Month: September 2022
‘అనువాదమే ప్రపంచ వారధి’
VARALA ANAND TALK SHOW
‘అనువాదమే ప్రపంచ వారధి’
VARALA ANAND TALK SHOW
pl click the link
గొప్ప ప్రేమికురాలు భావుకురాలు- అమృతా ప్రీతం
+++++++++++ వారాల ఆనంద్
భారతీయ చరిత్రలలోనే కాదు యావత్ ప్రపంచ మానవ చరిత్రలో భారత స్వాతంత్రానంతరం జరిగిన దేశ విభజన అత్యంత విషాదకర మయింది. హీనమయింది, ఇరు ప్రాంతాల్లో లక్ష లాది మంది ప్రజలు నిర్వాసుతులు అయ్యారు. వేలాది మంది హత్యలకు మారణ హోమాలకు గురయ్యారు..
PL CLICK THE LINK AND VIEW
కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్
కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్
++++++++ వారాల ఆనంద్
“నేను ప్రకృతిని అనుసరించను..నేనే ప్రకృతిని” నంటారు కున్వర్ నారాయణ్.
అంతేకాదు మనం రెండు ప్రపంచాల్లో బతుకుతాం..ఒకటి తాను సృష్టించిన ప్రపంచం.. మరోటి ఇతరులు సృష్టించింది..
నా ప్రపంచం మన ప్రపంచానికి భిన్నమయింది కావచ్చు కాకపోనూ వచ్చు.. అంటాడు
***********
Pl click the link for video
********
వర్తమాన హిందీ సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గొప్పగా ప్రభావితం చేసారు కున్వర్ నారాయణ్.
హిందీ సాహిత్య ప్రపంచంలో తనదయిన సృజనాత్మక నైపుణ్యాన్ని సాధించాడు. ఆయన సృజనాత్మక వ్యక్తీకరణలో సరళత, పదునయిన తాదాత్మ్యత కనిపిస్తాయి. మొత్తంగా సమతావాద దృక్పధం లో ఆయన రచనలన్నీ సాగాయి.
కున్వర్ నారాయణ్ రచనల్లో ‘జీవితం..కవిత్వం తో రూపొందింది’అన్న BORGES మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
కున్వర్ నారాయణ్ ఒక చోట ఇట్లా అంటాడు
‘నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను’…
హిందీ నవ్య కవిత్యోద్యమం తో మమేకమయిన కున్వర్ నారాయణ్ తన సరళమయిన భాష వ్యక్తీకరణలతో హిందీ సాహిత్యం లో ప్రత్యేక ముద్ర వేసాడు.
కున్వర్ నారాయణ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో వున్నారు.
ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసారు. కవిత్వం, కథలు,ఎపిక్, విమర్శ, వ్యాసాలూ, అనువాదాలు చేసారు. వాటితో పాటు సినిమా,సంగీతం, కళలు, మ్యూజింగ్స్ కూడా రాసారు.
++++
19 సెప్టెంబర్ 1927న జన్మించిన కున్వర్ నారాయణ్ తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య-ఫైజాబాద్ నగరాల్లో గడిపారు. ఆ కాలంలో ఆయన కుటుంబాన్ని టీబీ తీవ్రంగా కలిచివేసింది. అనేక మంది మృత్యు వాత పడ్డారు. చివరికి తనకు అత్యంత ప్రియతములయిన తల్లి, సోదరి కూడా టీబీ వ్యాధికి బలయ్యారు.
అనంతరం కున్వర్ పెద్దన్నయ్యతో కలిసి లక్నో నగరానికి చేరుకున్నాడు. అప్పుడు దేశమంతా గాంధీగారి ప్రభావం పెల్లుబుకుతున్న సమయం. లక్నో లో వాళ్ళిల్లు అనేక మంది రాజకీయ నాయకుఅకు వేదిక గా వుండేది. ఆక్రమం లోనే కున్వర్ నారాయణ్ జీవితంలో తొలి రోజుల్ని, ఆలోచనల్ని ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య కృపలానీ తీవ్రంగా ప్రభావితంచేసారు. ఒక సంవత్సరం బాంబే లో నరేంద్ర దేవ్ తో వున్న కున్వర్ తర్వాత
ఆచార్య కృపలానీ తో ‘విజిల్’ పత్రికలో పని చేసాడు. ఆ అనుభవం తన ఆలోచననీ దృష్టి కోణాన్నీ విస్తారం చేసింది.
