AKSHARALA THERA
అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)
కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.
మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్
బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్
Friends,pl read my poem published today 15 April 2024 in Andhra Prabha daily, Tq
బతుకు సమీకరణం కాదు
++++++++++++ వారాల ఆనంద్
జీవితం నడుస్తున్నాదా
పరుగెడుతున్నదా చతికిలబడ్డదా
ఓ క్షణం వెనక్కి చూస్తూ
వేగం పుంజుకుంటున్నదా
వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!
నిటారుగా నిలబడిందా
వంగుతూ లేస్తూ
అంబాడుతూ లేస్తూ
అవతలితీరంకేసి చూస్తున్నాదా
ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు
నా బతుకు నాకూ
నీ బతుకు నీకూ తెలియాలి
లేదూ కెమెరా కన్నేసుకు చూసే
నీ ముందరి వాడికి తెలియాలి
అయినా బతుకు
ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే
దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు
నిజానికి
ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో
మెలికలు తిరిగే మలుపుల్తో
యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం
************ 9440501281
Image Posted on
CHUKKALA MUGGU ‘POEM’
Friends, pl click the link below to read my poem published today in sanchika online magazine, thanks to the editor- anand Anand Varala
https://sanchika.com/chukkala-muggula-va-poem/
గానుగ యంత్రం+కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)
గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)
గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది
ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది
గుండ్రంగా నెలలూ ఏడాదులూ లెక్కించకుండా
జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
మెడలో గంటలు గణగణ మంటాయి
కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగ్గొట్టుతూ నూనె తీస్తుంది
కొరడాని గట్టిగా ఝలిపించినప్పుడు
దేహం గాయాల పాలవుతుంది
కంటి రెప్పలు మూతబడతాయి
మెదడు మొద్దుబారిపోతుంది
అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది
వేగాన్ని పెంచమంటూ చిన్నాపెద్దా
తిట్టే తిట్లను భరించడం తప్ప
నిస్సహాయ చట్రానికి బంధీ అయిన దానికి
వేరే దారి లేదు
వెలకొద్ది మైళ్ళు నడుస్తుంది
అయినా వున్నచోటే వుంటుంది
వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు
ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేదు
ఒకరు రాత్రీ పగలూ కష్టపడితే
మరొకరు ఆనందం పొందుతారు
ఒకరు చెమటోడిస్తే
మరొకడు లబ్ది పొందుతాడు
అంతేకాదా
ఒకరిది దుఖమయితే నూనె మరొకరిది
ఈ ప్రపంచమే ఒక గానుగ యంత్రం
అది అట్లాగే నడుస్తుంది
మనిషిని ఎద్దులా మార్చేసి
మట్టి పొరల్లో కొర్చేశారు
++++++
ఆంగ్లానువాదం: కేహ్రీ సింగ్ మధుకర్
తెలుగు: వారాల ఆనంద్
******************************
11 March 2024
GULZAR ARTICLE ANDHRA PRABHA
కవిత్వంలో ప్రతీకలు మనసు తట్టి చేయి పట్టుకు నడిపిస్తాయి
++++++++++++++++++ వారాల ఆనంద్
ఒక కవిని గతంలో చదివినప్పటికీ ఆ కవిని మళ్ళీ మళ్ళీ చదవడం గొప్ప అనుభవం. “REVISITING ALWAYS REJUNAVATES “. ఒక కవిని లేదా ఒక కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి.కొత్త భావాలు ధ్వనిస్తాయి.సరికొత్త అనుభవాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కవి సరికొత్తగా దర్శనమిస్తాడు. ప్రేమగా ఆసక్తిగా వింటే ’Between the lines’ లోంచి ఆ కవి మనతో మరింత ఆర్తిగా, వేదనగా, సంతోషంగా మాట్లాడతాడు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజనకారుడు మనముందు ఆవిష్కృత మవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. ఎప్పుడూ ఇష్టంగా చదువుతూ వుండే గుల్జార్ ని ఆయనకు ‘జ్ఞాన్ పీఠ్’ ప్రకటించిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదవడం సరికొత్త అనుభవమే. గుల్జార్ కవిత్వాన్నీ వచనాన్నీ మొత్తంగా ఆయన సృజనని చదవడంలో అందుకున్న ఆనందం రెట్టింపులు అయింది.
