుపత్రిలో డయాలిసిస్ విభాగం లో వున్న సురేశ్ చాలా స్ట్రిక్ట్ గా వుండేవాడు. శుచీ శుభ్రత ఖచ్చితంగా పాటించే వాడు . అదంతా రోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా వుండేందుకే అనేవాడు.  నిజమే కదా అనిపించినా ఆయన ఖచ్చితతత్వం ఒక్కోసారి కోపం తెప్పించేది. అయినా తప్పదు మరి. నన్ను లోనికి పంపించి ఇందిర బయట కూర్చునేది. అర్జున్ కు కూడా కాలం వెచ్చించడం కష్టంగానే వుండేది. హైదరబాద్ లో తొలి డైయాలిసిస్ అంకం అట్లా ముగిసింది. మంచయినా చెడు అయినా మొత్హంగా ఏ అనుభవమయినా మనిషికి మొదట కష్టంగా వున్నప్పటికే కాలం గడుస్తూ వుంటే అలవాయిపోతుంది. రొటీన్ అయిపోతుంది. డయాలిసిస్ కూడా నాకు రొటీన్ నాలుగు వారాలకే జీవితంలో భాగమయిపోయింది.

         అదే సమయంలో సహచరి ఇందిర కిడ్నీ ఇవ్వడానికి సిద్దపడింది. ఇందిర సోదరుడు బాలరాజు మొదలు పలువురు తన కిడ్నీ ఇచ్చి కష్టపడేకంటే ‘జీవందాన్’ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని గురించి వివరాలు తెలుసుకుంటే అదంతా త్వరగా కాదని తెలిసింది. అదంతా కాదు తన కిడ్నీ ఇవ్వడమే కరెక్ట్ అని ఇందిర పట్టుబట్టింది. దానికోసం మాచింగ్ తదితర టెస్ట్ చేయాలి. అప్పుడే ఎవరో సలహా ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో ఒక మంచి నెఫ్రాలజిస్ట్ వున్నాడు. కలవమని చెప్పారు. సరే వెళ్ళాం. అక్కడ అనేక టెస్టులు చేశారు. వేలాది రూపాయల బిల్ అయింది. కార్పొరేట్ హాస్పిటల్ అంటే చాలు టెస్ట్స్ అండ్ రేపోర్ట్స్ కదా. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. మాచ్ అవుతున్నట్టు తెలుస్తున్నది. చాలా ఉత్సాహంగా నిర్దేశిత సమయానికి ఇద్దరం వెళ్ళాం.   ముందు బయట డాక్టర్ ఇన్ చీఫ్ కు ఆసిస్టంట్ గా వున్నతన్ని కలిశాం. తర్వాత డాక్టర్ ఇన్ చీఫ్ ని  కలవమన్నారు. అన్నీ రిపోర్ట్స్ చూసి అంతా ఓకే అంటూనే ‘మీ ఇంట్లో ఎవరికయినా సుగర్ వుందా?’ అని ఇందిరను అడిగారు. మా అమ్మకి చాలా ఏళ్లుగా వుందని ఇందిర అంది. అంతే అయితే మీకు కూడా సుగర్ వచ్చే అవకాశం వుంది. దాతగా మీరు అనర్హులు అన్నాడాయన, తనకి సుగర్ లేదు కదా అని నేన్నాను. ఇందిర ఆదేమాట అంది. ఆయనకు బాగాలేకుంటే మీరు వెంట వుండి తిరుగుతున్నారు.రేపు మీరు కూడా సిక్ అయితే మీ ఇద్దరినీ వెంటబెట్టుకుని ఎవరు తిరుగుతారు. అందుకే దాతగా మీరు సరికాదు అన్నాడాయన. అంతే మేం హతాశులమయ్యాము. అంతా సజావుగా వుంటుదనుకున్న సమయంలో పిడుగుపడినట్టు అయింది. ఇందిర ఒకటే ఏడుపు. పిచ్చా చూద్దాం.డయాలిసిస్ నడుస్తుంది కదా అని ఊరడించాను.