కున్వర్ నారాయణ్ లక్నో విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో ఎం.ఎ. పూర్తి చేసారు. అప్పుడే ‘లేఖ్ సంఘ్’ అన్న సంస్థ తో మమేకమయి పని చేసారు. తర్వాత విదేశాలకు వెళ్ళిన కున్వర్ కవిత్వం పైన పాబ్లో నెరుడా, నాజిమ్ హిక్మాట్ లాంటి అనేక విదేశీ సృజనకారుల ప్రభావం పడింది. పోలాండ్, జెకోస్లోవేకియా, చైనా, రష్యా లాంటి దేశాల పర్యటన కున్వర్ ఆలోచనా పరిధిని విస్తృతం చేసాయి. 1956 లో విదేశాలనుంచి తిరిగి రాగానే కున్వర్ నారాయణ్ తొలి కవితా సంకలనం ‘చక్రవ్యూహ్’ వెలువడింది. ఆ కాలంలోనే ఆయన ‘యుగ చేతన’ అన్న పత్రిక కు సహా సంపాదకుడిగా పని చేసారు. తర్వాతి కాలంలో ‘నయా పత్రిక్’, ‘చాయానాత్’ అన్న పత్రికలకు కూడా సహసంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. ఎ పనిలో వున్నా ఎక్కడున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. తన సృజనని నిరంతరం నిలుపుకున్నారు. కవిత్వంతో పాటు అనేక కథల్నీ రాసారు కున్వర్. తర్వాత వెలువడింది ‘తీస్రా సప్తక్’. ప్రసిద్ధ కవి ఆగ్గేయ సంపాదకత్వం లో వెలువడిన ఆ సంకలనం లో వున్న ఏడుగురు కవుల్లో కున్వర్ నారాయణ్ ఒకరు.
తర్వాత కున్వర్ కవితా సంకలనం ‘పర్వేష్-హం తుమ్’
ఆ తర్వాత వచ్చిన “ ఆత్మజాయి” ఉపనిషత్తులలో వున్న నచికేతుని పాత్ర ఆధారంగా రాసిన రచన అది. అందులో జీవితము,మరణమూ, సంఘర్షణ లని మూలన్గాతీసుకుని చేసిన ఈ రచన తాత్వికంగా వుంటుంది. అందులో తమ కుటుంబ సభుల మరణాలూ వాటి ప్రభావాలూ అంతర్లీనంగా కనిపిస్తాయి.
70 వ దశకం వచ్చేసరికి కున్వర్ నారాయణ్ పై సినిమా, సంగీతం, నాటకం, చిత్రకళా ప్రభావాలు అధికమయ్యాయి. ఆ కాలంలోనే ‘నయా ప్రతీక్’, ‘చాయానాత్’ పత్రికలకు సహా సంపాదకత్వం వహించాడు. కొన్ని సాహితీ సంస్థల నిర్వహణ బాధ్యతా స్వీకరించాడు. 71 లో ఆయన వెలువరించిన ‘ఆమ్నే సామ్నే’ అన్న కథల పుస్తకం ఆనాటి సామాజిక రాజకీయాల పైన సంధించిన వ్యంగ్యాత్మక రచన గా వినుతికెక్కింది
అయితే ఆయనకు గొప్ప పేరుని అనేక అవార్డుల్నీ ఇచ్చిన పుస్తకం 1979 లోవచ్చిన “ కోయి దూస్రా నహీ’లో జీవితానుభవాల విస్తృతి కనిపిస్తుంది. 1999 కున్వర్ నారాయణ్ ‘ఆజ్ అవుర్ ఆజ్ సే పహలే’ అన్న సాహిత్య విమర్శ పుస్తకం వెలువరించారు. తర్వాత తన ఇంటర్వ్యూ ల తో కూడిన ‘మేరె సాక్షాత్కర్’ వచ్చింది. కున్వ నారాయణ్ అనేక సంవత్సరాల పాటు సినిమా, శాస్త్రీయ సంగీతాలను విశ్లేషిస్తూ విరివిగా రాసారు. పలు అనువాదాలు కూడా చేసారు.