ఆయన కవిత్వం తాను పాఠకుడితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ కవిత్వం నిండా ప్రతీకలు (ఇమేజేశ్) పరుచుకుని వుంటాయి. సాధారణంగా ఎప్పుడూ మనం చూసే చిత్రాల్ని, దృశ్యాలనే ప్రతీకలుగా చేసుకుని అతి సున్నితమయిన అంశాల్ని కవిత్వం చేస్తాడు. ఆయన కవితల నిండా మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం కనిపిస్తాయి. ఇట్లా గుల్జార్ కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి చదువుతూ వుంటే అనేక కోణాల్లో గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశమూ లభించిది. ఓ గొప్ప కవిని తిరిగి దర్శించడం అంటే ఇదేనేమో.
భారత దేశభజనలో జరిగిన హింసకు గురయిన కుటుంబం ఆయనది. పాకిస్తాన్ నుంచి సరిహద్దును దాటి ఈ పక్కకు వచ్చారు. అప్పుడు జరిగిన దుర్మార్గాలను స్వయంగా చూసిన గుల్జార్ ఆనాటి అనుభవాల్ని కవితలుగా కథలుగా రాశారు… ’ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్’ పుస్తకంగా వచ్చింది.
“అది ఇప్పటికీ నా మాతృభూమే
కానీ ఇకపై ఎప్పటికీ నా దేశం కాదు
అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల్లోని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరగాలి
నా కలలకు ఆధారాల్ని చూపుతూ
నా ముఖం మీద ముద్రలు వేయించుకోవాలి”
అంతేకాదు ‘నెగ్లెక్టెడ్ పోయెమ్స్’ లో
‘కళ్ళకు వీసా అవసరం లేదు
కలలకు సరిహద్దులు లేవు
నేను నా కళ్లను మూసుకుని
సరిహద్దును దాటి వెళ్తాను
మెహెంది హాసన్ ని కలవడానికి’ అంటూ తన వేదనని చెబుతాడు.
కవిగా రచయితగా గుల్జార్ అనేక భిన్నమయిన వైవిధ్యమయిన ప్రక్రియల్లో రాశారు. విభిన్న కళారూపాల్లో కృషి చేశారు. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా దృశ్య మాధ్యమంలో, సినీ గేయరచయితగా సంగీత ప్రపంచంలో గుల్జార్ ఆవిష్కరించిన కళాత్మకత ఎంతో విశాలమయింది, విలక్ష్ణమయింది. అయితే “ఎన్ని రూపాల్లో తన భావాల్ని వ్యక్తం చేసినప్పటికీ తనకు ‘అక్షరమే’ ఆలంబన అని, రచనే తన మౌలిక వ్యక్తీకరణ రూపమని” ఆయన అంటారు. సాహిత్యం విషయానికి వస్తే ఆయన కవిత్వం, కథలు, జ్ణాపకాలు, పిల్లలకోసం కథలు పాటలు, కవితానువాదాలు, త్రివేణి పేర మూడు లైన్ల చిన్న కవితలు, ‘టూ’ పేర ఒక ఇంగ్లీష్ నవల, కామిక్స్ , ‘చక్కర్ చలాయే ఘన్ చక్కర్’ నాటకం, ఇట్లా అనేక ప్రక్రియల్లో రాసారు. ఆయన ప్రధానంగా ఉర్దూ లో రాస్తారు. ఉర్దూ ఎంతమంది చదువుతున్నారు అది అంతరించి పోతున్న భాష అని ఎవరయినా అంటే గుల్జార్ అందుకు అంగీకరించడు. భాష ఎప్పటికీ అంతం కాదు. లిపి మారితే మారొచ్చు. కానీ భాష కు మరణం లేదు అంటాడాయన, మన దేశంలో పంజాబీ భాషను ఇప్పుడు గుర్ముఖీ లిపిలో రాస్తున్నారు, అదే పాకిస్తాన్లో వున్న పంజాబ్ లో ఉర్దూ లో రాస్తారు అంటాడాయన, మన దేశంలో ఉర్దూ పార్శీ ప్రభావంతోనూ, హిందీ సంస్కృత ప్రభావంతోనూ వుంది. కానీ ఇప్పుడు హిందీ ఉర్దూ ల్లో పెద్ద తేడా లేదు. సినిమాల్లో చూసినా బయట చూసినా వాడే హిందీలో అధిక శాతం ఉర్దూ మాటలే. అందుకే మనం దాన్ని హిందూస్థానీ అనాలి అంటాడు గుల్జార్. అయితే ఆయన రచనలు ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, బ్రిజ్, ఖరీబౌలి, హర్యాన్వి, మార్వారి భాషల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందాయి.