Month: December 2022
‘అనువాదమే ప్రపంచ వారధి’
***** వారాల ఆనంద్
‘ఇచ్చి పుచ్చు కోవడం’ అన్న భావనే మనిషి మనుగడకు మూలాధార మయింది. అంతే కాదు ‘ తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం’ అన్నది మానవ సంస్కృతిలో అంతర్భాగమయిన జీవనమార్గం. వేలాది లక్షలాది సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా భిన్న భాషలు సంస్కృతులతో కొనసాగుతున్న మానవాళి ఈ భాషా,సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అభివృద్ది రంగాల్లో కొనసాగుతున్న ఈ ‘ఆదాన్ ప్రాధాన్’ భావనతోనే ముందుకు సాగుతున్నది. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. అయితే ఆ భాష అన్నిప్రాంతాలకూ ఏక రూపకంగా కాకుండా భిన్న రూపాల్లో వ్యక్తమయి ఎదుగుతూ వచ్చింది. కేవలం మన దేశవిషయం చూసినా భారత రాజ్యాగం మొదట 14 భాషల్ని అధికార భాషలుగా గుర్తించి తర్వాత ఆ సంఖ్యను 22 వరకు పెంచింది. కానీ నిజానికి మన దేశంలోనే ఇంకా ఎన్నో లెక్క లేనన్ని భాషలున్నాయి. వాటిల్లో లిపి ఉన్నవీ లిపి లేనివీ కూడా వున్నాయి.మరయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని భాషలున్నాయో. చెప్పడం కష్టం.
ఆ స్థితిలో ఒక ప్రాంతంలో ఒక భాషలో జరిగిన విషయాలు, విజయాలూ, పెల్లుబికిన భావాలూ, తాత్వికతలూ ఇతర ప్రాంతాలకు చేరడానికి, వాటిని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి తర్జుమా అవసరమయింది.దాన్నే ‘అనువాదం’ అన్నారు.
ఈ అనువాదం ఇవ్వాలో నిన్ననో మొదలయింది కాదు. క్లాసికల్ సాహిత్య కాలం నుంచి వుంది. ఇట్లా భావాలని పంచుకోవడం పెంచుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న అనువాదం కోసం ఐక్య రాజ్య సమితి 30 సెప్టెంబర్ ను ప్రపంచ అనువాద దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నది. మానవ జీవన గమనంలో అనువాదానికి వున్న ప్రాధాన్యతను ముందుకు తేవాలన్నది దాని ముఖ్య ఉద్దేశ్యం. నిజానికి ఇవ్వాళ అనువాదానికి అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందా.. వుంటే అనువాద అభివృద్ధికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది అందరూ ఆలోచించాల్సి వుంది.
అసలీ అనువాద ప్రక్రియ ఎట్లా వుంటుంది అంటే ఏ భాష లోంచి అనువాదం చేయాలను కుంటామో దాన్ని మూల భాష అనీ, ఎందులోకి చేయాలనుకుంటామో దాన్ని లక్ష్య భాష అనీ అంటున్నాం. అనువాదం చేయాలనుకున్న అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్ సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం కూడా వుండి తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది. ఈ అనువాదాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా చెబుతారు. ఒకటి యధాతతానువాదం, రెండవది స్వేచ్చానువాదం. యధాతతానువాదంలో మూలంలో వున్నది ఉన్నట్టుగా అనువదించడం కాగా స్వేచ్చానువాదంలో మూలం లోని మౌలిక అంశాలు చెడకుండా అనువాదకుడు కొంత సృజనాత్మక స్వేచ్చ తీసుకోవడం. ఇక్కడ యధాతతానువాదానికి నిఘంటువుల అవసరం వుంటుంది, స్వేచ్చానువాదానికి సృజనాత్మకమయిన మనసు కూడా అవసరమవుతుంది. అయితే శాస్త్ర సాంకేతిక అంశాల అనువాదానికి యధాతతానువాదమే అనువయింది. సాహిత్య సృజనాత్మక అంశాలకు స్వేచ్చానువాదం అభిలశనీయమయింది. ఇక్కడ అనువాదంలో విశ్వసనీయత, పారదర్శకత అన్న అంశాలు కూడా ప్రదానమయినవే.
ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసాంకేతికత పెరిగిన తర్వాత అనువాద రంగం లో యంత్రాల ప్రమేయం కూడా పెరిగింది. ఫలితంగా మెషిన్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. ఇక 1990 తర్వాత పెల్లుబికిన ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాద ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్నది, దానికి ప్రాముఖ్యతా పెరిగింది. అంతా అన్నీ ఇంగ్లీష్ మయం అయిపోయిన స్థితిలో దాదాపు అన్ని రంగాల్లో అనువాద అవసరం పెరిగింది. ఇవ్వాళ ముఖ్యంగా అయిదు రంగాల్లో అనువాదం జరుగుతున్నది. అవి సాహిత్యానువాదం, సాంకేతికానువాదం, కార్యనిర్వాహకానువాదం, ఆర్థికానువాదం, చట్టాల అనువాదం, వీటికి తోడు వెబ్ సైట్ ల అనువాదం, మెడికల్, జీవ శాస్త్ర, పేటెంట్, క్రీడా రంగాలల్లో కూడా అనువాదాల ప్రాముఖ్యత చాలా పెరిగిందనే చెప్పాలి.