2002లో ఆయన ‘ఇన్ దినో’ అన్న కవితా సంకలనం వెలువరించారు. తర్వాత ‘వాజస్రావాకే బహానే’ అన్న ఒతిహాసిక గ్రంధం ప్రచురించారు.
హిందీ సాహిత్య ప్రపంచంలో విలక్షణ కవిగా పేరుగడించిన కున్వర్ నారాయణ్ సృజనాత్మక ప్రభావం మొత్తం హిందీ బెల్ట్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయనకు సాహిత్యంలో అనేక జాతీయ అంతర్జాతీయ విశిష్ట అవార్డులు లభించాయి. అందులో కెనడా హాహిత్య అకాడెమీ అవార్డు, జ్ఞానాపీఠ్ పురస్కారం, కబీర్ సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, లోహియ సమ్మాన్, సలఖ్ సమ్మాన్, వార్శా విశ్యవిద్యాలయ గోల్డ్ మెడల్, ఇటలీ ప్రెమియో ఫెరోనియా లు కొన్ని మాత్రమే.
++++++
ఇట్లా హిందీ సాహితీ ప్రపంచంలో తనదయిన గొప్ప స్థానాన్ని పొందిన కున్వర్ నారాయణ్ ఎంపిక చేసిన కవితల్ని ఆయన కుమారుడు అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి ప్రతిభావంతంగా అనువదించారు. మూల రచనని యధాతతదంగా కాకుండా, భావం చెడకుండా చాలా గొప్పగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. అనువాదంలో అనేక మంది లాగా అకాడెమిక్ ఇంగ్లీష్ భాషను కాకుండా సృజనాత్మక ఆంగ్ల భాషను ఉపయోగించి ఈస్తేటిక్ ఫీల్ ని చివరంటా కొనసాగించారు. అది అనువాదకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సంకలనంలో అనువాదకుడు అపూర్వ మూల కవిత్వాన్ని “ EARLY MEDITATIONS, ROUGH ROADS OF HISTORY, JOURNEYS,THE RIVER DOES NOT GROW OLD, TREES, MITTORS AND SHADOWS,REMEMBERANCES, HUMANESQUE” విభాగాలుగా ఎంపిక చేసి కూర్చారు. చాలా గొప్ప కూర్పు.
1927లో జన్మించిన కున్వర్ నారాయణ్ తన 90 ఎల్ల వయసులో 15 నవంబర్ 2017 న పరమపదించారు.
ఆయన కవిత్వం అందరూ ముఖ్యంగా కవులూ సాహిత్యకారులూ తప్పకుండ చదవాలని నేను అభిలషిస్తున్నాను. ఈ సందర్భంగా కున్వర్ నారాయణ్ స్మృతికి నివాళులు అర్పించుకుంటూ, అనువాదాన్ని అందించిన అపూర్వ నారాయణ్ కి ధన్యవాదాలు
….. మీకోసం నేను చేసిన కున్వర్ నారాయణ్ కవిత్వ అనువాదాలు కొన్ని……
1) కొత్త మార్గం
————————
నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను
జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
కవిత్వానికి
అనుమానాస్పదంగా వున్న
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి
అందుకు మొదట
జీవితపు శక్తి మూలాల్ని
క్రియాశీలం చేయాలి
తర్వాత ఆ శక్తిని
బతుకు కక్షకున్న ఇరుసుకు
జత చేయాలి
అప్పుడు
గతంలో లాగా
‘యాంత్రికత’ లేని
‘మానవత్వం’ వైపు మరలిన
కొత్త మార్గం ఆరంభమవుతుంది.
