VARALA ANAND POEMS

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

Posted on Updated on

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)

కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.

మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

పుస్తకం లాంటి మనిషి

Posted on

పుస్తకం లాంటి మనిషి  

++++++++++++ వారాల ఆనంద్

దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ

వాటి మధ్యే బతికానేమో

పుస్తకాల్ని

దూరంగా అద్దాల బీరువాలో చూసినా

దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా

ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది

చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది

మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా

పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది

అప్పుడు

కొన్నింటితో స్నేహం కుదుర్తుంది

కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను

కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే

మరికొన్ని నులిపెడతాయి

నేను కరిగి నీరయిపోతాను

కొన్ని నవ్విస్తే,

మరికొన్ని ఏడిపిస్తాయి

కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే

ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి

నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను

మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి

నేను వాటిలో లీనమవుతాను

అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా

నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం

పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..

*****************

24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY

“ప్రజాస్వామ్యం” ++++వారాల ఆనంద్

Posted on

“ప్రజాస్వామ్యం”

++++ వారాల ఆనంద్

ఓటు హక్కున్న మనుషులు

నడుస్తున్న కరెన్సీ అయిపోయినప్పుడు

పలుకుతున్న మాటలన్నీ

జమా ఖర్చులే

సర్వత్రా

నేను నాదీ నాకు అనేవే   

ఉఛ్వాస నిశ్వాసలై ఊరేగినప్పుడు                                                                                                                                                    

“ప్రజల చేత, ప్రజలయొక్క, ప్రజలకొరకు”

అన్న భావన సలసల కాగే స్వార్థపు జడిలో  

ఆవిరై అదృశ్యమైపోక

నాకోసమో నీకోసమో మిగులుతుందా

ఎన్నికల మైదానంలో

కూటమి, ఫిరాయింపు, బంధుప్రీతి  

మూడురంగుల జెండాగా తలెత్తుకు   

రెప రెప లాడుతూ వుంటే

కొంగ్రొత్త ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది

ప్రజలే ప్రేక్షకులై బిక్కమొహమేసుకుని

ప్రేక్షకుల్లా అచేతనంగా నిలబడిపోతారు 

*********************                                                                                                                                                                                                                                                                                          

చార్లీ చాప్లిన్

Posted on

చార్లీ చాప్లిన్

++++++++ వారాల ఆనంద్

హాస్యం వారధిగా
దుఖాన్ని
దృశ్య మానం చేశావు

చిత్రంగా
హాస్యం సమస్త లోకానికి చేరింది

దుఖం మాత్రం నీలో నిలిచిపోయింది

************************************
( చార్లీ చాప్లిన్ జయంతి నేడు )

16 ఏప్రిల్ 2024

చార్లీ చాప్లిన్

పెద్ద సమయం పట్టదు++++++ వారాల ఆనంద్

Posted on

FRIENDS,READ MY POEM PUBLISHED IN NAVATELANGANA TODAY,Tq

పెద్ద సమయం పట్టదు

+++++++++++++++ వారాల ఆనంద్

అంతా కనిపిస్తూనే వుంటారు

అందరూ వినిపిస్తూనే వుంటారు

కానీ

కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా   

కళ్ళముందే మొలుస్తున్న గోడలు

ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు

భ్రమాలోకపు గడీలు

తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు

చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు

ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది

నేనే

ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను

ప్రవాహంలా పరుగులుపెట్టాను

ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు

అలసట వొచ్చినప్పుడల్లా

‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని

పైత్యాన్ని వదిలించుకున్నాను

ఇవ్వాళ

ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి  

కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను

బంధాలకు కొత్త రూపునూ

అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను

మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ

అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ 

మనుషుల సమూహంలోకి

మమతల జాతరలోకి

నడక సాగిస్తున్నాను  

అస్తమయం తర్వాత

సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు

కొంచెం ఓపికుండాలి

ఒకింత విశ్వాసముండాలి

ఎంతయినా అందరమూ మనుషులమే కదా!