ఇంకేముంది ఉస్మానియా లో కోర్స్ అయిపోయింది. మేమిద్దరం బయలుదేరి కరీంనగర్ చేరుకున్నాం. కాలేజెలో జాయిన్ అయ్యాను. సోమ బుధ,శుక్ర మూడురోజులు డయాలిసిస్ కోసం హైదరబాద్ వెళ్ళడం రావడం. ఉదయాన్నే నాలుగింటికి లేచి రెడీ అయి టీ తాగి 5 గంటలకల్లా బస్ ఎక్కడం. జూబ్లీ బస్ స్టాండ్ లో దిగడం. సన్ శైన్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడే వున్న హోటల్ లో బ్రేక్ఫాస్ట్ చేయడం. లోనికి వెళ్ళి నేను దయాలిసీస్ హాలుకి వెళ్ళడం. ఇందిర బయట వైటింగ్ హాల్ లో కూర్చోవడం. 8-12 నాలుగు గంటలు అయ్యాక బయటకొచ్చి. కింద వున్న అదే హోటల్ లో లంచ్ చేసి బస్ ఎక్కడం. కరీంనగర్ చేరుకోవడం. అదీ మా కార్యక్రమం. అయిదారు నెలల పాటు సాగిందా కార్యక్రమం. కాలేజీ బాగా సపోర్ట్ చేసింది.

అప్పటికి కరీంనగర్ లో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ప్రతిమ, చలిమెడ ఆనందరావు కాలేజీలు. ప్రతిమలో దయాలిసి ఫెసిలిటీ వుందని తెలిసి అక్కడికి వెళ్ళాం. టెక్నీషియన్ గా వున్న శ్రీనివాస్ మా కాలేజీ స్టూడెంట్. దాంతో మంచి సహకారం లభించింది. కానీ మొదట అన్నీ రక్త పరీక్షలు చేయాలన్నాడు. నారిపోర్ట్స్ లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. సార్ ఎక్కడ తగిలిందో ఏమో కానీ డయాలిసిస్ అందరితో చేయలేం అన్నాడు. బయటకొచ్చి అక్కడే అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా వున్న మా మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.రాంచనర్ రావు గారిని కలిశాం. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం తో ఇందిర ఏడ్చేసింది. ఆయన తండ్రిలాగా ఆమెను ఓదార్చాడు. అంత కంగారుపడితే ఎట్లమ్మా ఏం కాదు అంటూ ధైర్యం చెప్పాడు. రాత్రి షిఫ్ట్  లో డయాలిసిస్ కి ఏర్పాట్లుయాయ్యాయి. కానీ అది చాలా కష్టం. తిరిగి డాక్టర్ గందే శ్రీధర్ ని కలిశాం. తాను వారం వారం కరీంనగర్ వస్తాడు. అంతకు ముందు ప్రతిమలో కన్సల్టెటెంట్ కా వున్నాడు. వివిషయం చెప్పగానే పెరిటోనియల్ డయాలిసిస్ వుంది అది మీరే ఇంట్లో చేసుకోవచ్చు అన్నారు. అయితే పొట్టకు ఒక ఆపరేషన్ చేయాలి అన్నాడు.హైదరబాద్ వెళ్ళాం. సర్జరీ పూర్తి అయ్యాక కరీంనగర్ వచ్చాం.  ట్యూబ్ ద్వారా చేసే ఆ ప్రక్రియ ఇంట్లో చేసుకోవచ్చు. కానీ అది ప్రతి ఎనిమిది గంటల కొకసారి చేయాలి. కానీ అత్యంత పరిశుభ్రమయిన వాతావరణంలో చేయాలి. ఇందిరకు కొంత శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకమయిన వాటర్ బాటిల్స్ తెప్పించడం. ఆ ప్రక్రియ చెప్పుకోవడం సులభమే కానీ నిర్వహణ చాలా కష్టం. పొట్టనుంచి పైప్ బయటకు వుంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువ. అయిన దాన్ని కొనసాగించాం.   