——————————–
ఓ వింతయిన రోజు
—————
నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదు
అనేకమంది మనుషుల్ని కలిసాను
ఎక్కడా అవమానం ఎదురుకాలేదు
నేను రోజంతా సత్యమే మాట్లాడాను
ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
నేనివాళ అందరినీ విశ్వసించాను
ఎక్కడా మోసగింప బడలేదు
అద్భుతమయిన విషయమేమిటంటే
నేను ఇంటికి చేరుకోగానే
తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
నేనే అని కనుగొన్నాను
================
ఎనిమిదవ అంతస్తు పైన
+++++++++
నేను ఎనిమిదవ అంతస్తులోని
ఓ చిన్న ఫ్లాట్ లో
ఒంటరిగా నివసిస్తున్నాను
ఆ ఫ్లాట్ కు బయటకు తెరుచుకునే
రెండు కిటికీ లున్నాయి
అవి నన్ను తీవ్రంగా భయపెడతాయి
కిటికీలకు బందోబస్తుగా
గట్టి గ్రిల్స్ బిగించాను
బయటనుంచి ఏదో ఉపద్రవం
ముంచు కొస్తుందని కాదు
ఇంత ఎత్తులోకి చొచ్చుకొచ్చే
ధైర్యం ఎవడు మాత్రం చేస్తాడు
ప్రమాదమల్లా నా లోపలే వుంది
చుట్టూ ఈ ఒంటరితనం ఈ విసుగూ
భయ భ్రాంతులని చేసే ఆ అంశాలు
ఏదో ఒక రోజు నన్ను
ఈ కిటికీల్లోంచి బయటకు దూకే
ఒత్తిడి చేస్తాయేమో
====
ఆధునిక మళయాళ కవి కే.సచ్చిదానందన్
వారాల ఆనంద్
PL CLICK THE LINK FOR THE VIDEO
ఇవాళ మళయాళ కవిత్వంలో ఆధునికతకు పాదులు వేసిన కవుల్లో ముందు వరుసలో వున్న కవి కే.సచ్చిదానందన్. ఆయన మలయాళం లోనే 60 కి పైగా పుస్తకాలు వెలువరించారు. వాటిలో 21 స్వీయ కవితా సంకలనాలు, 20 కి పైగా అనువాద సంకలనాలు, పలు నాటకాలు, వ్యాసాలూ, యాత్రా రచనలు, ఆంగ్లంలో పలు విమర్శనా గ్రంధాలు వెలువరించారు. అంతే కాదు ఆయన సమగ్ర కవితా సంకలనం కూడా వెలువడింది.
ఆధునిక కవిత్వం మరాఠీ లో మర్దేకర్, కన్నడలో ఆడిగ, హిందీలో ముక్తిబోద్ ల తర్వాత చాలా కాలానికి మలయాళంలో 1960ల్లో ఆరంభమయింది. అదునికత ఎన్.వి.కృష్ణా వారియర్ రచనల్లో మొదట ధ్వనించి నప్పటికీ ముఖ్యంగా అయ్యప్ప ఫనిక్కర్, కక్కడ్, అత్తూర్ రవివర్మలతో ఆధునికత విస్తరించిందని చెప్పుకోవచ్చు. వారి రచనల ప్రభావం సచ్చిదానందన్ పైన ఆయన తరం పైన గొప్పగా వుంది అనవచ్చు.
“Poetry as I conceive it is no mere combinatorial game; it rises up from the ocean of the unsayable, tries to say what it cannot stay, to name the nameless and to give a voice to the voiceless” అన్నాడు సచ్చిదానందన్.
కవి అనేవాడికి కవిత్వం మినహా మరే మతమూ ఉండాల్సిన అవసరం లేదంటాడు సచ్చిదా. అంతే కాదు ‘I can be spiritual without being religious’ అనికూడా అన్నాడు
అంతే కాదు కవిత్వమంటే తాజాదనం. తాజాదనం అంటే సృజనాత్మకత, పునరావృతం కాని సృజన. రాసిందే రాయడం చెప్పిందే చెప్పడం కవిత్వం కాదు. కవిత్వం లో సత్యం వుండాలి. కవి అనేవాడు కవిత్వ వాస్థవాన్ని విశ్వసించాలి.
ప్రపంచీకరణ ను నిలువరించడానికి కేవలం కవిత్వం శక్తి చాలదు. కాని సాంస్కృతిక ప్రతిఘటన సాధ్యమవుతుంది. అదనుకు కవులు తమ మాతృభాషలో రాయాలి. ప్రపంచీకరణ ఎ విషయాలనయితే మరుగున పరచాలను కుంటున్నదో ఆ అంశాల పైననే దృష్టి సారించాలి.