ఇదంతా ఇట్లా వుంచి సాహిత్యానువాద విషయమే తీసుకుందాం. అసలు అనువాదమనేదే లేకుంటే సంస్కృతం,లాటిన్ అరబిక్ లాంటి భాషల్లో వున్న క్లాసికల్ సాహిత్యం మనకు అందేదే కాదు. కేవలం ప్రాచీన సాహిత్యమే కాదు ఆధునిక కాలంలో కూడా వివిధ భాషల్లో వస్తున్న అద్భుత సాహిత్యం అనువాదాల ద్వారానే అందరికీ అందుబాటులోకి వస్తున్నది. అయితే మన తెలుగు భాషా సాహిత్యాల విషయానికి వస్తే అధిక శాతం నేరుగా మూల భాషల నుంచి కాకుండా మధ్యలో ఇంగ్లీషును మాధ్యమంగా చేసుకున్న అనువాదాలే ఎక్కువ. అయినప్పటికీ మన ‘ఇరుగు పొరుగు’ భాషల తో పాటు వివిధ దేశాల సాహిత్యం కూడా మనకు అందుబాటులోకి వస్తున్నది. చాలా మంది కవులు రచయితలు విమర్శకులు అనువాదాలు చేస్తున్నారు. కానీ తెలుగులో పూర్తి స్థాయి అనువాదకుల కొరత ఇంకా వుంది. అంతే కాదు వివిధ భాషల్లోంచి తెలుగులోకి సాహిత్యం వస్తున్నది కానీ మన సాహిత్యం ఇంగ్లీషుతో సహా ఇతర భాషల్లోకి వెళ్తున్నది చాలా తక్కువే. పలితంగా తెలుగులో వస్తున్న గొప్ప సాహిత్యం ప్రపంచానికి అంతగా అందడం లేదన్నది వాస్తవం. ఈ స్థితిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. వివిధ భాషల్లోంచి సాహిత్యాన్ని తెలుగులోకి తేవడంతో పాటు మన సాహిత్యాన్ని వివిధ భాషల్లోకి తీసుకు వెళ్ళే కృషి జరగాల్సి వుంది. అందుకోసం అధికారంలో వున్న తెలుగు తెలంగాణా సాహిత్యఅకాడెమీలు, విశ్వవిద్యాలయాలూ చొరవ చూపాల్సి వుంది. వాటిని మించి స్వచ్చంద సంస్థల కృషీ అవసరమయిందే. వ్యక్తులుగా చేస్తున్న కృషీ తక్కువేమీ కాదు.
సాహిత్యానువాదాలు ఏమేరకు జరిగినా.. ఆహ్వానించ దగ్గవే.. అభినందిన్చాల్సినవే..
-వారాల ఆనంద్
‘లోక్ కబి’ పద్మశ్రీ హల్దార్ నాగ్ +++ వారాల ఆనంద్
‘లోక్ కబి’ పద్మశ్రీ హల్దార్ నాగ్
కోసలి భాషా కవిత్వానికి పట్టాభిషేఖం
+++++ వారాల ఆనంద్
‘హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
సాయంకాలపు వెలుగు పురిటి నొప్పులు పడుతున్నది
సృజనాత్మక కవిత్వాన్ని ప్రసవించు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను ‘
…. అంటూ సాగే ఆయన కవిత్వం ఆయనలాగే నేల మీద నడుస్తుంది.
ఆయన కవిత్వంలోని మాటలు సాధారణ ప్రజలు మాట్లాడే మాటల్లాగే వుంటాయి..
అయినా వాటిల్లో జీవన వాస్తవికత తొణికిస లాడుతుంది.
ఆయన కవిత్వం వాహికగా ‘ప్రకృతి’ తో మాట్లాడుతాడు.
రోజు వారీ దినచర్యలాగే ఆయన కవిత్వం మనల్ని పలకరిస్తుంది.
అయినా అందులో తాత్వికత ధ్వనిస్తుంది.
సులభ శైలితో చదువరుల్ని జల్దీ జల్దీ పట్టేసుకుంటుంది.
ఆయన్ని“లోక్ కబి”, ప్రజా కవి అంటారు. ఆయన భాష కోసలి. దాన్నే సంబల్పూరి అనికూడా అంటారు. ఆయన హల్దార్ నాగ్.
“తనకు ‘పద్మశ్రీ’ అవార్డు వచ్చిన దానికంటే నా భాషకు రాజ్యాంగ గుర్తింపు వచ్చినప్పుడే తనకు ఎక్కువ సంతోషం” అంటాడు ఆ భాషా ప్రేమికుడు.
ఒరిస్సాలో ఆయన్ని ప్రకృతి కవి గా పేరెన్నికగన్న కవి గంగాధర్ మెహెర్ తో పోలుస్తారు. కానీ వాస్తవానికి ఆయన జీవితానికీ కవిత్వానికి మరెవరితో పోలిక లేదు. పోల్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఆయన జీవితం అష్టకష్టాలతో మొదలయింది. హల్దర్ నాగ్ ది పశ్చిమ ఒరిస్సాలోని బార్గర్హ్ జిల్లాలోని ఘెన్స్ అనే చిన్న గ్రామం. ఎగువ ఊళ్ళల్లో కలరా సోకితే అతడి కుటుంబం ఆ ఊళ్లోకి వచ్చి స్థిరపడింది. అక్కడే అమ్మా నాన్నలకు ఆఖరి సంతానంగా హల్దర్ నాగ్ 1950లో జన్మించాడు. చర్మకార వృత్తి చేసే తండ్రి పాముకాటుకు చనిపోయాడు. అప్పుడు హల్దార్ నాగ్ కి కేవలం పదేళ్ళ వయసు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం తో హల్దార్ నాగ్ మూడో తరగతిలోనే తన చదువు ఆపేశాడు. అతని కంటే ముందు పుట్టిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో ఇంటికి దిక్కుగా ఒక్కడు మిగిలి పోయాడు. మొదట ఊళ్లో ఉన్న మిఠాయి దుకాణంలో గిన్నెలూ, వంట పాత్రలు కడిగే పనికి కుదిరాడు హల్దర్. అక్కడే వంట కూడా నేర్చుకున్నాడు. ఆ ఊరిలోని ఒక పెద్దమనిషి అతణ్ణి స్కూల్లో వంటవాడిగా పెట్టాడు. దాదాపు పదహారెండ్లు అక్కడే వంటవాడిగానే బతికాడు. చాకిరీ చేస్తూ కాలం గడిపాడు. హల్దార్ ఆ సమయంలో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం గమనించాడు. తను పనిచేసే స్కూలుతో పాటు ఆ ప్రాంతంలో స్కూళ్ళ సంఖ్య పెరగడం చూసిన హల్దార్ వెయ్యి రూపాయలు అప్పు తీసుకుని స్కూల్ ఎదురుగానే చిన్న స్టేషనరీ షాపు, పిల్లలు తినే తినుబండారాల చిన్న దుకాణం పెట్టుకున్నాడు. చిన్నప్పటినుండే హల్దార్ కి జానపద పాటలు వినడం పాడడం అలవాటుగా వుండేది. ఎంతో అవంటే ఇష్టంగా కూడా వుండేది. ఆయనకు ‘కృష్ణా గురు భజన్’ , ‘దాల్కాయీ’, రసరేకలీ, మయేలా జాదా లాంటి అనేక జానపద గీతాలు పాడేవాడు. తనపైన బినోద్ నాయక్ కవిత్వం తొలి రోజుల్లో బాగా ప్రభావితం చేసిందని నాగ ఒక చోట చెప్పుకున్నాడు. ‘గ్రామ పద’ అన్న కవిత తనని కవిత రాసే దిశగా నడిపించిందని కూడా చెప్పాడు. అనంతర కాలంలో గంగాధర్ మెహెర్, రాదా నాథ్ రాయ్ ల కవిత్వం ఎక్కువ ప్రభావితం చేసిన్నాడు నాగ్,