   అట్లా డాక్టర్లు, వైద్యం,మందులు, వాటి మధ్య అటు మానసికంగానూ, ఇటు ఆర్థికంగానూ తీవ్రమయిన ఒత్తిడి,

మెడికల్ రి ఇంబర్స్మెంట్ ఒక పెద్ద ప్రహసనం…

మిగతా వచ్చేవారం…

  • వారాల ఆనంద్

9440501281   

A POEM A DAY “లయ”

Posted on

‘A POEM A DAY’
26 JAN 2024
“లయ”

A POEM A DAY” కన్నీటి ధార

Posted on

‘A POEM A DAY’
25 JAN 2024
“కన్నీటి ధార”


A POEM A DAY ‘ఇసుక పలక’

Posted on

‘A POEM A DAY’

23 JAN 2024

“ఇసుక పలక”

‘A POEM A DAY’ “గెలుపు కోసమే”

Posted on

‘A POEM A DAY’
22 JAN 2024
“గెలుపు కోసమే”

IRUGU PORUGU’ జీతేంద్ర వాసవ

Posted on

‘IRUGU PORUGU’ జీతేంద్ర వాసవ
గుజరాతీ కవిత
21 JAN 2024

YADONKI BARATH 2 SERIES No2

Posted on

“యాదోంకీ బారాత్”
(2-సిరీస్, no–2)
+++++++++++++++ వారాల ఆనంద్
తల పైకెత్తి విశాలమయిన ఆకాశాన్ని / ఆశగా అందుకోవాలనుకున్నాను
కానీ/ నా చేతులు చాలా చిన్నవి

తల వంచి నేల వైపు చూసి/ ఉత్సాహంగా భూప్రదక్షణ చేద్దామనుకున్నాను
కానీ/ నా పాదాలు చాలా చిన్నవి

ప్రపంచ సాహిత్యాన్నంతా/ ఆసక్తిగా చదివేద్దామనుకున్నాను
కానీ వయసుడిగిన చూపులు మందగించాయి