ఇవాళ ప్రపంచీకరణ ప్రతి అంశాన్నీ సరుకు గా మారుస్తుంది. వినియోగ వస్తువుగా చూస్తుంది. కవిత్వం దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికి కేవలం కవిత్వమే ఇంకా వినియోగ సరుకుగా మారలేదు.
కవి ప్రజల్లో ప్రజలతో వుండాలి. ఆలోచించాలి, విశ్లేషించాలి నిరంతరం రాస్తూ వుండాలి. ఎక్కడయితే అణచివేత అరాచకం వుంటుందో గమనింఛి వాటి పైన రాయాలి.
కవిత్వానికి ప్రత్యేకంగా కోడ్ ఉండదు కానీ నీతి వుంటుంది. అదేమిటంటే కవి తనకు తాను నిష్కప టాంగానూ నిజాయితీగానూ వుండాలి.
సచ్చిదానందన్ కవిత్వంలో ఆధునికతతో పాటు,సరళత, సూటిదనం,ప్రతీకాత్మకత,వ్యంగం ముఖ్యంగా కనిపిస్తాయి.ఆయన కవిత్వం నిండా న్యాయం,స్వేచ్చ, ప్రేమ, ప్రకృతి, భాష, మరణం ప్రధాన అంశాలు. సచ్చిదానండకి కేవలం కవిత్వమే కాదు సంగీతం, పెయింటింగ్, సినిమాల పట్ల గొప్ప ఆసక్తి వుంది. వాటిని అధ్యయనం చేసి అనుభూతించే తత్వమూ వుంది. కేరళలో ఫిలిం సొసైటీ ఉద్యమం ఉదృతంగా వున్న 70 లలో అంటే అదూర్ గోపాలక్రిష్ణన్ చిత్రలేఖ ఫిలిం సహకార సంఘం ఏర్పాటు చేసి ‘స్వయంవరం’ రూపొందించి గొప్ప విజయాన్ని సాధించిన కాలం అది. అప్పుడే సచ్చిదానందన్ తాను అధ్యాపకుడిగా పని చేసిన ఇరింజలకుడా లో ఫిల్మ్ సొసైటీ స్థాపించి ఐసెన్ స్టీన్, గోడార్డ్, టార్కోవిస్కి, కురుసోవా, ఆన్జేలోపోలస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల సినిమాలతో రిట్రోస్పెక్తివ్ లను నిర్వహించాడు.
1946 లో త్రిస్సూర్ ప్రాంతం లోని పుల్లూట్ లో జన్మించిన సచ్చిదానందన్ ఆంగ్ల సాహిత్యం లో కేరళ విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేట్ ను కాలికట్ విశ్వవిద్యాలయం లోనూ పూర్తి చేసారు.సచ్చిదానందన్ మొదటి రచన కవిత్వం పై రాసిన వ్యాస సంకలనం ‘కురుక్షేత్రం’. తన తొలి కవితా సంకలనం ‘అంచు సూర్యన్’(అయిదుగురు సూర్యుళ్ళు)ను 1970 వెలువరించారు. అప్పటినుంచి అవిశ్రాంతంగా రచనలు చేస్తూ ఫనిక్కర్ సూచనల మేరకు అధ్యాపకత్వాన్ని వదిలి ధిల్లీ లో సాహిత్య అకాడెమి పత్రిక ఇండియన్ లిటరేచర్ కు సంపాదకుడిగా చేరిపోయారు అనంతరం అకాడెమి కార్యదర్శిగా పదేళ్ళు పనిచేసారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ లో స్కూల్ అఫ్ ట్రాన్స్లేషన్ లో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
అనేక భారతీయ భాషా కవులతో పాటు అనేక మంది అంతర్జాతీయ కవుల రచనల్ని మలయాళీ భాషలోకి అనువదించారు. పోలాండ్, ఇటలీ తో సహా పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సచ్చిదానందన్ పైన దర్శకుడు బాలూ మీనన్ బయోపిక్ రూపొందించి విడుదల చేసారు.
