Month: January 2023
“ఇరుగు-పొరుగు” లను చూడకుండా మనం ఎదగ లేము
వారాల ఆనంద్ తో ముఖాముఖి
1) అనువాదం అంటే ఏమిటి, అనువాదాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు
జవాబు- ‘ఇచ్చి పుచ్చు కోవడం’ అన్న భావనే మనిషి మనుగడకు మూలాదారం. అంతే కాదు ‘ తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం’ అన్నది మానవ సంస్కృతిలో అంతర్భాగమయిన జీవనమార్గం. ప్రపంచ వ్యాప్తంగా వేలాది లక్షలాది సంవత్సరాలుగా భిన్న భాషలు సంస్క్రుతులతో కొనసాగుతున్న మానవాళి ఈ భాషా,సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అభివృద్ది రంగాల్లో కొనసాగుతున్న ఈ ‘ఆదాన్ ప్రాధాన్’ భావనతోనే ముందుకు సాగుతున్నది. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. అయితే ఆ భాష అన్నిప్రాంతాలకూ ఏక రూపకంగా కాకుండా భిన్న రూపాల్లో వ్యక్తమయి ఎదుగుతూ వచ్చింది. కేవలం మన దేశవిషయం చూసినా భారత రాజ్యాగం మొదట 14 భాషల్ని అధికార భాషలుగా గుర్తించి తర్వాత ఆ సంఖ్యను 23 వరకు పెంచింది. కానీ నిజానికి మన దేశంలోనే ఇంకా ఎన్నో లెక్క లేనన్ని భాషలున్నాయి. వాటిల్లో లిపి ఉన్నవీ లిపి లేనివీ కూడా వున్నాయి.మరయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని భాషలున్నాయో. చెప్పడం కష్టం.
ఆ స్థితిలో ఒక ప్రాంతంలో ఒక భాషలో జరిగిన విషయాలు, విజయాలూ,, సృజనాత్మక విషయాలూ ఇతర ప్రాంతాలకు చేరడానికి వాటిని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి తర్జుమా అవసరమయింది.దాన్నే అనువాదం అన్నారు
2) అనువాదకునికి ఉండాల్సిన ప్రాధాన అవగాహన, అర్హతలు ఏమిటి?
అనువాదం చేయడానికి అర్హతలు అంటూ ఏమీ ఉండవు. ఫలానా వాళ్ళు మాత్రమే అనువాదం చేయాలని ఏమీ వుండదు అయితే ఏ భాష లోంచి అయితే అనువాదం చేయాలను కుంటామో దాన్ని మూల భాష అనీ, ఎందులోకి చేయాలనుకుంటామో దాన్ని లక్ష్య భాష అనీ అంటున్నాం. అనువాదం చేయాలనుకున్న అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్ సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం వుండి తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది.
౩) మీకు సాహిత్యం మీద ఆసక్తి పెరగడానికి ప్రేరణ ఎవరు?
జవాబు- నిజానికి నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యం వున్న కుటుంబం. కానీ మా చిన్నప్పుడు మానాన్న ఉర్దూ లో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ నుంచి ఇతర పుస్తకాలు చదివే అలవాటు అయింది. తర్వాత అరికేపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, అమీనా, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ. అదీ మినీ కవిత్వంతో మొదలయింది.
2. సృజనాత్మక సాహిత్యానికి అనువాద సాహిత్యానికి మధ్య తారతమ్యం ఏంటీ?
జ- సృజనాత్మక సాహిత్యం లో సృజనకారుడు స్వీయ భావాల్ని, అనుభవాల్ని తన సొంత శైలిలో తనదయిన ఒరవడిలో సృష్టిస్తాడు. ఆ రచన ఆ భాష అంతా తన స్వంతం. ఆ రచన ప్రభావం, ఫలితం మొత్తంగా తనదే. కానీ అనువాదం లో అనువాదకుడు వేరొక సృజకారుడు మరో భాషలో రాసిన వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థంతో పాటు మూల రచయిత సాంస్కృతిక నేపధ్యం కూడా తెలుసుకోవాలి. అనువాదకుడు కేవలం భాషానువాదం చేస్తే న్యాయం జరగదు. అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్ సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం వుండి తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది. అప్పుడే అది మంచి అనువాదమవుతుంది.
3. అనువాద సాహిత్యాన్ని ఎంచుకోవడానికి కారణం?