****************** 9440501281

15 APRIL 2024

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

Posted on

ఏమి జంతువది
+++++++++++++++

ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు

దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది

ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు

ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు

ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది

ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది

దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది

ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు

ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ

దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ

అందరూ దాని కోసం ప్రార్థించండి

ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్


‘జ్ఞానం’ కవిత

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్

‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్

ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను

చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను

సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను

కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా

చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది

అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే

నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు

పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది

******************** 24-03-2024

YADONKI BARATH 2-series,Bo-11

Posted on

యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 11 

++++++++++++++++ వారాల ఆనంద్

జీవితం సరళరేఖ కాదు. తిన్నగా సాగడానికి. జీవితం నునుపయిన రహదారీ కాదు సాఫీగా నడవడానికి.  అనేక వంకరలు, వంపులు మలుపులు అనివార్యం. వాటన్నింటినీ దాటుకుంటూ మెలకువతో ముందుకు పయనించడమే జీవితం.

ఆ ప్రయాణానికి “ఎంట్రీ-ఎగ్జిట్” రెండూ వుంటాయి. మాతృగర్భంలోంచి మొదలయిన బతుకు ప్రవేశం(ఎంట్రీ) ఉత్సాహంగా ఆశలతో కలల్తో షురూ అవుతుంది. కానీ నిష్క్రమణే (ఎగ్జిట్) ఎవరిది ఎట్లా వుంటుందో ఏమిటో ఎవరమూ ఊహించలేం. ఎంట్రీ ఎగ్జిట్ లు రెండూ బాగుండాలనుకుంటాం. ఎవరమయినా ఎగ్జిట్ సంతోషంగా వుండాలనీ ఆశిస్తాం.

అది జీవితానికే కాదు బతుకులో ఏ ఉద్యోగానికయినా, వృత్తికయినా, మరే పనికయినా అంతే. ఎంట్రీ ఎగ్జిట్ అత్యంత ప్రధానమయినవి.

 నా ఉద్యోగ జీవితం ఎంట్రీ కొంత ఇష్టాయిష్టాల మధ్య 1980లో మొదలయింది. అనేక మలుపులతో 36 ఏళ్ళు గడిచాక 2016లో ఉద్యోగవిరమణ ఎగ్జిట్ సంవత్సరంలోకి చేరాను. అప్పటికి ఆ ప్రయాణం వివిధ కాలేజీల్లో అనేక మలుపులతో సాగిగింది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోకి 2000 సంవత్సరంలో ఎంట్రీ జరిగి పదహారేళ్లు కొనసాగింది. అదే కాలేజీలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థిగా ఎంతో ఉద్వేగంగా ఆ ప్రయాణం మొదలయింది. గ్రంధాలయ నూతన భవన నిర్మాణంలోనూ, అభివృద్దిలోనూ, విద్యార్థుల బహుముఖీన ఎదుగుదలకూ కొంత కృషి చేశాననే తృప్తి తోనే కాలేజీ ప్రయాణం సాగింది. మొత్తంగా ఇటు కాలేజీలో అటు బయటా సృజనాత్మక, సామాజిక రంగాల్లో పని చేయడానికి కాలేజీ, కాలేజీ మిత్రులూ నా వెన్నంటి వున్నారు. చేయిపట్టుకు  ముందుకు నడిపించారు.    