ఇట్లా కేరళనే కాదు మొత్తంగా దేశం గర్వించదగ్గ కవి సచ్చిదానందన్. సచ్చిదానందన్ కవిత్వం ఇప్పటికే అరబిక్, అస్సామీ,బెంగాలీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్,ఇటాలియన్, జర్మన్,గుజరాతీ,మరాఠీ, కన్నడ, తెలుగు, లాత్వియన్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడింది.
కే.సచ్చిదానందన్ అందుకున్న పురస్కారాల విషయానికి వస్తే ఒక్క కేరళ సాహిత్యాకాదేమీ నుంచే కవిత్వానికి, వచన రచనకు,అనువాదానికి, నాటకానికి, పర్యాటక రచన లకు వేర్వేరుగా అవార్డులు అందుకున్నారు. కేరళ సాహిత్య అకాడమీ వారి ఫెల్లోశిప్ కూడా అందుకున్నారాయాన. ఇక కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తన ‘మరన్ను వెచ్చ వస్తుకల్’ కు స్వీకరించారు.
సృజనరంగంలో ఆయన చేసిన కృషి దాదాపు అనితర సాధ్యం అనిపిస్తుంది. ఆయన మలయాళం లో ప్రధానంగా కవిత్వం, వచనం, నాటకాలు, పర్యాటక రచనలు చేసారు. ఆయన రచనలు అనేకం ఇతర భారతీయభాషల్లోకి అనువదించబడ్డాయి.ఆయనా ఇతర భాషలలోని రచనల్ని మలయాళం లోకి అనేకం చేసారు. నేరుగా ఇంగ్లీషులో రాసారు. ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ సాహిత్య వేదికల పైన మన దేశానికి ప్రాతినిథ్యం వహించాడు, లండన్,రష్యా, మాన్ట్రియల్, రొట్టార్ డాం, లాటి అమెరికా,లాహోర్లాంటి అనేక చోట్ల తన కవిత్వాన్ని వినిపించారు.
ఆయన రాసిన ‘నేను రాసేటప్పుడు’ WHILE I WRITE లోంచి కొన్ని కవితల అనువాదాలు మీకోసం…..
మూలం : కే.సచ్చిదానందన్
తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్
++++++++++
‘నడవ’ కారిడార్
————-
చాలాకాలంగా ఈ దారెంబడి
నడుస్తూనే వున్నా
కానీ
నా గదికి చేర లేకపోతున్నా
ఈ దారేమో
భూమధ్య రేఖలా
గుండ్రంగా సాగుతూనే వుంది
నిప్పుల కుంపటి లాంటి ‘సహారా’ను
ఈ పాదాలతో దాటడం కష్టం
గడ్డకట్టిన ఆర్కిటిక్ సముద్రం
ఈతకొట్టడాన్ని అనుమతించదు
నాకు తెలుసు
నా గది ఎక్కడో ఒక చోట వుంది
. . .
ఎప్పుడూ కలవని
ఓ నిజమయిన మిత్రుడు
ఎప్పుడూ రాయని
ఓ నిజమయిన కవిత
ఆ గదిలో నాకోసం ఎదురు చూస్తున్నారు
. . .
ఆ దారెంబడి వెళ్తున్న వాళ్ళని అడిగాను
ఈ దారెటు వెళ్తుందని
పాపం
వాళ్ళకూ తెలియదు
గది తెరవడానికి తమ వద్ద
తాళం చెవులు లేకున్నా
వాళ్ళు కూడా తమ తమ గదులకోసం
వెతుకుతూనే వున్నారు.
————————–
వీడ్కోలు
———
పట్టాల మీద ఆన్చిన
తల
పరుగు పరుగున సమీపిస్తున్న రైలు చేసే
దడ దడ శబ్దాన్ని వింటూ
ఇనుప చక్రాల కింద
తన గొంతు
నలిగిపోక ముందు ఆలపించే
కలలు నిండిన గీతం
మన కవిత్వం
—————————————
నేను రాసేటప్పుడు
===========
నేను దుఖంతో రాస్తాను.
నదులేమైనా పొంగి పొర్లుతాయా ?
లేదు, నా చెక్కిళ్ళు
తడుస్తాయంతే.