ఆ సమయంలోనే అతనిలో ఏవేవో భావాలు పెల్లుబుక సాగాయి. అవి కవిత్వ రూపంలో వెలికి వచ్చాయి. కోసలి భాషలో తనకు తోచింది ఆశువుగా చెప్పడం మొదలు పెట్టాడు. హల్దార్ కి మామూలు బడి చదువు లేకపోవడం పెద్ద ఇబ్బందేమీ కాలేదు కానీ మొదట్లో ఆయన ఆశువుగా చెబుతూ ఇతరులతో రాయించే వాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోని ‘అభిమన్యు సాహిత్య సన్సద్’ అనే గ్రూప్తో హల్దార్ కు పరిచయమయ్యింది. దాంతో ఆయనకు ఒరియా సాహిత్యం పరిచయం అయింది. క్రమంగా ఒరియా చదవడం నేర్చుకున్నాడు. కోసలి వివరంగా రాయడమూ అబ్బింది. దాంతో ఒరియా సాహిత్యం చదువుతూనే హల్దర్ తన కోసలి భాషలో కవిత్వసృష్టి సాగించాడు.1990లో అతని తొలి కవిత ‘ధోడో బగ్గాచ్’ (పాత మర్రిచెట్టు) ఒక స్థానిక పత్రికలో అచ్చయ్యింది. హల్దార్ కి గొప్ప జ్ఞాపకశక్తి ఉంది. ఏ పుస్తకంలోని ఏ కవితనైనా విని, చదివి గుర్తు పెట్టుకోగలిగే జ్ఞాపకం ఆయనది. అంతేకాదు తన స్వీయ కవిత్వాన్ని కాగితం చూడకుండా ఆలవోకగా చెప్పగలడు. అందుకే ప్రజలు అతణ్ణి ‘ఆశు కబి’ అని, ‘లోక కబి రత్న’ అని పిలుస్తారు. తొలి కవితతో ఆయన అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటినుండి ఆయన పలు కవితలు అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. దాంతో పాపులారిటీ పెరిగింది. “అప్పుడు నాకు చాలా ప్రశంసలు, సన్మానాలు లభించాయి. దాంతో మరింతగా రాయడానికి ఉత్సాహం పెరిగింది” అని ఒక చోట హల్దార్ చెప్పుకున్నాడు. ఇక తన చుట్టు పక్కల గ్రామాల్లోకి వెళ్ళడం కవిత్వం చదవడం ఆరంభించాడు. ఆయన తన కవిత్వం నిండా అట్టడుగు వర్గాల స్థితి, అణచివేతకు గురయిన వాళ్ళ పరిస్థితి పైననే రాసాడు.
భాష పట్ల హల్దార్ నాగ్ కి స్పష్టమయిన అభిప్రాయాలున్నాయి. ‘భాషలెన్ని వున్నా సాహిత్యం ఒక్కటే అంటాడాయన. అంతే కవిత్వం సాహిత్యం మానవ ఆలోచనల్ని మనసుల్నీ అత్యంత గాఢం ప్రభావితం చేస్తుంది అని కూడా ఆయన ఒక ముఖాముఖిలో అభిప్రాయపడ్డాడు.
ఆయన కవిత్వం ఇప్పటికే హిందీలోకీ, కొంత ఇంగ్లీశులోకీ అనువాదం అయింది.. 1916లో పద్మ శ్రీ వచ్చిన తర్వాత హల్దార్ నాగ్ కవిత్వం మరింతగా వివిధ భాషల్లోకి అనువదించబడుతున్నది.
ఆయన కోసిలి భాషలో రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన 24 కవితలతో మొదటి కవితా సంకలనం “కావ్యాంజలి” వచ్చింది. దాన్ని సురేంద్రనాథ్ ఇంగ్లీషులోకి అనువాదం చేసారు.2016 వెలువడ్డ ఈ పుస్తకానికి సుప్రసిద్ధ ఒరియా కవి మనోజ్ దాస్ ముందుమాట రాసాడు. ఈ సంకలనంలోని కవితల నిండా ప్రాంతీయత, పౌరానికత, సర్వదేవతావాదం, ప్రకృతితో మనిషికున్న అనుబంధం, సామాజిక అంతరాలూ ఇట్లా ఎన్నో అంశాల్ని ఆయన ఆవిష్కరించారు.
“కావ్యాంజలి” హల్దార్ నాగ్ ఎంపిక చేసిన కవితలు
ఈ సంకలనం లోని మొట్ట మొదటి కవిత దీర్ఘ కవిత ‘గ్రేట్ సతి ఊర్మిళ’( గొప్ప మహిళ ఊర్మిళ). రామాయణం లోని ఊర్మిళ పాత్రను ఉన్నతీకరిస్తూ ఈ కవితసాగుతుంది. అనేక రామాయణ కావ్యాల్లో ఊర్మిళ పాత్రకు పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కాని హల్దార్ ఊర్మిళ గొప్ప మహిళా అని ఆమె స్థానం సీత, మండోదరి లతో సమానమయిందని అంటాడు. నాగ్ తమ ప్రాంతంలో వున్న ప్రాంతీయ రామాయణ కావ్యాలను ప్రేరణగా తీసుకుని ఈ కవిత రాసాడు. ఒరిస్సా లో 15 వ శతాబ్దానికి చెందిన ‘విలంకా రామాయణ’ చాల ప్రసిద్ది పొందిన కావ్యం. దాన్ని సరళాదాస్ రాసారు. వేర్వేరు రామాయణాల్లో అనేక వైవిధ్యాలు కనిపిస్తాయి. కైకేయి పాత్రను ఇక్కడ ఉదాత్తమయినదిగా సూచిస్తారు. రాముడు కనుక పట్టాభిషిక్తుడు అయితే జాతక రీత్యా చనిపోతాడని తెలిసిన కైకేయి రామున్ని వనవాసానికి పంపిందని ఇక్కడ రాసారు. అట్లే 14 సంవత్సరాలు నిద్రలో ఉన్నట్టుగా చెప్పిన ఊర్మిళ పాత్రకు కూడా అనేక రామాయణాల్లో అంత ప్రాముఖ్యత నివ్వలేదు. కానీ ఆమె చేసిన త్యాగం, ఆమె జ్ఞానం, స్వచ్చత చాలా గొప్పదని హల్దార్ రాసాడు.