ఆ నడకలో ఓ ‘మెరుపు’ మెరిసింది. నాలోనూ మెరిసింది. ఉత్తర తెలంగాణా సాహిత్య ప్రపంచంలోనూ మెరిసింది. ఒక రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి, కవి మిత్రుడు ఆచార్య జయధీర్ తిరుమల రావు, నిజాం వెంకటేశంలు మేమంతా వస్తున్నాము. కరీంనగర్ లో కవులు రచయితలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నారు. అది నాతో ఎందుకన్నారో నాకు తెలీదు. శాస్త్రి గారికి నాకు అంతకు ముందు పరిచయమే లేదు. నా పేరు ఎవరు చెప్పారబ్బా అని ఆలోచించాను. బహుశా జింబో అని వుంటాడు. ఏది ఎట్లా అయితేనేం. మా ఫిల్మ్ భవన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. సాహితీ మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. ఎంతమంది స్పందిస్తారో తెలీదు. ఎంతమంది వస్తారో ఊహించలేను. చూద్దాం అనుకున్నాను. సమావేశం సమయానికల్లా అనేక మంది  పెద్దలు, కవులు రచయితలు వచ్చారు. సమావేశంలో ఎం.వీ.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ ఆంధ్రభూమి జిల్లా ఎడిషన్లో వారం వారం రెండు పేజీలు సాహిత్యానికి కేటాయిస్తున్నామన్నారు. అంతే కాదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సాహిత్యకారుల రచనలకు అందులో చోటు ఇవ్వాలనుకుంటున్నా మన్నారు. ఏమయినా సూచనలు ఇవ్వమన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణ రావుతో సహా పలువురు మాట్లాడారు. జయధీర్ తిరుమల్ రావు, నిజాం వెంకటేశం గార్లు కూడా మాట్లాడారు. చివరన ఈ సాహిత్య పేజీకి ‘మెరుపు’ అని పేరు పెడుతున్నామన్నారు. ఆ పేజీకి వారాల ఆనంద్ బాధ్యుడుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. నాకు కొంత ఆశ్చర్యం, మరికొంత ఆనందం. బాధ్యత తీసుకుంటారుగా అన్నారు శాస్త్రి గారు నేను సరే నన్నారు. దానికి సంభందించిన వివరాలు మాట్లాడదామన్నారు. సాహితీ మిత్రులంతా ఉత్తర తెలంగాణా సాహిత్యానికి ఒక వేదిక లభించినందుకు సంతోపడ్డారు. నాకయితే ఉత్సాహంగానే వుంది. అప్పుడు కరీంనగర్లో ఆంధ్రభూమి ఆఫీసు మా కాలేజీ గేటుకి సరిగ్గా ముందే వుంది. అంతేకాదు దాన్లో డీటీపీ ఆపరేటర్ చంద్రమౌళి గతంలో మా తో ఈనాడు లో పనిచేస్నవాడే. అంతా ఒకే అనుకున్నాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అంటూ హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లు బయలుదేరారు. ఆంధ్రభూమిలో ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా ఉత్తర తెలంగాణ జిల్లాల సాహిత్యకారులను సంప్రదించాను. అంతా ఉత్సాహం చూపించారు. అనేక వారాలు విజయవంతంగా సాగింది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది. దాంతో నేను ఉత్తర తెలంగాణ జిల్లాల కవులు రచయితల ఇంటర్వ్యూ లు ప్లాన్ చేశాను. అందరినీ సంప్రదించి ప్రశ్నలు పంపాను.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం వారం వేశాను. కవితలు,కథలు, సమీక్షలు ఓహ్ అన్ని కాలమ్స్ కొనసాగాయి. ఆ ఇంటర్వ్యూ లను “మెరుపు” పేర పుస్తకంగా తెచ్చాను. ఆ ఇంటర్వ్యూల్లో జింబో, దర్భశయనం, నలిమెల భాస్కర్, చొప్పకట్ల చంద్రమౌళి, అంపశయ్య నవీన్, తుమ్మేటి, వఝల శివకుమార్ తదితర అనేక మందితో చేసిన ‘ముఖా ముఖి’ ఇంటర్వ్యూలు ప్రచురించాను. దానికి 23 ఏప్రిల్ 2016 రోజున ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ. సాహితీ గౌతమి నిర్వహణ. ఆవిష్కర్తగా కరీంనగర్ లో కలెక్టర్ గా పనిచేసి ఫిల్మ్ భవన్ నిర్మాణం లోనూ, కాలేజీ గ్రంధాలయ భావన నిర్మాణంలోనూ నాకు ఎంతగానో సహకరించిన మంచి మనిషి శ్రీ సి.పార్థసారధి గారిని పిలిచాను. ఆయన ఎంతో ఉత్సాహంగా రావడానికి అంగీకరించాడు. వచ్చారు కూడా. కె.ఎస్. అనంతాచార్య అధ్యక్షతన సభ చాలా ఆసక్తిగా ఆనందంగా జరిగింది. నాకు మెరుపు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన పలువురు కవులు రచయితలు పాల్గొన్నారు. కవి మిత్రులు శ్రీ వఝల శివకుమార్, జింబో, నలిమెల భాస్కర్, దాస్యం సేనాధిపతి వేదిక మీద వుండి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘మెరుపు’ ఆవశ్యకతను ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలో సాహితీ వేత్తలు తెలంగాణ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు అనే విషయాల్ని ఆనాటి సభ విస్తృతంగా చర్చింది. సభలో శ్రీ నమిలకొండ హరిప్రసాద్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, పీ.ఎస్., తోట రమేశ్, మచ్చ హరిదాస్, డాక్టర్ రామకృష్ణ,. అన్నవరం దేవేందర్, ఎం.సరస్వతి, నవీన, ఇందిర, రేల తదితరులు పాల్గొన్నారు. పార్థసారధి గారు సాహితీ వేత్తలందరికి మెరుపు పుస్తకాన్ని అందజేశారు.