నేను ద్వేషం తో రాస్తాను.
భూమేమైనా వణుకుతుందా, కంపిస్తుందా ?
లేదు, నా దంతాలు విరుగుతాయంతే.
నేను కోపంతో రాస్తాను.
అగ్నిపర్వతాలేమైనా బద్దలవుతాయా?
లేదు, నా కళ్ళు ఎరుపెక్కుతాయంతే.
నేను వ్యంగ్యంగా రాస్తాను.
ఆకాశాన రాలుతోన్న ఉల్కలేమైనా తళుక్కుమంటాయా ?
లేదు,నా పెదాలపై
విరుపు కన్పిస్తుందంతే
నేను ప్రేమతో రాస్తాను
నా భుజాలపై పక్షులు గూళ్లు కట్టేస్తాయి
పూలూ పళ్లతో చెట్లు వంగిపోతాయి
పొట్లాడుకుంటున్న మనుషులు పరస్పరం
ఆలింగనం చేసుకుంటారు
స్పటికమంతటి స్వచ్ఛ ప్రవాహంలా
భాష తనెంత లోతైనదో వెల్లడిస్తుంది
నా దుఃఖం, ద్వేషం, కోపం, వ్యంగ్యం —
సమస్తం అర్థాన్ని సంతరించుకుంటాయి
నేనేమో
కెవ్వుమంటాను సిలువ పై నుండి
+++++++++++++++++
బామ్మ
——————–
మా బామ్మకు మనో వైకల్యం
ఆ పిచ్చి ముదిరి మరణానికి దారి తీసింది
పిసినారివాదయినా మా మేన మామ
ఆమెను సామాన్ల గదిలో
గడ్డిలో చుట్టి పెట్టేసాడు
మా బామ్మ పొడిబారి పగిలింది
ఆమె విత్తనాలు
కిటికీ అవతలికి ఎగిరి పడ్డాయి
ఎండా కాసింది, వాన కురిసింది
ఓ విత్తనం ఎదిగి చెట్టైంది
ఆమె కోరిక నన్ను తొలిచి వేస్తున్నది
బంగారు పళ్ళ కోతులను గురించి
కవితలు రాయడానికి
నేనేమయినా సాయం చేయగలనా
++++++++++++++
ఇల్లూ జైలూ
——————-
నువ్వు పొద్దు తిరుగుడు విత్తనాలు తెచ్చావు
నేను పగటి వెలుగు పత్రాన్ని తెచ్చాను
నువ్వు పిడికెడు చంద్ర కాంతిని తెచ్చావు
నేను రాత్రి నృత్యాన్ని తెచ్చాను
నువ్వు పావురం కన్నీళ్లు తెచ్చావు
నేను అడవి కందిరీగ తేనెను తెచ్చాను
నువ్వు స్వర్గం నుంచి ఈకను తెచ్చావు
నేను దేవుని వాక్యాన్ని తెచ్చాను
శ్వేత వర్ణం గలది మన ఇల్లు
పిల్లలేమో నల్లని వారు
వాళ్ళు ఏడ్చారు
నువ్వు భరించ లేదు
వరిధాన్యం కోసం నేను సూర్యుని వైపు ఎగిరాను
ఇప్పుడు నా రెక్కలూ పాటలూ
మబ్బుల్లో బంధించ బడ్డాయి
నా ఏకాంతం ఉరుమై మాట్లాడుతున్నది
నేనేమో మెరుపుల ఆసరాతో మనింటిని వెతుకుతున్నాను
నా పాట నీటి జల్లులా కరిగిపోయి చల్లబడి
మన శ్వేత గృహం పైనా
మనిద్దరి నడుమా వున్న చీకటి శూన్యం పైనా
పడిపోయింది
+++++
గాంధీ మరియు కవిత్వం
ఓ బక్క పలుచని కవిత
ఆ మహానుభావున్ని దర్శిద్దామని
గాంధీ గారి ఆశ్రమాన్ని చేరింది
దూది వడుకుతూ వాడుకుతూ
రాముని ధ్యానం లో నిమగ్నమయి వున్న
ఆయన ద్వారం వద్ద వేచి వున్న
కవితను గమనించ లేదు
తాను భజనను కానందుకు కవిత
