VARALA ANAND
అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)
కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.
మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్
పుస్తకం లాంటి మనిషి
పుస్తకం లాంటి మనిషి
++++++++++++ వారాల ఆనంద్
దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ
వాటి మధ్యే బతికానేమో
పుస్తకాల్ని
దూరంగా అద్దాల బీరువాలో చూసినా
దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా
ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది
చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది
మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా
పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది
అప్పుడు
కొన్నింటితో స్నేహం కుదుర్తుంది
కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను
కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే
మరికొన్ని నులిపెడతాయి
నేను కరిగి నీరయిపోతాను
కొన్ని నవ్విస్తే,
మరికొన్ని ఏడిపిస్తాయి
కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే
ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి
నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను
మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి
నేను వాటిలో లీనమవుతాను
అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా
నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం
పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..
*****************
24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY
“ప్రజాస్వామ్యం” ++++వారాల ఆనంద్
“ప్రజాస్వామ్యం”
++++ వారాల ఆనంద్
ఓటు హక్కున్న మనుషులు
నడుస్తున్న కరెన్సీ అయిపోయినప్పుడు
పలుకుతున్న మాటలన్నీ
జమా ఖర్చులే
సర్వత్రా
నేను నాదీ నాకు అనేవే
ఉఛ్వాస నిశ్వాసలై ఊరేగినప్పుడు
“ప్రజల చేత, ప్రజలయొక్క, ప్రజలకొరకు”
అన్న భావన సలసల కాగే స్వార్థపు జడిలో
ఆవిరై అదృశ్యమైపోక
నాకోసమో నీకోసమో మిగులుతుందా
ఎన్నికల మైదానంలో
కూటమి, ఫిరాయింపు, బంధుప్రీతి
మూడురంగుల జెండాగా తలెత్తుకు
రెప రెప లాడుతూ వుంటే
కొంగ్రొత్త ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది
ప్రజలే ప్రేక్షకులై బిక్కమొహమేసుకుని
ప్రేక్షకుల్లా అచేతనంగా నిలబడిపోతారు
*********************
చార్లీ చాప్లిన్
చార్లీ చాప్లిన్
++++++++ వారాల ఆనంద్
హాస్యం వారధిగా
దుఖాన్ని
దృశ్య మానం చేశావు
చిత్రంగా
హాస్యం సమస్త లోకానికి చేరింది
దుఖం మాత్రం నీలో నిలిచిపోయింది
************************************
( చార్లీ చాప్లిన్ జయంతి నేడు )
16 ఏప్రిల్ 2024
పెద్ద సమయం పట్టదు++++++ వారాల ఆనంద్
FRIENDS,READ MY POEM PUBLISHED IN NAVATELANGANA TODAY,Tq
పెద్ద సమయం పట్టదు
+++++++++++++++ వారాల ఆనంద్
అంతా కనిపిస్తూనే వుంటారు
అందరూ వినిపిస్తూనే వుంటారు
కానీ
కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా
కళ్ళముందే మొలుస్తున్న గోడలు
ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు
భ్రమాలోకపు గడీలు
తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు
చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు
ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది
నేనే
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను
ప్రవాహంలా పరుగులుపెట్టాను
ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు
అలసట వొచ్చినప్పుడల్లా
‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని
పైత్యాన్ని వదిలించుకున్నాను
ఇవ్వాళ
ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి
కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను
బంధాలకు కొత్త రూపునూ
అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను
మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ
అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ
మనుషుల సమూహంలోకి
మమతల జాతరలోకి
నడక సాగిస్తున్నాను
అస్తమయం తర్వాత
సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు
కొంచెం ఓపికుండాలి
ఒకింత విశ్వాసముండాలి
ఎంతయినా అందరమూ మనుషులమే కదా!
****************** 9440501281
15 APRIL 2024
బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్
Friends,pl read my poem published today 15 April 2024 in Andhra Prabha daily, Tq
బతుకు సమీకరణం కాదు
++++++++++++ వారాల ఆనంద్
జీవితం నడుస్తున్నాదా
పరుగెడుతున్నదా చతికిలబడ్డదా
ఓ క్షణం వెనక్కి చూస్తూ
వేగం పుంజుకుంటున్నదా
వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!
నిటారుగా నిలబడిందా
వంగుతూ లేస్తూ
అంబాడుతూ లేస్తూ
అవతలితీరంకేసి చూస్తున్నాదా
ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు
నా బతుకు నాకూ
నీ బతుకు నీకూ తెలియాలి
లేదూ కెమెరా కన్నేసుకు చూసే
నీ ముందరి వాడికి తెలియాలి
అయినా బతుకు
ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే
దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు
నిజానికి
ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో
మెలికలు తిరిగే మలుపుల్తో
యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం
************ 9440501281
ఏమి జంతువది
+++++++++++++++
ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు
దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది
ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు
ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు
ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది
ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది
దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది
ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు
ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ
దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ
అందరూ దాని కోసం ప్రార్థించండి
ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్
‘జ్ఞానం’ కవిత
మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్
‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్
ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను
చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను
సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను
కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా
చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది
అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే
నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు
పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది
******************** 24-03-2024