వెధవది మనిషిలాగే నిలకడలేని కాలం/ ఎవరో తరుముతున్నట్టు
ఒకటే పరుగు
******
2013 వరకు నాది మూడు సినిమాలూ, ఆరు ఫిల్మ్ ఫెస్టివల్స్, రెండు కవితలూ నాలుగు సంకలనాలుగా నడిచిపోతున్న జీవితం. కానీ 2013 ఆగస్ట్ మొదటి వారంలో ఒక్కసారిగా ఉరుమూ మెరుపూ లేకుండా పిడుగుపడింది. తీవ్రమయిన ఆరోగ్యసమస్య ఎదురయింది. ఎటూ పాలుపోలేదు. మొదట ఇంట్లో సహచరి ఇందిరకు కూడా విషయం చెప్పలేదు. నెఫ్రాలజిస్ట్ ని కలిశాక చూద్దాం అనుకున్నాను. కాలేజీలో ఆత్మీయ మిత్రుడు లెక్చరర్ తోట రమేశ్ కు మాత్రం విషయం చెప్పాను. ఏదో తేల్చుకోవాలి అన్నాను. ‘ఏముండదు లే భయ్యా’ అంటూ భుజం తట్టాడు.
డాక్టర్ మేకా విజయ మోహన్ రెడ్డి గారు సూచించినట్టు 7వ తేదీ బుధవారం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ రోడ్డులోవున్న న్యూ శ్రీనివాసా మెడికల్స్ ఆవరణలో వున్న క్లినిక్ కి వెళ్ళాను. విజయమోహన్ గారి సిఫార్సు, మెడికల్ రిపోర్టూ తీసుకుని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గందే శ్రీధర్ గారిని కలిశాను. ఆయన్ని చూడగానే యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనిపించింది. స్లిప్ చూసి మళ్ళీ ఒకసారి రక్త పరీక్ష, అల్ట్రా సౌండ్ స్కాన్ చేపిద్దామన్నారు. నేను సరే నన్నాను. డాక్టర్ ఓంప్రకాశ్ లాబ్ లో బ్లడ్ సాంపుల్ ఇచ్చి దగరలోనే వున్న లలితా డయాజ్ఞస్టిక్స్ లో డాక్టర్ నరేశ్ గారిని కలిశాను. స్కాన్ చేశారు. ఏముంది సార్ అన్నాను. కిడ్నీ సమస్య అన్నారాయన. ఏ స్థాయిలో వుందని అడిగాను. సమస్య అయితే వుంది తీవ్రత తదితర విషయాలు శ్రీధర్ గారు చెబుతారు అన్నారాయన. జవాబు అదే వస్తుందని తెలిసీ అడిగాను అనుకుంటూ నాలో నేనే నవ్వుకున్నాను. ఎందుకు నవ్వుతున్నారు అన్నాడాయన. ఆ ఏమీలేదండీ అని తప్పించుకున్నాను. రిపోర్ట్స్ తీసుకెళ్లి డాక్టర్ శ్రీధర్ ని కలిశాను. రిపోర్ట్స్ చూసి రెండు కిడ్నీల్లో సమస్య వుంది అన్నారు. వాటి వర్కింగ్ కన్దీషన్ ఏమీ బాగాలేదు అన్నారు. క్రియాటిన్ చాలా అధికంగా వుంది..ఎట్లా వచ్చారు మీరు అని అడిగారు. బైక్ మీద అన్నాను. వెంట ఎవరయినా వచ్చారా అన్నాడు. నేనొక్కన్నే వచ్చానని బదులిచ్చాను. ఆయన లేచి నా దగ్గరకు వచ్చి మీ ప్రస్తుత స్థితి మీ శరీరానికి అలవాటయింది అన్నారు. నాకేమీ పాలు పోలేదు. కంగారు పడకండి. ఎల్లుండి మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించండి. క్రియాటిన్ పెరిగితే నాకు ఫోన్ చేసి హైదరబాద్ వచ్చేయండి. లేదా నేను మళ్ళీ బుధవారం వచ్చినప్పుడు కలవండి అన్నారు. నా మనసు పరి పరి విధాలా పోతోంది. ఇంటికి చేరేసరికి ఇందిర ఎదురు చూస్తోంది. అప్పటికి తనకేమీ తెలీదు కదా. నేను ఆదుర్దా పడొద్దు అంటూనే పరిస్తితి తీవ్రతను చెప్పాను. ఆమె హతాశురాలయింది. ముందే నాకెందుకు చెప్పలేదు. నేనూ వచ్చేదాన్ని కదూ అంటుండగానే దుఖం మొదలయింది. నేనే అతి కష్టం మీద ఓదార్చే ప్రయత్నం చేయడం మొదలు పెట్టాను. అత్తయ్య కూడా ఈ సమస్య ఎదుర్కొని పోయింది కదా అంటూ తీవ్ర వేదనకు గురయ్యింది. రెండు రోజులకు మళ్ళీ టెస్ట్ చేయించాను. ఏముంది క్రియాటిన్ రెండు పాయింట్లు పెరిగి 7 అయింది. ఇంకేముంది సమస్య నిర్ధారణ అయింది. మంకమ్మతోట కు వెళ్ళి నాన్నకు విషయం చెప్పాను. ఆయన హతాశుడయ్యాడు. తమ్ముడు అమర్ శ్రీలతలు కూడా ఆందోళనకు గురయ్యారు. నేనే ఏమీ కాదు సోమవారం హైదరబాద్ కు వెళ్తాం. అక్కడ ఏమి చెబుతారో చూద్దాం