“ఏడు రామాయణాల్లో
ఎక్కడా ఉటంకించని ప్రస్తుతించని
స్త్రీ ఆమె
నాలోని కవికి ఆమె గొప్ప మహిళ
సీత కంటే కూడా స్వచ్చమయిన సతి ఆమె’ అంటాడు హల్దార్ తన కవితలో.
ఇక హల్దార్ నాగ్ రాసిన కవితల్లో స్థానిక పత్రికలో ప్రచురితమయిన మొదటి కవిత “ ముసలి మర్రిచెట్టు”. ఈ కవిత విశేష ప్రాచుర్యం పొందింది. అనేక ఏళ్ళుగా నిలబడి వున్న ఆ చెట్టు తన జీవిత కాలంలో ఏమేమి చూసిందో చెబితే ఎట్లా వుంటుందో ఆయా అంశాల్ని ఈ కవితలో చెబుతాడు హల్దార్.
ఆ మర్రి చెట్టు తమ తాతల కాలం నుంచీ వుంది. దాని ఊడలలూగుతూ ఎంతో మంది పిల్లలూ పెద్ద వాళ్ళు అయివుంటారు. ఎందరో ప్రయానికులకూ,యాత్రికలకూ ఆ చెట్టు నీడనిచ్చి వుంటుంది. ఎంతోమంది పెళ్లి కొడుకులు ఈ చెట్టు కింది నీడ కింద ఎదురు చూస్తున్న తమ పెళ్లి కూతుళ్ళను తీసుకెళ్ళి ఉండొచ్చు. అంతేకాదు చనిపోయిన ఎంతో మందిని చివరి యాత్రకు ముందు ఈ చెట్టు నీడనే కొంత సేపు పడుకో బెట్టి వుంటారు. ఈ మర్రి చెట్టు ఇంకా ఎంతో మంది దొంగలనీ వాళ్ళు దోచుకున్న సొమ్ముని పంచుకున్న రీతినీ చూసి ఉండొచ్చు. అంతేనా యువ ప్రేమికులెందరో ఈ మర్రి చెట్టు కిందే రహస్యంగా కలుసుకుని ఉండొచ్చు. ఇవన్నింటినీ చెప్పే సువర్ణావకాశం ఈ మర్రి చెట్టుకు వచ్చింది… గ్రామీణ
జీవితాల్ని ఆవిష్కరిస్తూ ఈ కవిత ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది. చెట్టును వ్యక్తిగా చేసి భావాల్ని పలికిస్తుంది.
“ అది చూస్తుంది, అది వింటుంది,
దానికి తెలుసు, అది కనుక్కొంటుంది
కానీ ఒక్క మాటా పలుకదు
అది తన బాహువుల్ని బయటకు విశాలంగా విస్తరించుకుని
ఓ మౌన సాక్షిగా నిలుచుంటుంది”
ఇక హల్దార్ నాగ్ కవిత “ ఘన్సాలి నది” కూడా మనిషి జీవితాన్ని పరిశీలిస్తుంది.
నది పయనమయి సముద్రాన్ని చేరే క్రమాన్ని ప్రతీకాత్మకంగా మనిషి తన ఆధ్యాత్మిక జీవన యానాన్ని ఈ కవిత చెబుతుంది. పుటుక నుంచి మరణం దాకా మనిషి పయనించి ఆత్మ పరమాత్మలో కలిసి పోయే భావనని ఇందులో కవి ఉటంకిస్తాడు.
ఇక ‘కావ్యాంజలి’ లో జల్దార్ మరో కవిత ‘మంత్రి- బిచ్చగాడు’
ఇది ఒక రాజకీయ వ్యంగ్యాత్మక కవిత. ఇది సంభాషణ తీరులో సాగుతుంది. మంత్రికి బిచ్కగాడికి నడుమ సాగే మాటల సమాహారం ఇది. ఒక మంత్రి ఓ బిచ్చగాడికి ఒక సూచనచేస్తాడు. బిచ్చ మెత్తుకోవడం ఆపేసి కస్టపడి పని చేసుకుని డబ్బు సంపాదిచుకోమని.. దానికి బదులుగా ఆ బిచ్చగాడు సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దోచేయకుండా ప్రజావసరాలకు వాడమని మంత్రికి బిచ్చగాడు ఎదురు సూచిస్తాడు…
“ నా కడుపులో ఆకలి కోసం నేను అడుక్కుంటాను,
కానీ నేను నా స్వార్థం కోసం కాదు..
నువ్వు స్వార్థపరుడివి,
అడుక్కోవడం మంచిది. ఇల్లు దగ్గరో గుడిసె దగ్గరో..” అంటాడు.
హల్దార్ రాసిన మరో చిన్న కవిత ‘వెలుతురు-మట్టి దీపం’ లో చాలా ముఖ్యమయిన అంశాన్ని తీసుకున్నాడు. తమ భాష కనుమరుగయితే ఆ ప్రాంత ప్రజలు తమ మాటలని మర్చిపోతారు. చివరికి వాళ్ళు తమ ఉనికినే కోల్పోతారు అంటాడు నాగ్… ఇందులో మాతృభాష పట్ల మనుషులకు ఉండాల్సిన ప్రేమా, అభిమానాలను నొక్కి చెబుతాడు కవి. అంతరించిపోతున్న ప్రాంతీయ భాషల పట్ల హల్దార్ కవిగా పడ్డ వేదన ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది.
“వారసుల్లేని బంధువుల్లో
నూతనంగా పుట్టిన వాడు దీపం వెలిగించినట్టు,
ఒరిస్సా ఉత్తర ప్రాంత భాష
దీపంలో వత్తిలా కాలి విస్తరించనీ..”
….
ఇక హల్దార్ నాగ్ రాసిన మరో ప్రతిభావంతమయిన కవిత “ అంతను ఇల్లు ఎందుకు వదిలేసాడు”.
వ్యంగంగా వున్న ఈ కవితలో సామాజిక అవలక్షణాన్ని చెబుతాడు. ప్రజలు సాధారనంగా నిందలు బలహీనుల పైనే వేస్తారు. కవిత బలవంతుల ఎదుట బలహీనులు తల వంచడాన్ని చెబుతుంది.