గుల్జార్ తన సృజాత్మక వ్యక్తీకరణల్లో ఇంత వైవిధ్యాన్ని విలక్షణతను సాధించడానికి ఆయన తన 90 ఏండ్ల వయసులో కూడా తనలోని సున్నితత్వాన్ని పోగొట్టుకోక పోవడమే ప్రధాన కారణం. ఆయన ఇప్పటికీ క్రమం తప్పకుండా, క్షణం వృధా చేయకుండా చదువుతూనో రాస్తూనో మాట్లాడుతూనో వుంటారు. అదే ఆయన బలం. మరో వైపు చూస్తే గుల్జార్ తన రచనల్లో వివిధ భారతీయ, భారతీయేతర భాషల్ని, ఆయా భాషల్లోని మాండలికాల్ని, జాతీయాల్ని ఆలవోకగా ఉపయోగిస్తాడు. దానికి ఆయన చేసే వివిధ భాషల అధ్యయనమే ప్రధానమయిన భూమిక. గుల్జార్ రాసిన తొలి సినిమా పాట ‘బందిని’ లోని మేర గోరా అంగ్ లయ్లే.. పాట పూర్తిగా అవధ్. ఇక ఆయనకు ఆస్కార్ తెచ్చిన ‘జయ్ హొ.’లో పంజాబీ తో పాటు కొంత స్పానిష్ కూడా ధ్వనిస్తుంది. ఇక ఆయన కవిత్వంలో ఆయన పలికించే ప్రతీకలు ప్రధాన బలం. గుల్జార్ కవితలు, గజల్స్ లో జానపదుల ఒరవడి, అమీర్ ఖౌస్రో, గాలిబ్, బాబా బుల్లే షా లాంటి కవుల అధ్యయన ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచనల్లోని మరో ముఖ్యాంశం ఆయన కవిత్వంలోనూ జీవితంలోనూ వున్న ‘డౌన్ టు ఎర్త్, డౌన్ టు హార్ట్’ లక్షణం.అది ఎళ్ళ వేళల్లా ఆయన రచనల్లో ధ్వనిస్తూనే వుంటుంది. ‘కబీ రూహ్ దేఖీ హై.. ‘ అని ఆయన అన్నప్పుడు గుల్జార్ లోని తాత్వికత ఆవిష్కృతమవుతుంది.
చాలా విస్తృతంగా రాసిన గుల్జార్ కవితా సంకలనాల వివరాల్లోకి వెళ్తే ఆయన రచనల్లో ప్రధానమయినవి సెలెక్టెడ్ పోయెమ్స్, నేగ్లెక్టెడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్, సైలెన్సెస్, ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్, ప్లూటో, ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇటీవలే గుల్జార్ కవిత్వం లోంచి సేకరించిన కవితలతో కూడిన సమగ్ర సంకలనం ‘బాలో-పార్:..కలెక్టెడ్ పోయెమ్స్” వెలువడింది. రక్షందా జలీల్ ఆ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. మొత్తం 1400 పేజీల ఈ సంకలనంలో గుల్జార్ మూల కవితలు వాటి అనువాదాలతో కూడిన ఈ సంకలనంలో చాంద్ పుఖ్ రాజ్ కా, రాత్ పాశ్మీనేకీ, పంద్రా పాచ్ పచత్తర్, కూచ్ ఔర్ నజ్మే, ప్లూటో, త్రివేణి సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి.
++++
గుల్జార్ కవిత్వాన్ని గురించి మరింతగా చెప్పుకుంటే ఆయన ‘ఆకుపచ్చ కవితలు’తో సహా గొప్ప భావుకుడయిన ఆయన సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్ వుంటుంది. ఇక ఆయన భాష,,రచనా శైలి కూడా చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వం చదువుతూ వుంటే ఆయన వాడిన ఇమేజెస్లో వున్న ఒక తాజాదనం మనల్ని కదిలిస్తుంది. పాఠకుడి మనసు కదిలిపోతుంది.
ఈ కవిత చూడండి…
‘గగన సీమలో ఆకాశం
అతుకులు అతుకులుగా విడిపోతున్నది,
ఎన్ని ప్రాంతాల్నుంచి
ఈ గుడారం విడిపోతున్నదో
నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ
మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం పాఠకుడిపై గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది..