సిగ్గుపడుతూ నిలబడింది
తన గొంతును సవరిస్తూ
కవిత చిన్న శబ్దం చేసింది
గాంధీ తన కళ్ళద్దాల పక్క సందుల్లోంచి
నరకాన్ని చూసినట్టు చూసి
‘నువ్వెప్పుడయినా దూది వడి కావా’
అని అడిగాడు
పాకీ వాడి బండి లాగావా
ఎప్పుడయినా ఉదయాన్నే
వంట గది పొగలో నిలబడ్డావా
ఆకలితో అలమటించావా
అని ప్రశ్నించాడు
నేను ఓ అడవిలో
ఓ వేటగాడి నోటిలోంచి పుట్టాను
ఓ బెస్తవాడు నన్ను ప్రేమించాడు
అయినా నాకు గానం చేయడం తప్ప
ఏ పని చేయడమూ రాదు
మొదట నేను రాజాస్థానాల్లో పాడాను
అప్పుడు అందంగా బలంగానే వుండేదాన్ని
కానీ
ఇప్పుడు నేను వీధుల్లో
సగం ఆకలి తో వున్నాను
అంది కవిత
అది మంచిదే
కానీ నువ్వు సంస్కృతం మాట్లాడే
అలవాటు మానుకో
పొలాల్లోకి వెళ్ళు
రైతు కూలీల భాష విను
అన్నాడు గాంధీ నవ్వుతూ
దాంతో కవిత విత్తనంగా మారి
పొలాన్ని చేరింది
భూమిని దుక్కి దున్నే రైతు కోసం
బీడును సస్య శ్యామలం చేసే
చినుకు కోసం
ఎదురు చూస్తున్నది
*****************
బతుకు తెరచాప రెపరెపలాడుతోంది
బతుకు తెరచాప రెపరెపలాడుతోంది
+++++++ వారాల ఆనంద్
(నమస్తే తెలంగాణ దిన పత్రిక September 7, 2022)
బతుకు తెరచాప రెపరెపలాడుతోంది
గొంతులో తారట్లాడే శబ్దాల అర్థాల్ని
మాటల అర్థాల కోసం వెతికే మౌనాన్ని
చూసావా ఎపుడయినా
తెల్లని కాగితంపై బారులుతీరిన అక్షరాల్ని
వంపులు తిరిగిన అక్షరాల సోయగాల్ని
అవి మోస్తున్న భావాల సరాగాల్ని
కన్నావా ఎపుడయినా
నిన్నటి అనుభవ సముద్రాల్ని మోస్తున్న
ఇవ్వాల్టి సూర్యోదయాల్ని
అనుభవించావా ఎపుడయినా
పగటి పరిమళాల్ని నింపుకొని
వెచ్చటి గాలిలో చల్లని హొయలు
పోతున్న సాయం కాలాన్ని
చూసావా ఎపుడయినా
ఒంటరితనం గుంపులోకి పరిణామం చెందడాన్ని
గుంపు ఒంటరితనంలోకి ఘనీభవించడాన్ని
తెలిసిందా ఎపుడయినా
రాత్రి నిద్ర ఉదయపు మెలకువలోకి
పగటి శ్రమ రాత్రి నిద్రలోకి పరివర్తన చెందడం
గమనించావా ఎపుడయినా
కవితలో అర్థం లేనితనాన్ని
వెతికావా ఎపుడయినా
అర్థం లేనితనంలో కవిత్వాన్ని
ఎక్కడ మొదలయ్యామో మరిచిపోయాం కావాలనే
ఎక్కడికి వెళ్ళాలో దారి తప్పిపోయాం తెలియకనే
చౌరాస్తాలో కాటగల్సిపోయాం
చూసావా చిత్రంగా
ముందు నిలుచున్న అద్దం
అబద్ధం చూపుతోంది
లోన వెలిగించుకున్న దీపం కొడిగట్టుతోంది
గమనించావా
చీకటి వెలుగుల నిరంతర యానంలో
బతుకు తెరచాప రెపరెపలాడుతోంది
అయినా కన్నీటి అలలపై
పడవింకా పరుగెత్తాల్సే వుంది
వారాల ఆనంద్