“ అందరి పెదాల పై ఒకే వాదన
గెలుపు బలహీనులకు సాధ్యం కాదు
నీళ్ళు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తాయి
తప్పు ఎప్పుడూ బలహీనునలవైపే..”
ఇట్లా సాగిన హల్దార్ నాగ్ కవిత్వం మొదట ‘కావ్యాంజలి’ పండిత, పామరుల ఆదరణ పొందింది
అతని రెండవ సంపుటం ‘కావ్యాంజలి2’ను సంబల్పూర్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టింది. అతడి అనేక కవితలు ఇప్పుడు పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలు అయ్యాయి. దేశీయ జానపద శైలి, పురాణ సంకేతాలు, కల్తీ లేని భాష, అప్రయత్న ధాటి హల్దర్ నాగ్ కవిత్వాన్ని జీవంతో, ఆకర్షణతో నింపుతాయి. అతడి రచనలు ఇప్పటి వరకూ దాదాపు 22 పుస్తకాలుగా వచ్చాయి. పాటలూ రాశాడు. సంబల్పూర్ యూనివర్సిటీ అతనికి డాక్టోరల్ డిగ్రీ ఇచ్చి సత్కరించింది.
2020 లో పాండిచేరీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జై శంకర్ బాబు రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు వైస్ చాన్సెలర్ గురు మీత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగన ఈ సెమినార్లో “హల్దార్ నాగ్ కా కావ్య సంసార్’ అన్న పుస్తకాన్ని విడుదల చేసారు. దినేష్ కుమార్మాలి సంబల్ పూరి భాషనుంచి హిందీ లోకి అనువాదం చేసిన హల్దార్ పుస్తకమది. ఆ సెమినార్లో నాగ్ కవిత్వం మీద విస్తృతంగా చర్చ జరిగింది. ఇంకా హల్దార్ కే లోక్ సాహిత్య పర విమర్శ, రామాయణ్ ప్రసంగొన్ పర్ హాల్దార్ కే కావ్య అవుర్ యుగిన్ విమర్శ’ అన్న పుస్తకాలూ వెలువడ్డాయి . ఇంకా ఇందిరా గాంధీ ఓపెన్ యునివర్సిటీ తో సహా అనేక విశ్వవిద్యాలయాల్లో హల్దార్ కవిత్వం మీద పాఠాలున్నాయి. పరిశోధనలూ చేస్తున్నారు.
ఒకప్పుడు వంట కాంట్రాక్టు కోసం ఎదురు చూసే హల్దర్ నేడు ఒరిస్సా రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజూ సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానింపబడే కవిగా గౌరవం పొందుతున్నాడు. అంతే కాదు 2015లో వచ్చిన ‘కౌన్ కిత్నే పానీ మే’ అనే లఘు చిత్రంలో రాధికా ఆఫ్టే, సౌరభ్ శుక్లా వంటి నటులతో కలిసి నటించాడు.
హల్దర్ నాగ్ కవిత్వాన్ని కవి గుల్జార్ అమితంగా అభిమానించాడు. ఆయన హల్దర్ నాగ్ కవిత్వం చదివి 50 వేల రూపాయల తన సొంత డబ్బును కానుకగా పంపాడు. అంతేకాదు, బాలీవుడ్ దర్శకుడు ‘భరత్బాల’ తన ‘వర్చువల్ భారత్’ ఫీచర్ కింద హల్దర్ పై తీసిన షార్ట్ ఫిల్మ్ కు వ్యాఖ్యానం కూడా అందించాడు. హల్దర్ కవిత్వం భారీగా ఇంగ్లిష్లోకి అనువాదం అవుతోంది. ఇప్పటికి 350 సంస్థలు హల్దర్ను సత్కరించాయి. ఇంత పేరు వచ్చినా ఇప్పటికీ చెప్పుల్లేకుండా నడుస్తాడు హల్దర్. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకునేటప్పుడు కూడా నాగ్ చెప్పులు తొడుక్కోలేదు.
‘ఈ మట్టి మీద నడిచేటప్పుడు మొత్తం భూగోళం మీద నడుస్తున్నట్టుగా భావించు’ అంటాడు హల్దర్
అంతే ఈ భూమి మనందరిది. అంటే ప్రతి మనిషి మరో మనిషి కోసమే అని భావిస్తూ ‘మనం’ అనే భావనతో బతకాలని హల్దర్ కోరుతాడు.
అనేక రకాల దుర్గుణాలు ప్రతి మనిషిలో ఉండేవే. కాకుంటే వాటిని వదిలించుకోవడానికి అప్పుడప్పుడు హల్దర్ వంటి మహాకవి పిలుపు అవసరం. ఇప్పుడా పిలుపు వినిపిస్తూ తిరుగుతున్నాడు హల్దర్ నాగ్. హల్దార్ నాగ్ “ సినిమా లాంటి ఇతర కళా రూపాల కంటే సాహిత్యం అమరమయిందని, అది ఎ భాషలోనిదయినా సమాజానికి దారి చూపే టార్చ్ లైట్ లాంటిదని యువకులతో అంటాడు. అందుకే యువత సాహిత్యాన్ని ఎక్కువగా అధ్యయనం చేయాలని సూచిస్తాడు.