ఇదంతా ఇట్లా వుండగా అంతకు ముందే నా ‘మనిషి లోపల’ కవితా సంకలనం లోని కవితల్ని మిత్రురాలు బొడ్ల అనురాధ ఇంగ్లీష్ లోకి అనువదించడం ఆరంభించారు. అనురాధ గారు మాకు అత్యంత ఆత్మీయ స్నేహితులు. కరీంనగర్ లో ప్రముఖ విద్యావేత్త కీ.శే.నాగభూషణం గారు మొట్టమొదటి ట్యుటోరియల్ ఏర్పాటు చేసిన విద్యావేత్త. 70ల్లో ఎస్వీటీసీ నోట్స్ అంటే కరీంనగర్ విద్యార్థుల్లో గొప్ప ఆదరణ. వారి కూతురు అనురాధ. తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హై స్కూలు చదువు తర్వాత వివాహమై ఇద్దరు పిల్లల తర్వాత వూహించని ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాంతో జీవితం ముగిసిందని ఆమె అనుకోలేదు. పోరాటమే తన జీవితం అనుకుంది. కాలానికి ఎదురొడ్డింది. తన కాళ్లమీద తాను నిలబడి ఉన్నత చదువులు కొనసాగించింది. ఎదురుదెబ్బలు తనకు ఎలాంటి ఆటంకం కావని ఆమె నిరూపించారు. కొంత కాలం మాల్దీవ్స్ కు కూడా వెళ్ళి అక్కడ పనిచేశారు. ఇంగ్లీష్ లో మంచి పట్టు సాధించారు. తనతో మాకున్న దశాబ్దాల స్నేహం, అభిమానంవల్ల ఆమె నా కవితల్ని ఇష్టంగా చదివింది. తనకు నచ్చిన ఆ కవితల్నిఅందంగా అర్థవంతంగా ఇంగ్లీషులోకి అనువదించే పని పెట్టుకుంది. చాలా గొప్ప అనువాదం చేశారామె. ఆ అనువాదాలతో ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ పేర పుస్తకం తెచ్చాను. పుస్తకం ఆవిష్కరణల విషయంలో మిత్రుడు ఎన్.బి.టి. తెలుగు సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ సహకరించారు. ఆ సమయంలో తాను హైదరబాద్ లో లేకున్నా ఉస్మానియా కాంపస్లో వున్న తమ ఆఫీసులోని హాలులో ఆవిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణకు ఆత్మీయ మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు ని పిలిచాను. ఆయనకుతోడు డాక్టర్ నందిని సిద్దారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య తదితరులు హాజరయ్యారు. కవిత్వం గురించి సిద్దారెడ్డి, అనువాదం గురించి దర్భశయనం మాట్లాడారు. అనువాదంలో అనురాధ చూపించిన పరిపక్వతని ఆయన సోధాహరణంగా చెప్పారు. ఇంగ్లీష్ పుస్తకానికి న్యాయం చేయడానికి దర్భశయనం సరయిన వాడని సిధారెడ్డి అన్నారు. ఆ తర్వాత ‘సూర్య’ దిన పత్రికలో మిత్రుడు టీవీ9 వొడ్నాల చంద్రమౌళి మంచి సమీక్ష చేశారు. 1990ల నుంచి పరిచయమూ స్నేహమూ వున్న చంద్రమౌళి చాలా సంవత్సరాలు ఈనాడులో సబ్ ఎడిటర్ గా పని చేసారు. వయసులో నాకంటే చాలా చిన్న వాడే అయినా ఇద్దరి నడుమా దగ్గరి స్నేహం అల్లుకుపోయింది. భావుకుడు ప్రగతిశీలవాది అయిన చంద్రమౌళి సిగ్నేచర్ ఆఫ్ లవ్ గురించి రాస్తూ ‘సమాజం పైన కవి వారాల ఆనంద్ చేసిన ప్రేమ సంతకమిది. మనసు నిండా ప్రేమను నింపుకున్న కవి తన కవిత్వం నిండా ప్రేమను నింపడం సహజమే. ఆ ప్రేమ మనుషులపట్ల, సమాజం పట్ల,మనుషుల మనుగడకు ఆధారభూతమయిన భూమి గాలి నీరు పట్ల కనిపిస్తాయి. వారాల ఆనంద్ జీవితం నిండా కవిత్వం కనిపిస్తుంది’ అని రాశాడు. రోజూ కలిస్తేనే స్నేహాలు నిలుస్తాయా… ఎప్పుడో ఒకసారి కలిసే చంద్రమౌళి తో స్నేహం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగడం లో ఆయన చూపించే ఆప్యాయత ప్రధాన కారణం. ఈనాడు తర్వాత తాను ఎలెక్ట్రానిక్ మీడియాకు వెళ్ళాడు.