ఇంకో కవిత:
‘భయపడకు నేనున్నాను
భయపడకు నేనున్నాను
ఆ ఒంటరి ఆకు
చెట్టుకు ధైర్యాన్నిస్తూ
చెబుతూనే వుంది’
ఎంత నిబ్బరమయిన మాట’
ఇక ఆయనే రాసిన మరో కవిత…
నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి
నా కిటికీని తాకింది
అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా
బయటంతా చీకటి
లేచి వెళ్ళి బయట వర్షాన్ని
పలకరించే సమయం కాదిది
కెటికీ పరదాల్ని వేశాను
అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి
తడి తడి చేసింది
నా హాస్య చతురత మూగవోయింది
లేచి కిటికీల్ని దడాల్న మూసేశా
తిరిగి ముసుగేసుకొని పడకేసా
మనస్తాపం చెందిన వాన కోపంతో
కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది
మళ్ళీ తిరిగి రాలేదు
కిటికీ అద్దం పగుళ్లు మాత్రం
అట్లాగే వుండిపోయాయి
** * ఎంత భావుకతో కదా
ఇక మరో కవిత ఇట్లా సాగుతుంది
—
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
‘రాత్రులు’
దాడి చేయడానికి సిద్ధపడ్డాయి
అది ఓ సాలెగూడు
చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ
అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి
అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది
అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు
మరింత భయంతో వణుకొస్తుంది
‘జాతి’
కొందరి పదఘట్టనల క్రింద
నలిగిపోతున్నది
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
మరోసారి మెడలు వంచబడ్డాయి
తలలు తెగి రాలిపడ్డాయి
ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా
విభజించబడ్డారు
ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది
ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది
కొందరు చాలాసార్లు నన్ను
మంచెకు వేలాడదీసారు
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
*********************
పర్యావరణం గురించి అధికంగా మదన పడే గుల్జార్ రాసిన ఈ కవితను చూడండి
“ దళిత మొక్క”
ఈ అడవి మొక్కల కొమ్మల మీద
ఏవో కొన్ని పదాలు కనిపిస్తాయి
పూర్తి కవిత అయితే కాదు
భూమి పొరల్ని చీల్చుకుని బలంగా నిలబడడానికి
ఈ మొక్కల కెప్పుడూ పోషకాలుండవు
వాటికి పూల కుండీలుండవు
వేర్లకు పోషకాలు లభించడానికి
అవి రోడ్లపైకి విసిరేయబడతాయి
దుమ్ములో ఆకలితో ధర్మంతో బతుకుతాయి
కొన్ని సార్లు మరిన్ని చేట్లేమో
బురద నీటిలోకి ఊడ్చేయబడతాయి
ఆ బురద నీటిలోనే మురికి మట్టిలోనే
ఎదగడం మొదలెడతాయి
మళ్ళీ ఇంకో రోడ్డు మళ్ళీ ఇంకో తన్ను
ఇంకో దళిత మొక్క
**** మొక్క గురించి చెబుతున్నట్టే వున్నా దళిత మొక్కను ప్రతీకగా చేసి మొత్తం కవిత కోణాన్నే మార్చేశాడు.
కవిత్వం సంగతి ఇట్లా వుంటే వచనం విషయంలో కూడా కథలు, ఒక నవల, ఒక నాటకం రాసిన గుల్జార్ తన జ్ఞాపకాల్నీ రాశాడు. అవి పుస్తకంగా వచ్చాయి.
ACTUALLY … I MET THEM MEMOIR BY GULZAR (నిజంగా.. వాళ్ళని నేను కలిసాను- ఓ జ్ఞాపకం = గుల్జార్ ) ఇవన్నీ అద్భుతమయిన జ్ఞాపకాలు. ఏకబిగిన చదివిస్తాయి. గుల్జార్ తన ఇన్నేళ్ళ జీవితంలో ఎంతో మందిని కలిసాడు. కవులు, రచయితలు,దర్శకులు, నటీనటులు, గాయకులూ, సంగీత దర్శకులు వొహ్ గొప్ప జ్ఞాపకాలు, మరెన్నోగొప్ప అనుభవాలు. ఈ పుస్తకంలో తాను తన నిత్య జీవితంలో కలిసిన వాళ్ళ గురించి ప్రస్తావించారు. తన వృత్తి జీవితంలో తాను కలిసి పనిచేసిన వారి గురించీ రాసారు, అంతే కాదు తన పై వాళ్ళ ప్రభావాన్ని కూడా గుల్జార్ ఈ పుస్తకం లో సవివరంగా చెప్పారు. పుస్తకం శీర్షిక “నిజంగా.. వాళ్ళని నేను కలిసాను”లో నిజంగా అనడంలోనే గుల్జార్ కవితాత్మ కనిపిస్తున్నది. వాళ్ళని ఊరికే కలిసాను అని కాకుండా నిజంగా కలిసాను అంటే మనసు లోతుల్లోంచి కలిసి రాసాను అంటున్నాడు గుల్జార్. ఇదొక మంచి జ్ఞాపకాల తోరణం.