హల్దార్ నాగ రాసిన రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం—-
అమృతం
—– హల్దార్ నాగ్
లోకంలోని సప్త సముద్రాలనుండీ
అమృతం జనించనీ
ఆకాశంలోంచి చంద్రుడూ
అమృతాన్నే కురవనీ
మనిషికి ప్రాణాధారమయిన అమృతమే
మాతృమూర్తి స్థనాలనుండి
బొట్లు బొట్లుగా రాలనీ
మానవత్వంతో మంచి మనుషులు చేసే
మంచి కార్యాలనుంచీ
అమృతమే పారనీ
ఇంకా
కవిగారు రాసే సున్నితమయిన పదాలనుంచీ
అమృతమే ప్రవహించనీ
********************
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
————-
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
సాయంకాలపు వెలుగు పురిటి నొప్పులు పడుతున్నది
సృజనాత్మక కవిత్వాన్ని ప్రసవించు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
సమాజాన్ని శుభ్రం చేయాలనుకుంటే
మొదట నిన్ను నువ్వు శుభ్రం చేసుకో
ఇతరులను చేయి పట్టి పైకి లాగాలనుకుంటే
ముందు నువ్వు రెండడుగులు పైకెక్కు
లోకం ఆకర్షణలకు మొహితుడవు కాబోకు
అత్యాశకు గురి కాకు
ఇదో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
సృష్టి సమస్తంలో మహోన్నతుడయిన మనిషి
చీకట్లో మగ్గుతున్నాడు
తన సుఖం కోసం అందరినీ దుఖం పాలు చేస్తున్నాడు
ధర్మ ఖర్మ అవమానాల్ని త్యజించాడు
నరకం వైపు మరింత దగ్గరవుతున్నాడు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
అమ్మ ఆశీర్వాదం తీసుకో
దుఖాన్ని సంతోషంగా భావించు
విశామున్న చోటే అమృతమూ లభిస్తుంది
వెతుకు ప్రేమతో ఉద్రేకంతో వెతుకులాడు
నువ్వు విషం తాగాల్సివచ్చినా
ఇతరులకు అమృతమే పంచు
అవసరమయితే తలపై గంగా నదిని ధరించు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
మంచి మాటలతో లోకంలోని
అందరినీ నీ వాళ్ళని చేసుకో
సమస్త ప్రపంచాన్నీ ఒకే చూరు కిందికి తీసుకురా
అందులో నువ్వూ నివాసముండు
నీ సమస్త రచనా శక్తినీ
ఈ లోకాన్ని సరి చేసేందుకు వాడు
****************
-వారాల ఆనంద్
9440501281
జావేద్ అఖ్తర్- ఓ లౌకిక స్వరం
++++++ వారాల ఆనంద్
జావేద్ అఖ్తర్- ఓ లౌకిక స్వరం
++++++ వారాల ఆనంద్
జావేద్ అఖ్తర్ ప్రతిభావంతమయిన కవి.
సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్నసామాజిక గొంతుక ఆయనది.
ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమయిన స్వతంత్ర లౌకిక స్వరం జావేద్ అఖ్తర్.
భావుకుడూ, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించాడు. జావేద్ తండ్రి జాన్ నిసార్ అక్తర్ ప్రముఖ ఉర్దూ కవి సినీ గీత రచయిత. జావేద్ అఖ్తర్ తాత ముజఫర్ ఖరబాది కవిత్వం ఉర్దూ సాహిత్య ప్రపంచంలో మైలురాయి లాంటిదని భావిస్తారు. ఇంకా జావేద్ మేనమామ మజాజ్ కవిత్వం కూడా ఉర్దూ లో ప్రముఖ మయిందే. జావేద్ అక్తర్ తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా రాసాడు. జాతీయ సమక్యత, స్త్రీల హక్కులకోసం మాట్లాడాడు రాసాడు. తప్పు దోవ పట్టిన యువతనుద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995 లో కేండ్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది.
జావేద్ అఖ్తర్ 1980లో సీరియస్ గా కవిత్వం రాయడం ఆరంభించాడు. ఆయన 1995 లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘టార్ఖాష్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమానుల్నుంచి విమర్శకులనుంచి ప్రశంసల్ని అందుకుంది.ఇప్పటికే అది హిందీలో 10, ఉర్దూలో అయిదు ముద్రణలు పొందింది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్ గా కూడా ప్రాచుర్యం పొందింది.
గ్వాలియర్ లో పుట్టిన జావేద్ లక్నో అలిఘర్, భూపాల్ లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిది బాగా విస్తారమయింది. చిన్నప్పుడు ఆయన జీవితం చాలా చిత్రంగా గడిచింది. తండ్రి బాంబే లో ఉండేవాడు. తల్లి అప్పటికే మరణించింది. జావేద్ తన అమ్మమ్మ తాతయ్యల దగ్గర లక్నోలో పెరిగాడు. నెలకు 15 రూపాయల జీతం మీద చదువు చెప్పే ట్యూషన్ మాస్టర్ వద్ద చదువు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. తనకు రోజూ ఉదయం ఆఠాణ, సాయంత్రం ఒక అణా ఇచ్చేవారని వాటితో ఉదయమే రాంజీ లాల్ షాపులో రంగుల మిఠాఈలు సాయంత్రం భగవతీ షాపులో చాట్ తినేవాన్నని జావేద్ ఒక చోట రాసుకున్నాడు. కనీసం మెట్రిక్ అన్నా పూర్తిచేయి పోస్ట్ ఆఫీసులో చిన్న ఉద్యోగామయినా దొరుకుతుంది అనేవాడు జావేద్ తాత. తర్వాత జావేద్ ను ఆయన అత్తగారి వూరయిన అలిఘర్ పంపించారు. ‘ వీడిని జాగ్రత్తగా చూడండి..వీడికి చదువుకంటే సినిమా పాటలంటే ఎక్కువ ఇష్టం’ అక్కడ స్కూల్లో చేర్పిస్తూ మామ టీచర్ తో అన్నాడంట. ఎందుకంటే అప్పటికే జావే కి ‘ఉరన్కా ఠోళా’, ‘శ్రీ 420’ లాంటి సినిమాల పాటలతో పాటు అనేక పాటలు నోటికి వచ్చేవంట. తర్వాత కొంత కాలం భూపాల్ లో తన సవతి తల్లి ఇంట్లో వున్నాడు. కాని అక్కడ ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేక మిత్రులతో కలిసి ఉంటూ కాలేజీ చదువుని పూర్తి చేసాడు. అప్పుడే మిత్రుడు ముస్తాక్ ద్వారా దేశ విభజన గురించీ అప్పుడు జరిగిన అరాచకాల గురించీ విన్నాడు.