అన్నాను. నేనయితే అత్యంత మామూలుగానే వున్నాను. బైక్ మీదే తిరుగుతున్నాను. కాలేజీలో మిత్రలందరికీ తెలిసింది. నేను ఇందిర కరీంనగర్ లో వున్న సన్ రైజ్ ఆసుపత్రిలో భాగస్వామిగానూ వైద్యుడిగానూ వున్న డాక్టర్ ఆకుల సదానందం,ఆయన శ్రీమతి మాధవిని కలవడానికి వెళ్ళాం. వాళ్ళు అప్పుడు హాస్పిటల్ పై అంతస్తులో వున్న రెసిడెన్స్ లో వుంటున్నారు. వెళ్ళి కలిసి విషయం చెప్పి మాట్లాదాము. మాధవి ఇందిర వాళ్ళ మేనబావ కూతురు మాతో చాలా స్నేహంగా వుండేది. సదానందం కూడా అంతే. వాళ్ళతో మాట్లాడ్డం ఎంతో కొంత ధైర్యం. అప్పుడే ఆత్మీయ మిత్రుడు నారదాసు లక్ష్మణ రావుకి ఫోన్ చేశాను. విషయం చెప్పగానే డాక్టర్ జి.శ్రీధర్ అన్నావు కదా ఆయన మా దగ్గరి బంధువు. మానవడి వరుస. నువ్వేమీ కంగారు పడొద్దు. సోమవారం హైదరబాద్ వచ్చేయి. నేను నీకు గార్డియన్ గా వుంటాను. ట్రీట్మెంట్ గురించి భయం ఆందోళన అసలే వద్దు అని ధైర్యంగా మాట్లాడాడు. ఎంతగానో ధైర్యం చెప్పాడు. ఓకే ఒకే . సోమవారం లక్దికాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో కలుద్దాం అన్నాను. దామోదర్కి జింబో తదితర మిత్రులకు చెప్పమన్నాను. శనివారం అతి కష్టం మీద గడిచింది. ఆదివారం మధ్యాహ్నం బయలుదేరాలనుకున్నాం. ఇందిర నేనూ. అమ్మాయి రేల హైదరాబాడ్లోనే వుంది. అన్వేష్ ట్రివేండ్రం లో ఐ.ఐ. ఎస్.టి. లో ఏవియానిక్స్ చదువుతున్నాడు. హైదరాబాడ్లో వుంటున్న తమ్ముడు అర్జున్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నాం. వరంగల్ లో వున్న ఇందిర సోదరుడు బాలరాజు కు సమాచారం ఇస్తే తానూ కరీంనగర్ వచ్చాడు. ఇక ఆదివారం ఎస్.ఆర్.ఆర్. కాలేజీనుంచి, విమెన్స్ కాలేజీనుంచి, మా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ మిత్రులు అంతా ఇంటికి రావడం మొదలు పెట్టారు. చాలా మంది మిత్రులు ధైర్యంగానే వున్న నాకు మరింత ధైర్యం చెప్పారు. మిత్రుడు నరెడ్ల శ్రీనివాస్ ఇందిరను పక్కకు పిలిచి డబ్బులు వున్నాయా ఏమయినా కావాలా అని అడిగాడు. వున్నాయి ఫర్వాలేదండీ అంది ఇందిర. ఒక బంధువు అయితే ఈ జీవితం ఇంతే ఇక్కడ చేసిన వాటికి ఇక్కడే అనుభవించాలి అని గొప్ప వేదాంతం చెప్పాడు. ఇందిరకు విపరీతమయిన కోపం వచ్చింది నేనే సర్ది చెప్పాను. ఎవరి ఇంగితం వాళ్ళది అని. అప్పుడు ఎస్.ఆర్.ఆర్.కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మురళి. ఆయన ఎన్.ఎస్.ఎస్. లో చాలా గొప్పగా పనిచేసినవాడు. నాకు మంచి మిత్రుడు. ఆయన అందించిన సహకారం మరువలేనిది. నా చుట్టూరా అధికశాతం మిత్రులే. బంధువులున్నా స్నేహంగా వున్నవారే. ఇక ఏముంది ఆదివారం మధ్యాహ్నం నేనూ ఇందిర బాలరాజు బయలుదేరాం. నేరుగా చక్రిపురం కుషాయిగూడాలో వున్న అర్జున్ ఇంటికి చేరుకున్నాం. అర్జున్, ఉషలు కూడా ఎట్లా వుంటుందో నన్న ఆందోళనలో పడ్డారు. నేనే చూద్దాం అంటూ ధైర్యం చెప్పాను. ఆ రాత్రి అక్కడ ఒకింత భారంగానే గడిచింది. మర్నాడు ఉదయమే అర్జున్ కారులో నేను అర్జున్, రాజు ఇందిర లక్దికాపూల్ లో వున్న గ్లోబల్ హాస్పిటల్ కు బయలుదేరాం. రేల హాస్టల్ నుండి నేరుగా అక్కడికే వచ్చింది. నారదాసు లక్ష్మణ్ రావు, జింబో, కె.