నిజానికి ఇది గుల్జార్ జీవిత చరిత్ర కాదు, ఎందుకంటే జీవితచరిత్ర రచనకు, జ్ఞాపకాలకు తేడా వుంటుంది. జీవితచరిత్రలో సమగ్ర జీవితం వుంటే జ్ఞాపకాల్లో కొన్ని ముఖ్యమయిన సందర్భాలు సంఘటనలు వుంటాయి. ఈ పుస్తకం నిండా జ్ఞాపకాలున్నాయి.
++++++++
నిజానికి మనిషి జీవితంలో జ్ఞాపకాలు మరుగున పడవు. చేతనా అంతఃచేతనల్లో ఎక్కడో ఒక చోట సజీవంగా నిక్షిప్తమయ్యే వుంటాయి. అందునా కవీ కళాకారుడి జీవితాల్లో జ్ఞాపకాలు హృద్యంగానూ సాంద్రంగానూ వుంటాయి. కావలసిందల్లా ఆ జ్ఞాపకాలని రాయాలనుకున్నప్పుడు మనసు, ఆలోచనలు తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలాన్ని పునర్ దర్శించాలి. వున్నది వున్నట్టు కల్పనారహితంగా రచన లో ప్రబిబింప జేయాలి. అప్పుడే ఆ జ్ఞాపకాలకు సాహిత్యంలో స్థానంతో పాటు గౌరవమూ లభిస్తాయి. ACTUALLY … I MET THEM MEMOIR BY GULZAR పుస్తకం అలాంటి గౌరవం ఇవ్వాల్సిన రచన. ఈ పుస్తకం ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. తొలుత బెంగాలీ పత్రిక ఆదివారం సంచిక కోసం గుల్జార్ ఇవి రాసారు. అవన్నీ కలిపి “పంటా భాటే” పేరున బంగాలీ లో పుస్తకంగా వచ్చింది. మహార్గ్య చక్రవర్తి ఇంగ్లీషులోకి చేసారు. పెన్గ్విన్ వాళ్ళు ప్రచురించారు.
…………. ఈ ACTUALLY … I MET THEM MEMOIR BY GULZAR లో గుల్జార్ తన గురువు మెంటార్ అయిన బిమల్ రాయ్ నుంచి మొదలు పెట్టాడు. తాను తన మొదటి పాట కోసం బిమల్ రాయ్ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితుల్లో వెళ్లిందీ ఆసక్తికరంగా రాసాడు. అనేక సంఘటనలను కథాత్మకంగా రాసారు గుల్జార్. ఈ పుస్తకంలో బిమల్ రాయ్ తో మొదలయిన ఈ జ్ఞాపకాల పరంపర సంగీతదర్శకులు సలిల్ చౌదరి, హేమంత్ కుమార్, ఆర్ డీ బర్మన్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ కుమార్, గాయకుడు కిషోర్ కుమార్, సంజీవ్ కుమార్, హ్రిషికేశ్ ముఖర్జీ, పండిట్ రవి శంకర్, భీంసేన్ జోషి, నటీమణులు సుచిత్ర సేన్, షర్మిళా టాగోర్, రచయిత్రి మహాశ్వేతా దేవి లాంటి అనేక మందితో తన పరిచయం, తనపై వారి ప్రభావం రాసారు. గుల్జార్ రాసిన విధానం మనతో మాట్లాడుతున్నట్టు వుండి చక చకా చదివిస్తుంది. అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పినట్టు అనిపిస్తుంది.
అట్లా కవిత్వమే కాదు వచనంలో కూడా గుల్జార్ పాఠకులని చేయి పట్టుకుని తన వెంట తీసుకెళ్తాడు, పాఠకుని చేయిపట్టుకుని వెంట నడుస్తాడు.
అనేక సృజన రూపాలు, అనేక రచనలు, సినిమాలు, పాటలు, పిల్లల కథలు పిల్లల పాటలు ఎన్నో ఎన్నెన్నో గుల్జార్ కలం నుండి వెలువడ్డాయి. ఆయన్ని ఎంత చదివితే అంతగా సున్నితమయిపోతుంది పాఠకుడి మనసు. ఆయన సాహిత్యమే కాదు ‘ఖోశిష్’ లాంటి ఆయన సినిమాలూ అంతే.
ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం రావడం అభినందనీయం. గుల్జార్ తో ఆ పురస్కారానికీ గౌరవం పెరిగింది.
+++++++++++++++++++++++++++++++
వారాల ఆనంద్
9440501281
GULZAR
మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024