తర్వాత అక్టోబర్ 1964 బాంబే చేరుకుని తండ్రి వద్ద వున్నాడు. కానీ కేవలం వారం తిరగ కుండానే ఇల్లు వదలాల్సి వచ్చింది. జేబులో 25 పైసలున్నాయి రెండేళ్ళ పాటు అష్ట కస్తాలు పడ్డాడు ఒక చిన్న సినిమాకు మాటలు రాసి వంద రూపాయలు సంపాదించాడు. అనేక సార్లు పలువురికి సహాయకుడిగానూ, ఘోస్ట్ రచయితగానూ పనిచేసాడు. సంవత్సరానికి పైగా కమల్ స్టూడియో లో వున్నాడు జావేద్. అందులో ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. అప్పుడే అంధేరీ లో వున్న ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్ వాడి పరిచయం తో జావేద్ చదివెందుకు పుస్తకాలకు కొదువ లేకుండా పోయింది.తర్వాత కొంతకాలం మిత్రుడు జగదీష్ తో కలిసి బాంద్రాలో మహాకాళి కేవ్స్ లో వున్నాడు. అప్పుడే తన విజయవంతమయిన పార్టనర్ సలీం ఖాన్ తో స్నేహం ఏర్పడింది. ప్రధాన స్రవంతి హిందీ సినిమాలకు ఒక సరికొత్త దారి చూపిన వాడు జావేద్. ఆయన తన మిత్రుడు సలీం ఖాన్ తో కలిసి రాసిన స్క్రీన్ ప్లే లు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయవంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది.దాన్నే సినిమా భాషలో ‘బ్రేక్ ‘ అంటారు. ఆ జంట రాసిన మొట్ట మొదటి సినిమా ‘హాతీ మేరె సాథీ’. ఒక రోజు రాజేష్ ఖన్నా వారి దగ్గరికి వెళ్లి దక్షినాది సినీ నిర్మాత అయిన దేవన్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు..మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.. దాంతో నేను హీరో రాజ్ కుమార్ కు చెందిన బిల్డింగ్ అమ్మకానికి వస్తే అడ్వాన్స్ ఇచ్చేసాను.. కానీ స్క్రిప్ట్ చూస్తే ఘోరంగా వుంది.. అది చేస్తే ఇక దాంతో నా ఫిలిం కారీర్ అంతే సంగతులు..అందుకే దాన్ని సరిచేయండి.. ఇంటికిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు. ఎట్లాగయినా చేసి ఈ స్క్రిప్ట్ ను మెరుగు పరచండి లేదా తిరగ రాయండి అని కోరుకున్నాడు. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీసిన ‘హాతీ మేరె సాథీ’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సలీం జావేద్ ల జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్ గా మారింది.
ఆ తర్వాత సీతా అవుర్ గేత సమయంలో జావేద్ అఖ్తర్ కి హనీ ఇరానీ తో పరిచయం కావడం అది పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఒకటయ్యారు. వారిద్దరికీ జోయా, ఫర్హాన్ లు జన్మించారు.
జావేద్ అఖ్తర్ తండ్రి జాన్ నిసార్ 18 ఆగస్ట్ 1976న మరణించాడు. చనిపోతూ తన చివరి పుస్తకాన్ని జావేద్ కి ఇస్తూ దాని పై ఇట్లా రాసాడు’నేను వెళ్లి పోయిన తర్వాత నన్ను గుర్తు చేసుకుంటావు..’ అప్పటిదాకా తండ్రి పట్ల సానుకూలంగా లేని జావేద్ కన్నీటి పర్యంతం అయ్యాడు. 1979 తన మొదటి కవిత రాసాడు. అప్పుడే జావేద్ కి షబానా ఆజ్మీ తో పరిచయం ఏర్పడింది. కైఫీ ఆజ్మీ కూతురు అయిన షబానా కు కూడా అప్పుడే జీవితం పట్ల అనేక ప్రశ్నలు, అనుమానాలూ వస్తున్న సమయం అది. అప్పుడే వారిద్దరి నడుమా సాన్నిహిత్యం పెరిగింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ లు విడిపోయారు. కానీ స్నేహంగానే వున్నారు పిల్లలు ఇద్దరు కూడా తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెంచుకోలేదు. జావేద్ షబానా ల జీవితం సాఫీగానే సాగుతున్నది.
జావేద్ అందుకున్న అవార్డులకు లెక్కేలేదు. ఆయన సినిమా పాటలకు అయిదు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఫిలిం ఫేర్, జీ,ఐఫా అవార్డులు లభించాయి. జాతీయస్థాయిలో పద్మభూషణ్,అవధ రత్న, జాతీయ సమగ్రత లో ఇందిరా గాంధీ అవార్డు లభించాయి.ఆయన హార్వార్డ్, కొలంబియా,బర్కిలీ, మేరీ లాండ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్, జే.ఎన్.యు., అలీ ఘర్, విశ్వభారతి లాంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించారు.
అట్లా జావేద్ కారీర్ కవిగానూ, సినిమా పాటల రచయితగానూ, స్క్రిప్ట్ రైటర్ గానూ ఎదుగుతూ వచ్చింది.
ఫలితంగా సలీం-జావేద్ లు జంట గా అందాజ్, సీతా అవుర్ గీతా, యాదోన్కీ బారాత్, జంజీర్,దీవార్, షోలే..డాన్, త్రిశూల్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు హిందీ సినిమాలకు ‘ఆంగ్రీ యంగ్ మాన్’ అన్న పాత్రను అందించింది. అప్పటి ఆ విజయాల మీద అంగ్రీ యంగ్ మాన్ కారెక్టర్ మీద పరిశోదనలు కూడా జరిగాయి. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్తుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆజంట విడిపోయింది. 1981 సలీం జావేద్ ల జంట విడిపోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేసాడు. వాటిల్లో సాగర్, మిస్టర్ ఇండియా, బెతాబ్, లక్ష్య లాంటి విజయవంతమయిన సినిమాలకు రాసాడు.
తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం లిరిక్స్ వైపు కదిలాడు.ఆయన రాసిన సినీ గీతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే కైఫీ ఆజ్మీ ఒక చోట ఇట్లా అంటాడు..’మొదట సమాధి తవ్వి తర్వాత దానికి సరిపడే శరీరాన్ని వెతకడం సినీ గేయ రచయితల పని’ అయితే జావేద్ అఖ్తర్ తనసినీ గీతాలతో అద్భుతమయిన రూపాల్ని చిత్రించాడు. సినీ గీత రచయితగానే కాకుండా జావేద్ అఖ్తర్ గొప్ప కవి. ఆయనరాసిన కవితలు గజల్ సూటిగా స్పష్టంగా మనసుకు హత్తుకుంటాయి. ఆయన కవితా సంకలనాలు ‘టర్కష్’ 1995 లో వచ్చింది, తర్వాత ‘లావా’ 2012 లో వెలువడింది. లావా కు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్’
అందులో ఆయన కాలాన్ని గురించి..
కాలమంటే ఏమిటి,
అలుపూ విరామమూ లేకుండా
సాగిపోతున్నది
అడట్లా ప్రయానిన్చాకుండా వుంది వుంటే
అదేక్కడుండేది
ఎక్కడో ఒక చోట వుండేది కదా… అంటూ గొప్ప తాత్వికత తో రాస్తాడు.
…..