దామోదర్ రెడ్డి, పవన్ తదితర మిత్రులు అనేక మంది ఆసుపత్రికి రానే వచ్చారు. నేనేమో అందరితో మామూలుగానే కలివిడిగా తిరుగుతూ వుంటే ఇందిరా ఇతర మిత్రులు కట్టడి చేశారు. డాక్టర్ శ్రీధర్ రాగానే వెళ్ళి కలిశాం. అక్కడ మళ్ళీ క్రియాటిన్ టెస్ట్ చేశారు. ఏముంది 11 వచ్చింది. పెరుగుతూనే వుందన్నమాట. నన్ను బయటకు పంపి లక్ష్మణ్ రావు, జింబో, దామోదర్ లు డాక్టర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాధారణంగా క్రియాటిన్ 5-6 రాగానే డయాలిసిస్ కు అడ్వైస్ చేస్తాం ఆనంద్ కు అది 11కు చేరింది. తప్పదు వెంటనే డయాలిసిస్ చేయాల్సిందే. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ కు వెళ్ళాలి అన్నారు డాక్టర్. మీరు ఆలోచించుకుని చెబితే ఏర్పాట్లు చేస్తాము అన్నారు. ఇంకేముంది ట్రీట్మెంట్ ఫిక్స్ అయింది. ఇందిర లో ఆందోళన దుఖం పెళ్లుబుక సాగింది. మిత్రులంతా చర్చల్లో పడ్డారు. ఇందిరే ఒక సారి పటేల్ కు ఫోన్ చేయండి అంది. డాక్టర్ లక్ష్మినారాయణ పటేల్ సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో కార్డియాలజీ శాఖలో పని చేస్తున్నారు. తాను ఇందిర అక్కయ్య ఉష వాళ్ళ అల్లుడు, కూతురు విలాసిని కూడా అక్కడే మత్తు డాక్టర్. ఫోన్ లో విషయం చెప్పి సలహా అడిగాను. ఇక్కడికి వచ్చేయండి మామయ్యా మేమున్నాం కదా అన్నాడు. తర్వాత ట్రాన్స్ ప్లాంట్ వసతి వుందా అని అడిగాను. అదంతా తర్వాత వెంటనే వచ్చేయండి లేదా మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు. డయాల్సిస్ గ్లోబల్ లోనా సన్ షైన్ లోనా అన్నది ఫామిలి నిర్ణయమే ఫైనల్ అన్నారు ఇదంతా విన్న మిత్రులు. మేము తీసుకున్న నిర్ణయమే సంవత్సరకాలాన్ని బలితీసుకుంది. అర్జున్ కారులో బయలుదేరాము. సన్ షైన్ లో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని కలిశాం. అప్పటికి సాయంత్రం అయింది. మర్నాడుదయం డయాలిసిస్ కి ఏర్పాట్లు జరిగాయి. మెడ దగ్గర సర్జరీ చేశారు. ట్యూబ్ ఫిట్ చేసి రక్త శుద్ది ఆరంభించారు. నాలుగు గంటల పాటు సాగుతుందది. ఒంట్లోని రక్తమంత ఒక నాళం ద్వారా బయటకొచ్చి దయాలిసిస్ యంత్రంలోకి వెళ్ళి శుద్ధి అయి తిరిగి మరో నాళం ద్వారా ఒంట్లోకి చేరుతుంది. ఇదంతా కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. అంతసేపూ బెడ్ పైన పడుకునే వుండాలి. మెడ కదలొద్దు. సిస్టమ్ ఓపెన్ గా వుంటుంది కనుక ఇన్ఫెక్షన్ కి అవకాశం ఎక్కువ. అందుకే చాలా జాగ్రత్తగా శుచీ శుబ్రత తో వుండాలి. బయటివాళ్లను లోనికి రానీయరు. అదొక ఎయిర్ కండీషన్ వున్న జైలు వాతావరణం. ఇక నా శరీరాన్ని వాళ్ళకి అప్పగించేశాను. ‘సంపుకున్నా సాదుకున్నా’ మీయిష్టం అన్నట్టు. డయాలిసిస్ తర్వాత సన్ షైన్ లోనే వాస్కులర్ సర్జన్ తో చేతికి ఫిస్టులా సర్జరీ చేయించారు. మెడతో ఎక్కువ రోజులు డయాలిసిస్ చేయలేము. ఫిస్తులా తప్పనిసరి అనడంతో. వాస్కులర్ సర్జన్ పేరు గుర్తు లేదు కానీ మీరు కవి ఆట కదా అంటూనే ఫిస్టుల సర్జరీ పూర్తి చేశారు. ఓహో కవులను అభిమానించే డాక్టర్లూ వున్నారు అని సంతోష పడ్డాను. హాస్పిటల్ లో అడ్మిట్ అయిపోయాను. నా దవాఖానా యాత్ర మొదలయింది.
మా కాలేజీ మిత్రులు చాలా మండి హైదరబాద్ సన్ శైన్ ఆసుపత్రికి వచ్చారు. అందరికీ ఆందోళనే. ఎవరికీ అవగాహన లేదు. కొంచెంసేపు వుంది తిరుగు ప్రయాణం అయ్యారు. నాకే ఎందుకో ఇంకా కొంచెం సమయం వాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. బందువుల్లో కూడా హైదరబాద్ లో అందుబాటులో వున్న వాళ్ళంతా వచ్చారు. అందరి కళ్ళల్లోనూ కన్నీటి పొర. ఫిస్టులా సెట్ అయ్యేదాకా ఆసుపత్రిలో వుండి అర్జున్ వాళ్ళింటికి వెళ్ళాం
మిగతా మళ్ళీ వారం…
-వారాల ఆనంద్
21 JAN 2024