జ- సాహిత్యం-సినిమా నాకు రెండు కండ్లలాంటివి. సాహిత్యంలో కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు రాసాను. సినిమాల విషయం వస్తే అర్థవంతమయిన మంఛి సినిమాల గురించీ, ఆయా దర్శకులపైనా, సినిమాల పైనా, బాలల సినిమాల పైనా అనేకంగా రాసాను. తెలంగాణా సాహితీ మూర్తులు పేర ముద్దసాని రామిరెడ్డి, సామల సదాశివ ల పైన డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీసాను. అదే క్రమంలో అనువాదాలు కూడా చాలా ఏళ్ళ క్రితమే మొదలు పెట్టాను. విపుల, ఆంధ్రజ్యోతి పత్రికల్లో 90 లలోనే పలు అనువాద కథల్ని రాసాను. తర్వాత స్వీయకవిత్వం తో పాటు కవిత్వానువాదాలు చేయడం ఆరంభించాను. విస్తృతంగా చదవడం ఒక అలవాటుగా మారిన తర్వాత వివిద భాషల్లో నాకు నచ్చిన కవితల్ని తెలుగు లోకి అనువదించడం ఆరంభించాను. అట్లా ఓ ‘సాంసృతిక బంజారా’ లాగా అనేక సృజనాత్మక రంగాల్లో క్రుషిచేసాను. అనువాదంలో సచ్చిదానందన్, జావేద్ అక్తర్, గుల్జార్ తదితరుల కవితల్ని అనువదించాను. అట్లా అనువాదం నా సృజన జీవితంలో ముఖ్యమయిన అంశం అయిపొయింది.
4. ఇప్పటివరకు ఎన్నిభాషలను తెలుగులోకి అనువదించారు?
జ- ‘ఇరుగు-పొరుగు’ శీర్షికన ఇప్పటివరకు 17 భారతీయ భాషల నుంచి 70 కవితల దాకా అనువదించాను. ఆసియా నెట్ ఆన్లైన్ పత్రికతో సహా పలు సామాజిక వేదికల్లో ప్రచురించాను.
5. అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అవార్డు రావడం పట్ల మీ అనుభూతి?
జ- కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను. నాకు నచ్చినవి అందరితో పంచుకోవాలనుకున్నాను. కేంద్ర సాహిత్య అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందం తో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. ‘ఆకుపచ్చకవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యుఅలకు ధన్యవాదాలు.
6. ఆకుపచ్చ కవితల నేపథ్యం ఏమిటి?
జ- ఆకుపచ్చ కవిత్వం మూల రచయిత గుల్జార్ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్’ సినిమాలో ఆయన రాసిన ముసాఫిర్ హూన్ యారో.. పాటతో. ఆతర్వాత రాజేష్ ఖన్నా “ఆనంద్’ సినిమాకు గుల్జార్ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. తర్వాత ఆయన ఖోశిష్ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకీ నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్ పోయెమ్స్, సస్పేక్టేడ్ పోయెమ్స్, నెగ్లేక్తేడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్ ఇట్లా అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్ ‘భాగ్బాన్’ అనువాదం కూడా చదివాను. వాటిల్లో గ్రీన్ పోయెమ్స్ బాగా నచ్చింది, అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలూ వాటికీ మనిషి వున్న అనుబందం అన్నింటినీ ఇందులో గుల్జార్ సున్నితంగా ఆవిష్కరించాడు దాంతో ఆ పుస్తకాన్ని అనువాదం చేయాలనుకున్నాను.
7. వాటిని అనువదిస్తున్నపుడు మీరు అవార్డు వస్తుందని అనుకున్నారా?
లేదు అలాంటి ఆలోచన రాలేదు.
8) గుల్జార్ సాహిత్యంలోని ప్రత్యేకత ఏమిటి?
జ- గుల్జార్ సాహిత్యం లో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్ వుంటుంది. ఆయన బొప్ప భావుకుడు. అయినా ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఇక ఆయన కవిత్వంలో ఇమేజెస్ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక టచ్ నెస్ మనల్ని కదిలిస్తుంది.
9) గుల్జార్ సాహిత్యాన్ని అనువాదానికి ఎంచుకోవడానికి కారణం?
జ- ‘గగన సీమలో ఆకాశ
అతుకులు అతుకులుగా విడిపోతున్నది,
ఎన్నిప్రాంతాల్నుంచి
ఈ గుడారం విడి పోతున్నదో
నా కవిత్వంతో
రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ
మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఎంచు కోకుండా ఉండలేక పోయాను.
ఇంకో కవితలో
‘భయపడకు నేనున్నాను / భయపడకు నేనున్నాను
ఆ ఒంటరి ఆకు/ చెట్టుకు ధైర్యాన్నిస్తూ/ చెబుతూనే వుంది’ లాంటివి చదివాక అనువదించాలి అనుకున్నాను.
12. తెలుగు సాహిత్యంలో సాధించాల్సిన పురోగతి ఏమన్న ఉందంటారా?
