VIDEO
SRIBHASHYAM VIJAYASARATHI
మిత్రులారా! సాహితీస్రవంతి కార్యక్రమంలో ఈ వారం సంస్కృత కవి పండితుడు శ్రీ శ్రీభాష్యం విజయసారధి గారి గురించి నా PODCAST వినండి. లింక్ క్లిక్ చేసి చూడండి -వారాల ఆనంద్, 9 మార్చ్ 2024
SAHITHI SRAVANTHI- KAVI NEERAJ
FRIENDS, PLEASE CLICK THE LINK AND LISTEN MY PODCAST VIDEO ON KAVI NEERAJ
– Anand Varala
SHAILENDRA – VRALA ANAND PODCAST
VIDEO PODCAST on ” SHAILENDRA” THE GREAT HINDI POET AND LYRICIST
pl click the link and watch, tq
-Varala Anand
‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను’’
వారాల ఆనంద్ :పలకరింపు
++++
గుల్జార్ కవిత్వ అనువాదానికి 2022 కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా అభినందనలు..
‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను అంతే. కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందంతో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. గుల్జార్ ‘గ్రీన్ పోయెమ్స్’ సంకలనానికి నా అనువాదం ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యులకు ధన్యవాదాలు.
**గుల్జార్ కవి మాత్రమేగాక హిందీ సినిమా రచయిత కూడా కదా. సినీ గీతాల ద్వారా ఆయనవైపు మొదట ఆకర్షితులు అయ్యారా, లేక ఆయన కవిత్వం మొదట చదివారా?
గుల్జార్ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్’ సినిమాలో ఆయన రాసిన ‘ముసాఫిర్ హూన్ యారో..’ అన్న పాటతో.
ఆ తర్వాత రాజేష్ ఖన్నా ‘ఆనంద్’ సినిమాకు గుల్జార్ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన తీసిన ‘ఖోషిష్’ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకు నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టెడ్ పోయెమ్స్, నెగ్లెక్టెడ్ పోయెమ్స్, సెలెక్టెడ్ పోయెమ్స్, జీరోలైన్ ఇట్లా ఆయన రాసిన అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్ ‘బాగ్బాన్’ అనువాదం కూడా చదివాను. వీటిల్లో ‘గ్రీన్ పోయెమ్స్’ బాగా నచ్చింది. అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. పర్యావరణం అన్న మాట ఎక్కడా అనకుండా చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలనూ, వాటికీ మనిషికీ వున్న అనుబంధాన్నీ ఇందులో గుల్జార్ సున్నితంగా ఆవిష్కరించాడు. అందుకే ఈ పుస్తకాన్ని ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట అనువాదం చేయాలనుకున్నాను.
**‘లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాల మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి?
చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖుడ్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్లో నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. మా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ పుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను. ఏదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.
** అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్ని వాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మాత్రమే నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?
ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నేను అన్ని వాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. నేనెప్పుడో రాసుకున్నట్టు ‘‘ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి’’ అన్న భావనలోనే వున్నాను.
** ‘ఆకుపచ్చ కవితలు’ అనగానే పర్యావరణకవిత్వం అనుకుంటారు ప్రకృతి పర్యావరణమా.. మానవ మనః ప్రకృతి పర్యావరణమా..?
‘ఆకుపచ్చ కవితలు’తో సహా గుల్జార్ సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్ వుంటుంది. ఆయన గొప్ప భావుకుడు. ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తాయి. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వంలో ఇమేజెస్ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే, అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక ఫ్రెష్నెస్ మనల్ని కదిలిస్తుంది. మనసు కదిలిపోతుంది.
‘గగన సీమలో ఆకాశం/ అతుకులు అతుకులుగా విడిపోతున్నది, / ఎన్ని ప్రాంతాల్నుంచి/ ఈ గుడారం విడిపోతున్నదో/ నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ/ మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం నాపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఇంకో కవిత:
‘భయపడకు నేనున్నాను
భయపడకు నేనున్నాను
ఆ ఒంటరి ఆకు
చెట్టుకు ధైర్యాన్నిస్తూ
చెబుతూనే వుంది’
ఇలాంటి కవితలు చదివాక అనువదించాలి అనుకున్నాను.
** మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?
చివరంటా చదువుతూ రాస్తూ వుండాలి. దాంతో పాటు ‘గో టు కాలేజెస్’ అంటూ కొత్త తరాన్ని చేరాలన్నది నా కోరిక. సాహిత్యం సినిమాలు కేవలం కొన్ని సర్కిల్స్ కే పరిమితం కాకుండా కాంపస్ల్లోకి వెళ్ళాలన్నది నా ఆశ. గతంలో చాలా కాలేజీల్లో కాంపస్ ఫిలిం క్లబ్స్ పెట్టాను. అట్లే కవిత్వం క్లబ్స్ కూడా రావాలి. ఈ దిశగా కవులు రచయితలూ అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను
ఇంటర్వ్యూ: గండ్ర లక్ష్మణ రావు