A POEM A DAY “ఎడారి”

Posted on

‘A POEM A DAY’

21 JAN 2024

“ఎడారి”

ఇరుగు పొరుగు ‘హాల్దార్ నాగ్ కవిత్వం’

Posted on

‘ఇరుగు పొరుగు’
20 JAN 2024
హాల్దార్ నాగ్ కవితలు

ఇరుగు పొరుగు

Posted on Updated on

‘ఇరుగు పొరుగు’ గుజరాతీ కవిత
“రుచి” మూలం: గోపికా జడేజా
19 JAN 2024

A POEM A DAY ‘చలనదర్పణం’

Posted on

‘A POEM A DAY’
19 JAN 2024
“చలనదర్పణం”

పెద్ద సమయం పట్టదు++++++ వారాల ఆనంద్

Posted on

FRIENDS,READ MY POEM PUBLISHED IN NAVATELANGANA TODAY,Tq

పెద్ద సమయం పట్టదు

+++++++++++++++ వారాల ఆనంద్

అంతా కనిపిస్తూనే వుంటారు

అందరూ వినిపిస్తూనే వుంటారు

కానీ

కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా   

కళ్ళముందే మొలుస్తున్న గోడలు

ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు

భ్రమాలోకపు గడీలు

తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు

చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు

ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది

నేనే

ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను

ప్రవాహంలా పరుగులుపెట్టాను

ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు

అలసట వొచ్చినప్పుడల్లా

‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని

పైత్యాన్ని వదిలించుకున్నాను

ఇవ్వాళ

ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి  

కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను

బంధాలకు కొత్త రూపునూ

అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను

మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ

అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ 

మనుషుల సమూహంలోకి

మమతల జాతరలోకి

నడక సాగిస్తున్నాను  

అస్తమయం తర్వాత

సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు

కొంచెం ఓపికుండాలి

ఒకింత విశ్వాసముండాలి

ఎంతయినా అందరమూ మనుషులమే కదా!

****************** 9440501281

15 APRIL 2024

Posted on

ఏమి జంతువది
+++++++++++++++

ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు

దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది

ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు

ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు

ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది

ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది

దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది

ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు

ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ

దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ

అందరూ దాని కోసం ప్రార్థించండి

ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్