జావేద్ అఖ్తర్ దుఖం గురించి కేవలం తన దుఖం గురించే అందరి దుఖాల గురించీ స్పందిస్తాడు. దుఖం అమ్మడాన్ని గురించి చెబుతూ…
అమ్మకానికి దుఖాలు
అంగట్లో దుఖాలు అమ్ముతారు
వ్యాపారం హాయిగా సాగితే
దుఖాలు మంచి ధరకే అమ్ముడవుతాయి
వినియోగదార్లు ఉద్వేగంలో
చిన్నవో పెద్దవో దుఖ బొమ్మల్ని
ఏ ధరకయినా కొంటారు
నేనెప్పుడూ నా దుఖాల్ని
మంచి ధరకే అమ్మాను
కానీ ఇవ్వాళ
నాకు కలిగిన దుఖాన్ని
ఏ దుఖానపు షో కేసులో వుంచలేను
నా దుఖాల్ని అమ్మలేక పోతున్నందుకు
మొట్టమొదటి సారిగా
సిగ్గుపడుతున్నాను.. అంటాడు
….
ఇట్లా ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మనుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల్నుండి పెల్లుబుకుతుంది.
ఈ సంకలనం నిండా వర్తమాన అవ్యవస్థ గురింఛి తనకోపమూ, తన తాత్వికత, వేదన దుఖం, ప్రశ్న జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించాడు జావేద్ అఖ్తర్. తన కవిత్వం నిండా వర్తమాన మత చాందస వాదం గురించీ ఖండిస్తూ రాసాడు. మాట్లాడాడు. ప్రశించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించాడు జావేద్.
ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి,కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించాడు.
ఆయన ‘ఇన్ ఆదర్ వర్డ్స్’ లోంచి కొన్ని కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదాలు కొన్ని….
నా ప్రాంగణం – నా చెట్టు
————
మా ప్రాంగణం
ఎంతో పెద్దగా మరెంతో విశాలంగా వుండేది
అప్పుడు నేను నా ఆటలన్నీ అందులోనే ఆడేవాణ్ణి
ఆ ప్రాంగణానికి ఎదురుగా
నా కంటే ఎంతో ఎత్తుగా
ఓ చేట్టుండేది
నేను పెద్దవాడినయ్యాక
ఎప్పటికయినా
ఆ చెట్టు చివరి అంచును తాకుతానని
నాకెంతో నమ్మకం వుండేది
ఏళ్ళు గడిచాక
ఇంటికి తిరిగొచ్చి చూస్తే
మా ప్రాంగణం ఎంతో చిన్నగా అనిపించింది
కాని
ప్రాంగణం ఎదురుగా వున్న చెట్టు మాత్రం
అప్పటికంటే మరెంతో పెరిగి పెద్దదయింది
*****
ఉదయపు కన్య
—————-
నల్లటి రాత్రి దుప్పట్లో
ముఖం కప్పుకొని
ఉదయపు కన్య
దీర్ఘ నిద్రలో వుంది
ఆమె తన దుప్పటి కంతల్లోంచి
తొంగి చూడదు
ఒక మాటా పలుకదు
సూర్యుణ్ణి ఎవరో దొంగిలించుకు
పోయినప్పటినుండీ
ఆమె విసుగు విసుగ్గా వుంది
రండి మనం
సూర్యుణ్ణి వెతుకుదాం
సూర్యుడు దొరకకుంటే
ఒక్కో కిరణాన్నీ జమ చేసి
మరో కొత్త సూర్యుణ్ణి నిర్మిద్దాం
చాలా సేపటినుండీ
ఉదయపు కన్య
అలిగి నిద్రపోతున్నది
రండి
ఆమెను మేల్కొల్పుదాం
ఊరడిద్దాం
******
పజిల్
——-
ఒకప్పుడు
మనిద్దరం కేవలం రెండక్షరాలం
ఒకరోజు ఇద్దరం కలిసాక
పదంగా రూపొందాం
దానికి మనమో అర్థాన్ని కనుగొన్నాం
అప్పుడు ఎదో జరిగింది
ఇప్పుడు
ఓ చతురస్రం లో
నువ్వో అక్షరానివి
మరో చతురస్రం లో
నేను ఇంకో అక్షరాన్ని
ఇద్దరి నడుమ
ఎన్ని చతురస్రాల క్షణాలు
ఖాళీగా వున్నాయో
మళ్ళీ ఓ పదం రూపొందవచ్చు
దానికి మనం ఓ అర్థాన్నీ కనుగొనవచ్చు
కానీ
ఈ ఖాళీ చతురస్రాల్ని ఎట్లా పూరించాలో
ఆలోచించాలి
******
ప్రకీర్ణకం (మొంతేజ్)
——————————–
నిద్ర మబ్బుల వెనకాల
ఓ నవ్వుతున్న ముఖం
ఆ ముఖం మీద జాలువారిన
పట్టు దారాల్లాంటి ముంగురులు
మంద్రంగా శబ్దించే వస్త్రాలు
కలవరపడుతున్న రెండు కళ్ళు
ఓ సమావేశం
ఓ ఆహ్లాద క్షణం
నిలకడగా సరస్సులో నీరు
చెట్టుపై కిచ కిచలాడుతున్న పక్షి
గడ్డిపై విచ్చుకుంటున్న చిన్న మొగ్గ
అందమయిన పెదాల పై సున్నితమయిన మాటలు
పసుపువర్ణపు పగలు
మంచు లాంటి చల్లని స్వరం
పగిలిన అద్దం
గాలిలో తేలుతున్న కాగితం ముక్కలు
కూలిన వంతెన
పూర్తికాని రహదారి
విచ్ఛిన్నమయి చీలిపోతున్న దృశ్యం
కనురెప్పలపై మెరుస్తున్న కన్నీళ్లు
నిద్ర మబ్బుల వెనకాల
లోతయిన నిశ్శబ్దం ధ్వనిస్తున్నది
*********
విరహం
—————
నేనో కవిత రాసినప్పుడు
లేదా
కొత్తగా ఏదయినా చదివినప్పుడు
ఏదయినా అసాధారణ విషయం విన్నప్పుడు
నవ్వొచ్చినప్పుడు
ఏదయినా మాట ఆసక్తి కలిగించినప్పుడు
లేదూ
ఓ అసలయిన భావం స్పురించినప్పుడు
ఏదయినా ఓ అద్భుత దృశ్యం
నా హృదయాన్ని తాకినప్పుడు
వాటిని
నా మనసంతరాలల్లో దాచుకుంటాను
మనం కలుసుకున్నప్పుడు
నీతో పంచుకోవాలనుకుంటాను
************
వారాల ఆనంద్