జ- తెలుగు సాహిత్యం ముఖ్యంగా తెలుగు కవిత్వం ప్రపచంలోని మరే భాషకూ స్థాయీ పరంగా తీసిపోదు. విషయపరంగా వ్యక్తీకరణ పరంగా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూనే వుంది. అయితే నూతనంగా రాయడం ఆరంభించిన కవులు రచయితలు చుట్టూ వున్న సమాజాన్నీ,మనుషుల్నీ లోతుగా అర్థం చేసుకోవాలి.విశ్లేసించుకోవాలి. అట్లే వివిధ భాషలలో వస్తున్న కవిత్వాన్ని అధ్యయనం చేయాలి, అప్పుడే మరింత గొప్ప కవిత్వం వచ్చే అవకాశం వుంది. ఇరుగుపొరుగు లను చూడకుండా మనం ఎదగ లేము.
IRUGU PORUGU-ANDHRA PRABHA INTERVEW
Image Posted on
‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను’’
వారాల ఆనంద్ :పలకరింపు
++++
గుల్జార్ కవిత్వ అనువాదానికి 2022 కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా అభినందనలు..
‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను అంతే. కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందంతో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. గుల్జార్ ‘గ్రీన్ పోయెమ్స్’ సంకలనానికి నా అనువాదం ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యులకు ధన్యవాదాలు.
**గుల్జార్ కవి మాత్రమేగాక హిందీ సినిమా రచయిత కూడా కదా. సినీ గీతాల ద్వారా ఆయనవైపు మొదట ఆకర్షితులు అయ్యారా, లేక ఆయన కవిత్వం మొదట చదివారా?
గుల్జార్ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్’ సినిమాలో ఆయన రాసిన ‘ముసాఫిర్ హూన్ యారో..’ అన్న పాటతో.
ఆ తర్వాత రాజేష్ ఖన్నా ‘ఆనంద్’ సినిమాకు గుల్జార్ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన తీసిన ‘ఖోషిష్’ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకు నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టెడ్ పోయెమ్స్, నెగ్లెక్టెడ్ పోయెమ్స్, సెలెక్టెడ్ పోయెమ్స్, జీరోలైన్ ఇట్లా ఆయన రాసిన అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్ ‘బాగ్బాన్’ అనువాదం కూడా చదివాను. వీటిల్లో ‘గ్రీన్ పోయెమ్స్’ బాగా నచ్చింది. అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. పర్యావరణం అన్న మాట ఎక్కడా అనకుండా చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలనూ, వాటికీ మనిషికీ వున్న అనుబంధాన్నీ ఇందులో గుల్జార్ సున్నితంగా ఆవిష్కరించాడు. అందుకే ఈ పుస్తకాన్ని ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట అనువాదం చేయాలనుకున్నాను.
**‘లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాల మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి?
చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖుడ్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్లో నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. మా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ పుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను. ఏదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.
** అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్ని వాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మాత్రమే నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?
ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నేను అన్ని వాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. నేనెప్పుడో రాసుకున్నట్టు ‘‘ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి’’ అన్న భావనలోనే వున్నాను.
** ‘ఆకుపచ్చ కవితలు’ అనగానే పర్యావరణకవిత్వం అనుకుంటారు ప్రకృతి పర్యావరణమా.. మానవ మనః ప్రకృతి పర్యావరణమా..?
‘ఆకుపచ్చ కవితలు’తో సహా గుల్జార్ సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్ వుంటుంది. ఆయన గొప్ప భావుకుడు. ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తాయి. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వంలో ఇమేజెస్ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే, అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక ఫ్రెష్నెస్ మనల్ని కదిలిస్తుంది. మనసు కదిలిపోతుంది.
‘గగన సీమలో ఆకాశం/ అతుకులు అతుకులుగా విడిపోతున్నది, / ఎన్ని ప్రాంతాల్నుంచి/ ఈ గుడారం విడిపోతున్నదో/ నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ/ మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం నాపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఇంకో కవిత:
‘భయపడకు నేనున్నాను
భయపడకు నేనున్నాను
ఆ ఒంటరి ఆకు
చెట్టుకు ధైర్యాన్నిస్తూ
చెబుతూనే వుంది’
ఇలాంటి కవితలు చదివాక అనువదించాలి అనుకున్నాను.
** మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?
చివరంటా చదువుతూ రాస్తూ వుండాలి. దాంతో పాటు ‘గో టు కాలేజెస్’ అంటూ కొత్త తరాన్ని చేరాలన్నది నా కోరిక. సాహిత్యం సినిమాలు కేవలం కొన్ని సర్కిల్స్ కే పరిమితం కాకుండా కాంపస్ల్లోకి వెళ్ళాలన్నది నా ఆశ. గతంలో చాలా కాలేజీల్లో కాంపస్ ఫిలిం క్లబ్స్ పెట్టాను. అట్లే కవిత్వం క్లబ్స్ కూడా రావాలి. ఈ దిశగా కవులు రచయితలూ అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను
ఇంటర్వ్యూ: గండ్ర లక్ష్మణ రావు