ఇక సమీక్షలకు పంపించే క్రమంలో సిగ్నేచర్ ఆఫ్ లవ్ ని ఇండియన్ లిటరేచర్ కు కూడా పంపాను. అక్కడ ఆ పుస్తకాన్ని చూసిన తమిళ కవి, ప్రముఖ అనువాదకుడు చంద్ర మనోహరన్ ఒకరోజు ఫోన్ చేసారు. మీ పుస్తకాన్ని తమిళం లోకి తేవచ్చా అని అడిగాడు. నేను వెంటనే చాలా సంతోషం అన్నాను. తానే దాన్ని తమిళం లోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడెమికి అనేక అనువాదాలు చేసిన చంద్ర మనోహరన్ స్వచ్చందంగా ‘అన్బిన్ కైచాంది’ పేర వెలువరించారు.  ఆ అనువాద సంకలనాన్ని తమిళనాడుకు చెందిన ‘ఆర్ట్ లిటరరీ క్లబ్’ ఆవిష్కరించింది. ఆనాటి కార్యక్రమానికి నేను వెల్ల లేదు కానీ ఆ సభలో సంస్థ కార్యదర్శి బి. ఆర్. నటరాజన్,డాక్టర్ సురేష్,డాక్టర్ మీనా సుందర్,డైరెక్టర్ మని, అన్వాదకుడు చంద్రమనోహరన్ పాల్గొన్నారు. ముక్కూ మొహం తెలీని  నేను రాసిన నా కవిత్వాన్ని తమిళంలోకి అనువదించి ప్రచురించిన చంద్ర మనోహరన్ కి ఎంతని ఏమని కృతజ్ఞతలు చెప్పను. ధన్యవాదాలు అంటూ నమస్కరించడం తప్ప.

2016 నాటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాను..

+++++

వారాల ఆనంద్

24 మార్చ్ 2024